8, నవంబర్ 2021, సోమవారం

వసూలు చేసే పన్నులు ఖజానాకు చేరుతున్నాయా ! – భండారు శ్రీనివాసరావు

 

నాలుగేళ్ల క్రితం అనుకుంటా ఓరోజు, ఊబెర్ అద్దె వాహనంలో ప్రయాణించాను. అతడికి బిల్లు చెల్లించాను. తరువాత ఊబెర్ కంపెనీ నుంచి నాకు వచ్చిన మెయిల్ లో ఇలా వుంది:
Before Taxes 112.26
Service tax (4.2%) 4.71
Swachh Bharat Cess (0.15%) 0.17
Krishi Kalyan Cess (0.15%) 0.17
COLLECTED ₹ 117.31

అంటే ఏమిటన్నమాట. సర్వీసు టాక్స్ 4.2 శాతం , నాలుగు రూపాయల డెబ్బయి ఒక్క పైసలు, స్వచ్చ భారత్ సెస్సు 0.15 శాతం పదిహేడు పైసలు, క్రిషి కళ్యాణ్ సెస్సు 0.15 శాతం మరో పదిహేడు పైసలు చెల్లించినట్టు రసీదులో వుంది. నా దగ్గరనుంచి వసూలుచేసిన ఈ సొమ్ము క్షేమంగా సర్కారు ఖజానాకు చేరుతుందని ఆశించడం సగటు పౌరుడిగా నా ఆకాంక్ష. ఇలా ప్రతి రోజూ, ప్రతి పౌరుడు తాను పెడుతున్న ప్రతి ఖర్చులో సర్కారుకు చెల్లించే పన్ను, సెస్సు వివరాలు ఎప్పటికప్పుడు ఇలా తెలియచేస్తూ సర్కారు ఖజానాలో మనకో ఖాతా తెరిచి అందులో నమోదు చేస్తుంటే కాలర్ ఎగరేసుకుని తిరగొచ్చు. ఎందుకంటే ఈదేశంలో ప్రతి ఒక్కరూ అనుమానం ముందు పుట్టి తరువాత వాళ్ళు పుడతారు. ఇంతకీ ఈ సొమ్ము( అక్షరాలా అయిదు రూపాయల అయిదు పైసలు) ఖజానాలో జమ అయినట్టేనా!
ఈ అనుమానాన్ని ఓ కేంద్ర ప్రభుత్వ పన్నుల అధికారి వద్ద వ్యక్తం చేశాను.
‘మనం దుకాణానికి వెళ్లి ఏదో వస్తువు కొని బ్యాంకు కార్డు మీద చెల్లింపు చేస్తాం. వెంటనే అంత మొత్తం మన బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయినట్టు మన ఫోనుకు మెసేజ్ వస్తుంది. హోటల్ కు పోయి తిన్నదానికి బిల్లు కడతాము. మనం కట్టిన పన్ను వివరాలు ఆ బిల్లులో వుంటాయి. కానీ ఆ పన్ను సరాసరి ప్రభుత్వ ఖజానాకు చేరిందా లేదా, అసలు చేరుతుందా లేదా అనే అనుమానం పీకుతూనే వుంటుంది. హోటల్ కు మనం పన్నుల రూపేణా చెల్లించిన డబ్బు హోటల్ బ్యాంకు ఖాతా నుంచి ఎకాఎకి ఖజానాకు చేర్చే వెసులుబాటు సాంకేతికంగా కల్పిస్తే బాగుంటుంది కదా! అలాగే మనం చెల్లించిన పన్నులు ప్రభుత్వ ఖజానాకు జమ అయినట్టు ఓ మెసేజ్ వచ్చే ఏర్పాటు చేస్తే ఇలాంటి సందేహాలు రావు కదా! ‘
అంతా విని ఆయన ఇలా జవాబు ఇచ్చాడు.
‘మీరు చెప్పేది నిజమే. కానీ దేశంలో ప్రతి రోజు ప్రతి క్షణం నిమిషం, లక్షల కోట్ల విలువైన లావాదేవీలు కోట్లలో జరుగుతుంటాయి. అంత భారాన్ని నిభాయించగల భారీ సర్వర్లు ఏర్పాటు చేసుకోవడంలో చాలా ఇబ్బందులు వున్నాయి’ .
ఇక నా దగ్గర ప్రశ్నలు లేవు.
అనుమానం మాత్రం అలానే వుండిపోయింది.

7, నవంబర్ 2021, ఆదివారం

జరిగిన కధ – భండారు శ్రీనివాసరావు

 

కధల్లో జీవితాలు ఉన్నట్టే జీవితాల్లో కూడా కధలు వుంటాయి. అలాంటి కధ కాని కధ ఈ జరిగిన కధ. 

స్నేహం అంటేనే స్వచ్చత. దాపరికం, స్వార్ధం ఇసుమంత కూడా లేనిదే నిజమైన స్నేహం అనిపించుకుంటుంది. మిగిలినవన్నీ పరిచయాలు మాత్రమే.

ఇప్పుడు మీరు చదవబోతున్న కధనంలోని పాత్రలన్నీ నిజమైనవే. ఆ పాత్రలు పలికిన పలుకులన్నీ ఒక ప్రత్యక్ష సాక్షి నోట నేను  విన్నవే.

కాకినాడ జే.ఎన్.టీ.యూ. చాలా ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థ. అక్కడ విద్యాభ్యాసం చేసి జీవితాల్లో స్థిరపడిన విద్యార్ధులు ఒక సాంప్రదాయాన్ని ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నారుట. అదేమిటంటే, ఒక బ్యాచ్ లో చదువు పూర్తి చేసుకున్న విద్యార్ధులు పాతికేళ్ళ తర్వాత అదే కళాశాలలో కలుస్తారు. ఇలా ప్రతి బ్యాచ్ వాళ్ళు ప్రతియేటా అదేచోట ఇరవై అయిదు  సంవత్సరాల  కలుస్తూ, గడిచిన ఇన్నేళ్ళ కాలంలోని  జ్ఞాపకాలను నెమరు వేసుకుని రెండు మూడు రోజులు సరదాగా గడపడం అక్కడ ఆనవాయితీగా వస్తోందని విన్నాను. ఇది నిజమైతే నిజంగా గొప్ప సంగతే.

మూడేళ్ల  క్రితం నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమానికి  పాతికేళ్ళ క్రితం ఆ కాలేజీలో చదువుకున్న ఓ బ్యాచ్ కి చెందిన మొత్తం 180 మందిలో 130 మంది హాజరయ్యారు. వారిలో ఇద్దరు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి వున్నారు. అమెరికా నుంచి వచ్చిన ముప్పయ్ మంది దంపతయుక్తంగా పాల్గొన్నారు. కొందరు కళాశాల రోజుల్లోనే ప్రేమలో పడి పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినవారు కూడా వున్నారు. 

రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఈ మధ్యంతర కాలంలో ఎవరికి వారు జీవితాల్లో వారు స్థిరపడ్డారు. కళాశాలలో కలిసి చదువుకున్న తమ సహాధ్యాయే తమకు పై అధికారిగా వచ్చిన ఉద్యోగులు కూడా కొందరు వున్నారు. ఆఫీసులో సార్ సార్ అనే మర్యాద పిలుపులు కాస్తా ఈ సమ్మేళనంలో పాత రోజుల్లోమాదిరిగా షరామామూలు అరేయ్ ఒరేయ్ కి మారిపోయాయి.

‘ఐ.ఏ.ఎస్. కాగానే మమ్మల్ని మరచిపోయావు. నేను పనిచేస్తున్న డిపార్ట్ మెంటుకి నువ్వే హెడ్డువి. ఏదో ఫ్రెండువి కదా కలవాలని వస్తే నన్ను లోపలికే పంపలేదు.’ డివిజినల్ ఇంజినీరుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్నాడు.

‘భలేవాడివే! విజిటర్స్ స్లిప్ మీద నీ పేరు చూసి నా పియ్యేను పంపించి మరీ పిలిపించా కదా! ఇలా నిష్టూరం ఆడితే ఎలా’ జవాబిచ్చాడు ఆ ఐ.ఏ.ఎస్. 

పోలీసు అధికారి అన్నాడిలా. ‘ఈ ఉద్యోగం పుణ్యమా అని నాకు వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా పోయింది. ఎప్పుడూ నీడలా స్టెన్ గన్లు పట్టుకుని సెక్యూరిటీ గార్డులు. దేశ సరిహద్దుల్లో వున్నప్పుడు ఎలాగూ తప్పదు. నేను చదువుకున్న చోటు ఇది. ఇక్కడన్నా నన్ను వదిలిపెట్టండిరా బాబూ అని బతిమిలాడుకుని వాళ్ళని మెయిన గేటు దగ్గరే వదిలి వచ్చాను’

అందరూ ఒక్క పెట్టున నవ్వారు. ఆ నవ్వులు అలా ఓ మూడు రోజుల పాటు పువ్వులు పూస్తూనే వున్నాయి. ఒకరు పెద్దా అని లేదు, ఒకరు చిన్నా అనిలేదు. అందరూ టైం కాప్స్యూల్ లో మాదిరిగా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళారు. కేరింతలతో, కాలేజీ కబుర్లతో సాగిపోతున్న ఆ ధారా ప్రవాహం ఎవరో అన్న ఒక్క మాటతో ఆగిపోయింది.

‘అన్నట్టు గణేష్ ఏడీ?’

పొట్టిగా వుండే గణేష్ కూడా వారందరితో పాటే అదే కాలేజీలో చదువుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత హైదరాబాదులో చిన్నా చితకా ఉద్యోగాలు చేసి తర్వాత అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు. పెళ్లయింది. ఒక పిల్లాడు. ఏమైందో తెలియదు ఏదో అస్వస్తతకు గురై హఠాత్తుగా కన్నుమూశాడు. అమెరికాలోనే ఉంటున్న కళాశాల సహాధ్యాయులు గణేష్ భార్యను, పిల్లల్ని పట్టుబట్టి కాకినాడ తీసుకువచ్చారు. గణేష్ లేడన్న విషయం తెలిసి స్నేహితులందరూ ఎంతో బాధ పడ్డారు.

గణేష్ కొడుకు కల్పించుకుని అన్నాడు. 

‘మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే మా నాన్న ఎంత అదృష్టవంతుడో అనిపిస్తోంది. ఇక్కడ అరమరికలు లేని మీ స్నేహం గమనించిన తర్వాత చనిపోయి ఎంత దురదృష్టవంతుడో అనిపిస్తోంది’

ఈ మాటలతో అందరి కళ్ళూ చెమ్మగిల్లాయి.

అగ్నిమీళే పురోహితం – భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు 07-11-2021 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.

కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.

లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం వొహ్ వోహోం వోహోం ధ్వనులు – ఎక్కడన్నా కనవస్తున్నాయా? ఎప్పుడన్నా వినబడుతున్నాయా?

