13, ఫిబ్రవరి 2021, శనివారం

My Speech at Raj Bhavan

12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మరచిపోలేని ఆతిధ్యం – భండారు శ్రీనివాసరావు

 “నేను ఈ పదవిలోకి రాక మునుపు ఒక గైనకాలజిస్టుగా ఎంతో మంది నవజాత శిశువులను  హాండిల్  చేశాను. తెలంగాణా కూడా నవజాత రాష్ట్రమే. కాబట్టి సులభంగా ఈ రాష్ట్రాన్ని కనిపెట్టి చూసుకోగలననే ధైర్యం వుంది. నేను తమిళ బిడ్డను, ఇప్పుడు తెలంగాణా సోదరిని”

ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలంగాణా గవర్నర్ డాక్టర్  తమిళ్ సై సౌందర రాజన్.

నిన్న గురువారం ఉదయం రాజ్ భవన్ నుంచి గవర్నర్ ప్రెస్ సెక్రెటరి శ్రీ మల్లాది కృష్ణానంద్ ఫోన్ చేశారు. ‘రేపు మీరు రాజ్ భవన్ కు రావాలి. గవర్నర్ గారి పుస్తకం ఆవిష్కరణ. వీలయితే నాలుగు ముక్కలు మాట్లాడాలి.

రాజ్ భవన్ నాకు కొత్త కాదు, రేడియో విలేకరిగా చాలా సార్లు వెళ్లాను. రాజ్ భవన్ లో జ్వాలా పనిచేసేటప్పుడు దాదాపు ప్రతి సాయంత్రం అక్కడే అన్నట్టు రోజులు గడిచాయి.  అటువైపు వెళ్లక  ఇంచుమించు పదిహేనేళ్లు కావస్తోంది. అయినా అక్కడ పనిచేసే సిబ్బంది చాలామంది నా మొహం చూసి గుర్తుపట్టి పలకరించడం సంతోషం అనిపించింది. కొంతమంది నా భార్య చనిపోయిన విషయాన్ని ప్రస్తావించి పరామర్శించారు.

గవర్నర్ వచ్చారు. వెంట ఆవిడ భర్త సౌందర రాజన్ కూడా వచ్చారు. ఆయన కూడా డాక్టరే. చాలా చాలా నిరాడంబరంగా వున్నారు. అతిశయం అన్నది మచ్చుకు కూడా కనబడలేదు. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ముందుంచి ఆయన వెనుకనే నిలబడ్డారు. అలాగే గవర్నర్ గారి సలహాదారులు. శ్రీ ఏపీవీఎన్ శర్మ గారు. ఒకప్పుడు  మేమున్న ఎర్రమంజిల్ క్వార్టర్స్ లోనే వుండేవారు. వారి ఇల్లు నిశ్శబ్దంగా ప్రశాంతంగా వుండేది. మా ఇల్లు అర్ధరాత్రి అయినా హడావిడిగా వుండేది. మా గందరగోళాన్ని ఆయన ప్రశాంత చిత్తంతో భరించారు. అలాగే  మహంతిగారు. Principled officer అంటే ఆయన పేరే ముందు చెప్పుకునే వారు.


(తెలంగాణా గవర్నర్ తమిళసై తో భండారు శ్రీనివాసరావు)


ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. దీప స్తంభం దగ్గరికి వస్తూనే గవర్నర్ తల ఎత్తి పైకి చూసారు. పైన వున్న ఏసీ వెంట్ నుంచి వస్తున్న గాలి ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని ఒక్క క్షణం పరకాయించి చూసారు. ఆమె సునిశిత దృష్టి నాకప్పుడు బోధ పడింది.

నన్నూ మరికొందరు సీనియర్ జర్నలిస్టులను వేదిక మీదకు ఆహ్వానించి పుస్తకం విడుదల చేశారు.

ఆ తర్వాత మాలో కొందరిని మాట్లాడమని కోరారు.సుదీర్ఘ ప్రసంగాలు చేసే సందర్భం కాదు. కృష్ణానంద్ కోరినట్టే ముక్తసరిగా మాట్లాడాను. సంవత్సరం కిందట తెలంగాణా గవర్నర్ గా పదవీ స్వీకారం చేసిన పిమ్మట,  ‘తెలుగు నేర్చుకుంటాను అని లేడీ గవర్నర్ చెప్పిన వార్త పత్రికల్లో వచ్చిన సంగతి గుర్తుచేసి, ఆ కారణంగానే తెలుగులో మాట్లాడుతున్నాను అని చెప్పాను. కేంద్ర రాష్ట్ర సంబంధాలను కాపాడడంలో గవర్నర్ల పాత్ర కీలకం, ఈ బాధ్యత నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్నందుకు సంతోషంగా వుందని,  తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని, ముందు ముందు కూడా ఈ సుహృద్భావ వైఖరి కొనసాగాలని ఆశిస్తున్నట్టు చెప్పాను.

మరికొందరి  ప్రసంగాలు అయిన తర్వాత లేడీ గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టి, ఇంగ్లీష్ లో కొనసాగించారు.

గవర్నర్ ప్రసంగం కాబట్టి పత్రికల్లో, మీడియాలో వివరంగానే వస్తుంది. కనుక ఆ ప్రసంగంలో వినవచ్చిన ఒక ముచ్చటతో ముగిస్తాను.

‘ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు ఓ నిరుద్యోగి వచ్చి తన కష్టాలను ఏకరవు పెట్టి, బతుకుతెరువుకోసం ఏదైనా ఉద్యోగం వేయించండి అని ప్రాధేయ పడ్డాడుట. ఆ నాయకుడు చిరునవ్వు నవ్వి, ‘ఏ ఉద్యోగం దొరక్కనే తాను రాజకీయాల్లోకి వచ్చాను అని జవాబిచ్చాడుట.

సభానంతరం జరిగిన విందులో మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని అందర్నీ అడిగి అడిగి  మరీ వంటకాలు సర్వ్ చేయించారు. మహిళలు ఎంతటి ఉన్నత స్థానంలో వున్నా కూడా తమకు మాత్రమే సొంతం అయిన ఆప్యాయంతో కూడిన  అతిథి మర్యాదల్ని మరిచిపోలేరు అనిపించింది. ఒకప్పుడు మా రేడియో వార్తా విభాగంలో పైనుంచి కింద నాలుగో తరగతి ఉద్యోగివరకు అందరూ మహిళలే పనిచేసి అఖిల భారత స్థాయిలో మా యూనిట్ కు గొప్ప అవార్డులు తీసుకువచ్చిన సంగతిని భోజనాల  కబుర్లలో భాగంగా లేడీ గవర్నర్ చెవిన వేశాను.

ఎన్నో రోజుల కరోనా గృహనిర్బంధం తర్వాత ఒక రోజు ఇలా  ఉల్లాసంగా హాయిగా గడిచిపోయింది.

 ఎంతో మంది పాత పాత్రికేయ మితృలు కలిసారు. అనేక నెలల తర్వాత అంతమందిని ఒకే చోట కలిసే మహత్తర అవకాశం కల్పించిన మిత్రుడు కృష్ణానంద్ కి ధన్యవాదాలు. 

 


(12-02-2021)  

 

11, ఫిబ్రవరి 2021, గురువారం

Sr Journalist Bhandaru Srinivasa Rao Give's Clarity On YS Sharmila Party...

ఏం సాధించినట్టు? – భండారు శ్రీనివాసరావు

 ఇప్పుడు తలచుకుంటే అనిపిస్తుంది, ఇంతోటి దానికి ఇన్ని వాయిదాలు ఎందుకో అని. గత మార్చిలోనో, లేదా ఆ తరవాతనో ఎవరో ఒకరు అనుకున్నప్పుడే ఎన్నికలు జరిపి వుంటే, కోట్లల్లో పెట్టిన కోర్టు ఖర్చులు, భారీ మొత్తాల్లో లాయర్ల ఫీజులు ఆదా అయ్యేవి. పంతాలకు పోయి పెళ్ళాం ఖర్చు చేసినా, పట్టుదలకు పోయి మొగుడు తగలేసినా పడే బొక్క ఇంటి ఖజానాకే కదా!

హాయిగా ఇప్పటికల్లా ఎన్నికల క్రతువు పూర్తయి ఎంచక్కా గ్రామాలు, మండలాలు, జిల్లాలు కూడా రాష్ట్రంతో పోటీ పడి రాజకీయాలు నడుపుతూ కాలక్షేపం చేస్తూ ఉండేవి.
(11-02-2021)

సర్కారు కొలువులు – భండారు శ్రీనివాసరావు

 


సర్కారు కొలువులు – భండారు శ్రీనివాసరావు
(Published in Andhra Prabha daily on 13-02-2021, Saturday)
ఉద్యోగం వుండదు కానీ ఉద్యోగం చేసే ఉద్యోగి ఉంటాడు. ఇదెక్కడి విరోధాభాసం అంటారా!
ఇదేదో సరదాగా అంటున్నది కాదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాట.
ప్రతి ఉద్యోగానికి దానికి తగ్గట్టు ఓ పేరు వుంటుంది, గుమాస్తో అనో, అధికారి అనో. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాతికేళ్ళవరకు ఒక ఉద్యోగి ఉండేవాడు. ముందే చెప్పినట్టు అతడు చేయాల్సిన ఉద్యోగం మాత్రం లేదు. అదేదో బ్రిటిష్ కాలంలో (1940) అవసరార్థం ఏర్పాటు చేసిన ఉద్యోగం. బ్రిటిష్ ప్రధానమంత్రి చర్చిల్ కు పొగతాగే అలవాటు వుండేది. గుప్పుగుప్పున రోజూ డజన్ల కొద్దీ సిగార్లు (నాణ్యమైన దొరపొగాకు చుట్టాలు) తగలేయడం ఆయన హాబీ. అందుకని చర్చిల్ దొరవారికి ఆయన బాగా ఇష్టపడే "ట్రిచినోపోలీ" వెరైటీ సిగార్‌ను చర్చల్ కి సరఫరా చేయడానికి ఒక ఉద్యోగాన్ని సృష్టించారుట. దాని పేరే సీ.సీ.ఏ. అంటే చర్చిల్ సిగార్ అసిస్టెంట్. 1945 లో చర్చిల్ ఓడిపోయినా, 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ ఈ పదవి మాత్రం 1970 వరకూ కొనసాగుతూనే ఉందిట.
పరిపాలనలో మార్పు అవసరం గురించి చెప్పడానికి ఈ ఉదంతం ఒక అతిపెద్ద ఉదాహరణ అని ప్రధాని మోడీ అన్నారు.
ఈ విషయం మీడియా వెల్లడించినప్పుడు ఇటువంటివే మరికొన్ని సంగతులు మస్తిష్కంలో మెదిలాయి.
హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రం సింహద్వారం పక్కనే ఓ స్తంభానికి వేలాడుతూ తళతళ మెరుస్తూ వుండే ఓ ఇత్తడి గంట కనిపిస్తుంది.
రేడియో స్టేషన్ లో ఈ ధర్మగంట అవసరం ఏమిటి? అనే ఆలోచన నన్ను వేధిస్తూ వుండేది.(అక్కడ పనిచేసే రోజుల్లో)
విచారించగా తెలిసింది ఏమిటంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినప్పుడు, అదే సమయంలో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు అందరినీ అప్రమత్తం చేయడానికి ఆ గంటను మోగిస్తారని తెలిసింది. మూడు దశాబ్దాల నా ఉద్యోగపర్వంలో ఒక్కసారి కూడా ఆ గంట మోగించిన దాఖలా లేదు. ఆ గంటను శుభ్రంగా తుడిచి పదిలంగా కాపాడడానికి ప్రత్యేకంగా ఓ ఉద్యోగి వుండేవాడేమో కూడా తెలియదు.
ఒకానొక కాలంలో, బహుశా స్వాతంత్రానికి పూర్వం అనుకుంటాను, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే ప్రభుత్వ వైద్యులకు రవాణా సదుపాయాలు సరిగా ఉండేవి కావు. రహదారులు అధ్వానంగా ఉండేవి. ఎటు పోవాలన్నా ఎడ్ల బండ్లే శరణ్యం. ఆ రోజుల్లో ప్రభుత్వ వైద్యులకు జీపు బదులు ఎడ్ల బండి ఏర్పాటు వుండేది. ఒక బండి, అది సర్కారు వాహనం కాబట్టి జత ఎడ్లు, వాటికి గ్రాసం, బండిని నడపడానికి జీపు డ్రైవర్ మాదిరిగా ఒక పనివాడు, ఈ తతంగం నడవడానికి ప్రభుత్వ ఖజానా నుంచి బిల్లుల చెల్లింపు ఇలా సాగిపోయేది.
కొన్నేళ్ళ తరువాత ఆ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కొద్దో గొప్పో మెరుగు పడడం వల్ల సర్కారీ విల్స్ జీపులు రంగ ప్రవేశం చేయడంతో, ఎడ్ల బండ్ల అవసరం లేకుండాపోయింది. అయినా కూడా చాలా కాలంపాటు ఆ వ్యవస్థ రికార్డుల్లో కొనసాగేది అని చెప్పుకునేవారు. 1970 ప్రాంతాల్లో అక్కడ పనిచేయడానికి వెళ్ళిన ఒక డాక్టరు గారెకి మనుషులకు వైద్యం చేసే దవాఖానాలో ఈ పశుగ్రాసం బిల్లులేమిటి అని అనుమానం వచ్చి ఆరా తీస్తే ఈ అసలు విషయం బయట పడింది.
మనలో చాలామంది పూర్వపు తహసీల్ కచేరీలు చూసి వుంటారు. పంకాలు లేని ఆ కాలంలో తహసీల్ దొరగారు కూర్చొనే సీటు మీద ఒక పెద్ద గుడ్డ పంకా వుండేది. ఒక బంట్రోతు దొరవారు దాన్ని అటూఇటూ తాడుతో లాగుతూ వుంటే అయ్యవారు మెల్లగా వీచే ఆ చల్లగాలిలో సేద తీరుతూ రాచకార్యాలు చక్కబెడుతూ వుండేవారు.
తరవాత్తరవాత విద్యుత్ పంకాలు వచ్చాయి కానీ గుడ్డ పంకాలు లాగే కొలువు మాత్రం చాలాకాలం కొనసాగింది.
ఐ.ఏ.ఎస్. అధికారిగా అనేక ఉన్నత పదవులు నిర్వహించిన శ్రీ ప్రభాకరరెడ్డి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. 1977లో ఆయన సర్వీసులో చేరిన కొత్తల్లో ‘మసాల్చి’ అనే ఉద్యోగం ఉండేదట. వెనుకటి రోజుల్లో కలెక్టర్లు గుర్రాల మీద తిరిగేవారు. ఆ గుర్రం ముందుగా వెడుతూ దారి చూపించడానికి ఈ మస్తాల్చి ఉండేవాడు. కాలక్రమంలో గుర్రాలు పోయి మోటారు వాహనాలు వచ్చినా ఆ ఉద్యోగం మాత్రం అలాగే చాలా కాలం కొనసాగుతూ వచ్చిందట.
మన దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో అమలు చేసిన పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని అన్ని స్థాయిల్లో రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు పుట్టుకు వచ్చాయి. మా చిన్నతనంలో మా ఊరికి వి.ఎల్.డబ్ల్యు. అనే ఉద్యిగి కొత్తగా వచ్చాడు. అప్పటిదాకా కరణం, మునసబు మాత్రమే ప్రభుత్వం అనుకునేవారు. అలాగే బ్లాకు డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీవో) ఉద్యోగం కూడా కొత్తగా వచ్చిందే. ఇప్పుడు అవే ఉద్యోగాలకు పేర్లు మారిపోయి వుంటాయి.

‘ఒక గుంతను తవ్వు. ఆ గుంతను పూడ్చు. గుంత తవ్విన వాడికి ఓ ఉద్యోగం, దాన్ని పూడ్చిన వాడికి మరో ఉద్యోగం” ఈ పద్దతిలో అనేక ఉద్యోగాలు. అయినా దేశంలో నిరుద్యోగ సమస్య అలాగే వుంది.(EOM)





(11-02-2021)