10, మే 2014, శనివారం

అమ్మ ఎవరికయినా అమ్మే!

(మే 11 - మన దేశంలో మాతృమూర్తి దినోత్సవం)
(మనసును తాకే కధఅనే  ఈ కధను సందీప్ కుమార్ పోస్ట్ చేసారు. చాలామంది చదవడానికి వీలుంటుందని దాన్ని తెలుగు లిపిలోకి మార్చి ఇస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు)   
ఇక చదవండి.


బస్సు నుంచి దిగి  నా జేబులో చేయి పెట్టి చూస్తే పర్సులేదు. ఎవరో కొట్టేసారు. గుండె గుభిల్లుమంది.
పర్సులో నూట యాభయ్ రూపాయలు, అమ్మకి రాసిన ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం రాసిపెట్టి మూడు రోజులయింది కాని పోస్ట్ చేయడానికి మనస్సు రాలేదు. వున్న ఉద్యోగం పోయింది అని రాయాలంటే ఎలాగో అనిపించింది. నూట యాభై రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు కాని ఉద్యోగం లేదుకదా. మళ్ళీ దొరికేదాకా వున్నదానితోనే నెట్టుకు రావాలి. ఉత్తరంలో అదే రాసాను. ప్రతినెలా పంపించే  అయిదు వందలు ఇకనుంచి పంపడం కుదరకపోవచ్చు అని.
కొన్ని రోజుల తరువాత అమ్మ నుంచి ఉత్తరం వచ్చింది.  అందులో ఏం రాసి వుంటుంది. డబ్బు అందలేదు త్వరగా పంపించమని రాసి ఉంటుంది.
కాని ఆ ఉత్తరం చూసిన తరువాత నోటమాట రాలేదు.
బాబూ! నువ్వు పంపిన అయిదు వందల రూపాయల మనియార్డర్ అందింది. నువ్వు ఎలా అయినా డబ్బు పంపిస్తావని తెలుసు.కానీ,  ఎవరా మనియార్డర్ పంపించింది అన్న విషయం మాత్రం  అర్ధం కావడం లేదు.
కొన్ని రోజుల తరువాత మరో ఉత్తరం వచ్చింది. రాత గజిబిజిగా వుంది.

అన్నా! నీ పర్స్ కొట్టేసిన వాడిని నేనే. మీ అమ్మకు పంపిన డబ్బులో  నూట యాభై నీది. మరో 350  నేను కలిపి మనియార్డర్ చేసాను. అమ్మ ఆకలితో పస్తు పండుకోకూడదు.  అమ్మ ఎవరికయినా అమ్మే.

NOTE: Courtesy Image Owner) 

రుచి తగ్గింది


'
"అదేవిటో! పేపర్లు తిరగేయడమే కానీ పూర్తిగా చదవాలని అనిపించడం లేదు"  
"అదేమరి! పచ్చడి తిన్న నాలుక్కి చప్పిడి మెతుకులు ఏం రుచిస్తాయి"  
 

9, మే 2014, శుక్రవారం

‘ఈగ’ ఖరీదు '

‘ఈగ’ ఖరీదు '
'మా మూవీస్ ఛానల్ లో రాజమౌళి 'ఈగ' సినిమావస్తోంది. 2012 జులై లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అదేమిటంటే:
‘ఈగ’ ఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.


హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన, సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సక్రుత్తు గా జరిగే విషయం.
నిన్న శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ‘ఈగ’ వీక్షణానంతరం ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్ మెసేజి. ‘ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను, ఆ కార్డుకు ‘యాడాన్’ కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మాముందుంచి తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు, ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం.
ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న తరుణంలో ‘రాచ పీనుగ తోడు లేకుండా కదలదు’ అన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం. తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ, సెల్ ఫోన్లతో మరికొందరూ, లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా పాటించే పనిలో పడ్డాం. ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం. దరిమిలా, ‘మూడు వర్కింగు డేస్ నుంచి పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని – మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.
‘అమ్మయ్య’ అని అనుకుంటున్న సంతోషం కాస్తా కాసేపటిలోనే ఆవిరావిరయిపోయింది.
అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ లేదు, జేబులో కార్డూ లేదు’ అనే పాత రోజులకన్న మాట.
ఇంతకీ, ‘ఈగ’ సంగతేమిటంటారా! ‘ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను కమ్మేసింది.
ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’ సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే రైట్ అనుకోవాలి. అయితే-
విలన్ని ఓసారి ‘ఈగ’ చంపేసినట్టుగా చూపించిన తరువాత కధానాయిక కాల్చిన బాణసంచాలో ‘పని పూర్తయింది’ అనే సందేశం కనిపిస్తుంది. అక్కడితో సినిమా ఆపేసివుంటే బాగుండేదని నాకనిపించింది. అట్టే సినిమాలు చూడని నా అభిప్రాయం కరెక్టని నేనూ అనుకోవడం లేదు. బహుశా బడ్జెట్ ముప్పయి కోట్లని అంటున్నారు కదా. దానికోసం సినిమా నిడివి పెంచారేమోనని మాత్రం అనుకుంటున్నాను. (15-07-2012)

నేటి అవసరం


'ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడెదీవు, ఆ ధర్మము నేనెరుంగుదు .....'అంటాడు శ్రీరాముడు తన అనుంగు భక్తుడు ఆంజనేయుడితో, కల్పిత పౌరాణిక నాటకం 'శ్రీరామాంజనేయ యుద్ధం'లో.
సీమాంధ్రలొ  ఎన్నికల సమరం ముగిసింది. ప్రజాతీర్పు 'ఏవీఎం'లలో నిక్షిప్తమై వుంది. మరో వారం రోజుల్లో అది యెలా వుందనేది వెల్లడి అవుతుంది.



ఈలోగా, ఆశలు, ఆశలకు తగ్గట్టుగా అంచనాలు, అంచనాలకు తగ్గట్టుగా వూహాగానాలు ఇవన్నీ  ఎలాగో రాజకీయ పార్టీలకు తప్పవు.
ఆ తీర్పు యెలా వున్నా ఏవిధంగా వున్నా దాన్ని గౌరవించడం ప్రజాస్వామ్యానికి మేలుచేస్తుంది. విజేతకు కావాల్సింది సంయమనం, పరాజితులకు అవసరమైంది హుందాతనం.
అరవయ్యవ దశకంలో పత్రికలు చదవడం అలవాటు చేసుకుంటున్న దశలో, నాటి ఆంధ్ర పత్రిక మొదటి పుట పతాకశీర్షిక  నాకింకా గుర్తుంది.
"అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాన్ ఫిట్జరాల్ద్ కెనెడీ అద్భుత విజయం. ఓటమిని అంగీకరిస్తూ నిక్సన్ ప్రకటన"
పోటీ అన్నాక విజేతలు పలువురు వుండరు. వోడినవారికి అదే తుది పోరు కాదు. ప్రజల విజ్ఞత మీద విశ్వాసం వుంచండి. నచ్చిన వారిని యెలా ఎన్నుకుంటున్నారో, నచ్చకపోతే అలాగే 'వోటు ఆయుధం' ప్రయోగించి దించేసిన సందర్భాలు  కోకొల్లలు.  
ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇరువురికీ అభినందనలు. ప్రజలకు చేరువ కావడానికి అన్ని పక్షాలు విశ్వప్రయత్నం చేసాయి. అన్ని రకాలుగా శ్రమించాయి. అయితే విజయం ఒకరినే వరిస్తుంది. వారు ప్రజల విశ్వాసాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి. ఓడిన వారు కూడా అనవసర ఆరోపణలు, విమర్శలకు దిగకుండా ప్రజాస్వామ్య స్పూర్తిని గౌరవించాలి. మరో పోరాటానికి సిద్ధంగా వుండాలి.
ఇదేమీ తుది సమరం కాదు. ఈ ఎరుక అందరికీ మేలు చేస్తుంది. 

5, మే 2014, సోమవారం

షరా మామూలే!

తెలంగాణా ప్రాంతంలో ఎన్నికలు జరిగినప్పటి మాదిరిగానే ఈసారి సీమాంధ్ర ప్రాంతంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడో  తేదీ పోలింగు ముగిసేవరకు సుమారు నలభయ్ ఎనిమిదిగంటలపాటు  నా బ్లాగులో రాజకీయ సంబంధమైన వ్యాసాలు  కానీ వ్యాఖ్యానాలు కానీ చోటుచేసుకోవు. ఇది నాకై నేను విధించుకున్న నిబంధన.


 భండారు శ్రీనివాసరావు 

4, మే 2014, ఆదివారం

"ఎవరు చేసిన ఖర్మ ......."



పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు వేమన. అలాగే - విభక్తుల్లో సంబోధనా ప్రథమా విభక్తి తరహాయే వేరన్న భావన ఈనాడు సమాజంలో కాలవస్తున్నట్లుగా తోస్తోంది. తల్లిని ఒసే అనడం - తండ్రిని ఒరే అనడం ఈ మధ్య సినిమాల్లో షరా మామూలుగా మారిపోయి అదే సంస్కృతి క్రమంగా, వడి వడిగా సాధారణ జీవితాల్లోకి జొరబడుతుంది.

వెనుకటి రోజుల్లో పిల్లలు ఒకర్నొకరు సరదాగా గురూ-గురూ అని పిల్చుకుంటూ ఉంటే విని పెద్దలు గుర్రుమనే వారు. మాట తీరుకు ఆ రోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది. ఇళ్ళల్లో మాట్లాడుకునే దానికి - బయట సంభాషించే పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉండేది.ఇంట్లో అమ్మా అని పిలిచినా బయట నలుగురిలో మాత్రం అమ్మగారూ అంటూ గౌరవంగా చెప్పుకునే వారు. ఉత్తరాలు రాసేటప్పుడు - గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి అనో, పూజ్యులైన తాతయ్యగారికి అనో వినమ్రత కనబరిచే వారికి వినయాన్ని సంస్కారంగా, విధేయతని సభ్యతగా పరిగణించేవారు. ఒదిగి ఒదిగి ఉండడాన్ని ఆత్మన్యూనతగా కాకుండా అణుకువగా అనుకునేవారు. సభ్యతా, సంస్కారాలక్కు అదే కొలమానంగా భావించేవారు.

ఇక, పత్రికల్లో వాడే భాష, సినిమాల్లో వినిపించే సంభాషణలు, చట్టసభల్లో జరిగే చర్చలు, చాలా వరకు పరిధులకు, ప్రమాణాలకు లోబడే ఉండేవి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ల సంగతి చెప్పనక్కర్లేదు. వాటి కార్యక్రమాలు, వార్తలు గిరి గీసుకుని, మడికట్టుకుని తయారుచేసినట్టుగా ఉండేవని గిట్టనివారు అనుకునేవారు కూడా. నిజాలను నిదానంగా  చెబుతాయన్న నింద తప్ప - సమాజానికి కాలుష్య కారకాలుగా మారాయన్న అపప్రధని అవి ఏనాడు మోయలేదు. 
కానీ, కాలం ఒక్క తీరుగా ఉండదు కదా! జనం అభిరుచులు కూడా కాలాన్ని బట్టి, తరాలను బట్టి మారిపోతుంటాఅయి. కనుకే సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలకు ఈనాడు ఇంతటి ఆదరణ. అందుకే మార్పులోని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా దాన్ని స్వీకరించడం, అమోదించడం అంతా సజావుగా సాగిపోతున్నది. ఈ మార్పుని మరింత వేగవంతం చేయడంలో ఈనాటి ఎ టూ జెడ్ ఛానెళ్ళు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి.

తరాలు మారుతున్నప్పుడు - వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు - రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే - ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది.  తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వెఐరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి. అమ్మను ఒసేఅనడం, నాన్నను ఒరేఅనడం వంటి కొత్త ధోరణులను ఆవిష్కరిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇది క్రమంగా సినిమాల నుంచి ఛానళ్ళకు, పత్రికలకు, పుస్తకాలకు, చట్టసభలకు విస్తరించి - సభ్యతా సంస్కారాలకు కొత్త భాష్యం చెబుతున్నాయి. ఈ క్రమంలో నుంచే ఆవిర్భవించిన ప్రజా ప్రతినిధులు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, కళాకారులు - చెప్పే మాటల్లో, ప్రవచించే పలుకుల్లో, రాసే రాతల్లో - సభ్యతా సంస్కారాల ప్రమాణాలే మారిపోతున్నాయి. ఇందుకు సజీవ సాక్ష్యాలు - ఈనాటి సినిమాలే, ఈనాటి ఛానళ్ళే ఈనాటి పత్రికలే, ఈనాటి పుస్తకాలే, ఈనాటి చట్ట సభలే!
రోజూ చచ్చేవాళ్ళకు ఏడ్చేవాళ్ళుండరు.రోజులు ఇలాగే గడిస్తే వర్తమాన వైరుధ్యాలకు బాధపడే వాళ్ళు మిగలరు. 
 
పాలితులను బట్టే పాలకులు- పాఠకులను బట్టే పత్రికలు - ప్రేక్షకులను బట్టే సినిమాలు - వీక్షకులను బట్టే ఛానెళ్ళు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు!

ధర్మ సందేహం


రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ఎన్నికల యుద్ధం రాజకీయ పార్టీల మధ్యనా లేక కొన్ని పత్రికల నడుమా?

కుడి ఎడమైతే....


సీమాంధ్రలో తొలి దశ పోలింగు జరిగి, రెండో దశ తెలంగాణా ప్రాంతంలో జరిపివుంటే రాజకీయ నాయకుల ప్రసంగాలు యెలా వుండేవో ఆలోచిస్తే తమాషాగా అనిపిస్తుంది.

2, మే 2014, శుక్రవారం

పత్రికా స్వేచ్ఛకు సరికొత్త భాష్యాలు - భండారు శ్రీనివాసరావు


అవి ఎమర్జెన్సీ రోజులు.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.
 పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజం ను వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేసే నాకు వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. ‘నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు దయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్చవుందని ఒప్పుకుంటాను.’
పత్రికా స్వేచ్చపట్ల అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్చ గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు.
ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికా స్వేచ్చకు భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్చ అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో.
నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం – అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ‘ఎడిట్’ చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో ‘పత్రికా స్వేచ్చకు’ పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు  ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రా యించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ‘ఎడిటోరియల్ పాలసీ’కి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగావున్నప్పుడు వారి పత్రికలలో ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ‘ఎడిటోరియల్ పాలసీ’ అంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే  పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం – ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికా స్వేచ్చకు అర్ధమేముంటుంది?
ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక – సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది.
“అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది.
‘అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు ఎదురుగా ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి”

29, ఏప్రిల్ 2014, మంగళవారం

'ఒరేయ్ నేను శారదని....'

క్షమించాలి నేను గీసుకున్న గీతను నేనే దాటి వస్తున్నందుకు. కానీ సరయిన కారణం వుంది. ఇందులో నాకు రాజకీయం కనబడలేదు. ఈ ఫోటోలో వున్నది మా రెండో అక్కయ్య. ఆవిడకు వోటు ఖమ్మంలో వుంది. కానీ మూడు నెలల క్రితం వాళ్ల అబ్బాయి దగ్గరకు వచ్చి ఆరోగ్యకారణాల రీత్యా హైదరాబాదులోనే వుండిపోవాల్సివచ్చింది. రేపు ఇక్కడ వోట్ల రోజు అన్న సంగతి తెలుసుకుని ఈ రోజు పొద్దటి నుంచి అందర్నీ ఫోనులో పలకరించి వోటు వేసి రమ్మంటోంది. అంతే కాదు వేసి వచ్చిన తరువాత ఆ విషయం మళ్ళీ ఫోను చేసి చెప్పమని మాట తీసుకుంటోంది. తొంభయ్ ఏళ్ళ వయస్సులో ఆవిడ పడుతున్న ఆత్రుత చూసిన తరువాత ఇక దీన్ని షేర్ చేయాలన్న ఆత్రుత నాలో పెరిగిపోయింది. అందుకే వొట్టు తీసి గట్టున పెట్టేసాను.మన్నించాలి. - భండారు శ్రీనివాసరావు
మా మేనకోడలు భండారు రేణు సుధ కధనం:



(శ్రీమతి కొలిపాక శారద)

ఫోను కలపవే చిన్నమ్మాయ్!
" పొద్దున్నే లచ్చుబాబు నుంచి ఫోను. ఒక్కసారి వచ్చివెళ్ళవే అమ్మ అడుగుతోంది"
'ఆర్చుకుని తీర్చుకుని జూబిలీ హిల్స్ నుంచి బయలుదేరి వెళ్లేసరికి పదకొండు దాటింది. అమ్మ కిందటి నెలలోనే ఖమ్మం నుంచి హైదరాబాదు పటాన్ చెర్వు సమీపంలో వున్న మా చిన్నన్నయ్య ఇంటికి వచ్చింది. తొంభయ్ ఏళ్ళ మనిషిని అలా కదిలించడం నిజంగా సాహసం అనిపించింది కాని తప్పలేదు. మేముంటోంది జూబిలీ హిల్స్ లో. వారానికో పది రోజులకో వెళ్ళి చూసి వస్తుంటాను. ఎర్రటి ఎండలో పడివచ్చానని ఇంట్లో అంతా అనుకుంటుంటే అమ్మ మాత్రం తాపీగా 'ఫోను కలపవే చిన్నమ్మాయి' అంటోంది. అప్పటికే మా లచ్చుబాబు అన్నయ్య, గాయత్రి ఒదినె, వాళ్ల పిల్లల వరస అయిపోయినట్టుంది. ఆవిడ మంచం మీద కూర్చుని, హైదరాబాదులోని చుట్టపక్కాలు అందరికీ ఫోను కలిపి ఇవ్వమంటుంటే ఏమిటో అనుకున్నాను. తీరా చూస్తే. ఈ వయస్సులో ఎవరయినా అలా చేస్తారా అని అనిపించింది కూడా.
ఆవిడ పుట్టింది కాంగ్రెస్ వాదుల ఇంట్లో. మెట్టింది కాంగ్రెస్ కుటుంబాన్ని. పెళ్ళయిన కొత్తల్లోనే భర్త అంటే మా నాన్నగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారు, స్వాతంత్ర సమర యోధుడిగా, గర్భిణి అయిన అమ్మను వొదిలి పద్దెనిమిది మాసాలు జైల్లో వున్నారు. తొలి చూరు బిడ్డని పుట్టిన వెంటనే చూసుకునే అదృష్టం కూడా లేదు. జైలు నుంచి వచ్చిన ఎన్ని నెలలకో కళ్ళారా చూసుకున్నారు. స్వతంత్రం వచ్చిన దరిమిలా మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి క్రితంసారి ఎన్నికల వరకు దేన్నీ విడిచిపెట్టకుండా ప్రతిసారీ వోటు వేసి రావడం మా అమ్మకు అలవాటు. ఈసారి తనకు వోటు లేని హైదరాబాదులో వున్నప్పుడు ఈ వోట్ల పండుగ వచ్చిపడింది. వోటు వేయాలని ప్రాణం యెంత కొట్టుకులాడిపోతున్నా చేతకాని స్తితి. వీలులేని పరిస్తితి. అందుకని కొడుకునీ, కోడల్నీ, మనుమల్నీ పక్కన కూర్చోపెట్టుని అందరికీ ఫోన్లు కలపమని చెబుతూ, 'వొరేయ్ నేను శారదని, రేపు మరిచిపోకుండా వోటు వేసి రండి. వేసి వచ్చిన తరువాత నాకు ఫోను చేసి చెప్పండి.' అంటోంది.
ఇదంతా వింటూ నాకు కళ్ళు తిరిగాయో తెలియదు కాని తెరిపిళ్ళు పడ్డాయి. - భండారు రేణు సుధ

28, ఏప్రిల్ 2014, సోమవారం

తాత్కాలిక విరామం



బ్లాగర్, ట్విట్టర్,  ఫేస్ బుక్ సయితం ప్రభావవంతమైన సోషల్ మీడియా అయినందువల్ల  ఈరోజు సాయంత్రం ఆరుగంటల నుంచి ఎల్లుండి ముప్పయ్యవతేదీ సాయంత్రం పోలింగు ముగిసేవరకు రాజకీయ సంబంధమైన వార్తలు, వాటిపై వ్యాఖ్యలు, లేదా రాజకీయ కార్టూన్లు షేర్ చేయడం, లేదా వాటికి వ్యాఖ్యానాలు జత చేయడం, ఇతరులు పోస్ట్ చేసిన రాజకీయ  అంశాలపై స్పందించడం మొదలయిన వాటన్నిటికీ దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను.ఇది నాకు నేనుగా స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయం.- భండారు శ్రీనివాసరావు       

27, ఏప్రిల్ 2014, ఆదివారం

ఏ నిమిషానికి ఏమిజరుగునో ........


మంథా భానుమతి గారు 'హ్యాపీ మూమెంట్స్' రాయడం మొదలు పెట్టిన తరువాత అలా అందరూ తలా ఓ చేయివేస్తే అంతా హాయిగా చదువుకోవచ్చు కదా అనిపించింది. కానీ మళ్ళీ ఆవిడే రాశారు తెలిసిన వాళ్ళెవరో పోయారు, విషాద వార్తను పంచుకోవాల్సివచ్చిందని. పోతే, మా కధ.
ఆదివారం అన్నీ లేటే! కాఫీలు టిఫిన్లు.
వంటావిడ వచ్చి చేసిన ఇడ్లీలు తిని, పొద్దున్న (ఛానళ్ళ కోసం) చదివిన పత్రికల్నే మళ్ళీ తీరిగ్గా  చదవడానికి గదిలోకి వెళ్లాను. మా ఆవిడ పూల కుండీల్లో నీళ్ళు పోశారో లేదో చూడడానికని బయటకు వెళ్ళింది. మావాడు సంతోష్  పెట్టిన టిఫిన్ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా 'వాట్సప్' లో మునిగితేలుతున్నాడు.
ఇంతలో భళ్ళున చప్పుడు. తలుపులు విరిగి విసురుగా దూరాన పడ్డ శబ్దం. బయటకు వచ్చి చూస్తే వంటిల్లు రణరంగంలా వుంది. కిచెన్ ప్లాట్ ఫారం కింద గ్యాస్ క్యాబిన్ తలుపులు దూరంగా పడివున్నాయి. సిలిండర్ రెగ్యులెటర్ నుంచి మంటలు వస్తున్నాయి. మావాడు మంచినీళ్ళబాటిళ్లలోని నీళ్ళతో ఆ మంటలపై చల్లుతున్నాడు.    
అవి ఓ పట్టాన కంట్రోల్ కావడం లేదు. ఎలారా అని అనుకుంటున్న సమయంలో 'లక్కు' అనేది మాకూ , జరగబోయే బీభత్సానికి నడుమ అడ్డుగోడలా నిలిచింది. మంటలు ఆరిపోయాయి. సిలిండర్ తీసి బయట పడేశాము.
ప్రస్తుతం మా ఆవిడ పర్యవేక్షణలో సంప్రోక్షణ జరుగుతోంది.
మావాడు కిచెన్ కు సెలవు ప్రకటించాడు. బహుశా ఈ పూట మధ్యాహ్నభోజనం బయట హోటల్లోనేమో!
కధ సుఖాంతం 


26, ఏప్రిల్ 2014, శనివారం

?????????


ఈ రెండు నెలలు అసెంబ్లీని యెందుకు వుంచినట్టు. యెందుకు రద్దుచేసినట్టు. కారణం తెలియదని కాదు ఈ ప్రశ్న వేయడం. రాష్ట్రపతి పాలన విధించినప్పుడే రద్దు చేసి వుంటే ఎమ్మెల్యేల జీత భత్యాల భారం తప్పేది కదా అని.



పల్లెకు పోదాం


"Back to village"

'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.  చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.


(మా స్వగ్రామంలో మా ఇల్లు)


25, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఏకంగా నా పోటీ జంధ్యాల మీదే!


డెబ్బయ్యవ దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం వల్ల నేను ఎస్సారార్  కాలేజీలో,  బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను. చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని తెలిసిన సైక్లోస్టైల్ షాపుకు వెళ్ళి తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి కాలేజీకి  తిరిగి వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి. అంటే ఎవరో కాదు మనందరి అభిమాన ఆహ్లాద సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల.


ఆ 'ఒక్కక్షణం' అనే  గేయం ఇలా సాగుతుంది.
"ఒక్క క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు - మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు - స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి - చేతులు కాలిన పిమ్మట ఆకులకై  వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు -  అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"

ఎందుకో మా తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జంధ్యాలను గెలిపించారు.               

1973 లో అగ్గిపెట్టె పదిపైసలు

మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు
న్యూ ఇయర్  గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31  వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే సుమారుగా నలభయ్ ఏళ్ళకిందటి మాట)
నూనె : Rs.3-25
నెయ్యి:Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు:Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా: Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)

24, ఏప్రిల్ 2014, గురువారం

యస్ సర్ నో సర్ - భండారు శ్రీనివాసరావు


ముప్పయ్ అయిదేళ్ళ క్రితం చండప్రచండుడిగా పేరు తెచ్చుకున్న ఒక ముఖ్యమంత్రిగారి పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి గారనే ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. చెప్పిన పని వెంటనే చేయకపోయినా, నలుగురిలో వుండగా ఏదయినా ఫైల్ విషయంలో కుదరదని (నో) చెప్పినా ఆయన ఎగిరిపడతారని ఆ అధికారికి బాగా తెలుసు. అందుకని ఎవరయినా పనిమీద సీఎంని కలిసి ఏదయినా అడిగితె,  అప్పటికి 'యస్ సర్' అనేవారు. తరువాత ఆ ఫైల్ సీఎం పేషీకి   వచ్చినప్పుడు ఎవరూ లేకుండా చూసి దాన్ని యెందుకు ఆమోదించకూడదో వివరంగా చెప్పి 'నో సర్' అంటూ 'నో'  చెప్పేవారట. అందులో విషయం వుందని అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి కూడా మారుమాట లేకుండా ఆ అధికారి చెప్పిన దాన్ని వొప్పుకునేవారట. అందుకని (ఎస్సార్ ) రామమూర్తి గారిని తోటి అధికారులు 'ఎస్ సర్ రామమూర్తి', 'నో సర్ రామమూర్తి' అనేవారట. (తదనంతర కాలంలో రామమూర్తి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు)    

23, ఏప్రిల్ 2014, బుధవారం

"రెండు నిమిషాలు నాకు దానం ఇవ్వండి"

పరమాచార్య పావన గాధలు - భండారు పర్వతాలరావు


"మీరందరూ నా వద్దకు అనేక కానుకలు తీసుకువస్తున్నారు. పుష్పఫలాదులు తెస్తున్నారు. ధనమిస్తున్నారు. వీటిని వేటినీ నేను కోరుకోవడం లేదు.
"దినానికి రెండు నిమిషాలు మాత్రం నాకివ్వండి. ఆ రెండు నిమిషాలు భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి. అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక.
"దినమంతా మీరు లౌకిక వ్యాపారాలతో గడుపుతారు. ఓ రెండు నిమిషాలు ఈ బీద సన్యాసికి దానమివ్వలేరా!
"నాకు కావలసింది అంతే!"
-పరమాచార్య