3, జూన్ 2014, మంగళవారం

ఇద్దరు చంద్రులకూ ఒకే చిట్కా - భండారు శ్రీనివాసరావు


ఇటు చంద్రశేఖరరావు గారు అటు చంద్రబాబు నాయుడుగారు - ఇద్దరికీ పనికొచ్చే తాయిలం ఇది.
స్కూళ్ళల్లో చేరే పిల్లల  సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. అధవా చేరినా, చేర్చినా -  చదువుకు మధ్యలోనే గంట  వాయించి స్కూళ్ళు వొదిలి వెళ్ళిపోయే వారి సంఖ్య రోజురోజుకూ  పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు. వాటిని అన్వేషిస్తూ ఢిల్లీలో ఒక స్వచ్చంద సంస్థ 'సూదికోసం సోది'  చెప్పించుకుంది. ఆ సోదిలో తేలిందీ తెలియవచ్చిందీ ఏమిటంటే -
"ఢిల్లీలోని మురికివాడల్లో నివసించేవారికి అనేక ఇబ్బందులు. అందులో ఒకటి విద్యుచ్చక్తి లేకపోవడం. వున్నా నామమాత్రంగా -  'గుడ్డికన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే' అన్న తీరులో వుండడం. ఈ కారణం వల్ల ఆ వాడల్లో వుండే పిల్లలు సరిగా చదువుకోలేకపోతున్నారు. అంతే సరిగా హోం వర్క్ చేసుకోలేకపోతున్నారు. ఫలితంగా బాగా మార్కులు తెచ్చుకోలేకపోతున్నారు. దీనికంటే చదువు మానేయడమే మంచిదనే తీర్మానానికి వస్తున్నారు (ట).
ఈ విషయం అర్ధం చేసుకున్న 'సలాం బాలక్ ట్రస్ట్' అనే ఒక స్వచ్చంద సంస్థ ఒక అడుగు ముందుకేసి  పరిష్కారం దిశగా ఆలోచించింది. మరో సంస్థతో కలిసి సోలార్ పానెల్స్, ఎల్.ఈ.డీ. లైట్లు వున్న స్కూల్ బ్యాగ్ తయారుచేసింది. పగటివేళ పిల్లలు స్కూలుకు వెళ్ళేటప్పుడు ఈ సంచీని వీపుకు తగిలించుకుని వెడతారు. సూర్యరశ్మికి  ఈ సోలార్ బ్యాగ్ చార్జ్ అవుతుంది.  రాత్రివేళ కరెంటు లేకపోయినా కూడా ఈ బ్యాగ్ కు అమర్చిన లైట్ల సాయంతో పిల్లలు చదువుకోవచ్చు.
కాబట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటీ అంటే-
ఉపాయం  లేనివాడిని వూరినుంచి తరిమెయ్యమంటారే -  అదిగో ఆ సామెతలో ఎంతో అర్ధం వుందని.

కామెంట్‌లు లేవు: