21, ఏప్రిల్ 2020, మంగళవారం

లాక్ డౌన్ – భండారు శ్రీనివాసరావు


“ఈ కషాయం తాగించి రాత్రికి లంఖణం వుంచండి. రేపటికి తగ్గిపోతుంది’
“ఓ అయిదు రోజులు ఉదయం సాయంత్రం ఈ గోలీలు వేయండి. లేచి తిరుగుతాడు”
“భయపడాల్సిన పనేమీ లేదు, మూడ్రోజులు ఆస్పత్రిలో వుంటే చాలు, టెస్టులు చేయించి మందులు వాడతాం. నాలుగోరోజు ఇంటికెళ్ళి పోవచ్చు”
“ఐసీయూ నుంచి రేపు రాత్రి డిశ్చార్జ్ చేస్తాం! ఒక రోజు వార్డులో వుంచి పంపేస్తాం”
“రేపు ఉదయం ఆపరేషన్. తర్వాత మూడు నాలుగు రోజులు హాస్పటల్ లో వుండి వెళ్లి పోవచ్చు”
“పరిస్తితి బాగాలేదు. మహా అయితే నాలుగయిదు రోజులు, ఇంటికి తీసుకువెళ్ళి కావాల్సిన వాళ్లకు కబురు పెట్టుకోండి”
ఇవన్నీ ఇంతవరకు అందరికి తెలిసిన మాటలు. వింటూ వచ్చిన మాటలు.
ఈ కరోనా వచ్చిన తర్వాత వినబడని మాటలు.
ఎలా వచ్చిందో తెలవదు. ఎలా పోతుందో తెలవదు. ఎన్నాళ్ళు వుంటుందో తెలవదు.
జబ్బేమిటో తెలవదు. మందేమిటో తెలవదు. తెలిసినదల్లా బయట ప్రపంచంలో తిరగకుండా ఎవరికివారు ఇంట్లో ఉండడమే. ఒక రకంగా మంచి రోగం. ఖర్చులేని రోగం.
ఖర్చు లేదు సరే! ఆదాయం మాటేమిటి?
జరిగితే జబ్బంత సుఖం లేదంటారు. కానీ ఆ జరగడం ఎలా! ఎన్నాళ్ళిలా !
అన్నీ జవాబులేని ప్రశ్నలు. ఎవర్ని అడిగినా జవాబు చెప్పలేని ప్రశ్నలు.
జవాబులు వెతుక్కోవడానికి మాత్రం బోలెడు ఖాళీ సమయం వుంది.
అదే,
కరోనా లాక్ డౌన్!   

1 కామెంట్‌:

సూర్య చెప్పారు...

ఒలింపిక్స్ లో ఏ దేశానికి ఎక్కువ పతకాలు వస్తే ఆ దేశం విజేత. ఈ కరోనా గేమ్స్ లో ఎక్కడ సంఖ్య తక్కువగా ఉంటే వారిదే విజయం.