20, ఏప్రిల్ 2020, సోమవారం

“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....



“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా...” అంటూ రెండుసార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రేడియో విలేకరిగా నేను ప్రత్యక్ష సాక్షిని. మూడోమారు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేనాటికి నేను యాక్టివ్ జర్నలిజంలో లేను.
ఏప్రిల్ ఇరవై చంద్రబాబునాయుడు పుట్టిన రోజు. ఊహకు అందని రాజకీయ పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడెనిమిది మాసాలకు ఆయన పుట్టిన రోజు వచ్చింది. ముఖ్యమంత్రి జన్మదినం అంటే చాలా హడావిడి వుంటుంది. కానీ అప్పటికి ఎన్టీఆర్ మరణించి మూడు మాసాలే అయింది. ఆ పరిస్తితిలో వేడుకలు సంభావ్యం కావని భావించి, తనకు శుభాకాంక్షలు చెప్పదలచుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పుష్ప గుచ్చాలతో హడావిడి చేయవద్దని చంద్రబాబు ముందస్తుగానే ప్రజలకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసారు. సాధారణంగా నాయకులు చేసే ఈ నిరాడంబర వినతులను అభిమానులు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోరు. దానితో తరువాతి సంవత్సరాలలో అయన మరో పద్దతిని ఎంచుకున్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుని ఇంట్లో లేకుండా ఆ రోజున ప్రజల నడుమ గడపడం.
అధికారంలో లేని కాలంలో కూడా పుట్టిన రోజులు ఆయనకు కొత్తకాదు. కాకపొతే ఈ సారి కరోనా లాక్ డౌన్ నడుమ ఈ ఏడాది పుట్టిన రోజు రావడం ఆయనకీ, అభిమానులకి ఒక కొత్త అనుభవం.
ఒక తరానికి చెందిన రాజకీయ నాయకులు అందరితో పోలిస్తే చంద్రబాబు అదృష్టవంతులయిన రాజకీయులలో మొదటి స్థానంలో నిలుస్తారు. అత్యంత పిన్న వయసులో మంత్రి అయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలిగారు.
ముందే చెప్పినట్టు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాస్తున్న వ్యాసం ఇది. దీన్ని గమనంలో వుంచుకుంటే రాజకీయంగా ఆయనతో విబేధించేవారికి అనవసరమైన అనుమానాలు కలగవు. గత నలభయ్ ఏళ్ళకు పైగా ఆయనతో వృత్తిపరంగా పెంచుకున్న సాన్నిహిత్యం కారణంగా తెలియవచ్చిన కొన్ని సంఘటనలు ఒక చోట గుదిగుచ్చి, వాటి ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని బేరీజు వేసుకునే అవకాశాన్ని పాఠకులకే వదిలిపెడుతున్నాను.
బ్రహ్మాండమయిన ప్రజాకర్షణ, అద్భుతమైన ప్రసంగ పాటవం కలిగిన ఎన్టీ రామారావుని త్రోసిరాజని అధికార పీఠం ఎక్కిన చంద్రబాబుకు తన బలహీనత ఏమిటో బాగా తెలుసు. అంతవరకూ రాజకీయాల్లో మామ చాటు మనిషిగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు ఎవరో తెలిసిన వారికి కూడా ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ప్రజలకు పరిచయం కావడానికి ఆయన ఎంచుకున్న మార్గం ప్రచారం. ఇందుకోసం ప్రతి సోమ వారం దూరదర్సన్, రేడియోల్లో ప్రజలతో నేరుగా మాట్లాడే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అలాగే అందివచ్చిన ప్రతి సందర్భంలో విలేకరుల సమావేశాల్లో ప్రసంగించడం. అప్పుడే కొత్తగా పురుడు పోసుకుంటున్న ప్రైవేటు మీడియాని వాడుకోవడం. ఈ ప్రయత్నం ఫలించింది. ప్రజలకి దగ్గర కావడానికి బాగా ఉపయోగపడ్డాయి.
ఇప్పుడంటే గంటలు గంటలు మాట్లాడే చంద్రబాబు నేటి తరానికి తెలుసు. కానీ తన బలహీనత ఏమిటో బాగా తెలిసిన మనిషి. దాన్ని అధిగమించడానికి ఆయన ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా కరెంటు అవసరం లేని రేడియోని పక్కన బెట్టి, కరెంటు లేకుండా పనిచేయని 'టీవీ' లకు ముఖ్యమంత్రిగారు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ, నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, 'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది. ఒకరోజు పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి ఆయన కంటపడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి, ‘ఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. ‘బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదనగా వుండేది.
సీరియస్ గా పనిచేసుకుపోతూ చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు. కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చా’ అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
‘రేపు హైదరాబాదు వస్తున్నాను, చంద్రబాబు గారిని కలిపిస్తారా?’
ఏడాదికి ఒక్క మారు వచ్చేది ఈ అభ్యర్ధన.
ఆవిడ బెజవాడలో ఓ స్కూలు టీచరు. రేడియోలో నా సీనియర్ సహోద్యోగికి దగ్గరి చుట్టం. ప్రతియేటా ఏప్రిల్ పందొమ్మిది సాయంత్రానికల్లా హైదరాబాదు చేరుకునేవారు. ఇరవయ్యవ తేదీ చంద్రబాబు పుట్టినరోజున ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపి వెంటనే బస్సెక్కి బెజవాడ వెళ్ళిపోయేవారు.
పుట్టిన రోజున వీ ఐ పీలను కలిసి శుభాకాంక్షలు తెలిపే అలవాటు నాకు లేదు. కానీ ఆవిడ పుణ్యమా అని నేను వెంటబెట్టుకు వెళ్లి పనిలో పనిగా శుభాకాంక్షలు చెప్పేవాడిని.
అధికారంలో ఉన్నవారిని కలవడానికి ఉబలాట పడేవాళ్ళు చాలామంది వుంటారు. కానీ ఈవిడ మనస్తత్వం నాకే ఆశ్చర్యమనిపించేది. చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఆవిడ క్రమం తప్పకుండా హైదరాబాదు వచ్చి శుభాకాంక్షలు తెలిపేది. నాకు తెలిసి ఇంతకూ మినహా ఆవిడ ఏనాడూ కూడా ఒక కోరిక కోరడం కానీ, ఆయనతో ఒక ఫోటో తీయించమని అడగడం కానీ చేసేవారు కాదు. నిష్కళంకమైన అభిమానానికి ఆవిడ ప్రతీక.
అభిమానం అంటే చొక్కాలు చించుకోవడం, పోస్టర్లపై పేడ కొట్టడం, తమ వ్యాఖ్యలతో ఇతరుల గోడలను నానా అంకచండాలం చేయడం ఎంతమాత్రం కాదు.
చివర్లో ఒక హితవాక్యం.
గతంలో ఆయన్ని అభిమానించినవారు, చంద్రబాబులో ఒక చాణక్యుడిని చూసి దగ్గరయ్యారు. ఇప్పుడు రాజకీయ చాణక్యం మాత్రమే కనబడుతూ వుండడం వల్ల దూరం జరిగారు.



5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాబు గారు సుదీర్ఘ సుత్తి ప్రసంగాలు, అస్మదీయ పాతకరత్న చిడతం బొట్లు మీడియా ప్రెస్ మీట్లు దుర్భరం దుస్సహం.

నీహారిక చెప్పారు...

A passionate, motivated and confident leader.

అజ్ఞాత చెప్పారు...

కె సి ఆర్ ప్రెస్ మీట్ పెడితే అందరు తెలుగు వారు ఆసక్తిగా చూస్తున్నారు. అదే బాబు ప్రెస్ మీట్ అంటే అందరు పారిపోతారు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Well said నీహారిక గారు.

సూర్య చెప్పారు...

పరిపాలనలో సంస్కరణలు తీసుకు వచ్చినమాట వాస్తవం. అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళతో పని అంటే ఒక పట్టాన అయ్యేది కాదు. 90s లో చంద్రబాబు వచ్చాక పరిస్థితి లో మార్పు మొదలైంది.
అయితే ఆయనకు ఉన్న ముఖ్యమైన నెగటివ్ పాయింట్ అతి ప్రచారం. తక్కువ చానెల్స్ ఉండి, సోషల్ మీడియా లేని రోజుల్లో సొంత ప్రచారాన్ని ఎవరూ అడ్డుకోకపోవచ్చు కానీ, ఈ రోజుల్లో పరిమితికి మించిన ప్రచారం ప్రమాదకరం.