1, ఏప్రిల్ 2018, ఆదివారం

శేషన్ ను చూసి పెద్దపులి బెదురున్! – భండారు శ్రీనివాసరావు


ఎలక్షన్ కమీషనర్  (ఆ రోజుల్లో ఒక్కరే) గా వుండగా టీ.ఎన్. శేషన్ ఓసారి హైదరాబాదు వచ్చారు. రాజ భవన్ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం. అందరం బిలబిలా వెళ్లాం. ఎలక్షన్ కమిషనర్ హోదాలో అది మొదటి సమావేశం. ఆయన గురించి వినడమే కాని వ్యవహార శైలి ఎవరికీ పరిచయం లేదు. గది నిండి పోయింది. ఇంతలో ఆయన వచ్చారు. ఫోటోలు తీసుకోవడానికి ప్రెస్ ఫోటోగ్రాఫర్లు అక్కడి సోఫాలపైకి ఎక్కారు. ఇది మామూలే. ఫోటో సరైన యాంగిల్  లో తీసుకోవడానికి వారు ఇలాంటి ఫీట్లు చేస్తుంటారు. కానీ వచ్చిన వాడు శేషన్ మరి.
ఆయన కన్నెర్ర చేసారు. అందర్నీ సోఫాల నుంచి కిందికి దిగమని గట్టిగా చెప్పారు. వినక పొతే భద్రతా సిబ్బందికి పని చెబుతా అని హెచ్చరించారు.
అందరూ ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. ఇలాటి మర్యాదలు గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరగనివి.
అయితే అదే శేషన్ ను అదే గెస్ట్ హౌస్ లో అదే రోజు  మరో మారు కల్సుకోవాల్సిన సందర్భం పడింది. ప్రెస్ క్లబ్  తరపున ఏదో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించాలని సంకల్పం. అంతకు ముందు ఓసారి ఆయన్ని ఇదే పని మీద ఢిల్లీలో శేషన్ అధికార నివాసంలో కలుసుకున్నాము.  మిత్రులు జ్వాలా నరసింహారావు, ములుగు సోమశేఖర్ పూనికపై  డెక్కన్ క్రానికల్ ఢిల్లీ కరస్పాండెంట్ రాధ గారి మాటసాయంతో క్లబ్  కార్యదర్శి శంకర్, నేనూ, జ్వాలా, సోమశేఖర్ కలిసి రాధ గారిని వెంటపెట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళాము. అప్పటికే ఒకటి రెండు సార్లు జ్వాలా ఆయనతో ఫోనులో మాట్లాడ్డం, మెయిల్ సందేశాలు పంపడం జరిగినట్టుంది, తలుపు తీస్తూనే ‘Who is Jwala, Why no flames are coming’   అంటూ పలకరించారు.
భద్రత బాగా వున్నా ఇల్లు చాలా సింపుల్ గా వుంది. నౌకర్లు, చాకర్లు ఎవరూ లేరు. శేషన్ గారి భార్య జయలక్ష్మి గారే  స్వయంగా కాఫీ కలుపుకు వచ్చి సర్వ్ చేసారు. జ్వాలా ‘కాఫీ తాగను’ అంటే ‘ఒక్క క్షణం వుండండి’ అంటూ వెళ్లి బోర్నవిటా తెచ్చి ఇచ్చారు. సరే వచ్చిన పని చెప్పాము. ఆయన విని ‘హైదరాబాదు వస్తున్నాను, అక్కడ కలవండ’ని చెప్పి పంపేసారు.
మళ్ళీ హైదరాబాదుకు వస్తే...
మధ్యాన్నం విలేకరుల సమావేశం సంఘటన తరువాత ఆయన్ని కలుసుకోవడానికి కొంత సంక్షేపించాము. కానీ కలుసుకోమన్నది ఆయనే కావడంతో ధైర్యం చేసి వెళ్ళాము. అదేమిటో మంత్రం వేసినట్టు ఆయనలో  ఢిల్లీలో కలిసిన శేషన్ కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. అప్పటికే ఆ గదిలో ఉన్న వ్యక్తిని తనకు ఇంగ్లీష్ నేర్పిన గురువు అని పరిచయం చేసారు. ఆయన ఎవరో కాదు, KS అనే పొడి అక్షరాలతో హిందూ పత్రికలో వారం వారం ‘Know your English’ అనే కాలమ్ రాసే కే. సుబ్రహ్మణ్యం గారు.  క్లబ్ కార్యక్రమానికి రావడానికి సుముఖత వ్యక్తం చేసారు.
కొన్నాళ్ళకు పరిస్తితులు మారాయి. సుప్రీం కోర్టు ఒక కేసు విషయంలో ఆయన్ని సమన్ చేయడం మొదలయిన చీకాకుల నేపధ్యంలో క్లబ్ కార్యక్రమానికి రాలేదు , కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకునే మహత్తర అవకాశం మాకు ఆ విధంగా లభించింది.
అంతటి పెద్ద ఉద్యోగాలు చేసిన ఆ పెద్ద మనిషి శేషన్,  ముదిమి వయస్సులో వృద్ధాశ్రమంలో శేష జీవితం గడపాల్సి రావడం విషాదం.
‘శతమానం భవతి!’
(శేషన్ సతీమణి శ్రీమతి జయలక్ష్మి గారి గురించిన వినకూడని వార్త సోషల్ మీడియాలో కనిపించిన తరువాత గుర్తుకు వచ్చిన ఓ పాత జ్ఞాపకం)

4, మార్చి 2018, ఆదివారం

చలో ఢిల్లీ - కేసీఆర్ కొత్త ఆలోచన


This morning in TV 5 News Scan program on KCR move to jump into National Politics: (LINK)
https://www.youtube.com/watch?v=5_SCxctuEF4&feature=share

Image may contain: 5 people, including Psk Prasad, people smiling, text

జీవితం అనుభవాల సమాహారం

బెన్ హర్ మహేష్ ఎక్కా. ఐ.ఏ.ఎస్.
ఆయన్ని చూసి కాస్త అటూ ఇటూగా పాతికేళ్ళు. నేను గుర్తు పట్టనే లేదు. రాత్రి అన్నంలో వేసుకుంది ఏ కూర అంటే చప్పున చెప్పలేని గొప్ప జ్ఞాపక శక్తి నాది.
ఆ విషయంలో జ్వాలాని మెచ్చుకుని తీరాలి. స్నేహితులు, సన్నిహితులవే కాక అప్పుడప్పుడు పరిచయం అయిన వ్యక్తుల పేర్లు, ఫోను నెంబర్లు అన్నీ ఆయనకి కరతలామలకం. నిజానికి ఆయన ఫోను చేసి చెప్పబట్టే బెన్ హర్ ఎక్కాని కలవడం జరిగింది. ‘నీకు ఆయన తెలుసు, ఐఏఎస్ ప్రోబెషనర్లగా వున్నప్పుడు ఆయన బ్యాచ్ కి నువ్వే తెలుగు పాఠాలు చెప్పావు, మరచిపోయావా’ అని కూడా అన్నాడు. నాకయితే ఈ బెన్హర్ మహాశయుల రూపం కూడా గుర్తుకు రాలేదు.
గిరిజనుల ఆరోగ్యాలకు సంబంధించిన అంశంపై క్రియ సీయీఓ డాక్టర్ బాలాజీ ఆయనకి వివరిస్తున్నారు. మధ్య మధ్యలో బెన్ హర్ ఎక్కా నా వైపు చూస్తున్నారు. నేను కూడా తేరిపార చూసాను కానీ నా దగ్గర తెలుగు నేర్చుకున్న అధికారులు ఎవ్వరూ స్పురణకు రాలేదు. లేచి వస్తున్నప్పుడు బెన్ హర్ నాతో అన్నారు.
‘నేను, సంజయ్, వెంకటేశం ఇంకా కొంతమందిమి మీ ఇంటికి వచ్చే వాళ్ళం. ఆ రోజుల్లో మీకు కాలు ఫ్రాక్చర్ అయి ఇంట్లో వున్నారు’
నాకు లైట్ వెలిగింది.
మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ డైరెక్టర్ జనరల్. జ్వాలా అక్కడ చేసిన ఉద్యోగం ఏమిటో చెప్పలేను కానీ ఆ సంష్తలో అన్నీ ఆయనే అని చెప్పగలను. ఆ రోజుల్లో నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. ఆఫీసుకు పోకుండా, తీరిక సమయాల్లో ఇంటి నుంచే రేడియో రిపోర్టింగ్ పని చూస్తూ, నా విరిగిన కాలుతో ‘కాలుక్షేపం’ చేస్తుండేవాడిని. మరికొంత కాలక్షేపంగా ఉంటుందని జ్వాలా పూనికపై, ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ప్రొబేషనరీ ఐ.ఏ.ఎస్. అధికారులకు తెలుగు నేర్పే పని ఒప్పచెప్పారు. వాళ్ళు అప్పుడు గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ లో వుంటుండేవాళ్ళు. మేము వుండే దుర్గానగర్ కు దగ్గర. అంచేత ఉదయమో, సాయంత్రమో వీలు చేసుకుని ఆ యువ అధికారులు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా కలివిడిగా వుండేవాళ్ళు. నా దగ్గర నేర్చుకున్న తెలుగు వారికి యెంత ఉపయోగపడిందో తెలియదు కాని పోటీ పరీక్షలు రాసి జీవితంలో అనుకున్నది సాధించిన కొందరు యువకులతో సన్నిహితంగా వుండే అవకాశం మాత్రం నాకు కలిగింది.


తెలుగు సంగతి అలా పెడితే, మా ఆవిడ మాత్రం వారికి అచ్చ తెలుగు వంటకాలను బాగానే పరిచయం చేసింది.

18, జనవరి 2018, గురువారం

రాజకీయాల రంగూ రుచీ మార్చిన యన్టీయార్ - భండారు శ్రీనివాసరావు



(జనవరి 18  యన్టీయార్ వర్ధంతి)

యన్టీయార్ అని అభిమానులు ముచ్చటగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో కొందరు తెలుగు దేశం నాయకులు ఆయన్ని కలిసి, 'పలానా జిల్లా ఎస్పీ ని బదిలీ చేయాల'ని  కోరారు. వారిని యన్టీయార్ రెండే రెండు ప్రశ్నలు అడిగారు.
"ఆ పోలీసు అధికారి అవినీతి పరుడా? చేతకానివాడా?"
కాదన్నారు వాళ్లు.
"మరేమిటి?" సీ.ఎం. ఆరా.
"మన పార్టీకి పనికి రాడు" పార్టీ నేతల జవాబు.
"పార్టీకి పనికి రాకపోతే మీకేమిటి నష్టం? పార్టీ పని మీరు చేయండి. ప్రభుత్వం చేయాల్సింది అధికారులు చేస్తారు" సంభాషణ ముగించారు యన్టీయార్.
ఆ ఎస్.పీ. ఎవరో కాదు ఉద్యోగపర్వంలో అత్యంత సమర్ధుడనీ, నిజాయితీపరుడనీ పేరు తెచ్చుకుని తదనంతర కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేసిన ఐ.పీ.ఎస్. అధికారి శ్రీ  ఏ.కే. మహంతి. ఒక టీవీ ఛానల్ చర్చలో ఆయనే స్వయంగా ఈ ఉదంతం వెల్లడించారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో యన్టీయార్ ది ఒక ఉత్కృష్ట అధ్యాయం. రాజకీయాల దశను దిశను ఆయన ఒక మలుపు తిప్పారు. నిజం చెప్పాలంటే రాజకీయాల రంగూ, రుచీ మార్చారు. సమాజంలో కొన్నివర్గాలకే పరిమితమైవున్న రాజకీయ అవకాశాలను  బడుగు బలహీన వర్గాలకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక సామాన్య గృహిణి, ఒక లాయరు, ఒక చిన్న వ్యాపారి ఇలా అనేకమంది ఆయన హయాములో  ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు కాగలిగారు. (ఉమ్మడి) రాష్ట్రం మొత్తం రాజకీయ రంగం రూపురేఖలు మారిపోయింది కూడా యన్టీయార్ తెలుగుదేశం పేరుతొ ఒక ప్రాంతీయ పార్టీని పెట్టిన తరువాతనే.    
 తెలుగుదేశం పార్టీ తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టి, తొలి అడుగులోనే విజయభేరి మోగించి 1983 లో అధికారంలోకి వచ్చింది. ఈ అపూర్వ విజయానికి ఎన్టీ రామారావు వ్యక్తిగత ఆకర్షణ, గత కాంగ్రెస్ పాలనపై ప్రజలకు కలిగిన ఏష్టత ప్రధానంగా దోహదం చేసాయి. రాష్ట్రావతరణం నుంచి ఏకఛత్రాధిపత్యంగా సాగుతూ వచ్చిన కాంగ్రెస్ పాలనకు గండి పడింది. అంతవరకూ ప్రాంతీయ పార్టీల పొడ ఎరుగని తెలుగు ఓటర్లు, 'తెలుగుజాతి ఆత్మ గౌరవం' నినాదంతో ముందుకు వచ్చిన  తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం కట్టబెట్టారు. రాజకీయాల్లో తొమ్మిది మాసాల పసికూన అయిన తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 203  స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. పాలకపక్షం అయిన కాంగ్రెస్ 60  సీట్లకే పరిమితమయింది. ఈ అసాధారణ విజయంతో ఎన్టీయార్ ప్రతిభ దేశం నలుమూలకు పాకింది.
అంతవరకూ తెలుగు సినీ పరిశ్రమను ఏలిన శ్రీ రామారావుకు, రాజకీయరంగంలో సయితం లభించిన ఈ అపూర్వ విజయం ఆత్మ స్తైర్యాన్ని మరింత పెంచింది.  ఈ ఆత్మవిశ్వాసంతో ఆయన మరింత దూకుడు ప్రదర్శించి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ వ్యతిరేకులను కూడగట్టి ఆ పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుచేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదిపారు. సహజంగానే ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీసింది. 'కేంద్రం ఒక మిధ్య' అని అభివర్ణిస్తూ, 'కేంద్ర పెత్తనాన్ని ఇక సహించేది లేదు' అనే రీతిలో తెలుగుదేశం అధినేత  ప్రదర్శించిన ధిక్కార ధోరణి యన్టీయార్ కు జనబాహుళ్యంలో మరింత ఆదరణను, రాజకీయాల్లో మరిన్ని నిరసనలను సంపాదించి పెట్టింది. పైకి అహంభావంగా కానవచ్చే ఎన్టీయార్ మనస్తత్వం, స్వపక్షంలోనే విపక్షం పురుడుపోసుకోవడానికి ఉపకరించింది. ఏడాది తిరక్కుండానే ఆయన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి శ్రీ నాదెండ్ల  భాస్కరరావు నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు ఆగస్టు సంక్షోభం రూపంలో శ్రీ రామారావు పదవికే ముప్పుతెచ్చింది. దరిమిలా జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నిద్రాణంగా వున్న తెలుగుప్రజల రాజకీయ చైతన్యాన్ని మళ్ళీ కొత్త చిగుళ్ళు తొడిగించింది. రాష్ట్ర రాజకీయాన్ని ఓ మలుపు తిప్పి సరికొత్త రాజకీయాలకు తెర తీసింది. ఎన్నికలలో ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న శాసన  సభ్యులకు ఎరవేసి  తమ వైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను అడ్డదోవలో కూలదోసే దుష్ట సంస్కృతి అప్పటినుంచే తెలుగు రాజకీయాల్లో వేళ్ళూనుకుంది. ఈనాడు యధేచ్చగా సాగిపోతున్న పార్టీ మార్పిళ్ళ రాజకీయాలకు ఆనాడే బీజం పడింది. తెలుగుదేశం పార్టీ అవిర్భావంవల్ల రాజకీయాలు ఎంతగా చైతన్యవంతం అయ్యాయో, ఎంతగా బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెరిగిపోయిందో, అంతే స్థాయిలో రాజకీయాలు కాలుష్య కాసారాలు  కావడం, నైతిక విలువలు దారుణంగా  క్షీణించడం ఇటువంటి అవలక్షణాలు అన్నీ అలాగే పెరిగిపోయాయి అనడం  సత్యదూరం కానేరదు. ఈ మంచి చెడులకు  రామారావు గారిని బాధ్యుడిని చేయడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే అయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల పట్ల ఆయనకు ఒక నిర్దుష్టమైన అవగాహన వుండేది. ఆయన్ని బాగా ఎరిగినవారికీ, సన్నిహితంగా మెలిగిన  అధికారులకు, కొందరు విలేకరులకు  ఈ విషయం ఎరుకే. దానికి మహంతి వంటి సీనియర్ పోలీసు అధికారులే ప్రత్యక్ష సాక్షులు.  ఆ  ఉదంతంతో ఈ వ్యాసాన్ని మొదలు పెట్టిన కారణం కూడా అదే.
ఏ కాంగ్రెస్ పార్టీని యన్టీయార్ సకల పాపాలకు కూపంగా అభివర్ణిస్తూ వచ్చారో, చివరికి ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీలో  సయితం అవే అవలక్షణాలు చోటు చేసుకోవడాన్ని ఆయన కళ్ళారా గమనించారు. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో చేయగలిగింది ఏమీ లేదని అందరూ నాయకుల్లాగానే అయన కూడా సమాధానపడ్డారేమో తెలియదు. కానీ తను నమ్మిన విషయాల్లో యన్టీయార్ కు వున్న చిత్తశుద్ధిని ఆయన వ్యతిరేకులు కూడా సందేహించలేరనేది మాత్రం వాస్తవం.
గతం తవ్వడం వల్ల ప్రయోజనం వుండదు. అయితే సినిమాల్లో, రాజకీయాల్లో తనదయిన శైలితో ప్రకాశించిన శ్రీ రామారావు గారి జీవితం 'ముగింపు' మాత్రం చాలా బాధాకరం. ఆయన అభిమానులు, వ్యతిరేకులు సైతం ఖేధపడే రీతిలో ఆయన మరణించడం  విధి వైపరీత్యం. చనిపోయిన తరువాత నేల ఈనినట్టు రాష్ట్రం నలుమూలలనుంచి తరలివచ్చిన అశేష జనవాహినిని చూసిన ప్రతి ఒక్కరూ,   జనం గుండెల్లో ఆయన ఎంతగా గూడుకట్టుకుని వున్నారో అర్ధం చేసుకుని వుంటారు.
బతికివున్నప్పుడు కూడా అదేవిధమైన గౌరవ,ప్రతిపత్తులు, మర్యాద మన్ననలు సంపాదించుకున్నవాళ్ళు మరింత అదృష్టవంతులు. ఆ కోవకు చెందిన వ్యక్తుల్లో మొట్టమొదట స్మరించుకోదగినవారు యన్.టీ. రామారావు గారు.

ఆయన చనిపోయి ఈనాటికి (జనవరి, 18) ఇరవై రెండేళ్ళు గడిచిపోయాయి.  ఒకరకంగా అప్పటికీ ఇప్పటికి  ఒక తరం మారిపోయింది. అయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్మృతి పదిలంగానే వుంది. (18-01-2018)

16, జనవరి 2018, మంగళవారం

ఎనర్జీ టూర్

వూరు మారిపోయింది – భండారు శ్రీనివాసరావు
తెలతెలవారవస్తోంది. పక్కన శివాలయం మైకులోంచి బాలసుబ్రమణ్యం శివస్తుతి బిగ్గరగా వినవస్తోంది. ఇల్లు   ఇల్లంతా నిద్ర పోతున్నవారితో నిండిపోయివుంది. ఊరేలా మారిందో కళ్ళారా చూడాలనే కోరిక చలిని జయించింది. నిద్ర మంచం మీద నుంచి లేచి వీధిలో కాలుపెట్టాను. వూళ్ళో వున్నవే మూడు వీధులు. అవన్నీ ముగ్గుల దుప్పట్లు కప్పుకుని కానవచ్చాయి.
సంక్రాంతికి సొంతూరుకు వెళ్ళాలనే అభిలాషతో హైదరాబాదు నుండి నాలుగు కార్లలో ఆదివారం ఉదయమే బయలుదేరి మా వూరు కంభంపాడుకు బయలుదేరాము. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ ఆలస్యం కాకుండానే బయటపడ్డాము. ఖమ్మం, రెబ్బారం, పెనుగంచిప్రోలు నుంచి కూడా చిన్నా పెద్దా  యాభయ్, అరవై  మందిమి మా వూరికి సంక్రాంతి అతిధులం.
Image may contain: 1 person, smiling, outdoor and nature


చిన్నప్పుడు తిరిగిన వీధుల్లో నడుచుకుంటూ చెరువు గట్టుకు చేరాను. మంచినీళ్ళ బావికి వున్న ఇనుప గిలకలు పూర్వపు ఔన్నత్యానికి గుర్తుగా మిగిలివున్నాయి. మోటారు పెట్టి నీళ్ళు తోడి ట్యాంకును నింపుతూ వుండడం వల్ల వాటి ఉపయోగం లేకుండా పోయింది. గట్టు మీద జేసీబీలు, ట్రాక్టర్లు ఇంకా భారీ యంత్రాలు కానవచ్చాయి. గట్టును వెడల్పు చేసి గట్టి పరచడం కోసం ఒక వైపున ఇరవై అడుగుల రిటైనింగ్ వాల్ నిర్మాణంలో వుంది. లింగాల నుంచి కంభంపాడు వరకు నిర్మాణం పూర్తయిన అరవై అడుగుల వెడల్పు రహదారిలో ఇదొక భాగం. ఈ రోడ్డు టీడీపీ నాయకుడు లింగాల వాసి, టీ.డీ. జనార్ధన్ గారి పూనికపై సాధ్యపడిందని స్థానికులు చెప్పారు. ఎప్పుడో నా చిన్నతనంలో నాటి కేంద్ర మంత్రి కే.ఎల్. రావుగారి పుణ్యమా అని వత్సవాయి- చెవిటికల్లు గ్రామీణ రోడ్డు సాకారమయింది. రోడ్లకు పేర్లు పెట్టే సాంప్రదాయం ఆనాడు లేకపోయినా,  నలభయ్ గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఆ రహదారిని ఆ గ్రామాల ప్రజలు మాత్రం యాభయ్ ఏళ్ళు గడిచినా ఇప్పటికీ కే.ఎల్.రావు రోడ్డు అనే పిలుచుకుంటున్న సంగతి స్పురణకు వచ్చి ఈ రోడ్డుకు జనార్ధన్ రోడ్డు అని నామకరణం చేస్తే బాగుండు అనే ఆలోచన కలిగింది.
అలా ఆలోచిస్తూ గట్టు చివరివరకు పోయి తిరిగి వస్తుంటే చలి కోటు కప్పుకున్న ఒక మనిషి ఎదురు పడ్డాడు. తెల్లటి తొలివెలుగులో నల్లటి రూపం కనిపించింది.  తాగుతున్న బీడీ విసిరివేసి నా మొహంలోకి తేరిపారచూసాడు. ‘మీరు కరణంగారి తమ్ముడు కదూ’ అన్నాడు. ఇన్నేళ్ళ తరవాత కూడా వూళ్ళో నన్ను గుర్తు పట్టేవాళ్ళు వున్నారని సంతోషించాను. ‘నాకు తెలిసిపోయింది, మీరు భండారు శ్రీనివాసరావు గారు’ అనేశాడు ఇంటిపేరులో ఉన్న ‘భ’ ని ఒత్తిపలుకుతూ.
‘మిమ్మల్ని సాక్షి టీవీలో చూస్తుంటాను’ అన్నాడు మరే టీవీలో కనబడనట్టు. ‘మీకు గుర్తుందో లేదో నేను, యేసు రత్నాన్ని.  మీ అన్నయ్య గారితో కలిసి చదువుకున్నాను, మీ ఇంటికి వచ్చేవాడిని, అయినా మీరు వూళ్ళో ఎప్పుడు వున్నారు కనుక’ అని కూడా ముక్తాయించాడు.
‘నేనిక్కడ వాచ్ మన్ని. ఇవిగో వీటన్నిటినీ నేను కనిబెడుతుండాలి’ చెప్పాడు గట్టు మీది యంత్రాలను గర్వంగా  చూపెడుతూ.
ఇన్ని ఏళ్ళ తరువాత గుర్తు పట్టిన ఆ పెద్దమనిషిని గుర్తు పెట్టుకునే ఫోటో తీసుకోవాలని అనిపించింది. తీసే వాడు ఎవరా అని ఆలోచిస్తుంటే ఒక ట్రాక్టరు కింద నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు.
‘రాం సింగ్. వీళ్ళది జార్ఖండ్. జేసీబీ పనిచేస్తాడు.’ అని పరిచయం చేసాడు యేసు రత్నం. ఆ జార్ఖండ్ కుర్రాడు మా ఇద్దర్నీ ఫోటోలు తీశాడు. వాళ్లకి థాంక్స్, సంక్రాంతి శుభాకాంక్షలు జమిలిగా చెప్పేసే మళ్ళీ ఊళ్ళోకి వచ్చాను. దగ్గరలోనే మునసబు మల్లయ్య గారిల్లు. ఇప్పుడు లేరు. ఆయన కొడుకు ప్రతాప్ ఆ ఇంట్లో ఉంటున్నాడు. చాలా ఏళ్ళ క్రితమే, వూళ్ళో ఉన్న ఇతర ఖామందుల ఇళ్ళకు భిన్నంగా  రెండతస్తుల భవంతి కట్టించాడు. ఇప్పుడు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ లో కనబడే పెద్ద పెద్ద అధునాతన భవనాలవంటివి నా గ్రామ సందర్శనలో రెండు మూడు కనిపించాయి.
వాసిరెడ్డి జమీందారు కట్టించిన గుడికి మా వంశస్తులు ధర్మకర్తలు. భక్తి ఉన్న చోట సంపద వర్ధిల్లుతుందో, ధనధాన్యాలు సమృద్ధిగా వుంటే భక్తిప్రపత్తులు పెరుగుతాయో తెలియదు కానీ చాలాకాలం నిత్య ధూపం కూడా గగనం అనుకున్న ఆ గుడి పరిస్తితి ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. దానికి దాపుల్లోనే మరో దేవాలయం రూపుదిద్దుకుంది. మరో రెండు నెలల్లో విగ్రహ ప్రతిష్ట అంటున్నారు. ముందు ముందు మా గ్రామానికి ఒక చక్కటి ఆకర్షణ కాగల ఈ రామాలయాన్ని చావా నరసింహారావనే పెద్దమనిషి నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా యాభయ్ లక్షలు అయ్యాయట.
ఇక మా ఇంట్లో సందడే సందడి. నగరాల్లో పుట్టి పెరిగిన కోడలు పిల్లలు కొంగులు దోపుకుని అర్దరాత్రివరకు మేలుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దారు. మర్నాడు అందరం కలిసి వెళ్లి ఎస్సీ కాలనీలోని  మా రెండో అన్నయ్య ధర్మకర్తగా ఉన్న  పూర్వీకుల శివాలయాన్ని, మా తోటలో మామూడో అన్నయ్య వెంకటేశ్వరరావుగారు నిర్మించిన మా ‘అమ్మా నాన్నల గుడి’ని దర్శించాము. ఆ పక్కనే మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గార్ల స్మారక స్తూపాలు వున్నాయి. చుట్టూ పచ్చటి చేలు. పిల్లల హడావిడి చెప్పతరం కాదు. పెద్దవాళ్ళు కూడా వయసు మరిచి పోయి మొక్కజొన్న చేలో కలయతిరుగుతూ ఫోటోలు దిగారు. రేగుపళ్ళు ఏరుకుని తిన్నారు.
వూళ్ళో ఉన్న రెండు రోజులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని, కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకుని మళ్ళీ అందరం కార్లెక్కి హైదరాబాదు రోడ్డెక్కాము.
మొత్తానికి పెద్దలకూ, పిల్లలకూ మంచి ఎనర్జీ టూర్!     

12, డిసెంబర్ 2017, మంగళవారం

దొరకని పుస్తకంలో విజయవాడ – భండారు శ్రీనివాసరావు (మూడో భాగం)


(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)
మితృడు రమణ ఈ పుస్తకానికి విజయవాడ వీధుల కధలు అని ఎందుకు పేరు పెట్టాడో తెలియదు కానీ ఇందులో విజయవాడ విశేషాలే ఎక్కువగా వున్నాయి. ఇందులో బెజవాడ వద్ద కృష్ణానదిపై కట్టిన ఆనకట్టతో మొదలయిన ప్రకాశం బరాజ్  కధ ప్రధానమైనది. అదిలా సాగింది.
“ప్రధానమైన నిర్మాణాలన్నీ మాయా మంత్రాలతో నిర్మించినవి కావు. వాటి వెనుక అనేకమంది త్యాగం వుంది. చిందించిన స్వేదం వుంది. కాటన్ దొర కృష్ణపై ఆనకట్ట నిర్మించిన నూరేళ్ళకు ప్రకాశం బరాజ్ కధ మొదలయింది. 1855 లో ఆ ఆనకట్టను కాటన్ మహాశయుడు నిర్మించి ఇచ్చాడు. దరిమిలా దానికింద ఆయకట్టు విస్తీర్ణం అయిదు లక్షల ఎనభయ్ వేల ఎకరాల నుంచి బాగా పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆనకట్ట ఎగువన ఏర్పాటు చేసిన మూడు అడుగుల  తలుపుల ఎత్తును ఆరడుగుల వరకు పెంచుతూ పోయారు. అవి 1925 నుంచి 1954 వరకు నమ్మకంగా  పనిచేశాయి. ఎనిమిది అడుగులకు పెంచాలని ఆలోచన చేస్తున్న సమయంలో 1954 సెప్టెంబరులో కృష్ణకు వరదలు వచ్చాయి. ఆ నెల నాలుగో తేదీ సాయంత్రం ఆనకట్ట బయట గోడకు పెద్ద గండి పడింది. క్రమంగా గండి వెడల్పు 70 అడుగుల నుంచి  134 అడుగులకు పెరిగింది. దిగువ ప్రాంతాలన్నీ ఆకస్మిక వరద ముంపుకు గురయ్యాయి. అప్పటి సూపరింటెండింగ్ ఇంజినీరు వేపా కృష్ణ మూర్తి గారు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి గండి స్వరూప స్వభావాలు తెలుసుకునేందుకు పడవలో వెళ్లాలని నిర్ణయించారు. ఇంజినీర్లు, లస్కర్లు అంతా ఒక పెద్ద పడవలో బయలుదేరారు. తిన్నగా గండి వద్దకు చేరుకున్నారు కానీ ఏమైందో ఏమో పడవతో సహా అందరూ వరదలో కొట్టుకు పోయారు. అయినా ఇంజినీర్లు ప్రయత్నం మానలేదు. చీఫ్ ఇంజినీరు జి.ఏ. నరసింహారావు గారు పెద్ద పెద్ద పంటుల మీద బ్రహ్మాండమైన బండ రాళ్ళు పెట్టి, గండికి ఎగువన ఫర్లాంగు దూరంలో లంగరు వేసిన స్టీమరుకు పంటును కట్టాలని,  సమయం చూసి పంటుకు రంధ్రాలు పెట్టి, అది మునిగిపోయేలోగా ఇనుప తాళ్ళను తెంచి వేయాలనీ అలా చేస్తే పంటు సరిగ్గా గండి వద్దకు వచ్చి మునిగి పోతుందనీ ఆ విధంగా గండికి అడ్డుకట్ట వేయవచ్చనీ నిర్ణయించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. గండిని పూడ్చి వేయడం జరిగింది.
అరవై ఏళ్ళకు పూర్వమే తెలుగు ఇంజినీర్లు ప్రదర్శించిన అసమాన ప్రతిభకు ఇది తార్కాణం.

(ఇంకా వుంది)      

దొరకని పుస్తకంలో విజయవాడ – (రెండో భాగం)


(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)
“బోధిసత్వ మైత్రేయుడు  బెజవాడ దగ్గర ఒక కొండపై జ్ఞానోదయం కోసం తపస్సుచేసి, అక్కడే శరీరం వదలివేసాడని రాబర్ట్ సువెల్, రాయల్ ఏషియాటిక్ సొసైటీ (లండన్) 1884 పత్రికలో రాశాడు.
బుద్ధుడు నిర్యాణం చెందిన తర్వాత మంజుశ్రీ గా జన్మించాడని, మైసోలియా (నేటి మచిలీపట్నం) నగరానికి త్రిపిటకాలు సంపాదించడం కోసం వెళ్లి తిరిగివస్తూ, దారిలో కొండ మీద గొప్ప తేజస్సు చూసాడని మంజుశ్రీ మూలకల్పంలో వుంది. శిష్యులు కనుగొనలేని ఆ రహస్యాన్ని చేధించేందుకు మంజుశ్రీ యోగమార్గంలో ఆ కొండ మీద వెలుగు వచ్చిన ప్రదేశానికి వెడతాడు.
ఆ క్రమంలో ఇంద్రకీలం మీద కొలువున్న కనకదుర్గాదేవి అంతరాలయం చేరతాడు. అక్కడ ఆ మహాపురుషుడికి తారాదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ తల్లిని చూడగానే ధ్యానం మొదలుపెడతాడు. కానీ, మనసు నిలవదు. మన్మధ ప్రకోపం మొదలవుతుంది. ధ్యాన యోగులకు ఇటువంటి అవక్షేపం సహజమే! మహాయోగి అయిన మంజుశ్రీ మన్మధ లీలను చూసి మార దమన మంత్రాన్ని చదువుతాడు. మన్మధుడు కనబడగానే ‘ఈ కొండ మీద ధ్యానం చేసుకునే యోగుల మనస్సులను వికారం చేయకుండా ఈ కొండలోనే బందీవై పోవాల’ని శపిస్తాడు. నిజానికి ఇది హిందూ పురాణాలలోని ఇంద్రనీలుని కధను పోలివుంది. ఆ సంగతి ఎలా వున్నా మంజుశ్రీ తన ధ్యానాన్ని ముగించుకుని పోతాడు. ఈ వృత్తాంతం మంజుశ్రీ మూలకల్పంలోని మార దమన సూత్రాలలో వుంది. ఆచార్య నాగార్జునుడు కూడా బెజవాడ వచ్చి ఈ కొండ మీద తారాదేవిని దర్శించాడని లంకావతార సూత్రాలకు వ్యాఖ్యానం చేసిన మహాయాన ఆచార్యులు తమ కారికల్లో పేర్కొన్నారు.
ఏతావాతా తేలేదేమిటంటే, 1300 సంవత్సరాలకు పూర్వం బెజవాడలో బౌద్దుల ప్రాబల్యం బాగా వుండేది. దుర్గామాత తారాదేవిగా పూజలు అందుకునేది.
ఏ పండితుడు ఏమన్నా, బెజవాడ నగరాన్ని హువాన్ చాంగ్ సందర్శించి అద్భుతమైన భావావేశం పొందాడు. ‘తారా తారా తత్తారా తారం తారం తత్తారం తారం’ అంటే ఏమిటో మంత్రోపదేశం పొందిన వారికి తెలుస్తుంది. ఎవరి నుంచి ఎప్పుడు ఆయన ఆ ఉపదేశం పొందాడో తెలియదు కాని, బెజవాడ మాత్రం హువాన్  చాంగ్  ని మరిచిపోయింది.
ఈ సందర్భంలోనే నేటి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లభించిన నాగార్జునాచార్యుని శాసనం గురించి, ఘంటసాల శాసనం గురించీ చెప్పుకోవాలి. ఈ రెండింటి లోను భదంత నాగార్జునుడి ప్రస్తావన వుంది. ‘స్వస్తి భదంత నాగార్జునా చార్యస్య’ అంటూ ప్రారంభం అయ్యే ఈ శాసనం ద్వారా ఆయన బౌద్ధ మతాచార్యుడని స్పష్టమౌతున్నది.”
(ఇంకా వుంది)