14, ఏప్రిల్ 2020, మంగళవారం

మోదీగారి సప్తపది


మే మూడు వరకు లాక్ డౌన్ పొడిగించడం. చాలామంది అనుకున్నదే. పేదప్రజల్ని దృష్టిలోపెట్టుకుని  ఈనెల ఇరవై తర్వాత అవసరమైన చోట్ల  సడలింపులు. ఇందులో సామాజిక ఆర్ధిక కోణాలు కూడా వున్నాయి. నిర్ణయం తీసుకోవడంలో ప్రజాస్వామ్యబద్ధంగా  వ్యవహరించినట్టు కనబడే ప్రయత్నం చేసారు. తన ఒక్కడి నిర్ణయాన్ని దేశం మీద రుద్దడం లేదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించిన తర్వాతనే ఈ పొడిగింపు అనే సంకేతాన్ని జనంలోకి బలంగా పంపారు.
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మరికొంతకాలం కొనసాగుతాయి. రోజువారీ కూలీపనులు చేసుకుని పొట్టపోసుకునే పేద ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతాయి. నిజమే!
ఈ సందర్భంలో ఒక విషయం చెప్పదలిచాను. చాలా పాత సంగతి.
ఒకప్పుడు సోవియట్ యూనియన్ ని తన కనుసన్నల్లో శాసించిన మిహయిల్ గోర్భచేవ్ పదవి నుంచి దిగిపోయిన తరవాత బీబీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం  చెప్పారు. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన విస్తృతంగా దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. వాళ్ళు పడే ఇబ్బందులను దగ్గర నుంచి గమనిస్తారు. సరిపడా తిండి గింజలు కూడా లేని పరిస్తితి. ఆ విషయం ప్రజలతో అంటే వాళ్ళు ఓ మాట చెబుతారు.
“తిండి గింజల కొరత చాలా చిన్న విషయం. అందరం కాస్త కష్ట పడితే ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు. అది కాదు మిమ్మల్ని కోరేది. యుద్ధాలు రాకుండా చూడండి. యుద్ధాల వల్ల మన దేశం గతంలో ఎంత కష్టపడిందో, ఎంత నష్ట పోయిందో అందరికీ తెలుసు. కాబట్టి మరో ప్రపంచ యుద్ధం రాకుండా చూడండి” అంటారు.
ఆ నాటి రష్యన్ ప్రజల స్పూర్తి ఈనాడు మనకు అవసరం.
కరోనాను కట్టడి చేయడానికి ఇప్పటివరకు ఇరవై ఒక్కరోజులు లాక్ డౌన్ లో గడిపాము. ప్రధాని మోడీ మరో పందొమ్మిది రోజులు తప్పదు అంటున్నారు. కరోనా రక్కసిని తుద ముట్టించడానికి ఇంతవరకు వాక్సిన్ అంటూ ఏమీ లేదు. కాకపోతే అది వ్యాప్తి చెందకుండా చేసే ఉపాయం మన చేతిలోనే వుంది. అదేమిటంటే ప్రధాని సప్తపది ప్రణాళికలో చెప్పినట్టు కష్టమో, నష్టమో మే మూడు వరకు ఇంటి పట్టున ఉండడమే. అదొక్కటే మనం మన  దేశానికి మొత్తం ప్రపంచానికి చేసే సేవ. నాడు రష్యన్ ప్రజలు చెప్పినట్టు స్వచ్చందంగా ఈ బాధ్యతని మనం అందరం నెత్తికెత్తుకోవాలి. ఇది మినహా గత్యంతరం లేదు.
మొదటి మూడు వారాల లాక్ డౌన్ కాలంలో కొన్ని పొరబాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకుంటూ మరో పందొమ్మిది రోజులు గడపాలి. మందు వంట పట్టడానికి మండలం వ్యవధి అవసరం అంటారు. అంటే నలభయ్ రోజులు. నలభయ్ రోజుల్లో ఈ మహమ్మారిని పారద్రోలే అవకాశం వుందనుకున్నప్పుడు ప్రధాని మోడీ చెప్పినట్టు వినాలి. విని తీరాలి. మరో దారి లేదు. ముందు ముందు మరింత కఠినంగా అమలు చేస్తామంటున్నారు. అదీ మంచిదే. అలా చేయని పక్షంలో ఇన్నాళ్ళు ప్రజలు పంటి బిగువున ఓర్చుకుంటూ వచ్చిన కష్టాలకు ఫలితం లేకుండా పోతుంది.
ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే మార్గదర్శిక సూత్రాలు రేపో మాపో వస్తాయి. కరోనా విసిరిన  సవాలును తేలిగ్గా తీసుకోకపోవడమే నేటి తక్షణ కర్తవ్యమ్.   

