30, ఏప్రిల్ 2013, మంగళవారం

నమ్మితే నమ్మండి అను ఇండియా దట్ ఈజ్ భారత్!



కొన్ని విషయాలు వింటుంటే నిజమా! అనిపిస్తాయి.
నిజంగా నిజమేనా అన్న అనుమానం కలిగిస్తాయి. నిజమెంతో నిగ్గుతేల్చే అవకాశం లేనప్పుడు –పోనీ మంచి విషయమే కదా నమ్మేస్తే పోలా అని కూడా అనిపిస్తుంది. అలాటి నమ్మలేని ఓ నిజం నెట్లో సంచరిస్తోంది. నమ్మితే నమ్మండి.
ఇంతకీ ఆ నమ్మలేని నిజం ఏమిటో తెలుసా?
ప్రపంచం యావత్తులో అత్యంత సంపన్న దేశం ‘భారత దేశం’ అన్నదే ఆ నమ్మలేని నిజం.




నిజానికి ఇందులో నిజమెంతో తెలియదు కాబట్టి ఒక కధలాగానే చెప్పుకుందాం.
అనగనగా వైద్యరాజ్ అనే వ్యక్తి ఇంట్లో మూడు పురాతన రాతి విగ్రహాలు వుంటూ వచ్చాయి. ఈ వైద్యరాజ్ మహాశయులవారి వంశ  చరిత్ర కూడా ఘనమైనదే. ఆయన కృష్ణదేవరాయల వంశీకుడు. మూడువందల ఏళ్లనుంచి మైసూరులోని ఆయన గృహంలో ఆ మూడు పురాతన దేవతా విగ్రహాలు తరతరాలుగా పూజలందుకుంటున్నాయి. నిజానికి అవి రాళ్ళూ కావు. దేవతా విగ్రహాలు కావు. లెక్కకట్టడానికి సాధ్యం కాని విలువైన వజ్రాలు. ఈ సంగతి బయటకు పొక్కీపొక్కక ముందే ఆ వజ్రాలను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కారణాలు తెలవవు కాని ఆ వజ్రాలను ప్రస్తుతం ఓ స్విస్ బ్యాంకులో భద్రపరిచి వుంచారు.
అసలు ఈ కధలోని అసలు కధ ఇక్కడే మొదలవుతుంది.
ఈ వజ్రాల విలువను లెక్కకట్టి చూసారు. లెక్కకట్టిన నిపుణులు ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు.
ఈ మూడు వజ్రాలలో ఒక్కొక్క దాని విలువ ఎంతంటే అమెరికా, ఇంగ్లాండ్ ఈ రెండు దేశాల స్తూల దేశీయ ఉత్పత్తికంటే ఎక్కువ. వీటిని కొనగలిగిన డబ్బు ప్రపంచ బ్యాంకు దగ్గర కూడా లేదు.
అంతే కాదు వీటిల్లో ఒక్క వజ్రం విలువ తీసుకున్నా – ప్రపంచ బ్యాంకు నుంచి మన దేశం ఇంతవరకు తీసుకున్న అప్పుకు మూడు రెట్లు ఎక్కువ. పది మంది బిల్ గేట్స్ సంపదకు సమానం. వీటితో ఏడు వర్ధమాన దేశాలను కొనుగోలు చేయవచ్చట. ఇంకో ‘ట’ కూడా వుంది. వాయిదాల పద్ధతిలో అమ్మితే కొనడానికి సిద్ధం అని ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చిందట. అయితే మన ప్రధాన మంత్రి గారు మాత్రం ‘ససేమిరా’ అనేసారుట.
మామూలుగా ఇలాటి విషయాలు చెప్పేవాళ్ళు పలానా పేపర్లో రాశారు చూడలేదా అనేస్తారు. అలాగే ఈ కధ చెబుతున్న వాళ్లు కూడా 2011  లోనే  టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ వార్త వేసారు, వీలయితే ఆ పాత పేపరు తెచ్చుకుని  చదువుకోమంటున్నారు. హిందూ లో కూడా రాశారు చూసుకోమంటున్నారు. స్టార్ టీవీ వాళ్లు ఈ వజ్రాల వ్యవహారం గురించి ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేశారంటున్నారు.
ఇదంతా చదివిన తరువాత ఎప్పుడో ఏనాడో విన్న ‘ఫారెన్ లాటరీ’ సంగతులేమైనా గుర్తుకువస్తే మాత్రం నా పూచీ లేదు. (30-04-2013)
Note: Courtesy Image Owner 

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చెడు కనకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని మీలాంటి పెద్దలే చెప్పారు, కానీ అది మా మాటలవరకే మా రాతలు ఆసాంతం అబద్ధాల మయం అని మీరు మళ్ళీ మళ్ళీ నిరూపించారు, ఇప్పుడు ఎవడో అడుక్కునేవాడు వచ్చి నేను నార్వే ప్రధానిని కావాలంటే టైంస్ ఆఫ్ ఇండియాలో నా గురించి వచ్చింది చూసుకోండి, యఫ్. టీవీ వాడు నా గురించి ప్రోగ్రాం కుడా వేసాడు కానీ నా పాస్పోర్ట్ మిస్ అవడం వలన అడుక్కుంటున్నాను అని అంటే నమ్మేస్తారా? ఈ టపా కుడా అలానే ఉన్నది, గాలి, జగన్ నేను నేరం చెయ్యలేదు, కావాలంటే మా ఆవిడ్ని అడగండి అన్నట్టుంది.

ఆ అగ్నిమిళే పురోహితంలో మీరు వ్రాసిన ప్రతి లైనూ తప్పే అని జనాలు చెప్పినా మీరు వినలేదు, కనీసం నిజం తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు, అబద్ధం చెప్పడమే కాదు, దాన్ని పనిగల్పించుకుని ఓ బ్లాగు పెట్టి మళ్ళీ ఇలా ప్రచారం. మీ మనవల్లకీ ఇదే చెప్తారా? మనం చెప్పేది అబద్ధం ఐనా, అది నిజం అనేసుకుంటే నిజమే ఐపోతుంది అని.. బాగుంది మీ నీతి

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత _ కనీసం నాకు నా పేరు బాహాటంగా రాసుకునే నిజాయితీ వుందని గర్వపడుతున్నాను. పైగా ఇవేవీ నా సొంతం అని ఎప్పుడూ రాసుకోలేదు. ప్రతిదీ నెట్లో వచ్చిన విషయాలనే తెలుగులోకి అనువదించడం జరిగిందని కూడా తెలియచేస్తున్నాను. మీరనుకున్నట్టు, నా మనుమళ్లకు కూడా చెప్పుకోలేని విషయాలు సిగ్గు విడిచి రాస్తున్నానని మీరనుకుంటే అది మీ 'అజ్ఞాతం' కాదు పూర్తిగా అజ్ఞానమే.ఇష్టం లేకపోతే చదవడం మానేయండి. చదవొద్దని మీ మిత్రులకు టపా పెట్టండి.పేరూ వూరూ తెలియకుండా ఈ ఆకాశ రామన్న రాతలు రాయడం మానుకోండి.-భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

నిజం చిన్నపిల్లాడు చెప్పినా వినాలి, అబద్ధం ఎంత పెద్దవారు చెప్పినా పాటించకూడదు అని ఎవరో పెద్దాయన చెప్పారు వినలేదా సార్.


>>పైగా ఇవేవీ నా సొంతం అని ఎప్పుడూ రాసుకోలేదు.

అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు అది చాలదా? ఒక అబద్ధాన్ని సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న మీలాంటి వారు ప్రచారం చెయ్యడం తప్పు అవదా? ఎవరో ఎదో రాస్తే నేను కేవలం తర్జుమా చేశాను, పేపర్లో వేశాను మాదేమీ తప్పు లేదు అని "సాక్షివారి" పలుకులను మీరూ వల్లె వేస్తే ఎలా సారు?

నిజాన్ని వెలికి తీయడం అన్న గౌరవనీయ పాత్రికేయ వృత్తిలోనో, దానికి దగ్గిరగా ఉన్న ఉండి, మీరు ఎవరైనా మీ తప్పులని ఎత్తి చూపినప్పుడు ఎదురు దాడి చెయ్యడం, మీ తప్పుని సరిదిద్దుకోవాలనుకోకపోవడం అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

చివరగా ఒక మాట, నిజం చెప్పడానికి అజ్ఞాత ఐతే ఏంటి? అజ్ఞాని ఐతే ఏంటి? నిజం నిజమే అది ఎవరు చెప్తే ఏంటి? రామోజీనో, అద్వానియో, మన్మోహనుడో చెప్పినా అబద్ధం నిజం అవదు కదూ.
నిజం చెప్పడానికి అజ్ఞాత ఐతే ఏంటి, దేవుడు ఐతే ఏంటి?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత-"I am responsible for what I say. I am not responsible for what you understood"

Sridevi చెప్పారు...

పోనీ మంచి విషయమే కదా నమ్మేస్తే పోలా అని కూడా అనిపిస్తుంది.

Sridevi చెప్పారు...

Srinivasa Rao garu, meeru post lo modate oka disclaimer vesaaru but పోనీ మంచి విషయమే కదా నమ్మేస్తే పోలా అని కూడా అనిపిస్తుంది. Ani kuda hint ichaaru. But indulo nijamentho teliyadu kada. Anyways Ajnatha gaaru vraasina daanni meeru positive drustitho kakunda reactive mode tho chusinattunnaaru. Konchem theevranga spandichaaru. He/She was right in a way what was opined in his/her note.

అజ్ఞాత చెప్పారు...

వజ్రాల బరువు కేరట్లలో, గ్రముల్లో చెబుతారు. విలువ డాలర్లలో చెబుతారు కాని, అమెరికా, బ్రిటన్ స్థూలాదాయంతో పోల్చడం లాంటి డొంకతిరుగుడు వ్యవహారం కాదు. పూజలందుకునే విగ్రహాలు స్విస్‌బ్యాంకుకెలా చేరాయి? ఏమిటో అన్నీ లొసుగులే. దీనిమీద సి.బి.ఐ ఎంక్వైరీ వేసి, UPA సర్కారు భాగస్వామ్య పక్షాలు, కేంద్ర న్యాయమంత్రి, ప్రధానమంత్రి కార్యాలయంలలో అభియోగపత్రాలను చూపించి సవరించాక తీరిగ్గా కోర్టుకు విన్నవించాలి.