7, మార్చి 2023, మంగళవారం

చదువరి జర్నలిస్టు రాజేశ్వరరావు గారిక లేరు

 పెద్ద మేజా బల్ల మీద పేర్చిన పుస్తకాలు, జాతీయ, ప్రాంతీయ దినపత్రికలు, ఆంగ్ల మాస పత్రికలు వాటి నడుమ దీక్షగా ఏదో పుస్తకమో, పత్రికో చదువుతున్న మనిషి కనబడితే ఆయన ఖచ్చితంగా  సి.హెచ్. రాజేశ్వరరావు గారే! సందేహం లేదు.

చదవక జర్నలిస్టు చెడిపోతాడని అనేవారు. నాకు తెలిసి అమితంగా పత్రికలు, పుస్తకాలు చెదివే అతి కొద్దిమంది పాత్రికేయుల్లో రాజేశ్వరరావు గారు ఒకరు. ఊరికే తిరగేయడం కాకుండా వాటిలోని సారాన్ని ఒడిసిపట్టే ప్రతిభాశీలి కనుకనే అంత గొప్ప జర్నలిస్టు కాగలిగారు. ఆంధ్ర పత్రిక, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలకు హైదరాబాదు, ఢిల్లీల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీలో ఉంటున్న రాజేశ్వర రావు గారిని ఏరికోరి తనకు సమాచార సలహాదారుగా నియమించుకున్నారు. హెచ్ ఎం టీవీ కి అంబుడ్స్ మన్ గా పనిచేశారు.

జర్నలిస్టులకు పెద్ద దిక్కుగా వుండే రాజేశ్వరరావు గారు 83వ ఏట రాత్రి హైదరాబాదులో మరణించారు.

వారికి సద్గతులు కలగాలని  కోరుకుంటూ

భండారు శ్రీనివాసరావు



(07-03-2023)

 

5, మార్చి 2023, ఆదివారం

పొలిటికల్ టూరిజం – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha daily today, 05-03-23, SUNDAY)


ఒక తెలుగు రాష్ట్రంలో కనుచూపు మేరలో ఎన్నికలు లేవు. మరో తెలుగు రాష్ట్రంలో ఈ ఏడాది చివరి వరకు ఎన్నికల కోయిల కూయదు. తొందరపడి కూస్తుందేమో అనే సందేహం కాబోలు, అన్ని పార్టీలకి చెందిన అనేకమంది నాయకులు ఏదో ఒక పేరు పెట్టుకుని జనం మధ్యనే గడపాలని అనుకుంటున్నారు. గడుపుతున్నారు కూడా. ‘సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నారు కీర్తిశేషులు, టీడీపీ సంస్థాపకుడు ఎన్టీఆర్. అంచేత ఓటరు దేవుళ్ల ఆశీస్సుల కోసం నాయకులు వారి చుట్టూ ప్రదక్షిణలు చేయడంలో తప్పేముంది. మెడికల్ టూరిజం, రెలిజియస్ టూరిజం మాదిరిగా పొలిటికల్ టూరిజం అనుకోవాలి.
ఈ మార్పుకు కారణం ఒక్కటే, వెనుకటికీ ఇప్పటికీ రాజకీయ వ్యూహాల్లో వచ్చిన తేడానే!
కొన్ని దశాబ్దాల క్రితం విద్యార్ధులు పరీక్షల తరుణంలోనే పుస్తకాలు చేతపట్టి రాత్రీ పగలూ అనకుండా నైట్ అవుట్ చేస్తూ కష్టపడి చదివి గట్టెక్కాలని ప్రయత్నం చేసేవారు. మిగిలిన రోజుల్లో ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి ప్రబలిన తరువాత విద్యార్ధులకు అనునిత్యం పరీక్షలే. ప్రతిక్షణం పరీక్షాకాలమే.
ఇప్పుడీ సంస్కృతి రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినట్టు వుంది. పూర్వం ఎన్నికల సమయంలో మాత్రమే కానవచ్చే హడావిడి ఇప్పుడు ఏడాది పొడుగునా కళ్ళకు కడుతోంది. నిత్యం జనాలతో అనుబంధం పెంచుకుంటూ ఆత్మ స్తుతి, పరనిందలతో పొద్దుపుచ్చుతున్నారు. ఎన్నికల ఘడియ దగ్గరలో లేకపోయినా నాయకులు కాళ్ళకు బలపాలు కట్టుకుని జనాలమధ్యనే తిరుగుతున్నారు.
అరవయ్యో దశకంలో ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం లోకసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికలప్పుడు జనాలకు చూపించిన తన మొహాన్ని మళ్ళీ ఎన్నికల నగారా మోగేవరకు వరకు చూపించేవారు కాదు. అయినా వరసగా అయిదు సార్లు ప్రజలు ఆయన్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గెలిచిన తరువాత ఢిల్లీలోనో, హైదరాబాదులోనో హాయిగా కాలక్షేపం చేసేవారు కాని నియోజకవర్గం వైపు తొంగి చూసేవారు కాదు. అయినా ఆ రోజుల్లో అలా నడిచిపోయింది.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి కొంత మారింది. జనాల్లో తిరగకుండా జనాలమీద పెత్తనం చేయడం కష్టం అన్న ఎరుక రాజకీయ నాయకుల్లో మొదలయింది. అయితే ఎన్టీఆర్ తరహా కూడా అదో మాదిరి. ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు, కనీసం ఏసీ సౌకర్యం కూడా లేని చైతన్య రధం మీద బయలుదేరి, ఎండావానల్ని లెక్కచేయకుండా, ఆకలిదప్పులు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని చుట్టబెడుతూ, రాత్రింబగళ్ళు ప్రజల మధ్యనే తిరిగేవారు. ఆ ఎండలకు అంతటి అందగాడి మొహం కూడా నల్లకప్పు వేసిపోయేది. ఒక్కసారి విజయం సాధించి, అధికార పీఠం ఎక్కడం తరువాయి, అంతే! ఎంతో ముఖ్యమైన రాచకార్యం వుంటే తప్ప రాజధానిని ఒదిలిపెట్టి అడుగు బయట పెట్టేవారు కాదు. జిల్లాల పర్యటనలు ఎక్కువగా పెట్టుకునేవారు కాదు. చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన గురించిన కబురు చెవిలో పడడం ఆలస్యం, కాళ్ళకు రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళేవారు. కొన్ని సందర్బాలలో స్థానిక అధికారుల కంటే ముందే అక్కడ వాలిపోవడం, లేదా ముఖ్యమంత్రి హైదరాబాదు నుంచి ఆ విషయం గురించి వారిని వాకబు చేయడం ఇలాటివన్నీ ఆ రోజుల్లో తమాషాగా చెప్పుకునేవారు. కొండొకచో సంచలనాత్మకంగా, కొండొకచో విమర్శనాత్మకంగా ఉండేవి అవి.
దరిమిలా ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డిది కూడా ఓ రకంగా ఇదే తరహా. పర్యటనల్లో వున్నా, రాజధానిలో వున్నా జనం మధ్య గడపడానికే ఆసక్తి చూపేవారు. ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడానికి ఆయన చాలా కాలం పాటు చేసిన నిరీక్షణ ఫలించడానికి కారణం ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రే అనడంలో సందేహం లేదు. తదాదిగా అధికారం చేజిక్కించుకోవాలంటే పాదయాత్రలు చక్కని రాజమార్గం అన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో కుదిరిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అనంతరమే తొమ్మిదేళ్ళ పైచిలుకు సాగిన ప్రతిపక్ష అజ్ఞాత వాసం నుంచి బయట పడి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు.
ఇక సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా జనం మీదనే ఆధారపడ్డారు. జనం అండ ఉంటుందనే నమ్మకంతో రాజకీయ ఎత్తుగడల్లో చూపించాల్సిన పట్టు విడుపుల్ని ప్రదర్శించకుండా ఓ మేరకు నష్టపోయారని కూడా ఆయన్ని గురించి చెప్పుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఆయనది అదే తీరు. తన సొంత పార్టీ నాయకులతో కంటే జనాల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతారనే పేరు ఆయన ఖాతాలో వుంది కూడా.
పొతే, రాజకీయ నాయకుల పాదయాత్రలు, రిలే పాదయాత్రలు, కిసాన్ యాత్రలు, రైతు భరోసా యాత్రలు, బస్సు యాత్రలు ఇంకా ఇలాటి అనేకానేక యాత్రలు, పర్యటనలు, ప్రదర్శనలు, ర్యాలీలు ప్రజలకు చేసే మేలు ఏమిటోకాని ఆయా పార్టీలకు మాత్రం పెద్ద మేళ్ళే చేస్తున్నాయని వాటి గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే ఎన్ని ఇబ్బందులు వున్నా, కష్టాలు వున్నా, బాగా డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా నాయకులు వెనుకడుగు వేయకుండా పాదయాత్రలతో ముందడుగు వేస్తున్నారు.
సరే! 'యాత్రాఫల సిద్ధిరస్తు' అని జనం వారిని ఆశీర్వదిస్తారో లేదో తెలియడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది.
'ప్రజలు గమనిస్తున్నారు సుమా!' అని ఎదుటివారికి హెచ్చరికలు చేసే నాయకులు, తమను కూడా అవే జనాలు గమనిస్తున్నారని మరచిపోవడం రాజకీయ నాయకుల ఉమ్మడి లక్షణం. సామాన్య రైతుల కడగండ్లు తీర్చడం ఒక్కటే తమ ప్రధమ ప్రాధాన్యత అని జబ్బలు చరుచుకుంటూ, అసలా కష్టాలకన్నింటికీ ఆవలి పక్షం వారే కారణం అంటూ ఆరోపిస్తూ, అధికారంలో వున్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తూ, అధికారం చేజారగానే అంతవరకూ ప్రతిపక్షాలు ఆలపిస్తూ వచ్చిన పాత పల్లవినే ఎత్తుకుంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకునేందుకు ఇలాటి యాత్రా వేదికలు ఉపయోగపడడం నిజంగా దారుణం అనిపిస్తుంది.
సమాజంలో వివిధ వర్గాల వారికి ఎన్నెన్ని సమస్యలు ఉన్నప్పటికీ, రైతు సమస్యలు మాత్రం ఒకే రకంగా వుంటాయి.
వారి వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించే మాట్లాడుతోంది. వాళ్ళు విడిగా అయినా కలివిడిగా అయినా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే. ఇంతవరకు ఏం చేసాము, ఏం చేయలేదు అన్నది కాదు ప్రశ్న. ఎవరి హయాములో ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నది కాదు సమస్య. వందలు, వేలూ కాదు ఇకనుంచి ఒక్కరంటే ఒక్క రైతు కూడా వ్యవసాయంలో నష్టాలు వచ్చి ప్రాణాలు తీసుకోకుండా ఏం చెయ్యాలి అన్నదే ప్రధానం అన్న ధోరణిలో ఆలోచించాలి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవేవీ జనాలకు అన్నం పెట్టే రైతుకు కూడు పెట్టవు.
ఒకటి మాత్రం నిర్వివాదాంశం. ఇన్నాళ్ళ అనుభవం తెలియచెప్పేది ఒక్కటే. ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చేంతవరకు రైతు జపం చేస్తాయి. ఒక్కసారి గద్దె ఎక్కగానే, దుష్యంతుడికి శకుంతల మరపున పడ్డట్టు రైతులనే వాళ్ళు వారికి చివరి ప్రాధాన్యతగా మిగులుతారు. అప్పటివరకు రైతులు, రుణాలు, గిట్టుబాటు ధరలంటూ మాట్లాడిన వాళ్ళు, అవే నాలుకలతో కార్పొరేట్లు, ఉద్యోగాలు, భూసేకరణలు, భూ పందారాలు, మిషన్లు, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లు, దావోస్ విజిట్లు, గ్రోత్ కారిడార్లు అంటూ సామాన్యులకు అర్ధం కాని పద ప్రయోగాలు చేస్తుంటారు. ఏం సాధించారు అంటే లెక్కకు కొన్ని లెక్కలు చెబుతుంటారు. కానీ పెట్టిన ఖర్చుకు వచ్చిన ఫలితాలకు పొంతన వుండదు. ఈ విషయంలో ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారంలో వుండడం, అధికారంలో లేకపోవడం అన్న రెండు విషయాలే ఈ రెండు నాలుకల ధోరణికి కారణం. దీన్ని అర్ధం చేసుకోవడానికి చరిత్రలోని కొన్ని తాజా పుటలు తిరగేస్తే చాలు.
ఆరుగాలం కష్టపడే రైతుకు, జనాలకు మొదటి ముద్ద పెట్టి, తాను చివరి ముద్ద తినే రైతుకు కావాల్సినవి ప్రభుత్వాలు సకాలంలో ఇస్తే, అంతకు రెట్టింపు ప్రతిఫలం రైతు ఈ సమాజానికి అందిస్తాడు. అతడికి అవసరమైంది తాను దున్నేమన్నుకు, పదును చెడకముందే అదునులో దున్ని పైరు వేసుకోవడానికి వీలుగా సకాలంలో మంచి విత్తనాలు, ఎరువులు. సేద్యపు నీరు, పంట చేతికి వచ్చిన తరువాత కాసింత గిట్టుబాటు ధర. ఇంతకు మించి ఏ రైతూ ఆశించడు. రైతు పండించిన ధాన్యంలో ఆఖరి గింజ అతడి చేతిలోంచి మార్కెట్ లోకి వెళ్ళే వరకు స్తబ్దుగా, మన్ను తిన్న పాములా పెరగకుండా వుండిపోయే ధాన్యం ధరలు, ఆ తర్వాత ఒక్క మారుగా చుక్కల్ని తాకడం అనేది రైతులు ఎదుర్కునే సమస్యల్లో అతి ప్రధానమైనది. ప్రభుత్వాలు ఈ ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన కలిగితే, ధర్మో రక్షిత రక్షితః అన్నట్టు ఆ రైతే దేశానికి బాసటగా నిలబడతాడు. సకాలంలో ఇటువంటి సాయం అందితే ఏ రైతూ ఆత్మహత్య ఆలోచన చేయడు. నిస్సహాయ పరిస్తితిలోనే రైతులు నిండు ప్రాణాలు నిలువునా తీసుకుంటున్నారు. అలాటి కుటుంబాలను ఓదార్చడం, ఆదుకోవడం తప్పుకాదు. కానీ అసలు రైతులు ఈ స్థితిలోకి జారిపోకుండా ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయన్నదే సమాధానం లేని ప్రశ్న.
సరే! ఇక యాత్రల విషయానికి వస్తే.
ఏదైనా పుణ్యక్షేత్రానికి యాత్రకి వెళ్ళినప్పుడో, లేదా ఏదైనా పర్యాటక ప్రదేశానికి యాత్రకు వెళ్ళినప్పుడో ఏం చేస్తాం. ఉన్న వ్యవధిలో అక్కడి విశేషాలు పరిశీలిస్తాం. యాత్రలో ఎదురయ్యే ఇబ్బందులు, అనుకూలతలు గమనిస్తాం. అలాగే రాజకీయ యాత్రలు చేసేవాళ్ళు కూడా తాము తిరిగిన ప్రదేశాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కుంటున్న దినవారీ సమస్యలు తమ కంటితో గమనించి వాటికి పరిష్కార మార్గాలు ఆలోచించగలిగితే అంతకు మించిన మంచి మేనిఫెస్టో వారికి మరెక్కడా దొరకదు. యాత్రా ఫలం సిద్ధించడం అంటే ఇదే!



(05-02-2023, SUNDAY)

1, మార్చి 2023, బుధవారం

ఏకాకి జీవితం – భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక రోజుల్లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి దేశంలో కొన్ని కోట్ల మందికంటే, కొన్ని లక్షల మంది కంటే, కొన్ని వేలమంది కంటే కూడా నాకు ముందు తెలిసింది. జర్నలిస్టుని కావడం అందుకు కారణం.
పక్కింటి వాళ్ళు వ్రతం చేసుకుంటున్న సంగతి, పిలిచి వెళ్ళిన సంగతి మాత్రం గుర్తుండదు. తెలియదు. చాలా దగ్గరి వాళ్ళ ఇంట్లో వివాహం ఎప్పుడో ఎక్కడో తెలియదు. వధూవరుల పేర్లు తెలియదు. బాగా కావాల్సిన వాళ్ళ పిల్లల పేర్లు గుర్తుండవు, తెలియవు. అలాగే పెళ్లి రోజులు, పుట్టిన రోజులు వాట్సప్ చూస్తేనే కానీ గుర్తు రావు. ఛీ పాడు జీవితం.
అదే భార్య వుంటే ..
రెడీ రికనర్. గూగులమ్మకు అమ్మలగన్న అమ్మ.
(01-03- 2023)

ఇంగువ కట్టిన గుడ్డ - భండారు శ్రీనివాసరావు

వీలున్నప్పుడు మా చర్చలకు రాకూడదా! అంటూ ఏబీఎన్ ఛానల్ సీనియర్ యాంకర్ ఒకరు మెసేజ్ పెట్టారు. స్టూడియోలకు వెళ్లి చర్చల్లో పాల్గొనడం బాగా తగ్గించి మూడేళ్లు దాటుతోంది. అయినా ఇంగువ వాసన ఎంతో కొంత వుంటుంది కదా! అప్పుడప్పుడు ఇలా పిలుపులు అన్ని ఛానల్స్ నుంచి వస్తూనే వుంటాయి. మృదువుగా నో చెప్పడం ఇక్కడే అలవాటు అయింది.

2005 లో దూరదర్సన్ నుంచి రిటైర్ అయిన తర్వాత మొదలయిన టీవీ చర్చల అధ్యాయం 2019లో నా భార్య మరణించే వరకు నిరాఘాటంగా కొనసాగింది. ఆ రోజుల్లో టీవీల వారాలబ్బాయి అని అనేవారు. సోమవారం ఉదయం ఒక టీవీ చర్చకు వెడిత మళ్ళీ ఆ టీవీ స్టూడియోకి మరుసటి సోమవారం చర్చకు వెళ్ళడమే. ఆ తర్వాత ఆరు రోజులు ఒక్కో పూట ఒక్కో టీవీకి అన్నమాట. ఇక మధ్యాన్నం సాయంత్రం, రాత్రి వేళ చర్చలు అదనం. అసలు ఉద్యోగం చేసే రోజుల్లో కంటే రిటైర్ అయిన తర్వాతనే ఎక్కువ బిజీగా జీవితం మారిపోయింది. ఎక్కడా కప్పు కాఫీ తాగరాదు అనే నియమం కారణంగా ఆ భారం మా ఆవిడ మీద పడేది. HMTV (AS Rao Nagar) 99 TV (Kondapur) వంటి దూరాభారపు టీవీలకు వెళ్ళాలి అంటే కారులో దాదాపు ముప్పావుగంట ప్రయాణం. పొద్దున్నే లేచి నేను తయారు అయ్యే లోపల మా ఆవిడ వేడివేడిగా టిఫిన్, కాఫీ సిద్ధం చేసేది. వీటికోసం నా కంటే ముందుగానే నిద్ర లేచేది. అన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఏ టీవీకి ఒక్కటంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళలేదు. గెస్టులు ఆలస్యంగా వస్తే ఎంత ఇబ్బందో నాకు రేడియో, దూరదర్సన్ రోజుల నుంచే తెలుసు.
ముందు రోజు సాయంత్రం ప్రతి టీవీ కో ఆర్డినేటర్ ఫోన్ చేసి ప్రోగ్రాం గుర్తు చేసేవారు. మళ్ళీ మరునాడు ఉదయం కారు పంపించామని ఫోన్ చేసి చెప్పేవారు. టీవీల్లో వీరికి జీత భత్యాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ, నానా చాకిరీ చేసేవారు. సబ్జెక్టును బట్టి యాంకర్ కోరిన గెస్టును నిమిషాల్లో స్టూడియోలకి రప్పించే సామర్ధ్యం వీరికి పుష్కలం. నాకు మాత్రం మినహాయింపు. నేను ముందుగా నిర్ణయించుకున్న టైం టేబుల్ ప్రకారమే వెళ్ళే వాడిని. ఈరోజు వెడితే మళ్ళీ ఏడు రోజుల తర్వాతనే.
ఏబీఎన్ సాల్మన్, సాక్షి సూర్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, NTV నేతాజీ, 10 TV కార్తీక్, TV 5 భాను, TV 9 ETv శ్రీకాంత్, HMTV శ్రీనివాస్, V6 గోపి, T News శంకర్, AP 24 x 7 రాజేంద్ర, 99 TV నేతాజీ, జెమినీ న్యూస్ శ్రీనివాస్, PRIME 9 నరసింహాచార్యులు, MAHA NEWS ఆరిఫ్ షేక్, I News మోహన్, Bharath Toady TV సుబ్రహ్మణ్యం, రత్నకుమార్, Sneha TV గౌస్, (Express TV, 6 TV వంటివి తారల్లా ఓ వెలుగు వెలిగి మాయమయ్యాయి) ఇలా వీళ్ళందరూ కాలక్రమంలో నాకు మంచి స్నేహితులు అయ్యారు. ఇప్పటికీ వారితో నా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. నిజానికి వారందరినీ గుర్తు చేసుకోవడానికే ఈ పోస్టు రాస్తున్నాను. TV 9, CVR News కి కూడా వెళ్ళే వాడిని కానీ వెళ్ళిన సందర్భాలు అతి తక్కువ.
థాంక్స్ చంద్రిక గారు. అందర్నీ ఓమారు గుర్తు చేసుకునేలా చేశారు.
కొసమెరుపు:
"ఈమధ్య టీవీ చర్చల్లో కనిపించడం లేదేమిటి' అని అడిగారో పెద్దమనిషి.
నా జవాబు కోసం ఎదురు చూడకుండా ఆయనే అన్నారు మళ్ళీ.
"మంచిదేలెండి. విశ్లేషకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడేదాంట్లో పెద్ద తేడా వుండడం లేదు"
నోరు తెరవకపోవడం మంచిదయింది.
01-03-2023

27, ఫిబ్రవరి 2023, సోమవారం

మై హూ నా! – భండారు శ్రీనివాసరావు


(Published in Andhra Prabha daily on 26-02-2023, SUNDAY)


ఎవరి పరిపాలనలో అయితే పాలకుల ప్రమేయం లేకుండా పాలితులకు రోజువారీ జీవితం హాయిగా

గడిచిపోతుందో ఆ పరిపాలనను సుపరిపాలనగా చాణక్యుడు అభివర్ణించారు.


మూడు దశాబ్దాలకు పూర్వం మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే అవకాశం నాకు లభించింది. 1990 లో ఓ సెలవు రోజున ఢిల్లీ నుంచి మాస్కో  వస్తున్న ఓ మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి భార్యా పిల్లలతో కలిసి మాస్కో నగర పొలిమేరల్లో వున్న షెర్మేతోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి టాక్సీలో బయలుదేరాను. విపరీతంగా మంచు కురుస్తోంది. మార్గమధ్యంలో వుండగా కారు టైర్లు మంచులో  జారిపోయి ఓ పక్కకు వెళ్లిపోయింది. ఏం జరిగిందా అని ఆందోళన మొదలయ్యేలోగా, మంచు తెర కమ్మిన కారు కిటికీ అద్దం వెనుక ఆరున్నర అడుగుల భారీ శరీరం కనిపించింది. నల్లటి యూనిఫారం చూడగానే అతడు ట్రాఫిక్ పోలీసు అని గుర్తు పట్టాను. ఇంత  మంచువర్షంలో హఠాత్తుగా ఇతడెలా ప్రత్యక్షం అయ్యాడో అర్ధం కాలేదు. ఇప్పుడీ కేసు తేలేదాకా రోడ్డు మీద అవస్థలు తప్పవేమో అని భయపడుతున్న సమయంలో, ఆ పోలీసు రెండు కాళ్ళు నేల మీద గట్టిగా చరిచి, ఫుల్ సెల్యూట్ చేయడంతో మా మొహాల్లో  భయం తగ్గిపోయి ఆశ్చర్యం ఆవరించింది. పౌరులకు అక్కడి పోలీసులు ఇచ్చే మర్యాద అని తరువాత తెలిసింది. అతడు ఆ మంచులో కారు దిగవద్దని మాకు  సైగలు చేస్తూ, వాకీ టాకీలో  మాట్లాడుతున్నాడు. కొద్ది నిమిషాల్లో మరో టాక్సీ వచ్చి ఆగింది. అందులోకి మమ్మల్ని ఎక్కించిన తర్వాతనే అతడు ట్రాఫిక్ కేసు విషయం చూసుకోవడం మొదలు పెట్టాడు. కేసు విచారణ పేరుతొ మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించని అతడి తీరు మమ్మల్ని ఎంతగానో  విస్మయపరచింది. చాణక్యుడు చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. 


యాభయ్ ఏళ్ళ క్రితం 

ఒకసారి మా వూరికి  పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. 

ప్రోగ్రాం ప్రకారం  ఆయన మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.

మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో దూరంగా  జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది, మంత్రిగారు  వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.

ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.

అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. ఊరి పోలిమేరల్లోకి వచ్చి ఊరిలోకి వెళ్ళే  దారి తెలియక చాలాసేపు ఇబ్బంది పడిన విషయం ఆయన చెప్పేదాకా తెలియదు. అంత అధ్వాన్నంగా ఉండేవి ఆరోజుల్లో  రహదారి సౌకర్యాలు. మా ఊరికి అయితే బండ్ల బాట మినహా వేరే దారిలేదు. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి మంత్రిగారు  నిష్క్రమించారు. 

సరైన రోడ్డు సదుపాయం లేక  ఆ ప్రాంతపు ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అనుభవం లోకి రావడం వల్లనెమో, ఢిల్లీ వెళ్ళగానే ఆ విషయంపై దృష్టి పెట్టినట్టున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక  గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. స్తంభాలు, కంకర, సిమెంటు వగైరా ప్రభుత్వం ఇస్తుంది.

కే ఎల్ రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు. ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆ గ్రామాల ప్రజలు ఆ రోడ్డుని కేఎల్ రావు గారి రోడ్డనే పిలుస్తారు.

ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చేది చాణక్యుడి సూక్తే.   

గత కొన్నేళ్లుగా  జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. 

అయినా కానీ, ప్రజలకు కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పలేము.

అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలకు కూడా ఈ అవస్థలు తప్పడం లేదు

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పౌరుడికి ఒక సమస్య ఎదురయినప్పుడు

దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెడతాడు. స్పందించే అధికారి వుంటే చాలు

సగం సమస్య తీరిపోయినట్టుగా అతడు భావిస్తాడు. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం 

అంటూ వుంటుంది. కొన్నిటికి తక్షణ ఉపశమనం లభిస్తే మరి కొన్ని నిదానంగా

పరిష్కారమవుతాయి.

మేము ఉంటున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో కోతలు లేవు. కానీ అంతరాయాలు

వున్నాయి. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ఇప్పుడు

సాంఘిక మాధ్యమాలు అందుబాటులో వున్నాయి. 

నాకు తెలిసిన విషయాలను

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం చేస్తూ వస్తున్నాను. గతంలో కూడా మా

ప్రాంతవాసుల సమస్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే మునిసిపల్ అధికారులు

తక్షణం స్పందించారు. అలాగే మరో అనుభవం.

ఒకరోజు రాత్రి కాసేపు కరెంటు పోయింది. లిఫ్ట్ లో ఒక పెద్దావిడ చిక్కుకు పోయింది.

కాసేపటికి కరెంటు వచ్చింది. ఆ పెద్దావిడ మా అపార్ట్ మెంటులో ఎవరినో

చూడడానికి వచ్చింది. లిఫ్ట్ ఇబ్బంది పెట్టడంతో గాభరా పడిపోయింది. ఇది

చూసి రాత్రి పొద్దుపోయిన తర్వాత నేను ఒక పోస్ట్ పెట్టాను.

“వేసవికాలం ప్రవేశించింది. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో పౌరుల

ప్రేమయాత్ర ముగిసింది అనుకోవాలా!  అటక ఎక్కించిన పవర్ ఇన్వర్టర్లను, జెనరేటర్లను

మళ్ళీ కిందికి దింపాలేమో! ఇలా చెప్పడానికి కాసింత  సిగ్గుపడుతున్నాను”

కఠినంగా రాశానేమో అని నాకే తరువాత అనిపించి ఆ పోస్ట్ తీసివేశాను.

ఆవిషయం మరచిపోయాను.

మరునాడు మధ్యాన్నం కాబోలు అయిదారుగురు మా ఇంటికి వచ్చారు.

“పొద్దున్న చైర్మన్ ప్రభాకర రావు గారు ఫోన్ చేశారు”

వారిలో ఒకరు ఈ మాట అంటూ, తనని తాను పరిచయం చేసుకున్నారు.

ఆయన గారి పేరు ఆనంద్.ట్రాన్స్ కోలో  సూపర్ ఇన్ టె౦డింగ్ ఇంజినీరు.

మిగిలినవాళ్ళు ఏడీయీలు, ఏఈలు.

సమస్య ఏమిటని అడిగారు. నేను చెప్పింది విన్నారు. అప్పటికే ఆశ్చర్యంలో

మునిగిపోయి ఉన్న నాకు ఆయన తన సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన కొన్ని విషయాలు

చెప్పారు. అది వింటుంటే నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. 

మా ప్రాంతంలో ఈ నెలలో అయిదు సార్లు కరెంటు పోయిందని చెబుతూ,  కరెంటు పోయిన

టైమును, మళ్ళీ వచ్చిన సమయాన్ని వివరాలతో సహా చూపించారు. నాలుగుసార్లు ఈ

ఎల్ (ఎర్త్ లీకేజీ), ఒకసారి ఓఎల్ (ఓవర్ లోడ్) వల్ల సరఫరాకు అంతరాయం

కలిగినట్టు రికార్డులలో వుంది.

ఎస్ ఈ గారి అధీనంలో మొత్తం 38 సబ్ స్టేషన్లు వుంటాయిట. ప్రతిరోజూ ఆ

ఏరియాల్లో ఎక్కడ, ఎన్నిసార్లు కరెంటు పోయిందనే వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్

అవుతాయట. ఆ సమాచారం ఆధారంగా వెనువెంటనే సరఫరా పునరుద్ధరణకు రాత్రీ పగలూ

ఇరవై నాలుగు గంటలు సిబ్బంది సిద్ధంగా వుంటారట.

సాధారణంగా చెట్ల కొమ్మలు నరికే సమయాలను ముందుగానే ఆయా వినియోగదారులకు

ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేస్తారట.

ఎంత ప్రయత్నం చేస్తున్నా తమ చేతిలో లేని కారణాల వల్ల సరఫరాలో ఆటంకాలు

కలుగుతున్న మాట నిజమే అని చెబుతూ, వాటిని సాధ్యమైనంత మేరకు తగ్గించడానికే

తాము, తమ సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నామని చెప్పారు.

మా ప్రాంతంలో కరెంటు సరఫరాలో అంతరాయాలు లేకుండా చేయడానికి చేయవలసినది

చేస్తామని హామీ ఇచ్చారు.

ముందే చెప్పినట్టు సమస్య పరిష్కారం ముఖ్యమే కావచ్చు కానీ, సమస్యను విని,

‘నేనున్నాను కదా!’ అని భరోసా ఇచ్చేవాళ్ళు కూడా అంతే ముఖ్యం. అప్పుడే

ప్రభుత్వం పనిచేస్తోందని జనం అనుకుంటారు. పనిచేసే ప్రభుత్వం అని

మెచ్చుకుంటారు.

మళ్ళీ మూడు దశాబ్దాల తర్వాత చాణక్యుడి సూక్తి మరోమారు స్పురణకు వచ్చింది.

ప్రభుత్వ ప్రమేయం లేని సాధారణ జన జీవితం. వినడానికి బాగానే వుంది.

ఇలా అడపా దడపా కాకుండా చాణక్యుడి సూక్తి అనుదినం గుర్తుకు వచ్చే బంగారు రోజులు వస్తే ఎంత బాగుంటుందో!




22, ఫిబ్రవరి 2023, బుధవారం

ఈ చక్కటి జ్ఞాపకానికి అప్పుడే ఏడాది

 

ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగింది. “ శ్రీనివాసరావు గారా! సీఎం ఆఫీసు నుంచి. సీఎమ్ గారు మాట్లాడుతారు, లైన్లో వుండండి” అంది ఓ గొంతు. ఓ ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఇలాంటి ఫోన్లు ఆశ్చర్యం లేదు. రిటైర్ అయి పదిహేను ఏళ్ళు దాటింది కదా! అందుకే ఆశ్చర్యం. “శ్రీనివాసరావు గారు, బాగున్నారా! ఎక్కడ వుంటున్నారు, ఒకసారి మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను, ఇంటికి రండి” కొద్దిసేపటికే పియ్యే ఫోన్ చేసి లొకేషన్ తీసుకున్నాడు. మరి కొద్ది సేపటికే అనిల్ అనే డ్రైవర్ ఫోన్ చేసి మీ (మా) ఇంటి దగ్గర వున్నాను’ అన్నాడు. రోజూ మూడున్నరకు నా మధ్యాన్న భోజనం. రెండున్నర దాటితే కానీ స్నానం సంధ్యా ప్రసక్తి వుండదు. డ్రైవర్ ని ఉండమని చెప్పి అప్పటికప్పుడు తయారై, గుప్పెడు మెతుకులు నోట్లో వేసుకుని కారెక్కాను. సరాసరి సీఎం ఇంటికే తీసుకు వెళ్ళాడు. లిఫ్టులోపైకి వెళ్లేసరికి రండి రండి భోజనం చేద్దాం అని ఆహ్వానించారు కేసీఆర్. చేసేవచ్చానని చెబితే, ఇలా మాతో వచ్చి కూర్చోండి అన్నారు. భోజనం టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ వున్న ఆరుగురిలో ఇద్దరే తెలుసు, ఒకరు సంతోష్, ఎంపీ. మరొకరు భాను ప్రసాద్ ఎం.ఎల్.సీ. భోజనాల కార్యక్రమం పూర్తి కాగానే కిందికి వెళ్లాం. వరసగా వాహనాలు. నన్ను కాన్వాయ్ లో మూడో వాహనంలో కూచోబెట్టారు. కారు తలుపు ఎంత గట్టిగా వుందంటే చేత్తో తీయడం సాధ్యం కాలేదు. అది బులెట్ ప్రూఫ్ అని చెప్పి డ్రైవర్ డోర్ తీశాడు. కాన్వాయ్ కదిలింది. నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ చేరింది. ఒక హెలికాప్టర్ దగ్గర ఆగింది. నేను దిగి ఒక పక్కన నిలబడ్డాను. ఇక్కడ నుంచి ఇంటికి చేరడం ఎల్లా అనేది నా ఆందోళన. ఈలోగా ఎవరితోనో ముచ్చటిస్తున్న సీఎమ్ నా వైపు చూసి ఎక్కండి అన్నారు. నాకు కలయో వైష్ణవ మాయయో అన్నట్టు వుంది. ఉద్యోగంలో వున్నప్పుడు ఇలాంటి ప్రయాణాలు అలవాటే. రిటైర్ అయి పదిహేనేళ్లు. అందుకే ఆశ్చర్యం. పక్కన కూర్చోబెట్టుకున్నారు. అరగంటలో నారాయణ్ ఖేడ్ చేరాము. స్టేజి మీద తన వెనకనే కూర్చోబెట్టుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగిస్తూ కూడా నాతోపాటు భండారు శ్రీనివాసరావు కూడా వచ్చారు అని ఆయన చెబుతున్నప్పుడు మతి పోయింది. సభ ముగిసింది. తిరిగి అరగంటలో బేగంపేట ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి సీఎం రెసిడెన్స్. పైకి వెళ్ళాము. వేడి వేడి ఉప్మా కాఫీ ఇచ్చారు. ఓ గంటన్నర ఏవేవో ముచ్చ్చట్లు. నన్ను ఎందుకు రమ్మన్నారో అంతు చిక్కలేదు. ఏడున్నర కాగానే నేను లేచి నిలబడి ధన్యవాదాలు చెప్పాను. ఆయన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపి రండి అన్నారు అక్కడ ఎవరితోనో. ఏడున్నర ప్రాంతంలో ఇంటికి చేరాను. అప్పటివరకు సెక్యూరిటీ జామర్ల వల్ల మూగనోము పట్టిన నా ఫోను మళ్ళీ ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ తో పిలుపులు మొదలు పెట్టింది. కలా నిజమా అనుకుందాం అంటే ‘నారాయణ్ ఖేడ్ మీటింగులో సీఎం తో పాటు నువ్వు కూడా కనిపించావు టీవీల్లో’ అని మిత్రుల ఫోన్స్. అయితే నిజమే అన్నమాట. ఇంతకూ ఎందుకు పిలిచినట్టు? నేను ఎందుకు వెళ్లినట్టు? ఈ భేతాళ ప్రశ్నకు జవాబు లేదు, కేసీఆర్ గారి అభిమానం ఆ స్థాయిలో ఉంటుందని సమాధానపడం తప్ప.


(21-02-2022) Video Clipping Courtesy: Shri Nirmal Akkaraju

https://fb.watch/iRRvVsg5dl/ https://fb.watch/iRPUnB4Ugw/

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

అనాయాస మరణం చూస్తే అసూయ ఎందుకు?

 


పొద్దున్న పదిగంటలకు మొద్దుబారిన నా మెదడు క్రమంగా అదుపులోకి వస్తోంది. వచ్చిన తర్వాత, విన్న సంగతులు నెమరు వేసుకుంటూ వుంటే  నా మనసంతా, అనకూడదు కానీ అసూయతో  నిండిపోయింది.

డెబ్బయ్ ఏడేళ్ల వయస్సులో ఈ అసూయ ఏమిటి. అది కూడా అనాయాసంగా చనిపోయిన  నా మేనకోడలు భర్త, నా చిన్న నాటి స్కూలు సహాధ్యాయి  జూపూడి ప్రసాద్ గురించి అంటే నా మనసే సమాధానం పడడం లేదు. మనుషులు ఇలాగా కూడా అనాయాసంగా పోతారా, ఇలాంటి అదృష్టం నా నొసట రాసి ఉందా లేదా అన్న ఆలోచనే ఆ అసూయకు కారణం.

నాకంటే రెండేళ్లు చిన్నవాడయిన నా మేనల్లుడు దుర్గా ప్రసాద్ ఈ మధ్యనే చనిపోయాడు,  ఇలాగే అనాయాసంగా దాటిపోయాడు. అనకూడదు కానీ అప్పుడు కూడా వాడి సునాయాస మరణం చూసి అసూయ పడ్డ మాట నిజం. అప్పుడు పైకి చెప్పలేదు. ఈ రెండో మరణ వార్త తెలిసిన తర్వాత ఇక చెప్పక తప్పడం లేదు.

ఖమ్మంలో వుండే ప్రసాద్ ఈ ఉదయం లేచి చాయ్ తాగి కాసేపు అలా పక్క మీదనే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అటూ ఇటూ ఇంట్లో తిరిగే వాళ్ళ అబ్బాయి షమీకి   అనుమానం వచ్చింది. ఏమిటి ఇంతసేపు పడుకున్నాడు, ఇలా ఆలస్యంగా లేచే అలవాటు ఆయనకి లేదే అనుకుంటూ తట్టి లేప బోయాడు.

అప్పుడు తెలిసింది అది నిద్ర కాదు, దీర్ఘ నిద్ర అని.

విషయం తెలిసి విదేశాల్లో ఉన్న పిల్లలు రేపు రాత్రికి వస్తున్నారు. ఎల్లుండి అంత్యక్రియలు.

నాలుగేళ్ల క్రితం మా ఆవిడ పోయినప్పుడు ఎక్కడో రాసుకున్న గుర్తు.

మన దేశంలో మెజారిటీ వృద్దులకు జీవన యానం చివర్లో ఐసు పెట్టెలో మూడు నిద్రలు తప్పేట్టు లేవు.

కఠినం అనిపించినా వాస్తవమే కదా!   

17-02-2023