7, మార్చి 2015, శనివారం

శాసనసభల సమావేశాలు


(Published by 'SURYA' telugu daily in it's edit page on 08-03-2015, SUNDAY)

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల శాసనసభల సమావేశాలు  మొదలయ్యాయి. ఈ రెండూ కొత్త రాష్ట్రాలుగా ఏర్పడి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. గతంలో కూడా ఈ రెండు శాసన సభల సమావేశాలు జరిగాయి కాని, అవి వేర్వేరుగా వేర్వేరు తేదీల్లో జరిగాయి. కానీ ఈసారి పూర్తి బడ్జెట్ సమావేశాలు, అవీ ఉభయ సభల సంయుక్త సమావేశాలు  కొన్ని గంటల తేడాతో ఒకే ఆవరణలో జరగడం ఒక విశేషం. అంతే  కాదు, ఉభయ రాష్ట్రాలకు గవర్నర్ గా వున్న శ్రీ నరసింహం, విడివిడిగా  రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 'నా ప్రభుత్వం' అంటూ ఆ రెండు ప్రభుత్వాల ఉద్దేశ్యాలు, కార్యాచరణ  ప్రణాళికలు వివరించారు.  ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్రశేఖర రావులు లోగడ అనేక సందర్భాలలో చెబుతూ వచ్చిన అనేక విషయాలను గుదిగుచ్చి రూపొందించిన ప్రసంగాల మాదిరిగా అనిపిస్తే ఆశ్చర్య పడాల్సింది లేదు. ఎందుకంటె ఆయా  రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గాలు ఆమోదించిన ప్రసంగపాఠాలనే గవర్నర్  శాసన సభల్లో చదువుతూ రావడం అనేది సంప్రదాయం.

గంటల తేడాతో మొదలయిన రెండు రాష్ట్రాల శాసన సభల ప్రారంభ పర్వం కూడా కొంత తేడాగా వుండడం యాదృచ్చికం కాకపోవచ్చు. ముందు మొదలయిన ఆంద్ర ప్రదేశ్ శాసనసభలో గవర్నర్ ప్రసంగం, ఆదినుంచి తుదివరకు హుందాగా సాగిపోయింది. గవర్నర్ కూడా నింపాదిగా హాయిగా తమ ప్రసంగ ప్రతిని దాదాపు గంటపాటు చదువుకుంటూ పోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన అనేక సంక్షేమ పధకాలను ఏకరువు పెట్టడంతో పాటు, కొత్త రాజధాని నిర్మాణం, ప్రత్యెక హోదా మొదలయిన అంశాలే కాకుండా 'రాష్ట్ర విభజన జరిగిన తీరు సమంజసంగా లేద'న్న ముఖ్యమంత్రి అభిప్రాయం సయితం గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనకు నోచుకుంది. గవర్నర్ ప్రసంగం ముగియగానే జాతీయ గీతాపలాపన అనంతరం ఆంద్ర ప్రదేశ్ శాసన సభ సోమవారానికి వాయిదా పడింది.
దీనికి పూర్తి భిన్నంగా తెలంగాణా శాసన సభ సమావేశాలు కాసేపటి తరువాత మొదలయ్యాయి. ప్రసంగం చదువుతున్నప్పుడు  టీవీల్లో గవర్నర్ నరసింహన్ హావభావాలు గమనించినప్పుడు,  సభలో అంతా సజావుగా సాగడం లేదేమో అన్న భావం కలిగింది. త్వరత్వరగా పేజీలు  తిప్పుతూ, గబగబా  చదువుతూ, మొత్తం ప్రసంగాన్ని పదిహేను నిమిషాల్లోనే ముగించిన తీరు చూసినవారికి  సభలో జరగరానిదేదో  జరుగుతోందన్నఅనుమానం తలెత్తింది. అది నిజమేనని ఆ తరువాత మీడియా పాయింటు వద్దనుంచి వివిధ టీవీ ఛానళ్ళల్ల ప్రతినిధులు ప్రత్యక్ష ప్రసారంలో  మాట్లాడినప్పుడు ధృవపడింది. గవర్నర్ ప్రసంగం మొదలెట్టగానే, కాంగ్రెస్, టీడీపీ సభ్యులు పోడియం ముందుకు దూసుకు వెళ్ళారనీ, ప్రసంగం ప్రతులను చించి గవర్నర్ పై విసిరి వేసే ప్రయత్నం చేసారనీ, కొందరు టీ.ఆర్.యస్. సభ్యులు కూడా ముందుకు  తోసుకురావడంతో ఉభయుల నడుమ తోపులాట జరిగిందనీ విలేకరుల కధనం. సరే! ఆయా రాజకీయ పార్టీలకు చెందిన శాసన సభ్యులు కూడా మీడియా పాయింటు నుంచి మాట్లాడారు. సభలో జరిగినదానిని తమ పార్టీల వైఖరులకి అనుగుణంగా సమర్ధించుకునే ప్రయత్నం చేసారు. తమ సభ్యులను టీ.ఆర్.యస్. సభ్యులు కిందపడవేసి కొట్టారని టీడీపీ ఆరోపిస్తుంటే, జాతీయగీతాన్ని ప్రతిపక్ష సభ్యులు అగౌరవ పరిచారని టీ.ఆర్.యస్. అంటోంది.  సమావేశాలకు ముందుగానే తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు సభలో అనుసరించబోయే వ్యూహాలను రచించడమే కాకుండా వాటిని బట్టబయలు కూడా చేయడం వల్ల ఇలాటిదేదో జరుగుతుందన్న అభిప్రాయం ముందే ఏర్పడిపోయింది. పార్టీ మార్పిళ్ళ పై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్దమైనట్టు ఆ పార్టీలు ముందే ప్రకటించాయి. శాసన సభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ సమక్షంలో గవర్నర్ ప్రసంగించే సమయాన్ని ఆ పార్టీలు ఇందుకు తగిన తరుణంగా ఎంచుకున్నాయి. ఆ పార్టీలు నిరసన కోసం ఎంచుకున్న అంశం ప్రజాస్వామ్య కోణం నుంచి చూస్తే  చాలా ప్రాముఖ్యత కలిగినదే. సందేహం లేదు. ఒక పార్టీ గుర్తుపై  ఎన్నికైన వ్యక్తి,   ప్రత్యర్ధి పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా మరో పాత్ర పోషించడం చూడడానికి ఎబ్బెట్టుగానే  వుంటుంది. నిజానికి , ఇలాటి సంస్కృతికి  అన్ని పార్టీలు స్వస్తి చెప్పినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ నాలుగు కాలాలపాటు మనగలుగుతుంది. కానీ, ఇలా తప్పులెన్నే పార్టీలే  తమకు అవకాశం లభించినప్పుడు అదే తప్పును ప్రోత్సహిస్తున్నాయి.  ఇందులోని  విషాదం ఇదే!. రాష్ట్ర విభజన అనంతరం ఇటు తెలంగాణాలో, అటు ఆంద్ర ప్రదేశ్ లో పాలక పక్షాలు  ఈ దుష్ట సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయన్న అపవాదును అవి ఇప్పటికే  మోస్తున్నాయి. తెలంగాణాలో, అనేకమంది  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను  ప్రలోభపెట్టి టీ.ఆర్.యస్. తమలో కలుపుకుందని టీడీపీ లెక్కలు చెబుతుంటే, అటు ఆంద్ర ప్రదేశ్ లో అధికార తెలుగు దేశం పార్టీ  చేర్చుకున్న ప్రత్యర్ధి పార్టీ వారి వివరాలను గోత్ర నామాలతో సహా టీ.ఆర్. యస్.  వెల్లడిస్తోంది. సరిగ్గా, ఈ కారణం వల్లనే, నిస్సిగ్గుగా సాగిపోతున్న పార్టీ మార్పిళ్లను గట్టి గొంతుకతో  ఖండిస్తున్న పార్టీలకు సరయిన నైతిక బలం చిక్కడం లేదు. 'మేమూ చేసాముకాని, మరీ ఇలా బరి తెగించి చేయలేదు' అనే వాదం వినేవారి విశ్వాసాన్ని పొందడం లేదు.
తెలంగాణా అసెంబ్లీలో తొలి రోజున ఏం జరిగిందన్నదానిపై   ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. అధికారిక వీడియోల్లో  నిక్షిప్తం అయిన దృశ్యాలు  బయటకు వస్తే ఎవరు బాధ్యులో తేటతెల్లం అవుతుంది. దానివల్ల మూల సమస్యకు పరిష్కారం దొరకదు. సభలో వివిధ రాజకీయ పక్షాల వాళ్ళు స్వయం నియంత్రణ ఏర్పరచుకుంటే అంతకంటే కావాల్సింది వుండదు. అయితే నేటి రాజకీయాల తీరుతెన్నులు గమనిస్తున్నవారికి ఈ ఆశ పేరాశగా అనిపించవచ్చు కూడా.  

ఉభయ రాష్ట్రాల శాసన సభల తొలిరోజు ప్రతిపక్ష పార్టీగా వై.యస్.ఆర్.సీ.పీ. ఒక పాయింటు తన ఖాతాలో వేసుకుంది. గవర్నర్ ప్రసంగం సాగుతున్నంత సేపూ ఆ పార్టీ ప్రతినిధులు ఒక పద్దతి ప్రకారం సభ సాగడానికి సహకరించారు. ఇదే వైఖరి ముందు కూడా కొనసాగిస్తే ఆ పార్టీకి దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది. దానితోపాటే, సభ గౌరవం ఇనుమడిస్తుంది. (07-03-2015)       

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

TRS played music for National anthem on backs of CONgress & TDP. It shows their respect & love on National Anthem.
BJP, CON & TDP are anti-national parties. Only TRS & MIM are pro-national parties.
Hope you observed the point. Please ask Two self-proclaimed T-Langana intellectual observers here.
Sure they will rush to make comments here, supporting my point.