29, అక్టోబర్ 2014, బుధవారం

నీటి జగడాలు, కరెంటు కయ్యాలు

(Published by 'SURYA" Telugu Daily in it Edit page on 30-10-2014, Thursday)

ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు, పొరుగు  దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో, ముడి చమురు  వనరులపై పెత్తనం కోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.
దాదాపు పదిహేడేళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఈ జోస్యం చెప్పారు. ఆయన వరల్డ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు భవిష్యత్తు గురించి వేసిన ఈ అంచనా అప్పట్లో ప్రపంచ రాజకీయ నాయకులను ఎంతగానో కలవర పరచింది. అదృష్టవశాత్తు ఇస్మాయిల్ గారి జోస్యం వెనువెంటనే నిజమవలేదు కానీ, కాలక్రమంలో  సాగు నీరు, తాగు నీటి  అవసరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దృష్ట్యా తలెత్తుతూ వచ్చిన నీటి  తగాదాలు మాత్రం  అనేక దేశాల నడుమ ఉద్రిక్తతల పెరుగుదలకు దోహదం చేసిన మాట వాస్తవం.
ఆసియా ఖండంలో ఇరిగేషన్ డాముల కింద నీరు పంచుకునే విషయంలో బోలెడు, బొచ్చెడు  తగాదాలు. భారత దేశం పాకిస్తాన్ నడుమ జలవిద్యుచ్చక్తి పంపిణీ విషయంలో ముదిరి పాకాన పడుతున్న వివాదాలు, మరోపక్క  చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ల నడుమ నదీ జలాల చిక్కుముళ్ళు.
పోతే, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కీర్గిజిస్తాన్ ల వ్యవహారం కూడా విభిన్నంగా లేదు. అముదారియా, సర్ దారియా నదులు, అలాగే నీటిమట్టం స్తాయి బాగా పడిపోతున్న అరల్ సీ విషయంలో ఈ దేశాల నడుమ సాగుతున్న నీటి పంచాయతీలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి కానీ ముగింపుకు రావడం లేదు.
ఇక, అర్జెంటీనా, ఉరుగ్వేలు - ప్లేట్ నదీ జలాలను పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాన్ని హేగ్ లోని అంతర్జాతీయ న్యాయ స్తానం వరకూ తీసుకువెళ్ళాయి. రియో గ్రాండే, కొలరాడో నదీ జలాలు గురించి అమెరికా, మెక్సికో లు జుట్లు పట్టుకుంటున్నాయి.           

తిగ్రిస్ నదిలో తన వాటా నీళ్ళను ఇక ముందు వాడుకోవడానికి వీల్లేదని ఇరాక్ సిరియాను డిమాండ్ చేసి ఎంతో కాలం కాలేదు. మధ్యప్రాత్యంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాలు, ఇరాన్, ఇరాక్ దేశాలు టర్కీ డాం లనుంచి వచ్చే నీటి సరపరాల విషయంలో అవగాహన కుదరక తలలు పట్టుకుంటున్నాయి.
ఆఫ్రికాలో జమ్బెజీ నది ఉపనది అయిన చోబే నది, బోత్స్వానా, మొజాంబిక్ దేశాల నడుమ చిచ్చు రేపింది.
జీవనదులన్నా ఎండిపోతాయేమో కాని ఈ తగాదాలు, వివాదాలకు  మాత్రం ముగింపు  అంటూ వున్నట్టులేదు.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం వివిధ దేశాల నడుమ జలాల పంపిణీ జరిగే నదులు దాదాపు రెండు వందల యాభయ్ కి పైగా వున్నాయి. ఈ నదుల పరీవాహక ప్రాంతాన్ని లెక్క వేస్తే, అది ఈ భూగోళం ఉపరితలంలో సగానికి పైగా  వుంటుంది. అంతర్జాతీయంగా నదీ జలాల వివాదాలు వున్న దేశాలు మూడు వందలకు పైగా వున్నాయి కాని, వీటిల్లో సాయుధ సంఘర్షణలకు దారితీసే వివాదాలు చాలా తక్కువనే చెప్పాలి. గత శతాబ్ద కాలంలో నీళ్ళ కోసం జరిగిన యుద్ధాలు కేవలం ఏడు మాత్రమే లెక్క తేలాయి.
నీరే ప్రాణాధారమన్నారు శతకకారులు. సేద్యానికయినా, పరిశ్రమలకయినా, తాగడానికయినా నీళ్ళు అవసరం. నానాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 2025 నాటికి  మానవాళి అవసరాలు తీర్చడానికి  ప్రపంచ వ్యాప్తంగా వున్న నదుల్లో పారే నీటిపై అపరితమయిన వొత్తిడి పెరగగలదని ఐక్యరాజ్య సమితి (ఐ.ఎన్.డి.పి.) అంచనా. ఈ నేపధ్యంలో నీళ్లపై హక్కులు, నీటి  కేటాయింపులు గురించిన ఉద్రిక్తతలు బాగా పెరిగే అవకాశం వుందని వరల్డ్ వాటర్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న కాలంలో ప్రపంచ రాజకీయాల్లో నీటి  తగాదాలు ప్రధానాంశంగా మారే వీలుందని అమెరికా రక్షణశాఖ హెచ్చరించింది. దేశాల నడుమ సరిహద్దు వివాదాల్లో నదీ జలాల పంపిణీ అంశం కీలకం కాగలదని పేర్కొన్నది. చాద్, సోమాలియా, యెమెన్ దేశాల మధ్య సంఘర్షణలకు నీటి తగాదాలకు సంబంధం వుందన్నది పెంటగాన్ అభిప్రాయం.                  
ఈ పంచాయతీలు కేవలం దేశాలకే పరిమితం కాలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నీటి వినియోగదారులు కూడా వీటికి అతీతం కాదన్నది జగమెరిగిన సత్యం. పొలాల్లో నీరు కావిడి తగాదాలు, వీధి కొళాయిల వద్ద ఆడంగుల  కొట్లాటలు పాత సినిమాలు చూసేవారందరికీ  అనుభవైకవేద్యం.

మన దేశంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగిలిన చిచ్చుకు కావేరి నదీ జలాలు కారణం. అలాగే, ఆంధ్ర, ఒడిశాల నడుమ వంశధార నదీ జలాల  వివాదం. ఇప్పుడు తాజాగా కొత్తగా పురుడుపోసుకున్న రాష్ట్రాలు - ఆంద్రప్రదేశ్, తెలంగాణాల నడుమ రాజుకుంటున్న కృష్ణా నదీ జలవివాదం.


ఇది రోజురోజుకూ కాదు పూటపూటకూ ముదిరి ఇరువైపులా మాటల యుద్ధాలకు దారితీస్తోంది. విడివిడిగా వీరిద్దరి వాదనలు విన్నవారికి వారు చెప్పేది సబబే అనిపిస్తుంది. ఎందుకంటె ఉభయ పక్షాలవాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రజల కోణం నుంచే మాట్లాడుతున్నారు. అది నిజమే కావచ్చు. కానీ ఇరుపక్కలా నష్టపోయేది కూడా ప్రజలే కదా. నిన్న మొన్నటి దాకా కలిసివున్నవారే కదా! ఇప్పుడు గీతలు గీసుకుని వ్యవహరించడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఇందులో రాజకీయ కోణం దాగుందని ఎవరయినా అనుకుంటే తప్పేమిటి?
ఆంద్ర ప్రదేశ్ లో తాగునీటికి నీళ్ళు కావాలని ఆ రాష్ట్రం వారు అడిగితే  తెలంగాణా వాదులకు కోపం. తెలంగాణలో ఎండిపోతున్న పంటలు కాపాడుకోవడానికి కరెంటు ఉత్పత్తికోసం  శ్రీశైలం నుంచి నీరు వొదిలితే  ఆంద్ర  నాయకులకు ఆగ్రహం.
కొందరికి నీళ్ళు  వెంటనే కావాలి. మరొకరికి అధ్యతన భవిష్యత్తులో పొంచి వున్న తాగునీటి, సాగునీటి అవసరాలు తీరాలి. నిజానికి  కాసింత సంయమనం, కాసింత సర్దుబాటు మనస్తత్వం వుంటే సరిచేసుకోలేని సమస్యేమీ కాదు. ఇరు పక్షాల వాళ్ళు, కొన్ని రోజులు మాటల యుద్ధాలకు విరామం ప్రకటించి, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని చర్చించుకుంటే పరిష్కారం కుదరని జటిల విషయం కూడా కాదు. అంతేకానీ, 'అక్కడికి రా! ఇక్కడికి రా! నీ వాదం గొప్పదో, నా వాదం గొప్పదో తేల్చుకుందాం' అని పరస్పరం సవాళ్లు విసురుకోవడానికి ఇది సినిమా స్క్రిప్ట్ కాదుకదా! వాదం నెగ్గించుకోవడం కాదిక్కడ సమస్య. సమస్యను పరిష్కరించుకోవడం ఒక్కటే ఇప్పుడు కీలకం. అది పూర్తిగా పక్కకుపోయింది.        
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. ఆ నదులు పారే ప్రాంతాలవాళ్ళు ఆ నీళ్ళు మాకే హక్కుభుక్తం అని వాదించుకుంటారు.
వచ్చిన చిక్కల్లా అలా అనుకునే నీటితోనే. ఆ నీటిని తమ స్వార్ధానికి వాడుకునే మనుషులతోనే.
(29-10-2014)   

NOTE: Courtesy Image Owner

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

ఆంద్ర తెలంగాణా మధ్య ఇంతక ముందు నీటి వివాదాలు లేవు అనుకోవడం ఒక అపోహ. ఒకే రాష్ట్రం కనుక ఆ వివాదాలను ప్రభుత్వమే ఏకపక్షంగా నిర్ణయించేది. ఇప్పుడు వివాదాలు టీవీలకు ఎక్కడం వల్ల చూస్తున్నారు తేడా ఇదొక్కటే.