28, ఆగస్టు 2021, శనివారం

రేడియో అభిమాని – భండారు శ్రీనివాసరావు

 

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అనేది ప్రసార భారతిలో కొత్తగా చేరి పనిచేసేవారికి ఒక అధికారి పేరు. కానీ సంగీత పరిజ్ఞానం కొద్దో గొప్పో వున్నవారికి మాత్రం ఆయన ఒక సంగీత కారుడు. రేడియో అంటే సంగీతం అనుకునేవారు ఇలాటి అధికారులు రావాలని. వుండాలని కోరుకుంటారు. కాని ప్రసాద్ గారు మాత్రం రేడియో శ్రోతల సంఖ్య పెరగాలని కోరుకుంటూ వుంటారు. సందర్భం దొరికినప్పుడల్లా సమయం చూసుకుని తన మనసులోని మాటని బయట పెడుతుంటారు.


(మంగళగిరి ఆదిత్య ప్రసాద్)




కొన్నేళ్ళ క్రితం మంగళగిరి ఆదిత్య ప్రసాద్ రేడియో స్టేషన్ ఉత్తరాదికారిగా పనిచేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఆయన్ని "ఇప్పడు రేడియోలు ఎక్కడ దొరుకున్నాయండీ" అడుగుతుండేవారు. దానికి జవాబు ఆయన వద్ద సిద్ధంగా వుంటుంది. కాకపొతే మాటల రూపంలో కాదు, చేతల రూపంలో. అలా అడిగినవారికి ఒక చిన్న సైజు ట్రాన్సిస్టర్ రేడియో ఇచ్చి 'రేడియో దొరికింది కదా! ఇక వినండ'ని అంటుంటారని ఆయన గురించి మెచ్చుకోలుగా చెప్పుకునే ఒక జోకు ప్రచారంలో వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిత్య ప్రసాద్ గారు రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ గారెని మర్యాదపూర్వకంగా  కలుసుకున్నప్పుడు ఏకంగా వారికి ఒక బుల్లి రేడియో కానుకగా ఇచ్చారట. దాన్ని స్వీకరించిన గవర్నర్ ఎంతగానో సంతోషించారట.  కొన్నేళ్ళ క్రితం హైదరాబాదు ఆకాశవాణి ప్రాంగణంలో డాక్టర్  ఆర్. ఏ. పద్మనాభరావు గారు రచించిన 'అలనాటి ఆకాశవాణి' పుస్తక ఆవిష్కరణ సభలో ఆయనే ఈ విషయాన్ని మర్యాదకు భంగం కలగని రీతిలో చాలా మన్ననగా ప్రస్తావించారు. 'రేడియో ప్రచార సభ' ఆలోచన కూడా వారిదే.

రేడియో శ్రోతల సంఖ్య పెరగాలన్న ఆదిత్య ప్రసాద్ గారి కోరిక నెరవేరాలని కోరుకుందాం.

అయితే అదే సభలో సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  కేవీ రమణాచారి గారు చెప్పినట్టు 'హాయ్ ఓయ్ రేయ్' అంటూ చెలరేగిపోయే మిర్చీ బజ్జీ శ్రోతలు కాదు. మంచి సంగీతాన్ని, మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి శ్రోతల సంఖ్య పెరగాలి. అందుకు నాందిగా ఆదిత్య ప్రసాద్ గారి మాదిరిగా ఒకరికొకరు చిన్న చిన్న రేడియోలు చిరుకానుకలుగా ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం రావాలి.

కామెంట్‌లు లేవు: