9, ఆగస్టు 2017, బుధవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (7)


మరో ప్రారంభానికి ఇంకో ఆరంభం
బాల్యం.
ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత భాగం. కష్టాలున్నా బాధ్యతలు వుండవు. సుఖాలు అనుభవించి ఆనందించడమే కాని కాని వాటిని ఎలా సంపాదించుకోవాలి అనే అవసరం వుండదు. ప్రేమను పొందడమే కాని దాన్ని  తిరిగి ఇతరులకు  పంచే పూచీ వుండదు.
బాధ్యతలు, బరువులు లేని దిలాసా జీవితం, కులాసా జీవనం. అదే బాల్యం. అందుకే ప్రతి మనిషికి అది అపురూపం.
అంతగా గుర్తుండకపోయినా, బాల్యంలో పడ్డ ముద్రలు పెద్దయిన తరువాత కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.
నాకు కూడా చిన్ననాటి విషయాలు గురించి పెద్దవాళ్ళు చెప్పగా వినడమే కాని గుర్తున్నవి తక్కువ. గుర్తుంచుకోవాల్సినవి కూడా తక్కువేనేమో!
ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి చిన్నవాడినని గారాబం చేయడంతో, కర్ణుడికి  కవచకుండలాల మాదిరిగా నాకు మంకుతనం, ముట్టె పొగరు సహజసిద్దంగా అలవడ్డాయి. పెద్దలను ఎగర్తించి మాట్లాడ్డం, అనుకున్నది దొరికే దాకా గుక్క పట్టి ఏడ్వడం నా చిన్నతనం గురించి మా పెద్దలకు మిగిలిన  జ్ఞాపకాలు. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నెయ్యి కోసం చేసిన యాగీ అంతాఇంతా కాదు. కుడిచేతిలో నెయ్యి పోస్తుంటే అది వేళ్ళ సందుల్లోనుంచి కారిపోయేది. గుప్పెడు నిండేదాకా నెయ్యి వేయలేదని గుక్క తిప్పకుండా ఏడుపు.  గుక్కపట్టడం అనేది ఈనాటి తల్లులకు, పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు. ఊపిరి కూడా పీల్చుకోకుండా అదేపనిగా ఆపకుండా ఏడ్వడం వల్ల ఒక్కోసారి పిల్లలు కళ్ళు తేలవేసేవాళ్ళు. అందుకే గుక్క పట్టే పిల్లలంటే తలితండ్రులు భయపడేవాళ్ళు. ఏడుపు మాన్పించడానికి  వాళ్ళు ఏది అడిగితె అది ఆలోచించుకోకుండా చేతిలో పెట్టేవాళ్ళు. నా గుక్క సంగతి అందరికీ తెలుసు కనుక ఇంట్లో నేను ఆడింది ఆటా, పాడింది పాటా.
అన్నాలుతినే సమయంలో నెయ్యి కోసం నేను పెట్టే పోరు తట్టుకోలేక పోయిన మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు ఒక సులువు కనిపెట్టారు. ‘ఇక వీడితో వేగడం ఇలా కాదనుకుని  ఒక చిన్న వెండి గిన్నెలో నెయ్యి నింపి ప్రత్యేకంగా నా కంచం పక్కన పెట్టడం అలవాటు చేశారట. వయసు పెరిగిన కొద్దీ ఆ నెయ్యి అలవాటు కొంతవరకు పోయింది కానీ మొండితనం మాత్రం, తనకు నేనెందుకు నచ్చానో తెలియదు కాని, శాస్వితంగా నాతోనే ఉండిపోయింది. పైగా తనకు తోడుగా ‘మాట తూలడం’ అనే తోబుట్టువును  కూడా తోడు  తెచ్చుకుంది. నిజానికి ఈ రెండూ లేకపోతే నేనూ ఒక ఆదర్శ పురుషుడిని అయ్యేవాడినేమో!  కాని కొందరికి కొన్ని ఇలాటి ‘రోల్డ్ గోల్డ్ ఆభరణాలు’ ఆ దేవుడే కావాలని తగిలిస్తాడు. లేకపోతే ఈ రకం  మనుషుల్ని పట్టుకోవడం కష్టం అన్న సంగతి ఆ దేవుడికి కూడా తెలుసు. ఈ చిన్నప్పటి లక్షణాలే చాలామందికి చివరి వరకు అంటుకుపోతాయి. ‘పుటక- పుడకలు’ సామెత అందుకే పుట్టిందేమో!
సరే! ఈ స్వగతం ఎందుకంటే నాలోని ఆ మొండితనమే మా ఊరు గురించి, చిన్ననాటి కబుర్లు గురించి నాచేత ఇంతగా రాయించేలా చేసింది. ‘బాగున్నాయి, బాగా రాస్తున్నారు’ అని ఎవరయినా కితాబులు  ఇచ్చినప్పుడు, ‘పోనీలే! మొండితనం కూడా ఒక రకంగా మంచితనమే’ అనుకుంటున్నాను.
“వేళ్ళు కొంకర్లు పోయేలా ఏమిటలా కంప్యూటర్ దగ్గర కూర్చుని టిక్కూ టిక్కూ అంటూ కొట్టడం’ అంటూ విసుక్కునే మా ఆవిడ నిర్మల కూడా నా చిన్నతనం కబుర్లు చదువుతూ ఇప్పుడు నస పెట్టడం మానేసింది. రాయడం నాకు కొత్తేమీ కాదు, బ్లాగుకూ, పత్రికలకీ వందల కొద్దీ వ్యాసాలు, వేల పుటల్లో రాసాను. కానీ అవన్నీ రాజకీయ అంశాలు. ఇంటికి వచ్చే పత్రికలలో  పడిన నా వ్యాసాలు, కంటి ఎదురుగా కనిపిస్తున్నా కూడా మా ఆవిడ చదివేది కాదు. అలాంటిది  ఈ మధ్య నేను రాస్తున్న ఈ  ‘బాల్యం’ ముచ్చట్లు చదవడమే కాదు, వాటిని గురించి మాట్లాడుతోంది కూడా.
ఈ విషయంలో నా కెందరో సహకరించారు. ఎందరో ఎన్నో విషయాలు చెప్పారు. నేను రాసిన వాటిల్లో ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని కాను. నిజానికి చాలా సందర్భాల్లో నేను అనేవాడినే నేను. పుట్టక ముందు జరిగిన అనేక సంగతులు చాలామందిని అడిగి తెలుసుకున్నాను. నాకే డెబ్బయి నిండాయి. చాలామంది రాలిపోయారు. కంభంపాడు స్కూల్లో నాతో కలిసి చదువుకున్న మా మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు, చిన్నప్పటి స్నేహితులు వేమిరెడ్డి ఓబుల రెడ్డి (కోటిరెడ్డి,కోటయ్యఅని పిలిచేవాళ్ళం), పమ్మి సత్యమూర్తి, పర్సా రామ్మూర్తి చనిపోయారు. విషయాలు వివరించడానికి పెద్దలు మిగల్లేదు. మా అక్కయ్యలు తుర్లపాటి సరస్వతి, కొమరగిరి అన్నపూర్ణ రాసిపెట్టుకున్న సంగతులు నాకు అక్కరకు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. కాని వారి జ్ఞాపకాలు ఇలా నా రాతల్లో మిగిలిపోయాయి. వారికి వేనవేల కృతజ్ఞతలు. ఇలాఎందరి నుంచో ఇంకా ఎంతో సమాచారం నా మెదడులో నిక్షిప్తం అయి వుంది. నెమ్మదిగా బయటకు తీసి అక్షర రూపం ఇవ్వాలి. ఈలోగా మా అన్నయ్య రాసిన భండారు వంశం వివరాలు లభించాయి.   
మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు బహు గ్రంధ కర్త. ఆధ్యాత్మిక అంశాలతో పాటు ఎంతో శ్రమించి మా భండారు వంశానికి సంబంధించిన అనేక అంశాలను క్రోడీకరించారు. పుట్టపర్తిలో ఒక చిన్న గదిలో ఆయన పోతూ పోతూ మిగిల్చి వెళ్ళిన రాత ప్రతులను మా వదిన గారు సరోజినీ దేవి భద్రంగా హైదరాబాదు చేర్చి మా అన్నయ్య రామచంద్ర రావు గారి ఇంట్లో భద్రపరిచింది. ఆ భాండాగారంలో దొరికిందే మా అన్నయ్య రాసిపెట్టిన ‘భండారు వంశం’. ఈ విషయంలోనేను కష్టపడింది ఏమీ లేదు, ఆయన రాసి ఉంచిన దాన్ని కంప్యూటర్ కు ఎక్కించడం తప్ప.
ఇది చదివిన తరువాత నేను ఎంతటి అంగుష్ఠమాత్రుడినో నాకు బోధపడింది. నిజంగా నా రచనలు నలుగురికీ నచ్చుతున్నాయి అంటే దానికి కారణం మా అన్నయ్య నుంచి నేను ఏకలవ్యుడిగా పొందిన విద్య. ఆయన రచనలు చదవడం వల్లనే నేనిలా రాయగులుతున్నాను. ఇది సత్యం.
వచ్చే భాగం నుంచే మా అన్నయ్య రాసిన ఆయన చిన్ననాటి విషయాలు, మా ఊరు ముచ్చట్లు కొన్ని పోస్ట్ చేస్తాను. నిజానికి బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ......” అనే  ఈ వ్యాస పరంపరలో ఆయన రాసిందే ప్రధాన భాగం. 
నమస్కారం! 
           



బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (6)


ఇక్కడో చిన్న మలుపు. మా ఇంట్లో ఇప్పటి తరానికి, పాత తరానికి వారధి మా పెద్దక్కయ్య  కుమారుడు డాక్టర్ ఏ.పీ.రంగారావు. ఇప్పటి మా  కుటుంబంలో పెద్దవాడు. కుటుంబానికి పెద్ద దిక్కు కూడా. డెబ్బయి అయిదేళ్ళ క్రితం మా  కంభంపాడు (ఆయనకు మాతామహుల స్థానం) లోనే జన్మించాడు. చిన్నతనంలో తాను  పెరిగిన  మా వూరు గురించీ, అప్పటి ఆచార వ్యవహారాల గురించి ఒక వైద్యుడి కోణంలో కొన్ని విశేషాలు ఇంగ్లీష్ లో రాశారు. వాటిని నేను తెనుగు చేసి ఇందులో పొందుపరుస్తున్నాను. (భండారు శ్రీనివాసరావు)



(డాక్టర్ అయితరాజు పాండు రంగారావు)
 
కంభంపాడు గురించి డాక్టర్ అయితరాజు పాండు రంగారావు జ్ఞాపకాల దొంతర: 
 “కృష్ణా జిల్లా, నందిగామ తాలుకా, కంభంపాడు అనే కుగ్రామంలో - 1942 సెప్టెంబర్ 20వ తేదీన  పుట్టాను. అప్పుడది బ్రిటిష్ పాలనలోని  మద్రాస్ ప్రెసిడెన్సీలో వుండేది. నేను పుట్టింది మా మాతామహుల ఇంట్లో. అదొక పెంకుటిల్లు. మా తాతగారు అంటే మా అమ్మగారి నాన్నగారు, భండారు రాఘవరావు, ఆ వూరికి కరణం.
“నేను మా తలిదండ్రులకు రెండో సంతానాన్ని. నేను పుట్టినప్పుడు నా బొడ్డు కోసిన మంత్రసాని పుట్టుగుడ్డిది. విచిత్రమేమిటంటే మా అమ్మ పుట్టినప్పుడు కూడా ఈ మంత్రసానే పురుడుపోసిందట. మా కుటుంబంలో చాలామంది  ఈ మంత్రసాని ఆధ్వర్యంలోనే సుఖంగా ప్రసవించి క్షేమంగా వున్నారు.  ఆమె పురుడు పోసిన పిల్లలెవ్వరూ  ప్రసవ సమయంలో చనిపోలేదు. అది ఆవిడ  చేతిచలవ అని చెప్పుకునేవారు. ఆ రోజుల్లో ప్రసవాలన్నీ ఇళ్ళల్లోనే జరిగిపోయేవి. మొట్టమొదటిసారి ఆసుపత్రిలో పురుడు పోసుకున్నది మా అమ్ముమ్మ గారు. అదీ మా మా పెద్ద మేనమామ (పర్వతాలరావు) పుట్టినప్పుడు. అయిదుగురు ఆడపిల్లల తరవాత కానుపు  కావడంతో మా అమ్ముమ్మను అప్పుడు ఖమ్మంలోని క్రిస్టియన్ మిషన్ ఆసుపత్రిలో చేర్పించి పురుడు పోయించారు.
“నేను పుట్టిన తరవాత నాకు కానీ, మా అమ్మకు కానీ ప్రసవానంతర జాగ్రత్తలు ఏమీ తీసుకోలేదు. మా ఇద్దరికీ ధనుర్వాతం (టెటనస్) రాకుండా ఏ విధమయిన ఇంజెక్షన్లు ఇవ్వలేదు. అలాటివి వున్నట్టు ఆ రోజుల్లో ఎవరికీ తెలిసివుండదు.  పురుడు  రావడానికి కొన్ని నెలలముందు  మా అమ్మ పుట్టింటికి వెళ్ళింది.  కేవలం పుట్టింటివారి ఆప్యాయతా, పూర్తి విశ్రాంతి మినహా ఆమె తీసుకున్న  మందులు ఏమీ లేవు.  నేను పుట్టగానే మంత్రసాని కొడవలితో  బొడ్డు కోసి ఒక తట్టలో పడుకోబెట్టింది. కోసిన బొడ్డు ముక్కను గోతిలో పాతిపెట్టారు. నాకు స్నానం చేయించి తల్లి పాలు పట్టించారు. మైల బట్టలు మంత్రసాని పట్టుకెళ్ళింది. అవి ఆమెకే చెందుతాయి. పురుడు పోసినందుకుగాను కొంత ధాన్యం కొలిచి ఇచ్చేవాళ్ళు.  
“ప్రసవం అయిన తరవాత ఆ గదిలోకి పన్నెండు రోజులపాటు ఎవ్వరూ రావడానికి వీలులేదు. ఎవరూ తాకడానికి వీలులేదు. పుట్టిన తిధి నక్షత్రాలనుబట్టి జాతకం రాయించారు. ‘రాధమ్మ సుఖంగా ప్రసవించింది. తల్లీ పిల్లవాడు కులాసా’ అని చుట్టపక్కాలందరికీ ఇంటి పురోహితుడితో కబురు పంపించారు.
“మూడోరోజున బాలింతరాలయిన మా అమ్మకు వావిలాకులు కలిపిన  వేడినీటితో స్నానం చేయించారు. మరో తొమ్మిది రోజులు ఇలాగే గడిచిన తరవాత, పన్నెండో రోజున   ఆమెకు పురిటి స్నానం చేయించారు. పసుపు, పెసరపిండి,శనగపిండి కలిపి వొంటికి నలుగుపెట్టి చేయించే స్నానం ఇది.  ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి పుణ్యావచనం, పూజ అయిన తరవాత, బియ్యం, బెల్లంతో తయారుచేసిన పులగం మా అమ్మకు తినడానికి పెట్టారు. అప్పటినుంచి పురిటి మైల వొదిలిపోయినట్టే. ఇల్లంతా స్వేచ్చగా అందరితో కలసి తిరగొచ్చు. పసిపిల్లాడినయిన నాకు కూడా ప్రతి రోజూ  పెద్దవాళ్లో, పనిమనుషులో కాళ్ళమీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేవారు. ఒక గుడ్డ పరచి  నిద్రపుచ్చేవారు. దాన్ని పాడుచేసినా ఆ గుడ్డనే, ఉతికి ఆరవేసి మళ్ళీ  వాడేవారు. పన్నెండో రోజున  నామకరణం చేసి ఉయ్యాలలో వేసారు. “చిన్నతనంలో నాకు ఎలాటి వాక్సినేషన్లు ఇవ్వలేదు. రెండేళ్ళ తరవాత నా చెల్లెలు పుట్టేవరకూ నేను మా అమ్మ పాలే తాగేవాడిని. అయితే, నాకు తొమ్మిది నెలల వయస్సు రాగానే  ఒక మంచి రోజు చూసి యిరవై కిలోమీటర్ల దూరంలో వున్న తిరుమలగిరి గుట్టమీది వెంకటేశ్వర స్వామి గుడిలో  అన్నప్రాసన చేసారు. బెల్లం కలిపి వొండిన అన్నం పాయసం.  ( అంటే అది నేను తిన్న మొట్టమొదటి ఘన పదార్ధం అన్నమాట.) అలాగే నా మొట్టమొదటి  కేశ ఖండన (తల వెంట్రుకలు) కూడా ఏడాది నిండినప్పుడు జరిగింది. చిన్నతనంలో మా పినతల్లులు (మా అమ్మ చెల్లెళ్ళు ) ముగ్గురు నా ఆలనా పాలనా చూసేవారు. అప్పటికి వారికింకా పెళ్ళిళ్ళు కాలేదు. పైనుంచి మా తాతయ్య రాఘవయ్య గారి తల్లి రుక్మిణమ్మ గారు  నన్ను కనిపెట్టి చూసేది. ఆమె, ఆమె తల్లి ఇద్దరూ చిన్నవయస్సులోనే వైధవ్యం పొందారు. పెద్దలు, పిల్లలు అందరికీ వాళ్ళిద్దరే పెద్ద దిక్కు. దూలానికి వేలాడదీసిన గుడ్డ ఉయ్యాలలో నన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చేవారు. మా తరంలో నేనే తొలిచూరు పిల్లవాడినని చాలా గారాబంగా చూసేవారు. యిరవై నాలుగ్గంటలూ ఎవరో ఒకరు కంటికి రెప్పలా కనిపెట్టుకుని వుండేవారు.
బోర్లపడితే బూరెలు వండాలి, పారాడితే పాలకాయలు పంచాలి అని ఏదో  పేరుతొ ప్రతినెలా నేను పుట్టిన తరువాత పండగలు, పేరంటాలు  చేసేవారు. మా అమ్మ నన్ను ప్రసవించిన తొమ్మిదో రోజున మా అమ్ముమ్మగారు, మా అమ్మ అమ్మగారు వెంకట్రావమ్మ గారు  కూడా అదే ఇంట్లో మరో గదిలో మగ పిల్లవాడిని (భండారు రామచంద్రరావు) కన్నది. నాకు బొడ్డుకోసిన మంత్రసానే మా అమ్ముమ్మకు కూడా పురుడు పోసింది. ఒకే ఇంట్లో రోజుల తేడాతో పుట్టిన మేమిద్దరం ఆడుతూ పాడుతూ  పెరిగాం. 
“చిన్నప్పటి ఓ జ్ఞాపకం నా మనసు తెరపై ముద్రపడిపోయింది.
1948 నాటి మాట.  మా అమ్మ తండ్రి రాఘవయ్య గారిని  కంభంపాడు తాతయ్య అనే వాళ్ళం. ఎవరూ లేవకముందే తెల్లారగట్టనే లేచి కాఫీ తయారుచేసుకుని తాగడం ఆయన అలవాటు.  బెజవాడనుంచి పచ్చి కాఫీ గింజలు కొనుక్కొని వచ్చి వాటినివేయించి కాఫీ చేసుకుని తాగేవాడు. కాఫీ గింజలను పొడి చేసే ఒక చిన్న మిషను ఒకటి అయన పట్నం (మద్రాసు) పోయినప్పుడు కొనుక్కు వచ్చాడు. నన్ను నిద్రలేపి, వొళ్ళో వేసుకుని పొయ్యి రాజేసేవాడు. నీళ్ళు పడేసి అవి కాగుతుండగానే, బొడ్లోనుంచి బీడీ కట్ట తీసి ఒకటి వెలిగించేవాడు.
“వేయించిన గింజల కమ్మటి వాసన, కాఫీ పొడి మిషన్ చేసే అదో రకం చప్పుడు, సుళ్ళు తిరిగే బీడీపొగ, ఎదురుగా పొయ్యిలో కణకణమని కట్టెల మంటలు, ఇవన్నీకళ్ళకు కట్టినట్టు గుర్తుండిపోయాయి.
“ఇన్నేళ్ళ తరవాత ఇప్పటికీ ఇలాటి చిన్న చిన్న సంగతులు కొన్ని బాగా జ్ఞాపకం వున్నాయి.             
“అలాటిదే మరో జ్ఞాపకం, గుడ్డ ఉయ్యాలలు గురించి. ఈ కాలం వారికి ఏమాత్రం తెలియని ఉయ్యాలలు ఇవి. ఒక పాతచీరెను  
దూలానికి వేలాడగట్టి ఉయ్యాల మాదిరిగా తయారుచేసేవారు. అందులో పిల్లలని పడుకోబెట్టి ఎవరో ఒకరు ఊపుతూ నిద్రపుచ్చేవారు. బయటనుంచి చూసేవారికి లోపల పిల్లాడికి గాలి ఆడుతుందా అని అనుమానం కలిగించేలా వుండేవి ఈ గుడ్డ ఉయ్యాలలు.
 “మరో చేదు జ్ఞాపకం నెలనెలా పిల్లలకు వంటాముదం పట్టించడం. పిల్లల్ని కాళ్ల మీదవేసుకుని, బలవంతంగా నోరు తెరిచి ఉగ్గిన్నెతో ఆముదం తాగించేవాళ్ళు. ఇలా చేస్తే మలబద్దకం రాదని నమ్మకం.  
“వినడానికి ఆశ్చర్యంగా వుండవచ్చు కానీ, మా నాన్నను చూడడం కూడా నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటి.
1949 సెప్టెంబర్ ఆఖరి వారంలో మా నాన్న జెయిలునుంచి విడుదల అయ్యారు.  హైదరాబాద్ స్టేట్, ఇండియన్ యూనియన్ లో విలీనం కావడంతో జైళ్లలో పెట్టిన స్వాతంత్ర్య సమరయోధులనందరినీ వొదిలిపెట్టారు. మా అమ్మగారి పుట్టింటిలో వుంటున్న మమ్మల్ని చూడడానికి మా నాన్నగారు, మూడు, నాలుగు మైళ్ల దూరంలోవున్న పెనుగంచిప్రోలులో బస్సు దిగి  కాలినడకన కంభంపాడు  చేరారు.
“అంత దూరంలో ఆయన కనబడగానే పెద్దపిల్లలం కొంతమందిమి చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని, ‘జై హింద్’ అని అరుస్తూ పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళాము. “అంతమంది పిల్లల్లో తనపిల్లవాడెవరన్నది ముందు ఆయనకు అర్ధం కాలేదు. అయితే వెంటనే తేరుకుని నన్నుగుర్తుపట్టి  చేతుల్లోకి తీసుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు. నా గుండె గోడల నడుమ పదిలంగావుండిపోయిన  మరో మధుర మధుర  జ్ఞాపకం అది.
“మేముంటున్న ఇల్లు చాలా పెద్దది. ముందూ వెనకా బోలెడంత ఖాళీ జాగా. పిల్లలం ఆరుబయట  ఆడుకునేవాళ్ళం. చెట్లనీడలో మంచాలు వేసుకుని కొంత మంది  కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇంట్లో నా వయసు పిల్లలం ముగ్గురం వుండేవాళ్ళం. అందరూ మమ్మల్ని గారాబంగా చూసుకునేవారు. దానితో మా పని ఆడింది ఆట పాడింది పాట.
“ఇంట్లో పెద్దవాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. కబుర్లు చెప్పేవాళ్ళు. రకరకాల ఆటలు నేర్పించేవాళ్ళు. దాగుడుమూతలే మేము ఎక్కువగా ఆడుకున్న ఆట. దొంగా పోలీసు మాదిరి. చేతులతో పంటలు వేసుకుని దొంగని నిర్ణయించేవాళ్ళం. వాడు ఒక్కడే మిగిలిన వారిని ఎక్కడ దాక్కున్నా వెతికి  పట్టుకోవాలి.
“అందరం రోజూ రెండుపూటలా స్నానాలు చేసేవాళ్ళం. బావిదగ్గరనిలబడితే పనివాళ్ళు చేదతో తోడి  పోసేవాళ్ళు. కాగులో నీళ్ళు కాగుతూ వుండేవి కానీ  దాదాపు రోజూ చన్నీళ్ళ స్నానమే. ఆ నీళ్ళనే బావి వెనుకవున్న పెరడుకు  మళ్లించే వారు. అక్కడ అరటి చెట్లు, కాయగూరల మడులు వుండేవి. కాలకృత్యాల కోసం అందరూ ఇంటికి కొద్ది దూరంలోవున్న తుమ్మల బీడుకు చెంబులు తీసుకునివెళ్ళేవాళ్ళు. మరీ పెద్దవాళ్ల కోసం పెరట్లో ఒక దడి కట్టి వుండేది.
“ఇల్లు యెంత పెద్దదయినా మూడంటే మూడే లాంతర్లు వుండేవి. పొద్దుగుంకడానికి ముందుగానే లాంతరు  అద్దాలను ముగ్గు పెట్టి శుభ్రంగా తుడిచి,  కిరసనాయిలు పోసి సిద్ధంగా వుంచేవారు. పూర్తిగా చీకటి పడకముందే పిల్లలకు అన్నాలు పెట్టేసేవాళ్ళు. తరవాత అంతా ఆరుబయట మంచాలు వేసుకుని పండుకునేవాళ్ళం. వెల్లకిలా పడుకుని ఆకాశంలో మిలమిల మెరిసే  నక్షత్రాలు చూస్తూ వుంటే ఆ ఆనందం అంతా  ఇంతా  కాదు.
“ఒక్కొక్క మంచంలో ఇద్దరిద్దరం పడుకునేవాళ్ళం. నులక మంచాలు కొన్ని, నవారు మంచాలు మరికొన్ని. నవారు మంచాలు పెద్దవాళ్ళకు వేసేవాళ్ళు.
మంచం పట్టెడ వొదులు కాకుండా సాయంత్రం కాగానే వాటిని బిగించి కట్టేవాళ్ళు.
 “వెన్నెట్లో ఎన్నోరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. పాడుకునేవాళ్ళం. వెన్నెల కుప్పలు అనే ఆట బాగుండేది. ఒక జట్టు చేతిలో మట్టి తీసుకుని ఇంటి ఆవరణలోని రకరకాల చోట్ల మట్టిని  చిన్న చిన్న కుప్పలుగా పోసేది. రెండో జట్టు అవి ఎక్కడున్నాయో కనుక్కుని వాటిని చెరిపేసేది. ఎవరివి మిగిలితే వాళ్ళు గెలిచినట్టు.
“మమ్మల్ని అందరితో పాటే వూరి బడిలో వేసారు. తాటాకుల షెడ్డు. తెలుగులో చదువు. అన్ని క్లాసులకూ ఒక్కరే టీచరు. స్కూల్లో వున్నప్పుడు అ ఆ ఇ ఈ లు నేర్పించేవారు. వల్లెవేయడం మీదనే శ్రద్ధ చూపెట్టేవారు. అంటే టీచరు  చెప్పిందే మనం మళ్ళీ  మళ్ళీ చెప్పడం అన్నమాట.  కుర్చీలు బెంచీలు లేవు. నేలమీదనే కూర్చునే వాళ్ళం. పుస్తకాల సంగతి సరే - అసలు  పలకా బలపాలే లేవు. ఇసకలో అక్షరాలూ రాసి వేళ్ళతో దిద్దించే వాళ్ళు. మొత్తం స్కూల్లో విద్యార్దుల సంఖ్య పదిహేను దాటేది కాదు.  వారిలో ఏడెనిమిది మందిమి మా ఇంటినుంచే. బాగా పాఠం ఒప్పచెప్పిన వారిని పంతులు గారు  మాటలతో మెచ్చుకునేవారు. బడి వొదలగానే ఇంటికి వచ్చి భోంచేసే వాళ్ళం.  “అన్నం, గరిటెజారుడు పప్పు, వంకాయ, బెండకాయ, దోసకాయ, చిక్కుడుకాయలతో చేసిన ఏదో ఒక కూర, పప్పుచారు, ఆవకాయ, నెయ్యీ, పెరుగు ఇదీ  మా భోజనం.
 “ ఆ రోజుల్లో కంభంపాడు  గ్రామానికి కరెంటు లేదు. రోడ్డు లేదు. మంచినీటి పంపులు లేవు. ఒక్క మా తాతగారికి తప్ప ఎవరి కాళ్ళకూ చెప్పులు కూడా వుండేవి కాదు.  అల్యూమినియం కంచాల్లో భోంచేసే వాళ్ళం. పెద్దవాళ్ళకు విస్తరాకులతోనో, బాదం ఆకులతోనో కుట్టిన  విస్తళ్లలో వడ్డించే వాళ్ళు. ఇంట్లో విధవరాండ్రయిన ముగ్గురు ఆడవాళ్ళు వుండేవాళ్ళు. ఒంటిపూట భోజనాలు. రాత్రి ఉప్పిడిపిండి తినేవాళ్ళు. ఉప్పుడు పిండికీ, తప్పాల చెక్కకూ,  ‘పేటెంట్’ ఇవ్వాల్సివస్తే,  అది మా కంభంపాడు అమ్ముమ్మ వెంకట్రావమ్మ గారికి ఇవ్వాలి. తప్పాలచెక్క అంటే బియ్యపు పిండితో చేసే వంటకం. బియ్యపుపిండిలో నానేసిన సెనగపప్పు, ఉప్పూ కారం జీలకర్ర కలిపి ముద్దగాచేసేవాళ్ళు.  ఇత్తడి గిన్నెను పొయ్యిపై వేడిచేసి, దానిలోపల ఈ ముద్దను  తందూరీ రోటీ మాదిరిగా పలచగా అంటించి మూతపెట్టేవాళ్ళు. కాసేపయిన తరవాత, గిన్నెని దించి లోపల ఎర్రగా కాలిన తప్పాలచెక్కను చేత్తో బయటకు తీసి దానికి వెన్నరాసి పెట్టేవాళ్ళు. ఆహా ఏమి రుచి! అన్ని లొట్టలు వేసుకుంటూ తినేవాళ్ళం. కానీ అది తయారుచేసేటప్పుడు అమ్ముమ్మ కాల్చుకున్న చేతుల సంగతి ఎవరికీ గుర్తుండేది కాదు.
“ఇంట్లో వంట పని భారం అంతా మా అమ్ముమ్మదే. పొగ చూరే కట్టెల పొయ్యిముందు కూర్చుని, ఇంటిల్లిపాదికీ వొంటి చేత్తో వండివార్చేది.  ఆవిడ వొదినెగారో, అత్తగారో అప్పుడప్పుడు ఆమెకు  చేతి సాయం చేసేవారు.
“వాళ్ళందరికీ మడి పట్టింపులు ఎక్కువ. మమ్మల్ని పొరపాటున కూడా తాకనిచ్చేవారు కాదు. ఎప్పుడయినా ముట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడితే బట్టలు విప్పి ముట్టుకోవాలి. “మా అమ్ముమ్మ కానీ, ఆవిడ  వొదినె గారు కానీ,  ఆమెను అంతా  చిదంబరం అత్తయ్య అనే  అని పిలిచేవాళ్ళు, మంచి నీళ్ళ బావికి వెళ్లి బిందెలో నీళ్ళు పట్టుకుని నెత్తిన  పెట్టుకుని మోసుకొచ్చేవాళ్ళు. ఇంటిల్లిపాదీ అవే తాగేవారు.  ఇంటికి మూడువందల మీటర్ల దూరంలో ఈ మంచి నీళ్ళ బావి వుండేది. ఇంట్లో కూడా  బావి వుండేది కానీ నీళ్ళు ఉప్పు కషాయం. తాగడానికి పనికి రావు. 
“కావాల్సిన కూరగాయలన్నీ  ఇంటి పెరట్లోనే పండేవి. కొష్టం నిండా ఆవులూ, బర్రెలూ వుండేవి. ఇంట్లోకి అవసరమయిన పాలు,పెరుగు,నెయ్యీ వాటి పాడితోనే సరిపోయేది. కొనుక్కోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. అలాగే బియ్యం,పప్పులూ, ఇతర దినుసులు. వేరుసెనగ విత్తులను గానుగ ఆడించి నూనె తీసేవారు.                
 ఆడవాళ్ళు ధరించే చీరెల నుంచి, మగవాళ్ళు కట్టుకునే దోవతులవరకూ వూళ్ళోని  నేతపనివారే నేసిపెట్టేవారు. ఏదయినా శుభాకార్యాలప్పుడే పట్నం వెళ్లి ఆలుగడ్డలు, టొమాటోలు వంటివి కొనుక్కుని వచ్చేవాళ్ళు. కాయలూ, పండ్లూ కూడా కొనుక్కోవాల్సిన అవసరం వుండేది కాదు. తోటల్లోనే కాసేవి. రుతువులనుబట్టి దొరికేవి. అరటి, జామ, మామిడి, సీమచింత, సపోటా, రేగిపళ్ళు  ఏవీ కొనాల్సిన పనివుండేది కాదు.
 ఆరోజుల్లో రకరకాల పండుగలు. కానీ ప్రతి పండగా పిల్లలకు పెద్ద  పండగే. అది ఆడవాళ్ళ వ్రతమయినా, మగవాళ్ళ వనభోజనాలయినా.
 వినాయక చవితి, మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీవ్రతం, కేదారేశ్వర వ్రతం, అట్లతద్దె, ఉండ్రాళ్ళ తద్దె, దసరా,  బతకమ్మ, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలా పండగలే పండగలు. నోములే నోములు. నవకాయ పిండి వంటలతో పండగ భోజనాలన్నీ  అదిరి పోయేవి. ఆ పండగలన్నీ ఇప్పుడు లేవని కాదు. ఆనాడు  పిల్లల్లో పెద్దల్లో కానవచ్చే సంతోషం  సంబరాలు ఇప్పుడు మచ్చుకు కూడా కానరావడం లేదు. ఈ పండగలే  కాక, బంధు మిత్రులతో కలసిచేసే వన భోజనాలు, తిరునాళ్ళు, తీర్ధయాత్రలు. వ్రతాలు,పూజలు, పేరంటాలు, ఆ రోజుల్లో అలా  సందడే సందడి.”

ఇవండీ డాక్టర్ రంగారావు, మా ఊరిలో  తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పిన ముచ్చట్లు. 

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (5) -


ఆడ వాళ్ళ ప్రయాణాలకి మా ఇంట్లో ఒక మేనా వుండేది.  నేను హైస్కూలు చదువు చదివే రోజుల్లో కూడా ఇంటి మధ్య హాల్లో ఆ మేనాను మోకులు కట్టి పైన రెండు దూలాల మధ్య వేలాడదీసి ఉంచేవాళ్ళు. దాన్ని మోయడానికి ఆరుగురు బోయీలు. పరిస్తితుల ప్రాబల్యం వల్ల మేనా వైభోగం అటక ఎక్కింది. ఆ  తరువాత చాలా కాలం వరకూ  పంటలు రాగానే వాళ్లకు ‘మేర’ (ధాన్యం వాటా) ఇవ్వడం కూడా నాకు గుర్తుంది. మేనా రోజులు అయిపోయిన తరువాత ఇంట్లో ఆడవాళ్ళు ఊళ్లకు పోవడానికి గుడిసె బండ్లు కట్టేవాళ్ళు. ఒక్క మగవాళ్ళ ప్రయాణాలకే అయితే గుడిసె కట్టకుండా కేవలం జల్ల బండ్లు మాత్రమే కట్టేవాళ్ళు. మా ఇంట్లో రాముడు భీముడు అని ఒక ఎడ్ల జత వుండేది. కాడి మెడ మీద పడగానే వాటికి ఎక్కడ లేని హుషారు. అవి లాగే బండి ఎక్కడానికి మేము పోటీలు పడేవాళ్ళం. బండి తొట్లో కూర్చుని, తోకలు మెలిపెడుతూ, చర్నాకోలతో ఎడ్లను అదిలిస్తుంటే అవి పరుగు మొదలు పెట్టేవి. వాటి మెడపట్టెలలో గంటలు మోగుతుంటే అదో తమాషాగా అనిపించేది. బండి నడిపే మనిషి వాటితో ఏవేవో మాట్లాడుతుండేవాడు. ఆ భాష వాటికి అర్ధం అవుతున్నట్టే అనిపించేది. ఒక ఈడు వచ్చిన తరువాత మేము రైలుకు పోవాలంటే మోటమర్రికి, బస్సు ఎక్కాలంటే పెనుగంచిప్రోలుకు మూడు, నాలుగు మైళ్ళు నడిచే వెళ్ళే వాళ్ళం. అలాగే పొరుగూరు వత్సవాయి టూరింగు టాకీసులో సినిమా చూడడానికి కూడా చాలామందిమి కలిసి కాళ్ళకు పనిచేప్పేవాళ్ళం. ఆ సినిమాల్లో రెండు మూడు ఇంటర్వెల్స్ ఉండేవి. పైన డేరా చిరుగులు పడి ఆకాశం కనిపిస్తూ వుండేది. హాలు బైట పెట్టిన మైకు మాత్రం గట్టిగా పనిచేసేది. సినిమాకు ముందు వేసే ‘నమో వెంకటేశా పాటలు చాలా దూరం వినిపించేవి. అవి వినపడడం లేదు అంటే సినిమా మొదలు పెట్టారని అర్ధం.
పొద్దున్నే చద్దన్నం మరో సుమధుర జ్ఞాపకం.
ఇంట్లో పదిమంది పిల్లలం కాక మరో పదిహేనుమంది దాకా పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. అంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకురావడం మా తాతగారికి అలవిమాలిన పని. ప్రతిపూటా కూరా నారా అంటే కుదరని పని. అందుకే, పిల్లలందరికీ పొద్దున్నే చద్దన్నం పెట్టేవాళ్ళు. అదే మా బ్రేక్ ఫాస్ట్. రాత్రిళ్ళు తినగా  మిగిలిన అన్నంలో ఆవకాయ కలిపి, పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని, ఒకరి తరవాత మరొకరికి వొంతులవారీగా ముద్దలు తినిపించేవాళ్ళు. పిల్లలకు విడిగా అన్నం పళ్ళాలు వుండేవి కాదు. పెరుగన్నంతో పిల్లల కడుపునిండి పోయేది.
పొద్దుటిపూట పెద్దవాళ్లకయితే జాంబెడు (పెద్ద గ్లాసు) కాఫీ లేదా చెంబెడు తేట మజ్జిగ.
ఇంటి వెనుకనే శివాలయం.
కార్తీక మాసం నెల రోజులూ  చీకటి పడుతుండగానే గుడి ఆవరణలోవున్న ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీసేవాళ్ళు.  ఆకాశదీపం అంటే  – చిన్న చిన్న కంతలు కలిగిన మూత వుండే ఒక రకం దీపం. లోపల ప్రమిదెలోనూనె పోసి  వొత్తి  వెలిగించి దానిని ఈ ఆకాశదీపంలో వుంచేవారు. చీకట్లో అంత ఎత్తున  ధ్వజస్తంభం నుంచి వేలాడుతూ - చిరు కాంతులు వెదజల్లుతూ మా పిల్లలందరికీ అది నిజంగా  ఆకాశంలో వెలిగే దీపంలాగానే అనిపించేది.

పొరుగున పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ తిరుణాల జరుగుతుంటే ఆ సంబరం ఛాయలు మా వూళ్ళో కనిపించేవి. రంగు కాగితాలతో రకరకాల ప్రభలు తయారు చేసి వాటిని బండ్లపై అమర్చేవారు. వాటికి కట్టే ఎడ్లను కూడా అందంగా అలంకరించేవారు. వాటిపై బుక్కా గులాములు చల్లేవాళ్ళు. మేళ తాళాలతో ఊరేగిస్తూ ప్రభలను పెనుగంచి ప్రోలు తీసుకువెళ్ళి ఏటి ఒడ్డున వున్న తిరుపతమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించేవాళ్ళు. మొక్కుబళ్ళు తీర్చేవాళ్ళు. గుడి పక్కన ఎత్తైన  పెద్ద ఇనుప ప్రభ వుంది. కరెంటు రాకముందు ఆ ప్రభను ఊళ్ళో తిప్పేవారట. తీగెలు అడ్డం వస్తాయని ఆ ప్రభను కదలకుండా గుడి పక్కనే వుంచేసారు.  తిరుపతమ్మకు ఏటా రెండు తిరుణాళ్ళు జరిగేవి. ఒకటి పెద్ద తిరుణాల. రెండోది చిన్న తిరుణాల. అదేమి చిత్రమో పెద్ద తిరుణాల జరిగిన సంగతే ఎవరికీ తెలిసేది కాదు. అదే చిన్న తిరుణాల చాలా అట్టహాసంగా జరిగేది. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు. చిన్న తిరుణాల జరిగినన్నాళ్ళు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పండగ వాతావరణమే. పెనుగంచి ప్రోలు మీద జనం ఎగబడేవారు. ఊరుమీద ఊరు పడ్డట్టు వుండేది. ఆ వూళ్ళో మా బావగారి ఇల్లు తిరుణాలకు వచ్చిన చుట్టపక్కాలతో నిండి పోయేది. తిరుణాల లేని రోజుల్లో ఏడాది పొడుగునా ఆ దేవాలయ ప్రదేశం నిర్మానుష్యంగా వుండేది. అలాటిది గత కొన్నేళ్లుగా ఆ గుడి ప్రభలు జగజ్జేయమానంగా వెలిగిపోతున్నాయి. అక్కడ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. మొన్నీ మధ్య మా మేనల్లుడు రామచంద్రం ఆ వూరు వెళ్లి వచ్చి చెప్పాడు, ‘వెనక ఏడాదికి రెండు తిరుణాళ్ళే. ఇప్పుడు ఏడాది పొడుగునా రోజూ తిరుణాళ్ళే’ అని. ఇతర జిల్లాలనుంచి కూడా ఆ వూరికి  ప్రతి రోజూ అనేక ట్రిప్పులు బస్సులు నడుస్తున్నాయి. మేము చదువు కునే రోజుల్లో బెజవాడ నుంచి పొద్దున్న ఒకటి (ఫస్ట్ బస్ అనే వాళ్ళు), సాయంత్రం ఒకటి (నైట్ హాల్ట్ బస్ అనేవాళ్ళు) బెజవాడ నుంచి వచ్చి పోయేవి. సాయంత్రం వచ్చిన బస్సు అక్కడే వుండిపోయేది. డ్రైవరు, కండక్టర్ కూడా అక్కడే నిద్ర చేసే వాళ్ళు. మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ బస్  లో బెజవాడ వెళ్ళే వాళ్ళు. బస్సు బయలుదేరేటప్పుడు గట్టిగా హారన్  మోగించేవాళ్ళు. అది వింటూనే  ప్రయాణాలపై వెళ్ళేవాళ్ళు హడావిడిగా ఇళ్ళ నుంచి  సామాన్లు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేవాళ్ళు. డ్రైవర్ పక్కన ఒక సీటు వుండేది. దాన్ని ఫ్రంట్ సీటు అనేవాళ్ళు. మునసబు, కరణాలకు, పోలీసులకు ఆ సీటు ప్రత్యేకం. బస్సులో ఖాళీ లేకపోయినా, నిల్చుని ప్రయాణం చేసేవాళ్ళు కాని వేరే వాళ్ళు అందులో కూర్చునే వాళ్ళు కాదు. బెజవాడకు టిక్కెట్టు రూపాయి వుండేది. పిల్లలకు అర  టిక్కెట్టు కొట్టించడానికి పెద్దవాళ్ళు నానా ప్రయాస పడేవాళ్ళు. వయసు తక్కువ చెప్పేవాళ్ళు. కండక్టర్ గట్టివాడయితే సీటు పక్కన నిలబెట్టించి పొడుగ్గా వుంటే పూర్తి టిక్కెట్టు కొట్టేవాడు. ఆ లడాయి నందిగామ చేరేదాకా సద్దుమణిగేది కాదు. (ఇంకా వుంది)     

8, ఆగస్టు 2017, మంగళవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (4) - భండారు శ్రీనివాసరావు


కంభంపాడులో మా ఇల్లు పెద్ద భవంతి ఏమీ కాదు. ఈ ఇల్లు కట్టడానికి ముందు ఉన్న ఇల్లు మాత్రం చాలా పెద్దది, మండువా లోగిలి అని చెబుతారు. మా తాతగారి కాలంలో ఆ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయింది. ఆ సంఘటనలో కాలిపోగా మిగిలిన కలపతో కొత్త ఇల్లు కట్టారని చెబుతారు. ఇప్పటికీ వసారాలో వేసిన పైకప్పులో కాలిన నల్లటి మచ్చలు కానవస్తాయి. ముందు వసారా. పక్కన దక్షిణాన ఒక పడక గది, మధ్యలో పెద్ద హాలు, దానికి ఆనుకుని ఒక పెద్ద గది, వెనుకవైపు మళ్ళీ ఓ వసారా, పక్కన వంటిల్లు. వెనుక వసారాలో పాలు కాచుకునే దాలి గుంట, పక్కనే మజ్జిగ చిలికే కవ్వం. అక్కడక్కడా గోడల్లోనే చిన్న చిన్న గూళ్ళు, వంటింట్లో రెండు ఇటుకల పొయ్యిలు, గోడకు రెండు చెక్క బీరువాలు, ఒకటి మడి బీరువా, ఆవకాయ కారాల జాడీలు పెట్టుకోవడానికి, రెండో బీరువాలో పెరుగు కుండలు, కాఫీ పొడి  పంచదార మొదలయినవి దాచుకునే సీసాలు. వాటితో పాటే పిల్లలకోసం తయారు చేసిన చిరు తిళ్ళు. ఈ రెండు బీరువాలు తాకడానికి కూడా పిల్లలకు హక్కు వుండేది కాదు. మడి బీరువా మరీ అపురూపం. దానికి తాళం కూడా వుండేది కాదు, అందులోనే చిల్లర డబ్బులు దాచి పెట్టేవారు. పొరబాటున కూడా ఇంట్లో ఎవ్వరూ మైల బట్టలతో వాటిని తాకే సాహసం చేసే వాళ్ళు కాదు. వంటింటి వసారాలోనుంచి పెరట్లోకి గుమ్మం వుండేది. దానికింద వలయాకారంగా మెట్లు. కింద తులసి కోట. ఒక వైపు బాదం చెట్టు. అక్కడ అంతా  నల్ల చీమలు. ఎర్రగా పండిన బాదం పండ్లు కొరుక్కు తింటే భలే బాగుండేవి. ఇక బాదం పప్పు రుచే వేరు. దానికి పక్కనే  పున్నాగ చెట్టు. నేలరాలిన పూలు భలే మంచి వాసన వేసేవి. మా అక్కయ్యలు వాటిని సుతారంగా మడిచి మాలలు కట్టుకునే వాళ్ళు. మేము వాటితో బూరలు చేసి వూదేవాళ్ళం. దగ్గరలో ములగ చెట్టు. కొమ్మల నుంచి ములక్కాడలు వేలాడుతూ కనిపించేవి. అక్కడే రెండు బొప్పాయి చెట్లు కవల పిల్లల్లా ఉండేవి.
రెండో వైపు కొంచెం దూరంలో గిలక బావి. ఆ బావి చుట్టూ చప్టా. పక్కనే రెండు పెద్ద గాబులు (నీటి తొట్టెలు). ఒకటి స్నానాలకి, రెండోది బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి. స్నానాల గాబు పక్కనే వేడి నీళ్ళ కాగు. అక్కడే చెంబుతో వేడి నీళ్ళు, గాబు లోని చల్ల నీళ్ళు సరిపాట్లు చేసుకుంటూ పిల్లలు స్నానాలు చేసేవాళ్ళు. పెద్ద వాళ్ళు బావిదగ్గర నిలబడి, పనివాళ్ళు నీళ్ళు తోడి ఇస్తుంటే పిండితో వొళ్ళు రుద్దుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు. నాకు బాగా బుద్ధి తెలిసే వరకు  ‘సబ్బు’ గృహ ప్రవేశం చేయలేదు.  బావి దగ్గర నుంచి వెనుక పెరట్లోకి చిన్న చిన్న కాలువలు ఉండేవి. ఇంట్లోకి అవసరం అయ్యే కాయగూరల్ని, ఆకు కూరల్ని అక్కడే పండించే వాళ్ళు. చుట్టూ కంచెగా వున్నా ముళ్ళ కంపకు కాకర పాదులు పాకించే వాళ్ళు. తేలిగ్గా ఓ పట్టాన తెంపుకు పోవడానికి వీల్లేకుండా. అక్కడే మాకు పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు, మంచి గుమ్మడి కాయలు కనబడేవి. అంత  పెద్దవి అక్కడికి ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడేవాళ్ళం. నాకు పొట్ల పందిరి ఇష్టం. పందిరి మీద అల్లుకున్న తీగె నుంచి పొట్ల కాయలు పాముల్లా వేలాడుతుండేవి. పొట్లకు పొరుగు గిట్టదు అనేది మా బామ్మ. పొరుగున మరో కూరగాయల పాదు వుండకూడదట.
బచ్చల పాదులు అంటే కూడా పిల్లలకు ఇష్టం. ఎందుకంటె వాటికి నల్ల రంగుతో చిన్న చిన్న పళ్ళు (విత్తనాలు) కాసేవి. వాటిని చిదిమితే చేతులు ఎర్రపడేవి. నెత్తురు కారుతున్నట్టు ఏడుస్తూ పెద్దవాళ్ళని భయపెట్టే వాళ్ళం. బెండ కాయలు, దొండ కాయలు దొడ్లోనే కాసేవి. దొండ పాదు మొండిది అనేవాళ్ళు. ఒకసారి వేస్తే చచ్చినా చావదట. ఇందులో యెంత  నిజం వుందో తెలవదు. పాదుల గట్ల మీద  ఆ పెరడు మధ్యలో రాణీ గారి మాదిరిగా కరివేపాకు చెట్టు వుండేది. నిజంగా చెట్టే. చాలా పెద్దగా, ఎత్తుగా  వుండేది. ఊరి మొత్తానికి అదొక్కటే కరివేపాకు చెట్టు కావడం వల్లనేమో ఊరందరి దృష్టి దానిమీదనే. మా బామ్మగారిది నలుగురికీ పంచి పెట్టె ఉదార స్వభావమే కాని, మడి పట్టింపు జాస్తి. మైల గుడ్డలతో కరివేపాకు చెట్టును ముట్టుకోనిచ్చేది కాదు. దాంతో ఎవరూ చూడకుండా ఎవరెవరో దొంగతనంగా కరివేపాకు రెబ్బలు తెంపుకు పోయేవాళ్ళు.   

