9, ఆగస్టు 2017, బుధవారం

బాల్యం నుంచి బాధ్యతల చివరంచుల దాకా ...... (5) -


ఆడ వాళ్ళ ప్రయాణాలకి మా ఇంట్లో ఒక మేనా వుండేది.  నేను హైస్కూలు చదువు చదివే రోజుల్లో కూడా ఇంటి మధ్య హాల్లో ఆ మేనాను మోకులు కట్టి పైన రెండు దూలాల మధ్య వేలాడదీసి ఉంచేవాళ్ళు. దాన్ని మోయడానికి ఆరుగురు బోయీలు. పరిస్తితుల ప్రాబల్యం వల్ల మేనా వైభోగం అటక ఎక్కింది. ఆ  తరువాత చాలా కాలం వరకూ  పంటలు రాగానే వాళ్లకు ‘మేర’ (ధాన్యం వాటా) ఇవ్వడం కూడా నాకు గుర్తుంది. మేనా రోజులు అయిపోయిన తరువాత ఇంట్లో ఆడవాళ్ళు ఊళ్లకు పోవడానికి గుడిసె బండ్లు కట్టేవాళ్ళు. ఒక్క మగవాళ్ళ ప్రయాణాలకే అయితే గుడిసె కట్టకుండా కేవలం జల్ల బండ్లు మాత్రమే కట్టేవాళ్ళు. మా ఇంట్లో రాముడు భీముడు అని ఒక ఎడ్ల జత వుండేది. కాడి మెడ మీద పడగానే వాటికి ఎక్కడ లేని హుషారు. అవి లాగే బండి ఎక్కడానికి మేము పోటీలు పడేవాళ్ళం. బండి తొట్లో కూర్చుని, తోకలు మెలిపెడుతూ, చర్నాకోలతో ఎడ్లను అదిలిస్తుంటే అవి పరుగు మొదలు పెట్టేవి. వాటి మెడపట్టెలలో గంటలు మోగుతుంటే అదో తమాషాగా అనిపించేది. బండి నడిపే మనిషి వాటితో ఏవేవో మాట్లాడుతుండేవాడు. ఆ భాష వాటికి అర్ధం అవుతున్నట్టే అనిపించేది. ఒక ఈడు వచ్చిన తరువాత మేము రైలుకు పోవాలంటే మోటమర్రికి, బస్సు ఎక్కాలంటే పెనుగంచిప్రోలుకు మూడు, నాలుగు మైళ్ళు నడిచే వెళ్ళే వాళ్ళం. అలాగే పొరుగూరు వత్సవాయి టూరింగు టాకీసులో సినిమా చూడడానికి కూడా చాలామందిమి కలిసి కాళ్ళకు పనిచేప్పేవాళ్ళం. ఆ సినిమాల్లో రెండు మూడు ఇంటర్వెల్స్ ఉండేవి. పైన డేరా చిరుగులు పడి ఆకాశం కనిపిస్తూ వుండేది. హాలు బైట పెట్టిన మైకు మాత్రం గట్టిగా పనిచేసేది. సినిమాకు ముందు వేసే ‘నమో వెంకటేశా పాటలు చాలా దూరం వినిపించేవి. అవి వినపడడం లేదు అంటే సినిమా మొదలు పెట్టారని అర్ధం.
పొద్దున్నే చద్దన్నం మరో సుమధుర జ్ఞాపకం.
ఇంట్లో పదిమంది పిల్లలం కాక మరో పదిహేనుమంది దాకా పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. అంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకురావడం మా తాతగారికి అలవిమాలిన పని. ప్రతిపూటా కూరా నారా అంటే కుదరని పని. అందుకే, పిల్లలందరికీ పొద్దున్నే చద్దన్నం పెట్టేవాళ్ళు. అదే మా బ్రేక్ ఫాస్ట్. రాత్రిళ్ళు తినగా  మిగిలిన అన్నంలో ఆవకాయ కలిపి, పిల్లలందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని, ఒకరి తరవాత మరొకరికి వొంతులవారీగా ముద్దలు తినిపించేవాళ్ళు. పిల్లలకు విడిగా అన్నం పళ్ళాలు వుండేవి కాదు. పెరుగన్నంతో పిల్లల కడుపునిండి పోయేది.
పొద్దుటిపూట పెద్దవాళ్లకయితే జాంబెడు (పెద్ద గ్లాసు) కాఫీ లేదా చెంబెడు తేట మజ్జిగ.
ఇంటి వెనుకనే శివాలయం.
కార్తీక మాసం నెల రోజులూ  చీకటి పడుతుండగానే గుడి ఆవరణలోవున్న ధ్వజస్తంభానికి ఆకాశదీపం వేలాడదీసేవాళ్ళు.  ఆకాశదీపం అంటే  – చిన్న చిన్న కంతలు కలిగిన మూత వుండే ఒక రకం దీపం. లోపల ప్రమిదెలోనూనె పోసి  వొత్తి  వెలిగించి దానిని ఈ ఆకాశదీపంలో వుంచేవారు. చీకట్లో అంత ఎత్తున  ధ్వజస్తంభం నుంచి వేలాడుతూ - చిరు కాంతులు వెదజల్లుతూ మా పిల్లలందరికీ అది నిజంగా  ఆకాశంలో వెలిగే దీపంలాగానే అనిపించేది.

