15, అక్టోబర్ 2014, బుధవారం

తురగా జానకీ రాణి గారు ఇకలేరు


"నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము...."
ఈ పద్యపాదానికి నిలువెత్తు ఉదాహరణ మా జానకీ రాణి గారు.


(కీర్తిశేషులు శ్రీమతి తురగా జానకీ రాణి)

చేరడేసి కళ్ళు, వాటికి కొట్టొచ్చినట్టు ఇంతేసి కాటుక. దూరం నుంచే చూసి చెప్పొచ్చు జానకీ రాణి గారు వస్తున్నారని. ఆ సంప్రదాయాలు, కట్టూ బొట్టూ అన్నీ అంతవరకే. మనసూ, ఆలోచనలు, సిద్దాంతాలు, సూత్రాలు అన్నీ రాబోయే తరానివి. ఆధునిక మహిళ ఆలోచనలు ఎలావుండాలో, ఎలా ఉంటాయో  ఆవిడని కలుసుకుని ఓమారు మాట్లాడితే ఇట్టే అర్ధం అవుతుంది. ఆ మాటలు వింటుంటే చూస్తున్న జానకీ రాణి గారు,ఆ మాటలు  చెబుతున్న జానకీరాణి గారు ఒకరేనా అన్నంత సందేహం కలగడం తధ్యం.
ఆమె రాకను మరో విధంగా కూడా కనుక్కోవచ్చు. ముందు ఆవిడ మాట వినబడుతుంది. తరువాత ఆవిడ కనబడతారు. చిన్నగా పొందికగా వుండే ఆ మనిషిది   ఏళ్ళు మీద పడుతున్నా వాటిని కనబడనివ్వని శారీరక తత్వం. ముందే చెప్పినట్టు మాట కొండొకచో చురుక్కు. ఎక్కువసార్లు చమక్కు.  అంత చక్కగా, శ్రావ్యంగా మాట్లాడుతారని తెలిసే బహుశా రేడియోలో ఉద్యోగం ఇచ్చి ఉంటారని అనుకునే అభిమానులు కూడా ఆవిడగారికి కోకొల్లలు. అలాటి మనిషి ఇక కనబడదనీ, అలాటి పలుకు ఇక వినబడదనీ తలచుకుని దుఃఖపడడమే ఇక మిగిలింది.
ఏవిటో కష్టాలు కట్టగట్టుకుని వస్తాయంటారు. ఈ మధ్యనే అల్లుడు ఒక రకంగా కొడుకూ అయిన నరేందర్ అందర్నీ వొదిలి వేరే లోకానికి తరలిపోయాడు. భర్త పోయిన దుఖం అనాలో, అతడ్ని మరచిపోలేని బాధ అనాలో తెలియక తల్లడిల్లుతున్న  ఉషారమణికి తల్లి పోవడం మరో విషాదం.
ఉషకు, శోభకు ధైర్యం చెప్పే ధైర్యం నాకు లేదు.
అందుకే ఈ నాలుగు మాటలు.

2 కామెంట్‌లు:

nagasrinivasaPeri చెప్పారు...

ఆవిడ చనిపోయారని వినిగానే, ముందుమీ బ్లాగు చూశానండి, ఊహించినట్లుగానే పోస్టు ఉంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@nagasrinivasaPeri - Thanks