20, ఆగస్టు 2021, శుక్రవారం

పాపం సీబీఐ – భండారు శ్రీనివాసరావు

 గుర్తుంది కదా! కొన్నేళ్ళ క్రితం ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు.

ఓ పదేళ్ళు వెనక్కి వెడదాం.

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదులో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న మోడీ ఏమన్నారో చూడండి.

సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’

మళ్ళీ ఓసారి వెనక్కి వెడదాం!

2013. సుప్రీం కోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.

జస్టిస్ ఆర్. ఎం. లోధా గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.

సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’

కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.

అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో మంచి ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

కొన్నేళ్ళ క్రితం సీబీఐ గురించి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.

ఉత్తరప్రదేశ్ లోని సిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా చెప్పారు. ‘సమాజ్ వాది, బిఎస్ పి లను అదుపు చేయడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. దాని పేరే సీబీఐ’.

మరిప్పుడు మద్రాస్ హైకోర్ట్ మధురై బెంచ్, సీబీఐ పంజరంలో చిలక అంటూ వ్యాఖ్యానించింది. ఆ చిలకను పంజరం నుంచి విడిపించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది.

దీనిపై మళ్ళీ చర్చలు.

జరిగేది ఏమీ వుండదు అనడానికి పై ఉదంతాలే రుజువు.

(20-08-2021)

కామెంట్‌లు లేవు: