21, జులై 2010, బుధవారం

జీవన స్రవంతి - భండారు శ్రీనివాస రావు

జీవన స్రవంతి - భండారు శ్రీనివాస రావు


(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం)




జీవనస్రవంతి - 1


'ఉప్పంటే ఏమిటి? దాని రుచి ఎలా వుంటుంది?' అంటే తెలియదు-

'రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే అదీ తెలియదు.

ఇవి ఏ ఇంటర్వ్యూ లోనో అడిగిన షరా మామూలు ప్రశ్నలు - జవాబులు కావు.


యెంతో అభివృద్ధి జరిగిందని జగమంతా అనుకుంటున్న సోవియెట్ రష్యా లాంటి దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఒకానొక తెగవారు గత నలభై సంవత్సరాలనుంచి ఉప్పు రుచి ఎరగరు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సంగతే వారికి తెలియదు.

ఈ మధ్య దారితప్పిన ఓ పరిశోధకుల బృందం - దారి తెలియక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలియవచ్చిన విషయాలు ఇవి.




జీవన స్రవంతి -2


పశ్చిమ బెంగాల్ లోని పోలిసులు పాగా వేసి ఓ పాగా లేని పెద్ద మనిషిని పట్టుకున్నారు. అతని దగ్గర పోలితిన్ సంచీ ఒకటి వారికి దొరికింది. దాంట్లో రెండు పుర్రెలు బయట పడ్డాయి. ఈ పుర్రెల సంగతి చెబుతావా? నీ బుర్ర రామకీర్తన పాడించమంటావా అని పోలీసులు సుతారంగా బెదిరించేసరికి, పాపం ఆ పుర్రెల షావుకారు జావకారిపోయి అసలు సంగతి ఒప్పేసుకున్నాడు. పుర్రెల్ని కలకత్తాలో హెచ్చు ధరలకు కొనే బడా వ్యాపారులున్నారన్న రహస్యం బయటపెట్టి వారి పుట్టి ముంచేసాడు. దాంతో పోలీసులు కలకత్తాలో కూడా దాడులు చేసి పుర్రెల వ్యాపారం చేసే వారిని పట్టేసుకుని కటకటాల వెనక్కు నెట్టేశారు.

జీవన స్రవంతి -3

దేశంలోని గూడ్స్ రైళ్లన్నీ కలసి ఏటా ఎంత సరుకుని రవాణా చేస్తున్నాయో - అంత కంటే ఎక్కువగా ఎడ్ల బండ్లపై సరుకుల రవాణా జరుగుతోందని ఆ మధ్య ఓ సర్వేలో తేలింది. ఇప్పుడా ఎడ్ల బండి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.


 భారత దేశం తయారు చేసిన ఒక ఉపగ్రహాన్ని అర్జంటుగా అడంగుకి చేర్చడానికి ఎడ్ల బండిని ఉపయోగించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంతొమ్మిదివందల ఎనభయి ఒకటిలో ఆ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపడానికి ముందు- కొన్ని పరీక్షలు జరపడానికి దాన్ని ఎడ్లబండిపై తీసుకు వెళ్ళారట. విదేశాల్లో ఈ పనికి ఎంతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే మనవాళ్ళు మాత్రం యాభయి రూపాయలకు ఒక ఎడ్లబండిని మాట్లాడి పనిపూర్తి చేశారు.

జీవన స్రవంతి -4

ఒక్కో దేశంలో జనాన్ని ఒక్కోరకమైన వింత రోగాలు పట్టి పీడిస్తుంటాయి.


ఈ మధ్య ఇంగ్లాండ్ లో జనం విపరీతంగా వొళ్ళు పెరిగిపోయి తెగ బాధ పడిపోతున్నారట. కాస్త కండ పట్టి, వొళ్ళు చేసి నిగ నిగలాడుతూవుంటే . బాగానే వుంటుందికాని, పెరిగే వొళ్ళు పెరిగిపోతూనేవుంటే ఏం బాగుంటుంది చెప్పండి ? ఇలా వొళ్ళు పెరిగిపోయే జబ్బు - రోజు రోజుకు పెరిగి పోతూ వుండడంతో .- జనంలో ఆందోళన కూడా అదే మోతాదులో పెరిగిపోతోందని అక్కడి రాయల్ వైద్య కళాశాల నివేదికలో పేర్కొన్నారు. పెద్దవారిలో ముప్పయి శాతం- పిల్లల్లో అయిదు శాతం ఊబకాయంతో లబ లబ లాడుతూ వున్నారట. గున్న ఏనుగుల్లా బలిసిన చిన్న పిల్లలు గున గున తిరుగుతూ- బరువు తగ్గడమెలా అన్న బెంగతో మంచమెక్కి - మరింత వొళ్ళు చేస్తున్నారట.

జీవన స్రవంతి -5

గుండె భద్రం తమ్ముడూ అంటున్నారు డాక్టర్లు.


  గుప్పెడు గుండెకాయపై గుండిగెలకొద్దీ భారాలనూ, బాధలనూ, భయాలనూ రుద్దకండీ- పిచ్చి గుండె గభాల్న ఆగి ఊరుకుంటుందని హెచ్చరిస్తున్నారు. మీ కోపం - మీకంటే - మీ గుండెకు ప్రధాన శత్రువని ఉచిత సందేశం కూడా ఇస్తున్నారు. మనసులో కక్షలూ, కార్పణ్యాలూ పెంచుకుంటూ పొతే- ఆ ప్రభావం గుండె మీదపడి గుండె జబ్బులకు దారి తీయగలదని గుండె మీద చేయి వేసుకుని మరీ చెబుతున్నారు. సిగరెట్ తాగడం గుండెకు ఎంత హాని చేస్తుందో- కోపతాపాలు కూడా గుండెని అంతే బలహీనం చేస్తాయని వారంటున్నారు. అంతేకాదు- నవ్వూ నవ్వించూ అంటూ నవ్వే భోగం- నవ్వే యోగం అనే ఫిలాసఫీతో జీవితాన్ని తేలిగ్గా తీసుకునేవారి గుండె మాత్రం నిక్షేపంగా వుంటుందట.
అయితే గుండె గురించి గుండె చెరువు అయిపోయే విషయాలు వీళ్ళిలా చెబుతుంటే- అమెరికాలోని ఫ్లోరిడా వైద్య కళాశాలలో పనిచేసే శాస్త్రవేత్తలు - చెప్పాపెట్టకుండా ఆగిపోయే గుండెని ఎన్నాళ్ళు నమ్ముకుంటామని ఏకంగా ఒక నకిలీ గుండెనే తయారుచేసారు. హృదయ చలనం ఆగిపోయిన రోగికి ఈ అయస్కాంతంతో రూపొందించిన ఈ నకిలీ గుండెని అమరిస్తే- గుండె చేసే పనులన్నీ అదే చేసేస్తుందట.

