12, అక్టోబర్ 2014, ఆదివారం

గుర్తొస్తున్న ఓ జ్ఞాపకం


చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో యావత్ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి 'మీడియా సావీ ముఖ్యమంత్రి' గా ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైం లో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న  రోజులవి.  ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు  మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. ఆ కోతల సమయాలు పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. అయినా ముఖ్యమంత్రిగారు 'టీవీ' లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ,  నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్న లోని మర్మం తెలియనివాడు కాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, ' సాంబశివరావుగారూ (ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచేప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
(తుపాను విరుచుకుపడబోయే ప్రాంతాలలో కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయనీ, అనేక ప్రాంతాలలో కరెంటు సరఫరాకు విఘాతం కలిగిందనీ వార్తలు వస్తున్ననేపధ్యంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి  చేసారని పత్రికల్లో చదివినప్పుడు ఈ సంగతి గుర్తుకు వచ్చింది)

కామెంట్‌లు లేవు: