18, డిసెంబర్ 2011, ఆదివారం

మాయమై పోతున్నవమ్మా!


మాయమై పోతున్నవమ్మా!

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో  స్నేహితుడొకడిచ్చాడని చెప్పి మా పిల్లలు  ఓ తెలుగు సినిమా క్యాసెట్ ఇంటికి పట్టుకొచ్చారు. కాసెట్ అయితే వుంది కానీ దాన్ని టీవీ (నలుపు తెలుపు) తెరపై చూడడానికి వీడియో క్యాసెట్ ప్లేయర్ (వీ సీ పీ ) లేదు. నాడా దొరికిందని ఘోడా కోసం వెదికినట్టు చిక్కడపల్లిలో ఓ షాపునుంచి దాన్ని గంటకు ఇంత అని రెంటుకు  తీసుకొచ్చి ఇంట్లో  ఆ సినిమా చూసాం. ఆ తరువాత అందరి  ఇళ్ళల్లో వీసీపీలు వీసీఆర్ లు గృహప్రవేశం చేశాయనుకోండి. అది వేరే కధ.
మళ్ళీ ఇన్నేళ్ళ తరవాత - మా బావగారి డెబ్బయ్యేడవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1995 లో తీసిన  వీడియో క్యాసెట్ చూడాలనిపిస్తే వీసీఆర్ అనే పరికరం ఇళ్లల్లోనే కాదు షాపుల్లో కూడా మాయమై పోయింది. ఒకప్పుడు వీసీఆర్ ఇంట్లో వుంటే  ఘనంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడా మాట చెబితే నమ్మేవాళ్ళు వుండరేమో. ఎందుకంటె ఈ నాటి పిల్లలకు ఆనాటి  వీడియో క్యాసెట్లు, వీడియో ప్లేయర్లు చూసివుండే అవకాశం లేదు కాబట్టి.
నిన్ననో మొన్ననో పేపర్లో ఓ వార్త చదివాను.
ఉత్తరాలు చదవడం దగ్గరనుంచి, టెలిఫోన్ డైరెక్టరీ  చూడడం వరకు అనేక పనుల అవసరం అందుబాటులోకి వచ్చిన  టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు జనాలకు లేకుండా పోయిందని ఓ సర్వే తేల్చిందట. ఇలాటివి దాదాపు  యాభయ్ దాకా వున్నాయని కూడా  ఆ సర్వే సారాంశం.
వెబ్ ప్రపంచం ఆవిష్క్రుతమైయిన దగ్గరనుంచి లోగడ ప్రజలు అలవాటు  పడిన అనేక పనుల  అవసరం నేటి  ప్రపంచంలో లేకుండాపోయింది. వెనుక ఏదయినా ఫోను నెంబరు కావాల్సివస్తే డైరెక్టరీ తో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. ఇంటర్ నెట్ వినియోగం  ఇంకా పూర్తిగా  వ్యాపించని కొన్ని దేశాల మాటేమో గాని ఇప్పుడు అనేకానేక దేశాల్లో ట్రావెల్ సంస్తల కార్యాలయాలకు వెళ్లి ప్రయాణాల టిక్కెట్లు కొనుక్కునే వారి సంఖ్య నామమాత్రం. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను  గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని  పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోతున్నాయి అని లండన్ కు చెందిన మొజి కంపెనీ చేసిన సర్వే తెలుపుతోంది. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేయడం కూడా బాగా తగ్గిపోతోంది.

మాయమై పోతున్న అంశాలు మననం చేసుకుంటున్నప్పుడు మిత్రులు ఆర్.వీ.వీ. కృష్ణారావు గారు హరికధను గుర్తుచేశారు. అదేమిటో ఆయన మాటల్లోనే విందాం.
మనకు ఇష్టం లేని కబుర్లు ఎవరయినా  చెపుతుంటే ఈ హరికధలు చాల్లేవోయి అంటూ ఉంటాము.
కానీ హరికధలంటే బోరు కొట్టే కధలు మాత్రం కాదు.హరికధలు, ఒకానొక కాలంలో జనాలను కట్టిపడేసిన భక్తిరస ధునులు. ప్రజలను సమ్మోహితులను చేసిన శ్రవణానందకర ధ్వనులు.
చాన్నాళ్ళుగా ఈ ఛానళ్ళ ప్రోగ్రాములు చూసి చూసి విసుగెత్తి పోయినప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కాని భక్తీ ఛానల్ కాని చూడడం ఈ మధ్య తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోయింది. నిజంగా పెద్ద రిలీఫ్.  ఈ మధ్య ఎస్.వి.బి.సి. ఛానల్ లో ఉమామహేశ్వరీ గారి హరికథ చూసాను. ఎంతో బాగా చెప్పారు.మరపున పడుతున్న మధుర జ్ఞాపకాలను తమ హరికధా గానంతో తట్టిలేపారు.
"ఈ నాటి పిల్లలకు కాని ఇంకా చాలామంది  పెద్ద వాళ్ళకు కాని హరికథ అనే ప్రసిద్ధ కళా రూపం వొకటి వుందని కూడా తెలియదేమో అనిపించే రోజుల్లో జీవిస్తున్నాము.   హరికథ ఎంత గొప్పదో నాకు తెలుసు.  నేను కాలేజీ చదువు పూర్తయిన తరువాత కూడా హరికథ అంటే ఎంతో ఇష్ట పడే వాడిని.   ఎనభయ్యో దశకములో కూడా హరికథకు ఎంతో కొంత ప్రభావము వుండేది.
"యాభయ్, అరవై దశకాల్లో కూడా హరికథ ఎంతో  ఉచ్చ స్థితిలో వుండేది. దేవాలయాల ఉత్సవాలలో, వినాయక చవితి, దేవి నవరాత్రుళ్ళు, శ్రీరామ నవమి పందిళ్ళలో, పెద్ద స్థితిమంతుల ఇళ్ళల్లో జరిగే  శుభకార్యాలలో హరికథా కాలక్షేపాలు ఉండేవి.  మధ్య మధ్యలో వేసవికాలంలో  కూడా గ్రామస్తులు అంతా కలసి రామాయణమో, మహా భారతమో సీరియల్ గా చెప్పించుకొనే వారు.    సాంస్కృతిక కార్యక్రమాలు నెలనెలా  నిర్వహించే గాన సభల్లో కూడా ఏడాదికి వోసారి అయినా హరికకధ  పెట్టించే వారు.

హరికధ అనేది  సర్వ కళాసమాహారం.  హరికథ చెప్పే దాసు గారికి సాహిత్యం, సంగీతం క్షుణ్ణంగా వచ్చి తీరాలి. రామాయణ,భారత,భాగవతాదులు కరతలామలకంగా వుండాలి.  కొద్దో గొప్పో నాట్యం తెలిసి వుండాలి.  వీటన్నితో పాటు సమయస్పూర్తి, చతురత, రక్తి కట్టించే సామర్ధ్యం అవసరం. అభినయ కళ తెలిసివుండడం కూడా ముఖ్యం.  ఇన్ని వుంటేనే  దాసుగారికి బంతిపూల దండలు  దండిగా పడేది.  హరి కథలు చెప్పే దాసుగారిని భాగవతార్ అని పిల్చేవారు.  అమ్ముల విశ్వనాథ భాగవతార్ అలా.  హరికథకి వయోలిన్, మృదంగం పక్క వాయిద్యాలు.  దాసుగారు కుడిచేతిలో చిడతలు పట్టుకొని కీర్తనలు పాడేటప్పుడు తాళం వేస్తూ వుండే వారు. కాళ్ళకు గజ్జెలు.  దాసు గారి ఆహార్యం పట్టు పంచె, పట్టు ఉత్తరీయం, నుదుట సింధూరం. అన్నట్టు దాసుగారు తనతో ఎప్పుడూ తీసుకు వెళ్ళేది శ్రుతి బాక్స్.

కథా ప్రారంభంలో దాసుగారు పక్క వాయిద్యాల సమేతంగా వేదిక మీద కూర్చునే గణపతి ప్రార్ధనతో మొదలుపెట్టి తాను  ఏ కధ  చెప్పదలచుకొన్నారన్నది  సూచన ప్రాయంగా తెలియచేస్తూ  రెండు మూడు కీర్తనలు పాడే వారు. తర్వాత లేచి నిలబడి, గజ్జెలు కళ్ళకు అద్దుకొని, వాటిని  కాళ్ళకు కట్టుకొని, శ్రీమద్రమారమణ గోవిందా అని తానంటూ, సభికులందరి చేతా గట్టిగా అనిపిస్తూ  కథలోకి ఉపక్రమించే వారు.  కీర్తనలు ఆలపించేటప్పుడు పక్క వాయిద్యాల సహకారం తీసుకొనే  వారు. సందర్భోచితంగా నాట్యం చేస్తూ కథను రక్తి కట్టించే వారు. నిద్రలో జోగే శ్రోతలను మేలు కొలిపెందుకు మధ్యమధ్యలో గోవిందలు కొట్టించేవారు.  సినిమాలో కూడా హరికథలు పెట్టేవారు.  పది పదిహేను నిమిషాలు వుండేవి.  విజయా వారి షాహుకారు సినిమా హరికథ తోనే ప్రారంభం అవుతుంది.  నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించిన కవితా వారి వాగ్దానం సినిమాలో రేలంగి హరిదాసుగా ఘంటసాల పాడిన  సీతా కల్యాణం చాలా మంది ఇష్టపడే మరపు రాని హరికథ.
హరికథ అంటే ఆది భట్ల నారాయణ దాసు గారి పేరే అందరికి గుర్తుకు వస్తుంది.  విజయనగరం సంస్థానం ఆస్థాన విద్వాంసులు ఆయన. ఫిడేలు  ద్వారం వెంకట స్వామి నాయుడు గారికి ముందు విజయనగరం సంగీత కళా శాల ప్రిన్సిపాల్ గా పనిచేసారు కూడా. హరికధ  చెప్పే ప్రతివారు మేము నారాయణదాసు గారి శిష్యులమనో లేదా ఆయన కథలు చెపుతున్నామనో చెప్పుకొనేవారు.  ఇప్పటికి కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో నారాయణ దాసు గారి ఉత్సవాలు చేస్తూ వుంటారు.
ఆయన తర్వాత తరంలో నరసాపురం దీక్షిత్ దాసు గారు. మా అమ్మ గారు నారాయణ దాసు గారు దీక్షిత దాసు గారు ఇద్దరి కథలూ విన్నాను అని చెప్పారు.  నేను కూడా ఎందరో ప్రసిద్ధులయిన  విద్వాంసుల హరికథలు విన్నాను.  తోట్లవల్లూరులో మా నాన్నగారు రాయసం గంగన్న పంతులు గారు వేణు గోపాల  స్వామి దేవాలయం ఆఫీసర్ గా పనిచేసినప్పుడు  వైశాఖ పౌర్ణమి కల్యాణాలలోను,  శివాలయంలో శివరాత్రి, దసరా నవరత్రులలోను ఎంతో మంది పేరున్న వారు వచ్చి హరికథలు చెప్పే వారు. కూచిభొట్ల కోటేశ్వర రావు అనే ఆయన బక్క పలచగా పొడుగ్గా వుండేవారు.  భక్త పోతన హరికథ ఎంతో గొప్పగా చెప్పే వారు.  'లలిత సరస గాన కళానిధే' అంటూ ప్రార్ధన చేసేవారు.  లేచి నిల్చున్న  వెంటనే 'వాసుదేవ' అని కళ్యాణి రాగంలో త్యాగరాజ కీర్తన ఎంతో శ్రావ్యంగా పాడే వారు.  సందర్భానికి తగ్గట్టుగా  పిట్ట కథలు చెప్పే వారు. ఇరవయ్యేళ్ళ తర్వాత నేను బెజవాడ రేడియోలో పని చేస్తున్నప్పుడు కూడా వారిని కలిసే అవకాశం నాకు దక్కింది.  పోతన భాగవతాన్ని అమ్ముకోలేక ఎంత బాధ పడ్డాడో అందరికీ తెలిసిందే.  పోతన గారిలాగే  కూచిభొట్ల వారుకూడా తమకున్న అద్భుతమయిన హరికథా విద్యను  అమ్ముకోలేదు.  ఏమిస్తే అది పుచ్చుకొనే వారు. పేద వారయినా పెద్ద మనసు వున్నవారు.  మేము బెజవాడలో త్యాగరాజ సంగీత కళా సమితి అనే సంస్థను ప్రారంభిస్తే ఇంట్లో వున్న  వెండి త్యాగరాజు ఫోటో పట్టుకొచ్చి ఇచ్చి 'ఇదే మీ లోగో' అన్న గొప్ప హృదయం వున్నమనిషి ఆయన. ప్రాతఃస్మరణీయులు.




