17, మార్చి 2019, ఆదివారం

పారాచూట్ పాలిటిక్స్ | News Scan Debate With Vijay On AP Politics | 17th ...







పాజిటివ్ ఓటింగ్
ప్రభుత్వాలు చేసిన మంచి పనులు,
అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలు చూసి
ప్రజలు ఓట్లు వేస్తే అది పాజిటివ్ ఓటింగ్. మేలు చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకునే
సద్గుణం ప్రజలకు వుంది.
అయితే నాయకులకు ఓ వార్నింగ్. మీరు ఈ
విషయంలో   ఓటర్లకు ఆదర్శంగా వుండాలి.
‘మేము స్వప్రయోజనాలకోసం పార్టీలు
మారుతుంటాము, డబ్బులావాదేవీలు చక్కబెట్టుకుంటూ ఉంటాము. మీరు మాత్రం ప్రలోభాలకు
గురికాకుండా ఓటు వేయండి’ అని నీతి వాక్యాలు చెబితే కుదరదు.
‘ఎప్పటికెయ్యది ప్రస్తుత’మని మీరు
అనుకున్నట్టు ఓటర్లూ అనుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి.   

16, మార్చి 2019, శనివారం

హెల్ప్ లెస్

రాజకీయ వ్యాసాలకు వ్యక్తిగత అభిమానాలకు లంకె కుదరదు. దేని దారి దానిదే. అలా అని మనసులో మాటలు ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట, ఏదోవిధంగా రచనలలో తొంగిచూడడం కద్దు. కీర్తిశేషులు, ప్రముఖ జర్నలిస్టు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పట్ల తన అభిమానాన్ని దాచుకోవడానికి సందేహించేవారు కాదు. ఆయన హయాములోనే బడుగు, బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన అంటూ వుండేవారు. అయితే అది తన వ్యాసాల్లో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడేవారు.
సినీ నటుల పట్ల అభిమానం పెంచుకునే రీతిలోనే రాజకీయ నాయకుల విషయంలో కూడా అభిమానులు తయారవుతున్నారు. ఇది తప్పేమీ కాదు.
మా కుటుంబం విషయమే తీసుకుందాం. దాదాపు తొంభయి శాతం మందికి చంద్రబాబునాయుడు అంటే చెప్పలేని ఇష్టం. మొదటి సారి ఆయన ఓటమి పాలయినప్పుడు, మా కుటుంబంలో కొందరు ఆడవాళ్ళు ఆయన్ని చూడాలని కోరితే వాళ్ళని ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాను. అందులో గీత అనే ఆవిడ తన సానుభూతి వాక్యాలతో చంద్రబాబుకు కంటనీరు తెప్పించింది. వాళ్ళని సముదాయించాల్సిన పరిస్తితి ఆయనది. ఇన్నేళ్ళు గడిచినా ఆయన పట్ల వారి అభిమానంలో మార్పులేదు.
ఇక జగన్ అన్నా ఆయన పార్టీ అన్నా ప్రాణం పెట్టేవాళ్ళు రోజూ నా చుట్టూతా కనిపిస్తుంటారు. మా పనిమనిషి, వంట మనిషి, వాచ్ మన్ ఇలా అనేక కుటుంబాల వాళ్ళు నాకు తెలుసు. సాక్షి పత్రిక కేలండర్ పై వేసే వై ఎస్ ఫోటోను ఫ్రేము కట్టించి దాచుకుంటారు. ప్రతి ఏటా ఆ పని చేయడం చూసి నాకు చిత్రమనిపిస్తుంది. జగన్ జైలు నుంచి విడుదల అయిన రోజున తమ రోజువారీ పనులు పక్కన బెట్టి గంటలు గంటల పాటు జైలు పరిసరాల్లో ఆయన కోసం ఎదురు చూస్తూ గడిపారన్న తెలుసుకుని ఆశ్చర్య పోవడం నా వంతయింది. ఇన్నేళ్ళు గడిచినా వాళ్ళూ అంతే! జగన్ పట్ల వారి అభిమానం రవంతకూడా చెక్కుచెదరలేదు.
కాబట్టి, ఎవరి అభిమానాలు వారివి. మా కుటుంబంలోని బాబు అభిమానులకు, జగన్ అభిమానులకు నేను రాసే రాతల్లో కొన్ని బాగా నచ్చుతాయి. కొన్ని అస్సలే నచ్చవు. ఆ విషయం నాకు తెలుసు.
కానీ ఈ విషయంలో నేను హెల్ప్ లెస్.


(పైన పేర్కొన్న రాజేంద్ర ప్రసాద్ గారే మరో మాట కూడా చెప్పేవారు. జర్నలిస్టు అనేవాడు ప్రతిపక్షం పట్ల కొంత సానుభూతి చూపాలని అనేవారు. ప్రచారం చేసుకోవడానికి పెద్ద వ్యవస్థ ప్రభుత్వం చేతిలో వుంటుంది. ఆ వెసులుబాటు లేని ప్రతిపక్షాల సంగతి కనిపెట్టి చూడాలని దాని తాత్పర్యం)

దుర్గంధ భరితం - ఏపీ రాజకీయం

ఒక మంచి మనిషిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. పోలీసులకంటే ముందు రాజకీయం రంగ ప్రవేశం చేస్తుంది. కారణం  అది ఆంధ్రప్రదేశ్.
ఉదయం గుండెపోటుతో మరణించారని వార్తలు. చనిపోయింది నిగర్వి, నిరాడంబరుడు అయిన వై.ఎస్. వివేకానంద రెడ్డి. అందరూ పార్టీలను పక్కన బెట్టి నివాళులు అర్పించారు. ఒక గొప్ప మనిషి, నేటి రాజకీయాలకు ఏమాత్రం సరిపోని వ్యక్తి కాబట్టి అందరూ ఆయనతో తన అనుబంధాలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
గంటల్లో దృశ్యం మారిపోయింది. అది సహజ మరణం కాదు, హత్య అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అంతే! రాజకీయం రంగంలోకి వచ్చింది. చనిపోయింది సాక్షాత్తు ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి కావడంతో రాజకీయం తన డేగ రెక్కలు విప్పుకుంది. అందులోను ఎన్నికల కాలం. ఎవరు మాత్రం వదులుకుంటారు ఈ మహత్తర అవకాశం. అదే జరుగుతోంది. ఒక ఉత్తమ రాజకీయ నాయకుడి ఆకస్మిక మరణం అమానుష రాజకీయానికి ఒక వేదికగా మారింది. ఎక్కడయినా ఇలా జరుగుతుందా! జరగదు. కానీ అది ఆంధ్రప్రదేశ్. అక్కడ అలాగే జరుగుతుంది. జరిగితీరాలి.
సంఘటనపై పోలీసులు స్పందించారు. చనిపోయింది కడప జిల్లాకు చెందిన  ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కావడంతో డీజీపీ స్థాయి అధికారి పెదవి విప్పి మాట్లాడడంలో అసహజం ఏమీ లేదు. కానీ అది కూడా ఒక వివాదాంశం అయికూర్చుంది. ఎండుమంటే, అది ఆంధ్రప్రదేశ్.
వివాదం కావడానికి కూడా కారణం లేకపోలేదు. గతంలో విచారణ సాగుతుండగానే పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తొందరపడి  స్పందించిన దాఖలాలు వున్నాయి. ఉన్నతస్తానాల్లో ఉన్న పోలీసు  అధికారులు ఇలా  బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యానాలు చేయొచ్చా  అనే చర్చ అనవసరం. ఎందుకంటె అది ఆంధ్రప్రదేశ్.
ఈలోగా అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన  ఒక నాయకుడు టీవీ తెరలపై కానవచ్చి ‘జగనే తన బాబాయిని హత్య చేయించాడని ఒక బాంబు పేల్చారు.  ఇలా తొందరపడి ఒక నిర్ధారణకు రావడం, ప్రతిపక్ష నేతపై ముందూ వెనకా చూసుకోకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం సబబా అంటే ఎంతమాత్రం కాదు. కానీ అది ఆంధ్రప్రదేశ్. అలాగే జరుగుతుంది.
వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్ళు ఊరుకుంటారా! ఊరుకుంటే అది రాజకీయపార్టీ కానేరదు. ఏకంగా ఆ పార్టీ అధినాయకుడే స్పందించారు. ఇది ప్రభుత్వం చేయించిన హత్య అని జగన్ మోహన రెడ్డి ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం వుందనేది అన్యాపదేశంగా ఆయన ఉద్దేశ్యం. ఒక ముఖ్యమంత్రి పై ఇలాంటి ఆరోపణలు చేయడం సహేతుకమా అంటే సమాధానం మళ్ళీ ఒక్కటే. అది ఆంధ్రప్రదేశ్.
మరో రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్ల పర్వం మొదలవుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్దులను ఖరారు చేయడంలో, అసంతృప్తులను బుజ్జగించడంలో, పార్టీ మారి వచ్చేవారికి కండువాలు కప్పి తమ పార్టీ తీర్దాలు ఇప్పించడంలో తలమునకలుగా ఉన్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రి  విలేకరుల సమావేశం పెట్టి సంఘటన పూర్వాపరాలను వివరించారు. పనిలో పనిగా అనుమానపు వేలును జగన్ వైపు చూపించారు. ఇది అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్.
విడ్డూరంగా అనిపించే విషయం ఏమిటంటే ఒక చిన్న స్థాయి పోలీసు అధికారి చెప్పాల్సిన మాటలు ముఖ్యమంత్రి చెప్పడం.
‘ఉదయం సహజ మరణం అన్నారు. గంటల్లో అది హత్య అని తేలింది. సంఘటన జరిగింది వారింట్లో. చనిపోయిన మనిషిని స్నానాలగది నుంచి పడక గదికి చేర్చారు.  రక్తపు మరకలు తుడిచేశారు. సాక్ష్యాధారాలు మాయం చేసే దురుద్దేశ్యంతో అలా చేసారు. ఆసుపత్రికి తీసుకెళ్ళి సహజ మరణం అని నమ్మించే ప్రయత్నం చేసారు. ఇంట్లో హత్య జరిగినప్పుడు ఎవరయినా ముందు పోలీసులకు సమాచారం అందిస్తారు. హత్యాప్రదేశంలో ఆనవాళ్ళు చెరిపేయరు. అందుకే అనుమానాలు. వీటి నివృత్తి జరగాలి. క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలి. అందుకే ‘సిట్’ ఏర్పాటు’ అన్నారాయన. అది ఆంధ్రప్రదేశ్. అందుకే ప్రతి విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు స్పందిస్తారు.
వైసీపీ ఊరుకుంటుందా! గతంలో హైదరాబాదులో నటుడు బాలకృష్ణ ఇంట్లో ఒక దుస్సంఘటన జరిగినప్పుడు పోలీసులు వచ్చేలోగా ఆ ఇంటి వాళ్ళు రక్తపు మరకలను శుభ్రం చేయలేదా అని గుర్తు చేస్తున్నారు.
‘ఒక ఘోరం జరిగింది. తెల్లారి చూస్తె ఇంటి పెద్ద బాత్ రూములో చనిపోయి పడివున్నాడు. ఆ దృశ్యం చూసిన ఇంట్లో వాళ్ళు ముందు ఏం చేస్తారు? ఆ విగత జీవిని వేరే గదిలోకి తరలిస్తారు. శరీరం మీద నెత్తురు మరకలు వుంటే తుడుస్తారు. చనిపోయిన వాడు పరాయి మనిషి కాదు, చూస్తూ చూస్తూ పోలీసులు వచ్చేదాకా అలా స్నానాల గదిలో  వదిలేయడానికి. మానవత్వం ఏ కోశానా  లేనివాళ్ళు మాత్రమే అలాంటి దుష్టపు ఆలోచనలు చేస్తారు’ అని చంద్రబాబుపై ఎదురు దాడికి దిగుతున్నారు.
ఇది సరే! ఒప్పుకుందాం. మరి సహజ మరణం అంటూ ఇచ్చిన పిర్యాదు సంగతేమిటి? ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఉండదు. ఎందుకంటే  అది ఆంధ్రప్రదేశ్.     
జరిగింది హత్య అని ఇరుపక్షాలు నిర్ధారణకు వచ్చి బహిరంగంగా ఆ సంగతి అంగీకరిస్తున్నారు. పోలీసులు కూడా హత్యే అని అంటున్నారు. ప్రభుత్వం గంటల వ్యవధిలోనే ప్రత్యెక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది.
‘ఠాట్!  ‘సిట్’ పనికిరాదు. అది రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తుంది. సీబీఐ చేత దర్యాప్తు చేయించి నిజం నిగ్గు తేల్చాలి’ అని వైసీపీ నాయకుల డిమాండ్. డేటా చోరీ కేసులో తెలంగాణా ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేస్తే తెలుగు దేశం పార్టీ  చేసిన ఆరోపణలను గుర్తుచేస్తూ.
‘వీళ్ళకి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు. మాట్లాడితే సీబీఐ అంటారు. తమ నేరాలను కప్పి పుచ్చుకోవడానికే ఆ డిమాండ్లు’ చంద్రబాబు ఆరోపణాస్త్రం.
‘గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎన్నిసార్లు సీబీఐ దర్యాప్తుకు పట్టుబట్టలేదు. అంటే స్థానిక పోలీసుల మీద నమ్మకం లేకనేనా? మాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం వుంది. విశ్వాసం లేనిది ప్రభుత్వం మీదనే. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం’ వైఎస్ ఆర్ సి పీ నాయకుల ప్రత్యారోపణ.
నిన్నకాక మొన్న సీబీఐ ని మా రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వం అని ఘీంకరించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఈడీ మీద నమ్మకం లేదన్నదీ ఆయనే. తనకు నమ్మకం లేదంటే అందరూ దాన్ని నమ్మాలి. మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటే మాత్రం  మాకు వ్యవస్థల మీద నమ్మకం లేదని భాష్యం చెబుతుంటారు’ అనేది వారి ముక్తాయింపు.  
ఒక పెద్దమనిషి మరణించినప్పుడు అదీ హత్య అని నిర్ధారణ అయినప్పుడు జరగాల్సిన వాదోపవాదాలు ఇవేనా! ఖచ్చితంగా కాదు. కానీ అది ఆంధ్రప్రదేశ్.    
వివేకానంద రెడ్డిని వివాదరహితుడిగా అభివర్ణిస్తూ,  నివాళులు అర్పించిన రాజకీయ నాయకులే ఆయన మరణాన్ని వివాదగ్రస్తం చేస్తూ వుండడం ఓ విషాదం.
సరే! ఇవన్నీ ఒకెత్తు. మీడియా ఈ సంఘటనపై స్పందిస్తున్న తీరు.  చర్చల రూపంలో విచారణ సాగిస్తున్నవైనం. ఇది బాధ్యత కలిగిన మీడియా చేయాల్సిన పనేనా! ఈ ప్రశ్న కూడా అనవసరం. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్.
సరే! ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఇలాగే సాగేవే. వాటిని కాసేపు ఒదిలేద్దాం.
చనిపోయిన ఆ మంచి మనిషిని గురించి ఓ మంచి ముక్క చెప్పుకుందాం  
ఇది జరిగి చాలా ఏళ్ళయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి.
రవీంద్ర భారతిలో దూరదర్సన్ ఏదో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్య అతిధులు, ముఖ్యుల కోసం ముందు రెండు వరసలు ఖాళీగా ఉంచారు. నేను మూడో వరసలో కూర్చున్నాను.
వెనుకవైపు జనం బాగా నిండి పోయారు. అక్కడక్కడా ఒకటో అరో కుర్చీలు ఖాళీగా వున్నాయి.
కార్యక్రమం మొదలు కావడానికి కాస్త ముందు బక్కపలచగా ఉన్న ఓ వ్యక్తి లోపలకు వచ్చి నాలుగో వరసలో ఖాళీగా ఉన్న ఓ కుర్చీ వెతుక్కుని కూర్చున్నారు. ఎక్కడో చూసినట్టుగా వుందే అనుకుంటూ తేరిపార చూస్తే అయన ఎవరో కాదు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్. వివేకానంద రెడ్డి. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి స్వయానా సోదరుడు. ముందూ వెనకా సెక్యూరిటీ కూడాలేదు.
వెళ్లి ముందు వరసలోకి రమ్మంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు. పరవాలేదు ఇక్కడే కూర్చుంటాను, నాకేమీ ఇబ్బంది లేదుఅన్నారాయన అంతకంటే సున్నితంగా.
రాజకీయాల్లో అటువంటి నిరాడంబరత్వం నిజంగా అపురూపమే. 

15, మార్చి 2019, శుక్రవారం

నిదురపోరా తమ్ముడా! – భండారు శ్రీనివాసరావు


(నిన్న అంతర్జాతీయ నిద్రా దినోత్సవం’ట’. కాస్త మాగన్నుగా నిద్ర పట్టడం వల్ల దాన్ని గురించి రాయడంఒకరోజు ఆలస్యం అయింది)
'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి. ఈ సంగతి అలా ఉంచితే -
నిదురించే తోటలోకి తీపి కబురు వచ్చింది.
‘ఏమిటా మొద్దు నిద్దర మూడు ఝాములు పొద్దెక్కేదాకా’ దాకా అని పెద్దలు సణుగుతున్నా దుప్పట్లో మునగ దీసుకుని పండుకునే వారికోసం ఏడాదిలో ఒక రోజును అంతర్జాతీయ నిద్రా దినోత్సవానికి కేటాయించారు. ప్రతి ఏటా మార్చి నెల మూడో శుక్రవారం నిద్రాప్రేమికుల దినోత్సవం అన్నమాట. నిద్రతో కొన్ని రోగాలు నయం చేయొచ్చన్న ఓ వైద్య ప్రక్రియను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో మొదటిసారి 2008 మార్చి 18 వ తేదీన ఈ అంతర్జాతీయ నిద్రా దినోత్సవాన్ని(వరల్డ్ స్లీప్ డే) నిర్వహించారు. ‘మంచి ఆరోగ్యంతో మర్నాడు మేలుకోవడం కోసం ఈ రాత్రి బాగా నిద్ర పొండి!’ అన్నది నిర్వాహకుల నినాదం. ఇంకా మనవైపు జనంలోకి రాలేదు కానీ నిద్రతో రోగాలు నయం చేసే ప్రక్రియ కొన్ని దేశాల్లో బాగానే ప్రాచుర్యంలో వుందన్నది వారి ఉవాచ..
అన్ని వయస్సుల్లోని వారికి నిద్ర అవసరం గురించి ప్రచారం చేయాలన్నది నిర్వాహకుల అభిప్రాయం. అప్పుడే పుట్టిన శిశువులు, స్కూలు పిల్లలు, ఈడొచ్చిన పిల్లలు, యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అన్ని వయసులవారు నిద్రకు తగినంత సమయం కేటాయిస్తే రోగాలబారిన పడకుండా ఎంచక్కా గుండెలమీద చేయివేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవచ్చని వీరు బల్ల గుద్ది చెబుతున్నారు. వీళ్ళంతా విదేశీయులు కనుకా, మన రామాయణాది పురాణాల అవగాహన అంతగా లేని వారు కనుకా – నిద్రకు నిలువెత్తు నిదర్శనం లాటి కుంభకర్ణుడు మొదలయిన పురాణ పాత్రల ప్రస్తావన తీసుకురాలేకపోతున్నారు. లేకపోతె, ఎంత నిద్రపోతే అంత బలం అన్నటాగ్ లైన్ తో ఏకంగా కుంభకర్ణుడి బొమ్మనే వారి 'లోగో' గా పెట్టుకునివుండేవారు. రాక్షసుడి చిత్రం ప్రచారానికి పనికిరాదని ఎవరయినా అభ్యంతరం చెబితే మన వేంకటేశ్వర స్వామి వారి అనుంగు సోదరులు వరద రాజస్వామివారు వుండనే వున్నారు. తమ్ములుంవారికి ఆయన భక్త కోటి భక్తి పారవశ్యంతో సమర్పించిన మొక్కుబళ్ల ద్రవ్యాన్ని లెక్కిస్తూ లెక్కిస్తూ అలసిపోయి కొలమానికను తలగడగా పెట్టుకుని నిద్రలోకి జారిపోయిన వరదరాజస్వామిని మించిన 'నిద్రాదేవత' మరొకరు దొరకడం దుర్లభం కూడా. ఇక్కడా మగపెత్తనమేనా అని గునిసేవారికి లక్ష్మణులవారి అర్ధాంగి ఊర్మిళాదేవి ఉండనే వుంది.
అయితే, 'నిద్ర తెరపీ' అని పిలుచుకుంటున్న ఈ వైద్య విధానంలో అదేపనిగా నిద్ర పోవాలని మాత్రమే వైద్యులు చెబుతారని అనుకోవడం పొరబాటు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా వుంచుకోవాలని అనుకునేవారు ఎలా నిద్ర పోవాలి, ఎంత నిద్ర పోవాలి, ఎంతసేపు నిద్రపోవాలి అని మాత్రమే వీరు సలహాలు ఇస్తారు. 'నిద్ర పట్టడం లేదు బాబోయ్' అని గాభరా పడిపోయే వారికి నిద్ర మాత్రలతో అవసరం లేకుండా నిద్రపట్టే పద్ధతులు చెప్పి వారిని నిద్రకు దగ్గర చేస్తారు. నిద్దట్లో లేచి ఆ తరవాత మళ్ళీ నిద్రపట్టక జాగారం చేసేవారు, రాత్రంతా నైట్ డ్యూటీలు చేసి మరునాడు నిద్రపట్టక పక్కవారిని నిద్రపోనీకుండా వేధించే వారూ, రాత్రివేళ అంతా నిద్ర పోతున్న సమయంలో నిద్దట్లోనే లేచి నడకలు సాగించే వారూ – ఇదిగో ఈ అమాంబాపతు జనమంతా ఈ తెరపీ వైద్యులను ఆశ్రయిస్తుంటారు. ‘నిద్ర పట్టకపోవడమేమిటండీ మరీ విడ్డూరం కాకపొతే!’ అని దవళ్ళు నొక్కుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ‘మా మూడోవాడు వున్నాడు చూడండీ! పక్కమీద అలా వాలిపోయాడా ఇక అంతే! ఏనుగులతో తొక్కించినా లేస్తే వొట్టు!’ అని వాపోయేవాళ్ళూ వున్నారు. ఇలాటి వారికోసమే, మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణులవారి చేత ‘మత్తు వదలరా! నిద్దుర మత్తు వదలరా!!’ అనే పాట పాడించారు. ఆ పాట వింటూ మరింత నిద్రలోకి జారిపోయినవాళ్ళు కూడా వున్నారని చెప్పుకునేవారు. ఘంటసాల వారి గాత్ర మాధుర్యం అలాటిది మరి.
“నవ్వడం ఓ భోగం! నవ్వలేకపోవడం ఓ రోగం!” అన్నారు జంధ్యాల. అలాగే, ‘నిద్రపట్టడం ఓ భోగం. నిద్ర పట్టకపోవడం ఓ రోగం’ అని దీనికి అన్వయించి చెప్పుకోవచ్చు. వెనుకటి రోజుల్లో మనుషులమీదా, మనసుల మీదా ఇన్ని రకాల వొత్తిళ్ళు లేనప్పుడు వున్నవాడూ, లేనివాడూ హాయిగా ఆరుబయట పండుకుని మరింత హాయిగా నిద్రపోయేవాళ్ళు. కడుపునిండా తిండి తిననివాళ్ళు ఉంటారని వాళ్లకు తెలుసుకానీ కంటినిండా నిద్రపోని జనం వుంటారన్నది వాళ్లకు బొత్తిగా తెలియని విషయం. ఈ నాడు ఇన్ని సౌకర్యాలు వుండికూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు కోట్లలో వున్నారు. నిద్రకోసం 'మందే మందు' అనుకునే మందుబాబులు, నిద్ర మాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడే గమ్మత్తు బాబులు ఈనాడు కోకొల్లలుగా కానవస్తారు. అందుకే బ్యాంకు బాలెన్సు వున్న కుబేరులకన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని చెబుతారు.
నిద్ర సరిగా పట్టకపోయినా, నిద్ర లేమితో బాధపడుతున్నా దాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటె, పర్యవసానాలు మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం వుంది. 'ఉత్తిష్టత జాగ్రత - మేలుకోండి. మంచిగా నిద్రపట్టే మార్గాన్ని మేలుకునివున్నప్పుడే వెతుక్కోండి. మంచి నిద్రతో చక్కటి ఆరోగ్యాన్ని ఉచితంగా సంపాదించుకోండి. సంపాదన యావలో పడి బంగారం లాటి నిద్రకు దూరం కాకండి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
చక్కటి కవిత్వం రాయడానికి ఇంటినిండా తాటాకులూ, చేతిలో ఘంటం వుంటే చాలదూ - “నిరుపహతీ స్తలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురవిడెంబు, బంగరు టూగుటుయ్యెల” ఎట్సెట్రా ఎట్సెట్రా వుండాలని కవి పెద్దన గారు ఏనాడో ఓ పెద్ద జాబితా కవిత్వరూపంలో చెప్పారు. అలాగే మంచి నిద్ర పట్టడానికి కూడా కొన్ని చిట్కాలున్నాయిట. పడకవేయడానికి ముందు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి, వేడి వేడి అన్నం తినాలట. నచ్చిన పుస్తకం కాసేపు తిరగేయాలట. పడకా, పడక గదీ ఆహ్లాదకరంగా వుండేట్టు చూసుకోవాలట. రాత్రిపూట గదిలో వెలుతురూ కూడా కంటికి ఇంపుగా వుండాలిట. అందుకే కాబోలు ఈ మధ్య మినుకు మినుకు మని మెరిసే తారలతో కూడిన వినీలాకాశాన్ని నేరుగా పడక గదిలోకి తీసుకువచ్చి గది పైభాగంలో కృత్రిమంగా తీర్చిదిద్దుకునే ఆధునిక పద్ధతులను అనేకమంది ఆశ్రయిస్తున్నారు. పోతే, మత్తు పదార్దాలకూ, మాదక ద్రవ్యాలకూ దూరంగా వుంటే నిద్ర భేషుగ్గా పడుతుందట. కానీ 'మందు కొడితేనే కానీ నిద్రపట్టదు' అని అనుకునేవాళ్లకు ఈ సలహా రుచించకపోవచ్చు.అయితే, వైద్యులు మాత్రం మత్తు పానీయాలవల్ల నిద్ర పట్టదనీ, పట్టినా సరిగా పట్టదనీ వాళ్ల లెక్కలు వాళ్ళు చెబుతున్నారు. నిద్రకు మొహం వాచిన వాళ్లకు వాళ్ల మాట వింటే పోయేదేమీ లేదు, మందు తప్ప.
ముందే చెప్పినట్టు – పొద్దున్నేఆరోగ్యంగా లేవడం కోసం రాత్రంతా హాయిగా నిద్దుర పోండి.

News Talk |Special Discussion With Senior Journalist Bhandaru Srinivas R...

14, మార్చి 2019, గురువారం

ఏది నిజం



కంటికి కనిపించేది, చెవికి వినిపించేది నిజమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
పలానా పార్టీకి పలానా నాయకుడి గుడ్ బై. పలానా పార్టీలో చేరబోతున్న పలానా.
ఈ స్క్రోలింగులు అన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఈ లీకులన్నీ ఎలా వస్తాయి, ఎవరు ఇస్తారు అనేది జర్నలిజంలో అంతోఇంతో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ఊహాగానాల మీద ఊహాగానాలు. ఈ చర్చలు అవసరమా అంటే అవసరమే. జనాలకు అవసరం కాకపోవచ్చు కానీ,  ఆ అభ్యర్దులకు ఇవి చాలా అవసరం. తమ అభ్యర్ధిత్వం పట్ల బేరసారాల్లో పై చేయి సాధించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆ లీకులకి మరింత బలం చేకూర్చడానికి వాళ్ళే మళ్ళీ ప్రకటనలు చేస్తుంటారు, వాటిని నమ్మవద్దనీ, అవన్నీ ఆధారరహితమనీ.
ఈమధ్య ఒక పార్టీ అభ్యర్ధుల అధికార జాబితా అంటూ అన్ని టీవీల్లో స్క్రోలింగులు అదేపనిగా పరుగులు పెట్టాయి. చివరకి ఆ పార్టీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటన చేయాల్సివచ్చింది, వాటిని నమ్మవద్దని, తాము అధికారికంగా ఎలాటి జాబితా విడుదల చేయలేదని.
అధ్యక్షుల వారి ప్రకటన కూడా అధికారికమా, లేక లీకుల్లో భాగమా అని సందేహించే స్థాయికి ఈ లీకుల వ్యవహారం సాగుతోంది.
కాబట్టి, కావున చెప్పేది ఏమిటంటే స్క్రోలింగులు చూసి వ్యాఖ్యానాలు చేస్తే తర్వాత నాలుక కరుచుకునే ప్రమాదం లేకపోనూ లేదని.