5, నవంబర్ 2012, సోమవారం

ప్రసిద్ధ జర్నలిస్ట్ ధర్మవరపు సీతారాం ఇక లేరు


ప్రసిద్ధ జర్నలిస్ట్ ధర్మవరపు సీతారాం ఇక లేరు
ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ధర్మవరపు సీతారాం ఈ సాయంత్రం (సోమవారం)  హైదరాబాదు, సీతాఫల్ మండి లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87  సంవత్సరాలు. కొద్దికాలంగా ఆయన అస్వస్తులుగా వున్నారు. జర్నలిజాన్ని ఒక నషాగా భావించే సీతారాం పెద్దగా చదువుకోలేదు. 1925 అక్టోబర్ ఆరోతేదీన నల్గొండ జిల్లా, హుజూర్ నగర్  సమీపంలోని  లక్కారం గ్రామంలో జన్మించిన సీతారాం హైదరాబాదు విమోచనకు ముందు హైదరాబాదు బులెటిన్అనే జర్నల్ లో జర్నలిస్టుగా  జీవితాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి పత్రికా రచయితగా అయిదు దశాబ్దాల సుదీర్ఘ జీవితం కొనసాగించారు. కొంతకాలం స్కై లైన్ అనే పత్రికను  నడిపారు. స్టేట్స్ మన్, ఇకనామిక్ టైమ్స్, పేట్రియాట్, లింక్ వంటి ప్రసిద్ధ ఆంగ్ల జాతీయ  పత్రికల్లో పనిచేశారు. యు.ఎన్.ఐ. వార్తాసంస్థకు హైదరాబాదు, కలకత్తా, మద్రాసు బ్యూరోల అధిపతిగా సేవలందించారు. వీ.వీ.గిరి రాష్ట్రపతిగా వున్నకాలంలో ఆయనతో కలసి యూరోపులో పర్యటించారు. నిర్భీతి, నిజాయితీ, ముక్కుసూటితనం ఆయన నైజం. జర్నలిస్టుగా ఆయన సాధించిన విజయాలు యువ జర్నలిస్టులు  నేర్చుకోవాల్సిన పాఠాలు. శ్రీ సీతారాం కాలంలో జర్నలిస్టుగా వున్నందుకు గర్విస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ‘జర్నలిజం ఒక నషాఅంటూ  ఆయన రాసిన ఒక వ్యాసంలోని కొన్ని విశేషాలతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తాను.


శ్రీ డి.సీతారాం 

పదహారేళ్ళ వయస్సులో హైదరాబాదు బులెటిన్ లో కుర్ర రిపోర్టర్ గా చేరాను. సైకిల్ చేతిలో వుండేది. తొలి అనుభవాలనుంచే రిపోర్టర్ చాలా నేర్చుకుంటాడు.
నిజానికి జర్నలిజం ఒక వ్యామోహం. మానవ సహజమయిన సౌకర్యాలను గురించి పట్టింపు వుండేది కాదు. వీటన్నిటికీ పరిహారం ఏమిటంటే, మీకు లభించే గుర్తింపు. మీరంటే గౌరవిస్తారు. మీరంటే భయపడతారు.
ఒక్కోసారి పెద్ద ప్రయత్నం  లేకుండానే కొన్ని అద్భుతమైన  వార్తలు వచ్చి  విలేకరి వొళ్ళో  పడతాయి. 1967  లో నిజాం అస్వస్థతకు గురై మరణించినప్పటి వార్త నాకు అలానే అయాచితంగా దొరికింది. అప్పుడు యు.ఎన్.ఐ. ఆఫీసు నిజాం క్లబ్ ని ఆనుకుని వున్న రోషన్ మంజిల్ లో వుండేది. అప్పట్లో మూడు సంపన్న క్లబ్బుల్లో సభ్యత్వం కలిగిన ఏకైక జర్నలిష్టును నేనే. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉద్యోగం చేస్తూనే నాలుగు ఆంగ్ల పత్రికలకు కరస్పాండెంట్ గా పనిచేసేవాడిని.సహజంగా క్లబ్బు పక్షులకు అన్ని రకాల వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుకునే వీలుంటుంది. పారిశ్రామికవేత్తలు, ఐ.యే.ఎస్., ఐ.పి.ఎస్. వంటి మూడక్షరాల బ్యూరోక్రాట్లు, జూదర్లు,లోఫర్లు,తిరుగుబోతులు అందరూ అక్కడ దర్శనమిస్తారు. రాజకీయ,అధికార సౌధాల్లోని ముచ్చట్ల నుంచి సామాజిక రంకు పురాణాల వరకు అక్కడ బయల్పడుతుంటాయి. నా నివాసం జాంబాగ్ లో. స్కూటర్ పై బయలుదేరి బొగ్గులకుంట మీదుగా యే అర్ధరాత్రికో ఇంటికి చేరుకోవడం అలవాటు. ఓ రాత్రి అలా  వస్తుండగా నిజాం రాజ భవనంలో దీపాలు వెలుగుతూ కనిపించాయి. ప్రధాన ద్వారం తెరిచివుంది. గార్డులు  సావధానంగా నిలబడి వున్నారు. ఒక కారు బయటకు వస్తోంది. కారులో వున్నది డాక్టర్ రామయ్య కాదుకదా అన్న అనుమానం కలిగింది. ఇంటికి వెళ్లి డాక్టర్ కు ఫోను చేసాను. రాజభవనంలో ఎవరో అస్వస్తులుగా వున్నారు. ఎవరని అడిగితే  కరక్టుగా జవాబు రాకపోవచ్చు. అందుకే ధైర్యం చేసి సూటిగా అడిగేశా. డాక్టర్, ముసలాయన తెల్లారేదాకా వుంటాడాఅని. ఆయన ముక్తసరిగా యెలా చెప్పగలను? మంచే జరుగుతుందని అనుకుందాంఅన్నాడు. ఇక ఆలశ్యం చేయకుండా ఫోను తీసుకుని ఆఫీసుకు ఫోను చేసి డ్యూటీలో వున్న ఆపరేటర్ కు  నిజాం కు తీవ్ర అస్వస్తతఅంటూ రెండు లైన్ల ఫ్లాష్ వార్త చెప్పాను. ఉద్దేశ్య పూర్వకంగానే స్తానిక పత్రికలకు ఈ వార్తను తెల్లవారు ఝాము వరకు విడుదల చేయకుండా ఆపాను. ఈ విధంగా చేయడం వల్ల ప్రత్యర్ధి న్యూస్ ఏజెన్సీ పీ.టీ.ఐ. కి వార్త లీక్ అయ్యే అవకాశం వుండదు. మరునాటికల్లా ఈ వార్త సంచలనంగా మారింది. నిజాం వంటశాలలో పనిచేసేవాడు మా ఆఫీసులో ప్యూను జానే జాద్  కు బంధువు. సమాచారం పట్టి సాయంత్రానికల్లా నిజాం మృతిఅంటూ స్నాప్ వార్త పంపాను. ప్రత్యర్ధి వార్తా సంస్థలు  అప్పటికి ఇంకా నిజాం అస్వస్థతకు సంబంధించిన వార్తలు మాత్రమే ఇస్తున్నాయి. ఆ సమయంలో మా వార్తాసంస్థ నిజాం మరణం గురించి ప్రపంచానికి తెలియచేసింది.
ఇలాటి ఆసక్తికర కధనాలు అనేకం ఆ వ్యాసంలో సీతారాం చెప్పుకొచ్చారు.  (05-11-2012) 

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

I deeply condole the demise of my mentor Mr.D.Sitaram who shaped many hands in UNI-Hyderabad with martinet discipline and drill in my early 1980.He was a stalwart in the galaxy of UNI hierarchy. I owe a lot to him in particular for what I am now after serving the news agency for over 30 years.

In our circle, we call him DS. He had the rare quality of picking up the right talent in the organisation which contributed to its growth and golden era of news agency journalism unlike the current management.

We had learnt from him the art of collecting news from different sources and disseminating the items with accuracy, brevity and fastness, which was the motto of UNI.

We were always kept on the run for stories and mind you, there was no Fax, STD,Mobile phone or Internet connections those days and yet UNI was faster, thanks to his drive.

DS used to dance his fingers on the type writer key board to file a story before it was given to the teleprinter operator for disseminating the news through terrestrial cable network to compete with the rivals.

We had learnt from him he technique of typing the any story with high speed as dictated by the reporter from the spot over telephone.I do remember he had typed the story of the then PM Indira Gandhi dedicating the Srisailam Dam when I dictated the item from the spot through "lightning call"(No STD even those days) in early 1980's.

While working as the manager of UNI-Hyd, he used to run a popular column under his pen name "Di Yes" in the Deccan Chronicle daily. He was responsible for getting UNI's own building after the office was run in a ramshackle Fatehmaidan stadium for several years.

May his soul rest in peace.I convey my heart felt condolences to the bereaved family.
-Dr.Y.Bala Murali Krishna