"విత్ మి ఆర్ విత్ మై ఎన్మీ" లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
"విత్ మి ఆర్ విత్ మై ఎన్మీ" లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఆగస్టు 2014, బుధవారం

"విత్ మి ఆర్ విత్ మై ఎన్మీ"


"వుంటే నాతొ వుండు, లేదా నా శత్రువుతో వుండు" అని అర్ధం వచ్చే ఈ మాట అన్నది ఒక అమెరికన్ ప్రెసిడెంటు. పేరు గుర్తుకు రావడం లేదు.
"వుంటే నాతో వుండు. పోతే నీ దేశం పోరా" అనే సినిమా పాట అప్పుడప్పుడూ వినబడుతూ వుంటుంది.  ఏ సినిమాలోదో, ఎవరు రాశారో అదీ గుర్తులేదు.
ఇప్పుడవి గుర్తుకువచ్చిన సందర్భం మాత్రం గుర్తుంది.
ప్రతిరోజూ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల నడుమ సాగుతున్న మాటల యుద్ధం గమనిస్తూ, వాటిని గురించి విశ్లేషణ చేసే సందర్భంలో మహా విసుగు వస్తోంది. ఈ రెండు ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తుల సముఖంలో ఇలాటి చర్చ జరిగినప్పుడు మరీ ఇబ్బందిగా వుంటోంది. ఏ విషయానికయినా బొమ్మా బొరుసూ మాదిరిగా 'మంచీ చెడూ' అనే రెండు పార్శ్వాలు వుంటాయి. పీపీయేలు, ఫీజు రీఇమ్బర్స్ మెంట్లు,  సర్వే ముచ్చట్లు ఏది తీసుకున్నాఈ విషయంలో  'మాదే రైటు' అనే మొండి ధోరణి తప్ప ఒక అంగుళం దిగివచ్చి మంచేదో చెడేదో మాట్లాడుకుందాం అన్న ధోరణి కానరావడం లేదు. ఏ విధానం అయినా, ఏ ప్రణాళిక అయినా నూటికి నూరు శాతం కరక్టుగా వుండే అవకాశం  వుండదు. మొత్తం మీద బాగున్నా ఏవో కొన్ని లోటుపాట్లు వుండడం సహజం. కానీ, ఒక్క చిన్న విషయంలో  కూడా అవతలవాళ్ళు చెప్పింది అంగీకరించడానికి ఇవతలవాళ్ళు సిద్ధంగా వుండరు.  వాళ్ల నాయకుల విధానాలను సమర్ధించుకుంటూ పోవాలనే ఏకైక లక్ష్యం ఒక్కటే కనబడుతుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఇంత గుడ్డిగా సమర్ధించుకుంటూ పోవడం ఏమేరకు మేలు చేస్తుందో అర్ధం కావడం లేదు. పార్టీలతో ప్రమేయం లేని వ్యక్తులు కూడా వుంటారని వాళ్లు మరచిపోతున్నారు. చాలా దురదృష్టకరం.


అనేక విషయాల్లో విబెదిస్తున్న అటూ ఇటూ నాయకుల వరస ఒక విషయంలో మాత్రం ఒకే విధంగా వుంది.
'మధ్యే మార్గం వద్దు. వుంటే నాతో వుండు. లేదా శత్రువుతో వుండు'
మరి నాయకుల్నిబట్టే వారి అనుచరులు.
దీనికి ముక్తాయింపు అన్నట్టుగా పక్కన  టీవీలో తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడుతుంటే వారి పార్టీ సభ్యులు గుడ్డిగా బల్లలు చరుస్తున్న దృశ్యం కనబడుతోంది.      

NOTE: Courtesy Image Owner