సొమ్ములు వాగ్దేవికి
సరసమ్ములు సంగీత సహజ సౌందర్య
విలాసమ్ములు, మధురమ్ములు, మా   
అమ్ముల తమ్ముల మనోహరాపముల్  –కరుణశ్రీ  



అమ్ముల విశ్వనాధం గారు మరో గొప్ప విద్వాంసులు.  చల్లపల్లి, అవని గడ్డ ప్రాంతం వారు.  స్ఫురద్రూపి. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులు.మండలి బుద్ధప్రసాద్ గారు ప్రచురించిన దివిసీమ రత్నాలలో అమ్ముల విశ్వనాధం గారి గురించి చాలా వివరంగా వుంది.  నారాయణదాసు గారి తర్వాత బహుశః శిలా విగ్రహం వేయించుకోగలిగిన గౌరవం పొందింది అమ్ముల వారే.  శివధనుర్భంగం కథ చాలా గొప్పగా చెప్పేవారు. నేను రేలంగి లో వున్నప్పుడు మావూళ్లో సుబ్రహ్మణ్య షష్టికి కధ చెప్పిన తరువాత మళ్ళీ వూళ్ళోవాళ్ళు పిలిపించి రామాయణం సీరియల్ గా వారం రోజులు చెప్పించారు.  ఆఖరి రోజున రామపట్టాభిషేకం నాడు దాసుగారిని ఘనంగా సత్కరించారు కూడా.అమ్ముల విశ్వనాధం గారి అమ్మాయి దుర్గాభవాని ప్రస్తుతం విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో వయోలిన్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.
సీరియల్ హరికథల గురించి కొంత చెప్పాలి. పొలం పనులు అయిపోయి అందరు తీరిగ్గా వున్నప్పుడు సీరియల్ హరికథలు పెట్టించుకునేవారు.  గుళ్ళో కళ్యాణ మండపం స్టేజిగా రామాయణమో, భారతమో పూర్తిగా చెప్పించే వారు.  రాత్రి ఏడు ఎనిమిది మధ్య ప్రారంభమయిన కథ పన్నెండు గంటల దాకా సాగేది.  మధ్యలో హారతి పళ్ళెం పట్టే వారు.  హరికధ వినడానికి వచ్చిన  హారతి పళ్ళెంలో  తమకు తోచిన విధంగా అణా, అర్ధణా, బేడా, పావలా కాసులు వేసేవాళ్ళు.  పళ్ళెం మధ్యలో చిన్న కుంది పెట్టి వొత్తి వెలిగించి  దీపం పెట్టే వాళ్ళు.  చీకట్లో కొంతమంది అణా వేసి పావలా కొట్టేసేవారని జోకులు కూడా ఉండేవి. చిల్లర లేక పోతే హారతి పళ్ళెం పట్టే వాడిని అడిగి తీసుకునే వెసులుబాటు వుండేది. నా దగ్గర పావలా వుంది నేను వో అణా వెయ్యాలి మిగతాది ఇచ్చెయ్యిఅని అడిగి తీసుకునే వారు.
"వీరగంధం వెంకట సుబ్బారావు, రాజశేఖరుని లక్ష్మీపతి రావుర్యాలి రామచంద్ర రావు, కంచిభొట్ల వీర రాఘవయ్య, నౌడూరి విశ్వనాధ శాస్త్రి , కడలి వీరదాసు, ముదపాక మల్లేశ్వర రావు, ప్రగడ వీర భద్ర రావు, ముదునూరు శంకర్ రావు, ఎల్లమంద రావు, చోరగుడి పాండురంగరావు గార్లు హరికధలు చెప్పడంలో దిట్టలుగా పేరుతెచ్చుకున్నారు.  ములుకోట్ల సదాశివ శాస్త్రి గారు అని తెనాలి అనుకొంటా.  హైస్కూల్ లో తెలుగు మాష్టారు గా వుండే వారు. త్యాగరాజ చరిత్రను  రామ భక్తి అంతా జోడించి చెప్పే వారు.   1996  ప్రాంతంలో నేను హైదరాబాద్ రేడియోలో పని చేస్తున్నప్పుడు తెనాలి నుంచి వాళ్ళ తాలూకు వాళ్ళు ఫోన్ చేసి ఆయన మరణించారు అని చెప్పి ఆయన్ను గురించి వివరిస్తూ ఉంటే ఆయన గొప్ప తనం నాకు తెలుసండీ  అని వార్తల్లో విపులంగా చెప్పాము. వార్తలు విన్న తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేసి అంత బాధలో కూడా చాలా బాగా కవర్ చేసారు అని థాంక్స్ చెప్పాడు.  పాతూరి మధుసూదన్ రావు  గారు  మొత్తం సంస్కృతం లోనే హరికథ చెప్పే వారు. సంసృతం రాని వాళ్ళకు కూడా అర్ధం అయ్యేలా. ఇలా రాసుకొంటూపోతే  చాలా  వున్నాయి. రేడియోలో ప్రయాగ నరసింహ శాస్త్రి గారు. ఏ కధ అయినా చెప్పేవారు. షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం లేక పోతే ప్రయాగ వారి హరికథ వుండేది.  గాంధీ, నెహ్రు, బోస్  చరిత్రలు కూడా ఆయన హరికధలుగా  చెప్పే వారు.
తర్వాత తరం లో మనకందరికీ తెలుసున్న వ్యక్తి కోట సచ్చిదానంద  శాస్త్రి గారు.  చాలా రమణీయం గా హాస్యోక్తులతో ఎన్ని గంటలు విన్నాఇంకా ఇంకా  వినాలనిపించేలా చెప్పేవారు. ఇప్పటికి కూడా చెప్తున్నారు.  2005 లో నల్లకుంట శంకర్ మఠంలోదర్శనం మాస పత్రికతో కలసి వారం రోజుల పాటు  హరికథా ఉత్సవాలు నిర్వహించారు,  మా ప్రసార భారతి సి.యి.వో. కే.ఎస్. శర్మ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి.
బుర్రా  శివరామకృష్ణ శాస్త్రి కూడా మంచి కథకులు.  ఆడ వారిలో కూడా మంచి విద్వాంసులు వున్నారు. తెనాలి ఉమా చౌదరి భాగవతారిణి  కొన్నేళ్ళపాటు ఆంధ్రదేశం తో పాటు ఇతర రాష్ట్రాలోని తెలుగు వారికి సయితం  అభిమాన పాత్రులయ్యారు.  నగరాజకుమారి, వజ్రాల విజయ శ్రీ , మంత్రిప్రగడ లలిత కుమారి హరికథలు అంటే జనం  చెవి కోసుకొనే వారు.
రాజమండ్రి  దగ్గర కపిలేశ్వరపురం జమీందార్  సత్యనారాయణరావు గారు సర్వారాయ హరికథ గురు కులం ప్రారంభించి, హరికధలపట్ల ఆసక్తివున్న వారికి   అక్కడే వసతి కల్పించి రెండు మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేసారు.  ఇప్పుడు హరికథ చెపుతున్నవారిలో  చాలా మంది కపిలేశ్వరపురం  గురుకులం  విద్యార్ధులే - మొదట్లో ప్రస్తావించిన ఉమా మహేశ్వరితో సహా.  ఉమా మహేశ్వరి  చాలా చిన్నతనంలోనే సంసృతంలో హరికధ  చెప్పి అందరిని మెప్పించారు.  మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు కళా కృష్ణ గారిని వివాహం చేసుకొని ఈ  దంపతులిద్దరూ  వొకరు పేరిణి నాట్యం ద్వారా  మరొకరు హరికథ ద్వారా కళాసేవ  చేస్తున్నారు.
"ఆచార్య తూమాటి దోణప్ప గారు హరికధా సర్వస్వం అనే గ్రంధం రాశారు.  తెలుగు యూనివర్సిటీ వారు నిరుడు తమ రజితోత్సవాల సందర్భంగా తక్కువ ధరకు అమ్మిన పుస్తకాల్లో ఇది కూడా వుంది. ఇంకా అవి వున్నాయో లేదో  కూడా తెలియదు. హరికధను అభిమానించే వారంతా కొని  దాచుకోవాల్సిన పుస్తకం.

రేడియోలో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు గంట సేపు హరికథ వచ్చేది. రేడియో సంగీత సమ్మేళనం, నాటక సప్తాహం లాగా హరికథా సప్తాహం కూడా నిర్వహించే వాళ్ళు. హరిదాసులు అందరు వారి లెటర్ హెడ్స్ పైనా, కర పత్రాల పైనా రేడియో ఆర్టిస్టుఅని వేసుకొనే వారు.  ఇప్పుడు కూడా హరికథలు ప్రసారం చేస్తున్నారో లేదో వోసారి చెక్ చెయ్యాలి.  వస్తే చాలా సంతోషం. మానేస్తే  అంత కంటే అన్యాయం మరోటి వుండదు.  తోలుబొమ్మలాటలు పోయాయి. పౌరాణిక నాటకాలు మరచి పోతున్నారు. హరికథని అలా కానివ్వకూడదు.  తమిళనాడులో ఇంకా హరికధ  ఆదరణకు నోచుకుంటూనే వుందన్న సంగతి మరచిపోకూడదు.

గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కధా గాన కళా పరిషద్ ఏర్పాటు చేసింది. సంగీత,సాహిత్య, నాటక అకాడమీల్లాగానే అది కూడా కాలగర్భంలో కలసిపోయింది. అలాగే బుర్రకధలు. ఎన్నికలప్పుడే ప్రచారాలకోసం గుర్తుకొచ్చే విధంగా క్రమంగా మాయమయిపోతున్నాయి. (18-12-2011)
 










 














2 కామెంట్‌లు:

yalamanchili చెప్పారు...

శ్రీ‌నివాస‌రావు గారు..
న‌మ‌స్సులు.. ఈ హ‌రి క‌థ క‌థ‌నం చూస్తే..మా నాన్న గారు గుర్తుకు వ‌చ్చారు. నా చిన్నప్పుడు మా ఊరి లో ఆయ‌న శ్రద్ధ తీసుకొని హ‌రిక‌థ‌లు పెట్టించేవారు. చిన్నత‌నంలో మా కుర్రకారు వీధి సినిమాల్ని ఇష్టప‌డేవాళ్లం. కానీ, నాన్నగారి గ్రూప్ పెద్దలంతా హ‌రిక‌థ ను శ్రద్ధ గా వినేవారు. ఆ తర్వాత కాలంలో రేడియో లో హ‌రిక‌థలు రావ‌టం వ‌చ్చాక‌, ఆయ‌న చాలా ఆనందించే వారు. భోజ‌నాల‌య్యాక మేం హై స్కూలు, ఆ పై కాలేజీ పుస్తకాల‌తో కుస్తీ ప‌డుతుంటే నాన్న గారు హ‌రి క‌థ శ్రద్ధగా వింటూ ఉండే వారు. (అంటే ఆయ‌న హ‌రి క‌థ పూర్తిగా విన‌టం కోసం మెళ‌కువ‌గా ఉండే వారో, లేక మేం చ‌దువుతుంటే కూడా ఉండేందుకు ఉండేవారో చిన్నపాటి అనుమానం. ) రేడియో లో చిన్న స్వరంలో వినే హ‌రి క‌థ కోసం ఆయ‌న ముందే ప‌డ‌క్కుర్చీ తెచ్చుకొని స్టూల్ పెట్టుకొని దానిపై రేడియో, కింద మంచినీటి చెంబు ఉంచుకొనే వారు. హ‌రి క‌థ పూర్తయ్యాక మ‌మ్మల్ని ప‌డుకొమ్మని చెప్పి అప్పుడు ఆయ‌న నిద్ర పోయేవారు. మ‌ళ్లీ తెల్లవారు జాము న నాలుగు గంట‌ల‌కే నిద్ర లేచేవారు. ఆ రోజులు గుర్తుకు వ‌చ్చాయి. మీకు మా కృత‌జ్ఞత‌లు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@యలమంచిలి గారికి - హరికధా కధనంపై వ్యక్తపరచిన అభిప్రాయానికి ధన్యవాదాలు. మీ నాన్నగారి స్మృతులను మరోమారు నెమరువేసుకోగలిగేలా ఈ పోస్ట్ దోహదపడడం ఎంతో సంతోషదాయకం.-భండారు శ్రీనివాసరావు