DORA లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
DORA లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2011, గురువారం

ఎన్టీఆర్ కి ఫైళ్ళు చూడడం అంటే ఇష్టం వుండేది కాదు


ఎన్టీఆర్ కి  ఫైళ్ళు చూడడం అంటే ఇష్టం వుండేది కాదు


(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను అనే పుస్తకం నుంచి)
 
స్పెషల్ టీ పట్రా !

“ఎన్టీఆర్ ఆఫీసు ఫైళ్ళు చూస్తున్నారంటే అదొక అష్టావధానమే. రాఘవేంద్రరావు టూకీగా విషయం చెప్పి ఫైల్ ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయన సంతకం పెట్టేవారు. ఇంతలో నేనో, మరొకరో వచ్చేవారు. ఆయన ‘ఈ పూటకి ఫైల్స్ చాలండీ!’ అంటూ వంటవాడిని పిలిచి ‘స్పెషల్ గా టీ చేసి పట్రా!’  అని పురమాయించేవారు. అంతే! ఫైళ్ళు చూసే 
కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయేది. అసలు విషయం ఫైల్స్ చూడడం అంత ఇష్టం వుండేది కాదు....

“....బెజవాడలో టీడీపీ మహానాడు జరిగిన ప్రదేశంలోనే ‘కాపు నాడు’ నిర్వహించాలని కాపు సంఘం నేతలు నిర్ణయించారు. కాపునాడు జరిగే ప్రదేశానికి నేను ఒక సాధారణ పౌరుడిగా వెళ్లాను. జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. వంగవీటి రంగా జైల్లో వున్నందున రాలేదు. ఆయన భార్య రత్నకుమారి వచ్చారు. కాపునాడు విశేషాలను, నాయకులు చేసిన హెచ్చరికలను హైదరాబాదు రాగానే ముఖ్యమంత్రికి వివరించాను....

.
“.....ఆ రోజుల్లో బెజవాడలో కమ్యూనిష్టుల ప్రాబల్యం ఎక్కువగా వుండేది. విశాలాంధ్ర పేపర్ కూడా ఇక్కడే, కమ్యూనిష్టులు చెప్పిందే ఇక్కడ వేదం. కమ్యూనిష్టుల్ని ఎదుర్కోవాలంటే బలమయిన ఓ ప్రత్యామ్నాయం కావాలి. అలా ఆలోచించేవారు వన్ టౌన్ వ్యాపారులు.....

“.....వంగవీటి మోహన రంగా అన్న రాధాకృష్ణ 
టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ లో వుండేవాడు. విజయవాడ నుంచి నలుగురయిదుగురు పాసింజర్లను ఎక్కించుకుని టాక్సీలు హైదరాబాదు పోతుండేవి. చొరవగలవాడు కావడంవల్ల త్వరలోనే అతను టాక్సీ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కాగలిగాడు. నెహ్రూ అన్న గాంధీ కూడా అప్పట్లో రాదా దగ్గర పనిచేసేవాడు. యూనియన్ వ్యవహారాలే తప్ప కులాల గొడవలు లేవు.......

“.......’ రాధ ఒకసారి రాష్ట్ర మంత్రి మండలి వెంకట కృష్ణారావును కలుసుకుని రాజకీయాల్లో ఎంట్రీ ఇప్పించమని  అడిగాడు. విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గట్టిగా వ్యతిరేకించారు. సంఘ వ్యతిరేక శక్తుల్ని రాజకీయాల్లోకి రప్పిస్తే వాటిని కూడా కలుషితం చేస్తారని స్తానిక నాయకులను కోపడ్డారు.....

“ విజయవాడలో నిరాహార దీక్షలో వున్న వంగవీటి రంగా హత్యానంతరం కోస్తాలోని  చాలా  జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. అనేక  పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. బాధితులను ఓదార్చేందుకు ఎన్టీఆర్ విజయవాడ పయనమయ్యారు. రంగా భార్య రత్నకుమారిని కలిసి పరామర్శించడానికి వెళ్లారు.  ఇంటి ముందు కారు ఆగింది.  రంగా అభిమానులు అడ్డుకున్నారు. ఇక లాభం  లేదనుకున్న ఎన్టీఆర్ కిందకు దిగి రంగా ఇంటి వైపు చూస్తూ నమస్కరింఛి తిరిగి వచ్చేశారు.........

1989,  ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. బడ్జెట్ లీక్ అయిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రులందరూ రాజీనామా చేయాలని ఎన్టీఆర్ బాంబు లాంటి ప్రకటన చేశారు. రాజీనామాలు స్వీకరించడం గవర్నర్ ఆమోదించడం జరిగిపోయాయి. అదే రోజు డీజీపీ పీ.ఎస్. రామ్మోహన్ రావును ఆ స్తానం నుంచి మార్చారు. ఈ పరిస్తితి ఎదురు కాకూడదనే ఆయన ముందుగానే సెలవులో వెళ్ళిపోయారు.....

“అంతా కొత్తవారితో ఆ తరువాత కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వారెవరన్నది చివరి దాకా సస్పెన్స్. చివరికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రెండవ స్తానంలో వున్న చంద్రబాబు నాయుడు దగ్గర కూడా విషయం దాచారు.
“.....ఎమ్మెల్యేలంతా విస్తు పోయారు. పార్టీ శ్రేణులన్నీ కలవరపడ్డాయి. (అయినా ఎన్టీఆర్ తొణకలేదు. ఎందుకంటె) ఆత్మ విశ్వాసానికి ప్రతీక ఎన్టీఆర్. తనపై రాళ్ళ వర్షం కురుస్తున్నా ఏరుకుని వాటితో దుర్గం నిర్మించుకోగల ధీశాలి ఆయన......
 (22-12-2011)

20, డిసెంబర్ 2011, మంగళవారం

"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర




"ఎన్టీఆర్ తో నేను" -హెచ్.జె. దొర 


( సీనియర్ ఐ పీ ఎస్ అధికారి, మాజీ డీజీపీ హెచ్.జె.దొర గారు ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పేరుతొ  
రాసిన పుస్తకంలో కొన్ని మచ్చుతునకలు.)




“....అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకుని తిరిగివచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు తప్పలేదు.
“....నాదెండ్ల భాస్కరరావు ఎవరో అప్పటిదాకా నాకు (దొరకు) తెలియదు.
“ ....తన వ్యక్తిగత విషయాలు గురించి సైతం ఎన్టీఆర్ నా దగ్గర ఓపెన్ అయ్యేవారు.
“....కొంతమంది ఎన్టీఆర్ దగ్గర (నా గురించి) ప్రస్తావించి ఇతను (దొర) ‘అవతల వ్యక్తి’ అని చెప్పినా కూడా ఆయన నన్ను వొదులుకోలేదు.
“....మా మామయ్య బొడ్డేపల్లి రాజగోపాల రావు ఏడు పర్యాయాలు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి (కాంగ్రెస్ అభ్యర్ధిగా) పోటీ చేసి ఎన్నికవుతూ వచ్చారు. మా ఇంట్లోనే కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలు నడిచేవి. మా మామయ్యకు కుడి భుజంగా వుంటూ ఈ క్యాంప్ నడిపేది స్వయంగా నా తమ్ముడు, ఆయన అల్లుడు హెచ్.ఏ.దొర. చూపరులకు ఇదంతా ఆశ్చర్యంగా వుండేది.
“....దేశ రాజకీయాల్లో ఎప్పుడయితే రాజకీయ పార్టీలకు, వాటి సిద్ధాంతాలకు ప్రాముఖ్యం  తగ్గి వ్యక్తుల ప్రాధాన్యాలు పెరిగాయో, గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయో అప్పుడే (పోలీసు శాఖలో అంతర్భాగంగా వున్న) ఇంటెలిజెన్స్ వ్యవస్త అవసరాలు పెరిగాయి.
“.....ఎన్టీఆర్ ఎక్కువగా ఇంటెలిజెన్స్ ఇన్ పుట్స్  మీదే డిపెండ్ అయ్యేవారు.
“....ఎన్టీఆర్ ఏజెన్సీ ప్రాంతాలలో (ముఖ్యమంత్రి హోదాలో)  టూర్ చేసేటప్పుడు .....అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, ఖాళీగా వున్న ఇళ్ళల్లో కానీ (ఆయనకు) బస ఏర్పాటు చేసేవారు. (సీఎం పేషీకి చెందిన సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారులు - రాఘవేంద్రరావు, టీ ఆర్ ప్రసాద్, బెనర్జీ లతో పాటు నేను (దొర) చాలా చిన్న గదుల్లో సరయిన వసతులు లేకపోయినా నైట్ హాల్ట్ చేసేవాళ్ళం.
“....ఆంధ్ర జ్యోతి అధినేత కే.ఎల్.ఎన్. ప్రసాద్ చనిపోయారని కబురందింది. ..వెళ్లి నివాళులు అర్పించాలని చంద్రబాబు అన్నారు. ‘ఏం! ఎందుకెళ్ళాలి? మేం వెళ్ళం!’ – ఇదీ ఎన్టీఆర్ సమాధానం.
“అక్టోబర్ 31,1984. ఉదయం పది గంటలు. యు.ఎన్.ఐ. విలేకరి నుంచి ఫోన్. ప్రధానమంత్రి  ఇందిరాగాంధీని ఎవరో షూట్ చేసారట....ఢిల్లీ యెలా వెళ్లాలనే దానిపై తర్జన భర్జన. ఆ రోజుల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండే ఫ్లయిట్లు. నావల్ చీఫ్ హైదరాబాదులో వున్న సంగతి తెలుసుకుని ఆయన వచ్చిన ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను తీసుకుని ఢిల్లీ వెళ్ళాము. అప్పుడు హైదరాబాదులో వున్న మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా అదే విమానం ఎక్కారు.ఆ చిన్న విమానం, యావ్రో ఎయిర్ క్రాఫ్ట్, ఢిల్లీ చేరడానికి నాలుగు గంటలు పట్టింది.
“....  ఆగస్టు సంక్షోభం నుంచి ఎన్టీఆర్ కు తలనొప్పులు మొదలయ్యాయి. (సొంత) ఎమ్మెల్యేలు పలువురు ఇప్పుడు ఆయననుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నారు. ఒకరకంగా బ్లాక్ మెయిల్. అందుకే ఆయన (ఎన్టీఆర్) శాసన సభను రద్దుచేసి తాజాగా ప్రజాతీర్పు కోరదామనుకుంటున్నారు.
“.....పెను తుపాను బాధితుల పరామర్శ కోసం మద్రాసు వచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీని రాజభవన్ లో ఎన్టీఆర్ కలసి మాట్లాడారు. ఆ చర్చల తరువాత ఉభయుల మధ్య రాజకీయ అవగాహన కుదిరినట్టు మాకు కొన్ని రోజులయ్యాక తెలిసింది. దీని పర్యవసానమే ఎన్టీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం.
“....రాజీవ్ గాంధీతో ఎన్టీఆర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు ముఖ్యులు (పీవీ నరసింహారావు, శివశంకర్, జలగం వెంగళరావు) వీరిపై  తెలుగుదేశం పార్టీ గట్టి అభ్యర్ధులను పోటీకి పెట్టకూడదు.
“....పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలకు రమ్మని కాంగ్రెసేతర పార్టీలకు చెందిన జాతీయ నాయకులనుంచి ఎన్టీఆర్ పై ఒకటే వొత్తిళ్ళు. అయినా రాజీవ్ గాంధీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎన్టీఆర్ వెళ్ళలేదు. రామకృష్ణ హెగ్డే మాట కాదన లేక కర్నాటకలోని ఒక్క కోలార్ కు మాత్రమే వెళ్లారు. అలా వెళ్లినందుకు అప్పటికే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చేసింది – ఏమిటిదీ అని. అందుకు పార్టీ వివరణ ఇవ్వాల్సివచ్చింది.
“....ఎన్నికలకు ముందు ఒక అవగాహనకు వచ్చిన రాజీవ్, ఎన్టీఆర్ ఆ తరువాత ఆ సయోధ్యకు తిలోదకాలు ఇచ్చారు.
“....రాజీవ్ గాంధీ (రాష్ట్రాల) పర్యటనల్లో కొన్ని సాహసాలు చేస్తుండేవారు.ఒకసారి ఖమ్మం జిల్లా  వచ్చినప్పుడు భద్రాచలంలో దిగి ఒక జీపులో ఎక్కి అందరూ చూస్తుండగానే దాన్ని ముందుకు ఉరికించి అడవుల్లో మాయమయ్యారు.  ఎటు వెళ్ళారో తెలియక మాకు టెన్షన్ మొదలయింది........
“....మరోసారి విశాఖ ఎయిర్ పోర్ట్ లో జర్నలిష్టులతో గంటన్నర మాట్లాడుతూ వుండిపోయారు. ఇంతలో బాగా చీకటి పడింది. ఆయన ఫ్లయిట్ ఎక్కగానే మేం కూడా తిరిగొచ్చేశాము.  తర్వాత తెలిసిందేమిటంటే వాతావరణం అనుకూలించక ఫ్లయిట్ టేకాఫ్ కాలేదు. ప్రధాని ఆ రాత్రి నావల్ ఆఫీసర్స్ మెస్ లో విశ్రాంతి తీసుకుని మరునాడు ఢిల్లీ వెళ్ళిపోయారు........తన జీవితపు చివరి ప్రయాణం కూడా విశాఖ ఎయిర్ పోర్ట్  నుంచే సాగడం రాజీవ్ గాంధీకి సంబంధించి ఒక విషాదం. (మరికొన్ని విశేషాలు మరోసారి- భండారు శ్రీనివాసరావు, 20-12-2011)