9, ఏప్రిల్ 2013, మంగళవారం

మనం మంచివాళ్ళ మధ్యనే వుంటున్నాం



ఒకరకంగా మన అందరం అదృష్టవంతులమే. ఎందుకంటే , జస్టిస్ చంద్రు వంటి  అరుదయిన మంచి మనుషులు జీవిస్తున్న కాలంలోనే మనమూ బతుకుతున్నాము కాబట్టి.

జస్టిస్  చంద్రు 

జస్టిస్ చంద్రు చెన్నై హై కోర్ట్లులో చాలాకాలం జడ్జిగా  పనిచేసి ఈమధ్యనే పదవీ విరమణ చేశారు. ఆయన్ని గురించిన నాలుగు మంచిమాటలు చెప్పుకునే ముందు మరో విషయం ప్రస్తావించడం అసందర్భం ఏమీ కాబోదు.
ఆంధ్రప్రదేశ్  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.వి.రావు  ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. దేశవ్యాప్తంగా న్యాయస్తానాలలో మూడుకోట్లకు పైగా కేసులు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోయివున్నాయనీ, ఇవన్నీ ఓ కొలిక్కి   రావాలంటే  300 లసంవత్సరాలకు  పైగా పడుతుందనీ జస్టిస్ రావు  చెప్పారు. ఆయన చెప్పింది అక్షరసత్యమే కావచ్చుకాని,  జస్టిస్  చంద్రు వంటి న్యాయమూర్తులు మరికొందరు వుండివుంటే,  బహుశా కేసుల పరిష్కారానికి  అంత సమయం అవసరం పడదేమో! ఎందుకంటే కేసుల పరిష్కారం  విషయంలో జస్టిస్ చంద్రు నెలకొల్పిన  రికార్డు అలాటిది మరి.  న్యాయమూర్తిగా ఆయన అక్షరాలా  యాభై నాలుగు వేల కేసులను పరిష్క రించారు. భారత న్యాయస్తానాల చరిత్రలో ఇదొక అరుదయిన రికార్డు.
సరే! విషయానికి వద్దాం.
ఏదయినా ఉద్యోగంలో వున్న వ్యక్తి యెంతటి  సమర్ధుడైనా సరే,  ఏదో ఒకనాడు పదవీ విరమణ చేయకతప్పదు. జస్టిస్ చంద్రుకు కూడా ఆ రోజు వచ్చింది.
మామూలుగా ఇలాటి సందర్భాలలో కొన్ని సంప్రదాయాలు వుంటాయి. న్యాయమూర్తి ఎవరయినా రిటైర్ అవుతున్నప్పుడు  కోర్టులోనే అధికారికంగా ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి,  ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్  వగైరా  హాజరవుతారు. వీడుకోలు ప్రసంగాలు చేస్తారు. పుష్పగుచ్చాలు అందచేస్తారు.  తేనీటి విందు జరుగుతుంది. అందరూ కలసి ఫోటో దిగుతారు. వీలునుబట్టి,  ఆ సాయంత్రం ఓ  ఫైవ్ స్టార్ హోటల్లో వీడ్కోలు  విందు ఏర్పాటుచేస్తారు.
కానీ జస్టిస్ చంద్రు తరహానే వేరు. అందువల్ల ఆయన పదవీ విరమణ ఆయన పద్దతిలోనే జరిగింది. ఏడేళ్ళపాటు జడ్జిగా  పనిచేసి  రిటైర్ అయ్యేముందు అంటే  ఈ ఏడాది ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయవద్దని అందులో ముందుగానే  అభ్యర్ధించారు.
ఒక జడ్జి  నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎన్నడూ జరగలేదా అంటే  జరిగింది. కానీ ఎప్పుడూ?  మన దేశానికి  స్వాతంత్ర్యం రాకముందు 1929లో జరిగింది.  ఆరోజుల్లో జస్టిస్ జాక్సన్ నాటి అడ్వొకేట్ జనరల్ తో చెప్పారు. ‘ నా రిటైర్ మెంటు విషయంలో అనవసరమైన హడావిడి ఏమీ చేయవద్దు. నా విధులు నేను నిర్వర్తించాను.  వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంది?’
మళ్ళీ ఎనభై రెండేళ్ళ తరువాత జస్టిస్ చంద్రు అలాటి నిర్ణయం తీసుకోగలిగారు.     
 మార్చి  ఎనిమిది, శుక్రవారం.
జస్టిస్ చంద్రు రోజుమాదిరిగానే  కోర్టుకు వచ్చారు. తన ఆస్తిపాస్తుల  వివరాలను స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. తరువాత తన చాంబర్స్ కు వచ్చి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో కూర్చుని తేనీరు  సేవిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు.
రిటైర్ అయినరోజున కూడా ఆయన అధికారిక వాహనాన్ని వాడుకోలేదు. అన్నిసంవత్సరాలుగా  వెన్నంటివున్న డఫేదారునూ వెంటతీసుకోపోలేదు.
తరువాత హై కోర్టు బయటకు వచ్చి నడుచుకుంటూ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటి అక్కడవున్న సంగీత రెస్టారెంటులో మిత్రులతో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెబుతూ గడిపారు. ఆ పిదప, బీచ్ రోడ్డు స్టేషన్ కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే ఎం.ఆర్.టీ.ఎస్. లోకల్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు.
న్యాయమూర్తిగా వున్నప్పుడు కూడా జస్టిస్ చంద్రు ఉద్యోగంతోపాటు వచ్చే హంగులు ఆర్భాటాలకు  దూరంగానే వుంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ చాంబర్ నుంచి కోర్టు హాలుకు వెళ్ళేటప్పుడు  యూనిఫారం ధరించిన  బిళ్ళ బంట్రోతు వొకరు చేత దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ. జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు.  తన అధికారిక వాహనానికి యెర్ర దీపం ఏర్పాటు తీసేయించారు. సెక్యూరిటీ సిబ్బందిని  అవసరంలేదని చెప్పి వాపసు పంపేసారు.  ఇంటివద్ద పనులకోసం బంట్రోతులను వాడుకోలేదు.
చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు చాంబర్ ముందు ఒక బోర్డు మీద ఇలా రాసివుండేది.

“పూలు,బొకేలు పట్రాకండి – నేనేమీ దేవుడ్ని కాను
ఆకలితో లేను  – కాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి
చలితో గడగడలాడిపోవడం లేదు –  శాలువల అవసరం ఏమీ లేదు  
అలా అని మీనుంచి నేనేమీ ఆశించడంలేదనుకోకండి.
లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మరచిపోకండి.”
   
బహుశా ఇప్పుడాబోర్డు అక్కడ వుండి వుండదు. దాని అవసరం కూడా వుండకపోవచ్చు.
(09-04-2013)
NOTE: COURTESY IMAGE OWENER

8, ఏప్రిల్ 2013, సోమవారం

భండారు బఠానీలు



‘పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?’  అనేది చిన్నప్పుడు స్కూల్లో అడిగే ప్రశ్న.
‘తెలుగు మాస్టారు’ ఠకీమని సమాధానం.
ప్రశ్న అడిగిన లెక్కల మాస్టారుకి ఎక్కడ కాలాలో అక్కడే కాలేది. తరువాత ఏదో తప్పువెతికి పట్టుకోవడం, చెయ్యి చాపమనడం, చాచిన చేతిని తిరగేయించడం,  దానిమీద డష్టరు తిరగేయడం - అది వేరే కధ.
తమదగ్గర  చదువుకునే పిల్లల్లో ఐ.ఏ.ఎస్. లు ఎంతమంది అవుతారన్నది వారికొచ్చిన  డౌటేహం కావచ్చు. వాళ్ళల్లో రాజకీయనాయకులు, జర్నలిస్టులు కొంతమంది అయినా కాకపోతారా అనే నమ్మకం కావచ్చు. అందుకే కాబోలు,  పిల్లలకు   వక్తృత్వపోటీలు పెట్టి, ‘కలం గొప్పదా? కత్తి గొప్పదా?’ – ‘అణ్వస్త్రాలు కావాలా?  అన్నవస్త్రాలు కావాలా?’ అని ప్రతి అంశానికి అనుకూలంగా ప్రతికూలంగా రెండు విధాలుగా చెప్పించేవారు. అప్పుడర్ధంయ్యేది కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చల తీరుతెన్నులు, రాజకీయ నాయకుల ప్రకటనలు గమనిస్తుంటే  అందులోని తత్వం  నెమ్మది నెమ్మదిగా తలకెక్కుతోంది.
‘నరం లేని నాలుక ఏవిధంగానయినా మాట్లాడుతుందంటారు చూడండి. అలా రాజకీయ నాయకులు ‘మొన్న ఏం మాట్లాడాం, నిన్న ఏం చెప్పాం’ అన్నదానితో నిమిత్తం లేకుండా ‘ఈరోజు చెప్పిందే ఫైనల్’ అన్న పద్ధతిలో  బల్లగుద్ది వాదిస్తున్న విధం చూస్తుంటే రాజకీయాల్లో సోషలిజం, కమ్యూనిజం, క్యాపిటలిజం   కాకరకాయా ఏమీలేదు వొట్టి అవకాశవాదం తప్ప అనిపిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఏమీ వుండదు.




‘మా నాన్నవల్ల ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టడం నామతం కాదు,  అభిమతం కాదు, కాదెంతమాత్రం కానే  కాదం’టూ ఎక్కడలేని ధర్మపన్నాలు  వల్లించి ఆ తరువాత అనతికాలంలోనే  పోటీ పార్టీ పెట్టి సొంతపార్టీకి చిల్లి పెడుతున్న విధం చూస్తుంటే-  రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడే స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకులను పంచెలూడతీసి తరిమికొడతాం!’ అంటూ పొడుగుపాటి డైలాగులు అలవోకగా జనం మీదకు వొదులుతూ, పార్టీ పెట్టిన  తొమ్మిదిమాసాల్లోనే అధికార పీఠం ఎక్కిన  ఎన్టీయార్ రికార్డుని బద్దలుకొట్టేసి,   రాజ్యాధికారంలోకి వద్దామనుకున్న కలలు కాస్తా   పార్టీ పారాణి ఆరకముందే కల్లలైపోవడంతో, ఇక  విధిలేక  ఆ కాంగ్రెస్ పంచనే చేరి, కేంద్రమంత్రి పదవిలో విదేశాల్లో  సేదతీరుతూ, తీరిగ్గా  సోనియా భజన చేస్తున్న వైఖరి చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్సార్ చనిపోయినప్పుడు, పట్టు చీరెల అంచులతో, ఖాదీ ఉత్తరీయాలతో కళ్ళు వొత్తుకుంటూ బుల్లితెరలమీద బారులుతీరి ‘అంతటి నాయకుడు ఇంతకు ముందు పుట్టలేదు ఇకముందు పుట్టడు’ అంటూ విలపించిన ఆయన  మంత్రివర్గ సహచరులే  ఇప్పుడు పల్లవి మార్చి ‘అవినీతిలో వైఎస్ ను మించినవాడు లేడం’టూ వైనవైనాలుగా శాపనార్ధాలు పెడుతున్న వైనం గమనిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

‘తుది శ్వాస విడిచేవరకు తాత స్థాపించిన పార్టీలోనే వుంటానంటూ, ప్రత్యర్ధి పార్టీల ఫ్లెక్సీల్లో అభిమానుల పేరుతొ తన ఫోటోలు పెడుతుంటే మిన్నకుండిపోయి ముసిముసి నవ్వులు నవ్వడం చూస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?
‘అల్లుడా రమ్మని పిల్లనిచ్చిన  మామ పిలిచి పార్టీ అందలం ఎక్కిస్తే, పార్టీని బతికించే నెపంతో పార్టీ సంస్తాపకుడి అంతాన్నే కళ్ళారాచూసి, ఇప్పడు మళ్ళీ పార్టీ పునరుద్దానానికి ఆ కీర్తిశేషుడి పేరునే వాడుకుంటూ, దానిపై పేటెంటు రైటు తమదే అంటూ వాడవాడలా  వూరేగుతున్న విపరీతాన్ని చూస్తున్నప్పుడు - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

పార్టీలు, వ్యక్తుల భజనకోసం పెట్టిన టీవీ చానళ్ళలో పనిచేస్తూ, జీతాలకోసమో, హోదాలకోసమో వేరే చానళ్ళలో చేరి  పొగిడిన నోళ్లతోనే తెగుడుతున్న విధానాలను పరికిస్తుంటే - రెండు నాలికలతో  మాట్లాడడానికి  చిన్నప్పుడు స్కూల్లో యెందుకు ట్రైనింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదా?

ఇలాటి  చద్మ వేషధారుల, ఆషాఢభూతుల లీలలు చూపించి, వారి అసలు రూపాలను, స్వరూపాలను చూపించే విధంగా ఏ టీవీ వారయినా పుణ్యం కట్టుకుని, ‘అప్పుడు – ఇప్పుడు’ అనే కార్యక్రమం ప్రసారం చేస్తే యెంత బాగుంటుందో !   (08-04-2013)  
Note: Courtesy image owner              

6, ఏప్రిల్ 2013, శనివారం

ఈనాడు సిటీ ఎడిషన్ ఎనిమిదో పేజీ చూశారా?




ఈనాటి ‘ఈనాడు’ దినపత్రిక సిటీ ఎడిషన్ ఎనిమిదో పేజీలో ఒక ఫోటో వేసారు. ఆ ఫోటోలో ఒక నడివయసు ఆవిడ తన మనుమడిని భుజాలమీద ఎత్తుకుని వెడుతున్న దృశ్యం వుంది. పల్లెపట్టుల్లో ఇది మామూలే కాని హైదరాబాదు లాటి నగరంలో అపూర్వ దృశ్యమే అని చెప్పాలి. అందుకే అది ఆ ఫోటోగ్రాఫర్ కళ్ళల్లో పడి కెమెరా కంటికి చిక్కి పత్రికలోకి  ఎక్కింది.




ఈ ఫోటోలో వున్న ఆవిడతో మాకు బాదరాయణ సంబంధం వుండడం వల్లనే ఇది రాయాల్సివస్తోంది. 1992 లో మేము మాస్కోనుంచి వచ్చిన తరువాత పంజాగుట్టలోని  దుర్గానగర్ కాలనీలో చాలా ఏళ్ళు వున్నాము. ఆ రోజులనుంచి ఈ ఫోటోలో వున్న యాదమ్మ కుటుంబంతో మాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. యాదమ్మ చాలా కాలం మా ఇంట్లో పనిచేసింది. వాళ్ళాయన మల్లయ్య ఆటో నడుపుతాడు. ఆ రోజుల్లో దూరాభారాలకు మల్లయ్య ఆటోనే మాకు ఆధారం. అలాగే ఆ తరువాత సంవత్సరాలలో యాదమ్మ పిల్లలు – సైదమ్మ, కళ, భాగ్య, సంపూర్ణ , తిరుపతమ్మ మా ఇంట్లో పనిచేస్తూ వచ్చారు. చిన్నపిల్లలు సంపూర్ణ, తిరుపతమ్మ మా ఇంట్లో వుంటూనే చదువుకున్నారు. సంపూర్ణ పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళేదాకా మా ఇంట్లోనే వుండేది. వాళ్ల అక్క  భాగ్య ఇప్పుడు మాకు వంట చేసిపెడుతోంది. ఇదిగో ఈ భాగ్య ‘భాగ్యమే’ ఫోటోలో యాదమ్మ నెత్తికెక్కిన వాడు,  ఆమె  ఏకైక సంతానం గౌతమ్. కాన్వెంటు స్కూల్లో చదువుకుంటున్నాడు.  పోతే, కళ తనకు పుట్టిన పిల్లలకు మా పిల్లల పేర్లే ‘సందీప్,సంతోష్’ అని పెట్టుకుంది. మా పిల్లలు అమెరికా నుంచి ఎప్పుడు ఫోను చేసినా వీళ్ళందరి యోగక్షేమాలు అడుగుతారు. మా ఇంట్లో యే శుభకార్యం జరిగినా మొత్తం కుటుంబం మా చెంతనే  సాయంగా వుండిపోతుంది.   అదీ ఈ ఫొటోకు మాకువున్న లింకు. (06-04-2013)

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?




సరిహద్దుల్లో పోరు భీకరంగా జరుగుతోంది.
మరోపక్క అక్కడికి దాపున వున్న ఆసుపత్రిలో ఓ ముసలాయన చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. యుద్ధరంగంలో వున్న కొడుకును పదే  పదే  తలచుకుంటున్నాడు. తనకు సేవలు చేస్తున్న నర్సుతో కొడుకు గురించి తాను పడుతున్న ఆరాటాన్ని కేవలం కనుసైగలతో అదేపనిగా వివరిస్తున్నాడు. ఆఖరిఘడియల్లో కన్నకొడుకు ఆఖరి చూపు కోసం ఆ ముసలాయన పడుతున్న బాధను ఆ నర్సు అర్ధంచేసుకోగలిగింది. కానీ ఏమీ చేయలేని పరిస్తితి ఆమెది.
అదే  సమయంలో  ఓ యువకుడు ఆసుపత్రిలో అడుగుపెట్టాడు. మిలిటరీ దుస్తుల్లో వున్న  అతడిని చూడగానే  నర్సుకు ప్రాణం లేచి వచ్చింది. వెంటనే అతడిని వెంటబెట్టుకుని ముసలాయన వద్దకు తీసుకు వెళ్ళి  ‘ఇదిగో మీ నాన్న గారు. కళ్ళల్లో ప్రాణాలుపెట్టుకుని మీకోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎంతో సమయం లేదు. తెల్లారుతుందన్న ఆశ కూడా లేదు.’ అంటూ మిగిలిన రోగులను కనుక్కోవడానికి  హడావిడిగా వెళ్ళిపోయింది. మంచానికి  అతుక్కుపోయినట్టు పడివున్న  ఆ వృద్ధుడి వంక అతడు తేరిపారచూశాడు. ముడతలు పడి బలహీనంగా వున్న చేతిని కదపడానికి  అవసానదశలో అతడు చేస్తున్న విఫల ప్రయత్నాన్ని గమనించాడు.  ఆ యువకుడే చేయిసాచి వృద్ధుడి చేతిని తన చేతిలోకి తీసుకుని  మృదువుగా ఆప్యాయంగా అదిమాడు. బలిష్టమైన ఆ యువకుడి చేతిలో ఎముకలు,చర్మం  తప్ప ఏమీ లేని వృద్ధుడి చేయి అలాగే  వుండిపోయింది.


కాసేపటి తరువాత అటుగా  వచ్చిన నర్సు అతడిని చూసింది.
‘ఇక ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. మీరు కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తెల్లారిన తరువాత చేయవలసిన తతంగం చాలా వుండవచ్చు’ అంది.
తన చేతిని వొదలడం ఇష్టం లేదన్నట్టు  ప్రశాంతంగా నిదురపోతున్న ఆ ముసలి ప్రాణాన్ని  వొదిలివెళ్లడానికి అతడికి మనస్కరించలేదు.  రాత్రంతా  ఆ యువకుడు రోగిమంచం చెంతన అలాగే కూర్చుండిపోయాడు.  తెలతెలవారుతుండగా వృద్ధుడి ప్రాణం పోయింది.  చలనంలేని  ఆ చేతిని నెమ్మదిగా విడిపించుకుని వెళ్ళి నర్సును కలిసి విషయం చెప్పాడు.  కంటి మీద కునుకు లేకుండా  వృద్ధుడి చెంతనే వుండి, ఆఖరి నిమిషం వరకు స్వాంతన  చేకూర్చిన ఆ యువకుడిని నర్సు మనసారా అభినందించింది. ‘ఇలాటి కొడుకున్న  ఆ వృద్ధుడు ఎంతో అదృష్టవంతుడు’ అని కొనియాడింది. ఆ యువకుడి మోహంలో రంగులు మారాయి.
‘ఆయన  నాకు తండ్రా! అసలాయన్ని చూడడం ఇదే మొదటి సారి’ అన్నాడు. ఆశ్చర్యపోవడం ఈసారి నర్సు వంతయింది. ‘అదేమిటి, రాత్రి  ఆయనతో చెబుతున్నప్పుడే ఈ విషయం నాకెందుకు చెప్పలేదని’ ఎదురు ప్రశ్నించింది.
‘అప్పుడే నాకు విషయం బోధపడింది. ఆయన నా తండ్రి కాదని చూడగానే తెలిసిపోయింది. రాత్రి గడవదని మీరే చెప్పారు. ఆయనేమో నేను తన కొడుకుననుకుంటున్నాడు. కన్నకొడుకు చెంతనే కన్ను మూసానన్న తృప్తి ఆయనకు మిగలాలని  ఏమీ మాట్లాడకుండా వుండిపోయాను. అది సరే ఈ ఆసుపత్రిలో వర్ధన్ సింగ్ అనే పేషెంటు వుండాలి. ఆయన్ని నేను వెంటనే చూడాలి. ఆయన ఒక్కగానొక్క కొడుకు మొన్న శత్రువులతో పోరాడుతూ వీరమరణం చెందాడు. ఈ కబురు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను.’
యువకుడి మాటలు వింటూనే నర్సు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది.
‘వర్ధన్ సింగా! ఆయన ఎవరో కాదు. కనుమూసేవరకు మీరు కనిపెట్టుకుచూసిన ఆ వృద్ధుడే వర్ధన్ సింగ్’ అంటూ మంచం మీద అచేతనంగా పడివున్న ఆ వృద్ధుడి శవాన్ని చూపించింది. (06-04-2013)   
(చక్కటి ఇంగ్లీష్ కధను పంపిన అజ్ఞాత వ్యక్తులకు – ఇమేజ్ ఓనర్ కు కృతజ్ఞతలతో) 

5, ఏప్రిల్ 2013, శుక్రవారం

తెలుగువారి తొలి పండగ ఉగాది





రుతువులు మారుతుంటాయి...వాటితోపాటే అవి మనకు పంచిచ్చే అనుభూతులూ మారుతుంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది.
శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. పచ్చగా కళకళలాడుతుంటాయి. రుతువుల్లో వసంతం మనోహరమైనదీ ఆహ్లాదకరమైనదీనూ. రుతువుల్లో వసంతరుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలిరుతువుగానూ చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అంటోంది బ్రహ్మపురాణం. అదే యుగాది. అన్నీ తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి తొలిపండగ... ఉగాది!
రామపట్టాభిషేకం జరిగిందీ , శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ , కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలిమాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ , ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్రశుద్ధపాడ్యమినే నూతన సంవత్సర ఆరంభదినంగా కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకుంటారు. సౌరమానాన్ని పాటించే తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, సిక్కులు చేసుకునే ఉగాది కూడా వసంతంలోనే రావడం విశేషం.
ఉగాది పచ్చడి
ఈ పండగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మామిడిపిందెలు, వేపపువ్వు, కొత్తబెల్లం, చింతపండు, పచ్చిమిరప, ఉప్పు వేసి చేసే ఈ పచ్చడిలోని ఆరురుచులూ జీవితంలోని సుఖదుఃఖాలకు ప్రతీకలు. ఈ జీవనతత్త్వం సంగతెలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలేమయినా ఉంటే పోతాయంటోంది ఆయుర్వేదం. వేపపువ్వులో యాంటీసెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. క్రిములనీ చర్మరోగాలనీ నివారించే శక్తీ ఉంది. మామిడిముక్కలు రక్తప్రసరణదోషాలను నివారిస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్తబెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా చూసే పని ఉప్పుది. కొత్తకుండలోనే ఈ పచ్చడిని చేయడంవల్ల అది చల్లగా ఉంటుంది. వీటితోపాటు చెరకుముక్కలు, అరటిపండు... కూడా కలుపుతుంటారు కొందరు.
అయితే ధర్మసింధు వంటి గ్రంథాలు అసలు ఉగాది పచ్చడి ఇది కాదంటాయి.
ఈ పచ్చడిని పూర్వం 'నింబ కుసుమ భక్షణం' అనేవారట. రుతుమార్పు కారణంగా వచ్చే అన్ని ఇబ్బందులూ తొలగిపోవాలంటే ఉగాదిపచ్చడిలో మామిడిచిగురూ, అశోకవృక్షం చిగుళ్లూ కూడా కలపాలట. అందుకే దీన్ని 'అశోక కళికా ప్రాసనం' అనేవారట.
'త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు'
(నేను జీవిత సమస్యలతో బాధపడుతున్నాను. ఓ అశోకమా! ఈ మధుమాసంలో నీవు చిగురించి కళకళలాడుతున్నట్లుగా నా జీవితానికి కూడా సుఖసంతోషాలు కలిగించుమా) అనే మంత్రం చదువుతూ దీన్ని తినాలట. అదీ ఒక్క పండగరోజే కాదు. శ్రీరామనవమి వరకూ అంటే తొమ్మిదిరోజులపాటు తినాలట. కాలక్రమంలో మామిడి చిగుళ్లు పోయి ముక్కలొచ్చాయి.
అయితే ఇప్పటికీ కర్ణాటక వాళ్లయితే 'బేవు బెలాల పేరుతో వేపచిగుళ్లూ బెల్లం కలిపి పచ్చడిలా చేసుకుని తింటారు. మరాఠాలు పచ్చడిలో వేపాకులూ వామూ కూడా కలుపుతారు.
ఉగాది అనగానే గుర్తుకొచ్చే మరో అంశం నూతన వస్త్రధారణ. కొత్త చిగుళ్లతో కళకళలాడే ప్రకృతికాంతను సూచిస్తూ కొత్తదుస్తుల్ని ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అదీ తెలుపురంగు లేదా లేలేతరంగుల్లో ఉండే పలుచని దుస్తులే ఎక్కువగా ధరిస్తారు. వచ్చేది వేసవికాలం కాబట్టి ఆ సమయంలో ధరించడానికి హాయిగా చల్లగా ఉండేందుకు ఎండని గ్రహించని తెలుపురంగు దుస్తుల్నే ముందు జాగ్రత్తగా కుట్టిస్తారన్నమాట.
ఉగాదినాడు విధిగా పంచాంగశ్రవణమూ ఉంటుంది. ఇందులోనూ పరమార్థముంది. ఇది మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దంపట్టే సంప్రదాయం. ఎందుకంటే ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు. ఇందులో ఐదు అంగాలుంటాయి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంలను పంచాంగం అంటారు. ఈ ఏడాది వాతావరణం ఎలా ఉండబోతుందీ ఏయే పంటలు వేస్తే మంచిదీ వంటి విషయాలన్నీ రైతులు ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం పల్లెల్లో ఆనవాయితీగా వస్తోంది.
తెలుగువారు ఉగాది, కన్నడిగులు యుగాది, మహారాష్ట్రీయులు గుడిఫడ్వా, సిక్కులు వైశాఖీ, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, బెంగాలీయులు పొయ్‌లా బైశాఖ్‌... ఇలా ఎవరు ఏ పేరుతో ఉగాది పండగను జరుపుకున్నా అంతటా ఒకటే భావన. అదే... ఆశావహ దృక్పథం... నిన్నటి నిరాశల్ని విడనాడి కొత్త ఆశలతో భవిష్యత్తుని స్వాగతించడం... వసంతం సాక్షిగా!
(తెలుగు పండగలు బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ సౌజన్యంతో)

ఏప్రిల్ ఫూల్



ఇంకా ఏప్రిల్ మాసమే నడుస్తోంది కాబట్టి ఎంచక్కా ఏప్రిల్ ఫస్ట్ – ‘ఆల్ ఫూల్స్  డే’ కబుర్లు కొన్ని- ఆఫ్ కోర్స్ - అందరికీ కాకపోయినా కొందరికి తెలిసినవే అనుకోండి – చెప్పుకోవచ్చు. ఫూల్స్ గురించి ప్రముఖులు కొందరు నుడివిన మాటలు, కొన్ని దేశాల్లో ప్రాచుర్యంలో వున్న సామెతలు ఇవిగో కొన్ని. 


 ‘మనమంతా ఫూల్స్ కి రుణపడి వున్నాం. వాళ్ళే లేకపోతే మన తెలివితేటలు ప్రపంచానికి తెలిసేవి కావు’ – మార్క్ ట్వైన్

‘ఏమయినా చెప్పండి కాని, నాకు మాత్రం ఫూల్స్ అంటే ఎంతో నమ్మకం. అది నాపట్ల నాకున్న విశ్వాసం అని నా స్నేహితులు ఆట పట్టిస్తుంటారు.అది వేరే సంగతి.’ – ఎడ్గార్ అలెన్ పా   

‘తెలివైన వాళ్లకి ఇతరుల సలహాలు అవసరం లేదు. తెలివితక్కువ వాళ్లు ఎవరి సలహాలు తీసుకోరు.’ - బెంజమిన్ ఫ్రాంక్లిన్  

‘నిజమైన హాస్య ప్రియులు జోకులు వేయరు. ఇతరుల జోకులను హాయిగా ఆస్వాదిస్తారు. - మాక్స్ ఈస్ట్ మన్

‘నాకెందుకో నా తెలివితేటలపట్ల నాకు అపారమైన నమ్మకం. అంత తెలివికలవాడిని కావడం వల్లనో యేమో ఒక్కోసారి నా మాటలు నాకే అర్ధం కావు’ – ఆస్కార్ వైల్డ్  

‘పందులకు పనసపండు  ముక్కలు పెట్టకు. బుద్ధి వుంటే బుద్ధిహీనులకు ఎప్పుడూ  సలహాలు ఇవ్వకు’ – ఐరిష్ సామెత  

‘తెలివితక్కువవాళ్ళతో కూర్చుని నవ్వడం కంటే తెలివైన వాళ్ళతో కలసి ఏడవడం మంచిది’ – స్పెయిన్ నానుడి     

‘నన్నొకసారి ఫూల్ ని చేసావనుకో అది నీకు అవమానం. మళ్ళీమళ్ళీ మరోమారు ఫూల్ ని చేసావనుకో అది నాకు అవమానం.’ – చైనా సామెత

NOTE: Courtesy Image Owner

4, ఏప్రిల్ 2013, గురువారం

తిరగేసిన తాతా మనుమడు కధ






న్యూ యార్క్ లో హడావిడిగా ఆఫీసుకు వెడుతున్న సమయంలో ఫోను మోగింది. నెంబరు చూస్తే ఇండియాది. తండ్రి మాధవయ్య నుంచి. ‘హలో’ అన్నాడు ఆనంద్ కారు డ్రైవ్ చేస్తూనే.
తండ్రి రెండే ముక్కలు మాట్లాడి ఫోను పెట్టేసాడు.  ఆనంద్ ఆందోళనగా బోస్టన్ లో వున్న తన అన్నతో  కనెక్ట్  అయ్యాడు. ఆ కాల్ కోసమే ఎదురుచూస్తున్నట్టుగా వున్నాడేమో  తమ్ముడితో అన్నాడు - ‘నాన్న నీకూ కాల్  చేసాడా? అంతా చెప్పాడా’.
‘అంతా ఏముంది. అంతా రెండు ముక్కల్లో చెప్పాడు. అమ్మకు విడాకులిస్తాడట. రేపే లాయర్ను కలుస్తాడట.  ఇండియాలో ఇదేం పొయ్యే  కాలం? ఇక్కడంటే డైవర్సులు  మామూలు. అయినా నలభై ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడీ వయస్సులో ఇవేం బుద్ధులు?’
‘సరే! ఇప్పుడేమి చేద్దాం’
‘చేసేది ఏవుంది. రేపే బయలుదేరి హైదరాబాదు వెడదాం. నాతో పాటు నీకు కూడా ఫ్లయిట్  టిక్కెట్లు బుక్ చేసాను. ఆ విషయం చెబుదాం అనుకుంటువుండగానే నువ్వే కాల్ చేసావు”
‘సరే రేపే వెడదాం! ఆ సంగతి నాన్నకు ఫోను చేసి ఇప్పుడే చెప్పేసెయ్. మేము ఇద్దరం వస్తున్నాం వచ్చేదాకా విడాకులు, లాయరు అంటూ హడావిడి చేయొద్దు’ అని నాన్నకు గట్టిగా  చెప్పు’
కట్ చేస్తే ఇక్కడ ఇండియాలో మాధవయ్య భార్యతో అంటున్నాడు.
‘పదేళ్లయింది పిల్లల్ని చూసి అని  నువ్వేం బెంగ  పడకు. ఎల్లుండి తెల్లారేకల్లా పిల్లలిద్దరూ మన కళ్ళ ముందు వుంటారు.’   
(ఇంగ్లీష్ వ్యాసదాతలకు, ఇమేజ్ ఓనర్ కు  షరా మామూలు కృతజ్ఞతలు)

2, ఏప్రిల్ 2013, మంగళవారం

డేరింగ్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి !!??!!



కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తరువాత త్వరితగతిన  నిర్ణయాలు తీసుకోవడంలో  విఫలం అవుతున్నారన్నది ఆయన్ని సమర్ధించేవారు కూడా  చేస్తూవస్తున్న ప్రధాన విమర్శ.  కిరణ్  ఎక్కువగా అధికార గణం మీదనే ఆధారపడతారని, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంత్రివర్గ సహచరులను కూడా విశ్వాసం లోకి తీసుకోరని సొంత పార్టీ నాయకులే చెణుకులు విసురుతుంటారు.  సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన లోగుట్టు మనిషి అనే పేరు.   రేడియో, దూరదర్శన్ విలేకరిగా పనిచేసే రోజుల్లో  మిగిలిన కాంగ్రెస్ నాయకులలాగానే ఆయన కూడా నాకు    బాగా తెలిసిన మనిషే. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా ప్రెస్  గ్యాలరీ పాసులను నియంత్రిస్తూ  ధైర్యంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, మూడు దశాబ్దాలకు పైగా నాకున్న అసెంబ్లీ ప్రెస్ పాసు రద్దయినా కూడా   నేను ఆయన నిర్ణయాన్ని స్వాగతించాను. అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ పాసు అంటే ఆషామాషీ కాదనీ, పరిమిత సంఖ్యలో పాసులను  ఇవ్వడం వల్ల వాటికి వుండే   గౌరవం, విలువలను మరింత పెంచినట్టు  అవుతుందని  భావించి  కిరణ్ కుమార్ రెడ్డి  తీసుకున్న ఆ నిర్ణయం వల్ల పదవీ విరమణ చేసిన మా బోటివారికి ఆ ప్రివిలేజ్ లేకుండాపోయిన మాట నిజమే. అయినా కూడా  స్పీకర్  మంచి పనే చేసారని అభిప్రాయపడ్డ జర్నలిస్టులలో నేనొకడిని.

ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి నేను  క్రియాశీలక పాత్రికేయ  వృత్తి నుంచి తప్పుకోవడంవల్ల  ముఖ్యమంత్రి  వ్యవహార శైలిని గతంలో మాదిరిగా దగ్గరనుంచి పరిశీలించే అవకాశం నాకు  లేకుండాపోయింది. కాకపొతే, పైవేట్ టీవీ ఛానళ్ళ పుణ్యమాఅని జర్నలిజం రంగంతో నా సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది. ఆ రీత్యా   ఎప్పటికప్పుడు ఆయన పరిపాలన గురించి బేరీజు వేసుకోవాల్సిన అవసరం, వేసుకోగలిగిన అవకాశం నాకు లభించాయి.
ఆయన ముఖ్యమంత్రి అయిన ఇన్నేళ్ళకు డేరింగ్ చీఫ్ మినిస్టర్ అని కితాబు ఇవ్వడానికి సరయిన ప్రాతిపదిక కరెంటు చార్జీల పెంపు రూపంలో నాకు కనబడింది.
నిజమే, పవర్ చార్జీలను ఆయన తప్ప ఇంత భారీ స్థాయిలో ఒకేసారి  పెంచగల ధైర్యం ఏ రాజకీయ నాయకుడికి  వుంటుంది?  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సయితం ఇంతటి సాహసోపేత నిర్ణయానికి పూనుకుని వుండేవారు కాదేమో.
రెండేళ్లుగా ముఖ్యమంత్రి ఆధారపడుతూ వచ్చిన అధికారులు కూడా ఒకే తడవ ఇంత భారీగా పెంచే ప్రతిపాదనలు సమర్పించలేదనీ, ఇప్పుడు కాకపొతే (వచ్చే ఏడాదికి ఎన్నికలు ముంగిట్లోకి వస్తాయి కాబట్టి) మరెప్పుడూ పెంచే అవకాశం ప్రభుత్వానికి దొరకదనీ (నౌ ఆర్ నెవ్వర్) వాదించి కిరణ్ కుమార్ రెడ్డే పూనుకుని ‘వడ్డన’ పరిమాణాన్ని బాగా పెంచమని అధికారులకు  సలహా ఇచ్చారని ముఖ్యమంత్రి అనుకూల మీడియా కూడా కోడై కూసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆయన  తరహా చూస్తుంటే వెనక్కు తగ్గే సూచనలు కానరావడం లేదు.
వాస్తవానికి కాంగ్రెస్ ఈ నాడు అధికారంలో వున్నదంటే అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఈ అంశం కూడా. నాడు తెలుగుదేశం పార్టీ  సంస్కరణల పేరుతొ విద్యుత్ చార్జీలను పెంచడం అనేది  ఆనాడు ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీకి బాగా కలసి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత , ‘పవర్ డిస్కం’ ల ఆర్ధిక పరిస్తితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంతి కిరణ్ కుమార్ రెడ్డి ‘హరాకిరీ’ వంటి ఆత్మహత్యాసదృశ్య నిర్ణయాన్ని తీసుకోగలిగారంటే నిజంగా ఆయన డేరింగ్ చీఫ్ మినిస్టరే. డేర్ డెవిల్ చీఫ్ మినిస్టరే.
గతంలో వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ప్రజలపై పడే భారాన్ని లెక్కచేయకుండా  ఆయన రాష్ట్ర ఖజానా సంక్షేమానికే పెద్ద పీట వేశారన్న పెద్ద అపవాదు మోశారు.
రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ, 104, 108,  ఫీజు రీయింబర్సుమెంటు వంటి వోట్ల గుడ్లు పెట్టే  అనేక సంక్షేమ   పధకాలను అధికారుల మాట విని అటకెక్కించే ప్రయత్నం చేయడం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి ఇంత దిగజారిందని, తెలుగుదేశం వారు కూడా విమర్శించడానికి సంకోచించిన ఆరోగ్య శ్రీ పధకాన్ని అధికారగణం సలహా మేరకు   ప్రభుత్వ నిధులను  ఆచి తూచి ఖర్చు పెట్టే విధానానికే  పచ్చ జెండా వూపి, పార్టీకి పుట్టగతులు లేకుండా చేసారని సొంత పార్టీ నుంచే విమర్శలను ఎదుర్కోవడానికి చాలా తెగువ కావాలి. అది తనలో పుష్కలంగా వుందని  కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించారు.    
భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, మద్యం పన్నులు కూడా కిరణ్ హయాం లోనే ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కాకపొతే అవి కలిగినోళ్ల వ్యవహారాలు కనుక ప్రజల్లో అత్యధికులు పట్టించుకునే అవకాశం వుండదు.
కానీ, కరెంటు చార్జీల సంగతి అలా కాదు. ఈ మంట రాజుకోవడం చాలా తేలిక. ఈ అగ్నికి ఆజ్యం పోసేవాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఆ రకమయిన విభీషణులకు కాంగ్రెస్ పార్టీలో కొదవ వుంటుందని అనుకోలేము.
ఇంకో  ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని ఇలా ధైర్యం చేసి నిర్ణయాలు తీసుకోవడం ఆషామాషీ కాదు. అయినా ధైర్యం చేస్తున్నారంటే ఏమిటి అర్ధం?
రెండు రకాల రాజకీయ నాయకులే ఈ రకమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఒకరు – రాజనీతిజ్ఞులు. వీళ్ళు రేపు గురించి భయపడరు. పదేళ్ళ తరువాత పరిస్థితులు గురించి ఆలోచిస్తారు. దేశం, దేశ భవితవ్యమే వీరికి ముఖ్యం. వోట్లు, సీట్లు, అధికారం కాదు.
ఆ విధంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం ఆహ్వానించదగిందే.
మరో రకం – వీరికి రేపు అనేదే లేదు.  తనని నమ్ముకుని బాధ్యత అప్పగించిన పార్టీని ఎన్నికల రేవు దాటించి అధికార తీరం చేర్చాల్సిన అవసరం ఇలాటి వారికి వుండదు. తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగే పదవులు వీరివి. అటువంటప్పుడు ఇలా తెగించి నిర్ణయాలు తీసుకోవడానికి అడ్డేమివుంటుంది?
మరి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రెండింటిలో ఏ రకం.
కాలమే జవాబు చెప్పాలి. (02-04-2013)

వినదగునెవ్వరు చెప్పిన -10



నీళ్ళకు కటకటగా వున్నప్పుడే వాటి  విలువ పెరుగుతుంది. అలాగే పొదుపుగా వాడే మాటలకు కూడా.
నీళ్ళు  వరదగా మారి  వూళ్ళపై విరుచుకు పడితే  వినాశనకారకమవుతాయి.
మాటలు కూడా అంతే. ఒక స్థాయి దాటితే, అవి మంచి  చేయవు. 


COURTESY:IMAGE OWNER

వాళ్ళనే ‘గొప్పవాళ్ళు’ అని యెందుకు అంటామంటే?



మహాత్మా గాంధి జైల్లో వున్నప్పుడు కస్తూరి బా, ఆయన్ని  చూడడానికి వెళ్లారు.


భార్యాభర్తలకు మాట్లాడుకునే ఏకాంతం కల్పించాలనే  సదుద్దేశ్యంతో జైలు సార్జంటు వారిని  వొంటరిగా వొదిలేసి ఓ అరగంటసేపు బయటకు వెళ్లాడు. కస్తూరి బా వెళ్ళిన తరువాత ‘భార్య యోగక్షేమాలు అడిగారా, కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారా ? వాళ్ళెలా వున్నారు?’ అంటూ  యధాలాపంగా గాంధీని అడిగాడు. ఆయన ఇచ్చిన సమాధానం ఆ బ్రిటిష్ అధికారిని నివ్వెర పరచింది.
‘జైల్లో వున్నప్పుడు ఇక్కడి నియమాలను పాటించి తీరాలి. జైలు సిబ్బంది పరోక్షంలో సొంతమనుషుల వద్ద కూడా నోరు విప్పకూడదని నాకు తెలుసు. అందుకే మీరు వెళ్ళి తిరిగివచ్చేదాకా మా ఆవిడతో నేను ఏవీ మాట్లాడకుండా మౌనం పాటించాను’
గాంధీ ఇంకా ఇలా అన్నారు.
‘మీరు బయటకు వెళ్ళకుండా వుండి వుంటే నేను నా భార్యతో ఏవయినా సంగతులు ముచ్చటించి వుండేవాడినేమో. మీరు లేకపోవడంతో నాకు ఆ అవకాశం లేకుండా పోయింది’
సార్జంటుకు నోటమాట రాలేదు. నెత్తి మీది టోపీ తీసి గాంధీకి వొంగి నమస్కారం చేసిన సంగతి కూడా వేరుగా  చెప్పేపనిలేదు. 
ఆయన అందుకే మహాత్ముడు అయ్యాడు.

(From some classic english narrations of Shri AS Murthy, Dy. Director, Ramakrishna Math during his speech  at TTD Tiru Nilayam Hyderabad, on 28.3.2013.)

1, ఏప్రిల్ 2013, సోమవారం

అమరం అమరం అమరం – మన వీరుల చరిత అమరం




కొన్ని వీరోచిత గాధలు  వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. మరి కొన్ని అవి యెంత పాత కాలానికి చెందినవైనా సరే తలచుకున్న మాత్రంలోనే  సరికొత్తగా జనాలను ఉత్తేజపరుస్తుంటాయి.
ఈ ప్రస్తావనకు నేపధ్యం 1962 నాటి భారత చైనా యుద్ధం. దేశానికి ఉత్తరాన హిమాలయాల్లో  16000  అడుగుల ఎత్తునవున్న రెజాంగ్ లా కనుమలో,  ఎముకలు కొరికే చలిలో కుమాన్ బెటాలియన్ సరిహద్దుల్ని  కాపుకాస్తోంది. నిండా నూటపాతిక మంది కూడా లేని ఆ భారత సైనికదళంలోని జవానులందరూ ఆహిర్లు. ఆహిర్లు జన్మతః వీరులు. వెన్ను చూపి పారిపోయే రకం కాదు. అందుకే ఆహిర్లను  చూడగానే శత్రువులవొంట్లో ఆవిర్లు పుడతాయని  చెప్పుకునేవారు.


(రెజాంగ్ లా  యుద్ధరంగం - చిత్రకారుడి వూహాచిత్రం)

 ఈ దళానికి వీరికి జోద్ పూర్ కు చెందిన  రాజ్ పుట్ వీరుడు మేజర్ షితాన్ సింగ్ కమాండర్ గా వున్నాడు. దళపతి గట్టివాడే కాని, నాటి వాతావరణమే అత్యంత దుర్భరంగా వుంది. అందుకుతగ్గ వసతులు ఏమీ లేవు. నిజానికి ఆ పరిస్థితుల్లో ప్రాణాలు నిలుపుకోవడానికే ఎన్నో సదుపాయాలు అవసరం. అవేవీ  వారికి లేవు. కేవలం   ప్రాణాలు వొడ్డి పోరాడడానికి అవసరమయ్యే  చెక్కుచెదరని  మనోధైర్యం, ఆత్మ విశ్వాసం మాత్రమే వారివద్ద పుష్కలంగా   వున్నాయని  ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైమ్  మేగజైన్ రాసిందంటే  ఆ  వీర సైనికులకు అంతకంటే  చక్కటి కితాబు ఏం కావాలి?
123 మంది ఆహిర్లు వున్న ఆ దళానికి పై అధికారులనుంచి  ఒక ఆదేశంలాటి సందేశం అందింది.  'మీరు ఏమైనా చేయండి. చుషూల్ పట్టణం మాత్రం చైనా సైనికుల పరం కాకుండా చూడండి.'
అటేమో పరాయి సైన్యం  పూర్తి సమాయత్తంగా వచ్చింది.  భారత సైన్యం  వారికి సరితూగే పరిస్తితిలో  లేదు. శత్రు సైనికులు ఒకరి యాభయ్ మంది చొప్పున వున్నారు. సంఖ్యాపరంగా అంత తేడా వుంది. వారి ఆయుధాలు కూడా అత్యంత ఆధునిక మైనవి. వారికి వెనుకనుంచి  దన్నుగా అందే ఇతర సహాయాలు, తోడ్పాటు విషయంలో కూడా వాళ్లు  భారత సైనికులకంటే ఎన్నో రెట్లు  మెరుగ్గా వున్నారు.
నవంబర్, 18, ఆదివారం. చైనా సైన్యం ఒక్కుమ్మడిగా  భారత సైనిక స్థావరం పై విరుచుకుపడింది.
భారత సైన్యం వారిని ఎదురొడ్డి నిలచింది. ఒకరు పోతే మరొకరు అన్నట్టు చైనా సైనికులు నేల ఈనినట్టు పుట్టుకువస్తున్నారు. వారిని  నిలవరించడం భారత సైన్యానికి తలకు మించిన భారంగా పరిణమించింది. కమాండర్ మేజర్ షితాన్ తన సైనికులను ఉత్సాహపరుస్తూ ఒకచోటి నుంచి మరో చోటికి వేగంగా కదులుతూ తన జవానులకు వెన్నుదన్నుగా నిలిచాడు. శత్రువులు మాత్రం  మిడతల దండు మాదిరిగా వస్తూనే వున్నారు. భారత సైనికులు స్థైర్యం కోల్పోకుండా ఎదురు నిలుస్తూనే వున్నారు. ఇంతలో శత్రు సైన్యం భారత  కమాండర్ పైనే నేరుగా కాల్పులు జరిపింది. ఒక తూటా షితాన్  భుజంలోకి దూసుకుపోయింది. మరోటి నేరుగా పొట్టలో దిగబడింది. అయినా ఆ వీరుడు వెన్ను చూపలేదు. సరికదా శత్రుసైన్యంపై  కాల్పులు జరుపుతూనే పోయాడు. నిమిష నిమిషానికీ రక్త స్రావం అధికం అవుతోంది. శరీరం సహకరించడం లేదు. అయినా ఆ వీరుడు మడమ చూపలేదు. ప్రాణాలతో మిగిలిన కొందరు బారత జవాన్లు అతడిని చేతులమీద వేసుకుని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి కాపాడాలని ప్రయత్నించారు. కానీ షితాన్ సింగ్  పడనివ్వలేదు. ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా శత్రు సైన్యాన్ని మట్టుపెట్టాలనే తుదివరకు పోరాడాడు. ఆ పోరాటంలో రక్తస్రావం అధికం అయి యుద్ధరంగంలోనే అతడు వీరమరణం పొందాడు. భారత ప్రభుత్వం షితాన్ సింగ్ ధైర్యసాహసాలకు గుర్తింపుగా మరణానంతర  పరమ వీర చక్ర పురస్కారం ప్రదానం చేసి గౌరవించింది.
కుమాన్  దళంలోని 123 మందిలో అనేకమంది వీరోచితంగా పోరాడి అసువులుబాసారు. ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రతి   భారత సైనికుడు  కనీసం అయిదుమంది శత్రువులను మట్టుబెట్టిన తరువాతనే  నేలకొరగడం జరిగింది.
నాటియుద్ధం యెంత భయంకరంగా సాగిందన్నది తరువాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన తరువాత కాని అధికారులకు బోధపడలేదు. ఆ దృశ్యాలు కడు దయనీయంగా వున్నాయి. కందకాల్లో కానవచ్చిన మృత సైనికుల చేతుల్లో గురిపెట్టిన తుపాకులు కడవరకు వారు పోరాడిన తీరుకు సజీవ సాక్ష్యంగా వున్నాయి. కొందరి దేహాలు శత్రు సైనికుల కర్కశ దాడికి గురై  చిద్రమై కానవచ్చాయి. వారి చేతుల్లో తుపాకులు మాత్రం అలాగే వున్నాయి. భారత సైనిక  దళంలోని ప్రతి ఒక్కడూ వీరమరణాన్ని ఆహ్వానించాడే కానీ ప్రాణాలు దక్కించుకోవాలని ఎంతమాత్రం ప్రయత్నించలేదు. శత్రువుల దాడికి ఖండ ఖండాలుగా మారిన వారి శరీర భాగాలు అక్కడి కందకాల్లో పడివున్నాయి. తూటాలతో వారి శరీరాలు చిల్లులు పడిపోయాయి. ఒక సైనికుడి చేతిలో విసరడానికి సిద్ధంగా  వుంచుకున్న  బాంబు కనిపించింది. కానీ అతడిలో ప్రాణం మాత్రం లేదు.  చైనా సైనికుడి తుపాకీ తూటాకు బలైన మరో భారత మెడికల్  ఆర్డర్లీ చేతిలో సిరంజి, బ్యాండేజీ కనిపించాయి. ఒక డజను మందికి పైగా ఆహిర్ల శవాలు వారి స్థావరాలకు దూరంగా కానవచ్చాయి. అంటే  సైనికులను తరుముతూ వారు అంత దూరం వెళ్లారన్నమాట.
ఈ యుద్ధంలో చనిపోయిన ఒక ఆహిర్  హర్యానాలోని కోస్లి గ్రామం నుంచి వచ్చాడు. ఈ గ్రామానికి  ఒక ప్రత్యేకత వుంది. ఆహిర్ల ధైర్య సాహసాలకు, పోరాట స్పూర్తికి   ఈ గ్రామమే   ప్రత్యక్ష ఉదాహరణ. రెండో ప్రపంచ యుద్ధకాలం నుంచి ఈ నాటి వరకు  ఈ వూరిలోని ప్రతి కుటుంబం సైన్యంలోకి ఒకరిని పంపుతూనే వస్తోంది. ఈ చిన్న గ్రామంలో భారత సైన్యానికి చెందిన 106  మంది అధికార్లు, 500 మంది జవాన్లు ఈనాటికి కూడా పనిచేస్తున్నారంటే ఈ గ్రామం విశిష్టత అర్ధం చేసుకోవచ్చు.
ఆహిర్ జిందాబాద్ !
సెహభాష్ కోస్లి !
Note: Courtesy Artiste of the picture.

31, మార్చి 2013, ఆదివారం

వినదగునెవ్వరు చెప్పిన....9



“కాలం కలసివచ్చినప్పుడు మనం చేసే పొరబాట్లను కూడా జనం తేలిగ్గా తీసుకుంటారు. టైం బాలేకపోతే జోకువేసినా అది మేకై కూర్చుంటుంది.”




NOTE : COURTESY IMAGE OWNER

30, మార్చి 2013, శనివారం

వినదగునెవ్వరు చెప్పిన ....... 8




“మీరు  చేయలేని పని ఇతరులు ఎలాచేస్తారు అన్నదానిపై దృష్టి పెట్టడం దండుగ. ఇతరులు చేయలేనిపని  మీరు  యెలా చెయ్యగలరు  అన్నదాని గురించి ఆలోచించిననాడు విజయాలు మీ సొంతం అవుతాయి.”

Courtesy Image Owner