16, ఏప్రిల్ 2025, బుధవారం

అమ్మ చనిపోయింది – భండారు శ్రీనివాసరావు

 మా అమ్మ కడుపున పుట్టినా,  నేను పెరిగింది మా వదిన భండారు సరోజినీ దేవి దగ్గర.  నన్ను పెంచింది మా పెద్ద వదినే. నా  హైస్కూలు, కాలేజి చదువులు మా అన్నయ్య ఇంట్లోనే.

ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత వెన్నెముకకి సంబంధించిన  వ్యాధితో బాధ పడ్డాను. కింద చాప మీద వెల్లకిలా పడుకునే వుండాలి. ఏమాత్రం అటుఇటు ఒత్తిగిల్లినా ప్రాణం పోతున్నంత బాధ. అప్పుడు అన్నం ముద్దలు తినిపించింది మా వదినే. వేళకు మందులు వేసేది. అంతెందుకు బెడ్ పాన్ కూడా ఆమే పెట్టేది. కన్నతల్లి చేసే సేవలు మా వదిన చేసింది. ఆమె రుణం ఎన్ని జన్మలకు తీరనిది.

85 వ ఏట ఆమె రాత్రి నిద్రలోనే పోయింది.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు గారు   రిటైర్ అయిన తర్వాత, పుట్టపర్తిలో ఒకే ఒక గదిలో వుండేవాళ్ళు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం నడుచుకుంటూ భజనలకు వెళ్ళేవాళ్ళు. రెండు అడుగులు ముందు అన్నయ్య. ఆయన వెనుకనే అడుగులో అడుగు వేసుకుంటూ మా వదిన. ఎక్కడికి అని అడిగేది కాదు. ఆయన వెంట నడవడమే ఆమెకు తెలిసింది.

ముందు ఆయన పోయాడు. ఇప్పుడు ఆయన వెనుకనే వదిన.

ఇప్పుడే హైదరాబాదు మహాప్రస్థానంలో వదినగారి అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి చేరాము.

ఓం శాంతి!



(16-04-2025)

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అమెలాంటి సాధ్వీమణికి పునిస్త్రీ మరణం లభిస్తే సముచితంగా ఉండేదేమో ? సరే, ఇవేవీ మన చేతుల్లో లేని విషయాలు కదా.

మీకందరకూ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

దివంగత ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను 🙏.

అజ్ఞాత చెప్పారు...

Om Santi... ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని ఆశిస్తూ ..

Zilebi చెప్పారు...

ఆవిడ ఆత్మకు శాంతి కలుగుగాక

అజ్ఞాత చెప్పారు...

మీ వదిన గారికి సద్గతి ప్రాప్తిరస్తు.