9, సెప్టెంబర్ 2018, ఆదివారం

త్వరిత గతిన మారుతున్న తెలంగాణా రాజకీయ చిత్రం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-09-18)
‘ఇలా జరగొచ్చని అనుకున్నవాళ్ళు వున్నారు కానీ ఇలానే జరుగుతుంద’ని
అన్నవాళ్లు తక్కువ.
అయితే కేసీఆర్ ఎలా జరగాలని అనుకున్నారో అక్షరాలా అలాగే జరిగింది.
తెలంగాణా ప్రభుత్వపు ఆఖరి మంత్రివర్గ సమావేశం నిమిషాల్లో ముగిసింది. శాసన
సభను రద్దు చేయాలనే ఏకవాక్య తీర్మానాన్ని క్షణాల్లో ఆమోదించింది. ఆ
తీర్మానాన్ని తీసుకుని ముఖ్యమంత్రి నేరుగా రాజ్ భవన్ కు వెళ్ళారు.
గవర్నర్ ని కలిసారు. తీర్మానం ప్రతిని అందచేశారు.
మంత్రివర్గ రాజీనామాను అక్కడికక్కడే గవర్నర్ నరసింహన్ ఆమోదించారు.
సాయంత్రం అయిదు గంటలకు టీబీజేపీ ప్రతినిధివర్గం తనను కలవడానికి వస్తున్న
దృష్ట్యా గవర్నర్ తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించక పోవచ్చని టీవీ
చర్చల్లో కొందరు మాట్లాడుతున్నప్పుడే వారిని నిబిడాశ్చర్యానికి
గురిచేస్తూ గవర్నర్ నరసింహన్ మంత్రివర్గ నిర్ణయాన్ని ఎలాంటి జాప్యం
చేయకుండా తక్షణం
ఆమోదించడం మాత్రమే కాకుండా, కే. చంద్రశేఖర రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా
కొనసాగమని కోరినట్టు టీవీ తెరలపై స్క్రోలింగులు పరుగులు తీశాయి.
అక్కడినుంచి పరిణామాలు చకచకా సాగాయి.
తెలంగాణా తొలి అసెంబ్లీ రద్దయినట్టు శాసనసభ సచివాలయం గెజిట్ జారీ
చేసింది. గెజిట్ ప్రతిని శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు రాష్ట్ర
ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి అందచేయడం, ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల
సంఘానికి తెలియచేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హుటాహుటిన ఢిల్లీకి వర్తమానం
పంపడం వెనువెంటనే జరిగిపోయాయి.
ముందుగా రాసుకున్న సినిమా స్క్రిప్ట్ మాదిరిగా ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు,
అవాంతరాలు లేకుండా జరగాల్సిన విధి విదానాలన్నీ సాగిపోయాయి.
అప్పటివరకు ఈ విషయంలో అలముకున్న అనుమాన మేఘాలన్నీ పటాపంచలు అయ్యాయి.
నిన్నమొన్నటి వరకు కేసీఆర్ అనే పేరుకు ముందున్న ‘ముఖ్యమంత్రి’ అనే పదానికి
‘ఆపద్ధర్మ’ అనే పదం జోడు కలిసింది.
తాను కోరుకున్న విధంగానే కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి పర్యాయం అసెంబ్లీ
ఎన్నికలు జరగబోతున్నాయి.(2014లో అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణాకు విడిగా
జరిగినా ఆ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టే లెక్క)