బావి పక్కనే కంచెను ఆనుకుని విశాలమైన ఖాళీ స్థలం వుండేది. వెనుక వైపు దక్షిణం కొసన బండ్లు వెళ్ళడానికి రాళ్ళు పరచిన ఏటవాలు దారి వుండేది. అక్కడే జుట్టు విరబోసుకున్న రాక్షసి లాగా పెద్ద చింత చెట్టు. పగలల్లా ఆ చెట్టు కిందనే ఆడుకునే వాళ్ళం కాని పొద్దుగూకేసరికి చిన్న పిల్లలం ఎవరం ఆ ఛాయలకు పోయేవాళ్ళం కాదు. చింత చెట్టుకు ఓ పక్కన ఎరువుల గుంత వుండేది. గొడ్ల సావిట్లో పోగుచేసుకు వచ్చిన చెత్తనూ, పేడను అందులో వేసేవాళ్ళు. సాలు చివర్లో వాటిని జల్ల బండ్లకు ఎత్తి పంట పొలాలకు ఎరువుగా వేసేవాళ్ళు. కనీసం యాభయ్, అరవై  బండ్ల ఎరువు పోగు పడేది. (ఇంకా వుంది)

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (3) - భండారు శ్రీనివాసరావు


తరువాత సరస్వతక్కయ్యకు సంబంధాలు చూడడం మొదలయింది. మా వూరిలో చలువాది నరసింహం అనే షావుకారు వున్నారు. ఆమెకు ఒక్కటే కూతురు. ఆమెతో మా పెద్దక్క య్యలు ఇద్దరికీ తగని స్నేహం. ఆమె పేరు తిరుపతమ్మ. పొద్దునలేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేదాకా మా ఇంట్లోనే వుండేది. ఆమెను నందిగామ తాలూకాలోని తుర్లపాడు ఇచ్చారు. ఆ వూళ్ళో తిరుపతమ్మ అత్తగారి ఇల్లు, ఆ వూరి కరణం గారయిన  తుర్లపాటి భైర్రాజు గారి ఇల్లు పక్కపక్కనే వుండేవి. ఆ కరణం గారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు సత్యనారాయణకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత పొలంలో పాము కరచి చనిపోయాట్ట. రెండోవాడు బియ్యే పాసయి ఎమ్మే చదువుతాను అన్నాట్ట. కాని కరణం గారు మాత్రం ‘నీ చదువు ఇక నా వల్లకాదు, పెళ్లి చేసుకుని మీ మామగారు చదివిస్తే చదువుకో అభ్యంతరం లేదన్నా’రట. చదువు మీది మమకారంతో కరణంగారి ఆ రెండో కొడుకు హనుమంతరావు కారేపల్లి సంబంధం  చేసుకున్నారు. పెళ్ళయిన కొన్నాళ్ళకు  పైచదువుల ప్రసక్తి తండ్రిదగ్గర తెస్తే ‘మన ఇంటి పరిస్థితులు నీకు తెలవనివి కావు కదా. ముందు ఏదన్నా నౌకరీలో కుదురుకుని ఆ తరువాత చదువుకో లేకపోతే మీ మామను అడుగు’ అని సలహా ఇచ్చారట. మామగారిని డబ్బు అడగడం ఇష్టం లేక ఇంట్లో చెప్పకుండా ఆయన సైకిల్ అమ్ముకుని కాశీ వెళ్ళి ప్రైవేట్లు చెప్పుకుంటూ ఎమ్మేలో చేరారు. ఫైనల్ పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో కారేపల్లిలో గర్భవతిగా ఆయన భార్య పురుడు కష్టమై పెద్ద ఆపరేషన్ చేయించినా ఉపయోగం లేక తల్లీ పిల్లాడు ఇద్దరూ పోయారట. పరీక్షల ముందు ఈ కబురు చెప్పడం ఇష్టం లేక, భార్య చావు కబురు  ఆయనకు తెలవనివ్వలేదు. పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన తరువాత చింతపల్లి వేంకటేశ్వర రావు అనే అతడిని పంపి ఆయన్ని కారేపల్లి తీసుకువెళ్ళారు. అక్కడికి పోయినదాకా ఆయనకు ఆ వార్త తెలవదు. ఆ షాకునుంచి కోలుకోవడానికి ఏడాది పట్టింది.
ఇంతలో ఆయన తండ్రి గారు  మాత్రం మళ్ళీ పెళ్ళంటూ వొత్తిడి మొదలు పెట్టారు. కారేపల్లిలో ఈయనకు పిల్లనిచ్చిన రంగారావు గారికి కూడా బాగా చదువుకున్న ఈ అల్లుడు అంటే ఎంతో అభిమానం. ‘మా అల్లుడు కాశీ వెళ్ళి పెద్ద పట్టా ఫస్టుక్లాసులో పాసయాడు తెలుసా’ అని అందరితో గర్వంగా చెప్పుకునే వాడు. చిన్న వయస్సులో భార్యాపిల్లలను పోగొట్టుకున్న ఈయనను చూసి ఆయన జాలిపడి మళ్ళీ   పెళ్ళిచేసుకోమని పోరు పెట్టేవారట. చివరకు భీమవరం అమ్మాయితో ఈయనకు రెండో పెళ్లి జరిగింది. ఆ అమ్మాయికి మనస్తిమితం లేని సంగతి దాచిపెట్టి పెళ్లి చేశారు. ఆమె పుట్టింటి వాళ్లు కూడా ఏదో గతిలేక అబద్ధం చెప్పి పెళ్ళయితే చేశారు కాని వారికీ మనసులో గుబులు అనిపించిందో యేమో ఒకరోజు వచ్చి పిల్లను తీసుకువెళ్ళి పోయారు. వాళ్ళూ మంచివాళ్ళే. ‘మిమ్మల్ని మోసం చేయాలని మాకూలేదు. ఏదో అలా జరిగిపోయింది. పెద్దమనస్సుతో మన్నించడ’నే అన్నారు. కానీ ఇదంతా ఆయన మనస్సును చీకాకు పరిచింది. ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, బెజవాడలో ప్లీడరు ప్రాక్టీసు మొదలు పెట్టాలని తీర్మానించుకున్నారు.  మొదట్లో ఓ నాలుగు నెలలు మాచవరంలో తుర్లపాటి సంగమేశ్వర రావు అనే దూరపు బంధువు  దగ్గర పనిచేసి ఆ తరువాత సొంతంగానే ప్రాక్టీసు పెట్టారు. గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, జైహింద్ టాకీసు నడుమ రాజగోపాలచారి వీధిలో చక్రవర్తి గారి తెల్లమేడ ఎదురుగా సోవమ్మగారి ఇంట్లో మూడుగదుల వాటా   ఇరవై రూపాయల అద్దెకు మాట్లాడి దిగిపోయారు. సున్నం ఇటుకలతో కట్టిన ఆ ఇంటికి గోడలు గిలాబు కూడా చేయించలేదు. బాతు రూము వుండేదికాదు. నాలుగు వాటాల వాళ్ళకీ కలిపి ఒకటే నీళ్ళ పంపు. బావి లేదు. బోరింగు లేదు. ఆ ఇంట్లో ఆయనా, తుర్లపాడులో తెలిసిన  స్నేహితుడు గురవయ్య కలసి వుండేవారు. ఈయన్ని గురించీ, ఈ ఇంటిని గురించి ఇన్ని వివరాలు మాకు యెలా తెలిసినవన్న అనుమానం రావచ్చు. మా అక్కయ్యకు  పెళ్లి సంబంధం తీసుకువచ్చిన తిరుపతమ్మే  ఈ విషయాలన్నీ మా వాళ్లకు చెప్పిందట.          
తుర్లపాడులో వుండే  ఆ తిరుపతమ్మ మావూరు  వచ్చి ‘మా కరణంగారి అబ్బాయికి పెళ్లి చేస్తారుట. ఇరవైఎనిమిది ఏళ్ళు. బాగా చదువుకున్నాడు. బుద్ధిమంతుడు. బెజవాడలో ప్లీడరీ చేస్తున్నాడు. మీ అమ్మాయిని అయితే తప్పకుండా చేసుకుంటారు’ అని మా నాన్నతో  చెప్పింది. రెండో సంబంధం అనగానే ఆయన ఇష్టపడలేదు.
ఇట్లావుండగానే ఆ తిరుపతమ్మ మొగుడు రమణయ్య,  పిల్లాడి తండ్రి భైర్రాజుగారు మా వూరు వచ్చి షావుకార్ల ఇంట్లో దిగి మా ఇంటికి కబురు పెట్టారు. మా నాన్న  వెళ్ళి వారిని ఇంటికి తీసుకువచ్చారు.
‘అతికితే గతకదు. మీఇంట్లో భోజనం చేసేది లేద’ని  ముందే చెప్పారు. అందుకని మా ఇంటికి పక్క వీధిలో వున్న గూడా రామచంద్రయ్యగారింట్లో వాళ్లకు భోజనం  ఏర్పాట్లు చేశారు. తరువాత  మా అక్కయ్యను చూపించారు. అప్పుడు మా ఇల్లు ఒక పెండ్లివాళ్ళ ఇల్లులాగా వుండేది. మా బామ్మ,  ఆమె తల్లి, మా మేనత్త, మా అమ్మ, పది మంది పిల్లలు. (అప్పటికి మా ఇంట్లో అందరికంటే  చిన్నవాడినైన నేను పుట్టనేలేదు). ఇంకా మా సీతంబామ్మ, సుబ్బయ్య తాతయ్య, జీతగాళ్ళు ఇట్లా ఇంతమందితో ఇల్లంతా ఎంతో సందడిగా వుండేది.  ఇదంతా చూసి  పిల్లాడి తాలూకువాళ్ళు ముఖ్యంగా పిల్లాడి తండ్రి భైర్రాజు గారు ‘ఈ సంబంధం  నాకు నచ్చింది’ అని అక్కడికక్కడే చెప్పేసారు.  ‘మా అబ్బాయిని పంపుతామ’ని చెప్పి వెళ్ళిపోయారు. తరువాత పది  రోజులకు తుర్లపాడు సంబంధం అబ్బాయి వచ్చవాయి వచ్చి జగన్నాధం బాబాయిని,  ఇంగువ రామకృష్ణయ్యగారిని, గురవయ్య గారిని వెంటబెట్టుకుని  కంభంపాడు వచ్చి మా అక్కయ్యను చూసారు. చూసి వెళ్ళిన తరువాత ఆయన తండ్రిగారు ‘మా అబ్బాయికి ఇష్టమయింది’ అని కబురు పంపారు. మా నాన్న వెంటనే బెజవాడ వెళ్ళి దోర్భల శేషాద్రి గారనే ప్లీడరును కలుసుకుని పెళ్లి కుమారుడి గురించి వాకబు చేశారు. ‘పిల్లాడు  మంచివాడు, బుద్ధిమంతుడు, తెలివికలవాడు’ అని ఆయన చెప్పారు. తరువాత కారేపల్లి  వెళ్ళి మొదటి సంబంధం వారిని కూడా మంచి చెడ్డలు కనుక్కున్నాడు. మా బామ్మ పెత్తల్లి కూతుర్ని కారేపల్లి రంగారావుగారి  బాబాయికి  ఇచ్చారుట.  అందుకని కంభంపాడు, కారేపల్లి కుటుంబాల మధ్య రాకపోకలు వుండేవి.  నాన్న  వెళ్ళి ‘తుర్లపాడు కరణంగారి పిల్లాడికి మా అమ్మాయిని ఇద్దామనుకుంటున్నాము’ అని చెప్పగానే వాళ్ళూ ఎంతగానో  సంతోషపడి  ‘వెంటనే వెళ్ళి లగ్గాలు పెట్టుకోండి. మీ అమ్మాయి ఇక మీ అమ్మాయి కాదు మా అమ్మాయి’ అని అన్నారుట.  ఆ భరోసాతో మా నాన్న కంభంపాడు వచ్చి లగ్గం  పెట్టుకోవడానికి రమ్మని తుర్లపాడు కబురు చేశారు. కార్తీక మాసంలో కంభంపాడులోనే ఇంటిముందు పందిరి వేసి పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి  కారేపల్లి నుంచి మా బావగారి మొదటి సంబంధం మామగారు  రంగారావు గారు, అనంతరాములు గారు, దుర్గాప్రసాదు గారు అంతా మా వూరు వచ్చారని మా అక్కయ్య చెప్పింది.

(ఇంకా వుంది)

6, ఆగస్టు 2017, ఆదివారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (2) - భండారు శ్రీనివాసరావు


ఆ రోజుల్లో ఆడపిల్లలకు పదో ఏటినుంచే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు. మా ఇంట్లో పెద్దాడపిల్ల రాధక్కయ్య. ఆమెకు పదేళ్లు నిండకుండానే సంబంధాలు చూడడానికి తొందరపడేవాళ్లు. ఈ సంగతులు గురించి  సరస్వతక్కయ్య కొన్ని సరదా ముచ్చట్లు చెబుతూ వుండేది. పెళ్లి సంబంధాల వాళ్లు ఎవరు వచ్చినా సరే మా పెద్దక్కయ్యతో పాటు రెండోది శారదక్కయ్య కూడా పక్కనే కూర్చుని స్వాములవారు చెప్పిన హిందీ రామాయణం గడగడా చదివేసేది.
మావూరికి కొద్ది కోసులదూరంలో వున్న ఖమ్మం జిల్లా వల్లభినుంచి ఓ సంబంధం వచ్చింది. వరుడి పేరు రాంరావు. ఇంటిపేరు అయితరాజువారు. పెద్దమోతుబరులకింద లెక్క. పెళ్ళిచూపుల్లో ఇద్దరు అక్కయ్యలు కలసి మళ్ళీ హిందీ రామాయణం వినిపించారు. అంత పల్లెటూరులో హిందీ  తెలిసిన పిల్లలు వుండడం విచిత్రమనిపించిందో యేమో కాని మొత్తానికి మా రాధక్కయ్యకు వల్లభి సంబంధమే ఖాయమయింది. అయిదువందల రూపాయల కట్నం, అయిదు రోజుల పెళ్లి వొప్పుకుని వెళ్ళిపోయారు.
సంబంధం అయితే కుదిరింది కాని మా నాన్నకు కాలూ చేయీ ఆడని పరిస్తితి. చివరికి మూడెకరాలు అమ్మి పెళ్ళిచేశారు. పిల్లకు నూటయాభై కాసుల బంగారం పెట్టారు. పల్లెటూరు. దొంగల భయం ఎక్కువ. అంత బంగారం ఇంట్లో పెట్టుకుని ఎలారా అని మా నాన్న  భయపడుతుండేవాడు. మొత్తం మీద ఎలాటి అవాంతరం లేకుండా పెళ్లి ఘనంగా జరిగిపోయింది.
సంవత్సరం గడిచింది. రెండో అక్కయ్య శారదక్కయ్యకు  పెళ్లి సంబంధాలు అంటూ ప్రత్యేకంగా చూడలేదట. మేనరికం ఇద్దామనుకున్నారు. మా పెద్ద మేనత్త గారు  శారదక్కయ్య   పుట్టగానే ‘ఇది నా కోడలు’  అని  డిక్లేర్ చేసింది.  రాధక్కయ్య పెళ్లి కావడం ఆలస్యం, వాళ్ల పెద్ద అబ్బాయి రామచంద్రరావుకు శారదను చేసుకుంటానని కబురుచేసిందిట. ఇంట్లో పెళ్లి హడావిడి మొదలయింది కాని ఏదో గుబులు. ఆ రోజుల్లో శారదా చట్టం వుండేది. చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు. ఆరోజుల్లో మా లక్ష్మయ్య తాతయ్యకు మా కుటుంబానికీ నడుమ దాయాది తగాదాలు, ఏవేవో  కీచులాటలు వుండేవి. సంగతి తెలిసి ఆయన ఏమైనా పిటీషన్ పెడితే గోల అవుతుందనే భయంతో ఖమ్మం జిల్లా రెబ్బారం వెళ్ళి పెళ్లి చేసుకువచ్చారు. శారదక్కయ్యకు కూడా యాభయ్ కాసుల బంగారం పెట్టారు. పెద్దక్కయ్య పెళ్ళప్పుడు దొంగల భయం గుర్తు ఉందేమో, ఈసారి నాన్న బెజవాడ వెళ్ళి లల్లూరాం కంపెనీ వాళ్ల ఇనప్పెట్టె కొనుక్కుని వచ్చాడు.
పెద్ద రంగయ్య అనే మాస్టారు  పొరుగున వున్న పెనుగంచిప్రోలు నుంచి మా వూరు స్కూలుకు బదిలీపై  వచ్చారు. ఆయన దగ్గర కూడా మా అక్కయ్యలు  హిందీ నేర్చుకునేవాళ్లట.  ప్రాధమిక, మాధ్యమిక హిందీ పరీక్షలు రాయడానికి మా బామ్మ బండి కట్టించి వాళ్ళను మాచినేనిపాలెం తీసుకువెళ్ళి వచ్చేది. ఆడపిల్లలకు చదువెందుకు అనేరోజుల్లో మా ఇంట్లో పెద్దవాళ్ళు చదువు గురించి తీసుకున్న శ్రద్ధాసక్తులు అలాటివి.
మా పెద్దవాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఆ తరువాత కొంత మార్పు వచ్చింది. పిల్ల సంవర్త అయినా పెళ్ళికి తొందరలేదనేవారు. అందువల్ల మా ఇంట్లో మిగిలిన ఆడ పిల్లల వివాహాలు పదహారేళ్ళు వచ్చిన తరువాతనే జరిగాయి. ఏడుగురు అక్కయ్యల్లో అయిదుగురి పెళ్ళిళ్ళు నేను పుట్టకమునుపే మా నాన్న చేతుల మీదుగానే జరిగాయి. ఇంట్లో చిన్నవాడిని కావడంవల్ల అనేక సంగతులు వాళ్ళు చెప్పుకునే ముచ్చట్ల ద్వారానే నాకు తెలిసాయి.
పెనుగంచిపోలు నుంచి ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అక్కడ చినకరణం గారు కొమరగిరి లక్ష్మీ కాంతారావు గారు. ఆయనకు ఒక్కడే కొడుకు. వెంకట అప్పారావు. బోలెడు ఆస్తి. అతగాడేమో ఇంట్లో చెప్పకుండా మిలట్రీలో చేరాడు. చేరినవాడు అక్కడ కాలు నిలవక తప్పించుకుని వచ్చాడు. మిలట్రీ నుంచి పారిపోయి రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వారంటు జారీ అయింది. తెలిసిన వాళ్లు కాబట్టి మా నాన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి కృష్ణమూర్తి అని పేరు మార్చి రెబ్బారంలో మా రెండో అక్కయ్య ఇంట్లో వుంచాడు. అక్కడి నుంచి కూడా మార్చి కొన్నాళ్ళు కేసు ఎత్తివేసేదాకా ఎలకలపల్లి అనే పల్లెటూర్లో పెట్టారు. అప్పారావు తలిదండ్రులు కాంతయ్య గారు, రంగమ్మ గారు. మా నాలుగో అక్కయ్య సరస్వతిని వాళ్ల పిల్లవాడికి చేసుకుంటామని కబురు చేశారు. కానీ మా నాన్న  సుతరామూ దానికి వొప్పుకోలేదు. ‘కేసు పూర్తిగా ఎత్తివేసినట్టు గవర్నమెంట్ నుంచి కాగితం వచ్చేదాకా పిల్లనిచ్చేది లేదని, పెళ్లి ప్రసక్తి తేవద్ద’ని  తెగేసి చెప్పాడు. (ఇంకా వుంది)

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ......భండారు శ్రీనివాసరావు


“ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా దలచెనో విచ్చేయునో ఈశ్వరుం
డనుకూలింప దలంచునో దలచడో ఆర్యా మహాదేవియున్
నను బాలింప నెరుంగునో నెరుగదో నా భాగ్యమెట్లున్నదో”

రుక్మిణీ  కళ్యాణంలో  పద్యం శ్రావ్యంగా వినబడుతోంది. పాడుతున్న అమ్మాయికి పన్నెండేళ్ళు వుంటాయేమో. వింటున్న వాళ్లు మాత్రం ఆరుపదులు దాటిన  వాళ్ళే. పుస్తకం అవసరం లేకుండా కంఠతా వచ్చిన పద్యాన్ని రుక్మిణీ దేవే స్వయంగా ఆవహించి పాడుతున్నదా అన్నట్టుగా ఆలపిస్తున్నది మా అన్నపూర్ణక్కయ్య. మధ్యలో మంచంలో చేతిలో తావళంతో మా బామ్మ, కొంత దూరంలో మరో మంచంలో మా  బామ్మ అమ్మ చెల్లాయమ్మ అమ్ముమ్మ. ముక్కాలిపీట  పై కాలు మీద కాలువేసుకుని తన్మయంగా వింటున్న మరో శ్రోత మా లలితమ్ముమ్మ. వొంటింట్లో పనిచేసుకుంటూనే ఓ చెవి ఇటు వేసి వింటున్నది మా అమ్మ.  ఈ దృశ్యం ఆ ఇంట్లో పరిపాటే.
ఆ ఇల్లే నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు. చిన్నప్పటి ఈ సంగతులు గురించి మా అక్కయ్యలు, అన్నయ్యలు  చెప్పగా వినీ వినీ  అవన్నీ నా మనసులో ముద్రపడి పోయాయి. అరవై ఏళ్ళ కిందటి ముచ్చట్లు, ఏళ్ళు గడిచినా మనసులో అలా పచ్చగా వుండిపోయాయి.
ఇప్పటికీ కుగ్రామంగా వున్న మా వూరు కంభంపాడు అప్పుడు  ఎలావుండి వుంటుందో  వూహించుకోవాల్సిందే.
మా నాన్నగారు వూరికి కరణం. పేరుకు బోలెడు ఆస్తి. వూరిచుట్టూ ఎటు చూసినా ఎంతదూరం వెళ్ళినా మా పొలాలే. ఐదో అక్కయ్య అన్నపూర్ణ అక్కయ్యను పక్కవూరు పెనుగంచిప్రోలు  పెద  కరణం గారి అబ్బాయి అప్పారావుకుకు  ఇచ్చి పెళ్లి  చేశారు. ఈ సంగతి  ఇప్పుడెందుకంటే కొత్త అల్లుడు పొరుగూరు నుంచి  గుర్రం మీద అత్తగారింటికి మా ఊరు  వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని మేతకు వొదిలేవారు. ఇక  అది తిరిగి మేసినంత మేరా మా పొలాలే. కానీ ఏం లాభం? వందల ఎకరాల భూమి మీద వచ్చే అయివేజు మాత్రం అంతంత మాత్రమే. కరణీకం మీద వచ్చే జీతం రాళ్ళు నాలుగే, ఇంటి ఖర్చుకు ఆధారం. వర్షాలు లేక పంటలు పండక రైతులు సర్కారుకు శిస్తుకట్టలేక ఇళ్ళూ పొలాలు వొదులుకుని వూళ్ళు వొదిలి వెళ్ళే రోజులవి.
అలాటి రోజుల్లో మా బాల్యం గడిచింది. అలాటి పల్లెటూరిలో మా చిన్నతనం నడిచింది.
మా నాన్నకు  ఏడుగురు ఆడపిల్లలు.  నలుగురు మగపిల్లలం.
ఇంతమందికే కాదు, ఇంకా ఇంతమంది ఇంట్లో  విస్తళ్ళు వేసే సమయానికి భోజనాలకు సిద్ధంగా వుండేవారు. పూటకూళ్ళ ఇల్లు లేని వూరు. ఎవరొచ్చినా చేయి కడిగేది వూరి కరణం గారింట్లోనే.
మా అమ్మా నాన్న, బామ్మ, ఆమె తల్లి గారు, పెనిమిటి వొదిలిపెట్టిన ఒక మేనత్త, ఇద్దరు జీతగాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు ఇంతమందికి మా అమ్మే వండి వార్చేది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పొద్దుపోయేవరకు నడుం వాల్చే వీలు వుండేది కాదు. దీనికి తోడు నిప్పులు కడిగే ఆచారం మా బామ్మది. వూరి పొలిమేరలో చెరువుకట్ట దగ్గర వున్న మంచినీళ్ళ బావినుంచి తడి చీరెకట్టుకుని బిందెలతో నీళ్ళు పట్టుకురావడంతో మా అమ్మ డ్యూటీ మొదలయ్యేది. మైలకు పనికొచ్చే నీళ్ళు ఆడపిల్లలు తీసుకువచ్చేవాళ్ళు.
మా ఇంటి వెనుక ఉసిగె వాగు. దాన్ని ఆనుకుని శివాలయం. అందులోనే హనుమంతుడి గుడి. పక్కనే పూడిపోయిన కోనేరు. దాని వెనుక లక్ష్మయ్య తాతయ్య పొలాలు. దాన్ని ఆనుకుని మా అప్ప పొలం నల్లగడ్డ. దానిపక్కనే తుమ్మల వాగు. ఆ వాగు దాటుకుని వెడితే సుబ్బయ్య తాతయ్య గరప చేను. అందులో స్వాములవారి ఆశ్రమం. శివుడి గుడి. అందులో కాశీ నుంచి తెచ్చి స్వాములవారు ప్రతిష్టించిన శివలింగం.
ఇంట్లో పెద్దవాళ్ళు నా చిన్నతనంలో చెప్పుకునే మాటలు  ఒకటీ అరా అలా గుర్తుండి పోయాయి. పెద్దక్కయ్యలు రాధక్కయ్య, శారదక్కయ్య హిందీ నేర్చుకోవడానికి వూరి పొలిమేరల్లో వున్న స్వామి గారి ఆశ్రమానికి వెళ్ళేవాళ్లు. చిన్నక్కయ్యలు సరస్వతక్కయ్య, అన్నపూర్ణక్కయ్య  బామ్మతో తోటకు వెళ్ళి కూరలు కోసుకువచ్చేవాళ్ళు.  శివరాజు నాగభూషణం గారి అరుగు బడిలోనే అందరి చదువులు. ఆయన పొద్దున్నే లేచి, స్నానాదులు ముగించుకుని –
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా|
అంటూ కంచుకంఠంతో కృష్ణ శతకం వూరంతటికీ వినబడేటట్టు ఎలుగెత్తి చదివేవారు.
అదే మా  క్లాసు బెల్లు.
(ఇంకా వుంది)