23, డిసెంబర్ 2011, శుక్రవారం

నాటకాలు ఆడొద్దురా........ ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు


నాటకాలు ఆడొద్దురా........ ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

చింతామణి  నాటకాన్నినిషేధించాలి లేకపోతే మేమంతా పెద్ద ఉద్యమం చేస్తాము. ఎంతకయినా తెగిస్తాము.అంటూ ఈ మధ్య జరిగిన ఆర్య వైశ్య మహాసభలో కొందరు వక్తలు సింహ గర్జన చేశారు. ఛానళ్ళు అన్నీ వివరంగా కవర్ చేశాయి. ప్రతిగా నాటక సమాజాలకు చెందిన మరికొందరు  ఆర్టిస్టులు ‘నాటకం నిషేధిస్తే ఉద్యమం చేస్తాం’ అంటూ ఎదురు దాడి ప్రారంభించారు. ఇప్పటికే ఆదరణ కరువై  కళాకారులు వీధిన పడ్డారు. ఇప్పుడీ ఆందోళనల పుణ్యమా అని నిజంగానే వీధికెక్కే పరిస్తితి.  కొద్దో గొప్పో ఉపాధి కల్పిస్తున్న నాటకాన్ని నిషేధిస్తే ఎలా’ అన్నది వారి బాధ. ‘చింతామణి నాటకంలో మా కులం వారిని హేళన చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎలాగో ఓపికపట్టి  భరించాము. ఇక వూరుకోమ’న్నది ఆర్య వైశ్య ప్రతినిధుల ఆవేదన. ఉభయులదీ కరక్టే. ఇరుపక్షాల వాదంలో సహేతుకత లేకపోలేదు.

ఇదిలా వుంటే మరోపక్క హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో దాదాపు వారానికి ఒక రోజయినా ఏదో ఒక నాటకం వేస్తుంటారు. ఈవిధంగా  రంగ స్తల రంగానికి గానసభ చేస్తున్న సేవ మెచ్చుకోతగ్గదే. కాకపొతే నాటకానికి ముందు ఏదో ఒక సభ పెట్టి వక్తల ప్రసంగాలతో, ముఖ్య అతిధుల అభిభాషణలతో ప్రేక్షకుల ఓర్పును పరీక్షిస్తుంటారన్న అపప్రధ వుంది. ఓ పక్క  నాటకం ఎప్పుడు మొదలవుతుందా’ అని ప్రేక్షకుల ఎదురు చూపులు చూస్తుంటే, మరోపక్క  ఇవేమీ పట్టించుకోకుండా సుదీర్ఘంగా సాగే సభలో పాల్గొనే వక్తలు  ‘నాటకానికి పూర్వ వైభవం తేవాలంటూ’ అంటూ  దీర్ఘోపన్యాసాలు దంచుతుంటారు. వారు కోరుకునే  పూర్వవైభవం ఎప్పుడూ వస్తుందో తెలియని నాటకాభిమానులు అప్పటికే చాలా పొద్దుపోయిందనుకుని నిట్టూర్పులు విడుస్తూ బయటకు జారుకుంటూ వుంటారు. ఇక ఆడిటోరియంలో మిగిలేవారు పల్చబడుతుంటారు.


శ్రీ కె.వి.రమణాచారి 

‘ఈ నాటకాలు చాలు. వాటిని కట్టిపెట్టు’ అని చాలా సార్లు నిజజీవితంలో అనుకుంటూ వుండడం కద్దు. నిజంగా జరుగుతున్నది కూడా  అదే.  నాటకానికి పూర్వ వైభవం మాటలతో రాదు.  అలాగని చేతలు కూడా పని చెయ్యడం లేదు.  పదేళ్ళ క్రితం కే.వీ. రమణాచారి గారు ( (సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి, రెవెన్యూశాఖ ప్రిన్సిపల్  కార్యదర్శిగా మొన్నీమధ్యనే స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు) ‘రసరంజని’ సంస్త  ద్వారా ‘నాటకానికి ప్రాణం పొయ్యాలి’  అని నానా తంటాలు పడ్డారు. బోల్డంత ఖర్చు పెట్టారు. విసుగెత్తి మానేశారు.

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు కాళిదాసు. తెలుగు వారికి పద్య నాటకాలు ఎంతో ఇష్టం.  ఎనభయ్యో  దశకంలో కూడా నాటకాలు బాగా చూసే వారు. ఉద్యోగ విజయాలు’ నాటకంలో ‘చెల్లియో చెల్లకో’, ‘జెండాపై కపిరాజు’ ‘అలుగుటయే యెరుంగని’  పద్యాలు కంఠతా   రానివారు, అవి  తెలియని వారు తెలుగునాట అరుదు. పొద్దున్నే  చద్దన్నం తిని,  గొడ్లను మేపు కోవడానికి వెళ్ళిన పాలేర్లు,  పశువులు మేస్తూ వుంటే చెట్టుకింద పడుకొని ఈ పద్యాలు పాడుకొంటూ, రాగాలు తీస్తూ  రోజంతా హుషారుగా గడిపేవారు. అలా గాలివాటంగా పద్యాలు  పాడేవారే తదనంతర కాలంలో రంగస్థల నటులుగా మారిన దృష్ట్యాంతాలు కూడా వున్నాయి.




పాత రోజుల్లో నాటకం పోష్టరు

‘పౌరాణిక నాటకాలు అంటే చెవి కోసుకొంటాము’ అనేవాళ్ళు ఇరవయి ఏళ్ళ క్రితం దాకా. ఇది పూర్తిగా నిజం. ఆ నాటకాల్లో  పాత్రధారి ఎలా వున్నా పద్యం  పాడడానికే ప్రాధాన్యం.  ఎంత రాగం తీస్తే అంతగా   తలలూపేవాళ్ళు. ‘ఒన్స్ మోర్’ అనే ఇంగ్లీష్ మాట నిరక్షరాస్యులకు కూడా  తెలుసు.  పద్యం పాడగానే ‘ఒన్స్ మోర్’ అని అరిచే వారు.  ఆ పద్యం మళ్ళీ పాడే వరకు నాటకాన్ని ముందుకు సాగనిచ్చేవారు కాదు. ఓ  సీన్లో పద్యం పాడిన  తర్వాత ఆ పాత్రధారి  పాత్రోచితంగా కింద పడిపోవాల్సిన సందర్భంలో కూడా ప్రేక్షకులు ఎవరయినా ‘ఒన్స్ మోర్’   అంటే చాలు అతగాడు మళ్ళీ లేచి నిలబడి పద్యం పాడి రాగం తీసి  మళ్ళీ పడిపోయేవాడు. ఔచిత్యమా కాదా అనేది అక్కడ అనవసరం.  అలా సాగేవి నాటకాలు. జనం విరగబడి చూసే వారు.  ఊళ్ళల్లో,  ఉత్సవాలు అవీ జరిగినప్పుడు ‘టికెట్ నాటకాలు’ ఆడేవారు. ‘ఫలానా హాలులోనో లేక ఫలానా వారి దొడ్లోనో’ అని కర పత్రాలు వేసే వారు. ఒకళ్ళవో ఇద్దరివో  నటుల ఫోటోలు కూడా ఉండేవిపాంఫ్లెట్ చివర్లో   రేట్లు ఉండేవి. రిజర్వుడు, కుర్చీ,  బెంచీ, నేల ఇలా విడివిడిగా టిక్కెట్లు వుండేవి.  మహా అయితే టికెట్ ఖరీదు  రూపాయి, అర్ధ, పావలా అలా వుండేది. ‘ప్యాట్రన్ టిక్కెట్లు కలవు’ అని రాసే వారు. ‘స్త్రీలకు ప్రత్యేక స్థలం. ఆలసించిన ఆశాభంగం, షరా మామూలే! త్వరపడండి. ముందుగా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోండి! ఏ కారణం చేతనయినా ప్రదర్శన నిలిపివేసినయెడల టికెట్ డబ్బు వాపసు ఇవ్వబడదు’ ఇలా  ఏవేవో రాసేవారు. (23-12-2011)



కామెంట్‌లు లేవు: