9, జనవరి 2015, శుక్రవారం

బొమ్మను చేసీ ప్రాణము పోసీ....


బ్రహ్మగారు సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని,  రేడియో వింటూ చేసే వంట లాగా, అర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.
'అందం అరవై దోసిళ్ళు' అన్నది సరస్వతి.
అక్షరాలా అరవై దోసిళ్ళు  అందం కొలిచి పోశాడు విధాత.
'సౌకుమార్యం పాతిక గుప్పిళ్ళు' అన్నది సరస్వతమ్మ.
'తధాస్తు' అన్నాడు బ్రహ్మలుంగారు.
'అమ్మతనం అరవై,  ఆత్మబలం ఆరు, అహంకారం మరో ఆరు. వినయం అయిదు, అణకువ ఆరు, మేధస్సు ముప్పై , మానసిక బలహీనతలు నలభై దోసిళ్ళు,  శారీరకబలం కూరలో లవణం మాదిరిగా తగినంత.' చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి. విధాత వింటూ మరో చేత్తో  ఆ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.


బొమ్మ పూర్తయింది. దాని అందం చందం చూసి హాటకగర్భురాణికే మతిపోయింది. ఇంత సౌందర్యం,  ఇన్ని తెలివితేటలు, అమ్మో ఇంకేమైనా వుందా అని గాభరా పడిపోయింది.
భార్య కంగారు చూసి బ్రహ్మ తన బోసి నోళ్ళతో ముసి ముసి నవ్వులు  నవ్వాడు. నవ్వి చెప్పాడు.
"నువ్వు పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా అనిపించింది. అదీ మంచిదేలే,  సరే పోనీలే అనుకున్నాను. ఎందుకంటావా? శారీరక బలం వంటలో లవణం మాదిరిగా తగినంత అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అని చెప్పలేదు. ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు. వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా. వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే,  ఈ బొమ్మ బతుకూ అంతే.   తెలివితేటలు, బలాబలాలు, మేధస్సు యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే తేడా. అందువల్లే ఈ విషయాల్లో ఒక   స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా అమ్మతనం ఒక్కటే ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా  పెద్దదిక్కు, ఆ గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది.  ఈ పుత్తడి  బొమ్మకు నేనిస్తున్న అదనపు వరం ఇదొక్కటే!'   

NOTE : Courtesy Image Owner

8, జనవరి 2015, గురువారం

ఫుడ్ సెక్యూరిటీ


క్లాసు జరుగుతోంది. ప్రొఫెసర్ అడిగాడు, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏమిటో తెలుసా అని.
ఠక్కున జవాబు వచ్చింది.
‘తెలియకేం. అందరికీ ఆహారం. ఈ దేశంలో ఎవ్వరూ ఆకలితో కడుపులో కాళ్ళు పెట్టుకుని నిద్రించే పరిస్తితి లేకుండా చేయడం'   
సమాధానం విన్న ప్రొఫెసర్ గారు విద్యార్ధులకు ఓ పరీక్ష పెట్టాడు. దానితో పాటు ఒక నిబంధన కూడా.
అదేమిటంటే – అందరూ పరీక్ష రాస్తారు. కానీ అందరికీ వచ్చిన మార్కులను కూడి సగటు తీసి విద్యార్ధులకు  గ్రేడ్లు ఇస్తారు.
సరే. అంతా పరీక్ష రాశారు. బాగా చదివిన  వాళ్లు బాగా రాశారు. చదవని వాళ్లు అందుకు తగ్గట్టే జవాబులు రాశారు. ప్రొఫెసర్ గారు వాళ్ల మార్కుల సగటు తీసి అందరికీ ‘బీ’ గ్రేడ్ ఇచ్చారు. చదవని వాళ్లు సంతోషించారు. బాగా చదివే వాళ్లు  చిన్నబుచ్చుకున్నారు.
కొన్నాళ్ళు జరిగాయి. మళ్ళీ పరీక్ష పెట్టారు. ఈ సారి బాగా చదివేవాళ్ళు కూడా చదువుపై శ్రద్ధ పెట్టలేదు. వాళ్లను  నిర్వేదం అవహించింది, ‘చదివేం లాభం. యెట్లాగు వచ్చేవి సగటు మార్కులే’ కదా అని.
కాస్తో కూస్తో చదివేవాళ్ళు, అస్సలు చదవని వాళ్లు ఆ కాస్త కూడా చదవడం మానేశారు. ఎందుకంటే చదవకపోయినా మంచి గ్రేడే వస్తోంది. ఇక కష్టపడాల్సిన పనేముంది.
ఈసారీ  అందరికి  తక్కువ గ్రేడే వచ్చింది.
తరువాత తరువాత ఏం జరిగిందో చెప్పనక్కర లేదు. బాగా కష్టపడి చదివేవాళ్లు చదవడం పూర్తిగా మానేశారు.
చదవని వాళ్లకు ఏం పట్టలేదు. ఎందుకంటే వాళ్లకు పోయేదేమీ లేదు.
ఎంతో మంచి కాలేజీ అని పేరుపడ్డ ఆ కాలేజీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని  విధంగా క్లాసు మొత్తం పరీక్షలో తప్పింది.


ప్రతి కధకు ఒక నీతి వుండాలి కదా!
అదే ఇది.
‘కొందరికే అన్నీ కాకుండా అందరికీ అన్నీ’ అనే విధానం మెచ్చతగిందే.
కాలే కడుపుకి ఇంత అన్నం పెట్టడాన్ని మించిన ధర్మం ఏముంటుంది ?
కానీ,
మళ్ళీ ఈ కాణీలు అర్ధణాలు ఏమిటంటారా ? 
అందరికీ పంచడం అంటే  కొందరి నుంచి తీసుకోవడం కాదు.
సోమరితనాన్ని పెంచడం అంతకంటే కాదు.
అన్ని అవతారాలు ఎత్తిన భగవంతుడు కూడా అవతారానికి తగ్గట్టే నడుచుకున్నాడు.
ఆర్ధికవేత్తలు రాజకీయ సలహాదారుల అవతారాలు ఎత్తినప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
అంచేత చెప్పేదేమిటంటే,  ప్రతిదీ శాస్త్రంతో ముడిపెట్టి చూడకూడదు.

NOTE: Courtesy Image Owner 

7, జనవరి 2015, బుధవారం

అర్ధం కానిది అర్ధశాస్త్రం


అర్ధం అయినట్టు అనిపిస్తూ  అర్ధం కానిది అర్ధ శాస్త్రం అన్నాడొక 'అర్ధ' శాస్త్రవేత్త.
చిన్నప్పుడు చందమామ పత్రికలో  సిందుబాద్ యాత్రలు అనే సీరియల్ కధలు వచ్చేవి. వ్యాపారం నిమిత్తం ఆయన పడవలనిండా సరుకులు నింపుకుని విదేశాలకు వెళ్ళి, వాటిని  అమ్మి బోలెడు లాభాలు గడించి స్వదేశానికి తిరిగి వస్తుండగా సముద్రంలో చెలరేగిన తుపాను కారణంగా ఓడ మునిగిపోయి  సర్వస్వం కోల్పోవడం, అతగాడు మాత్రం మొక్కవోని ధైర్యంతో మళ్ళీ మళ్ళీ ప్రయాణాలు చేసి, మళ్ళీ మళ్ళీ వ్యాపారాలు చేసి  పోయిన సిరిసంపదలన్నింటినీ తిరిగి  కూడగట్టుకోవడం, తిరిగి ఓడలు మునిగిపోయో, సముద్రపు దొంగల పాలయ్యో సంపాదించిన సంపాదనంతా పోగొట్టుకుంటూ, తిరిగి కూడగట్టుకుంటూ  ఇలా ఇలా  వొళ్ళు గగుర్పొడిచే సంఘటనలతో ఆ కధలు అలా అలా  సాగిపోయేవి. చదవడానికి బాగుండేవి కాని, ఎక్కడో సముద్రంలో తుపానులు వస్తే సిందుబాదు బికారి కావడం ఎందుకో చిన్న బుర్రలకు అర్ధం అయ్యేవి కావు.
నిన్న మంగళవారం. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి అమంగళవారం. సుమారు మూడులక్షల కోట్ల రూపాయల మదుపర్ల డబ్బు  ఒక్క రోజులో ఆవిరి అయిపోయిందని  తెల్లారి పత్రికల్లో కధనాలు. ఇంత డబ్బు ఒకేఒక్క రోజులో పోగొట్టుకోవడానికి వాళ్లు ధర్మరాజు మాదిరిగా  పాచికల జూదం ఆడలేదు. గుర్రప్పందాలు ఆడలేదు. మరి యెందుకు పోయినట్టు అంత డబ్బు.
కారణం వింటే సిందుబాదు కధ జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడో యూరోపు ఖండంలోని గ్రీసు దేశంలో చెలరేగిన  రాజకీయ సంక్షోభం, మనదేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి దారితీసింది (ట). మన దేశంతో పోలిస్తే చాలా చాలా చిన్న దేశం అది.  మొత్తం గ్రీసు దేశపు జనాభా   కోటీ పదిలక్షలు అంటే అర్ధం చేసుకోవచ్చు అదెంత చిన్నదో. సరే.  దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గడం కూడా మన దేశంలో మార్కెట్ ప్రతికూలతలకు దోహదపడ్డాయి. ఏమైతేనేం, లక్షలాదిమంది సిందుబాదులు షేర్ మార్కెట్లో 'బేర్ల' చెలగాటంతో అతలాకుతలం అయిపోయారు.


ఈ షేర్లేమిటో, బేర్లేమిటో తెలియని మాబోంట్లు ఆ వార్తలు చదువుతూ పాత చందమామ కధలు జ్ఞాపకం చేసుకున్నారు.
నీతి: డబ్బుతో ఆటలు ఆడరాదు

కార్టూన్ 'ఈనాడు' సౌజన్యంతో 

దిల్ మాంగే మోర్



రాజుగారు ఉద్యానవనంలో వాహ్యాళి ముగించుకుని తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు అతడు వున్నట్టుండి ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా  ఉల్లాసంగా వున్న రాజుగారికి ఆ క్షణంలో అతగాడికి ఏదయినా  సాయం చేయాలని అనిపించింది.
ఏం కావాలి నీకు ? కోరుకో! ఏదయినా సరే ఇస్తాను అన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో
అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. కానీ, అతడు అల్లాటప్పా రాజు కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు. అరివీరభయంకరులయిన శత్రురాజులను మట్టికరిపించి సువిశాల సామ్రాజ్యం నిర్మించుకున్న మహా చక్రవర్తి. అలాటి వాడు,  ‘కోరుకో ఇస్తాను అంటే ఆలోచించుకో అనే మనిషి మామూలువాడు అయివుండడు
అలా ఆలోచించుకున్న రాజు అన్నాడు అతడితో.
పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.
సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి
రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు.
ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను
రాజు అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు.   
కృష్ణ తులాభారం  మాదిరిగా సన్నివేశం  మారిపోయింది. ఒకటికి రెండుసార్లు యెందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతోంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే వుంది.
రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని సమస్త ధనరాసులు, స్వర్ణాభరణాలను  భటులు గంపలకొద్దీ  తెచ్చి ఆ బిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే వుంది.
రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందూ వెనకా చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం శూన్యం.
చివరకి జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం పోగొట్టుకున్న తరువాతగాని రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి ముందు సాగిలపడి అన్నాడు.
మహానుభావా! నా అహంకారాన్ని మన్నించండి. నేను మీమాట పెడచెవిన పెట్టాను. ఇంతకీ ఈ బిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి
ఆగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
రాజా! నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం. నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర మాదిరిగా కనబడేట్టు చేసాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే! ఏమీ మిగలదు.  అధికారం, సిరి సంపదలు ఎన్ని వున్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు. యెంత ఇచ్చినా కాదనదు. మనుషులకు, ఈ ఆశ అనండి, అత్యాశ అనండి, దురాశ అనండి -  కాటికి పోయినదాకా అది వాళ్ల వెంటే వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతా
రాజుకు తత్వం బోధపడగానే మాయమయిన ధనరాసులు, సిరి సంపదలు ఆయనకు  మళ్ళీ దక్కాయి. అంతేకాదు, వాటికి అదనంగా ఒక  జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది.
దిల్ మాంగే మోర్’ 



(ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం & Courtesy Image Owner)

6, జనవరి 2015, మంగళవారం

డస్ట్ బిన్


ఖరీదయిన మద్యం సీసాకు ఓ కరెన్సీ నోటు తారసపడింది.మద్యం సీసా కరెన్సీ నోటుతో అంది.
‘ఏం చూసుకుని నీకా మిడిసిపాటు? నువ్వొక కాగితం ముక్కవి. ఇంకా చెప్పాలంటే  నాతో  పోలిస్తే  ఎందుకూ పనికిరాని  చిత్తు కాగితానివి.’
కరెన్సీ నోటు తాపీగా జవాబిచ్చింది.
‘నువ్వన్నది నిజమే. నేనొక కాగితాన్నే. కానీ నా జన్మలో నేనెప్పుడూ నీలా ‘చెత్త బుట్ట’ని చూడలేదు’


NOTE: Courtesy Image Owner

కధకు మరణం లేదు


(అంతేకాదు, చక్కని కధకు 'పాతా కొత్తా' తేడాలేదు. అలాటికధలు ఎన్నిసార్లు చదువుకున్నా తృప్తి తీరదు. అందుకే కధా ప్రియులు దేవినేని మధుసూదన రావు గారు ఈ కధను మరోమారు నెమరు వేసుకొవడానికి నెట్లో పంపారు.
వండడం ఓ కళ. వండి వార్చడం మరో కళ. వండినదాన్ని వడ్డించడం ఇంకో అపురూప కళ. అదేమిటో శంకరమంచి సత్యం గారు తన 'అమరావతి కధ'ల్లో ఒకదానిలో చెప్పారు. ఆరగించండి.)




తృప్తి
పూర్ణయ్యని బావగాడంటారు అందరూ.
బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరమూ లేదు. పెళ్ళి గాని, పేరంటం గాని, వంట హంగంతా బావగాడే. వంటవాళ్ళని కూర్చోనిచ్చేవాడు కాదు, నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు.
ఒకసారి వనసంతర్పణం పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటీ మాట్లాడుకునే వారు కొందరు. పేకాటలో మునిగిన వారు కొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రాఅని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు, పేకాట మూయించాడు. వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నానుఅంటూ లిస్టు చదివాడు.
వంకాయ మెంతికారం పెట్టిన కూర
అరటికాయ నిమ్మకాయ పిండిన కూర
పెసరపప్పుతో చుక్కకూర
వాక్కాయ కొబ్బరి పచ్చడి
పొట్లకాయ పెరుగు పచ్చడి
అల్లం, ధనియాల చారు
మసాలా పప్పుచారు
అయ్యా! జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం
మామిడి కోరుతో పులిహోర
గుమ్మడి వడియాలు, వూరమిరపకాయలు.
అందరికీ సమ్మతమేనా?” అని అరిచాడు.
సమ్మతమేమిటి నామొహం - అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది.
అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకూ ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూశారా! లేత వంకాయలునవనవలాడుతున్నాయిమెంతికారం పెట్టి మరీ వండిస్తున్నానుదగ్గరుండి కోయించుకు వచ్చాను. …” అని అందరికీ చూపించి వెళ్ళి పోయాడు. ఆ తరవాత జనానికి వేరే ఆలోచనలు పోయినాయి కావు. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు. కాయ కాయ పళంగా వండితే రుచా? తరిగి వండితే రుచా? అసలు రుచి వంకాయలో వుందా? వంకాయ తొడిమలో వుందా? ఇలా చర్చలు సాగాయి.
మరో అరగంటకి — –
నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, లేత చుక్కకూర మోపుతో వచ్చి అందర్నీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి,” అని తలా ఓ కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది.అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడ్డారు. బావగాడు ఇలా ప్రదర్శన లిస్తుంటే ఆకలి రెప రెప పెరుగుతోంది.
ఇక అక్కడ గాడిపొయ్యి దగ్గర వంటవాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు.
ఓ పక్క పులిహోర తిరగమాత వెయ్యగానే రయ్యిన జనం దగ్గరికి పరిగెత్తుకు వొచ్చి, “ఆ వాసన చూశారా? పులిహోర తిరగమోతసన్న బియ్యంతో చేయిస్తున్నాను,” అని మాయమయ్యాడు.
మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది. తాటి ప్రమాణమైంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురు మంటున్నారు. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు, శుభ్రంగా కడుక్కోండి.అని వరుసల మధ్య కొచ్చి హెచ్చరించాడు.
సుబ్బయ్యన్నయ్యకు ఒక ఆకు వేస్తావేం? రెండు ఆకులు కలిపి వేయించుఅంటున్నాడు.
వడ్డనలు మొదలయ్యాయి.
నేతి జారీ పుచ్చుకొని పేరు పేరునా అందర్నీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ అలా వదిలేయకూడదు. నిమ్మకాయ పిండిన అరిటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు.అంటూ మళ్ళీ కూర వడ్డింపించి ఆకలి పెంచుతున్నాడు. జనం ఆబగా తింటున్నారు.
చుక్కకూర పప్పులో వూరమిరపకాయలు మిళాయించండి.
పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి.
వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు. తప్పు లేదు.
ఇంకా విస్తట్లో మిగిల్చావేం. పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో.
అప్పుడే మంచినీళ్ళు తాగకు. మీగడ పెరుగుంది.” ….
ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు. విస్తళ్ళ ముందు నుండి లేవడమే కష్టమయింది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరవాత వంటవాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా?” అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపొయ్యి పక్కన ఒక చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు.
అప్పటికి కూరలు మిగల్లేదు.
ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంతా హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురూ హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారన్న సంతోషమే బావగాడి తాంబూలపు పెదాలపైని చిరునవ్వు. 

(అమరావతి కథలు - సత్యం శంకరమంచి. నవోదయ పబ్లిషర్స్, విజయవాడ. 1978. రూ. 150/-)
Cover Page Courtesy Shri 'BAPU'


5, జనవరి 2015, సోమవారం

స్వచ్ఛ భారత్ స్వప్నం సాకారం కావాలంటే


సూర్యదేవర రామచంద్రరావు అంటే చాలామందికి తెలియకపోవచ్చు, యస్.ఆర్. రావు అంటే గుర్తురాక పోవచ్చు. కానీ, సూరత్ మునిసిపల్ కమీషనర్ రావు అనగానే  చప్పున గుర్తొస్తారు ఈ 1978  బ్యాచ్ గుజరాత్ క్యాడర్  ఐ.ఏ.యస్. అధికారి. తదనంతర కాలంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా కేంద్రంలో సయితం ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. అయితే,  సూరత్ మునిసిపల్ కమీషనర్ గా పనిచేసిన కాలమే ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలబెట్టింది.
1994 లో సూరత్ పట్టణాన్ని ప్లేగ్ వ్యాధి అతలాకుతలం చేసింది. అసలే సూరత్ కు దుర్గంధ నగరం అనే పేరు. దానికి తగ్గట్టు, ప్లేగ్ వ్యాధి జరిపిన ముట్టడితో మరింత మురికి పేరు, సూరత్ పేరులో పేరుకుపోయింది. ఆ నేపధ్యంలో యస్.ఆర్.రావు అనే యువ ఐ.ఏ.యస్.  అధికారిని ప్రభుత్వం 1995  లో సూరత్ మునిసిపల్ కమీషనర్ గా నియమించింది. పన్నుల వసూళ్లు, రహదారుల నిర్మాణాలు కాదు ఆయన మీద మోపిన బాధ్యత. ప్లేగ్ వ్యాధి తాకిడితో తలకిందయిన నగర పారిశుధ్యాన్ని తిరిగి గాడిలో పెట్టడం అనే పెను బాధ్యతను ఆయన భుజస్కంధాలపై పెట్టింది.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే  ఏమాత్రం కాలయాపన చేయకుండా ఆయన నేరుగా  రంగంలోకి దిగిపోయారు. ముందు  సూరత్ నగరానికి వున్న మురికి పేరును వొదిలించడం మొదటి పనిగా పెట్టుకున్నారు. అయితే  ఇందుకోసం అయన చీపురు పట్టుకుని వీధుల్లోకి రాలేదు. మునిసిపాలిటీ నిధులు వెచ్చించి వాక్యూం క్లీనర్లు కొనలేదు. సాధారణంగా ఐ.ఏ.యస్. అధికారుల్లో కానవచ్చే బ్యూరోక్రాట్ మనస్తత్వం ఆయనలో లేకపోవడమే ఆయనకు కలిసివచ్చిన అంశం.  అంచేత  బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే ఆయన ప్లేగ్ వ్యాధిపై యుద్ధం ప్రకటించారు. నగరాన్ని దుర్గందానికి దూరం చేసి, పరిశుద్ధ నగరంగా చేయడానికి కసితో పని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనపై ఎన్నో రాజకీయ వొత్తిళ్ళు వచ్చాయి. స్థానిక నాయకులు ఆయన ప్రతిపనికీ అడ్డం పడ్డారు. కానీ ఆయన దేనినీ ఖాతరు చేయలేదు. ఎవరినీ లెక్కచేయలేదు. తను అనుకున్నది అనుకున్నట్టు చేస్తూ పోయారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు,  చోటా మోటా రాజకీయ నాయకులు వారి అనుచరులు అందరూ రావుగారికి వ్యతిరేకమే, ఒక్క సూరత్ ప్రజలు తప్ప, ఆ వూరిలో మురికివాడల్లో నివసించే జనాలు మినహా. ఏడాదిన్నర కూడా గడవక ముందే రావు ప్రజలకు దైవసమానుడిగా మారిపోయారు. ఆయన కనిపిస్తే చాలు నోట్లో వున్న పాన్ రోడ్డుమీద  ఉమ్మేయడానికి పౌరులు  సంకోచించేవాళ్ళు. చెత్త కాగితం కానీ, వాడేసిన సిటీ బస్సు టిక్కెట్టు కానీ  బయట పారేయడానికి సందేహపడేవారు. పరిసరాల పరిశుభ్రత పట్ల పౌర  సమాజంలో  ఆయన కల్పించిన అవగాహనా ఫలితం అది. రావుగారి పాలనలో సూరత్ ప్లేగ్ వ్యాధినుంచి శాశ్వితంగా విముక్తమయింది. పరిసరాలన్నీ పచ్చని  చెట్లతో అలరారడం మొదలయింది. పన్నుల వసూళ్లు స్వచ్చందంగా పెరిగాయి. తాము కట్టే పన్నులన్నీ తమకు  ఉపయోగపడే పనులకే ఖర్చు చేస్తారు అన్న ఆలోచన పౌరుల్లో  పెరగడమే పన్నుల వసూళ్ళ పెరుగుదలకు కారణం అని వేరే చెప్పనక్కరలేదు.  అనతికాలంలోనే దేశం మొత్తంలో చండీగర్ తరువాత అత్యంత పరిశుభ్ర నగరంగా సూరత్ ఎంపికయింది. ఇది సాధించడానికి ఏళ్ళూ పూళ్ళూ పట్టలేదు. వందలకోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టలేదు. ఒక అధికారి పట్టుదలతో, ప్రజలు అందించిన సహకారంతో ఇది సాధ్యపడింది. 'మన ఇంటిని శుభ్రంగా వుంచుకుందాం' అని ప్రతివారు అనుకుంటారు. 'మన పరిసరాలను కూడా అలాగే చక్కగా వుంచుకుందాం' అనే స్పృహ కల్పించడం  చాలా కష్టం. కృష్ణాజిల్లాలో జన్మించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న సూర్యదేవర రామచంద్రరావు ఈ అద్భుతాన్ని చేసి చూపారు. అందుకు  ఆయన అనుసరించిన విధానం కూడా చాలా చాలా మామూలుది. మునిసిపాలిటీలో పనిచేసే అధికారులు  ఆఫీసుల్లోని ఏసీ గదుల్ని వొదిలిపెట్టి ఉదయం ఏడుగంటలకల్లా వీధుల్లోకి వెళ్లగలిగితే సగం  సమస్య పరిష్కారం అయినట్టే అని ఆయన భావించారు. ఆయనా అలాగే చేశారు. తన అధికారులు, సిబ్బందితో చేయించారు. ఫలితం కనబడింది. అట్లా ఇట్లా కాదు  అద్భుతంగా కనబడింది.  పారిశుధ్య సిబ్బందికీ,  వారిపై అఆమాయిషీ చేసే అధికారుల నడుమ చక్కని కమ్యూనికేషన్ ఏర్పడింది. కలిగిన ఆసామీ ఎవరయినా ఇంటిముందే  రోడ్డుమీద చెత్త పారబోస్తుంటే అదేమని అడిగే ధైర్యం  మామూలు స్వీపర్ చేయలేడు. కానీ వెంట ఉన్నతాధికారి వుంటే, అలా అడిగే  ధైర్యం అదే వస్తుంది. ఇదీ, మనస్తత్వ శాస్త్రం చదివిన రావు గారి థియరీ.
అప్పటివరకు స్థానిక దినపత్రికల్లో సూరత్ అధ్వాన్నపరిస్తితుల గురించీ, అధికారుల అలసత్వం గురించీ కోకొల్లల్లుగా కధనాలు వెలువడేవి. కొద్దికాలంలోనే వార్తల స్వరూపస్వభావాల్లో ఎంతో తేడా వచ్చింది. విమర్శల పాలు పూర్తిగా తగ్గిపోయి,  ప్రశంసల జోరు పెరిగిపోయింది.
అనతికాలంలోనే అయన సూరత్ పట్టణాన్ని చక్కని పారిశుధ్య నగరంగా తీర్చిదిద్దారు. అత్యంత పరిశుద్ధమైన భారతీయ నగరాల్లో దానికి రెండో స్థానం కల్పించారు. ఈ బృహత్తర కర్తవ్యాన్ని జయప్రదంగా నిర్వర్తించినందుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అరుదయిన పద్మశ్రీ అవార్డు బహుకరించింది. ఒక  సివిల్ సర్వీసు అధికారికి అటువంటి 'పద్మ' పురస్కారం లభించడం కూడా అరుదయిన విషయమే.