పొరుగున పెనుగంచి ప్రోలులో తిరుపతమ్మ తిరుణాల జరుగుతుంటే ఆ సంబరం ఛాయలు మా వూళ్ళో కనిపించేవి. రంగు కాగితాలతో రకరకాల ప్రభలు తయారు చేసి వాటిని బండ్లపై అమర్చేవారు. వాటికి కట్టే ఎడ్లను కూడా అందంగా అలంకరించేవారు. వాటిపై బుక్కా గులాములు చల్లేవాళ్ళు. మేళ తాళాలతో ఊరేగిస్తూ ప్రభలను పెనుగంచి ప్రోలు తీసుకువెళ్ళి ఏటి ఒడ్డున వున్న తిరుపతమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించేవాళ్ళు. మొక్కుబళ్ళు తీర్చేవాళ్ళు. గుడి పక్కన ఎత్తైన  పెద్ద ఇనుప ప్రభ వుంది. కరెంటు రాకముందు ఆ ప్రభను ఊళ్ళో తిప్పేవారట. తీగెలు అడ్డం వస్తాయని ఆ ప్రభను కదలకుండా గుడి పక్కనే వుంచేసారు.  తిరుపతమ్మకు ఏటా రెండు తిరుణాళ్ళు జరిగేవి. ఒకటి పెద్ద తిరుణాల. రెండోది చిన్న తిరుణాల. అదేమి చిత్రమో పెద్ద తిరుణాల జరిగిన సంగతే ఎవరికీ తెలిసేది కాదు. అదే చిన్న తిరుణాల చాలా అట్టహాసంగా జరిగేది. వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలియదు. చిన్న తిరుణాల జరిగినన్నాళ్ళు చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పండగ వాతావరణమే. పెనుగంచి ప్రోలు మీద జనం ఎగబడేవారు. ఊరుమీద ఊరు పడ్డట్టు వుండేది. ఆ వూళ్ళో మా బావగారి ఇల్లు తిరుణాలకు వచ్చిన చుట్టపక్కాలతో నిండి పోయేది. తిరుణాల లేని రోజుల్లో ఏడాది పొడుగునా ఆ దేవాలయ ప్రదేశం నిర్మానుష్యంగా వుండేది. అలాటిది గత కొన్నేళ్లుగా ఆ గుడి ప్రభలు జగజ్జేయమానంగా వెలిగిపోతున్నాయి. అక్కడ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. మొన్నీ మధ్య మా మేనల్లుడు రామచంద్రం ఆ వూరు వెళ్లి వచ్చి చెప్పాడు, ‘వెనక ఏడాదికి రెండు తిరుణాళ్ళే. ఇప్పుడు ఏడాది పొడుగునా రోజూ తిరుణాళ్ళే’ అని. ఇతర జిల్లాలనుంచి కూడా ఆ వూరికి  ప్రతి రోజూ అనేక ట్రిప్పులు బస్సులు నడుస్తున్నాయి. మేము చదువు కునే రోజుల్లో బెజవాడ నుంచి పొద్దున్న ఒకటి (ఫస్ట్ బస్ అనే వాళ్ళు), సాయంత్రం ఒకటి (నైట్ హాల్ట్ బస్ అనేవాళ్ళు) బెజవాడ నుంచి వచ్చి పోయేవి. సాయంత్రం వచ్చిన బస్సు అక్కడే వుండిపోయేది. డ్రైవరు, కండక్టర్ కూడా అక్కడే నిద్ర చేసే వాళ్ళు. మళ్ళీ పొద్దున్నే ఫస్ట్ బస్  లో బెజవాడ వెళ్ళే వాళ్ళు. బస్సు బయలుదేరేటప్పుడు గట్టిగా హారన్  మోగించేవాళ్ళు. అది వింటూనే  ప్రయాణాలపై వెళ్ళేవాళ్ళు హడావిడిగా ఇళ్ళ నుంచి  సామాన్లు మోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కేవాళ్ళు. డ్రైవర్ పక్కన ఒక సీటు వుండేది. దాన్ని ఫ్రంట్ సీటు అనేవాళ్ళు. మునసబు, కరణాలకు, పోలీసులకు ఆ సీటు ప్రత్యేకం. బస్సులో ఖాళీ లేకపోయినా, నిల్చుని ప్రయాణం చేసేవాళ్ళు కాని వేరే వాళ్ళు అందులో కూర్చునే వాళ్ళు కాదు. బెజవాడకు టిక్కెట్టు రూపాయి వుండేది. పిల్లలకు అర  టిక్కెట్టు కొట్టించడానికి పెద్దవాళ్ళు నానా ప్రయాస పడేవాళ్ళు. వయసు తక్కువ చెప్పేవాళ్ళు. కండక్టర్ గట్టివాడయితే సీటు పక్కన నిలబెట్టించి పొడుగ్గా వుంటే పూర్తి టిక్కెట్టు కొట్టేవాడు. ఆ లడాయి నందిగామ చేరేదాకా సద్దుమణిగేది కాదు. (ఇంకా వుంది)     

కామెంట్‌లు లేవు: