28, నవంబర్ 2016, సోమవారం
అర్ధం చేసుకోరూ......
ఏకాంబరం, లంబోదరం మాట్లాడుకుంటున్నారు.
వీళ్లిద్దరిదీ రైలు పట్టాల సంభాషణ. సమాంతరంగా పోతుంటాయి కానీ ఎన్నటికీ కలవ్వు.
ఏకాంబరం: డాక్టరు రోగికి ఆపరేషన్
చేస్తున్నాడు. నొప్పి తెలియకుండా మత్తు మందు ఇచ్చాడు. రోగి స్పృహలోకి రావడానికి
కొంత నిర్దిష్ట వ్యవధి వుంటుంది. అతడికి మెలకువ వచ్చేవరకు రోగి బంధువులు గాభరా
పడుతుంటారు కానీ, విషయం తెలిసిన వైద్యుడు ఏమాత్రం కంగారు పడడు. అంతా అర్ధం
చేసుకోవడంలో వుంది.
లంబోదరం: నిజమే. మత్తు మందు ఇచ్చి
ఆపరేషన్ చేశాడు. డోసు సరిగా కుదరాలి. లేకపోతే, ఆపరేషన్ సక్సెస్ అయినా రోగి
ఆమత్తునుంచి తేరుకోకుండానే కన్ను మూస్తాడు. అలా జరుగుతుందనే ఈ కంగారు. అర్ధం
చేసుకోమనే నేను చెప్పేది.
27, నవంబర్ 2016, ఆదివారం
పబ్లిక్ పల్స్
“ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు
ఎన్నికలు జరిగితే ఏమవుతుంది? జనం ఏమనుకుంటున్నారు? మళ్ళీ చంద్రబాబే
కావాలనుకుంటున్నారా? జగన్ రావాలనుకుంటున్నారా? చంద్ర బాబు పధకం పారుతోందా?” అనే పలు
ప్రశ్నలకు తాము జరిపిన సర్వేలో వెల్లడయిన సమాధానాలను రేపటి నుంచి అందించబోతున్నట్టు ఒక పత్రిక నేడు
ప్రకటించింది.
‘ఆ పత్రిక పాలసీ
తెలిసినదే కాబట్టి జవాబులు ఎలా వుండబోతున్నాయో తెలుసుకోవడానికి రేపటివరకు ఆగక్కరలేద’ని
వాట్స్ ఆప్ లో ఒక అభిప్రాయం చక్కర్లు కొడుతోంది. మరో పత్రిక ఇదే రకమైన సర్వే చేస్తే
పబ్లిక్ పల్స్ మరో రకంగా వుంటుందని
ముక్తాయింపు ఇచ్చారు కూడా!
సర్వేల మీద జనం నమ్మకం తగ్గిపోతోందా! పత్రికల
మీద విశ్వాసం సడలిపోతోందా!!
ఇది తెలుసుకోవడానికి ఇంకో సర్వే అవసరమవుతుందేమో!
సర్వే జనా సుఖినోభవంతు
సర్వే జనా సుఖినోభవంతు
26, నవంబర్ 2016, శనివారం
నాణేనికి అటూ ఇటూ
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 27-11-2016, SUNDAY)
పూర్వం పల్లెటూళ్ళలో దుకాణాల ముందు “నగదు నేడు, అరువు రేపు” అనే బోర్డులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా తలెత్తిన కరెన్సీ కటకటల కారణంగా దాన్ని కొద్దిగా మార్చి, “అరువు నేడు, నగదు రేపు” అని బోర్డులు పెట్టాల్సి వస్తుందేమోననే ఓ చమత్కారం సాంఘిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. కాస్త ఉత్ప్రేక్షాలంకారం పాలు ఎక్కువై వ్యాఖ్యలో ఘాటు పెరిగినట్టు అనిపించినా ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు.
నూట పాతిక కోట్ల జనాభాలో అత్యధికులు
పేదవారు అవడం మూలాన దేశంలో డబ్బు అవసరం
కలిగిన వారి సంఖ్య ఎక్కువగా వుండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అవసరం వేరు, కటకటపడడం
వేరు అని గత రెండువారాల పైచిలుకు అనుభవం
తెలుపుతోంది. బ్యాంకుల్లో దాచుకున్న తమ డబ్బును తీసుకోవడానికి గంటల గంటల పాటు
క్యూలల్లో నిలబడి యాభయ్ మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ప్రస్తుత పరిస్తితిలోని తీవ్రతను వెల్లడిస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు
ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కదా, అవి అలానే వ్యవహరిస్తాయి, అది సహజం కూడా.
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఈ
విషయంపై విరామం లేకుండా జరుగుతున్నచర్చోపచర్చల్లో
ఒక విషయం మాత్రం తెలిసొచ్చింది, అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదని.
ఎనిమిదో తేదీ మంగళవారం రాత్రి ప్రధాని
మోడీ ప్రసంగం తయారు చేసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. (
అసలా నిర్ణయం ప్రధాని కాకుండా రిజర్వ్ బ్యాంక్
అధికార ప్రతినిధిచేత ప్రకటించి
వుంటే మరింత బాగుండేది, అలా చేస్తే దీనికి
రాజకీయ రంగు అంటివుండేది కాదన్నది ఒక వాదన. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్
కూడా నోట్ల రద్దు ప్రకటన బాధ్యతను అధికారులకే ఒదిలి వేసిన విషయాన్ని ఈ ‘వాదకులు’ గుర్తు చేస్తున్నారు)
సరే! ప్రకటన ప్రధానమంత్రి మోడీ స్వయంగా
చేశారు. అందులో కొంపలు మునిగేది ఏమీ వుండదు.
కాకపొతే దాన్ని ఆయన తన తరహాలో కాకుండా ఒక
అధికారిక ప్రకటన మాదిరిగా రాసుకొచ్చి చదివి వుంటే బాగుండేదన్న అభిప్రాయం
వుంది. అలానే ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం మాదిరిగా కాకుండా క్లుప్తంగా కొన్ని విషయాలను మాత్రమే
ప్రస్తావించి వుండాల్సింది. నల్ల కుబేరులపై యుద్ధ ప్రకటనకు మరో అవకాశం
వినియోగించుకుని వుండాల్సింది. తన ప్రసంగంలో ప్రధాని మోడీ “ఉగ్రవాదుల చేతుల్లో భారత కరెన్సీ” అనే మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. అందువల్ల దేశ భద్రతకు యేర్పడ
బోతున్న ముప్పు, వీటి కారణంగా ఈ హఠాత్
నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెప్పిన
ప్రధాని ఆ అంశానికే ఎక్కువ ప్రాధాన్యత
ఇచ్చి వుంటే, యావత్ దేశ ప్రజల దృష్టి అటు
మళ్ళివుండేది. (నల్ల కుబేరులపై యుద్ధం అంటూ ఓ పక్క చెబుతూ ఆ నోటితోనే రెండువేల కొత్త నోటు తెస్తున్నట్టు చెప్పేసరికి అసలు విషయం జావకారి పోయింది, లేనిపోని అనుమానాలకు ఆస్కారం
ఇచ్చినట్టయింది.)
ప్రధాని తన ప్రసంగాన్ని క్లుప్తంగా
ముగించి, గత పన్నెండు రోజులుగా తీసుకుంటున్న అనేకానేక ఉపశమన చర్యలు గురించి ఆ రోజే
ప్రస్తావించి వుంటే సామాన్య ప్రజల మనస్సుల్లో ఇంత గందరగోళం ఏర్పడి వుండేది కాదు.
ప్రకటన దరిమిలా మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం
కొత్త నిర్ణయాలు ప్రకటిస్తూ, సవరిస్తూ పోవడం
గమనించిన వారికి ప్రభుత్వం చేసిన తప్పులు
(పొరబాట్లు అనాలేమో) దిద్దుకుంటూ పోతోందన్న అభిప్రాయం కలిగింది. సరయిన విధంగా
ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయిందన్న ఆరోపణలకు ఆస్కారం
వుండేది కాదు. నిర్ణయాన్ని సమర్ధించిన
వారే అమల్లో లోపాల గురించి ఇంతగా
మాట్లాడాల్సిన అవసరమూ వచ్చేది కాదు. చర్చలు ఇంత సుదీర్ఘంగా జరిగేవీ కావు, ఇంత రచ్చ
జరిగేదీ కాదు.
సరే! జరగాల్సింది జరిగిపోయింది. నిర్ణయం వెనక్కి తీసుకునే వీలులేదు. తడబడ్డ కాలునే కూడదీసుకోవాలి. పైపంచ గాలికి యెగిరి
ముళ్ళకంచెపై పడినప్పుడు అది చిరిగిపోకుండా జాగ్రత్తగా బయటకి తీయాలి. దీనికి చాలా
సంయమనం కావాలి. మనసు నిగ్రహంగా వుంచుకోవాలి. రాజకీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కునే
క్రమంలో, ఆవేశకావేశాలతో తీసుకునే నిర్ణయాలు, వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీస్తాయి. ఇది మోడీ
అభిమానులకీ, దురభిమానులకీ, వ్యతిరేకులకీ కూడా వర్తిస్తుంది.
ఈ నిర్ణయంలో నిజంగా ఎటువంటి రాజకీయ
ఉద్దేశ్యాలు లేకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం కానీ, ఎవరినీ భయపెట్టాల్సిన అగత్యం
కానీ వుండదు.
ఇప్పుడు బంతి పూర్తిగా సర్కారు దగ్గరే వుంది. అది స్పష్టంగా
కానవస్తోంది.
పొతే, మోడీ ప్రభుత్వ నిర్ణయం గురించి అనుకూలంగా, ప్రతికూలంగా
ప్రతిరోజూ అనేక వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఏ నిర్ణయం కూడా నూటికి నూరుపాళ్ళు
సరయినదని చెప్పే వీలులేదు. అలాగే ప్రతి నిర్ణయాన్నీ తప్పులతడకగా కొట్టేయడం కూడా సబబు కాదు. ఈ రెండు వాదనలు అర్ధసత్యాలే. అది
వివరించడానికే ఈ ప్రయత్నం. ముందు అనుకూలుర వాదన విందాం.
“పెద్ద నోట్ల రద్దువల్ల
మొట్టమొదట కనబడే ఫలితాలు నిరాశనే కలిగిస్తాయి. అయితే అది తాత్కాలికం. పరిణామాల
క్రమం వేరుగా వుంటుంది.
“బ్యాంకుల్లో కరెన్సీ నిల్వలు తగ్గిపోతాయి. నగదు చేతిలో
ఆడకపోవడం వల్ల వస్తువుల కొనుగోళ్ళు మందగిస్తాయి. రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం
మీద తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయి.
“సక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఖర్చుకు
సందేహిస్తారు. ఇక అక్రమ మార్గాల్లో డబ్బు
పోగేసుకున్నవారి సంగతి చెప్పక్కర లేదు. అలాంటి కరెన్సీని ఏదో విధంగా మార్చుకోవాలని
ప్రయత్నిస్తారు. విఫలం అయితే ఆ డబ్బు చిత్తు
కాగితాలకిందే లెక్క. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రజల దగ్గర వున్న ప్రతి నోటు ప్రభుత్వానికి భారమే. ఇప్పుడు లెక్కకు రాని, లెక్క చెప్పలేని అలాంటి నోట్ల భారం ప్రభుత్వానికి గణనీయంగా
తగ్గిపోతుంది. ప్రభుత్వ ఖాతాలో మొదట పడే లాభం ఇదే. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన కొత్త
వెసులుబాటును ఉపయోగించుకుని తమ దగ్గర
వున్న లెక్క చెప్పని సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే మళ్ళీ ఆ మొత్తంలో అధిక
భాగం పన్ను రూపంలో ప్రభుత్వ ఖజనాకే చేరుతుంది.
“ఇలా సమకూడిన డబ్బుతో ఒక ఏడాది ద్రవ్య లోటు పూర్తిగా తీరిపోగలదని ఓ
అంచనా. మొదటి ఆరుమాసాలకాలంలో జీడీపీ
పెరుగుదల రేటు క్షీణించి నప్పటికీ ఆ తరువాత రెండేళ్ళు బాగా పుంజుకుంటుందని కొందరు ఆర్ధిక వ్యవహారాల
నిపుణులు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టగలదని, రియల్ ఎస్టేట్
రేట్లు భూమార్గం పట్టగలవని ఆశావాదుల ఊహాగానం. పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఏడెనిమిది
లక్షల కోట్ల విలువైన కొత్త చట్టబద్ధమైన కరెన్సీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరడం
మూలాన దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కాగలదని వారు చెబుతున్నారు. ముందు దెబ్బతిన్న
రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాల వ్యాపారం
ఆ తరువాత అరుమాసాల కాలంలో మళ్ళీ స్థిరత్వం పొందగలవని, ఆందోళనకు ఆస్కారం లేదనీ
వారు భరోసా ఇస్తున్నారు. నల్ల డబ్బు చెలామణీ బాగా తగ్గిపోవడం వల్ల బంగారం
కొనుగోళ్ళపై ప్రభావం వుండే అవకాశం
ఉండవచ్చు. అయినా కానీ నల్ల ధనాన్ని దాచుకోవడానికి బంగారం అనేది మంచి
ప్రత్యామ్న్నాయం కాబట్టి బంగారం వ్యాపారానికి ముప్పు ఏమీ వుండకపోవచ్చని మరో అంచనా.
నగదు మార్పిళ్లు తక్కువ కావడం వల్ల కార్పొరేట్ సంస్థలు లాభపడతాయి. కొత్తగా ప్రవేశపెట్టిన
రెండువేల కరెన్సీ నోటు కారణంగా మళ్ళీ నల్ల
ధనం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందా లేదా అనే ప్రశ్న మిగిలే వుంటుంది. అయితే, పెద్ద
నోట్ల చెలామణీ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం నల్ల కుబేరుల
మనస్సులో కలిగించిన అలజడి మరికొంత కాలం అలాగే వుండిపోతుందనీ, తిరిగి నల్ల ధనం
కూడబెట్టుకునే ధైర్యం చేయకపోవచ్చనీ ఆ ప్రశ్నకు
జవాబు చెబుతున్నారు.”
సరే! ఇదంతా నాణేనికి ఒక వైపు.
రెండో వైపు వాదన దీనికి పూర్తిగా
విరుద్ధం. వాళ్ళు చెప్పేదేమిటో చూద్దాం.
“పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల
పెద్ద ప్రయోజనం లేకపోగా నష్టం ఎక్కువ. ప్రధానమంత్రి మోడీకి ఈ విషయంలో సరయిన సలహా
ఇచ్చినట్టు లేరు. రాబోయే పరిణామాలను ముందుగా ఊహించి తగిన జాగ్రత్తలు చెప్పినట్టు
లేదు.
“నిర్ణయం సమర్ధకులు చెబుతున్నట్టు
నల్ల ధనం అంటే కేవలం కరెన్సీ నోట్లు కాదు. నిజం చెప్పాలంటే అన్ని కరెన్సీ నోట్లు
బ్లాక్ మనీ కాదు. ప్రతి నోటు తెల్లధనం కిందికే వస్తుంది. కరెన్సీ నోటు ఎవరి దగ్గర
వున్నదీ అన్నదాన్ని బట్టి దాని రంగు మారుతుంది. ఉదాహరణకు ఒక కరెన్సీ నోటు పన్నులు
కట్టని వ్యక్తి వద్దకు చేరితే అది నల్ల ధనం అవుతుంది. తిరిగి అదేనోటు పన్ను
చెల్లించే వ్యక్తిదగ్గరకు చేరితే అదే డబ్బు తెల్ల ధనంగా మారుతుంది. ఈ విధాన
లోపాన్ని గుర్తించి సరిచేయకుండా మొత్తం కరెన్సీని రద్దు చేయడం సరికాదు.
“నల్లధనం సంపన్నుల దగ్గర వుందని
నమ్ముతున్న ప్రభుత్వం ఎక్కువ నగదు మార్పిళ్ళతో జీవితం గడిపేవాళ్ళు అతి పేదవారనే
వాస్తవాన్ని విస్మరిస్తోంది. వారిలో 90% మంది కరెన్సీ
చెల్లింపుల ద్వారానే జీవన యానం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్య వల్ల వారివద్ద
డబ్బు లేకుండా పోయింది. సమాజంలో నగదు చెలామణీ తగ్గిపోవడంతో దాని ప్రభావం వర్తక వాణిజ్యాలపై
పడుతోంది. అవి పూర్తిగా మందగించాయి.
“కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఖర్చు
పది,పదిహేనువేల కోట్ల రూపాయల వరకు వుండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి దండగ
ఖర్చే.
“రానున్న కొద్ది మాసాల్లో బ్యాంకుల
కార్యకలాపాలు పూర్తిగా స్తంభిస్తాయి. నోట్ల మార్పిడి, డిపాజిట్ల స్వీకరణ, వచ్చిన
జనాలను అదుపు చేయడం, సముదాయించడం వీటితోనే సరిపోతుంది. ఫలితం ఆర్ధిక వ్యవస్థపై
నేరుగా పడుతుంది. మార్కెట్లో నగదు నిల్వలు తగ్గిపోతాయి. వ్యాపార లావాదేవీలు తగ్గి
పన్నుల రూపంలో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
“ప్రజలవద్ద నగదు లేకపోవడంతో
ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది. ధరలు తగ్గినా కొనుగోలు చేయడానికి జనం దగ్గర డబ్బులు
వుండవు. కనీసం కూరగాయలు కొనగల స్థోమత కూడా ఉండకపోవచ్చు.
“నోట్ల రద్దు అనేది చాలా
ప్రమాదకరమైనది. అత్యంత తప్పనిసరి పరిస్తితుల్లో మాత్రమే ప్రయోగించాల్సిన ఈ బ్రహ్మాస్త్రాన్ని
ఆషామాషీగా ఉపయోగిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయి.”
ఈ రెండు వాదనలు ఒకే నాణేనికి బొమ్మా
బొరుసూ. అసలు సంగతి ఈ రెంటి నడుమా వుంది. వాదప్రతివాదాలు
చేసేవారికి ఈ విషయం తెలియకపోలేదు. కానీ అభిమాన దురభిమానాలు అలానే వాదించేలా చేస్తాయి.
వీటికి రాజకీయం కూడా తోడయితే ఇక
చెప్పేదేమీ వుంటుంది?
నిర్ణయం మంచిదే, అమలే ఇబ్బందిగా
మారిందని కదా మన్మోహన్ సింగ్ నుంచి మామూలు మనిషి వరకు మనసులో అనుకునే మాట. నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ముందు చూపుతో
వ్యవహరించలేదు, సరయిన కసరత్తు చేయలేదని కదా అందరం అంటున్నది. మనలో చాలామందిమి
ఈ నల్ల ధనంతో సంబంధం లేనివాళ్ళమే. అయినా
కొన్ని ఇబ్బందులు తప్పవు. మరి ఒకటో తారీఖు వచ్చేస్తోంది. మనమన్నా కాస్త ముందు
చూపుతో మనకు ఎలాటి ఇబ్బందులు ఎడురవుతాయో కాస్త ఊహించుకుందామా! ఇబ్బందులు పూర్తిగా
తొలగక పోయినా కాసింత మానసిక ఉపశమనం అన్నా లభిస్తుందేమో చూద్దాం.
మా ఆవిడను అడిగితే మొదటి వారంలో
ఎదురుకాగల కొన్ని సమస్యలు చెప్పింది. పనివాళ్ళ జీతం, పాలవాడి బాకీ, పేపరువాడి బిల్లు. ఇలా అన్నమాట.
బ్యాంకులో డబ్బు వున్నా బయటకి వచ్చే వీలులేదు. చేతిలో డబ్బులు రేపోమాపో అయిపోయే
బాపతు. వాళ్లకి బ్యాంకు ఖాతాలు లేవంటున్నారు. మరి ఏమిటి పరిష్కారం.
ఒకటే పరిష్కారం. రాజకీయాలు తగ్గించి ఒక
పద్దతిగా చర్చించుకోవడం. అందరం ఒక పడవలోని
ప్రయాణీకులమే కాబట్టి నిజాయితీగా మాట్లాడుకోవడం. రెచ్చగొట్టే చర్చల వల్ల ప్రయోజనం
శూన్యం. (26-11-2016)
లేబుళ్లు:
నల్ల ధనం చర్చలు - నాణేనికి అటూ ఇటూ
24, నవంబర్ 2016, గురువారం
అమ్మో! ఒకటో తారీఖు
నిర్ణయం మంచిదే, అమలే ఇబ్బందిగా మారిందని
కదా మన్మోహన్ సింగ్ నుంచి మామూలు మనిషి వరకు మనసులో అనుకునే మాట. నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం ముందు చూపుతో
వ్యవహరించలేదు, సరయిన కసరత్తు చేయలేదని కదా అందరం అంటున్నది. మనలో చాలామందిమి ఈ నల్ల ధనంతో సంబంధం లేనివాళ్ళమే. అయినా కొన్ని
ఇబ్బందులు తప్పవు. మరి ఒకటో తారీఖు వచ్చేస్తోంది. మనమన్నా కాస్త ముందు చూపుతో మనకు
ఎలాటి ఇబ్బందులు ఎడురవుతాయో కాస్త ఊహించుకుందామా! ఇబ్బందులు పూర్తిగా తొలగక పోయినా
కాసింత మానసిక ఉపశమనం అన్నా లభిస్తుందేమో చూద్దాం.
మా ఆవిడను అడిగితే మొదటి వారంలో
ఎదురుకాగల కొన్ని సమస్యలు చెప్పింది. పనివాళ్ళ జీతం, పాలవాడి బాకీ, పేపరువాడి బిల్లు. ఇలా అన్నమాట.
బ్యాంకులో డబ్బు వున్నా బయటకి వచ్చే వీలులేదు. చేతిలో డబ్బులు రేపోమాపో అయిపోయే
బాపతు. వాళ్లకి బ్యాంకు ఖాతాలు లేవంటున్నారు. మరి ఏమిటి పరిష్కారం.
ఒకరికొకరం ఇబ్బందులు చెప్పుకుంటే
పోయేదేమీ లేదు. నామోషీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడందరం ఒక పడవలోని ప్రయాణీకులమే.
రవంత రాజకీయాలు తగ్గిస్తే అసలు సంగతులు మాట్లాడుకోవచ్చు.
నడిచే నాటకరంగం కేవీ రమణ IAS
తెలిసిన వ్యక్తిలో తెలియని అంశాలు
My article on Savitri Sai book on KV Ramana (IAS) published in AKSHARA of Andhra Bhoomi, Telugu Daily today.Courtesy Shri Mvr Sastry
తెలంగాణా ప్రభుత్వ సలహాదారు, స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే,వీ.రమణ జీవన యానంపై శ్రీమతి సావిత్రీ సాయి రాసిన పరిశోధక గ్రంధం గురించిన నా సమీక్షను ఆంధ్ర భూమి దినపత్రిక 'అక్షర' లో ఈరోజు ప్రచురించారు. పత్రిక సంపాదకులు శ్రీ ఏం.వీ.ఆర్. శాస్త్రికి కృతజ్ఞతలు.
తెలంగాణా ప్రభుత్వ సలహాదారు, స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కే,వీ.రమణ జీవన యానంపై శ్రీమతి సావిత్రీ సాయి రాసిన పరిశోధక గ్రంధం గురించిన నా సమీక్షను ఆంధ్ర భూమి దినపత్రిక 'అక్షర' లో ఈరోజు ప్రచురించారు. పత్రిక సంపాదకులు శ్రీ ఏం.వీ.ఆర్. శాస్త్రికి కృతజ్ఞతలు.
“తీసివేసే థీసిస్ లు, ఎత్తిపోతల పధకాలు వంటి తెలుగు పరిశోధనల పరంపరలో యోగ్యుడయిన ఒక కళా వతంసుని కృషిని అంశంగా స్వీకరించి పరిశోధన చేసిన సావిత్రీ సాయిని అభినందిస్తున్నాను” అని ఈ పరిశోధనకు పరీక్షకునిగా వ్యవహరించిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు పేర్కొనడం సావిత్రి గారికి డాక్టరేట్ ని మించిన కితాబు.
కేవీ రమణ (రమణాచారి అనే తన పేరులో వున్న ‘చారి’ అనే రెండక్షరాలను ఆయనే స్వయంగా తొలగించుకున్నారు) జీవితం ఒక తెరిచిన పుస్తకం. పుస్తకం అట్ట వెనుక రచయిత్రే స్వయంగా ఈ విషయం పేర్కొన్నారు. అందరికీ తెలిసిన వ్యక్తిలో అందరికీ తెలియని అంశాలను కూడా పరిశోధించి రాయడం అంటే మాటలు కాదు. ఆ దిశగా చేసిన కృషి, ఆ క్రమంలో చూపిన పట్టుదల ఆవిడకు డాక్టరేట్ పట్టాను అందించింది. సావిత్రీ సాయి శ్రమ ఫలించడం వల్ల ఒక ఉపకారం కూడా జరిగింది. కేవీ రమణ జీవన చిత్రంలోని సాంస్కృతిక కోణం సమగ్ర రూపంలో ఆవిష్కృతమైంది. తెలుగు పాఠకులకు, ప్రత్యేకించి సాంస్కృతిక ప్రియులకు పుస్తక రూపంలో ఒక అమూల్యమైన కానుక లభించింది. ఇందుకు డాక్టర్ సావిత్రీ సాయి బహుధా అభినందనీయులు.
ఈ పుస్తకాన్ని సమీక్షించడం అంటే ఒక రకంగా కేవీ రమణ జీవితాన్ని ఆమూలాగ్రం స్పర్శించడమే. అందుకే కాబోలు ఆయన కొండంత వ్యక్తిత్వాన్ని ఆవిడ కొద్ది మాటల్లో గుదిగుచ్చి ఇలా చెప్పారు.
“దేశానికి ఒక అబ్దుల్ కలాం....ఒక అన్నా హజారే....
“తెలుగువారికి ఒక రమణాచారి”
అల్పాక్షరాల్లో అనల్పార్ధాలను పొదగడం అంటే ఇదే!
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి రచయిత్రి కృషి గురించి ‘రమణీయం’గా ఒక మాట చెప్పారు.
“పరిశోధకురాలు విషయాన్ని సంగ్రహించి, ఔచిత్యాన్ని గ్రహించి, ఎంతగానో శ్రమించి ఈ సిద్దాంత గ్రంధాన్ని రచించారన్న శివారెడ్డి గారి మాటల్లో ఎంతో సత్యం వుంది.
రమణది అందరికీ తెలిసిన వ్యవహారం కనుక తెలిసిన విషయాలను తేలిగ్గా సేకరించి దానికి పరిశోధనా పత్రం అనే రూపాన్ని ఇవ్వడం చాలా సులభమని ఎవరయినా అనుకుంటే పొరబాటు పడినట్టే. రమణ పూర్తి వ్యక్తిత్వాన్ని ఆపోసన పట్టడానికి సావిత్రీ సాయి ఎంతో శ్రమించారు. ఎక్కడెక్కడో స్తిరపడిన రమణ బాల్య స్నేహితులను, కళాశాల సహాధ్యాయులను, సహోద్యోగులను, సహచరులను, బంధు మిత్రులను, పరిచయస్తులను స్వయంగా కలుసుకుని మాట్లాడి విషయ సేకరణ చేసారు. ఆయన పాల్గొన్న అనేకానేక సాంస్కృతిక సభలు, సమావేశాలకు హాజరై రమణ ప్రసంగ రీతులను శ్రద్దగా గమనించారు. రమణ గురించి సర్వం తెలుసు అనుకునే వారు కూడా నివ్వెర పోయే అనేక అంశాలను సావిత్రీ సాయి తన ఈ గ్రంధంలో పొందు పరిచారు. చక్కగా చదువుకుని, డాక్టరయి సమాజానికి సేవ చేయాలనే తండ్రి ఆశయానికి అనుగుణంగా బుద్దిమంతుడయిన రాముడి మాదిరిగా మసలుకుంటున్న రమణ, ప్రత్యేక తెలంగాణా నినాదం పట్ల ఆకర్షితుడై, పదిహేడేళ్ళ ప్రాయంలోనే ఆనాటి విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొని, అరెస్టయి. జైలుకు వెళ్లి చిప్ప కూడు తిన్నవిషయం ఇందులో వెలుగు చూసింది. బాల్యంలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా మండుటెండలో తండ్రి వెంట బడికి పరుగులు తీసిన రమణ తదనంతర కాలంలో ఉన్నత చదువులు చదివి, ఉన్నతోద్యోగాలలో రాణించడం వెనుక దాగివున్న శ్రమదమాదులు ఈ రచనలో అడుగడుగునా కానవస్తాయి.
రమణకు స్వతహాగా నాటకాలంటే అనురక్తి. బాల్యంలోనే అంకురించిన ఈ అభిరుచి ఆయనతోనే పెరిగిపెద్దదయింది. విద్యార్ధిగా వున్నప్పుడు, అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు, తదుపరి ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా రమణలోని నటనాసక్తి బయటపడుతూనేవుండేది. రేడియో నాటకాలంటే చెవి కోసుకునే రమణకు ఎలాగైనా సరే రేడియోలో నాటకం వేయాలనే కోరిక బలంగా వుండేది. సైఫాబాదు కాలేజీలో లెక్చరరుగా పనిచేసేటప్పుడు మధ్యాన్న భోజన విరామసమయంలో కాలినడకన దగ్గరలో వున్న రేడియో స్టేషనువైపు వెళ్లి చూస్తూ, లోపలకు ఎలా వెళ్ళడం అనుకుంటూ వుండేవారు. ఆయనలోని ఈ ఆకాంక్షకు అక్కడి గేటు దగ్గరి ఘూర్ఖా అడ్డుపడే వాడు. మొత్తం మీద అతడు లేని సమయం చూసుకుని లోపలకు ప్రవేశించి, వేలూరి సహజానందను కలుసుకుని రేడియో నాటకాల్లో నటించాలనే తన అభిమతాన్ని వ్యక్తపరిచారు. వారి సలహా పాటించి, ఆడిషన్ లోఅర్హత సంపాదించి రేడియో నాటకాల్లో నటించగలగడం తన జీవితంలో ఒక మరపురాని అధ్యాయం అని రమణే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు.
అభిప్రాయ బేధం వచ్చి విడిపోయిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ప్రసిద్ధ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణలను తిరిగి కలపడంలో రమణ ప్రదర్శించిన కుశలత పాఠకులను ఆకట్టుకునే మరో అంశం. ఇద్దరూ తమతమ రంగాలలో ఉద్దండులే. మాట పట్టింపుగల మానధనులే. మరి ఎలా సయోధ్య కుదర్చడం! ముఖ్యమంత్రి కార్యాలయంలోని టెలిఫోన్ ఆపరేటర్ సాయంతో ఎవరు ఎవరికి ముందు ఫోను చేశారో వారిరువురికీ తెలియకుండా వారిద్దరినీ సంభాషణలో కలిపిన వైనం రమణ చతురతకు నిదర్శనం. మంగళంపల్లి పేరు వింటేనే మండిపడుతున్న రామారావు నోటితోనే “కులీ కుతుబ్ షా గారూ! (హైదరాబాదు పాత నగరం అభివృద్ధికి ఏర్పరచిన కులీ కుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థ పరిపాలనాధికారిగా రమణ చాలా కాలం పనిచేయడం వల్ల ఆయనకు లభించిన మారుపేరిది) మంగళంపల్లివారికి ప్రభుత్వం తరపున అఖండ సత్కారం చేయాలి, డేటు ఖరారు చేయండి” అనిపించారంటే రమణలోని చాతుర్యం, చాకచక్యం అర్ధం అవుతుంది.
ఎప్పుడూ దరహాస వదనంతో కానవచ్చే రమణకు చిన్ననాటి నుంచే హరికధలు అంటే అనురక్తి. పదహారేళ్ళ వయస్సులో సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్సవాలలో ఆయన చేసిన సీతాకల్యాణం హరికధా కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం మెడలో పూలదండతో, అంగవస్త్రంతో, పట్టుదోవతితో, నుదుట తిలక ధారణతో మెరిసిపోతూ వచ్చిన రమణని చూసి ఆశ్చర్య పడడం ఇంట్లో వాళ్ళ వంతయింది.
అలాగే, దేవస్థానం అనే సినిమాలో కూడా రమణ నటించారు. జనార్ధన మహర్షి రూపొందించిన ఈ సినిమాలో విశ్వనాద్, ఎస్పీ బాలసుబ్రమణ్యం సరసన నటించడం ఆయనకు మరో మరపురాని అనుభూతి.
ఇటువంటి ఆసక్తికర అంశాలను అన్నింటినీ సేకరించి ఒక క్రమపద్దతిలో, అధ్యాయాల వారీగా విభజించి ఈ పుస్తకంలో పొందుపరచడానికి సావిత్రీ సాయి పడిన శ్రమ కూడా తక్కువేమీ కాదనిపిస్తుంది ఇది చదివిన తరువాత.
పరిశోధక పుస్తకం అయినా చదివించే పుస్తకం రాసిన రచయిత్రి అభినందనీయులు.
లేబుళ్లు:
నడిచే నాటకరంగం కేవీ రమణ IAS
22, నవంబర్ 2016, మంగళవారం
మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కొన్ని జ్ఞాపకాలు - ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు
మంగళంపల్లి వారు మంచి స్నేహశీలి.
బెజవాడతో వారికి మంచి అనుబంధం. ఈ రెంటినీ
తెలియచెప్పడానికే ఈ చిరు ప్రయత్నం.
(PHOTO COURTESY RVV KRISHNARAO)
మూడుపదుల వయస్సు దాటేవరకూ బాలమురళీ
కృష్ణ బెజవాడ సత్యనారాయణపురంలోని తన సొంత
ఇంట్లోనే వుండేవారు. వారి తండ్రి పట్టాభి రామయ్య గారు కట్టించిన ఇల్లది. మద్రాసులో
స్థిరపడి, సంగీతంలో ఖండాంతర ఖ్యాతి పొందిన
తరువాత కూడా ఆయన బెజవాడలోని తన ఇంటిని అట్టే
పెట్టుకోవడం ఆ వూరు మీద ఆయనకున్న మమకారాన్ని తెలియచేస్తుంది. ఒకసారి విజయవాడ
పురపాలక సంఘం వాళ్ళు మంగళంపల్లివారికి పౌర సన్మానం చేసారు. ఆయన ఇల్లు వున్న వీధికి ‘మంగళంపల్లి వీధి’ అని పేరు పెడుతూ సంఘం
చేసిన తీర్మానాన్ని ఆ సభలో చదివి వినిపించారు.