13, ఏప్రిల్ 2020, సోమవారం

కరోనా కలయిక


ఆదివారం రాత్రి పద్నాలుగు కుటుంబాల వాళ్ళం ఒక చోట కలిసాము, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండానే. ఈ కలయికకు కర్త కర్మ క్రియ మా అన్నయ్య పెద్ద కోడలు రేణు సుధ. రాత్రి తొమ్మిది గంటలకు మనమంతా కలుస్తున్నాం, జూమ్ యాప్ సాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా’ అని ముందుగానే అన్ని కుటుంబాలకు వాట్సప్ సమాచారం అందించింది. అమెరికాలో వేర్వేరు చోట్ల ఉంటున్న మా అన్నయ్య పిల్లలు, మా పెద్దబ్బాయి కుటుంబం, ఖమ్మంలో మూడు కుటుంబాల వాళ్ళు, ముంబైలో ఉంటున్న ఒక కుటుంబం,   హైదరాబాదు సరే సరి మిగిలిన వాళ్ళందరూ రకరకాల ప్రదేశాల్లో వుంటున్నారు, అందరూ చెప్పిన టైము కల్లా కెమెరాల్లో మొహాలు పెట్టాము. ఒకళ్ళనొకళ్ళం పలకరించుకున్నాం. మనసారా మాట్లాడుకున్నాం. ఇంతకు  ముందు ఇలా ఫోన్ల ద్వారా పలకరింపులు మాకు  కొత్తేమీ కాదు, అలాగే వీడియో కాల్స్ కూడా. కానీ ఇలా అందరం ఒక ఫ్రేములో కలవడం ఇదే మొదటి సారి.
కొసమెరుపు ఏమిటంటే ఏ కరోనా అయితే మమ్మల్నందర్నీ ఇలా కలిపిందో ఆ కరోనా ముచ్చటే లేదు మా మాటల్లో. దాని ప్రస్తావన లేకుండానే అరగంట మాట్లాడుకున్నాం.     

కరోనా రోజుల్లో హైదరాబాదు


1970 లేదా అంతకుపూర్వం నుంచి హైదరాబాదులో నివసిస్తూ ఉన్నవారికి, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వుంటున్నవారికి నాటి హైదరాబాదు భౌగోళిక వాతావరణ పరిస్తితులు గుర్తుండేవుంటాయి. చాలా ప్రశాంతంగా వుండేది. బస్సులో హైదరాబాదు వస్తుంటే నగర పొలిమేరలకు చేరుతుండగానే కిటికీ చువ్వలు చల్లగా ఐస్ కడ్డీలుగా మారిపోయేవి. నడి వేసవిలో కూడా ఉదయాలు, సాయంత్రాలు చల్లగా, ఆహ్లాదంగా ఉండేవి. తెల్లవారి బాగా పొద్దుపోయే దాకా నగర వీధులు నిశ్శబ్దంగా, జన సంచారం లేకుండా కానవచ్చేవి. అప్పుడప్పుడు అక్కడక్కడ సైకిళ్ళ మీద, రిక్షాలమీద  వెడుతూ కొందరూ, కాలినడకన కొందరూ కనిపించేవారు. కానీ చాలా చాలా అరుదు. ఆ దృశ్యాలు ఆహ్లాదకరంగా ఉండేవి. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చిన దాకా నగరం బద్ధకం దుప్పటి కప్పుకున్నట్టు నిద్రాణంగా వుండేది. ఏదో పనులమీద, బహుశా ఉస్మానియా యూనివర్సిటీలో పనిపడి కాబోలు  ఒకటి రెండు సార్లు ఆ రోజుల్లో హైదరాబాదు వచ్చిన అనుభవం వుంది. ఇక 1975 నుంచి నా ఆల్ మకాం హైదరాబాదుకే మారింది.
ఇప్పుడు ఈ లాక్ డౌన్ కాలంలో ఆలోచిస్తుంటే నాటి నగర శోభ కనుల ముందు తిరుగుతోంది. నేను బయటకి వెళ్లి చూడగలిగిన, లేదా తిరుగాడగలిగిన అవకాశం వుంటే బహుశా ఆ నాటి నగరాన్ని, నిశ్శబ్దంగా, జన సంచారం, వాహనాల రొద లేని నాటి వీధుల్ని మళ్ళీ ఒకసారి చూడగలిగే అదృష్టం లభించేదేమో! కానీ దురదృష్టం. ఇవన్నీ ఊహలకే పరిమితం చేసుకోవాల్సివస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుంచి ఈనాటి వరకు నేను  ఇంటిగడప (ఇప్పుడు అన్నీ గడపలు లేని ఇళ్ళే అనుకోండి) దాటి కాలు బయట పెట్టలేదు. అపార్ట్ మెంటు లిఫ్ట్ లో కూడా కాలుమోపలేదు.   

https://www.youtube.com/watch?v=UVH0hoMmMJE    

(LINK COURTESY: విన్నకోట నరసింహారావు గారు)

12, ఏప్రిల్ 2020, ఆదివారం

వార్తలు చదువుతున్నది పార్వతీప్రసాద్! ఇకలేరు !


దుర్వార్తలకు గంధర్వుల శాపం ఉందేమో! మొదలు పెడితే చాలు వరసగా అవే.
ఆకాశవాణి న్యూస్ రీడర్ పార్వతి ప్రసాద్ గారు ఈ తెల్లవారుఝామున కన్నుమూసారు. గత కొద్దికాలంగా అస్వస్తులుగా వుంటున్నారు. ఆ సంగతి తెలిసినా పోలేని పరిస్తితి. డి. వెంకట్రామయ్య గారు పోయినప్పుడు ఆవిడ కలిసారు. సంస్మరణ సమావేశంలో పార్వతి గారే సర్వం చూసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మాడపాటి సత్యవతి గారు, దుగ్గిరాల పూర్ణయ్య గారు, పొత్తూరి  వెంకటేశ్వర రావు గారు, సి.నరసింహారెడ్డి గారు, ఈరోజు పార్వతి గారు.
ఇంతమెల్లగా మృదువుగా మాట్లాడే పార్వతి గారు వార్తలు ఎలా చదువుతారు అనిపించేది. కానీ ఆవిడ రెడియోలోనే కాదు, దూరదర్సన్లో కూడా వార్తలు చదివారు.
ఒకసారి ఢిల్లీ నుంచి ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ వచ్చారు. ఆర్వీవీ కృష్ణారావు గారు, సీజీకే మూర్తిగారు అందరం కలిసి మాట్లాడుతుంటుంటే అప్పుడే రేడియోలో వార్తలు మొదలయ్యాయి. పార్వతిగారు చదువుతున్నారు. తెలుగు తెలియని డీజీ గారు శ్రద్ధగా వింటున్నారు. ఆవిడ స్టూడియో నుంచి రాగానే డీజీ లేచి నిలబడి ఆవిడని అభినందించారు. చక్కటి స్వరం అని మెచ్చుకున్నారు. ఆవిడ క్యాజువల్ న్యూస్ రీడర్ అని చెబితే రెగ్యులర్ రీడర్ల కంటే బాగా చదివారని ఆయన అందరిలో ప్రశంసించడం పార్వతి గారి ప్రతిభకి తార్కాణం.
‘బాగున్నారు కదా!’ అని ఆత్మీయంగా పలకరించే మనిషి ఇక కనబడరు. ఆవిడ సుస్వర స్వరం మరి వినపడదు.
పార్వతీ ప్రసాద్ గారి ఆత్మశాంతికి ప్రార్ధించడం మినహా ఈ కరోనా సమయంలో చేయగలిగింది లేదు.    

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఓ పాత వృత్తాంతం నెమరు వేసుకోవడానికి మాత్రమే


ఏదో జరుగుతుంది. వెంటనే అప్పుడెప్పుడో ఇలాగే జరిగింది అంటారు పెద్దవాళ్ళు, దానికీ దీనికీ పెద్దగా పోలికలేకపోయినా.
అలాగే ఇది. జరిగింది ఏమిటో మీకు తెలుసు, విడిగా అదేమిటో చెప్పక్కర లేదు. పోలిక అంటారా! మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని  పేటిక మాదిరే. అందులో ఎవరికి కావాల్సింది వాళ్లకు కనబడుతుంది. అక్కరలేదు అనుకున్నది కనబడదు. మన రాజకీయాల సంగతి చెప్పేది ఏముంది.
ఇక చిత్తగించండి!
ఈ వ్యాసం ఇండియా టుడే పత్రికలో 1993 అక్టోబర్ సంచికలో వచ్చింది. రాసిన జర్నలిస్టు పేరు మనోజ్ మిత్తా. ఆ వ్యాసానికి ఇది స్వేచ్చానువాదం. ఆ పత్రిక వారికి కృతజ్ఞతలు.
ఆ రోజుల్లో ఎన్నికల చీఫ్ కమిషనర్ టి.ఎన్. శేషన్ అంటే జనాలకు ఎనలేని ఆదరణ అభిమానం. రాజకీయులకు సింహస్వప్నం.
అయితే ఎంతటి వారికి కూడా ఒక రోజు వస్తుందనేది నానుడి. అది సెషన్ విషయంలో కూడా జరిగింది.
అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది. అది ఆయన్ని ఇరకాటంలోనే కాదు ఆశ్చర్యంలో కూడా ముంచివేసింది. ఎందుకంటే ఇలాటి రోజు ఒకటి వస్తుందని ఆయన కూడా ఎప్పుడూ ఊహించి వుండరు.
అప్పటివరకు ఎలెక్షన్ కమిషన్ అంటే శేషన్ ఒక్కరే. ఆయనే దానికి కర్తా కర్మా క్రియా అన్నీను. అలాంటిది మరో ఇద్దరు ఎలెక్షన్ కమిషనర్లను ప్రభుత్వం అదనంగా నియమించింది. అది ఎంతటి ఆకస్మిక నిర్ణయం అంటే కొత్తగా నియమితులయిన ఇద్దరు కమిషనర్లు శ్రీ జీవీజీ కృష్ణమూర్తి, శ్రీ ఎం.ఎస్. గిల్ లకు కూడా ఆ సమాచారం ఆఖరి నిమిషంలోనే తెలిసింది. అప్పుడు వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్న గిల్ అధికారిక పర్యటన నిమిత్తం ఆ రోజు ఉదయమే గ్వాలియర్ వెళ్ళారు. ఆయన్ని మళ్ళీ ఢిల్లీ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక  ప్రత్యేక విమానాన్ని పంపింది.  పుణేలో సెలవులు గడపడానికి వెళ్ళిన శేషన్ కు ఈ విషయం తెలిసింది. “ఇంకా నూటొక్క మంది కమిషనర్లను వేసుకోమనండి, నాకేమీ ఫరకు పడదు” అన్నది ఆయన మొదటి స్పందన.
ఇక కృష్ణమూర్తి గారి విషయం తీసుకుంటే ఆయన కొన్నింటిలో శేషన్ కు ఏ మాత్రం తీసిపోరు. ఆయన కేంద్రంలో న్యాయ శాఖ కార్యదర్శిగా పనిచేసారు. ఆయన శేషన్ రక కోసం ఎదురు చూడకుండా ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో తనకంటూ ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు.  శేషన్ కు నమ్మకస్తుడిగా  ఎలెక్షన్ కమిషన్ లో కోర్టు వ్యవహారాలు చూస్తున్న మాజీ అటార్నీ జనరల్  జి. రామస్వామి, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఒక కేసులో కమిషన్ తరపున వాదించడానికి వీలులేకుండా ఆర్డరు వేసారు. ఎందుకంటే అనదరి కంటే ముందు ఇలాముగ్గురు సభ్యులను నియమించడం రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది ఆ రామస్వామి కాబట్టి.
“ఇక నుంచి  ఎలెక్షన్ కమిషన్ అంటే మేము ముగ్గురం.” అని ఇండియా టుడే తో తేల్చి చెప్పారు. అయినా శేషన్ పట్టుబట్టి ఆ కేసును మళ్ళీ రామస్వామికే అప్పగించారు. అది వేరే విషయం. అప్పటి నుంచి ఈ ఇరువురి నడుమ విబేధాలు పెరిగిపోయాయి. తనకు ఆఫీసులో తగిన గౌరవం లభించడం లేదని ఒకసారి శ్రీ కృష్ణమూర్తి ఆఫీసు నుంచి బయటకు వెళ్ళిపోయారు కూడా. తను కూర్చుండే గదికి తాళం వేసి వుండడం, ఫోను వైర్లు తెగిపోయి వుండడం గమనించిన శ్రీ కృష్ణమూర్తి అవమానంగా భావించారు. భద్రతా హర్యాల కారణంగా ఒక రోజు ఆ గదికి తాళం వేసినట్టు శేషన్ విలేకరులకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మెత్తపడని కృష్ణమూర్తి ఆ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని శేషన్ హామీ ఇచ్చిన తర్వాతనే ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టారు.
మూడో సభ్యుడైన గిల్ మాత్రం ఈ వ్యవహారాలను తేలిగ్గా తీసుకున్నారు. ‘మనం ఏ కుర్చీలో కూర్చున్నాం, మన గదిలో ఎన్ని సోఫాలు వున్నాయి అన్నది ప్రధానం కాదు. రాజ్యాంగం మనకు ఒప్పగించిన బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అన్నదే ప్రధానం’ అనేది ఆయన అభిప్రాయం.
ఇదిలా ఉండగానే ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తెచ్చింది. ముగ్గురు కమిషనర్లలో  ఒకరుఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు, హోదాలో, అధికారాల్లో అందరూ సమానమే” అన్నది దాని సారాంశం.
(ఇండియా టుడే సౌజన్యంతో)