నా చిన్నతనంలో మా సుబ్బయ్య తాతయ్య గారి దగ్గర ఓ గ్రామఫోన్ వుండేది. దాని ధ్వని నలుగురికీ బాగా వినబడడానికి దానికి గమ్మత్తయిన, విచ్చుకున్న పువ్వు  ఆకారంలో వుండే  రేకుతో చేసిన ఒక  స్పీకర్ తగిలించేవాళ్ళు. గ్రామఫోనుకు అదొక గుర్తుగా వుండేది. పాటల రికార్డులు మందపాటి భోజన పళ్ళాల మాదిరిగా పెద్దగా వుండేవి. వాటిమీద గాయనీగాయకుల పేర్లు, సినిమా పేరు, సంగీత దర్శకుడి వివరాలు ముద్రించేవాళ్ళు. గ్రామఫోనుకు గడియారం మాదిరిగా కీ ఇచ్చి, రికార్డు  దానిమీదవుంచి, అది తిరుగుతున్నప్పుడు ముల్లును జాగ్రత్తగా గాడిలో పెట్టేవాళ్ళు. ఆ ముల్లును గవర్నర్ అనే పరికరంలో బిగించే వాళ్ళు. రికార్డు తిరగడం ప్రారంభం కాగానే పాట మొదలయ్యేది. మా తాత గారు సంగీతం అంటే చెవికోసుకునేవారు. అందువల్ల ఆయన దగ్గర వున్నరికార్డుల్లో అన్నీ జావళీలే. ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. అయినా వూరు వూరంతా ఆ పాటలు వినడానికి పోగయ్యేవాళ్ళు. అంత చిన్న పెట్టెలో నుంచి పాటలు పాడుతున్నదెవరో తెలియక విస్తుపోయేవాళ్ళు. ఏదో మంత్రం పెట్టె పట్టుకొచ్చారని మా తాతగారిని అనుమానించిన వాళ్ళు కూడా వున్నారు.

పొతే, నేను రేడియోలో చేరినప్పుడు గ్రామఫోన్ రికార్డులు వుండేవి. కాకపొతే కాస్త నాజూకుగా చిన్నగా వుండేవి. ఇప్పడు వాటి జాడ కూడాలేదు. అన్నీ కంప్యూటర్ డిస్క్ లే. వాటికి కూడా కాలం చెల్లినట్టు వుంది. అంతా డిజిటల్. జగమంతా డిజిటల్. 

రేడియోలో చేరిన కొత్తల్లో ఓ రోజు జంధ్యాల స్వయంగా రేడియో స్టేషన్ కు వచ్చి తను మొదట డైరెక్ట్ చేసిన ‘ముద్దమందారం’ సినిమా పాటల రికార్డ్ ను ప్రసారం నిమిత్తం తెచ్చి నాకిచ్చివెళ్లడం ఇప్పటికీ ఓ మధుర విషాద స్మృతి.

తన గొంతు తాను వినాలని, తన మొహం తాను చూసుకోవాలని – ప్రతి మనిషికీ కొన్ని బలహీనతలు వుంటాయంటారు. ఇలా మనసుపడని మనుషులు వుండరేమో కూడా. రేడియోలో తమ గొంతు ఒక్కసారయినా వినపడాలని తాపత్రయపడి అందుకోసం ఎంతగానో ప్రయత్నించిన పెద్దవాళ్ళు ఎందరో నా వృత్తి జీవితంలో పరిచయం అయ్యారు. అలాగే ఋష్యశృంగుడు లాటి పెద్దమనుషులు కూడా ఫోటోలో తమ మొహం ఎలావుందో చూసుకోవాలని ముచ్చటపడడం కద్దు. అలాటి వాళ్లకు వాళ్ళ ఫోటో వాళ్ళకే చూపింఛి చూడండి. పైకి మొహమాటపడి చూసీ చూడనట్టు చూసి వొదిలేసినా, నలుగురు లేని సమయం చూసి ఒక్కమారయినా ఆ ఫోటోను తనివితీరా చూసుకోవడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. ఆ రోజుల్లో రేడియోకు, ఈ రోజుల్లో టీవీలకు జనం వెంపర్లాడటం అన్నది జనంలో అంతరాంతరాలలో దాగివున్న వున్న ఈ బలహీనతవల్లే అని అనుకోవాలి.

సరి. మళ్ళీ గ్రామ ఫోన్ రికార్డుల సంగతికి వద్దాం.

ఈ రికార్డులకు హెచ్ ఎం వి (హిజ్ మాస్టర్ వాయిస్)ది పెట్టింది పేరు. ఈ కంపెనీ లోగో పై వుండే కుక్క బొమ్మ జగత్ ప్రసిద్ధం. అసలీ గ్రామ ఫోను రికార్డుల కధాకమామిషు గురించి ఈ కంపెనీ ఓ బుల్లి కరపత్రాన్ని ప్రచురించింది. ఇప్పుడు చెప్పబోయే కధనానికి అదే ఆధారం కనుక ఇది వొండివార్చిన వార్తా కధనం కాదని నమ్మడానికి ఆస్కారాలు వున్నాయి.

పందొమ్మిదవ శతాబ్దం లో థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త గ్రామఫోను రికార్డును తయారు చేసారు. ఈ ఒక్కటే కాదు - విద్యుత్ దీపం, కెమెరా మొదలయిన వాటిని తొలిసారి కనుక్కున్నది కూడా ఎడిసన్ మహాశయులవారే అన్నది ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి సయితం తెలిసిన విషయమే.

గ్రామఫోను రికార్డుని తయారు చేసిన ఎడిసన్ గారు – ఎవరయినా సుప్రసిద్ధ వ్యక్తి స్వరాన్ని మొదటి రికార్డుపై భద్రపరచాలని తలపోశారు. ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ఆయన మదిలో మెదిలారు.

“మీ స్వరాన్ని రికార్డు చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు కలవాలని” కోరుతూ మాక్స్ ముల్లర్ కి ఆయన వెంటనే లేఖ రాసారు. ఎడిసన్ పై ఎంతో గౌరవ ప్రతిపత్తులు కలిగిన మాక్స్ ముల్లర్, ఎడిసన్ అభ్యర్ధనను అంగీకరించారు. పలానా సమయంలో యూరోపులోని శాస్త్రవేత్త లందరూ ఇంగ్లాండ్ లో సమావేశం అవుతారనీ, అప్పుడువస్తే బాగుంటుందనీ ముల్లర్ జవాబు రాసారు.

ఆవిధంగానే ఎడిసన్ ఆ సమావేశానికి వెళ్లారు. మాక్స్ ముల్లర్ ఆయన్ని సభికులకు పరిచయం చేసారు. అప్పటికే ఎడిసన్ శాస్త్ర ప్రయోగ విజయాలను కర్ణాకర్ణిగా వినివున్న ఇతర శాస్త్రవేత్తలు ఆయన్ని సగౌరవంగా స్వాగతించారు.

తరువాత ఎడిసన్ అభ్యర్ధనపై మాక్స్ ముల్లర్ వేదికపైకి వచ్చి ఎడిసన్ వెంట తెచ్చుకున్న రికార్డింగ్ పరికరం ఎదుట నిలబడ్డారు. ఆయన చెప్పిన మాటలు రికార్డు చేసుకున్న ఎడిసన్ బయటకు వెళ్లి మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం సమావేశ మందిరానికి తిరిగి వచ్చారు. ఈ సారి ఆయన చేతిలో ఒక రికార్డు కూడా వుంది. దాన్ని గ్రామ ఫోనుపై వుంచి ఆ ఉదయం రికార్డు చేసిన ముల్లర్ స్వరాన్ని సభికులకు వినిపించారు.

అందులో నుంచి వినిపిస్తున్న ముల్లర్ స్వరాన్ని వింటూ యావన్మందీ చేష్టలుడిగి పోయారు. భావి తరాలకోసం ముల్లర్ స్వరాన్ని భద్రపరచిన ఎడిసన్ కృషిని అంతా చప్పట్లు చరుస్తూ మెచ్చుకున్నారు. కరతాళధ్వనులు సద్దుమణిగిన తరవాత మాక్స్ ముల్లర్ మళ్ళీ వేదిక మీదకు వచ్చారు. సభికుల నుద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు.

“ఈ ఉదయం ఎడిసన్ మహాశయులు నా గొంతు రికార్డు చేస్తున్నప్పుడు మీరది విన్నారు. ఇప్పుడు మళ్ళీ గ్రామఫోను నుంచి వెలువడిన నా మాటలు కూడా విన్నారు. నేను ఉదయం ఏమి మాట్లాడానో, ఇప్పుడు మీరు ఏమి విన్నారో ఏమయినా, ఎవరికయినా అర్ధం అయిందా?” అని సభికులను సూటిగా ప్రశ్నించారు.

ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం తాండవించింది. హాజరయిన వారందరూ వారి వారి విభాగాలలో నిపుణులు. నిష్ణాతులు. అయితే మాక్స్ ముల్లర్ ఏమి మాట్లాడారో వారిలో ఎవరికీ అర్ధం కాని మాట నిజం. కారణం ఆ భాష వారికి తెలవదు కాబట్టి. గ్రామఫోను నుంచి వెలువడుతున్న ముల్లర్ స్వరాన్ని వింటూ మైమరచిపోయిన సభికులు, ఆ ఆశ్చర్యంలో ఆయన ఏభాషలో మాట్లాడారన్నది గమనించలేదు. వాళ్ళంతా యూరోపు కు చెందినవాళ్ళు కాబట్టి ఆ భాషను వారెప్పుడూ వినివుండలేదు.

సభికుల అశక్తతను అర్ధం చేసుకున్న మాక్స్ ముల్లర్ తానేమి మాట్లాడిందీ తానే స్వయంగా వివరించారు. తాను మాట్లాడింది సంస్కృత భాషలో అన్నది ఆయన చెప్పేవరకు తెలియని శాస్త్రవేత్తలందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టారు. గ్రామ ఫోను రికార్డింగ్ కోసం అంతకుముందు పేర్కొన్న రిగ్వేదం లోని మొదటి శ్లోకాన్ని ఆయనమళ్ళీ చదివి వినిపించారు.

“అగ్నిమీళే పురోహితం – యజ్ఞ స్వదేవ మృత్విజం హాతారం రత్నశాసనం” – ఇలా సాగిపోతుందా శ్లోకం. ప్రపంచంలో మొట్టమొదటి గ్రామఫోను రికార్డుపై రికార్డయిన  అరుదైన రికార్డును, రిగ్వేద శ్లోకానికి,  మాక్స్ ముల్లర్ ఆవిధంగా కట్టబెట్టారన్న  విషయం తెలపడమే ఈ కధనం లోని విశేషం.

(EOM)

NOTE: అగ్ని మీళే పురోహితం శ్లోకానికి ప్రతిపదార్ధ తాత్పర్యాలు ఆంధ్రామృతం బ్లాగులో వున్నాయి. అవి యధాతధంగా: 

ప్రతిపదార్థము.  అగ్నిం = అగ్నినిపురోహితం = పురోహితుడినియజ్ఞస్యదేవం = (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానినిఋత్విజమ్ = ఋత్విక్కునుహోతారమ్ = హోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును)రత్నధాతమమ్ = (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మజ్ఞానరత్నాలతో పోషించేవాణ్ణిఈళే = నేను ప్రస్తుతిస్తానుమనసా ప్రార్థిస్తాను.

భావము. అగ్నినిపురోహితుడిని; (జీవన) యజ్ఞాన్ని ప్రకాశింపచేసేవానినిఋత్విక్కునుహోతను ( దేవతాశక్తులను ఆహ్వానించే ఋత్విక్కును); (జీవన యజ్ఞక్రియారూపం ద్వారా వచ్చే) ధర్మజ్ఞానరత్నాలతో పోషించేవానినినేను ప్రస్తుతిస్తానుమనసా ప్రార్థిస్తాను.



6, నవంబర్ 2021, శనివారం

ఇద్దరు స్నేహితుల హృదయావిష్కరణ – భండారు శ్రీనివాసరావు



కొంత పరస్పర డబ్బా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ ఈ ప్రోగ్రాం చేసిన జర్నలిస్ట్ ప్రేమకు అవేవీ పట్టవు. వాళ్ళ నాన్న జ్వాలాలాగే తాను అనుకున్నది అనుకున్నట్టు చేసుకుపోవడమే ఆమెకు తెలుసు.

ఒకరిని గురించి మరొకరు చెప్పడం ద్వారా ఇద్దరు స్నేహితులను పరిచయం చేయాలని అనుకున్నట్టుంది. అలాగే చేసింది. ఈ క్రమంలో కొందరికి  నేను పైన చెప్పిన మాట కొంత నిజమనిపించవచ్చు. చేయగలిగింది లేదు.

జ్వాలా, నాకు మధ్య ఉన్న స్నేహానికి షష్టిపూర్తి దాటింది. ఈ సందర్భంలో మా ఇద్దర్నీ కూర్చోబెట్టి ప్రేమ అనే ప్రేమమాలిని అనే బుంటీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

అదేమిటో విచిత్రం. ముసురుపట్టినట్టు ఈరోజు నా పోస్టులు అన్నీ వీడియోలే!   







Journalist BHANDARU SRINIVAS RAO's Comments on Jai Bhim Movie ...

జవాబుకు తగ్గ ప్రశ్న- భండారు శ్రీనివాసరావు

 సమాధానంఎలా వుండాలని కోరుకుంటారో ప్రశ్న ఆ విధంగా వుండాలని కార్పొరేట్ గురువులు చెబుతుంటారు.

అందుకో ఉదాహరణే ఈ కధ.
ఏకాంబరం, పీతాంబరం మంచి మిత్రులు.
‘దేవుడ్ని పూజిస్తూ సిగరెట్ తాగొచ్చా’ అన్నది పీతాంబరం అనుమానం. వెళ్లి గుళ్ళో పూజారి ఒంటరిగా వున్నప్పుడు అడిగాడు.
“తప్పు నాయనా! తప్పు. దైవ ప్రార్ధన చేసేటప్పుడు అటువంటి తప్పుడు పనులు ఎంతమాత్రం కూడదు” అన్నాడు పూజారి.
ఆ విషయమే వెళ్లి స్నేహితుడితో చెప్పాడు.
“నువ్వు అలా అడిగుండాల్సింది కాదు’ అన్నాడు పీతాంబరం.
తరువాత పీతాంబరం వెళ్లి మళ్ళీ అదే పూజారిని కలుసుకుని అడిగాడు,“పొగతాగుతూ దైవాన్ని స్మరించుకోవచ్చా!” అని.
“దానికేం నాయనా! నిక్షేపంగా దైవ ప్రార్ధన చేసుకోవచ్చు. సర్వకాల సర్వావస్తలలో దేవుడ్ని స్మరించుకోవడం అవశ్యం అభిలషణీయం”

రాయడం నాకో వ్యసనం ఓ వ్యాపకం - భండారు శ్రీనివాసరావు


కానీ ఆ రాసిన వాటిలో ఒకటి ఇలా నాలుగు చెరగులా పాకుతుందని అనుకోలేదు. మహా న్యూస్ ఎండీ శ్రీ వంశీ ఈరోజు అంటే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు నన్ను స్టూడియోకి ఆహ్వానించి ఈ అంశంపైన గంట ప్రోగ్రాం చేశారు. అనేక వెబ్ ఛానల్స్ నా దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఇవేమీ నాకు కొత్తకావు. కానీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాసాన్ని చదివి దానిమీద ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి. ఇది కేవలం నా వ్యాసానికి ప్రేరణ ఇచ్చిన జస్టిస్  చంద్రు గొప్పతనం. నాదేమీ లేదు.నిమిత్తమాత్రుడిని.

మహా  న్యూస్ ఛానల్. సుమన్ టీవీల యాజమాన్యాలకు కృతజ్ఞతలు.