మంగళంపల్లి వారు చాలాయేళ్ళు బెజవాడ
రేడియో స్టేషన్లో సంగీత ప్రయోక్తగా పనిచేసారు. అలాగే బెజవాడలో ఏర్పాటు చేసిన సంగీత
కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ కూడా మంగళంపల్లివారే. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు
రాజీనామా చేసి ఆయన మద్రాసుకు మకాం మార్చారు.
ఒకసారి బెజవాడ వచ్చి కచేరీ చేశారు. ఆయన అరవ కీర్తనలు పాడడం ఒకాయనకు నచ్చలేదు. ఆ
సంగతి మంగళంపల్లివారి చెవిన పడింది. ఇక ఆ
రోజు పూనకం పట్టినట్టు వర్ణం నుంచి మంగళం వరకు (కచేరీ మొదలు అయిన దగ్గరి నుంచి
చివరి వరకు) తమిళ కీర్తనలే పాడి కచేరీ ముగించారు. తమిళులకి సంగీతం పట్ల యెనలేని
గౌరవం వుందని, తనకు ఇన్ని పేరుప్రఖ్యాతులు రావడంలో తమిళ అభిమానుల పాత్ర వుందని
చెబుతుండేవారు. అసలు సిసలు సంగీతం కావేరీ
ఒడ్డునే ఉందనే వారు.
వారి గురువు పారుపల్లి రామకృష్ణయ్య
పంతులు గారు. బెజవాడ గాంధీ నగరంలో నవయుగ
ఫిలిమ్స్, అద్దంకి శ్రీరామమూర్తి ఇంటి దగ్గరలో పంతులుగారి నివాసం. బాలమురళీకృష్ణ అక్కడ
వుండే సంగీతం నేర్చుకున్నారు. వారికి వయోలిన్ అంటే ఆసక్తి. వయోలిన్ విద్యాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడి బాణీ అంటే చెవికోసుకునేవారు.
ఆయన్ని అనుకరిస్తూ వయోలిన్ వాయిస్తూ ఒకసారి గురువుగారి కంట పడ్డారు.
‘వయోలిన్ ‘సంగతి’ సరే! ముందు నీ ‘సంగతి’
చూసుకో అని గురువు గారు మెత్తగా మందలించారు. (సంగతి అనేది సంగీత పరిభాషలో ఒక పదం).
ఆనాటి నుంచి మంగళంపల్లి వారు అనుకరణకు పూర్తిగా స్వస్తి పలికారు.
1985 ప్రాంతంలో కాబోలు, బెజవాడలో డి.ఎల్.నారాయణగారి అమ్మాయి
వివాహానికి మంగళంపల్లి వారు మద్రాసు నుంచి వచ్చారు. ఇద్దరికీ మంచి స్నేహం. ఆ
స్నేహాన్ని పురస్కరించుకునే ఆ పెళ్ళిలో మంగళంపల్లి వారు కచేరీ కూడా చేసారు. ఆ
తరువాత మమత హోటల్ లో కాసేపు గడిపి రాత్రి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ కు
వెళ్ళారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్లాటు ఫారం మీద సిద్ధంగా వుంది. ఆ ట్రైను టీసీ మంగళంపల్లివారిని చూడగానే గుర్తుపట్టి
సెకండ్ ఏసీ బోగీలో ఒక బెర్తు మీద కూర్చోబెట్టి, ‘ఇప్పుడే వస్తాను, కూర్చోండి, వచ్చి మీకు బెర్తు ఇస్తాను’ అని చెప్పి వెళ్లి పోయాడు.
ఈ లోగా ఒక బెంగాలీ బాబు ప్లాటు ఫారం మీద
ఇడ్లీలు పార్సెల్ కట్టించుకుని, ఇడ్లీల మీద పోసిన జారుడు చట్నీ కారిపోతుండగా ఆ
బోగీలోకి వచ్చాడు. వచ్చి బాలమురళితో అది
తన బర్తని, అక్కడినుంచి లేవమని అన్నాడు. తానొక సంగీతకారుడిననీ, పేరు మంగళంపల్లి
బాలమురళీ కృష్ణ అనీ పరిచయం చేసుకోబోయారు. అయినా ఆ బెంగాలీబాబు పట్టించుకోలేదు.
సరికదా! “అయితే ఏమిటట” (వాట్ ఇఫ్) అనేసాడు. మంగళంపల్లివారు చిన్నబుచ్చుకుని టీసీ
వచ్చేవరకు ఆగకుండా బండి దిగి, మళ్ళీ హోటల్ కు వచ్చేసారు. తనవెంట వున్న మిత్రుడితో
ఇలా అన్నారు. ‘చూడు కృష్ణారావు. మనల్ని కావాలని కోరుకునేవాళ్ళు ఎంతోమంది వున్నారని
అనుకుంటాం. మన వెర్రి కాని అది పూర్తిగా నిజం కాదు. మన అసలు స్థాయి ఏమిటన్నది ఆ బెంగాలీ వాడు మనకు చెప్పాడు’
ఆయన మాటల్లో బాధ లేదు. ఒక సత్యం బోధపడిన భావన
కనిపించింది.
లేబుళ్లు:
కొన్ని జ్ఞాపకాలు,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