5, ఏప్రిల్ 2020, ఆదివారం

పెద్ద గీత గీద్దాం రండి – భండారు శ్రీనివాసరావు



(Published in నమస్తే తెలంగాణ daily on 5th April, SUNDAY)
ఒక తరం వారు కనీవినీ ఎరుగని ఒక మహా విపత్తు నేటి తరం అనుభవంలోకి వస్తోంది. గతంలో మన పెద్దవాళ్ళు రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి పరిస్తితులను గురించి చెప్పడం పాత తరం వారికి గుర్తుండే వుంటుంది. అది ప్రపంచదేశాల మధ్య జరిగిన యుద్ధం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచదేశాలన్నీ కలిసి ఉమ్మడిగా ఒక మహమ్మారి వైరస్ తో సాగిస్తున్న సమరం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించినట్టు ‘కనపడని శత్రువుతో ఎడతెగని యుద్ధం’ ఇది. ఏ యుద్ధంలోనైనా గెలుపోటములు వుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో గెలిచి తీరాల్సిన అవసరం వుంది. ఎందుకంటే సమస్త మానవాళి మనుగడ ఈ విజయం మీదనే ఆధారపడి వుంది.
కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులందరూ ఇంతకాలం మూడో ప్రపంచ యుద్ధం గురించే ముచ్చటిస్తూ వచ్చారు. వారు ఏనాడు కూడా ఇటువంటి ముప్పొకటి యావత్ ప్రపంచాన్ని ఉడ్డుగుడుచుకునేలా చేస్తుందని లేశమాత్రం కూడా ఊహించలేదు. ఏదేశం ఎన్ని మారణాయుధాలను కలిగివున్నది, ఏ అగ్రరాజ్యం వద్ద నిమేష కాలంలో శత్రు దేశాలను భస్మీపటలం చేసే అణ్వాయుధాలు పోగుపడి వున్నది లెక్కలు కట్టి చెప్పి మూడో ప్రపంచయుద్ధం అంటూ జరిగితే అందులో విజేతలు, పరాజితులు అంటూ ఎవ్వరూ మిగలరని, ఆ సంగ్రామంలో మొత్తం మానవ సమాజం తుడిచి పెట్టుకు పోవడం మినహా నిర్దిష్ట ఫలితం శూన్యమని హెచ్చరిస్తూ వచ్చారు.
సరే! ఈ సంగతులు ఇలా ఉంచుదాం.
ఈ ఉదయం మా పనిమనిషి మూతికి గుడ్డ కట్టుకుని పనులు చేయడానికి వచ్చింది. ఆవిడ మా వాచ్ మన్ భార్య. బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. రాగానే సానిటైజర్ తో చేతులు కడుక్కుని పనులన్నీ పూర్తి చేసుకుని వెడుతోంది. మామూలు రోజుల్లో అయితే, పక్కనే వున్న మరో రెండు ప్లాట్లలో పనిచేస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా వెళ్ళడం లేదు. ‘రేణుకా! ఏదైనా డబ్బు ఇబ్బందిగా వుంటే చెప్పు’ అన్నాను, వెళ్లిపోయేటప్పుడు.
ఆవిడ చెప్పిన జవాబు నా కళ్ళు తెరిపించింది. ‘డబ్బుకు ఇబ్బంది ఉన్న మాట నిజమే కాని కష్టంగా లేదు’
ఇబ్బందులు వేరు, కష్టాలు వేరు అనే భగవద్గీత ఆమె నాకు బోధించింది.
చదువుకున్న వాళ్ళం, ఇంట్లో వొంట్లో కాస్త వున్నవాళ్ళం ఈ వారం పది రోజులకే నానా హైరానా పడిపోయి ఎందుకు పరిస్తితుల్ని తిట్టుకుంటూ కూర్చున్నాం. అంతే కాదు ఈ కష్టాలకు ఎవరినో బాధ్యులను చేసి వాళ్ళ చేతకానితనం వల్లనే దేశం ఇన్ని ఇబ్బందుల్లో చిక్కుకుపోయిందని హాయిగా తీరి కూర్చుని ఫేసుబుక్కుల్లో పోస్టులు పెడుతున్నాం. నిజానికి మనం ఇబ్బందులు అనుకునేవి ఇబ్బందులేనా!
రోజూ ఆర్డరు వేసి తెప్పించుకునే పిజ్జాలు దొరక్క పోవడం, పనివున్నా లేకపోయినా బైకో, కారో వేసుకుని నాలుగు బజార్లు చక్కర్లు కొట్టిరావడానికి వీలులేకపోవడం, చేతి సంచీ పట్టుకుని మార్కెట్టుకు వెళ్లి గీసి గీసి బేరాలు చేసి కూరలు కొనుక్కువచ్చే అవకాశం లేకపోవడం, పెద్ద పెద్ద మాల్సుకు వెళ్లి, కలయతిరుగుతూ అవసరమైనవీ లేనివీ సమస్తాన్ని ట్రాలీల్లో నింపుకుంటూ షాపింగ్ చేసే వీలు లేకపోవడం, అర్ధరాత్రి దాకా బార్లలో, పబ్బుల్లో గడుపుతూ డ్రంకెన్ డ్రైవింగ్ లో పట్టుపడి పోలీసులతో యాగీపడుతూ, టీవీల్లో కనబడే సందర్భాలు కోల్పోవడం ఇవేనా మనం అనుకునే ఇబ్బందులు, కష్టాలు. నిజానికి ఇవన్నీ చిన్న గీతలు.
పగలూ రాత్రీ ఇళ్ళల్లోనే వుండి, కాలుమీద కాలువేసుకుని టీవీలు చూస్తూ కరోనాపై సాగిస్తున్న యుద్ధంలో వైద్య సిబ్బంది, పోలీసులు పడే కష్టాలను చూస్తూ మన తలలో దూరిన ప్రతి ఐడియాను సలహాల రూపంలో సాంఘిక మాధ్యమాల్లో గుప్పించడం, వాటికి లైకులు తగినన్ని రాలేదనో, లేదా వాటిని ఖండిస్తూ కామెంట్లు వచ్చాయనో జుట్టు పీక్కుంటూ కూర్చోవడం ఇవేనా మనం పడే కష్టాలు, ఇబ్బందులు. నిజానికి ఇవన్నీ చాలా చిన్న గీతలు.
మనం ఇలా ఇళ్ళల్లో వున్నామంటే ఎవరో మనకోసం వీధుల్లో మండుటెండలో నానా కష్టాలు పడుతున్నారని అర్ధం చేసుకోవాలి. రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి కాసేపు కరెంటు పొతే, అసలే ఎండాకాలం, కరెంటు లేకపోతే ఎల్లాగా, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని విమర్శలు చేసే నైతిక హక్కు మనలో ఎవరికైనా ఉందా!
తగినన్ని సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలు లేవు, మాస్కుల ఉత్పత్తి సరిపోను లేదు అంటూ సన్నాయినొక్కులు నొక్కుతూ కాలక్షేపాలు చేయడం బాధ్యత అనిపించుకుంటుందా!
ఇంటికి నిప్పు అంటుకుంటుంది. అప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏమిటి? ఆ మంటల్ని ఆర్పడం లేదా అవి పక్క ఇళ్ళకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అంతే కాని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ ఇంట్లో తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని నోళ్ళు పారేసుకోవడం వల్ల ఉపయోగమేమిటి? ముందు నష్ట నివారణ చర్యలు తీసుకుని, ప్రాణ నష్టం నివారించి ఆ పిదప తీరిగ్గా ఈ విషయాలు చర్చించి బాధ్యులను నిర్ధారించి శిక్షలో జరిమానాలో వేయిస్తే ఆక్షేపించేవారు ఎవరుంటారు? నిజానికి ప్రభుత్వాలు చేస్తున్నది అదే! ఆ ప్రయత్నాలను ఆక్షేపించడం వల్ల ఉపయోగం ఏమిటి?
ఈ లాక్ డౌన్ వల్ల సమాజంలో కష్టపడేవాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు వేరే వున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రోజు కూలీ చేసుకుని జీవనం గడిపే వాళ్ళు, రెక్కాడితేకాని డొక్కాడనివాళ్ళు ఎందరో వున్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ కూడా. కానీ వాళ్ళని గురించి మాట్లాడేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటోంది. ఎంతసేపూ ఇఎంఐలు, వాయిదాలు, వడ్డీ గొడవలు ఇవే రోజువారీ చర్చల్లో కనబడుతున్నాయి. వీటిని తక్కువ చేసి చెబుతున్నానని అనుకోవద్దు. కానీ ఇవి ఇబ్బందులు మాత్రమే, కష్టాలు కాదు.
మా పనిమనిషి మాటలతో నాకు జ్ఞానోదయం అయిందని అనుకుంటున్నాను. నేను వెంటనే నా గీత పక్కనే పెద్ద గీత గీసుకున్నాను. దాంతో నాది చిన్న గీత అయింది. మనసు తేలికపడింది.
అందరం పెద్ద గీత గీసుకుందాం రండి! కష్టాలు అనుకున్నవి ఇబ్బందులుగా మారతాయి. మనసు తేలికపడ్డకొద్దీ ఇబ్బందులు కూడా దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

2, ఏప్రిల్ 2020, గురువారం

రాజుగారి పెద్ద భార్య చిన్న భార్య


“మీరు పాత కాలంవాళ్ళు. ఇవన్నీఈ  రోజుల్లో చాలా  మామూలు. తేలిగ్గా తీసుకోవాలి” అన్నాడు ఓ మిత్రుడు.
నిజమే. కానీ ఆ మిత్రుడు అన్నట్టు పాత కాలపు వాసనలు కదా! త్వరగా వదలవు.
ఈ మధ్య ఫేస్ బుక్ లో  ప్రతి విషయంలో అనవసరమైన నిందారోపణలు, వ్యాఖ్యలు దర్శనమిస్తున్నాయి.
చిన్నప్పుడు మా బామ్మ అనేది, ఇష్టం లేని వాడి పాపిడి వంకర అని. అలాగే వున్నాయి ఇవి కూడా.
ఏదో ఎవరూ అనుకోని  తెలియని ఉత్పాతం వచ్చి పడింది. అందరూ తలో చేయీ వేస్తున్నారు. కానీ వీళ్ళ చేతులు ఊరుకోవు కదా! సోషల్ మీడియాలో సన్నాయి నొక్కులు మొదలయ్యాయి.
“టాటా సాయం చేస్తే బిర్లా ఎందుకు చేయడు? (బిర్లాలు చేసారో లేదో నేను పత్రికల్లో చదవలేదు, ఎందుకంటే పత్రిక మొహం చూసి రమ్యమైన రెండో వారం నడుస్తోంది)
“హీరోలు ఒక్కళ్ళేనా హీరోయిన్లకు బాధ్యత లేదా”   
“అందరూ కోట్లు లక్షలు ఇస్తుంటే ఈయనకు ఏమైంది వేలతో సరిపుచ్చాడు”
 “ఇంకా వాళ్ళు మొదలు పెట్టలేదేమిటి? గతంలో ఏదైనా ఉపద్రవం వస్తే చాలు చందాల వసూలుకు జనం మీద పడేవాళ్ళు. వసూలు చేసిన వాటికి ఇంతవరకు లెక్కా డొక్కాలేదు”
“ఈ ముఖ్యమంత్రిని నమ్మి వందల కోట్లు ఇస్తున్నారు, అదిగో ఆ ముఖ్యమంత్రిపై నమ్మకం లేక ఎవరూ చేయి విదల్చడం లేదు”
అంటే ఏమిటి? రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనేనా?
ఈ విషమ సమయంలో ఇవేనా మనం మాట్లాడుకోవాల్సింది.
వెనక చైనా యుద్ధం అప్పుడు దేశ రక్షణ నిధికి విరాళాలు పోగుచేస్తుంటే మా రెండో అక్కయ్య కూతురు శాంత, అప్పటికి చాలా చిన్నపిల్ల, తన చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి జోలెలో వేసింది. మా బావగారు ‘మంచి పనిచేశావ్ అమ్మాయి’ అని మెచ్చుకున్నారు. అంతే! అప్పటితో మరచిపోయారు. ఇరుగూ పొరుగు వాళ్లకి కూడా చెప్పుకోలేదు.