9, మే 2017, మంగళవారం

ఆయన రేడియో ప్రయోక్తా! రచయితా!


రెండూను అంటున్నారు ఎమెస్కో వారు. అనడమే కాదు, డి. వెంకట్రామయ్య రాసిన రెండు పుస్తకాలను ఒకేసారి ప్రచురించారు. ఇది ఎప్పుడో జరగాల్సిన పని అనేది రొటీన్ కామెంటు. ఇప్పటికయినా చేసారు, ఆయన అభిమానులకి అదే సంతోషం.



'ఆయన వార్తలు చదువుతుంటే వార్తలు చదువుతున్నట్టు అనిపించేది కాదు. చక్కగా చెబుతున్నట్టు వుండేది. నిజంగా రేడియో వార్తలు చదవడం అంటే  ఏమిటో వెంకట్రామయ్య వార్తలు వింటే తెలుస్తుంది' అనేవారు ప్రసిద్ధ జర్నలిస్ట్ జీ.కృష్ణ గారు. ఆయన అన్నారంటే అది ఆస్కార్ అవార్డ్ తో సమానం. ఎందుకంటే కృష్ణ గారు అల్లాటప్పాగా  రాయరు, మాట్లాడరు.



వెంకట్రామయ్యకి ఇలాటి నమ్మకాలు లేవుకాని, శాపవశాన గంధర్వుడు మానవ జన్మ ఎత్తినట్టు, ఆయన రేడియోలో చేరి ఉద్యోగం చెయ్యడం  ఆకాశవాణికి ఉపయోగం అయ్యింది కానీ,  ఆ ఉద్యోగం చేయడం వల్ల ఆయన నష్టపోయారు. ఇంకా చెప్పాలంటే వెంకట్రామయ్య అనే సృజనాత్మక వ్యక్తి  రేడియో న్యూస్ రీడర్ గా సుదీర్ఘకాలం పనిచేయడంవల్ల ఆంధ్రదేశం చక్కని రచయితను కోల్పోయింది. ఇది నా నమ్మకం.
ఒక రచన చేసినా, ఒక వార్త  తర్జూమా చేసినా, లేక  రేడియోలో  చదివినా, ఏం చేసినా సరే మనసుపెట్టి చేసేవారు. అందుకే ఆ రచనలో,  ఆ వార్తలో, దానిని చదవడంలో  జీవం తొణికిసలాడేది. ఆయనతో పాటు దశాబ్దాలపాటు పనిచేసిన రేడియో ఉద్యోగిగా ఈ విషయం బల్ల గుద్ది చెప్పగలను.
రాయని రచయిత, లేదా రాసి మానేసిన రచయిత అని పేరుపడ్డ  వెంకట్రామయ్య చేత మళ్ళీ రాయించాలన్నది నా చిరకాల వాంఛ.  దాన్ని మన్నించి కొన్ని రాశారు కానీ ఇంకా ఇంకా రాయాలనే కోరిక మాత్రం తీరలేదు. అలాఅని, నా ఆశా చావలేదు. చూద్దాం!  ఆయన రాయకపోతారా! నేను చదవక పోతానా?
కానీ, కార్మికుల కార్యక్రమం 'రాంబాబు'  అంత తేలిగ్గా వినే రకం కాదు. అదేకదా! బాధ.
మొత్తానికి ఈ గోడు ఎమెస్కో వారి చెవిన పడినట్టుంది. అందుకే ఆయనవి రెండు పుస్తకాలు ఏకకాలలో అందంగా అచ్చొత్తించి అభిమానుల కోరిక తీర్చారు. నిన్ననే నాకూ, జ్వాలాకు ఆయన  ఈ పుస్తకాలు అందచేశారు. ఈ ఏడాదిలో నాకందిన గొప్ప కానుక.
(ప్రచురణ: ఎమెస్కో PRICE: Rs.175 each)
తోకటపా: రేడియో అనుభవాల గురించి రాసిన మూడువందల పేజీల్లో, పది పేజీలతో కూడిన ఒక అధ్యాయాన్నే నాకోసం, నా పేరుమీద కేటాయించిన వెంకట్రామయ్య గారికి స్నేహపూర్వక కృతజ్ఞతలు – భండారు శ్రీనివాసరావు


అభిమాన ధనం అంటే ఇదీ బాబుగారూ!

“సింగరాయకొండ కొండ నుంచి నరసింహారావుని మాట్లాడుతున్నాను”
“చెప్పండి”
“ఫిబ్రవరిలో చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికల్లో మీరు రాసిన వ్యాసాలు చదివాను. వాళ్ళు మీ ఫోను నెంబర్లు ఇవ్వడం వల్ల అప్పుడే ఒకసారి మీతో మాట్లాడాను”
“............”
“నాకు ఆ వ్యాసాలు బాగా నచ్చాయి. నేను టీడీపీ అభిమానిని. అందువల్లనే అవి నచ్చాయని అనుకోవద్దు. మీరు చంద్రబాబులో అప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులు గురించి సుతిమెత్తగా చెప్పారు. అది నాకు నచ్చింది. అందుకే నేను మీకు ఒక చిన్న కానుక పంపాలని అనుకుంటున్నాను”
ఆశ్చర్యం వేసింది. వ్యాసాలు ప్రచురించిన పత్రికల వాళ్ళే పారితోషికం ఊసెత్తలేదు. అందుకోసం నేనవి రాయలేదు. కానీ ఈ పెద్దమనిషి కానుక పంపుతాను అంటున్నాడు. అందుకే ఆశ్చర్యం.
“ఇన్ని రోజులు గడిచాక ఎందుకిలా అనుకుంటారేమో. మా తోటలో మామిడి కాయలు కాపుకు వచ్చాయి. అవి రాగానే మీకు పంపాలని అప్పుడే అనుకున్నాను. ఏమీ అనుకోకపోతే మీ అడ్రసు చెబుతారా? పార్సెల్లో వేస్తాను”
“మీ అభిమానానికి ధన్యవాదాలు. మా ఇంట్లో మామిడి పండ్లు తినేవాళ్ళు లేరు. మా ఆవిడకు సుగరు. ఇక నేను తినగా పంచి పెట్టేటన్ని పళ్ళు మీలాంటి మిత్రులు పంపారు. కాబట్టి ఓ పనిచేయండి. శ్రమ తీసుకుని అంత దూరం నుంచి పార్సె ళ్ళు పంపకండి. వాటిని అవసరం అయిన వాళ్లకి ఇచ్చి నన్ను ధన్యుడ్ని చేయండి”
“..........”

“మరో మాట! నిజానికి ఆయనకి (చంద్రబాబు) ఇంతకంటే (మీ వంటివారి అభిమానం) మించిన పుట్టిన రోజు కానుక వుండదు”       

8, మే 2017, సోమవారం

స్లో పాయిజనింగ్

“ఆటో కంటే చౌక తెలుసా? ఒక్కోసారి ఫ్రీ రైడ్. దిగిన తరవాత ఏమీ ఇవ్వక్కర లేదన్నాడు డ్రైవర్. ఇంటి దగ్గరకే వచ్చి ఎక్కించుకుంటారు, దింపమన్న చోట దింపేస్తారు, యెంత హాయిగా వుందో ఇప్పుడు. ఈ ఊబెర్లు, ఓలాలు అన్ని ఊళ్ళల్లో పెడితే యెంత బాగుంటుందో!” ఇలా సాగుతున్నాయి నగర మధ్యతరగతి పౌరుల ఆలోచనలు. నేనూ వీరిలో ఒకడినే.
కానీ, వ్యాపారి అనేవాడు ఏ లాభం లేకుండా వరదన పడిపోడని సామెత. మాల్స్ సంస్కృతి ప్రబలిన తర్వాత చిన్న చిన్న దుకాణాలకు ఊపిరి అందడం లేదు. అమెరికా లాంటి దేశాల్లో చిల్లర వ్యాపారాలు ఎప్పుడో హరీ అన్నాయి. అలాగే ఇవీ. ముందు చౌక ధరలతో ఆకర్షించి అలవాటు పడేలా  చేస్తారు. మరో దారి లేకుండా చేసిన తరువాత వారేం చెబితే అదే మాట చెల్లుబడి అవుతుంది. అప్పుడు రేట్లు పెంచినా అడిగేవాడు వుండడు. ప్రత్యామ్నాయం లేకుండా పొతే అడగడానికి నోరు పెగలదు.
ఈరోజు బయటకు వెళ్ళడానికి ఊబెర్ బుక్ చేద్దామని అనుకున్నాను. “ఈరోజు రేట్లు పెరిగాయి, సహకరించండి” అని ఓ చిన్ని హెచ్చరిక.
ఊబెర్, ఓలాలు వచ్చిన కొత్తల్లో రేట్లతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయితే ఒక్కసారిగా పెద్దగా పెంచరు. కార్పొరేట్ కల్చర్ కదా! వారి పద్దతులు వారివి.

ఎవరో చెప్పగా విన్నాను. ‘స్లో పాయిజనింగ్’ అంటే ఇష్టమని.       

ప్రెస్ మాన్ వేణుగోపాల్

వేణుగోపాల్. తెలుగు తెలియని వేణుగోపాల్. హైదారాబాదు ఎప్పుడు వచ్చినా కలిసేవాడు. ఎం.ఎస్. శంకర్ కి ఆత్మీయ మిత్రుడు. ప్రెస్ మాన్ ప్రకటన సంస్థలో, తరువాత బిర్లా సంస్థలో చాలాకాలం పనిచేసాడు. నేనూ, జ్వాలా, శంకర్ మూడేళ్ళ క్రితం చెన్నై వెళ్లి నప్పుడు కూడా మాతో గడిపాడు. నిగర్వి. స్నేహశీలి.
ఈ నెల ఇరవై నాలుగో తేదీన శంకర్ తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాడు. స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో చెన్నై మీదుగా వేణుగోపాల్  ని చూసి రావాలని శంకర్ ఆలోచన. ఈ సంగతి చెబుదామని ఈ ఉదయం వేణుగోపాల్  కి ఫోను చేశాడు. అయన భార్య ఫోను ఎత్తింది. పరిచయం వుంది కాబట్టి శంకర్ గబగబా తాను పలానా రోజు  చెన్నై వస్తున్నానని, వేరే పనులు ఏవీ పెట్టుకోవద్దని. అంతా చెప్పేసిన తరువాత అవతల నుంచి వినబడింది సన్నగా ఆవిడ ఏడుపు. ఏడుస్తూనే  చెప్పింది, వేణుగోపాల్ ఇక లేరని, ఈ తెల్లవారుజామునే  చనిపోయాడని.
శంకర్ ఒక్క మాటుగా షాక్ తిన్నాడు, తేరుకున్న తరువాత నాతొ పంచుకున్నాడు.

నిన్న వుండి ఈరోజు వుండడం జీవితం అయితే, క్షణం క్రితం వుండి మరుక్షణం లేకపోవడమే మరణం.           

మహానుభావుడితో మూడు నిమిషాలు


సన్మాన కార్యక్రమం మొదలు కావడానికి కొద్ది వ్యవధానం ఉండడంతో విశ్వనాథ్ గారితో కాసేపు ముచ్చటించే సావధానం దొరికింది.
నా రష్యా అనుభవం చెప్పాను. మాస్కోలో శంకరాభరణం సినిమా చూసిన వివరాలు చెప్పాను. చూసిన వెంటనే సంతోషం పట్టలేక మద్రాసు ఫోను చేసి జంధ్యాలను అభినందించిన సంగతి వివరించాను.
ఆయన తన సుదీర్ఘ జీవితంలో ఇటువంటి కబుర్లు ఎన్నో వినివుంటారు. నేను చెప్పింది కూడా నిర్వికారంగా విన్నారు.  మలయాళంలో ఆ సినిమా డబ్ చేసిన సంగతి గుర్తుచేసుకున్నారు.  


ఈ ఫోటో తీసిన కుర్రాడు వయసులో చాల చిన్నవాడు. వచ్చి విశ్వనాధ్ గారి కాళ్ళకు నమస్కరించి దీవించమని కోరాడు. తాను ఎడిటింగ్ ఫీల్డ్ లో వున్నానని, డైరెక్టర్  గా  పైకి రావాలని అనుకుంటున్నానని చెబుతూ, ఆయన  ఆశీర్వాదం కోరుతూ మళ్ళీ  పాదాభివందనం చేయబోయాడు. తల మీద చేయి వేస్తేనే దీవించినట్టుకాదని, మనస్సులోనే  దీవించానని కళాతపస్వి బదులిచ్చారు. ఇది చూస్తుంటే నాకు స్వాతి ముత్యం సినిమాలో ఏదో చిన్న ఉద్యోగం కోరుతూ  కమల్ హసన్ చేసిన  పాత్ర,, ఆ సన్నివేశం గుర్తుకువచ్చాయి.   


7, మే 2017, ఆదివారం

సినిమాహాలు కాదది, దేవాలయం

‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్ట్రోక్ తగిలింది నాకు, సన్ స్ట్రోక్ లాగా.’ అన్నారు డైరెక్టర్ కే. విశ్వనాథ్, నేను సభ్యుడిగా ఉన్న వయోధిక పాత్రికేయ సంఘం వారు ఆయనకీ రోజు (07-05-2017) ఫిలిం ఛాంబర్ లో చేసిన సన్మాన సభలో మాట్లాడుతూ. నిజానికి ఈ కార్యక్రమంలో అత్యంత క్లుప్తంగా ప్రసంగించింది కూడా విశ్వనాద్ మాత్రమే. వరస సన్మాన పరంపరలతో, టీవీ ఇంటర్యూలతో తీరికలేని ఇటీవలి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలివి. నిజంగానే ఆయనలో ఆ అలసట కానవచ్చింది.
శంకరాభరణం గురించి కూడా చెప్పారు.
“ఎవరో ఒకతను తాను ఆ సినిమా డజను సార్లు చూశానని అన్నాడు. అన్ని సార్లు చూడడానికి అందులో ఏముందని అడిగాను. ఏమోసారూ, ఆ సినిమాహాల్లో కూర్చుంటే దేవుడి గుడిలో వున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడా కుర్రాడు. జన్మ ధన్యం అవడం  అంటే ఇదే కాబోలు”

చాలామంది చాలా మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య, సినిమాహాలుకు వెళ్లి సినిమా చూడక దశాబ్దాలు గడిచాయని, విశ్వనాద్ సినిమా మాత్రం తప్పకుండా చూసేవాడినని చెప్పారు. 


(శ్రీ విశ్వనాద్ తో)
  

      

5, మే 2017, శుక్రవారం

జాతి తీర్పును సమర్ధించిన సుప్రీం

(PUBLISHED IN EDIT PAGE OF ANDHRA PRABHA DAILY ON 06-05-2017)

ఒక యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో న్యాయస్థానంలో  విచారణ మొదలు కాకుండానే, ముద్దాయిలకి ఉరిశిక్ష వేయాలంటూ జాతి యావత్తు  ముక్తకంఠంతో తీర్మానించడం స్వతంత్ర భారతంలో నిజంగా ఒక అరుదయిన విషయమే. ఆ ఘోరకలికి పాల్పడినవారికి మరణదండన ఒక్కటే సరయిన శిక్ష అని ప్రజానీకమే తీర్పు ఇవ్వడం, ‘అత్యంత అరుదయిన కేసు’ అనే పేరుని కట్టబెట్టింది. ముద్దాయిల కిరాతక చర్య పట్ల ప్రజలు ఎంతగా చలించి పోయారనడానికి ఇదొక దృష్టాంతం. ఈ సంఘటన జరిగి అయిదేళ్ళయింది. 2012 డిసెంబరు 16  తేదీ రాత్రి భారత  రాజధాని ఢిల్లీలో జరిగిన పాశవిక కాండ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది. ఈ కేసుపై  వివిధ కోర్టుల్లో సుదీర్ఘ విచారణ సాగిన  అనంతరం ఢిల్లీ హైకోర్టు ముద్దాయిలకు విధించిన ఉరిశిక్షను సుప్రీం కోర్టు నిన్న  ఖరారు చేయడంతో, గతంలో  జాతి ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించినట్టయింది.  
మనుషులు నరరూప రాక్షసులుగా ఎలా మారతారో, ఆ మారిన స్ధితిలో వాళ్ళు ఎంతటి ఘోరాలకు పాల్పడుతారో సకల దేశవాసులకు తెలిసివచ్చింది కూడా ఈ కేసు వివరాలు వెలువడిన తరువాతే.
ఈ సంఘటనలో మానాన్నీ, ప్రాణాన్నీ పోగొట్టుకున్న  యువతికి ఏమి న్యాయం జరిగిందో తెలియదు కానీ దేశంలోని ఆడపడుచులందరికీ ఊరట కలిగించే ఒక శాసనంమాత్రం  ఊపిరి పోసుకుంది.  నాకు తెలిసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత, ప్రజల ఒత్తిడి ఫలితంగా ఒక చట్టం రూపొందిన సందర్భం కూడా దే.  చట్టమే ‘నిర్భయ’.
ఆరుగురు కామాంధుల చేతికి చిక్కిన ఒక యువతి ఎటువంటి దుర్భర, దుస్సహ, శారీరక, మానసిక వేదనలకు గురైందన్న విషయం లోకానికి తెలిసివచ్చిన పదమూడు రోజుల తరువాత ఆ అనామికను మెరుగయిన చికిత్స కోసం సింగపూరు తరలించారు. అక్కడే  చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ సంఘటన  పట్ల సభ్య సమాజం స్పందించిన తీరు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితిని సైతం కదిలించింది. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే. ఎస్. వర్మ నేతృత్వంలో త్రిసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన పరిశీలనకు వచ్చిన ఎనభయ్ వేలకు పైగా సలహాలు, సూచనలను పరిశీలించి నెలరోజులలోపునే  సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.   మహిళల పట్ల లైంగిక పరమైన నేరాలు పెరిగిపోవడానికి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థల వైఫల్యంగా సంఘ సభ్యులు అభిప్రాయపడ్డారు.  కమిటీ నివేదికలో సుమారు తొంభయ్  శాతం సిఫారసులను గుదిగుచ్చి రూపొందించిన ఆర్దినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, తదుపరి అది శాసనంగా చట్టసభల ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆర్డినెన్స్ బిల్లు రూపం ధరించి, 2013 మార్చి 19 తేదీన   లోకసభ ఆమోదం పొందేనాటికే అందులో పొందుపరచిన అనేక అంశాలు పలు మార్పులకు గురయ్యాయి. నిర్భయ చట్టంతో ఇటువంటి హేయమైన సంఘటనలు పునరావృతం కావని ఆశించడం  వృధా అని ఈ అయిదేళ్ళ కాలంలో చోటుచేసుకుంటున్న అదే విధమైన పలు సంఘటనలు నిరూపించాయి. ఒక్క ఢిల్లీ కేసులో మినహా మరే సందర్భంలో కూడా కఠిన శిక్షలు పడిన  దాఖలా లేదు. ఢిల్లీ కేసు కూడా విచారణలు త్వరగా పూర్తయి, దోషులకు వెంటనే శిక్షలు పడతాయనే ఆశలపై నీళ్ళు చల్లింది. అలా అని ఈ నిర్భయ చట్టం వల్ల ఎలాటి ఉపయోగం లేదని కాదు. లైంగిక అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు చట్టాలను లెక్కపెట్టే స్థితిలో వుండకపోవచ్చు కానీ, అత్యాచార బాధితులకు మాత్రం ఈ చట్టం కొంత ఊరట కలిగిస్తోంది. తమ మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందన్న భరోసా ఆ  అబలలకు  ఒకింత ఉపశమనాన్ని ఇస్తోంది. అన్నింటికీ మించి ప్రజల ఆకాంక్షల మేరకు ఒక శాసనం రూపొందడం అనేది ప్రజాస్వామ్యం సాధించిన  ఒక విజయం. అంతే కాకుండా, లైంగిక అత్యాచార బాధితులు సమాజం  దృష్టిలో మరిన్ని అవహేళనలకు గురికాకుండా అటువంటి వారిని అసలు పేర్లతో కాకుండా నిర్భయగా పిలవాలనే ఒక సంప్రదాయం అమల్లోకి వచ్చింది.
ఢిల్లీ నిర్భయకేసులో ఆరుగురు ముద్దాయిల్లో నలుగురికి (ఒక ముద్దాయి విచారణ జరుగుతూ వున్న  సమయంలోనే  జైల్లో  ఉరివేసుకుని చనిపోయాడు) ప్రత్యేక  న్యాయస్థానం మరణశిక్ష  విధించింది.  ఆరో  ముద్దాయి మైనర్’ (అల్ప వయస్కుడు) అన్న కారణంతో అతడ్ని మూడేళ్ళు జువనైల్ హోంలో ఉంచారు. ఈ శిక్షాకాలం పూర్తయి అతడు విడుదల అయ్యాడు కూడా. మైనర్ అనే ఒకే ఒక కారణంతో నేరశిక్షాస్మృతి ప్రకారం అతడికి మిగిలిన నేరస్తులతో పాటు శిక్ష వేయకుండా మూడేళ్ళ శిక్షతో సరిపుచ్చాల్సి వచ్చింది. అయితే ఇటువంటి నేర మనస్త్వత్వం కలిగిన వారిని, చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకుని విడుదల చేస్తే మరింత ప్రమాదకర పరిణామాలు  సంభవించే అవకాశం వుందని కొందరు సందేహాలు  వ్యక్తం చేశారు కూడా. విచారణా కాలంలో జైల్లో ఒక విదేశీ వార్తా సంస్థకు ముద్దాయిల్లో ఒకరు ఇచ్చిన ఇంటర్వ్యూ  ని బట్టి ఆ సందేహాలు నిజమయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది. ఆ యువతి బలాత్కారానికి సహకరించి వుంటే ఇంతటి విషమ పరిస్తితి ఆమెకు ఎదురయ్యేది కాదనిఅతడు చెప్పిన తీరు కరడు గట్టిన నేర ప్రవృత్తికి నిలువెత్తు సాక్ష్యం.
మూడేళ్ళ అనంతరం అల్పవయస్కుడి’   విడుదలను అడ్డుకుంటూ సుబ్రమణ్య స్వామి కోర్టుకు ఎక్కారు, కానీ న్యాయస్థానం ఆ అభ్యర్ధనను తిరస్కరించింది.
పిన్న వయస్కుడు అనే కారణంతో శిక్ష తప్పించుకుని దర్జాగా సమాజంలోకి తిరిగి అడుగుపెట్టిన అతగాడు చేసిన నేరం చిన్నదేమీ కాదు. ఆనాటి   సామూహిక మానభంగ పర్వంలో అతడూ ఒక భాగస్వామి. పైపెచ్చు,  నిస్సహాయ స్తితిలో వున్న ఆ  అభాగ్యురాలిని ఒక ఇనుప రాడుతో అతి క్రూరంగా, అత్యంత రాక్షసంగా హింసించిన పాపం అతడి ఖాతాలో వుంది. అయినా,  ‘అల్పవయస్కుడుఅనే కారణంతో చేసిన నేరానికి శిక్ష పడకుండా బయటపడగలిగాడు.
కోర్టు నిర్ణయం నిర్భయ  తలితండ్రులను నిరాశ పరచింది. నేరం జయించిందని, తామే పరాజితులమనిఆమె తల్లి ఆశాదేవి ఆవేదన వెలిబుచ్చారు. ఆమె బాధ సమంజసం  అనిపిస్తోంది. ( హతురాలి పేరు జ్యోతిసింగ్ అని ఆమె తల్లి ఆశాదేవే స్వయంగా వెల్లడించేవరకు ఎవరికీ ఆమె అసలు పేరు తెలవదు, మీడియాలో కూడా నిర్భయ అనే పేరే ప్రాచుర్యం పొందింది) మూడేళ్ళ జువెనైల్ హోం శిక్ష పూర్తిచేసుకున్న  ఆ బాల హంతకుడికి కొత్త జీవితం ప్రసాదించే పేరుతొ,  టైలరింగ్ షాపు పెట్టుకోవడానికి ఆర్ధిక సాయం అందించారు. ఆ షాపుకు  అవసరం అయ్యే  స్థలాన్ని కూడా అధికారులే సమకూర్చారు. అతడి పాత పేరును మార్చి కొత్త పేరు తగిలించారు. అతడు పాత జీవితం మరిచిపోయి కొత్త జీవితంలో స్థిర పడడానికి ఈ ఏర్పాటు. ఇదంతా వినడానికి బాగానే వుంది. పేర్లు మార్చినట్టు నేరస్తులను పూర్తిగా సంస్కరించగలిగితే అంతకంటే కోరుకునేది ఏమీ వుండదు. మనిషి వేష భాషలను మార్చినంత సులభంగా అతడి మనస్త్వత్వాన్ని మార్చడం అంత తేలికా అన్నదే ప్రశ్న. జైలు  ఇంటర్వ్యూలో ఒక ముద్దాయి చెప్పిన అభిప్రాయమే దీనికి సరయిన సమాధానం. ధర్మం ప్రకారం ఆ అల్ప వయస్కుడుకూడా మిగిలిన వారితో పాటు శిక్షార్హుడే. కానీ చట్టం చెప్పే న్యాయం వేరుగా వుంటుంది.    
కోర్టుల్లో న్యాయం  చట్టాన్ని బట్టి వుంటుంది. చట్టం మారితే దానికి తగ్గట్టుగా న్యాయం, దానికి తగ్గట్టుగా శిక్షలు  మారిపోతూ వుంటాయి. ధర్మం అనేది మారుతున్న కాలంతో ప్రమేయం లేకుండా స్థిరంగా మార్పు లేకుండా వుంటుంది.
అల్ప వయస్కులు నేర పూరిత మనస్త్వత్వం కలిగివుండరన్న అభిప్రాయం ఒకప్పుడు సరికావచ్చు. కానీ వారి మనస్సులను కలుషితం చేసే అనేక అవకాశాలు  చిన్న వయస్సునుంచే ప్రస్తుతం  అందుబాటులో ఉంటున్నాయి. గుప్పెట మూసివుంచాల్సిన అనేక సెక్స్ పరమైన సంగతులు, వారి గుప్పెట్లో ఉంటున్న సెల్ ఫోన్ల పుణ్యమా అని చిన్నతనం నుంచే వారికి కరతలామలకం. ఈ వెసులుబాట్లతో వారు పెడమార్గం పడుతున్నారన్న వాస్తవాలను మరిచిపోరాదు. అల్పవయస్కులు అయినంత మాత్రాన వారు ఇటువంటి హీనమైన లైంగిక కార్యకలాపాలకు పనికిరారు అని నిర్ధారణకు రావడానికి వీల్లేదు  అనడానికి  ఈ కేసులో శిక్ష తప్పించుకుంటున్న ఈ బాల నేరస్తుడే సాక్షి. 
తక్కువ వయస్సు కారణంగా శిక్షలు తప్పించుకునే పరిస్తితి ముందు ముందు కూడా కొనసాగితే అందువల్ల మరికొన్ని విషమ పరిణామాలు కూడా చోటుచేసుకునే ప్రమాదం పొంచి వుంటుంది. పిల్లల్ని చేరదీసి,  చిన్నతనం నుంచే ఉగ్రవాద శిక్షణ ఇచ్చే విదేశీ  సంస్థలు,  తప్పుడు సర్టిఫికేట్లతో వయస్సు తక్కువగా చూపించి, వారిచేత ఉగ్రవాద చర్యలు జరిపించే అవకాశాన్ని కూడా కొట్టివేయలేము. అటువంటి వారు ఒకవేళ పట్టు పడినా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని, అనతి కాలంలోనే బయటపడి తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగించే వీలుంటుంది.

వీటన్నిటినీ  దృష్టిలో  ఉంచుకుని ఆలోచిస్తే,   ప్రస్తుతం వున్న చట్టాలను తగువిధంగా సవరించుకోవాల్సిన అవసరాన్ని ఈ అల్పవయస్కుడివిడుదల వ్యవహారం  గుర్తు చేస్తోంది. (EOM)