రెండు దశాబ్దాల నాటి ఈ నేపధ్యాన్ని యెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందో దానికి కారణం ఏమిటో విపులంగా వివరించాల్సిన అవసరం లేదు. ఈనాడు దేశం నలుమూలల్లో 'స్వచ్ఛ భారత్' అనే నినాదం మారుమోగిపోతోంది. ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఈ పిలుపుకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.  పత్రికల్లో, మీడియాలో ఈ కార్యక్రమానికి అపూర్వమైన ప్రాచుర్యం దొరుకుతోంది. ప్రధాని మోడీ ప్రభ నలుదిక్కులా వెలిగిపోతూవుండడం కూడా ఒక కారణం కావచ్చు. దేశం నాలుగుచెరగుల్లో తమ ప్రతిభతో జనాలను ప్రభావితం చేయగల సమర్ధులు, తమ తమ రంగాల్లో అశేష  శేముషీ విభవం కలిగిన ప్రముఖులు అనేకమంది  స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్చందంగా పాల్గొని విశేష ప్రచారం అందిస్తున్నారు. సెలెబ్రిటీలు తలచుకుంటే ప్రచారానికేం కొరత.  మడత నలగని దుస్తులు ధరించి చీపుర్లు పట్టుకుని వీధులు వూడుస్తుంటే చూసేవారికి కన్నుల పండువ. అయితే ఇదంతా కనిబెట్టి  చూస్తున్నవారికి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా మిగిలిన అన్ని సర్కారు పధకాల మాదిరిగా ఒక ప్రచారార్భాటంగా మారిపోతుందేమో అనే భయసందేహాలు కలక్కమానవు.
స్వచ్ఛ భారత్ అనేది ఒక చక్కటి కార్యక్రమం. సందేహం లేదు.  మోడీని విధానపరంగా వ్యతిరేకించేవారు సయితం దీన్ని తప్పుపట్టలేరు. తప్పుపట్టే పరిస్తితి వస్తే, అలాటి స్తితి తెచ్చుకుంటే  మాత్రం అది సర్కారు తప్పే అవుతుంది.
మన దేశంలోనే కాదు విదేశాల్లో వుండే భారతీయులు, ప్రత్యేకించి వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు స్వచ్ఛ భారత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్ధిక సంస్కరణల  పుణ్యమా అని అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో మాదిరిగానే సకల సౌకర్యాలు మన దేశంలో కూడా  దొరుకుతున్నాయి. దొరకనిదల్లా స్వచ్చమైన వాతావరణం. పరిశుభ్రమైన పరిసరాలు. మాతృ దేశానికి తిరిగివచ్చేయాలన్న వారి బలమైన కాంక్షను బలంగా అడ్డుకుంటున్న కారణం ఇదొక్కటే.
సంస్కరణల ప్రభావం దేశంలో అన్ని రంగాల మీదా, పౌరులందరి మీదా పడింది. చదువుకుండే ఆడపిల్లల సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు, ఉపాధుల పేరుతొ గడప దాటి వెళ్ళే ఆడంగుల సంఖ్యా బాగా పెరిగింది. ఇలాటివారిలో కాస్త కలిగిన ఆడవారికి ఎదురయ్యే ఇబ్బందులు తక్కువ. వాళ్లు పనిచేసే కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలు వుంటాయి. ఉన్నత కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు చదువుకునే స్కూళ్ళు కూడా అన్ని సదుపాయాలతో వుంటాయి.  పోతే, సర్కారు బళ్ళల్లో చదువుకునే ఆడపిల్లలకు,  పొద్దున్నే లేచి వెళ్ళి  పనిపాటులు చేసుకునేవారికీ, వీధుల్ని శుభ్రం చేసే ఆడవారికి అవసరమైనప్పుడు కాలకృత్యాలు తీర్చుకోగల వెసులుబాటు వుండదు. అలాటి వారు తమ ఇబ్బందిని ఎవరికీ చెప్పుకోలేరు. బలవంతంగా అణచుకుని లేనిపోని అనారోగ్యాలకు గురవుతుంటారు. స్వచ్ఛ భారత్ సంకల్పం చెప్పుకున్నప్పుడే  ప్రధాని మోడీ మనస్సులో కూడా ఈ అంశం  మొలకెత్తకపోలేదు.  యుద్ధప్రాతిపదికన పాఠశాలల్లో  ఆడపిల్లలకు మరుగు దొడ్లు నిర్మించాలని ఆయన  తలపెట్టారు. ఆలోచన మంచిదే. కానీ ఆచరణ మాత్రం అనుకున్నంత వేగంగా సాగుతున్నట్టు లేదు.
గొప్ప గొప్పవాళ్ళు చేత చీపుర్లు పట్టి వీధులు వూడవడం తప్పని ఎవ్వరూ అనరు. కానీ, ఏదో మొక్కుబడి తంతుగా సాగినప్పుడు మాత్రమే ప్రతికూల ఫలితాలు వస్తాయి. కార్యక్రమం యెంత మంచిదయినా అమల్లో నీరుకారిపోయేది చిత్తశుద్ధి కరువయినప్పుడే.
ప్రస్తుతం మన దేశంలో తీవ్రమైన కొరత వున్నది  'చిత్తశుద్ధి' ఒక్కదానికే అని  అందరికీ తెలుసు.(05-01-2015)

NOTE: Courtesy Image Owner