30, డిసెంబర్ 2011, శుక్రవారం

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు



ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

తమ శ్వాస,ధ్యాస కళామతల్లి మాత్రమేనని,  తుది శ్వాస వొదిలేవరకు  వరకు నటిస్తూనే వుంటామని  చెప్పుకునే వారు చాలామంది కనిపిస్తారు. కాని అలాటి అరుదయిన కోవలో చేర్చాల్సిన మహా నటులు కూడా తెలుగు నాటకరంగంలో  వున్నారు.
వల్లూరు వెంకట్రామయ్య చౌదరి బాలనాగమ్మ నాటకం ఆయన పోయే వరకు బాగా నడిచింది.  మాయల ఫకీరుగా ఆయన నటన గొప్పగా వుండేది అనే వారు. ఓ నాటకంలో నటిస్తూనే   స్టేజీ  మీదే చనిపోయారు. అలాగే రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడి పాత్ర ధరించే   బేతా వెంకటరావు గారు కూడా వేషం మీదే చనిపోయారు. మహానుభావులు. కళామతల్లి సేవచేస్తూనే కన్నుమూశారు. వెంకటరావు గారి అబ్బాయి  బేతా రామచంద్రరావు తండ్రి కళను పుణికిపుచ్చుకున్నాడు. అతడు కూడా ఆంజనేయుడి వేషం వేసేవాడు.
నెల్లూరుకు  చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు.  హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు. మందపాటి రామలింగేశ్వర రావు  విశ్వామిత్రుడుగా  వేసేవారు. గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. సావిత్రి ప్రస్తావన వచ్చింది కాబట్టి కొందరు మహిళా నటీమణులను సంస్మరించుకుని ఈ వ్యాసపరంపరకు భరతవాక్యం పలుకుదాం.   

ద్రౌపదిగా పూర్ణిమ వేసేవారు ఎక్కువగా. కొంచెము లావుగా వున్నా ఆవిడ నటన, పద్యం పాడే విధానం నచ్చిన ప్రేక్షకులు అవేవీ   పట్టించుకోకుండా అభిమానించేవారు. పువ్వుల అనసూయపీసపాటి సత్య వతి కూడా ద్రౌపది వేసే వారు.

(తెలుగు నాటక రంగానికి సేవ చేసిన మహామహులను గుర్తున్నంతవరకు మాత్రమే కాకుండా గుర్తు తెచ్చుకుని


 కూడా మరోమారు  సంస్మరించుకోవడానికి  చేసిన చిరు ప్రయత్నం ఇది. ఈ క్రమంలో ఎవరినయినా పొరబాటున

 మర్చిపోతే ఆ తప్పిదాన్ని మన్నించాలని మనవి. – ఆర్వీవీ కృష్ణారావు,భండారు శ్రీనివాసరావు) 

కామెంట్‌లు లేవు: