13, ఆగస్టు 2021, శుక్రవారం

అతడు – ఆమె - ఆవిడ

 ఓసారెళ్ళి ఆవిడ్ని చూసిరండి. ఒకటే కబుర్లు చేస్తోంది.’

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి సైకిల్ స్టాండ్ వేస్తున్న శంకరం కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. భార్య నోటి వెంట ‘ఆవిడ’ ప్రస్తావన రావడం ఈ అయిదేళ్ళలో ఇదే మొదటిసారి.

పెళ్ళయిన నాటి నుంచీ ఇదే తంతు.

'నేను మీ జీవితంలోకి వచ్చాను. అంతే. ఇక ఆవిడ ప్రస్తావన మన మధ్య రావడానికి వీల్లేదు’ దాదాపు హుకుం జారీ చేసింది.

మొదటి రాత్రే తనంటే ఏమిటో స్పష్టంగా తెలియచెప్పింది. కాస్త వయసు మీదపడ్డ తరువాత పెళ్లి చేసుకుంటే ఇంతేనేమో. తానూ అప్పటినుంచి కుక్కిన పేను మాదిరిగానే పడివుంటున్నాడు, 'భార్య గీసిన గీత దాటడు' అనే పేరు బయట మారుమోగుతోందని తెలిసినా.

ఇక, ఇంట్లోఆవిడ’ ప్రసక్తి తేనంతవరకు, రానంతవరకు భార్య తనని పల్లెత్తు మాట అనదు. పొరబాటున వచ్చిందంటే చాలు ఇక తన మాట వినదు.

ఏమిటో ఈ ఆడవాళ్ళు. మరో ఆడదాని మాట మొగుడి నోట వెంట 'వినాల'ని కూడా అనుకోరు.

ఇంతకీ శంకరం భార్య మొగుడ్ని వెళ్ళి చూసిరమ్మని చెప్పిన ‘ఆవిడ' ఎవరో కాదు, శంకరాన్ని నవమాసాలు మోసి కని పెంచిన అతడి కన్నతల్లి. పదిహేనేళ్ళ క్రితం తండ్రి చనిపోయిన నాటి నుంచి తన బాగోగులు చూస్తూ తను ఒక ఇంటివాడు అయ్యేంతవరకు కనిపెట్టుకుని చూసిన మనిషి. పెళ్ళయిన మరుసటి నెలలోనే, కోడలి దాష్టీకం పుణ్యమా అని ఇల్లు వొదిలి పెట్టి పరాయి ఇంట్లో తలదాచుకుంటూ, ‘వంటలమ్మగా’ రోజులు వెళ్లమారుస్తోంది.

భార్యే స్వయంగా చూసి రమ్మని చెప్పడంతో ఇక శంకరం ఆఘమేఘాలమీద తల్లి దగ్గర వాలిపోయాడు. తనకోసమే కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు వుంది. కానీ ఆ తల్లి కళ్ళల్లో కొడుకుని చూసిన తృప్తే తప్ప జీవం లేదు.

'నీతో కలిసి భోంచేయాలని వుందిరా శంకరం. నీకు అంత తీరుబడిఉందా? వెంటనే వెళ్ళాలా!' అని అడిగింది. పర్మిషన్ తీసుకునే వచ్చాడు కనుక 'దానికేముందమ్మా! అన్నం తినడమే కాదు ఈరోజంతా నీతో కలిసేవుంటాను' అనేసాడు. ఆ తల్లి తబ్బిబ్బయింది. తత్తరపాటుతో లేచి వెళ్లి వంట మొదలు పెట్టింది. శంకరం కూడా పక్కనే పీట వేసుకు కూర్చున్నాడు. ఆవిడ ఒక పక్క వంట చేస్తూనే శంకరం చిన్నతనపు అల్లరి గురించీ, తిండి అలవాట్లు గురించి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టింది. ఆ కబుర్లు వింటుంటే చిన్నప్పుడు తల్లిని ఎంతగా ప్రాణాలు కొరుక్కు తినేవాడో అ విషయాలన్నీ కన్నీటిపొర తెరలా కమ్మిన కళ్ళల్లో గిర్రున తిరిగాయి.

ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. తిన్నంత సేపూ తనివితీరా కబుర్లు చెప్పుకున్నారు. పాత సంగతులు గుర్తుచేసుకున్నారు. కానీ ఆవిడ పొరబాటున కూడా 'ఆమె' ప్రసక్తి తీసుకురాలేదు.

బయలుదేరేటప్పుడు ఒక మూట చేతిలో పెట్టింది. ఇంటికి చేరగానే ఆ మూటను భార్య చేతిలో పెట్టాడు. ఆమె విసురుగా దాన్ని అటక మీదకు గిరవాటు వేసింది.

రోజులు గడిచాయి. మళ్ళీ కబురు. కానీ ఈసారి ఆవిడ నుంచి కాదు. ఆవిడ వంటలు చేసిపెట్టే వారినుంచి.

'అంతా అయిపొయింది. ఇన్నేళ్ళు మా ఇంట్లో వంటలు చేసి పెడుతోంది కానీ ఆవిడ ఎవ్వరో, ఎవరి తాలూకో కూడా తెలియదు. మొత్తం మీద మీ చిరునామా కనుక్కునేసరికి ఇన్నాళ్ళు పట్టింది. అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేసే ఒక సంస్థ వారు ఆపని పూర్తిచేశారు'

శంకరం బావురుమన్నాడు. ఇంటివారు కబురుచేసిన దానిప్రకారం తల్లితో కలిసి భోంచేసిన రాత్రే ఆవిడ కన్ను మూసింది. భార్యకు ఇచ్చిన మూట జ్ఞాపకం వచ్చి అటక మీద నుంచి తీసి చూశాడు. తల్లికి పుట్టింటివాళ్ళు పెట్టిన నాలుగు బంగారు గాజులు, వొంటిపేట చంద్రహారం అందులో వున్నాయి. వాటితో పాటే ఓ చీటీ.

'ఒరేయ్ శంకరం. నువ్వు పెళ్లి చేసుకుని కోడల్ని తీసుకురాగానే ఇవి ఇద్దామనుకున్నాను. ఇల్లు వొదిలి రావడం వల్ల కుదరలేదు. తరువాత ఇద్దామని ఎన్నోసార్లు అనిపించినా మళ్ళీ దేనికోసమో ఆరాటపడుతోంది అని అనిపించుకోవడం ఇష్టం లేక ఆ ఉద్దేశ్యం మానుకున్నాను. నా తరువాత ఇవన్నీ కోడలికే దక్కాలి. మనసులో ఏవీ పెట్టుకోకుండా తీసుకోమని చెప్పు. నేను ఇక ఎన్నో రోజులు బతుకుతానని అనుకోను. నిన్ను చూసాక ఇక నా ఆఖరి కోరిక కూడా తీరిపోయింది'

శంకరం ఆశ్చర్యంతో ఏడుపు ఆపేసాడు.

మరొకరు ఆ గదిలో రోదిస్తున్న ధ్వని సన్నగా వినబడుతోంది.

12, ఆగస్టు 2021, గురువారం

నాకు వచ్చిన కల – భండారు శ్రీనివాసరావు

 యాభయ్ ఏళ్ళ క్రితం నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసే రోజుల్లో ఆంధ్రజ్యోతి వారపత్రిక (ఇప్పుడు నవ్య అనే పేరుతొ వస్తోంది) ఎడిటర్ పురాణం సుబ్రమణ్య శర్మ గారు పాఠకులు పాల్గొనే ఒక శీర్షిక ప్రారంభించారు. దాని పేరు ‘నాకు వచ్చిన కల’

పుంఖానుపుంఖాలుగా పాఠకుల నుంచి రచనలు వచ్చేవి. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మగారు అస్వస్థత కారణంగా సెలవు పెడితే కొన్నాళ్ళు పురాణం గారికి సహాయకుడిగా పనిచేశాను. అలా ఈ శీర్షికకు వచ్చే రచనలు పరిశీలించే అవకాశం నాకు లభించింది. వీటిలో ఒకటి ఇప్పుడు స్పురణకు వస్తోంది.
ఒకడు కల కంటాడు. తాను ఒక స్నేహితుడికి ఇచ్చిన బాకీని ఆ మిత్రుడు తీర్చేస్తాడు. అయితే అది కలలో.
నిజజీవితంలో ఆ స్నేహితుడు అప్పు తీర్చబోతే అదేమిటి బాకీ ఎప్పుడో చెల్లు అయింది కదా అంటే ఆ స్నేహితుడు తెల్లబోతాడు. బాకీ తీర్చింది కలలో అనే విషయం చివరికి అర్ధం అవుతుంది. అదే తాను స్నేహితుడివద్ద అప్పుచేసి అతడి బాకీ తీర్చినట్టు కలకని, దాని విషయం పూర్తిగా మరచిపోతే ఏమయ్యేదో అని తీరిగ్గా మధన పడతాడు.
ఈ సంగతి గుర్తు రావడానికి ఒక కారణం వుంది.
ఈరోజు ఒక ఛానల్ లో చర్చ చూశాను. అది కేవలం ఊహాగానాల మీద సాగిన చర్చ. అంటే టీవీ వాళ్ళే( ఆ కలలో లాగా) ఒక పరిణామం ఊహించుకుని, అది జరిగిందని నమ్మి చర్చపెట్టారు. సరే! అందులో పాల్గొన్నవాళ్ళు కూడా అది జరిగిందనే నమ్మి యధారీతిగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
శుభం భూయాత్!
(12-08-2021)

నవ్వుకునేవాళ్ళకు నవ్వుకున్నంత

 ఆఫీసరు కొత్తగా చేరిన ఉద్యోగితో అన్నాడు.

"ఇక్కడ పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తాం. నువ్వులోపలకి వచ్చేటప్పుడు డోర్ మ్యాట్ మీద బూట్లు శుభ్రంగా తుడుచుకుని వచ్చావా?"

"అవునండీ!"

"అలానా! మేము మరో విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాము. ఇక్కడ పనిచేసేవాళ్ళు నిజం చెబుతున్నారా అబద్దం చెబుతున్నారా అని. అసలా గుమ్మం దగ్గర డోర్ మ్యాటే లేదు"


"కుక్కలు ఎందుకు పెళ్లి చేసుకోవు"

"ఇదో ప్రశ్నా! ఎందుకంటె వాటిది అప్పటికే కుక్క బతుకు"


"తల్లికీ భార్యకూ తేడా?"

" ఏడుస్తున్న నిన్ను, తల్లి ఈ లోకంలోకి తెచ్చిపడేస్తుంది. రెండో ఆవిడ నువ్వు జీవితాంతం ఆ ఏడుపు ఆపకుండా జాగ్రత్తగా కనిపెట్టి చూస్తుంది"


"మగ సెక్రెటరీకి ఆడ సెక్రెటరీకి తేడా?"

"మగ సెక్రెటరీ ఆఫీసుకు వెళ్ళగానే బాసుకు 'గుడ్ మార్నింగ్' చెబుతాడు. ఆడ సెక్రెటరీ 'ఇక లేవండి బాస్ తెల్లారింది' అంటుంది"

(మళ్ళీ మళ్ళీ చెప్పక్కరలేదు - యధావిధిగా ఇంగ్లీష్ జోకులకు స్వేఛ్చానువాదం)

 

11, ఆగస్టు 2021, బుధవారం

మీ ఆడ గుర్రం ఫోను చేసింది

 

ఏకాంబరం ఉదయం లేచి వరండాలో పేపరు చదువుకుంటున్నాడు. ఇంతలో భార్య సూరేకాంతం అప్పడాల కర్రతో ఏకాంబరం మాడుపై ఒక్కటిచ్చింది. ఏకాంబరం కుయ్యో మొర్రో అంటూ మొత్తుకున్నాడు. మొత్తుకోవడం అయిపోయిన తరువాత ఎందుకలా కొట్టావ్ అని అడిగాడు.

'ఎందుకా' సూరేకాంతం చెప్పింది.

'మీ ప్యాంటు జేబులో కళ్యాణి అని రాసిన చిట్టీ వుంది. ఎవత్తది! ముందా సంగతి చెప్పండి'

ఏకాంబరానికి నిలువు గుడ్లు పడ్డాయి. కానీ వెంటనే తమాయించుకున్నాడు.

'ఓస్ ఆ కళ్యాణా! అది రేసు గుర్రం. మొన్న నా ఫ్రెండు గుర్నాధం కళ్యాణి మీద పందెం కాయమని గుర్తుగా రాసిచ్చాడు'

అది విని సూరేకాంతం నొచ్చుకుంది. మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని లేచి వెళ్లి ఇంత వెన్నపూస తెచ్చి ఏకాంబరం మాడుకు రాసింది.

వారం తిరిగిందో లేదో ఏకాంబరం మాడు మళ్ళీ పగిలింది. ఈసారి సూరేకాంతం అప్పడాలకర్ర కాకుండా ఇనుప గరిటె తిరగేసి కొట్టింది. ఆ దెబ్బకు ఏకాంబరం మూర్చపోయాడు. తేరుకున్న తరువాత షరామామూలుగా అడిగాడు భార్యని, ఈసారి కొట్టడానికి కారణం ఏమిటని.

భార్య చెప్పిన జవాబు విని ఏకాంబరం మళ్ళీ మూర్చపోయాడు.

'మీ కల్యాణి - అదే మీ ఆడగుర్రం - ఇందాక మీ కోసం ఫోను చేసింది'




10, ఆగస్టు 2021, మంగళవారం

సమాంతర సంభాషణలు


పూర్వం జ్యోతి అనే మాసపత్రిక వచ్చేది. రాఘవయ్య గారు సారధి అయితే ముళ్ళపూడి, బాపు ఆ పత్రికకి అదనపు ఆకర్షణలు. ఓసారి ఆ పత్రికలో సంభాషణలు పలు తెరగులు అని వివరిస్తూ అనేక ఉదాహరణలు ఇచ్చారు ఆ జోడీ. ప్రస్తుతం చెప్పుకుంటున్న సమాంతర సంభాషణలు వాటిల్లో ఒకటి. సమాంతర రేఖలు ఎక్కడా కలవవు, రైలు పట్టాల మాదిరిగా. ఇద్దరు మాట్లడుకుంటూ వుంటారు. వారి అభిప్రాయాల మాదిరిగానే వారి సంభాషణలు ఓ పట్టాన కలవ్వు. ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా అనంతంగా సాగిపోతుంటాయి, వినే వారితో నిమిత్తం లేకుండా. ప్రస్తుతం టీవీ చర్చల్లో ఈ రైలుపట్టాల ముచ్చట్లు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వినేవారికి విన్నంత వినోదం.

9, ఆగస్టు 2021, సోమవారం

ధ్యానం

 2003లో మౌంట్  అబూ  బ్రహ్మకుమారీల  ఆశ్రమంలో  ఒక రోజు.

తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి- ధ్యాన మందిరానికి వెళ్ళాము. స్నానాలు చేసి శుచిగా రావాలని కానీ, పాద రక్షలు ధరించకూడదని కానీ నిబంధనలేమీ లేవు. మందిరంలో ఒక బ్రహ్మ కుమారి తెల్లని దుస్తుల్లో సోఫా మీద ధ్యాన ముద్రలో వుంది. ప్రశాంతమయిన వాతావరణంలో – ఎక్కడ అమర్చారో తెలియని స్పీకర్ల నుంచి మెల్లగా ఒక పాట వినబడుతోంది. పాట పూర్తి కాగానే బ్రహ్మ కుమారి సమ్మోహన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. మధుర ఘడి యలుగా వారు పేర్కొనే ఆ సుప్రభాత వేళలో మెడిటేషన్ చేయడం కొత్త అనుభూతి. కానీ మనస్సు కోతి కదా. దాని వాసనలు దానివి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే – నేను మాత్రం ఆ వాతావరణాన్నీ అక్కడి మనుషులనూ పరిశీలించడంలో మునిగిపోయాను. అరగంటలో ఆ కార్యక్రమం ముగిసింది. అంతా నిశ్శబ్దంగా బయటకు వచ్చారు. అందరిలో ఒక రకమయిన ప్రశాంతత. నిజంగా ధ్యానం లో ఏదయినా వుందా?”



(2003)

 

సావిత్రక్కయ్య @91 – భండారు శ్రీనివాసరావు

 


నిరుడు ఖమ్మంలో రఘు గృహ ప్రవేశానికి హైదరాబాదు నుంచి వెళ్ళాము. కొలిపాక రాంబాబు ఇంట్లో సావిత్రక్కయ్య కలిసింది. వయసు ఎనభయ్ తొమ్మిదేళ్ళు. కుటుంబంలో పెద్దావిడ. పాత తరానికి చెందిన విషయాలు తెలుసుకోవడానికి మిగిలివున్న ఏకైక వారధి. అందుకే ఆమెతో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాను. ముందు ఏముంటాయిరా అంత గుర్తుంచుకునే విషయాలు అంటూనే దాదాపు రెండు గంటలు మాట్లాడింది. ఆమె ధారణ శక్తి చూసి ఆశ్చర్యపోవడం మా వంతయింది.

పుట్టి పెరిగిన కంభంపాడు గురించీ, ఎప్పుడో ఎనభై ఏళ్ళనాడు కాలిపోయిన మా ముత్తాతలు నిర్మించిన మండువా లోగిలి గురించీ, ఆ తర్వాత మా నాన్న హయాములో కట్టిన పెంకుటిల్లు గురించీ, చిన్న నాటి చదువుసంధ్యలు గురించీ, అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు గురించీ అనేక విషయాలు చెబుతూ పోయింది. మేమంతా వింటూపోయాము. ఈ ధ్యాసలో పడి అంశాల వారిగా గుర్తుపెట్టుకునే అసలు పని మరిచేపోయాను. ఆమె తనంతటతానుగా అభివ్యక్తీకరించిన ఆత్మావలోకనం.

ఊళ్ళో అప్పయ్యగారి వీధిబడి దగ్గర చదువు ఆగిపోయింది కానీ మా చెల్లమ్మమ్ముమ్మ పక్కన కూర్చుని నేర్చుకున్న భారత, రామాయణాలు కంఠతా వచ్చేసాయి. పొద్దున్నే బామ్మ తోటకు వెడుతూ తననూ, అన్నపూర్ణక్కయ్యను వెంటబెట్టుకుని వెళ్ళేది. ఇంటికి వస్తూ ఆ రోజుకు కావాల్సిన కూరగాయలు కోసుకుని తెచ్చుకునేవారు.

సావిత్రక్కయ్య పెళ్లి చూపులు వల్లభిలో రామారావు బావ ఇంట్లో జరిగాయి. వరుడు కౌటూరి కృష్ణ మూర్తి. గానుగపాడు. ప్లీడరీ చేశారు. రాధక్కయ్య ఇంట్లో పెళ్లి కుదిరింది. విచిత్రం ఏమిటంటే మళ్ళీ ఖమ్మంలో రాధక్కయ్య ఇంటి పక్కనే వీళ్ళూ ఇల్లు కట్టుకున్నారు. అంతకు ముందు బ్రాహ్మణ బజారులో వుండేవాళ్ళు. అద్దె పది రూపాయలు.

కొత్తల్లో చాలా ఇబ్బందులు. కొత్త ఇంట్లో చేరిన తర్వాత కూడా అవి వెంటే వచ్చాయి. అయితే దేవుడి దయవల్ల మా వారి ప్రాక్టీసు, ఆయన రెక్కల కష్టం వృధా పోలేదు. పిల్లలు ఎదిగి వచ్చారు. ఆడపిల్లలకు, మగపిల్లలకు మంచి సంబంధాలు కుదిరాయి. ఇవ్వాళ ఈ స్తితిలో వున్నామంటే ఆయన చలువే.” అంది తృప్తిగా.

మా వారి ప్రాక్టీసు అంతంత మాత్రంగా వున్నప్పుడు నేను ఎక్కువ రోజులు పుట్టింట్లోనే వుండేదాన్ని. పెద్దమ్మాయి విమల, పెద్దపిల్లాడు దుర్గాప్రసాదు నేను పుట్టిన ఊరు కంభంపాడులోనే పుట్టారు. తర్వాత ఖమ్మం వెళ్ళిపోయాను. ప్రతి వేసవి సెలవుల్లో మా అక్కచెల్లెళ్ళ పిల్లాజెల్లా అందరూ పొలోమని అమ్ముమ్మగారి ఇంటికి వెళ్ళేవాళ్ళు. అలాగే మా అప్ప తద్దినం నాడు కూడా నేను వెళ్ళలేకపోయేదాన్ని. మా వారికి పిల్లలు అంటే ప్రాణం. కోర్టు నుంచి ఇంటికి రాగానే పిల్లలు అందర్నీ కంటి నిండా చూసుకుంటే కాని ఆయనకు తృప్తిగా వుండేదికాదు. అన్నపూర్ణ మా వారిని ‘ ‘ఏం బావా సావిత్రిని రెండు రోజులు కంభంపాడు పంపిస్తే పిల్లులు ఎత్తుకుపోతాయా ఏమిటని’ ఆటలు పట్టిస్తుండేది. కానీ అయన మనసు నాకు తెలుసు. చెప్పాకదా పిల్లలు అంటే ప్రాణమని. ఆ పల్లెటూళ్ళో ఆడుకుంటూ కాలికి చేతికీ దెబ్బలు తగిలించుకుంటారేమో అని భయం. పెళ్ళికి ముందే పుట్టింట్లో ఎక్కువ రోజులు వున్నా కనక పెళ్ళయిన తర్వాత అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అనే బాధ అంతగా వుండేది కాదు. నాకు ఇల్లే వైకుంఠం.

“కన్నపిల్లలు కంటి ఎదుట కనబడేలా ఇప్పుడు ఏర్పాటు చేసారు. అల్లుళ్ళు, కోడళ్ళు మంచివాళ్ళు దొరికారు. చిన్నవాడు అచ్యుత లలిత అనే అమ్మాయిని హమేషా నా దగ్గర ఉండేలా నాకు తోడుగా పెట్టాడు. హైదరాబాదులో వున్న శారద తప్పిస్తే మిగిలిన ఆడపిల్లలు, అల్లుళ్లు, పెద్దబాబు, చిన్నబాబు, కోడళ్ళు  అందరూ ఇక్కడే వున్నారు.  రోజులు మంచిగా గడిచిపోతున్నాయి. ఎవరైనా అడిగితే కానీ, నేను తొంభయ్యవ పడిలో పడుతున్నాను అనే సంగతి గుర్తురావడం లేదు.”

 

ఈరోజు సావిత్రక్కయ్య  పుట్టిన రోజు. 90 నిండి 91లో అడుగు పెట్టింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఖమ్మం ఫోను చేస్తే తనే రిసీవ్ చేసుకుంది. చక్కగా, ఆనందంగా, తృప్తిగా మాట్లాడింది.  పిల్లలు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు మనుమరాళ్లు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పింది.


ఇంతకంటే మనిషి జీవితంలో కోరుకునేది ఏముంటుంది?

సావిత్రక్కయ్యకు నమస్కారాలు.

(09-08-2021)