12, జూన్ 2016, ఆదివారం

నాహం కర్తా, హరి: కర్తా


గతంలో టీటీడీ ఈవో గా, ప్రధానమంత్రి పీవీ గారికి సమాచార సలహాదారుగా పనిచేసిన పీవీఆర్ కే ప్రసాద్ గారు తమ తిరుపతి అనుభవాలపై రాసిన గ్రంధం ఇది. తిరుపతి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరూ తమకు చక్కటి దైవ దర్శనం లభించిందని తమ చుట్టపక్కాలతో చెబుతుంటారు. అయితే ఎవరికి ఎలాంటి దర్శన భాగ్యం ఇవ్వాలో స్వామే నిర్ణయిస్తారని, ఎవరు ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా చివరికి స్వామి నిర్ణయమే చెల్లుబాటు అవుతుందనీ ప్రసాద్ గారు ఈ పుస్తకంలో అనేక ప్రమాణాలు చూపించారు.
అది నిజమే అనిపించింది, తన అరవయ్యవ పెళ్లి రోజున స్వామి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుపతి వెళ్ళివచ్చిన మా అన్నయ్య భండారు రామచంద్రరావు  చెప్పిన అనుభవాలు వింటుంటే.  మా అన్నగారి మాటల్లోనే ఆ కధనం విందా.
“నా అరవయ్యవ పెళ్లిరోజు జూన్ పదో తేదీ. ఆ రోజున తిరుమలలో స్వామి వారి  దర్శనం చేసుకోవాలని నా ప్రగాఢ వాంఛ. అందుకని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చాలా  ముందుగా చేసుకున్నాను. మాది పెద్ద కుటుంబం. నలుగురు పిల్లలు, నలుగురు కోడళ్ళు, మనుమడు, మనుమరాళ్ళు. హైదరాబాదులో ఉంటున్న పిల్లలే కాకుండా అమెరికాలో ఉంటున్న మా చిన్న కొడుకు కూడా భార్యా పిల్లలతో ఈ సందర్భంకోసం వచ్చారు.  మూడు నెలల క్రితమే రైలు టిక్కెట్లు, తిరుమలలో కాటేజీలు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నాము. సిఫారసులు చేయించుకోలేని అనేకమంది యాత్రీకులకి ఈ ఆన్ లైన్  బుకింగులు ఓ వరప్రసాదం అనే చెప్పాలి. పదో తేదీ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లు పదహారు మేము ఈ విధంగానే కొనుక్కోగాలిగాము.
ముందు అనుకున్న విధంగానే మేము రైల్లో బయలుదేరి పదో తేదీ ఉదయానికి తిరుపతి చేరుకున్నాము. స్టేషన్ బయటకు వచ్చి మేము కొండకు పోవడానికి కార్లు  ఎక్కుతున్న సమయంలో నా జేబులో సెల్ ఫోన్ మోగింది. తీసి చూద్దును కదా, టీటీడీ జేయీవో ఆఫీసునుంచి. పదకొండో తేదీ ఉదయం మా దంపతులు ఇరువురికీ బ్రేక్ దర్శన్ టిక్కెట్లు ఎలాట్ చేసినట్టు అవతలనుంచి  ఓ ఉద్యోగి చెప్పాడు. కలా, నిజమా అని ఆశ్చర్యపోతుంటే అతడు ఇంకో విషయం చెప్పాడు. మా మేనకోడలి భర్త  జ్వాలా నరసింహారావు రిఫరెన్సుతో బ్రేక్ దర్శన్ ఏర్పాటయిందన్నది అతడి మాటల్లో నాకు అర్ధం అయింది. బహుశా మా పెళ్లిరోజు కానుకగా  ఆయన హైదరాబాదునుంచి ఈ ఏర్పాటు చేసివుంటాడు. నిజం చెప్పాలంటే ఈ సందర్భానికి ఇంతకు  మించిన బహుమతి ఏముంటుంది. అందులో పొద్దున్న పేపరు చూస్తె తిరుమల కొండ భక్తులతో నిండిపోయిందనీ, క్యూ లైన్లు వైకుంఠం కాంప్లెక్స్ అవతల కిలోమీటర్ల మేర దాటిపోతున్నాయనీ వార్తలు. అంతే కాకుండా సహస్ర కలశాభిషేకం కారణంగా పదకొండు ఉదయం బ్రేక్ దర్శన్ రద్దు చేసారని కూడా రాసారు. ఈ నేపధ్యంలో ఈ ఫోను. ఇది జరగడానికి కారణం నాకోసం జ్వాలా చేసిన ప్రయత్నమే, అందులో సందేహం లేదు. అందుకే జేఈవో ఆఫీసువాళ్ళు కూడా ఆయన పేరే చెప్పారు. జ్వాలాకు  వెంటనే ఫోను చేసాను. అయన అన్నాడు, మానవ ప్రయత్నాలు మనం ఎన్ని చేసినా చివరికి దర్శనం అనుగ్రహించడం అనేది ఆ స్వామి చేతుల్లోనే ఉంటుందన్నాడు.
ఏదిఏమైనా  బ్రేక్ దర్సనం టిక్కెట్లు జారీ చేయడం నిలిపివేసిన రోజున అవి దొరకడం  ఒక అద్భుతమే. జ్వాలా అన్నట్టు అది స్వామి దయే!
దేవుడు వరం అనుగ్రహించేముందు కొన్ని  పరీక్షలు పెడతారంటారు. అదే జరిగింది. ఉత్త పరీక్ష అయితే పరవాలేదు, ఏకంగా విషమ పరీక్షే పెట్టాడు.
బ్రేక్ దర్శన్ కోసం దంపతులం ఉభయులం పదకొండో తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకల్లా వైకుంఠం కాంప్లెక్స్ వద్ద వుండాలి. మేమున్న కాటేజీ అక్కడికి దగ్గరే, కాబట్టి ఆ టైముకల్లా తేలిగ్గా చేరుకోవచ్చు. ఆ ధిలాసాతో బయలుదేరిన మాకు దోవలోనే పెద్ద అవాంతరం ఎదురయింది. దోవదోవంతా యాత్రీకులే. కారు కదలడానికి వీల్లేకుండా రోడ్డంతా భక్త జన సందోహమే. నేను అనేక సార్లు తిరుపతి వెళ్లాను కానీ, కొండ మీద అంత పెద్ద సంఖ్యలో యాత్రీకులను చూసిన జ్ఞాపకం లేదు. ఒక పక్క టైం దగ్గర పడుతోంది. మరో పక్క మేము ఎక్కిన కారు ముందుకు కదిలే పరిస్తితి లేదు. ఎట్లాగో కాంప్లెక్స్ చేరుకునే సరికి పుణ్యకాలం కాస్తా అయిపోయింది. ఎనిమిదిన్నర కావడంతో గేటుకు తాళం వేసారు. అనుకోని దర్శన భాగ్యం బ్రేక్ టిక్కెట్ల వల్ల దొరికినట్టే దొరికి చేజారి పోవడంతో నీరసపడిపోయాము. అక్కడి టీటీడీ సిబ్బందిని ప్రాధేయ పడ్డాను. ఈరోజు మా పెళ్లి రోజనీ, బ్రేక్ టిక్కెట్లు చేతిలో వున్నా వెళ్ళలేకపోతున్నామనీ వివరించాను. అయినా ఫలితం కనబడలేదు. సర్వ దర్శనం క్యూ ఒదిలారనీ, ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదనీ వారు తమ నిస్సహాయత వ్యక్తం చేసారు. అయితే,  బ్రేక్ దర్శన్ అవకాశం వుండికూడా అది వాడుకోలేని మా అసహాయత వారిని కరిగించింది. మమ్మల్ని సర్వ దర్శనం క్యూలో ఒదలడానికి ఒప్పుకున్నారు. సరే అని అందులో కలిసాము. ఇక అక్కడి పాట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ తోపులాటలోనే గర్భగుడిలో ప్రవేసించాము. అక్కడి వారిని మళ్ళీ చేతులు పట్టుకుని అడిగాను, కొద్దిలో మాకు బ్రేక్ దర్శన్ భాగ్యం చేజారి పోయిందని. కానీ వారికెవ్వరికీ మా గోడు పట్టించుకునే తీరికలేదు. అలాగే స్వామివారిని లఘు దర్శనం చేసుకుని బయటపడ్డాము.
విచారవదనాలతో వున్న  మమ్మల్ని ఓ టీటీడీ  ఉద్యోగిని గమనించింది. వివరం అడిగింది. కధంతా చెప్పాను. ఆవిడ జాలిపడి గుడిలోపల వున్న  సూపర్నెంటు వద్దకు తీసుకు వెడతాను, తరువాత మీ  అదృష్టం అంది.  అన్నట్టే తీసుకు వెళ్ళింది. లోపలకు వెళ్ళిన తరువాత ఆ పెద్దాయనతో విషయం చెప్పాను. ఈ రోజు మా అరవయ్యవ పెళ్లి రోజనీ, బ్రేక్ టిక్కెట్లు ఉపయోగ పడలేదనీ చెప్పాను. ఆ మహానుభావుడు  ఏ కళన ఉన్నాడో కాని నా గోడు విన్నాడు. అదే స్వామి మహత్యం అంటే. అంతకు ముందు అరడజను మందిని కలిసి వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈయన మమ్మల్ని ఇద్దర్నీ వెంటబెట్టుకుని మళ్ళీ గర్భ గుడిలోకి తీసుకు వెళ్ళాడు. తీసుకు వెళ్లి  స్వామి ఎదుట నిలబెట్టి దర్శనం చేయించాడు. మీ ప్రార్ధన మీరు చేసుకోండి అని మమ్మల్ని అక్కడ ఒదిలేసాడు. హడావిడి పెట్టి మమ్మల్ని పొమ్మనలేదు. గుడి ద్వారం గడప అవతల అభయ హస్తం చూపిస్తూ స్వామివారు.  ఇవతల అటువంటి  అద్భుత దర్శనానికి వీలుకల్పించిన ఆ  అధికారి.  ఇన్నిరోజులుగా మంచి దర్శనం అనుగ్రహించమని మేము చేస్తున్న ప్రార్ధనలను స్వామి  ఆలకించారు. ఈ అధికారి రూపంలో వచ్చి మాకు  ఆ అవకాశం కల్పించారు. దైవం మానుష రూపేణ అన్నారు, అందుకే..
పీవీఆర్ కే గారు  చెప్పింది అక్షర సత్యం.