విశేషం ఏమిటంటే ఈ పరిణామాలన్నీ మెరుపువేగంతో జరిగిపోవడం.
అంతేనా! అంటే అంతటితో అయిపోలేదు.
శాసనసభ రద్దు నిర్ణయాన్ని వెల్లడించిన విలేకరుల సమావేశంలోనే, ఎవరూ
ఊహించని రీతిలో ఏకంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే నూట అయిదుమంది పార్టీ
అభ్యర్ధుల పేర్లను ప్రకటించి అందర్నీ మరింత విస్మయానికి గురిచేసారు
కేసీఆర్. ముందస్తు ఎన్నికల మాట
ఇదమిద్ధంగా తేలకముందే ఆయన మాత్రం చాలా ముందుగానే అభ్యర్ధుల తొలి జాబితా
విడుదల చేసి ఒక రికార్డు నెలకొల్పారు.
అంటే ఏమన్నమాట. ఈ విషయంపై ఆయన చాలా కాలంగా, చాలా లోతుగా కసరత్తు
చేస్తున్నారని అర్ధం చేసుకోవాలి.
సరే! నూట అయిదుమంది అభ్యర్ధులు ఎవరన్నది తేలిపోయింది. సంతోషం. వాళ్లకి
కూడా టికెట్ వస్తుందా రాదా అన్న అనుమాన, భయాలు ‘ప్రస్తుతానికి’ లేకుండా పోయాయి.
మరి తరువాత ఏమిటి? మళ్ళీ ఈ ప్రశ్న సహజంగానే ముందుకువస్తుంది. దానితో
పాటుగా మరికొన్ని ఉప ప్రశ్నలు.
‘కేసీఆర్ భావిస్తున్నట్టు డిసెంబరులోగా తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయా?
‘ఏదైనా కారణంతో జరక్కపోతే ఏం జరుగుతుంది?
‘కొత్త రాష్ట్రంగా తెలంగాణా ఏర్పడ్డ తర్వాత తొట్టతొలిసారి రాష్ట్రపతి
పాలన వస్తుందా?’

ఇలా అన్నమాట.
అయితే, ఈలోగా మరో పరిణామం చోటుచేసుకుంది. లేకపోతె ఇది జవాబు దొరకని
ప్రశ్నలాగా మిగిలిపోయేది, ఎవరో అన్నట్టు ‘డౌటింగ్ థామస్’ లకు
చేతినిండా పని పెడుతూ.
ఈరకం ప్రశ్నలపై టీవీల్లో చర్చలు మొదలవుతుండగానే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పిలుపు వచ్చింది, ఖుద్దున ఢిల్లీ
బయలుదేరి రావాల్సిందని.
మరో నాలుగు రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్
ఘడ్ లకు ఎన్నికల ఘడియ దగ్గర పడింది. వాటి విషయం చూడడానికి కేంద్ర ఎన్నికల
కమీషన్ వారానికి రెండుమార్లు, మంగళవారం. శుక్రవారం సమావేశం అవుతూ
వస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో పాటు తెలంగాణా
అధికారిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు అంటే తెలంగాణాలో ముందస్తు
ఎన్నికలు గురించి కేంద్ర కమీషన్ లో కూడా కొంత కదలిక కనబడుతోందని కొందరు భాష్యం
చెబుతున్నారు.
అదీ నిజమనే అనిపిస్తోంది, ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం చూస్తే.

ఈ పరిణామాల నేపధ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తధ్యం అనే మాటలు
ఎల్లెడలా వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగానే టీఆర్ఎస్ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి తెలంగాణా కాంగ్రెస్
పార్టీ కూడా ముందస్తు ప్రకటనలు చేస్తూ తానూ రేసులో ఉన్నాననే సంకేతాలు
బలంగా పంపిస్తోంది. సాధారణంగా ప్రతి విషయానికీ ఢిల్లీ వైపు చూస్తూ,
నిర్ణయాలు తీసుకుకోవడంలో జాప్యం చేస్తారనే అపప్రధను మోస్తున్న కాంగ్రెస్ పార్టీ
ఈ పర్యాయం చాలా ముందుగానే ఎన్నికల ప్రణాళిక వెల్లడిచేసింది. ఆకాశమే
హద్దుగా చేసిన ఎన్నికల వాగ్దానాలు, ఓటర్లకు ఇవ్వచూపిన తాయిలాలు,
కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనను మరింత ముందుకు నెట్టాయని కూడా
కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. త్వరితగతిన స్పందించడంలో ఏమాత్రం
వెనుకబడిలేమనే సంకేతం ఇవ్వడానికి కాబోలు ఎంతమాత్రం కాలయాపన చేయకుండా విలేకరుల
సమావేశాలు వెనువెంటనే పెట్టి కేసీఆర్ ఏ నిర్ణయం ప్రకటించినా దాన్ని
ఖండించే కొత్త పద్దతికి కాంగ్రెస్ స్వీకారం చుట్టడం ఆ పార్టీలో వచ్చిన
కొత్త మార్పు. ‘ప్రజలను మంచి చేసుకుని అధికారంలోకి తిరిగిరావడం కన్నా
వ్యవస్తలని మేనేజ్ చేసుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కేసీఆర్ కి
వెన్నతో పెట్టిన విద్య’ అని కాంగ్రెస్ నాయకులు ఘాటయిన విమర్శలకు
దిగుతున్నారు.
రాజకీయాలను, ముఖ్యంగా ఎన్నికలను, అవి ఏ ఎన్నికలయినా సరే, అత్యంత
ప్రతిష్టాత్మకంగా, ఎంతో పట్టుదలగా తీసుకుని చావోరేవో తేల్చుకునే విధంగా
వ్యవహరించే రాజకీయ నాయకుడని కేసీఆర్ కు పేరుంది. దాన్ని నిజం చేస్తూ యాభై రోజుల్లో
వంద ప్రజాశీర్వాద సభలను నిర్వహించి తమ పరిపాలనపై ప్రజల తీర్పును కోరాలని నిర్ణయం
తీసుకోవడం, వేయబోయే ఆ అడుగును తనకు గతంలో కలిసొచ్చిన హుస్నాబాదు నుంచే ఆ
మరునాడే మొదలు పెట్టడం కూడా జరిగింది.
‘ఔర్ ఏక్ బార్ కేసీఆర్’, ‘కంటి ముందే అభివృద్ధి, ఇంటి ముందే అభ్యర్ధి’
అనే ఎన్నికల నినాదాలను బలంగా జనంలోకి తీసుకు వెళ్లేందుకు టీఆర్ఎస్
శ్రేణులు ఫేస్ బుక్, వాట్సప్ వంటి సాంఘిక మాధ్యమాల్లో
ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి కూడా. కాంగ్రెస్ పార్టీకి కూడా
ఇటువంటి హైటెక్ ప్రచారాన్ని సమన్వయం చేసే గట్టి యంత్రాంగం లేకపోలేదు. ఆ
మాటకువస్తే, మిగిలిన రాజకీయ
పార్టీలు కూడా ఈ విషయంలో ఎవరికీ తీసిపోలేదనే చెప్పాలి. అయితే ఆయా పార్టీల
అభిమానులు, కార్యకర్తలు తమ పార్టీలని సమర్ధించడానికి, ప్రత్యర్ధి
పార్టీలను బద్నాం చేయడానికి ఈమాధ్యమాలను వాడుకుంటున్న తీరు కొన్ని
విమర్శలకు గురవుతున్న మాట కూడా యదార్ధమే.
‘ఏది మాట్లాడాలి ఏది కూడదు’ అనే విషయంలో నాయకులే స్పష్టత లేక
నోటికివచ్చినట్టు మాట్లాడుతుండడం చూస్తుంటే ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున
మేస్తుందా’ అనే సామెత గుర్తు రాకమానదు.
రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పోటీకి దిగినా ప్రధాన పోరాటం
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమే అన్నది బహిరంగ రహస్యం.

కాంగ్రెస్ లో బహునాయకత్వం. ఇది ఒక రకంగా ఆ పార్టీకి బలమూ, బలహీనత. పార్టీ
గుర్తు తోడయితే తమ సొంత బలంతో సునాయాసంగా గెలవగలిగిన వాళ్ళు ఆ పార్టీలో
చాలామంది వున్నారు. అయితే అంతర్గత కలహాల కారణంగా అనేక సందర్భాలలో ఈ బలం
నిర్వీర్యం అయిపోతోంది.
టీఆర్ఎస్ పరిస్తితి వేరు. ప్రాంతీయ పార్టీలకు అధినాయకుడే అసలు బలం. అతడి
శక్తిసామర్ధ్యాలను బట్టే జయాపజయాలు చాలావరకు నిర్ధారణ అవుతాయి. కేసీఆర్
నాయకత్వపటిమే ఆ పార్టీకి శ్రీరామరక్ష. అయినా ఏదోవిధంగా బలమయిన
అభ్యర్ధులను వేరే పార్టీల నుంచి ఆకర్షించే ప్రయత్నం కేసీఆర్
చేస్తున్నారంటే, ఎన్నికల వంటి అతిముఖ్యమైన విషయాల్లో ఆయన ఏమాత్రం చాన్స్
తీసుకునే వ్యక్తి కాదని అర్ధం చేసుకోవచ్చు.

ప్రత్యర్ధి శిబిరాలు కూడా ఈసారి ఛాన్స్ తీసుకోకూడదనే ఆలోచనల్లో వున్నాయి.
కేసేఆర్ అనే ఉమ్మడి రాజకీయ ప్రత్యర్ధిని నిలువరించేందుకు ఆగర్భ రాజకీయ
ప్రత్యర్దులయిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపే ప్రయత్నాలను
ముమ్మరం చేశాయి. ఈ దిశలో సంప్రదింపులను మరింత ముందుకు తీసుకుపోవడానికి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాదు వచ్చారు. పొత్తులపై
చర్చలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా ఒక
కమిటీని ఏర్పాటు చేసారు. మరికొన్ని పార్టీలను కలుపుకుని ఒక మహా కూటమి
ఏర్పాటు చేయాలన్నధ్యేయంతో ముందుకు సాగుతున్నట్టు తోస్తోంది. మరి కొద్ది
రోజుల్లో ఈ పొత్తులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఈ సందర్భాలలో పైకి
భావసారూప్యం అనే పడికట్టు పదాలు వినబడుతుంటాయి.కానీ ఇలాంటి కూటములది ఒకే
ధ్యేయం, అధికారంలో ఉన్న ప్రత్యర్ధి పార్టీని గద్దె దింపడం. తమ రాజకీయ
ప్రయోజనాలను తాత్కాలికంగా అయినా కాపాడుకోవడం. గతం చెబుతున్న సత్యం ఇది.

మన ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం ఏమిటంటే, అన్ని పార్టీలు ప్రజాస్వామ్య
పరిరక్షణే తమ ఆశయం అంటూనే, మరో పక్క అవకాశం దొరికినప్పుడల్లా ఆ
స్పూర్తికి తూట్లు పొడవడం.

నిజానికి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎవరయ్యా అంటే వాళ్ళు మన సాధారణ
ఓటర్లు. రాజకీయ పార్టీలు కాదు.

పార్టీలు ఎరచూపే ప్రలోభాలకు గురవుతున్నారన్న అపప్రధను మోస్తూ కూడా కేవలం
‘ఓటు’ అనే ఆయుధంతో ప్రభుత్వాలను మార్చగలుగుతున్నది మాత్రం ఆ ఓటర్లే.



రచయిత ఈమెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595

ఎంతెంత కాలం? ఇంకెంత కాలం??




ఏకఛత్రాదిపత్యంగా పాలించిన మహా మహా చక్రవర్తులు సయితం ఒక వయసు రాగానే కొడుకులకు రాజ్యభారం అప్పగించి వానప్రస్తాశ్రమానికి వెడతారని పురాణ కధలు చెబుతాయి.
మరి భారత ప్రజాస్వామ్యంలో అలాంటి వీలు ఎందుకు లేదని కొందరి ఘోష.
ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికెవ్వరికీ రిటైర్ మెంటు లేదు. కొన్ని నియంతృత్వ దేశాలు, కమ్యూనిష్ట్ దేశాలను మినహాయిస్తే గొప్ప గొప్ప ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలం అధికారపీఠంపై కొనసాగిన దాఖలాలు లేవు. అమెరికా విషయమే తీసుకుందాం. ఆ దేశ అధ్యక్షుడిగా ఎవరయినా సరే రెండు దఫాలు, అంటే ఎనిమిదేళ్ళకు మించి ఏ ఒక్కరూ వైట్ హౌస్ ను అంటిపెట్టుకుని ఉండరు. ఒక పార్టీ అధికారంలో దీర్ఘ కాలం అధికారంలో ఉండవచ్చు కానీ, ఒకే వ్యక్తి, అతడు ఎంతటి ప్రజ్ఞాధురీణుడైనా సరే అధ్యక్షుడిగా నియమిత కాలాన్ని మించి పదవిలో వుండడం కుదరదు. అమెరికా అధ్యక్షుడిగా గతంలో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న వాళ్ళు అయిదుగురు వున్నారు. ఎవరికి వారు తమ ప్రవృత్తికి తగిన వ్యాపకాన్ని ఎంచుకుని శేష జీవితం గడుపుతున్నారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో వారందరూ తమ తమ తెలివితేటలకు తగినట్టుగా పాలనా వ్యవహారాలను చక్కదిద్దారు. ప్రపంచ రాజకీయాలను శాసించారు. అయితే ప్రతిదానికీ ఒక ముగింపు వుంటుంది. వైట్ హౌస్ లో వుండగా దుర్నిరీక్షంగా పాలించిన వారందరూ ఇప్పుడు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఈ అయిదుగురు మాజీ అధ్యక్షులు, బారక్ ఒబామా, (డెమోక్రాటిక్ పార్టీ- 2009), జార్జ్ డబ్ల్యూ. బుష్, జూనియర్, (రిపబ్లికన్ పార్టీ-2001) బిల్ క్లింటన్,(డెమోక్రాటిక్ పార్టీ- 1993), జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్ సీనియర్, (1981-89),రిపబ్లికన్ పార్టీ, జిమ్మీ కార్టర్ (1977-81) డెమోక్రాటిక్ పార్టీ. వేర్వేరు పార్టీలకు చెందినవారు అయినప్పటికీ అప్పుడప్పుడూ కలిసి అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు.
జిమ్మీ కార్టర్ వయసు ఇప్పుడు 94 సంవత్సరాలు. కొన్ని వందల గదులతో అలరారే శ్వేత భవనం (వైట్ హౌస్) లో అధ్యక్షుడిగా సకల సదుపాయాలతో జీవించిన ఈ వృద్ధ రాజకీయ నాయకుడు ఎప్పుడో 1961లో కట్టుకున్న ఒక సాదా సీదా రెండు పడక గదుల ఇంట్లో తన భార్యతో కలిసి శేష జీవితం గడుపుతున్నారు. వారాంతపు రోజుల్లో ఇరుగు పొరుగు వారితో కలిసి పేపర్ ప్లేట్లలో భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు. ఈ విందుల కోసం వృద్ధురాలయిన కార్టర్ భార్య స్వయంగా యోగర్త్ తయారుచేసి వడ్డిస్తుంది. అప్పుడప్పుడూ బయటకు వెళ్లి చౌకగా వస్తువులు దొరికే డాలర్ స్టోర్ లో షాపింగ్ చేస్తుంటారు. ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ వంటి ప్రెసిడెంట్ ప్రత్యేక విమానంలో దర్జాగా తిరిగిన కార్టర్ దంపతులు ఇప్పుడు అవసరం పడ్డప్పుడు సాధారణ కమ్మర్షియల్ విమానాల్లో ప్రయాణిస్తుంటారు అంటే ఒక పట్టాన నమ్మలేం.
జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్.
జీవించి వున్న అమెరికన్ అధ్యక్షులు అందరిలోకి పెద్దవాడు. శ్వేత సౌధంలో అధ్యక్షుడిగా వున్నది నాలుగేళ్లయినా దాన్ని వదిలి పెట్టి వెళ్ళే నాటికి సొంత నివాసం అంటూ లేదు. పదవీ విరమణ చేసి వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే బుష్ తాత్కాలికంగా కొంతకాలం తన స్నేహితుడి ఇంట్లో వున్నారు. తరువాత ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు. విచిత్రం ఏమిటంటే ఈ సీనియర్ బుష్ కుమారుడు జార్జ్ బుష్ కూడా తదనంతర కాలంలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఇలా తండ్రీ కొడుకులు అమెరికా అధ్యక్షులు కావడం అన్నది ఇది రెండో సారి. గతంలో జాన్ ఆడమ్స్, ఆయన కుమారుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ కూడా అధ్యక్షులుగా శ్వేత సౌధంలో పనిచేసారు.
ఏళ్ళు మీద పడ్డా సీనియర్ బుష్ మానసికంగా చాలా చురుకు. తన తొంభయ్యవ జన్మదినం నాడు హెలికాప్టర్ లో ఆకాశం లోకి వెళ్లి, అక్కడనుంచి పేరాచ్యూట్ సాయంతో స్కై డైవింగ్ చేశారంటే బుష్ మహాశయుల ధైర్యసాహసాలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు.

Image may contain: 4 people, people smiling, people standing and suit

Photo Courtesy: Image Owner

8, సెప్టెంబర్ 2018, శనివారం

తప్పు చేయనివాడు లేడు, తప్పని చెప్పేవాడు లేడు

పూర్వం రాజులు శత్రురాజ్యంపై దండెత్తాలనుకున్నప్పుడు ముందుగానే చతురంగ
బలాలను సమాయత్తం చేసుకునే వారు. యుద్ధ భేరీ మోగించడానికి మునుపే సమస్త
సంభారాలను సమకూర్చుకునే వారు. కోట ముట్టడికి గురైతే కొన్ని నెలలపాటు
అవసరం అయ్యే నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పెట్టుకునే వారు. ఏదైనా
అనుకోనిది జరిగి రాణీ వాసంతో సహా శత్రువుల చేతికి చిక్కకుండా బయటపడి
ప్రాణాలు దక్కించు కోవడానికి రహస్య సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునే
వారు. యుద్ధ రంగంలో పోరాడే సైనికుల కుటుంబాల ఆలనా పాలనా చూసేవారు.
యుద్ధంలో లభించేది విజయమో, వీర స్వర్గమో అనే ఫలితంతో నిమిత్తం లేకుండా
యుద్ధసన్నద్ధత ప్రదర్శించేవారు. అవసరమైతే మిత్ర రాజ్యాల సాయం
అర్ధించేవారు. విజయ లక్ష్మిని వరించడానికి అవసరం అనుకుంటే కొన్ని కుటిల
ప్రయత్నాలు చేసేవాళ్ళు. శత్రు శిబిరంలో చీలికలు కల్పించడం, వాళ్ళు
ఏమరుపాటున వున్నప్పుడు మెరుపుదాడి చేసి వారిని వధించి సింహాసనం స్వాధీనం
చేసుకోవడం ఇలా సాగేవి వారి ఆలోచనలు.
ఇదంతా పురాతన కాలం నాటి ముచ్చట్లు.
ఇప్పుడు ప్రజాస్వామ్య యుగంలో జరిగే ఎన్నికల సమరాల్లో రాజకీయ పార్టీలు
సయితం అలనాటి రాజులు, చక్రవర్తుల మాదిరిగానే రకరకాల యుద్ధ తంత్రాలను
ప్రయోగిస్తున్నారు. విజయమే ప్రధానం అనుకున్నప్పుడు విలువల విషయం ఎవరికీ
పట్టదు. పదవే ప్రధానం, పవరే ముఖ్యం అనుకునే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ
మాత్రం విలువలు, సిద్ధాంతాలు, సూత్రాలు వల్లె వేసుకుంటూ బతికి బట్టకట్ట
కలుగుతుంది?
అందుకే ఆనాటి యుద్ధతంత్రాలే ఈనాడు రూపం మార్చుకుని, ఎత్తులు, పొత్తులు, జిత్తులుగా రకరకాల అనైతిక రాజకీయ
విన్యాసాలు చేస్తున్నాయి.ఇది తప్పు అని చెప్పగలవాడు లేడు, ఎందుకంటే అందరూ
అదే తప్పు చేస్తున్నారు కనుక.

31, ఆగస్టు 2018, శుక్రవారం

నాన్నకి ప్రేమతో....



క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. కారు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం గురించి చెబుతూ ఆయన వెనక్కి తిరిగి నీళ్ళ బాటిల్ అందుకోబోయే సమయంలో రెప్పపాటులో ప్రమాదం జరిగిందని అంటూ ఆ సీను రిప్లే చేసే ప్రయత్నం చేస్తుంటే ఆపి, ‘అసలు మీ కుటుంబం ఏమిటి, సంపాదన సరిపోతుందా’ అనే ప్రశ్నలు వేస్తూ సంభాషణను జయప్రదంగా దారి మళ్ళించాను. కానీ అతడు చెప్పిన సంగతులు వింటే ఏ తండ్రికి అయినా ఇలాంటి కొడుకు వుంటే బాగుంటుందనిపించింది.
పేద కుటుంబంలో పుట్టాడు. ఒక్కడే కొడుకు. చదువు సరిగా అబ్బక పోవడంతో సంసారం నడపడానికి స్టీరింగ్ చేతబట్టాడు. తండ్రికి వేరే సంపాదన లేదు. టాక్సీ నడిపిన రోజుల్లో బాగానే గిట్టుబాటయ్యేది. ఒక్కోసారి రోజువారీ ఆదాయం వేలల్లో వుండేదిట. సంసారం కాస్త తెరిపిన పడింది. దేశంలో తిరగని ఊళ్ళు లేవు.
రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు. తండ్రికి జబ్బు చేసింది. ఏ క్షణాన ఆసుపత్రికి తీసుకువెళ్ళాలో తెలవదు. దేశం పట్టుకుని తిరుగుతూవుంటే సంపాదన బాగా ఉండొచ్చు కానీ, ఇంట్లో ఏదైనా అవసరం పడితే చప్పున రావడం కష్టం. అందుకని రాబడి తగ్గినా పరవాలేదనుకుని హైదరాబాదులోనే ఉండేలా ట్రావెల్స్ లో చేరాడుట.
‘నాకు మా నాన్న ఆరోగ్యం ముఖ్యం. సంపాదన కానీ, ఏదైనా కానీ దాని తర్వాతే’ అన్నాడు నెమ్మదిగా.
వెనక సీట్లో కూర్చోవడం వల్ల అతడి మొహం నాకూ, నా మొహం అతడికీ కనబడే వీలు లేదు.


కానీ నాకు మల్లేనే అతడి కళ్ళు చెమ్మగిల్లి వుంటాయి.

నిజం లాంటి అబద్ధం – భండారు శ్రీనివాసరావు



‘ఓ నిజం చెప్పనా?’ అంది నిజం.
నిజమే స్వయంగా ఓ నిజం చెబుతున్నప్పుడు దాన్ని నమ్మనివాళ్ళు ఎవరుంటారు.
‘నన్నూ ఓ నిజం చెప్పమంటారా?, నేనూ, నిజమూ మా చిన్నప్పటి నుంచీ దోస్తులం”
అంది పక్కనే వున్న అబద్ధం, అది శుద్ధ అబద్ధమని తెలిసికూడా.
కానీ అబద్ధం చెప్పిన మాట నిజమని నమ్మేసింది, నిజం  అమాయకంగా.
అప్పట్నించి నిజం అబద్ధంతో స్నేహం చేయడం మొదలెట్టింది.
అలా కొన్నాళ్ళు గడిచాయి.
నిజం తనను నిజంగా నమ్ముతోందని ధ్రువపరచుకున్న తర్వాత  అబద్ధం ఓరోజు నిజాన్ని అడిగింది ‘అలా సరదాగా అడవిలో   షికారుకు  వెళ్లివద్దామా’ అని.
సరే అని నిజం అబద్ధం వెంట అడవికి వెళ్ళింది.  చాలా దూరం వెళ్ళిన తర్వాత వారికి ఓ సరస్సు కనిపించింది. అందులోకి దిగితే తిరిగి ప్రాణాలతో బయటకి రాలేరు. ఈ నిజం అబద్ధానికి తెలుసు. అయినా ఆ విషయం నిజానికి చెప్పకుండా దాచింది.
ఇద్దరూ స్నానం చెయ్యడానికి దుస్తులు విప్పి ఒడ్డున పెట్టారు. నిజం ముందుగా నీళ్ళల్లోకి దిగింది.
అబద్ధం తెలివిగా ఒడ్డున వదిలేసిన నిజం దుస్తులు తాను ధరించి సరస్సులోకి దిగకుండా వెనక్కి  వచ్చేసింది. నిజం ఆసరస్సులోనే వుండిపోయింది.
అప్పటినుంచి అబద్ధం తాను  వేసుకున్న నిజం దుస్తులతో తానే నిజాన్నని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఆ విధంగా కొన్నాళ్ళకు  అబద్ధమే నిజంగా చెలామణిలోకి వచ్చింది.
అంటే ఈ రోజు మనకు కనిపించే, వినిపించే నిజం, నిజానికి  నిజం కాదు, అబద్ధం చెప్పే నిజం మాత్రమే.  
(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం )    

25, ఆగస్టు 2018, శనివారం

సరదాకు మాత్రమే! – భండారు శ్రీనివాసరావు


ఒక రకంగా బాగానే వుందనిపించింది
ఈరోజు ఒక టీవీలో చర్చాకార్యక్రమం నిర్వాహకుడు చర్చలో పాల్గొంటున్న ఒకరిని ఇలా సంబోధించారు.
“ఒకప్పటి టీడీపీ నాయకుడిగా, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడిగా ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పండి”
సరదాగా చేసిన ఈ పరిచయ వాక్యం అందర్నీ నవ్వించింది. నిజానికి సీరియస్ చర్చల్లో అప్పుడప్పుడూ ఇలాంటి చమక్కులు అవసరం కూడా.
అయితే, ఇలాటి పరిచయాలు చేయాల్సివస్తే పాల్గొనే వాళ్లకి కొంత ఇబ్బందే. ఉదాహరణకు:


“ఒకప్పుడు మీరు కాంగ్రెస్. తరువాత టీడీపీలో చేరారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజులకే ఎన్నికలు రావడం, మీరు టీఆర్ఎస్ లో చేరడం జరిగిపోయాయి. రాష్ట్రం విడిపోవడంతో వైసీపీలో చేరి గెలిచిన తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు మరో కొత్త పార్టీ జనసేనలోనో, లేదా మరింత తాజాగా పెట్టిన పేరుపెట్టని మరో పార్తీలోనో చేరుతారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ అనుభవ నేపధ్యంలో ఈ అంశంపై మీరు యేమని అనుకుంటున్నారు”

21, ఆగస్టు 2018, మంగళవారం

టీవీ చర్చలు అవగాహన కలిగించేలా వుండాలి – భండారు శ్రీనివాసరావు



రాత్రి ఒక టీవీ అమరావతి బాండ్లు గురించిన చక్కటి అంశాన్ని చర్చకు తీసుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ముగ్గురూ ఘనాపాటీలే. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. ఎవరి వాదాన్ని వాళ్ళు వినిపించడమో, తమకు తెలిసిన దాన్ని వివరించడమో చేస్తే బాగుండేది. ఎంతసేపటికీ ఎదుటివాళ్ళ వాదాన్ని పూర్వపక్షం చేయడానికే సమయాన్ని వినియోగించుకున్నట్టు అనిపించింది. టీవీలు చూసేవారిలో ఆయా పార్టీల అభిమానులకు వారి భాషణలు ఆనందం కలిగించి ఉండవచ్చు. కానీ విషయం పట్ల అవగాహన పెంచుకోవడానికి కొంతమందయినా టీవీ చర్చలు చూస్తారు. వారికి మాత్రం నిరాశ మిగిలిందనే చెప్పాలి. చర్చకు ముందు మనసులో మెదిలిన సందేహాలు మరిన్ని పెరిగాయి కానీ నివృత్తి కాలేదని గట్టిగా చెప్పొచ్చు.