20, డిసెంబర్ 2011, మంగళవారం

"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర




"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర 


( సీనియర్ ఐ పీ ఎస్ అధికారి, మాజీ డీజీపీ హెచ్.జె.దొర గారు ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పేరుతొ  
రాసిన పుస్తకంలో కొన్ని మచ్చుతునకలు.)




“....అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకుని తిరిగివచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు తప్పలేదు.
“....నాదెండ్ల భాస్కరరావు ఎవరో అప్పటిదాకా నాకు (దొరకు) తెలియదు.
“ ....తన వ్యక్తిగత విషయాలు గురించి సైతం ఎన్టీఆర్ నా దగ్గర ఓపెన్ అయ్యేవారు.
“....కొంతమంది ఎన్టీఆర్ దగ్గర (నా గురించి) ప్రస్తావించి ఇతను (దొర) ‘అవతల వ్యక్తి’ అని చెప్పినా కూడా ఆయన నన్ను వొదులుకోలేదు.
“....మా మామయ్య బొడ్డేపల్లి రాజగోపాల రావు ఏడు పర్యాయాలు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి (కాంగ్రెస్ అభ్యర్ధిగా) పోటీ చేసి ఎన్నికవుతూ వచ్చారు. మా ఇంట్లోనే కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు నడిచేవి. మా మామయ్యకు కుడి భుజంగా వుంటూ ఈ క్యాంప్ నడిపేది స్వయంగా నా తమ్ముడు, ఆయన అల్లుడు హెచ్.ఏ.దొర. చూపరులకు ఇదంతా ఆశ్చర్యంగా వుండేది.
“....దేశ రాజకీయాల్లో ఎప్పుడయితే రాజకీయ పార్టీలకు, వాటి సిద్ధాంతాలకు ప్రాముఖ్యం  తగ్గి వ్యక్తుల ప్రాధాన్యాలు పెరిగాయో, గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయో అప్పుడే (పోలీసు శాఖలో అంతర్భాగంగా వున్న) ఇంటెలిజెన్స్ వ్యవస్త అవసరాలు పెరిగాయి.
“.....ఎన్టీఆర్ ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్  మీదే డిపెండ్ అయ్యేవారు.
“....ఎన్టీఆర్ ఏజెన్సీ ప్రాంతాలలో (ముఖ్యమంత్రి హోదాలో)  టూర్ చేసేటప్పుడు .....అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ఖాళీగా వున్న ఇళ్ళల్లో కానీ (ఆయనకు) బస ఏర్పాటు చేసేవారు. (సీఎం పేషీకి చెందిన సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు - రాఘవేంద్రరావు, టీ ఆర్ ప్రసాద్, బెనర్జీ లతో పాటు నేను (దొర) చాలా చిన్న గదుల్లో సరయిన వసతులు లేకపోయినా నైట్ హాల్ట్ చేసేవాళ్ళం.
“....ఆంధ్ర జ్యోతి అధినేత కే.ఎల్.ఎన్. ప్రసాద్ చనిపోయారని కబురందింది. ..వెళ్లి నివాళులు అర్పించాలని చంద్రబాబు అన్నారు. ‘ఏం! ఎందుకెళ్ళాలి? మేం వెళ్ళం!’ – ఇదీ ఎన్టీఆర్ సమాధానం.
“అక్టోబర్ 31,1984. ఉదయం పది గంటలు. యు.ఎన్.ఐ. విలేకరి నుంచి ఫోన్. ప్రధానమంత్రి  ఇందిరాగాంధీని ఎవరో షూట్ చేసారట....ఢిల్లీ యెలా వెళ్లాలనే దానిపై తర్జన భర్జన. ఆ రోజుల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండే ఫ్లయిట్లు. నావల్ చీఫ్ హైదరాబాదులో వున్న సంగతి తెలుసుకుని ఆయన వచ్చిన ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను తీసుకుని ఢిల్లీ వెళ్ళాము. అప్పుడు హైదరాబాదులో వున్న మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా అదే విమానం ఎక్కారు.ఆ చిన్న విమానం, యావ్రో ఎయిర్ క్రాఫ్ట్, ఢిల్లీ చేరడానికి నాలుగు గంటలు పట్టింది.
“....  ఆగస్టు సంక్షోభం నుంచి ఎన్టీఆర్ కు తలనొప్పులు మొదలయ్యాయి. (సొంత) ఎమ్మెల్యేలు పలువురు ఇప్పుడు ఆయననుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఒకరకంగా బ్లాక్ మెయిల్. అందుకే ఆయన (ఎన్టీఆర్) శాసన సభను రద్దుచేసి తాజాగా ప్రజాతీర్పు కోరదామనుకుంటున్నారు.
“.....పెను తుపాను బాధితుల పరామర్శ కోసం మద్రాసు వచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీని రాజభవన్ లో ఎన్టీఆర్ కలసి మాట్లాడారు. ఆ చర్చల తరువాత ఉభయుల మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్టు మాకు కొన్ని రోజులయ్యాక తెలిసింది. దీని పర్యవసానమే ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం.
“....రాజీవ్ గాంధీతో ఎన్టీఆర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు ముఖ్యులు (పీవీ నరసింహారావు, శివశంకర్, జలగం వెంగళరావు) వీరిపై  తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టకూడదు.
“....పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలకు రమ్మని కాంగ్రెసేతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులనుంచి ఎన్టీఆర్ పై ఒకటే వొత్తిళ్ళు. అయినా రాజీవ్ గాంధీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎన్టీఆర్ వెళ్ళలేదు. రామకృష్ణ హెగ్డే మాట కాదన లేక కర్నాటకలోని ఒక్క కోలార్ కు మాత్రమే వెళ్లారు. అలా వెళ్లినందుకు అప్పటికే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చేసింది – ఏమిటిదీ అని. అందుకు పార్టీ వివరణ ఇవ్వాల్సివచ్చింది.
“....ఎన్నికలకు ముందు ఒక అవగాహనకు వచ్చిన రాజీవ్, ఎన్టీఆర్ ఆ తరువాత ఆ సయోధ్యకు తిలోదకాలు ఇచ్చారు.
“....రాజీవ్ గాంధీ (రాష్ట్రాల) పర్యటనల్లో కొన్ని సాహసాలు చేస్తుండేవారు.ఒకసారి ఖమ్మం జిల్లా  వచ్చినప్పుడు భద్రాచలంలో దిగి ఒక జీపులో ఎక్కి అందరూ చూస్తుండగానే దాన్ని ముందుకు ఉరికించి అడవుల్లో మాయమయ్యారు.  ఎటు వెళ్ళారో తెలియక మాకు టెన్షన్ మొదలయింది........
“....మరోసారి విశాఖ ఎయిర్ పోర్ట్ లో జర్నలిష్టులతో గంటన్నర మాట్లాడుతూ వుండిపోయారు. ఇంతలో బాగా చీకటి పడింది. ఆయన ఫ్లయిట్ ఎక్కగానే మేం కూడా తిరిగొచ్చేశాము.  తర్వాత తెలిసిందేమిటంటే వాతావరణం అనుకూలించక ఫ్లయిట్ టేకాఫ్ కాలేదు. ప్రధాని ఆ రాత్రి నావల్ ఆఫీసర్స్ మెస్ లో విశ్రాంతి తీసుకుని మరునాడు ఢిల్లీ వెళ్ళిపోయారు........తన జీవితపు చివరి ప్రయాణం కూడా విశాఖ ఎయిర్ పోర్ట్  నుంచే సాగడం రాజీవ్ గాంధీకి సంబంధించి ఒక విషాదం. (మరికొన్ని విశేషాలు మరోసారి- భండారు శ్రీనివాసరావు, 20-12-2011)

6 కామెంట్‌లు:

keshav చెప్పారు...

chala bagundi sir... very informative... thanQ

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ keshav - thanks- ధన్యవాదాలు కేశవ్ - భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

really good.....if u can provide any pdf link

NNRAO చెప్పారు...

నేను పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారి అసలు యేమయ్యి౦ద౦టె అనే పుస్తక౦ చదవట౦ జరిగి౦ది...మళ్ళీ - భండారు శ్రీనివాసరావు గారి పోస్ట్ లు చూశాక
అటువ౦టి అనుభూతి కలిగి౦ది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@NN RAO _ అంతటి మహానుభావుడితో 'పోలిక' కొంత ఇబ్బందికరంగా వున్నా మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుపలేకుండా వున్నాను.- భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత- థాంక్స్. pdf link నా చేతుల్లో లేదు. క్షమించండి - భండారు శ్రీనివాసరావు