నాహం కర్తా, హరి:కర్తా...... “  






అమెరికా సమారాధన


నడిపేది నడిపించేది కవిత్వమైతే, నలుగుర్నీ  కలిపేది కలిపించేది, ఐతే జ్వాలా  లేదా రవి. ఈ ఇద్దరూ నా మేనకోడళ్ళను పెళ్ళాడిన వాళ్ళే.

ఇంజినీర్ జీవీఆర్  రవి, ఆయన భార్య నా మేనకోడలు విజయ కుటుంబ సమేతంగా అంటే కొడుకూ కోడలు, కూతురు, అల్లుడు సహా అమెరికా యాత్ర చేసివచ్చారు. కాశీ సమారాధన మాదిరిగా తెలిసిన నలుగుర్నీ, (నలుగురు అనేది ఏదో మాటవరసకు అన్నది, అసలు వచ్చినవాళ్ళు నలభయ్ పై మాటే)పిలిచి  రాత్రి వాళ్ళింట్లో టెర్రేస్ మీద  బ్రహ్మాండమయిన విందు ఇచ్చారు. కొత్తగా రాజ్యసభ సభ్యులు అయిన కెప్టెన్ లక్ష్మీ కాంత రావు, ఆయన భార్య శ్రీమతి సరోజిని ముఖ్య అతిధులు. ఇంకా అతిరధులు మాజీ  ఎంపీ పీవీ రాజేశ్వర రావు, తెలంగాణా  జెన్  కో  చైర్మన్ దేవులపల్లి ప్రభాకర రావు, మాజీ ఐజీ, ఏపీ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ రావులపాటి సీతారామారావు (మరో మేనకోడలు శారద భర్త), ప్రముఖ ఆడిటర్ ఎస్ వీ రావు, తెలంగాణా ముఖ్యమంత్రి సీపీఆర్ఓ వనం జ్వాలా నరసింహారావు( మరో మేనకోడలు విజయలక్ష్మి భర్త) ఇంకా అనేకమంది మహారధులు ఈ విందుకు హాజరయిన వారిలో వున్నారు.   

      


(PHOTO COURTESY KARTIK)

11, జూన్ 2016, శనివారం

2005 తానా సభలు – ఓ జ్ఞాపకం



2005 జులై మొదటి వారంలో అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో తానా సభలు జరిగాయి. ఆ రోజుల్లో దూరదర్శన్ లో పనిచేస్తున్ననేను, నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ సభలకు హాజరయ్యాను.  అక్కడినుంచి దూరదర్శన్  వార్తలకోసం పంపిన కొంత సమాచారం పాత కాగితాలు వెతుకుతుంటే కనిపించింది.  అదే ఇది.
“మోటారు వాహనాల పరిశ్రమకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెరికన్  నగరం డెట్రాయిట్  లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం , తానా  ద్వైవార్షిక సభలు ఘనంగా మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, పీసీసీ అధక్షుడు కే. కేశవరావు, రాష్ట్ర మంత్రులు నేదురుమల్లి  రాజ్యలక్ష్మి, నాయని నరసింహారెడ్డి, పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, వీ.హనుమంత రావు, వై.ఎస్.వివేకానంద రెడ్డి, మధుయాష్కీ, శాసన సభ్యులు ఎర్రబల్లి దయాకరరావు, నాగం జనార్ధనరెడ్డి  ప్రభ్రుతులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ వేడుకలకుహాజరయ్యారు. అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగువారు సుమారు ఎనిమిది వేలమంది  మూడురోజులపాటు జరిగే ఈ సభలకు తరలివచ్చారు.


“డెట్రాయిట్  మాజీ  మేయర్ , కీర్తిశేషులు  ఆల్బర్ట్ కోబో పేరిట నిర్మించిన సువిశాల సభామందిరంలో తానా సభలు మొదలయ్యాయి. 1960 లో  ఈ  ప్రాంగణాన్ని మొత్తం ఇరవై నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో ప్రదర్శనలు, సదస్సులు సమావేశాలు నిర్వహించుకోవడానికి  సుమారు ఏడులక్షల ఇరవై మూడువేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన  మందిరాలు  సకల వసతులతో  కొలువై వున్నాయి. 




ఆహూతులుగా వచ్చిన పలువురు తెలుగు సినీ కళాకారులు సమర్పించిన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా సభికులను ఆకట్టుకున్నాయి. రాజకీయాల్లో విలువలు,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటిపారుదల రంగాలపై ప్రత్యేక  గోష్టులను  తానా సభల్లో  భాగంగా నిర్వహించారు. అంశం ఏదైనప్పటికీ చర్చ తెలంగాణా వైపుగానే సాగడం విశేషం. ప్రసంగించిన వక్తలు ప్రధాన అంశాన్ని పక్కనబెట్టి, తమదయిన రాజకీయ కోణంతో చర్చను మళ్ళించాలని ప్రయత్నించినప్పుడల్లా, వారిని చర్చనీయాంశం వైపు తిప్పుకు రావడానికి సదస్సుకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ ఐ. వెంకట్రావ్  చాలా శ్రమ పడాల్సి వచ్చింది. హాజరయిన ప్రేక్షకుల ప్రతిస్పందనను గమనిస్తే, వారిలో అధికులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వున్నట్టు కానవచ్చింది.
“తానా సభలను పురస్కరించుకుని కొందరు తెలుగు ప్రముఖులను సన్మానించారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ మాజీ  వైస్  చాన్సలర్ భద్రిరాజు కృష్ణమూర్తిని గిడుగు రామమూర్తి స్మారక పురస్కారంతో గౌరవించారు. సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు,ప్రసిద్ధ పరిశోధకులు డాక్టర్ సి.ఆర్. రావు, పత్రికా సంపాదకుడు వ్మూరి బలరాం పురస్కార గ్రహీతల్లో వున్నారు.
“తానా ప్రస్తుత అధ్యక్షులు గొర్రెపాటి నవనీత కృష్ణ నుంచి కొత్తగా ఎన్నికయిన బండ్ల హనుమయ్య తానా నూతనాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలోని పలు నగరాల్లో హోటల్ పరిశ్రమను విస్తరించడం ద్వారా ప్రసిద్దికెక్కిన కోమటి జయరాం తానా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అట్లూరి సుబ్బారావు తానా మహాసభల సంధానకర్తగా వ్యవహరించారు.

“విదేశీ గడ్డపై నివసిస్తూ తెలుగు  సంస్కృతికి  దూరంగా ఉంటున్నప్పటికీ దాన్ని కాపాడుకోవాలనే  వారి తపన మెచ్చదగింది. అయితే  పెళ్లి సంబంధాలకోసం, వైభవ ప్రదర్శన కోసం కొందరు ఈ వేదికలను దుర్వినియోగం చేస్తున్నారనే అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది” (జులై, 2005)                 

10, జూన్ 2016, శుక్రవారం

చర్చించి వగచిన ఏమిఫలము?

ఈ మధ్య మా పక్క వాటా లోకి తెలుగు వచ్చీ రాని పొరుగు రాష్ట్ర కుటుంబం ఒకటి అద్దెకు దిగింది. వచ్చిన దగ్గరనుంచి వాళ్ళను ఒక సందేహం పీడిస్తున్నట్టుగా ఇటీవలే అర్ధం అయింది. మా ఇంట్లో వుండేది నేనూ మా ఆవిడా ఇద్దరమే. పిల్లలిద్దరూ వేరే వూళ్లలో కాపురాలు వుంటున్నారు. అటువంటప్పుడు ‘ఉదయం నుంచి రాత్రిదాకా అరుపులు, కేకలు వినవస్తాయేమిట’ని పొరుగింటావిడ, మా ఇంటావిడని అంటే మా ఆవిడని ఆరా తీసింది. అదంతా టీవీ ఛానళ్ళలో వస్తుండే చర్చలలోని రచ్చని తెలుసుకుని ఆశ్చర్య పోవడం పొరుగావిడ వంతయింది.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఉద్యోగి వుంటారు. మామూలుగా డ్యూటీ ఆఫీసర్ అని పిలిచే ఆ ఉద్యోగి డ్యూటీ ఏమిటంటే – రేడియోలో ప్రసారం అయ్యే లేదా దూరదర్శన్ లో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రాములను ఆమూలాగ్రం శ్రద్ధగా విని, చూసి - తప్పొప్పులను పట్టుకుని, మంచి చెడులను గమనించి ఏరోజుకారోజు పై అధికారులకు రిపోర్ట్ చేయడం. రేడియో వినడానికి ప్రత్యేకంగా ఉద్యోగి అవసరమేమిటని కొందరు అడిగేవారు కూడా. బహుశా అలాటి ఏర్పాటు – ఈనాటి ప్రైవేటు ఛానళ్లలో లేకపోబట్టే ఇలాటి ‘చర్చలు’ రచ్చరచ్చగా తయారవుతున్నాయేమో!
ఇటీవల ఒక ఛానల్లో చర్చలో పాల్గొంటున్న ఇద్దరి మధ్య ఆవేశకావేశాలు పెచ్చరిల్లాయి. మాటల తూటాలు పేలాయి. అసభ్య పదజాలాలు జాలువారాయి. ఏతావాతా ఆ మహత్తర దృశ్యాలను పన్నుకట్టకుండా చూసి వినోదించగల అవకాశం వీక్షకులకు లభించింది. కాకపోతే, భాష కారణంగా విషయం అర్ధం కాని మా పొరుగింటావిడ లాంటి వాళ్ళు – పక్కింట్లో యేవో గొడవలు జరుగుతున్నాయని అపోహపడే దుస్తితి దాపురించడం దీనికి పరాకాష్ట.
ఈ మధ్య ఓ శుభకార్యం లో తారసపడిన ఓ పెద్దమనిషి అడిగాడు ‘ఎందుకండీ ఇలా ఛానళ్ళ వాళ్ళు ‘ఉప్పూ నిప్పూ లాటి మనుషులను చర్చలకు పిలుస్తారు?’ అని. సుతీ మతీ కుదరని ఇలాటివాళ్ళ వల్ల చర్చ పక్కదారి పడుతుందన్నది ఆ పెద్దమనిషి ఉద్దేశ్యం.
అసలే చిటపటలు. వీటికి ఆజ్యం పోయడానికి తయారుగా ఫోన్ ఇన్ లో మరికొందరు సిద్ధంగా వుంటారు. వీరందరినీ సర్డుబాటు చేయడానికీ, సముదాయించడానికీ యాంఖర్ సతమతమవుతుంటాడు. వాద ప్రతివాదాలు ముదిరి, ఖండన ముండనలుగా మారి, దుమ్మెత్తి పోసుకోవడాల్లోకి దిగి, వీధి కొళాయిల వద్ద తంతుని డ్రాయింగ్ రూముల్లో చూసే భాగ్యం వీక్షకులకు దొరుకుతోందని మరి కొందరి ఉవాచ.
‘ఇది ఇంతేనా? అంటే - ఇప్పటికింతే!’ అనుకోవాలి.
మెరుగయిన సమాజ నిర్మాణాలు స్క్రోలింగ్ లకే పరిమితమై పోయి, రేటింగులే ప్రధానమనుకున్నప్పుడు - ఇది ఇంతే!
ఎన్ని ఛానల్స్ వచ్చినా, వాటి నిర్వాహకులు యెంత లబ్ధ ప్రతిష్టులయినా – ఇది ఇంతే!
ఈ పోటా పోటీ ‘పోటీ యుగం’లో పోటీ తప్పనిసరి. పాట్లూ తప్పనిసరి. బోధి వృక్షాలు కూడా జ్ఞానోదయం కలిగించలేని విషమ పరిస్తితి. తప్పని సరి అనుకున్నప్పుడు ఆనందించమన్న సామెత మాదిరిగా చూసి తరించడమే వీక్షకులకు మిగిలింది.
‘చర్చించి వగచిన ఏమి ఫలము?’
(Still I feel proud to be called as a media person)


9, జూన్ 2016, గురువారం

భద్రతా ఏర్పాట్లు - సామాన్యుల అగచాట్లు

సూటిగా...సుతిమెత్తగా.......
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 12-06-2016, SUNDAY)
  
అమెరికా  మాజీ అధ్యక్షుడు అబ్రహంలింకన్ ఒక చక్కని మాట చెప్పారు.
“ఒక మంచి వాడిని, సద్గుణ సంపన్నుడిని ఎంపిక చేసుకోండి. అతడికి అధికారం ఇచ్చి చూడండి, ఇక అతడెలా మారిపోతాడన్నది మీరే చూస్తారు.”
చాలామందికి అర్ధం కానిది ఇదే. అధికారంలో లేని సమయంలో ఎలాంటి బందోబస్తూ లేకుండా ప్రజల నడుమ అరమరికలు లేకుండా స్వేచ్చగా తిరిగిన రాజకీయ నాయకులు, పదవిలోకి రాగానే చుట్టూ భద్రతా వలయాలు నిర్మించుకుని ప్రజలకు ఎందుకు దూరం అవుతారన్నదే జవాబు లేని ప్రశ్న.
నరేంద్ర మోడీ భారత ప్రధానుల్లో ఎంచదగిన వ్యక్తి. ఒక అతి సాధారణ కుటుంబం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన మనిషి. ప్రతి  సామాన్య పౌరుడు తనలో ఆయన్ని చూసుకుంటారని ప్రతీతి.
ఆయన ఆ పదవిలోకి వచ్చిన తరువాత సెక్యూరిటీ పేరుతొ ప్రజలకు దూరం అవుతున్నారా అనిపిస్తోంది. అది ఆయన తప్పు కాదు. ఒక్కసారి ప్రధాని పీఠం ఎక్కిన తరువాత భద్రతా వ్యవస్థ అధీనంలోకి  వెళ్లిపోవాల్సిందే. ఆ పదవి అలాంటిది.


బహుశా తన చుట్టూ ఇంతటి స్థాయిలో భద్రత వుందని ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఢిల్లీ లోని ఒక సాధారణ పోలీసు జవాను చెప్పేదాకా నిజానికి  మోడీకి కూడా ఈ విషయం తెలవదు. ఈ వివరం తెలుసుకోవడానికి ఒక ఏడాది వెనక్కి పోవాలి.
నిరుడు అక్టోబర్  రెండో తేదీ, గాంధీ జయంతి రోజున  దేశ వ్యాప్తంగా స్వచ్చ భారత్ కార్యక్రమం ప్రారంభమయినప్పుడు, ప్రధాని మోడీ, ఢిల్లీలో  అపరిశుభ్రంగా వున్న ఒక పోలీసు స్టేషన్ ప్రాంగణాన్ని గమనించారు. అక్కడి పోలీసు జవానుతో నేరుగా ఆయన ఆ విషయం ప్రస్తావించారు. రోజూ కాసేపు  శ్రమ దానం చేసి, పరిసరాలను శుభ్రం చేసుకోవచ్చు కదా అన్నది మోడీ  మహాశయుల సూచన.
దానికి ఆ  పోలీసు ఇచ్చిన సమాధానంతో మోడీ గారికి తన చుట్టూ అల్లుకుకుని వున్న భద్రతావలయం గురించీ, తన భద్రత పేరుతొ సామాన్యులు పడుతున్న ఇబ్బందుల గురించీ తెలిసివచ్చింది.  ఇంతకీ  ఆ పోలీసు చెప్పింది ఏమిటంటే...
‘అయ్యా మీరు చెప్పేది నిజమే. కానీ, మా పోలీసుల్లో ఎక్కువమందికి, వీ.వీ.ఐ.పీ.ల భద్రత కనిపెట్టి చూడ్డంతోనే పుణ్యకాలం సరిపోతోంది. మీరు చెప్పిన పని చేయడానికి పోలీసు స్టేషన్లలో ఎవరూ మిగలడం లేదు’
ప్రధాని తిరిగి తన కార్యాలయం చేరుకున్న వెంటనే చేసిన మొదటి పని, తన భద్రతా ఏర్పాట్లను గురించి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించడం, భద్రతను అవసరమయిన స్థాయికి తగ్గించాలని గట్టిగా సూచించడం.
అందుకు అనుగుణంగా ప్రధాని కార్యాలయం ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నగర పర్యటనల సమయంలో అన్ని చోట్లా పోలీసులను మొహరించి మొత్తం నగరాన్ని ఒక దుర్భేధ్యమైన కంచుకోటగా మార్చవద్దనీ, అవసరమైన చోట్లనే తగిన  బందోబస్తు ఏర్పాటు చేయాలనీ.
ఉన్నత స్థానాల్లో వున్న వ్యక్తులకు భద్రత కల్పించడం ఆక్షేపణీయం యెంత మాత్రం  కాదు. అయితే  ఆ పేరుతొ చేస్తున్న హడావిడీ, అనవసర వ్యయం గురించి ఎవ్వరూ ప్రశ్నించకూడదు అనడం కూడా సబబు కాదు.
మరో ఉదంతం చెప్పుకోవాలి.
చైనా అధక్షుడు అధికార పర్యటనపై ఢిల్లీ వచ్చారు. ఆయన వెళ్ళే మార్గాలనే కాకుండా చుట్టుపక్కల దారులను కూడా దిగ్బంధించారు. ఆ క్రమంలో పార్కింగ్ చేసివున్న కొన్ని వాహనాలను పోలీసులు క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు.  పార్కింగు చేసి వున్న ఒక కారులోని మహిళను కిందికి దిగే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్రేన్ తో పైకి లేపిన వాహనంలో ఆ మహిళ చిక్కుకు పోయిన సమాచారం బయటకు పొక్కి, పోలీసులను చిక్కుల్లో పడేసింది.


ప్రముఖుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా,  ఏదైనా  జరగరానిది జరిగితే అది సంచలన వార్త అవుతుందని, అంచేత సెక్యూరిటీ విషయంలో తాము చెప్పినట్టు విని తీరాల్సిందే అని భద్రతా విభాగం వారు నొక్కి చెబుతుంటారు. వారు చెప్పేది నిజమే కావచ్చు. మరి వందల కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతున్న ఈ భద్రతా ఏర్పాట్ల విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవచ్చు కదా, తద్వారా  ప్రముఖుల రాకపోకల సందర్భంలో బందోబస్తు పేరుతొ సామాన్యుల రాకపోకలకు కలుగుతున్న ఇబ్బందులను ఓ మేరకు తగ్గించవచ్చు కదా! అనేది  మామూలు మనుషులకు కలిగే సందేహం. ప్రస్తుతం అలా కూడా చేస్తున్నారు. అంగరక్షకుల చేతుల్లో చిన్న సైజు బ్రీఫ్ కేసులు కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇటువంటి పరికరాలే వుంటాయి. అయినా ప్రముఖుల రాకకు ముందు, అది వివాహ వేడుక కావచ్చు,  సాధారణ సమావేశం కావచ్చు  పోలీసు జాగిలాలతో, బాంబులను నిర్వీర్యం చేసే దళాలతో క్షుణ్ణంగా తనిఖీ చేయడం తప్పనిసరి. అలాగే ప్రముఖులు  ప్రయాణం చేసే మార్గాల్లోనే కాకుండా  భద్రతాధికారులు ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ  మార్గాల్లో సయితం వాహనాల కదలికలపై ఆంక్షలు విధించడం కద్దు.  ఇంత శ్రమ పడ్డా, ఇంతటి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలేదు. దరిమిలా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించి వాటిని మరింత పటిష్టం చేయడం ఒక్కటే జరుగుతోంది. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పెరుగుతూనే వస్తోంది.
పొతే, ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత, పటాటోపం, అధికార దర్పం ప్రదర్శించడానికే తప్ప వారి ప్రాణరక్షణకు సరిగా ఉపయోగపడడం లేదన్న అభియోగాలు వున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రముఖుల పేరుతొ కొందరికి కల్పిస్తున్న భద్రత అపహాస్యానికి గురవుతున్న మాటా నిజమే.
ఉదాహరణకు 2014 లో ఒక వ్యక్తికి అసాధారణ భద్రత కల్పించారు. అతడికి ఏర్పాటు చేసింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. అతడికి పహరా కాయడానికి కేంద్ర భద్రతా దళానికి చెందిన పాతికమంది సాయుధ పోలీసులను నియోగించారు. ఇంతకీ ఆ వీ.వీ.ఐ.పీ. వున్నది ఒక ఆసుపత్రిలో చావుబతుకుల నడుమ.  వెంటిలేటర్ల సాయంతో అతగాడి ప్రాణాలను  ఏ క్షణానికి ఆ క్షణం డాక్టర్లు నిలిపి వుంచుతున్న స్తితిలో.  వెంటిలేటర్లు ఎప్పుడు తొలగిస్తే అప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు హరీ అంటాయి.  అయినా  పోలీసు  భద్రతమాత్రం  కొనసాగించారు. ఇది అవసరమా అంటే అవుననే అంటారు అధికారంలో వున్నవాళ్ళు.
రజ్బీర్ సింగ్.  ఎన్ కౌంటర్ స్పెషలిష్టు. ఉగ్రవాదుల ముప్పు కారణంగా అతడికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. దొంగవాడికి మడి బట్టలు అడ్డమా అన్నట్టు అంత సెక్యూరిటీ వున్నా అతడికి ఉగ్రవాదుల చేతుల్లో చావు తప్పలేదు. కేంద్ర మాజీ మంత్రి ప్రమోద్  మహాజన్  ని అతడి సోదరుడే మట్టుబెట్టాడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని  పదవిలో ఉన్నప్పుడే ఆమె వ్యక్తిగత అంగరక్షకులు కాల్చి చంపారు.
ఈ సందర్భంలో ముప్పయ్యేళ్ళ క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని గుర్తు చేసుకుందాం.
స్వీడన్ దేశపు ప్రధాన మంత్రి పామే ప్రతి రోజూ మాదిరిగానే ఆఫీసునుంచి ఓ సాయంత్రం ఇంటికి వచ్చారు. సినిమాకు పోదామన్న కోరికను భార్య వెలిబుచ్చింది. సరే అన్నారు ప్రధాని. వారిద్దరూ కాలినడకన బయలుదేరి భూగర్భంలో వున్న మెట్రోలో ప్రయాణించి  గ్రాండ్ సినిమా  థియేటర్  కు చేరుకున్నారు. (మన దేశంలో ఇలాటివి కలలో కూడా ఊహించలేము). సినిమా చూసి, పామే దంపతులు తిరిగి నడుచుకుంటూ ఇంటికి చేరుకునే క్రమంలో దారిలో ఒక దుండగుడు చాలా దగ్గర నుంచి కాల్పులు  జరపడంతో పామే అక్కడికక్కడే మరణించారు. ప్రధాని భార్య ఈ సంఘటనలో గాయపడింది. ఈ దుర్ఘటన  కారణంగా స్వీడన్ దివంగత ప్రధాని నిరాడంబర జీవన శైలి ప్రపంచానికి తెలిసివచ్చింది.
పలానా దేశపు ప్రధాన మంత్రి  విమానాశ్రయంలో తోటి ప్రయాణీకుల మాదిరిగానే క్యూలో నిలబడి బోర్డింగు పాసులు తీసుకున్నారనీ, మరో దేశపు ప్రధాని,  కొడుకును స్కూల్లో దింపి రావడానికి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాడనీ ఇలాటి  వార్తలు విన్నప్పుడు, ఫోటోలు చూసినప్పుడు  కూడా ఆశ్చర్యం అనిపించక మానదు. మన దేశంలో కూడా ఇటువంటి రాజకీయ ప్రముఖులు లేకపోలేదు. కాకపోతే వారి సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఉదాహరణకు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్  కలాం,  కేంద్ర రక్షణ మంత్రి పరీకర్, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ,  త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,  పుదుచ్చేరి మాజీ  ముఖ్యమంత్రి రంగస్వామి  ఈ కోవలోకి వస్తారు.
గతంలో గోవా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, పరీకర్,  తన నిరాడంబరత్వంతో వార్తల్లో వ్యక్తి అయ్యారు. ప్రభుత్వ వాహనాలను, భద్రతా సిబ్బందిని పక్కన బెట్టి హాయిగా ఝాం ఝాం  అంటూ మోటారు సైకిల్ పై  హాయిగా  తిరిగే వారు. కేంద్ర రక్షణ మంత్రి అయిన తరువాత గోవా బీజేపీ  శాఖవారు ఆయన గౌరవార్ధం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో మాట్లాడుతూ పరీకర్, ప్రముఖుల భద్రత గురించి గమ్మత్తయిన వ్యాఖ్యలు చేసారు.
“నేనొక విషయం గట్టిగా చెప్పగలను. ఎవరయినా నిజంగా భద్రతను కోరుకుంటే,  ప్రముఖులకు ఇచ్చే భద్రత కావాలని ఎట్టి పరిస్తితుల్లోను కోరుకోకూడదు’ అన్నారాయన.
‘వీవీఐపీల కదలికలను గురించి భద్రతాధికారులు ముందస్తుగానే సమాచారాన్ని వాకీ టాకీల్లో సంబంధిత పోలీసు అధికారులకి అందిస్తుంటారు. ఆ సూచనలు వాళ్లకు ఏమాత్రం అర్ధం అవుతాయో లేదో తెలియదు కానీ, ఏదో చేయాలనీ, సంచలనం సృష్టించాలని తలపెట్టే సంఘ విద్రోహ శక్తులకు మాత్రం వీవీఐపీ కదలికలు గురించి ఇట్టే  తెలిసిపోతుంది’ ఇదీ పరీకర్ మహాశయులు వ్యంగంగా ఇచ్చిన వివరణ. 
అసామాన్యులకోసం అధికారులు అసాధారణ రీతిలో చేసే భద్రతా ఏర్పాట్ల కారణంగా  సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే  ఈ విషయం ఆ ప్రముఖులకు తెలుసో లేదో తెలవదు. శ్రీలంక అధక్షులు మహీంద్ర రాజ పక్సే వెంకన్న దర్శనం కోసం ఓ సారి తిరుపతి వచ్చారు. స్వామి సేవ చేసుకుని తిరిగి వెళ్ళారు. అయితే  అయన రాకను పురస్కరించుకుని చేసిన భద్రతా ఏర్పాట్లు సామాన్య భక్తులకు చుక్కలు చూపించాయి. కొండ ఎక్కకుండానే వారికి దేవుడు కనబడ్డాడు. తిరుపతి అలిపిరి సెక్యూరిటీ గేటు వద్ద అసంఖ్యాకంగా వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.   మరునాడు పత్రికల్లో వచ్చిన ఆ  ఫోటోలు  చూసే  అవకాశం ఆ విదేశీ  అతిధి దేవుడికి ఎలాగూ వుండదు. అంచేత తన భద్రత కారణంగా జనాలు ఎంతగా ఇక్కట్లకు గురయిందీ తెలిసివచ్చే అవకాశం ఆయనకి బొత్తిగా  లేదు. 


ఆర్భాటపు భద్రతా ఏర్పాట్లకోసం ప్రజాధనం ఖర్చయినా ప్రజలు సహిస్తారు, ఎంతవరకు అంటే, తమ దినవారీ పనులకు ఆ ఏర్పాట్లు అడ్డం  రాకుండా ఉన్నంత వరకు.
ఉపశృతి: 
ఎనభయ్యవ దశకం చివర్లో  నేను  మాస్కో రేడియోలో  పనిచేస్తుండేవాడిని. సోవియట్  యూనియన్  రాజధాని నగరం మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములు, విద్యుత్ తో నడిచే బస్సులు తిరిగే మార్గాలు. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే వీధికి,  సోవియట్ వ్యవస్థకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా, (ఆనాటి) సోవియట్ అధినాయకుడు మిహాయెల్  గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండే వాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే - అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.
ఒకసారి మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియా' అంటారు.) దానివెంట ఒక బస్సు, దాని వెనక అంబులెన్స్, వెనుకనే మరో పోలీసు వాహనం - ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది. ఆ కాన్వాయ్ ఏ ప్రముఖుడిదో కాకపోవడం ఇందులోని విశేషం.(11-06-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595



8, జూన్ 2016, బుధవారం

అర్ధం చేసుకోవడం ప్రధానం



ఈ సూక్తి తెలుగులో వున్నా, మనకంటే ముందు స్విస్ ప్రజలు అర్ధం చేసుకున్నారు.



అధికారంతో ప్రాణం విలువ పెరుగుతుందా ?


వ్యక్తుల ప్రాణాల విలువలో హెచ్చుతగ్గులు వుంటాయా? అధికారం వున్నప్పుడు  ఒక రకంగా, లేనప్పుడు మరో రకంగా  వారి  ప్రాణాల  విలువల్లో  తేడాలు వస్తాయా? అవుననే అంటున్నాయి ప్రముఖుల ప్రాణాలకు డేగ కళ్ళతో పహరా కాసే భద్రతా వర్గాలు.
ఈ వ్యాసంతో పాటు జోడించిన చిత్రం చూడండి. అందులో అనేకమంది సాయుధ అంగరక్షకుల నడుమ వున్న వ్యక్తిని గుర్తుపట్టే వుంటారు. ఎందుకంటే దేశంలోనే కాదు విదేశాల్లో  కూడా చప్పున జనం గుర్తు పట్టగల వ్యక్తి మన ప్రధాని  నరేంద్ర మోడీ.




మోడీ గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పేది, మోడీని అభిమానించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు అంగీకరించేది ఒక్కటే,  మోడీ అత్యంత నిరాడంబర జీవితం గడుపుతారని. మరి ప్రధాన మంత్రి కాగానే ఈ హడావిడి ఏమిటి?
బహుశా తన చుట్టూ ఇంతటి స్థాయిలో భద్రత వుందని ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఢిల్లీ లోని ఒక సాధారణ పోలీసు జవాను చెప్పేదాకా మోడీకి కూడా ఈ విషయం తెలవదు. ఈ విషయం తెలుసుకోవడానికి ఒక ఏడాది వెనక్కి పోవాలి.
స్వచ్చభారత్ కార్యక్రమం ప్రారంభమప్పుడు కాబోలు ప్రధాని మోడీ, ఢిల్లీలో  అపరిశుభ్రంగా వున్న ఒక పోలీసు స్టేషన్ ప్రాంగణాన్ని గమనించారు. అక్కడి పోలీసుజవానుతో నేరుగా ఆయన ఆ విషయం ప్రస్తావించారు. రోజూ కాసేపు  శ్రమ దానం చేసి, పరిసరాలను శుభ్రం చేసుకోవచ్చు కదా అన్నది మోడీ  మహాశయుల సూచన.
దానికి ఆ  పోలీసు ఇచ్చిన సమాధానంతో మోడీ గారికి తన చుట్టూ అల్లుకుకుని వున్న భద్రతావలయం గురించి తెలిసివచ్చింది.  ఇంతకీ  ఆ పోలీసు చెప్పింది ఏమిటంటే...
‘అయ్యా మీరు చెప్పేది నిజమే. కానీ, మా పోలీసు బలగాల్లో అత్యధికులకు వీ.వీ.ఐ.పీ.ల భద్రత కనిపెట్టి చూడ్డంతోనే పుణ్యకాలం సరిపోతోంది. మీరు చెప్పిన పని చేయడానికి పోలీసు స్టేషన్లలో ఎవరూ మిగలడం లేదు’
ప్రధాని తిరిగి తన కార్యాలయం చేరుకున్న వెంటనే చేసిన మొదటి పని, తన భద్రతా ఏర్పాట్లను గురించి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించడం, భద్రతను అవసరమయిన స్థాయికి తగ్గించాలని గట్టిగా సూచించడం.

మరి ఇది జరిగిందా అంటే. తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టాన్ని వాడుకోవాలేమో.