జీవన స్రవంతి -6



చాదస్తం మొగుడు చెబితే వినడు- కొడితే ఏడుస్తాడు అన్నట్టయింది పంజాబులో ఓ భర్తగారి పరిస్తితి.
అమృతసర్ దగ్గర ఓ ఊళ్ళో ఒక పెద్దమనిషి ఇంటి విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా - కేవలం వొంటికి మందు పట్టించడంలోనే ఎక్కువ సమయాన్నీ, డబ్బునూ ఖర్చు చేస్తూ వుండేవాడు.
 ఇంటి ఇల్లాలుకి ఇంటి ఖర్చులకింద ఏమీ ఇవ్వకుండా- సంపాదన అంతా తాగుడికే తగలేస్తూవుండడం ఆవిడకు సుతరామూ నచ్చేదికాదు.
నచ్చని సంగతి నయాన చెప్పింది. ఏడుస్తూ చెప్పింది. వేడుకుంటూ చెప్పింది. అయితే- మందు తలకెక్కిన ఆ పెద్దమనిషికి పెళ్ళాం మాటలు మాత్రం మనసుకు ఎక్కలేదు. పైపెచ్చు- ఇంట్లో గొడవలన్నింటికీ మందే మందు అని ధృడంగా నమ్మేసి తన మందు గొడవలోనే కూరుకుపోయాడు.
దానితో ఆ ఇల్లాలుకి చిర్రెత్తుకొచ్చింది.
భర్త పని చేసే దుకాణం ముందు ధర్నా ప్రారంభించింది. చోద్యం చూస్తున్నవారందరికీ తన మొగుడి నిర్వాకాన్ని తెలియచెప్పింది. ఆ విధంగా భాద్యత తెలియని భర్తలందరికి బుద్ధి చెప్పింది.

జీవన స్రవంతి -7

'అడుక్కోవాల్సిన ఖర్మ నాకేం పట్టింది- అప్పిచ్చే వాళ్ళు న్నంతకాలం.' అన్నాడొక అప్పారావు.
నిజమే. వూరికే ధర్మం చేసాడా- అప్పిచ్చాడు కాని - అని ఆనక బుకాయించవచ్చు- ఎంచక్కా అప్పు తీసేసుకుని.
 పంజాబు నేషనల్ బ్యాంకు వారు అడుక్కునేవాళ్ళకి అప్పులిచ్చిచూద్దామని ఆలోచన చేసి - కొందరు బిచ్చగాళ్ళకు రుణాలు మంజూరు చేశారు.


 బిలబిలమంటూ వచ్చి అప్పు తీసుకున్న భిక్షకులు ఆ డబ్బుతో స్వయం ఉపాదులు ఏర్పాటుచేసుకుని, రాబట్టుకున్న రాబడిలో కొంత మొత్తం బాకీ కింద బ్యాంకుకు చెల్లు వేసారు. దర్జాగా అప్పులుచేసి మొగం చాటేసి ఎగ్గొట్టే బడాబాబులకంటే పూటకు గతిలేని బిచ్చగాళ్ళే నయమన్నది సదరు బ్యాంకు వారి ఉవాచ.  

జీవన స్రవంతి -8

కొందరు సాహసాలు చేసి కీర్తి గడిస్తే- మరికొందరు దుస్సహాసాలకు దిగి జయిల్లో పడుతుంటారు.
ఫ్రాన్సు సైన్యంలో పనిచేస్తున్న ఓ కుర్ర ప్రేమికుడికి - కొత్తగా తళతళలాడుతున్న ఆర్మీ కారు కనిపించింది.


 అది వేసుకుకుని-తనకోసం ఎదురుచూస్తున్న ప్రేయసి వద్దకు వెడితే ఎలా వుంటుందో అని ఆలోచించడానికి అతగాడికి రెండు క్షణాలు కూడా పట్టలేదు. ఎందుకంటే- మరు క్షణంలోనే అతడు కారుని దొంగతనంగా బయటకు తీసుకువెళ్ళి- ఝామ్మున ప్రేయసి దగ్గరకు దూసుకుపోయాడు. చూసావా నా తడాఖా అంటూ ప్రియురాలితో డంబాలు పలకబోయేన్తలో - వెనుకనే వున్న పోలీసులు హఠాత్తుగా ముందుకొచ్చి కారు దొంగ చేతికి అరదండాలు తగిలించారు. వయస్సులోవున్న కుర్రాడు, కొత్త కారు చేతికి చిక్కితే - ముందుగా వెళ్ళేది ప్రేమించిన పిల్లదగ్గరికే అన్న ధర్మసూక్ష్మం తెలిసిన పోలీసులు- ఆ యువకుడికంటే ముందుగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, అతడికోసం కాచుకోవడంతో ఆ కుర్ర దొంగ కధ కాస్తా అడ్డం తిరిగింది. కొత్త కారులో- పాత ప్రేయసితో హాయిగా షికారు తిరుగుదామనుకున్న అతడిని ఆ కారులోనే కారాగారానికి చేర్చారు.


జీవన స్రవంతి -9

ప్రతి బియ్యపు గింజమీద తినేవాడి పేరు రాసుంటుంది అన్నది ఓ సామెత. పెళ్ళిళ్ళ విషయం కూడా అంతే అంటారు. ఎవరికెవరో ఎవరికెరుక ?
సౌదీ అరేబియాలో ఈమధ్య ఇలాంటి ఒక వివాహం - నిజం చెప్పాలంటే రెండు జరిగాయి.


ఇంట్లో వొంట్లో పుష్కలంగా వున్న ఒకానొక పెద్దమనిషి తన ఇద్దరు కుమార్తెలకీ పెళ్లి సంబంధాలు వెతికి- ఘనంగా వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేసి- ఆర్భాటంగా నలుగుర్నీ పిలిచి - సరిగ్గా నిఖా సమయానికి నోరు జారి, తన కూతుళ్ళను - ముందు నిశ్చయం చేసుకున్న వరుళ్ళలో - ఒకరికి బదులు మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు ప్రకటించాడు. తరువాత జరిగిన పొరబాటు తెలుసుకుని, నాలుక కరుచుకుని - , అవసరమయితే విడాకులు ఇప్పించయినా సరే - కూతుళ్ళకి ముందు నిర్ణయించిన వరులతోనే వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే- మారుపడిన మొగుళ్ళ తోనే మనువు కొనసాగిస్తామని ఆ కొత్త వధువులిద్దరూ మారు మాట లేకుండా రాజీ పడిపోయారు.


జీవన స్రవంతి -10

భార్యలమీద ప్రేమని ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా వెల్లడిస్తుంటారు కొందరు పెళ్ళాం మెడలో నగలు దిగవేసి తమ వగలు చూపిస్తే- మరికొందరు పట్టు చీరెలతో కట్టుకున్నవారిని ఆకట్టుకుంటూ వుంటారు. మనీలాలో- ఆర్మిడో పినేడా అనే వడ్రంగికి భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఎలాగయినా సరే- కష్టపడి కాసులు కూడబెట్టి - రెండస్తుల మేడ కట్టి- సుఖపెడతానని ఇల్లాలితో ఎప్పుడూ చెబుతుండేవాడు. పాపం- విధి వక్రించి- ఇంతలొ ఆ ఇంటావిడ కన్నుమూసింది.


ఆటను మాత్రం- భార్యనూ, ఆమెకిచ్చిన మాటనూ మరవలేదు. రేయింబవళ్ళు శ్రమించి, డబ్బులు పోగేసి- అనుకున్న ప్రకారం భార్య పేరున ఇల్లు కట్టాడు. ఆమె అవశేషాలతో ఇంట్లోనే సమాధి నిర్మించాడు. దానిపైన- భార్య చాయా చిత్రాన్ని వేలాడకట్టాడు . ఆవిడ జీవించి వుండగా ఉపయోగించిన గ్యాస్ స్టవ్ ను, పడక మంచాలను ఆ సమాధికి దగ్గరగా అమర్చాడు. అలా, గృహ ప్రాంగణం లోనూ, గృహ ప్రాంగణం లోను - ఇల్లాలి జ్ఞాపకాలను భద్రపరచుకుని రోజులు దొర్లిస్తున్నాడు.

(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All images in this blog are copy righted to their respective owners.




17, జులై 2010, శనివారం

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ -భండారు శ్రీనివాస రావు

గ్రేట్ ఫెయిల్యూర్ స్టొరీ -భండారు శ్రీనివాస రావు
 (డిసెంబర్. ఆరు - రెండువేల ఆరులో రాసినదానికి కొద్దిపాటి సవరణలతో )

పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి -ఆగష్టు నెల- ఇరయయ్యవ తేది.

విజయవాడ, లబ్బీపేట లోని 'ఆంద్ర జ్యోతి' కార్యాలయం.

అందులో అడుగు పెట్టి - ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు గారిని కలుసుకున్నాను.



ఆయన ఎగాదిగా చూసి, నా పరిచయం కనుక్కుని-

'మీ అన్నయ్య ఒకటే చంపేస్తున్నాడయ్యా! పైకి పో. ఉపేంద్ర వుంటాడు. నేను పంపానని చెప్పు' అన్నారు ఫోన్ మీద చేయి వేస్తూ.

అదే నా తొట్ట తొలి ఉద్యోగ నియామకపు ఉత్తర్వు.

ఉపేంద్ర గారిని కలిసాను. కూర్చోమని సైగ చేసారు. గుర్రపు నాడా ఆకారంలో వున్నా బల్ల చివర్లో కూర్చున్నాను. పీ టీ ఐ , యు ఎన్ ఐ వార్తల్ని తెలుగులోకి తర్జుమా చేయమన్నారు. ఆ విధంగా మొదలయింది నా జర్నలిస్టు జీవితం.

ఉదయం ఎనిమిది గంటలకల్లా అన్నం తిని ఆంధ్ర జ్యోతి కి వెళ్ళే వాడిని. అన్నయ్య పర్వతాలరావు గారు ఇమ్మన్న రూపాయి నోటు వొదినె సరోజినీ దేవి నా చేతులో పెట్టేది. రాను పోను సిటీ బస్సుకు నలభై పైసలు. మధ్యాహ్నం ఆఫీసు కు ఎదురుగా వున్నా టీ స్టాల్లో ముప్పయి పైసలు పెట్టి ఒక సమోసా తిని టీ తాగేవాడిని. రోజుకు ముప్పయి పైసలు మిగిలేవి. వేరే ఖర్చులు లేవు. అలా నెలకు సుమారు పది రూపాయలు ఆదా. అదే నా మొట్టమొదటి నెలసరి ఆదాయం.

అలా మూడు నెలలు గడిచాయి. జీతం విషయం నేను అడగను లేదు - వాళ్ళు చెప్పను లేదు. ఒక రోజు అటెండర్ నాగేశ్వరరావు నా దగ్గరకు వచ్చి ఎక్కవుంటేంట్ ని కలవమని చెప్పాడు. వెడితే- ఓ ఓచర్ మీద సంతకం చేయించుకుని పది- పది రూపాయల నోట్లు - వంద నా చేతిలో పెట్టారు. అదే నా తొలి వేతనం.

ఉద్యోగం తప్ప వేరే ధ్యాస లేని రోజులవి. రాసిన ప్రతిదీ మర్నాడు పేపర్లో రాకున్నా- ప్రూఫ్ లో అచ్చయిన నా ఐటెంసుని నేనే చదువుకుని మురిసిపోయేవాడిని. నేను చేరిన కొత్తల్లోనే నార్ల గారు హైదరాబాద్ వెళ్ళిపోవడం - నండూరి రామమోహనరావు గారు భాద్యతలు స్వీకరించడం జరిగిపోయాయి.ఎందుకో ఏమోగానీ, దిన,వార పత్రికలకు సంబంధిoచిన అన్ని అంశాలలో నాకు తర్ఫీదు ఇచ్చారు. ప్రతిరోజూ ఎడిట్ పేజీలో కార్టూన్ తో కూడిన నాలుగు వాక్యాల గేయాన్ని 'వాక్టూనులు ' అనే శీర్షికతో రాసేవాడిని.
వాక్టూనులు
మార్నింగ్  మనాది 
ఉదయం ఎనిమిది గంటలకల్లా 
ప్రతి సెంటర్లో అందమయిన బొమ్మల్లా 
నిలబడే అమ్మాయిలనల్లా 
ఊడ్చుకుపోయే 
ఉమెన్స్ కాలేజ్ బస్ తో ఎల్లా?
                           -భండారు 

 సినిమా సమీక్షలు, పుస్తక సమీక్షలు, ఆదివారాల్లో - పిల్లలకోసం ప్రత్యెక కధలు -

భారత సైన్యం చేతిలో పాక్ ఓటమి

 బంగ్లాదేశ్ అవతరణకు దోహదం చేసిన పంతొమ్మిదివందల డెబ్బయి ఒకటి ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాల కదలికలను సూచించే మ్యాపులు - ఇలా అన్నింట్లో నేనున్నానంటూ వేలు పెట్టేవాడిని. శ్రీయుతులు ఉపేంద్ర, ఐ వెంకటరావు, కే.రామకృష్ణ, వీరభద్రరావు, ఎల్వీ రమణ, సత్యనారాయణ, ఆంజనేయులు, చంద్రశేఖర ఆజాద్ వంటి సహోద్యోగుల నడుమ నా ఆంధ్ర జ్యోతి ఉద్యోగ పర్వం నాలుగున్నర సంవత్సరాలపాటు ఇట్టే గడిచిపోయింది.

అన్నట్టు చెప్పడం మరిచాను. మొదట్లోనే నార్లగారు నాకో బ్రహ్మొపదేశం చేశారు. జర్నలిస్టు అనే వాడు ఎప్పుడూ, జేబులో రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకోవాలనే వారు. చాలా కాలంపాటు దాని పాటించాను కూడా. తర్వాతి రోజుల్లో రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఏదో విషయంలో పేచీ వచ్చి,రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చేశాను. అంతే! నెలరోజులపాటు మళ్ళీ ఆఫీసు మొహం చూడలేదు. చివరికి ఎవరో పూనుకుని రాజీ చేయడం, ఉద్యోగంలో తిరిగి చేరడం జరిగిపోయాయి. అదో అధ్యాయం.

హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో విలేకరిగా చేరడం యాద్రుచ్చికమే అని చెప్పాలి.


 అంతకుముందు ఈ ఉద్యోగాన్ని ఏంటో సమర్ధంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తురగా కృష్ణమోహన రావు గారు - గోల్కొండ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి- దురదృష్టవశాత్తు -నకిరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విధంగా ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయడానికి ఆకాశవాణి ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా నేను దరకాస్తు చేసుకోవడం, ఇంటర్వ్యూ కు హాజరు కావడం - సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఆంద్ర జ్యోతి అనుభవం ఈ ఉద్యోగం పొందడానికి అదనపు అర్హతగానే కాకుండా- అసలైన అర్హతగా తోడ్పడిందని నా నమ్మకం. రాసిన రాతలు అచ్చులో చూసుకునే అవకాశం ఆంద్ర జ్యోతి ద్వారా లభిస్తే- సొంత గొంతును తెలుగునాట నలుగురికీ వినిపించే వీలు రేడియోలో దొరికింది. వార్తా సేకరణ, కూర్పు, తెలుగులోకి అనువాదం ఇలాంటి ప్రక్రియలతో పాటు, రెగ్యులర్ న్యూస్ రీడర్లు రాని రోజున ఏకంగా స్టూడియో లోకి వెళ్ళిపోయి వార్తలు చదివేయడం- వారానికి రెండు మార్లు వార్తా వాహిని -

 ఒకసారి జీవన స్రవంతి (రోజువారి జరిగే ఘటనలకు కొంత హాస్యాన్ని జోడించి తయారు చేసిన ప్రత్యెక వార్తలు ) ఇలా అన్నిరకాలుగా నా రేడియో జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాను.

ఆ రోజుల్లో ఇన్ని పత్రికలూ లేవు. ఇంత మంది విలేకరులు లేరు. ముఖ్య మంత్రి నిర్వహించే విలేకరుల సమావేశానికే పది, పన్నెండు మంది హాజరైతే గొప్పగా వుండేది. నేను రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో కావడం వల్ల-వార్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగం, రేడియో పై ఎక్కువగా ఆధార పడాల్సి రావడం- రేడియో విలేకరిగా నా ప్రాధాన్యతను కొంత పెంచింది.

 
నాటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్యతో

 అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు - రేడియో మీది అభిమానాన్ని, నా మీది వ్యక్తిగత అభిమానాన్ని కలబోసి ప్రదర్శించేవారు. విలేకరుల సమావేశాలను -'శ్రీనివాస్ వచ్చాడా!' అని కనుక్కుని మొదలు పెట్టడం అప్పుడప్పుడు నలుగురిలో ఇబ్బంది పెట్టేది. తన ఎయిర్ బస్ మంత్రివర్గంపై చెలరేగిన విమర్శల దరిమిలా-మంత్రుల మూకుమ్మడి రాజీనామాలను ప్రకటించడానికి ఓసారి విలేకరులకు కబురు పెట్టారు. మధ్యాన్నం వార్తల టైం దగ్గర పడుతుండడంతో-రాజీనామాల సంగతి ముందుగా నా చెవిలో వేయడం - విలేకరుల సమావేశం మొదలు కాకముందే ఆ సమాచారం ప్రాంతీయ వార్తల్లో ప్రసారం కావడం జరిగి పోయింది. ఇది నా వృత్తి జీవితంలో మరచిపోలేని సంఘటన

ఆ రోజుల్లో ప్రతి రోజు సచివాలయానికి వెళ్లి మధ్యాహ్నం దాకా ప్రెస్ రూం లోనో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ల్లోనో గడిపి- అంతవరకు సేకరించిన సమాచారం తీసుకుని న్యూస్ బుల్లెటిన్ కు అందించడానికి కాలినడకన రేడియో స్టేషన్ కు వెడుతుండే వాడిని. ఒకరోజు అలా పోతున్నప్పుడు ముఖ్యమంత్రి పైలట్ వాహనం సైరన్ మోగిస్తూ వెళ్ళింది. అంజయ్య గారు- తన అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కారులో డ్రైవర్ పక్కన ముందు సీట్ లో కూర్చునే వారు.ఆయనకు కార్యకర్తల తాకిడి ఎక్కువ. వెనుక సీట్ లో ఎవరికి వారు దూరి పోయేవారు. ఈ ఇబ్బంది తట్టుకోవడం కోసమో ఏమో ఆయన ముందు సీట్ కి మారిపోయారు.

సరే! ఆ రోజు నా పక్కనుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి వాహనం కొద్దిగజాలు ముందుకుపోయి ఆగింది. ఆయన అంగరక్షకుడు బాలాజీ- - రిటైర్ అయిన తర్వాత ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో పనిచేస్తున్నారు- కిందికి దిగి సీఎం గారు పిలుస్తున్నారు రండి అనడం- నన్ను కారు ఎక్కించుకుని రేడియో స్టేషన్ లో దింపడం క్షణాల్లో జరిగిపోయాయి.అనుకోకుండా ముఖ్యమంత్రి రేడియో

స్టేషన్ కి రావడంతో మా వాళ్ళంతా అవాక్కయ్యారు. అంజయ్య గారు ఇలా నాపట్ల చూపిన అవ్యాజాను రాగాలకి ఇంకా ఎన్నో ఉదాహరణలు వున్నాయి. అవి ఆయన గొప్పతనానికి, మంచి తనానికి తార్కాణాలుగా భావిస్తానే కాని , నా ప్రత్యేకత ఏమీ లేదు.

1980 లో వైఎస్సార్ తో రచయిత



2005 లో వైఎస్సార్ తో రచయిత


2009 లో వైఎస్సార్ తో రచయిత  

నేటి ముఖ్య మంత్రి,నాటి హోం మంత్రి శ్రీ రోశయ్యతో రచయిత


పొతే, ఎందరో మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు, డీజీపీలు ,చీఫ్ సెక్రటరీలు, సీనియర్ ఐ ఏ ఎస్ , ఐ పీ ఎస్ అధికారులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు - ఇందరితో సాన్నిహిత్యాలు, విందులు, వినోదాలు,విమాన యానాలు,విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ చక్కర్లు - మాస్కో రేడియో ఉద్యోగ విజయాలు - ఓ విధమైన 'మత్తు 'లో వృత్తి జీవితం గడిచిపోయింది.

అటు చూస్తే, వ్యక్తిగత జీవితం ఓ గుండు సున్నా. జీతానికీ, జీవితానికీ పొంతన లేకపోవడంతో అందినంత వరకు అప్పులు చేయడం (చేబదుళ్లు పుట్ట వేమో కానీ జర్నలిష్టులకు మాత్రం బ్యాంకు రుణాలు కోకొల్లలు ) వాటిని తీర్చడం కోసం మళ్ళీ కొత్తవి చేయడం - అదో రుణ చక్ర భ్రమణం. ఇలా ఊబిలో కూరుకుపోయిన జీవితానికి ఆసరాగా మా ఆవిడ నిర్మల- 'అమ్మ వొడి'ని ప్రారంభించింది. కన్న సంతానం ఇద్దరు పిల్లలతో పాటు - మరో పాతికమంది పసి పిల్లల ఆలనా పాలనా నెత్తిన వేసుకుంది. ఓ గృహిణిగా సంసార భాధ్యతలో పాలు పంచుకుంటున్నదని అనుకున్నానే కాని, అలవికాని భారం మోస్తున్నదని అనుకోలేదు. ఫలితం - పదేళ్ళ తరవాత ఆమెకు జరిగిన ఓపెన్ హార్ట్ సర్జరీ. మరో పదేళ్ళ అనంతరం మొన్నీ మధ్య రెండో సర్జరీ.

ఇక వృత్తి జీవితం చివరి రెండేళ్ళు - కే ఎస్ శర్మ గారి పుణ్యమా అని హైదరాబాద్ దూర్ దర్శన్ వార్తా విభాగంలో ఆర్వీవీ గారి సారధ్యంలో దొర్లిపోయాయి. రెండువేల అయిదు డిసెంబరు ఆఖర్లో ఉద్యోగ విరమణ. మోహన్ కందా గారన్నట్టు- మనిషికి మరణం, ఉద్యోగికి రిటైర్మెంట్ రెండూ తప్పవు.




దూరదర్శన్లో ఉద్యోగ విరమణ రోజున

అందరికీ నమస్కారం...
జాతస్య మరణం ధృవం అన్నట్టు- సర్కారు ఉద్యోగికి ఏదో ఒకనాడు-'ఈనాడు ' అనేది రాక తప్పదు.

నా వృత్తి జీవితపు చరమాంకంలో కొద్దికాలం మీతో కలిసి పనిచేసే సదవకాశం దొరికింది. పరస్పర అవగాహనకు ఈ స్వల్ప సమయం చాలకపోవచ్చు. కానీ మీ అభిమానం చూస్తుంటే ఈ అభిప్రాయం తప్పేమోనని అనిపిస్తోంది.

చూస్తుండగానే ముప్పయ్యేళ్ళు చక చకా గడిచిపోయాయి.ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపూ వుండదన్నట్టు కాలం హాయిగా వేగంగా దొర్లిపోయింది. వొప్పచెప్పిన పనులతోపాటు చిన్నా చితకా ఇతరత్రాలు కూడా నెత్తికెత్తుకున్నందువల్ల -చేసే పనిలో ఏనాడూ రొటీన్ ఫీల్ కాలేదు.ఏరోజుకారోజు కొత్తగా గమ్మత్తుగా గడిచిపోయింది.

అసూయ తెలియని పై అధికారులు-అత్మీయత కనబరిచే సాటి సిబ్బంది- ఏ ఉద్యోగికైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది?

అందుకే- అత్త లేని కోడలులాగా అందరిలోను-అందరితోను కలిసిపోయి,కలగలిసిపోయి ఓ మోస్తరుగా అత్తెసరు మార్కులు కొట్టేయగలిగానని అనుకుంటున్నాను.

అయితే ఉప్పూ, కారం తినేవాడిని కనుక - ఎప్పుడో ఒకప్పుడు - ఎవరినోఒకరిని నొప్పించే వుంటాను. మాటతూలే వుంటాను. ఇలాంటి సందర్భాలలో అప్పటికప్పుడే సారీ చెప్పేసి మనసు కడిగేసుకోవడం నాకలవాటు. అయినా, నావల్ల మనసు నొచ్చుకున్నవారెవరైనావుంటే మన్నించమని మనసారా కోరుకుంటున్నాను. అప్పుడే ప్రశాంతమైన ఉద్యోగ విరమణ పర్వానికి అర్ధం పరమార్ధం.

నాకు మాట్లాడడం రాదు.ఇది నా మాట కాదు.-మా ఆవిడ ఉవాచ.

అందుకే మనసులోని మాటలను ఇలా అక్షరాలలో పరచి మీ అందరితో పంచుకుంటున్నాను.

మీ వద్ద సెలవు తీసుకునేముందు మరో మాట...

నిజమే!కృతజ్ఞతలు బాహాటంగా చెప్పడం చాల కష్టమే...

అందుకే మీ అందరికీ మరోసారి మరొక్క నమస్కారం.

ఇప్పుడు - ఇన్నేళ్ళ తరవాత -

'నడిచివచ్చిన దారిలో' ఆగి  ఓసారి  వెనక్కి తిరిగి చూసుకుంటే-

 ఎన్నో అనుభూతులు-అనుభవాలు.

అన్నింటి సమగ్ర సమాహారమే జీవితం.

నిజానికి జీవితంలో ఫెయిల్యూర్ స్టొరీ లు వుండవచ్చు-

 కానీ, ఏ జీవితం ఫెయిల్యూర్ కాదు.
(16-07-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

దడిగాడువానసిరా

మనసులో మాట - భండారు శ్రీనివాసరావు

దడిగాడువానసిరా

సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు చదువుతారంటారు.
కానీ ఇది తప్పున్నరతప్పు అభిప్రాయమన్నది మా సుబ్బారావు నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అన్నది మా వాడి థియరీ! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్‌' చేయడానికి వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు.


కాకపోతే అర్ధంలేని అనుమానాలతో కుట్రలు, కుతంత్రాలతో కూడిన బహిరంగ, జనాంకిత ప్రకటనలతో - అనంతంగా సాగే డైరీ సీరియళ్ళలోని ఆడతనం మచ్చుకులేని ఆడపాత్రలు - ఎప్పుడో ఒకప్పుడు వాణిజ్య ప్రకటనలకు కాస్తముందో వెనకో - వీలుచూసుకుని, వీలుచేసుకుని ప్రక్కవాళ్ళ డైరీలనో, ఉత్తరాలనో చదివే అమూల్య అవకాశం లేని పక్షంలో ఆదిక్కుమాలిన అనుమానాలు తీరిపోయే సువర్ణావకాశం తప్పిపోయి ఇక ఆ సీరియళు్ళ అనంత విశ్వంలో దారి తప్పిన రోదసీ నౌకల్లా అలా, అలా, అలా, అలా, అలా, ఏళ్ళ తరబడి అనంతంగా సాగిపోయే మహత్తర ప్రమాదం లేకపోనూలేదన్నది మా సుబ్బారావు వాదన.


ఈ రకమైన సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు చిన్నప్పుడు మా వూళ్ళో పార్‌‌ట టైమ్‌ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొంస్తుంటారు. వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని ఆ పైన వాటిని జాగ్రత్తగా అతికించి, తాపీగా ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం పోస్‌‌ట మాస్టర్‌గా తనకున్న కాపీరైట్‌గా భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా పాటిస్తుండేవాడు. అంతటితో ఆగితే ఏ చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ' ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?'  అంటూ ఆరాలు తీసేవాడు. ఇలా చాన్నాళ్లు  అతగాడి సెన్సార్‌షిప్‌ని మౌనంగా భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని రాసి వూరుకుంది. అంటే చదివినవాడు గాడిద అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం అనేది ఆ అమ్మడి భావం! కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే వెధవ అలవాటున్న ఆ పెద్దమనిషి - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.

తాజాతోక

ఈ శీర్షికకు `మనసులో మాట' అనే పేరు పెట్టడం వల్లా అలాగే చివర్లో `తాజాకలం' బదులు `తాజాతోక' అనే పదం వాడడం వల్లా ఈ రెండూ ఎక్కడో విన్నట్టుగా వుందే అనే ఫీలింగ్‌ పాఠకులకు కలిగితే దానికి రచయిత పూచీ ఎంతమాత్రం లేదనన్నీ ఆ పదాలపై అన్ని స్వామ్యములు ఈప్రజా స్వామ్యదేశంలో ఏ కొందరివో కాక అందరివనన్నీ సమస్త ప్రజానీకానికీ ఇందుమూలంగా తెలియచేయడమైనది. (16-07-2010 )

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

13, జులై 2010, మంగళవారం

అభిమానమా? అధిష్టానమా? – భండారు శ్రీనివాసరావు

అభిమానమా? అధిష్టానమా? – భండారు శ్రీనివాసరావు

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులను కలవర పరుస్తున్న ప్రశ్న ఇది.



దివంగత కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డి కుమారుడు, కడప ఎంపీ వై ఎస్ జగన్మోహనరెడ్డి తలపెట్టిన ‘ఓదార్పు యాత్ర’ లో మొదటి రెండు ఘట్టాలు కలిగించిన కలకలానికి పరాకాష్టగా మూడో దశ మొదలయి పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అభిమానానికీ, అధిష్టానానికీ నడుమ నలిగిపోతున్నకొందరు పార్టీ నేతలు 'ఈ యాత్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పెనుమార్పులకు తెర తీస్తుంద'ని కలవరపడుతున్నారు. ‘మాట తప్పని, మడమ తిప్పని తత్వం’ తండ్రినుంచి వారసత్వంగా సంక్రమించిందని చెప్పుకుంటున్న జగన్ వెన్ను చూపే ప్రసక్తే లేదని ఆయన అనుయాయులు అంటున్న నేపధ్యంలో - క్రమ శిక్షణను ఉల్లంఘించే వారిపై వేటుపడకతప్పదని, పార్టీని కాదని వెళ్లేవారికి రాజకీయంగా పుట్టగతులు వుండబోవని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు తేల్చి చెబుతున్న పరిణామ క్రమంలో - జగన్ అనుకూల, ప్రతికూల వర్గాలుగా పార్టీ శ్రేణులు నిట్ట నిలువుగా చీలిపోయి, మాటల ఈటెలతో బుల్లితెరలపై నికృష్ట రాజకీయాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్న తరుణంలో - జగన్ ఓదార్పు యాత్ర - ఈ వ్యాసం రాసే సమయానికి, అంచనాలను మించి సాగుతోంది. నిరుటి ఎన్నికల్లో ప్రతిపక్ష 'మహాకూటమిని' మట్టి కరిపించి వరసగా రెండోపర్యాయం అధికారపగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ- వైఎస్సార్ చనిపోయి ఏడాది తిరగకుండానే ‘కాళ్ళ పారాణి’ సామెతను గుర్తుచేస్తూ ఇలా గందరగోళంలో పడిపోతుందని కాకలు తీరిన రాజకీయపండితులు కూడా వూహింఛి వుండలేదు.



పొతే, ఇరుపక్షాలు తమ స్కంధారావాలతో తుదిపోరుకు సిద్దమయినట్టుగా మీడియా కోడై కూస్తోంది. జగన్ వైఖరిపై అధిష్టాన దేవత అగ్గిపై గుగ్గిలం చందాన ఆగ్రహంతో వున్నట్టు పరోక్ష కధనాలతో అగ్నికి ఆజ్యం పోస్తోంది. అధిష్టానం బూచిని చూపిస్తూ మరో పక్క జగన్ వ్యతిరేక శిబిరం పార్టీ శ్రేణులను అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అమీతుమీ తేల్చుకునే రీతిలో జగన్ పక్షం పట్టుదలగా వుండడం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. పాలకపక్షంలో బయటపడుతున్న ఈ చీలిక ప్రతిపక్షాలను ఆశల పల్లకీలో వూరేగిస్తోంది. 2009 ఎన్నికల్లో సమైక్యంగా వుండి కూడా సాధించలేని దానిని - కాంగ్రెస్ లోని ‘అనైక్యత’ అప్పనంగా అందించే పరిస్తితి ఇంత త్వరగా అందిరావడం ప్రతిపక్షాలకు ఆడబోయిన తీర్ధం ఎదురయిన చందంగా గోచరిస్తోంది. ఇంకా నాలుగు సంవత్సరాలు ‘పాలించే’ వీలున్నప్పుడు - ఎదురుతిరిగే వారిని ‘లాలించే’ ప్రసక్తే లేదన్న ధోరణిలో ‘ ధిక్కారమున్ సైతునా ’ అన్నట్టు కాంగ్రెస్ అధిష్టాన దీవత కొలువులోని పూజారులు, వారి తాబేదారుల ముఠా తన సహజ శైలిలో హుంకరిస్తోంది. ' ‘ఔరా! ఇలాటి వారికా మనం వోట్లు వేసి, పట్టంకట్టి నెత్తికెత్తుకుందని ' ఇవన్నీ గమనిస్తున్న షరా మామూలు ప్రజానీకం' మౌన వేదనకు గురవుతోంది.
ఇలా జరుగుతుందని పదినెలల క్రితం ఎవరయినా వూహించారా!
కానీ రాజకీయం అన్నది ఇలాగే వుంటుంది. అధికారం అన్నది ఇలాగే ఆడిస్తుంది. ఈ ఆట ఇలాగే కొనసాగుతుంది. ఎప్పటిదాకా? ప్రజలు కళ్ళు తెరిచేదాకా! (12-07-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

4, జులై 2010, ఆదివారం

Why blame EC? TRS protest unwarranted! - Bhandaru Srinivasrao(I.I.S.)

Why blame EC? TRS protest unwarranted!







Dragging the Election Commission into unnecessary political controversies is reprehensible. The decision of the Election Commission to slap a show cause notice on actress-turned-TRS MP is justifiable. The decision was taken based on her inflammatory remarks made at a

 Bhandaru Srinivasrao(I.I.S.)

meeting held at Party headquarters in Hyderabad. Such remarks, if not restrain, bound to vitiate peace in already surcharged political environs in the region in the wake of by-elections due later this month.

TRS decision to blame a constitutional body like Election Commission is also just unacceptable and inappreciable. None should be allowed to make such inflammatory remarks which flare up regional passions. More so, no responsible politician of Vijayashanti stature should have indulged in such emotive speeches which may ignite ‘hatred’ among two region people within the state.



The state bifurcation issue is already seized off by the Centre and the latter had constituted Justice BN Srikrishna Committee to carry out the required exercise. Why then make such inflammatory remarks?




"Telanganaku addam vacche vaallani addanga narikeyandi!" (‘Chop off whoever oppose Telangana!)

I, as a political analyst, feel there is no reason for the TRS to point accusing fingers at the state unit Election Commissioner IV Subba Rao.




The TRS MP’s arrest was following a sue motto case filed by the police themselves. If one has to believe the conflicting reports appearing either in news papers or presented in visual media, the case was registered on a complaint from an Inspector or constable. And, Subba Rao had already clarified this. He said the EC had nothing to do with the police case or her arrest. And, the EC had only slapped show cause after examining the video-clips of her speech at the party meeting.



In fact, Vijayashanti was charged under under IPC sections 153-A (Promoting enmity between different groups on grounds of religion, race, place of birth and residence) and 505(2) (Statements creating or promoting enmity, ill-will or hatred between classes). If the TRS has to blame, it has to the city police who booked the case. Why drag the Election Commission, which has nothing to do with the arrest of their MP?

I, for one feel, Subba Rao had rightly so issued the show cause notice based on the conclusion he arrived at after going throw the video-clips he gathered over her alleged inflammatory remarks made at a party meeting on the eve of by-polls. By issuing such a show cause notice, the EC only wanted to restrain all political parties which are partaking in the by-elections to restrain from indulging in such acts.




Similar initiatives by the then Chief Election Commissioner T N Seshan indeed brought more than semblance of discipline in conducting elections in the country. His bold, though harsh initiatives, to larger extent prevented people with criminal background from contesting polls. His electoral reforms also put some sort of ‘cap’ on election spending by contesting candidates. That too exceeded his brief and had to face the flak of apex court is another story. Yet, post-Seshan general elections held in the country continue to haunt his reforms fear.

In that back ground, one should view the EC decision in right perspective. It was only to discipline, if not caution, volatile politicians like Vijayashanti restraining from enacting the same in future. Had Subba Rao not slapped such a show cause notice, the police would not have taken action against Congress MLA Turpu Jaya Prakash Reddy. He too was arrested for similar remarks, which led to vitiate peaceful conduct of polls, akin to TRS MP Vijayashanti’s and let him off later.

Although, I find fault with TRS decision to blame the EC, I welcome their move to file a complaint with the same EC for taking action against none other the Pradesh Congress chief and party nominee from Nizamabad (urban) assembly constituency, D Srinivas, for violating the election code. The PCC Chief apparently sought votes on behalf of his caste and region, which certainly attracts action from the EC.

While appealing to all political parties to follow the election code to ensure peaceful conduct of by-elections to 12 assembly constituencies later this month, I also wish the Election Commission too apply the same yard stick that it has applied while slapping the show cause notice on TRS MP, even in case of the PCC Chief. By doing so, the EC not only disprove its ‘impartial’ (or unbiased) role in conducting free and fair polls.

I have full confidence in the EC as he received accolades for conducting free and fair polls (general elections) not so long ago. One just cannot forget that it was he who was instrumental in replacing the then state police chief SSP Yadav for the latter’s remarks at an official meeting.(04-07-2010 )

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

28, జూన్ 2010, సోమవారం

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు) - భండారు శ్రీనివాస రావు




                                                                                    


                                                      
  


                                      

                                                                                                             


జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు.గ్రంధ  ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం. అయినప్పటికీ, అనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకు జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే - ఇంచుమించు రెండు దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు ఐదేళ్ళ అనుభవాలను అక్షర బద్ధం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏకధ్రువ ప్రపంచ వ్యవస్తను ప్రశ్నిస్తూ- నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ - ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ కమ్యూనిష్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా  చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్షను ఎన్నో ఏళ్ళుగా అదిమిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణాలు అనేకం. ఆనాడు నేను చూసింది మరో ప్రపంచం. అప్పటికీ ఇప్పటికీ యెంతో తేడా.  

ఆ రోజుల్లో 'అలా వుండేదియిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన  'స్వర్ణ యుగాలుచరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా.  నేను  కమ్యూనిష్టుని కాను.  వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ  ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు.  ఒక సామాన్యుడిగా  అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం'  నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం.  నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయినగౌరవ ప్రదమయినతృప్తికరమయిన  రోజులు గడిపింది ఆ రోజుల్లోనే.  వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా  గోరంతను 'కొండంతచేసి చెబుతున్నానేమో అని  అనిపించకత ప్పదు.   అందుకే  'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సి వచ్చింది.  



అంతేకాదు.  కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం.  తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది.  విషయానికి న్యాయం చేయలేక పోతున్నామేమో  అన్న సంశయం  మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా  జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
(దస్వి దానియా అంటే రష్యన్ లో మళ్ళీ కలుద్దాం)
(ఇంగువ తెచ్చిన తంటా- గురించి మరోసారి).

NOTE: All the images in this blog are copy righted to their respective owners.


27, జూన్ 2010, ఆదివారం

మహిళలపై టీవీ ప్రభావం - భండారు శ్రీనివాసరావు


మహిళలపై టీవీ ప్రభావం 


ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం కాదు హింసాయుగం.
'ఎందెందు వెదికిచూసిన అందందే శ్రీహరి కనిపిస్తాడని' ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడితో అంటాడు. కానీ హింస కోసం అలా వెతకాల్సిన పని కూడా లేదు.
హింస ఎక్కడ లేదు? నగరాల్లో- గ్రామాల్లో- ఇళ్ళల్లో- వీధుల్లో- మాటల్లో- చర్చల్లో ఎక్కడ చూసినా హింస విలయతాండవం చేస్తోంది. అంతెందుకు - సినిమాల్లో చూపిస్తున్న హింస నేరుగా టీవీల ద్వారా  డ్రాయింగ్ రూముల్లోకి  జొరబడుతోంది. అవునా? కాదా?
అయిదేళ్ళక్రితం  అమెరికా వెళ్లాను. మన దగ్గరినుంచి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్న అనేకమంది తెలుగు పిల్లలు కనిపించారు. 'మీ ఈ  అభివృద్దికి కారణం  ఏవిటన్న నా ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానాలలో ఒకటి ఈనాటి ఈ చర్చకు సంబంధించినది  వుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు క్రమం తప్పకుండా  దూరదర్శన్ లో  క్విజ్ ప్రోగ్రాములు చూసే వాళ్ళమనీ,  ఆ నాలడ్జే తరువాత జీవితంలో అక్కరకు వచ్చిందనీ  వాళ్ళు చెప్పారు. 
టీవీల వల్ల పాజిటివ్  ఎఫెక్ట్  ఉంటుందనడానికి దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. 
లాహోర్ లో  ఇన్ష్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్  లో చదువుకునే విద్యార్ధులు నిరుడు ఒక పరిశోధనా పత్రం ఒకటి రూపొందించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఎఫెక్ట్ ఆన్ చిల్ద్రెన్  అన్నది సబ్జెక్టు. వాళ్ళ లెక్క ప్రకారం-
అక్కడి పిల్లల్లో -
పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు రోజుకి రెండుగంటలు టీవీ చూస్తారట. ఓ అరగంటపాటు హోం వర్క్ చేసుకుని -ఓ గంట టీవీ గేమ్స్  చూస్తారట. 

ఓ యిరవయి నిమిషాలు  రేడియో వింటారు. మరో యిరవయి నిమిషాలు పుస్తకాలు చదవడానికీ, ఓ గంట ఆటలకీ, రెండున్నర గంటలు స్నేహితులతో ముచ్చట్లకీ  ఖర్చు చేస్తారని తేలింది. 
మరో ఆసక్తి కరమయిన విషయం ఏమిటంటే - చాలామంది పిల్లలు టీవీ తమకు సెకండ్ పేరెంట్ లాంటిదని చెప్పారు. టీవీ వల్ల  ఇమాజినేటివ్ పవర్ పెరుగుతుందన్నారు. కొత్త భాషలు, కొత్త పదాలు నేర్చుకోవచ్చన్నారు. అదేసమయంలో వాళ్ళు మరో మాట కూడా చెప్పారు. పేద పిల్లలు టీవీ వల్ల నష్టపోతున్నారన్నారు. అలాగే పెద్దల నుంచి వేధింపులకు గురయ్యే పిల్లలు - టీవీలు చూసి హింసా మార్గం పడుతున్నారని, దౌర్జన్యకారులుగా తయారవుతున్నారని, చదువులో వెనకబడుతున్నారని వెల్లడించారు. ఈ పరిశోధన చేసిన విద్యార్ధులు కొన్ని విలువయిన సూచనలు కూడా చేశారు. బెడ్ రూముల్లో టీవీలు ఉండకూడదన్నారు. వాణిజ్యపరంగా నిర్వహించే టీవీ చానళ్ళను రెగ్యులేట్ చేయాలన్నారు. పిల్లలు చూసే ప్రోగ్రాములపై  పెద్దలు ఓ కన్నేసి వుంచాలన్నారు. 
రాజ్యాంగంలోని ఆర్టికిల్ యిరవై ఒకటి  మనందరికీ జీవించే హక్కు ఇచ్చింది. రయిట్ టు లివ్ విత్ డిగ్నిటి అంటే హుందాగా, గౌరవంగా జీవించే హక్కు కూడా ఈ అధికరణం పౌరులకు ఇస్తోందని - హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసాయి. టీవీల్లో మహిళలని అసభ్యంగా చూపించడం ఈ  ఆర్టికిల్ కి విరుద్ధం. కానీ ఏ టీవీ చానల్ కూడా దీన్ని పట్టించుకున్న దాఖలా  లేదు.
వంటలు-ఆరోగ్యం- ఎడ్యుకేషన్ - వీటి మీద చాలా ఛానళ్ళు అనేక చక్కటి ప్రోగ్రాములు అందిస్తున్నాయి. వీక్షకుల స్పందన కూడా వీటికి బాగా వుంది. మంచి సంగతులు సరే. చెడు ప్రభావం తలచుకుంటేనే భయపడాల్సి వస్తోంది. ఆడవాళ్ళల్లో- ముఖ్యంగా గృహిణుల్లో చాలామందికి టీవీ చూడడంతోనే సరిపోతోంది. సరయిన వ్యాయామం లేక ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయి.  పిల్లలు ఆకర్షణీయమయిన టీవీ యాడ్స్ చూసి  పిల్లలు జంక్ ఫుడ్స్ కి అలవాటుపడుతున్నారు. పత్రికల్లో ఇలాంటి ప్రకటనలు మామూలే కదా అనవచ్చు. కానీ నిరక్ష్యరాస్యులపై వాటి ప్రభావం అంతగా వుండదు. టీవీల యుగం వచ్చాక చదువుతో నిమిత్తం లేదు. చూసి  కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు. కన్స్యూమరిజం బాగా ప్రబలడానికి  ఈ డ్రాయింగ్ రూం  టీవీలే  కారణం. ఇన్ని రకాల టీవీలు లేని రోజుల్లో పల్లెటూళ్ల లోని  ఆడవాళ్ళకు అనేక రకాల కాలక్షేపాలు ఉండేవి. కుట్లు. అల్లికలు, సంగీతం  అలా ఏదో ఒక   ప్రయోజనకరమయిన వాటితో పొద్దు పుచ్చుకునేవాళ్ళు. ఇప్పుడో-  సీరియళ్లు చూస్తూ  వాటిపై   చర్చోపచర్చలు చేసుకోవడంతోనే  సరిపోతోంది. పిల్లలని  చూడడానికి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడి సీరియల్ ఏమయిపోతోందో అని బెంగ పడుతున్నారని వింటుంటే  వాటికి ఎంతగా ఎడిక్ట్  అయ్యారో అర్ధం చేసుకోవచ్చు. 
ఒక సూర్యుండు సమస్త జీవులకు  తానొక్కొక్కడయి తోచు  చందాన -  ఈ నాడు  ప్రయివేటు  ఛానళ్ళు కుటుంబంలో అందరికీ కావాల్సిన ప్రోగ్రాములను నేత్రానందంగా తయారుచేసి అందిస్తున్నాయి. కొన్నిసందర్భాలలో ఇవి కుటుంబ సభ్యుల నడుమ పొరపొచ్చాలకు  కూడా కారణమవుతున్నాయి. దానితో ఎవరికి వాళ్ళు తమ విభవం కొద్దీ ఎవరి గదుల్లో వాళ్ళు విడిగా టీవీ సెట్లు ఏర్పాటుచేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య అసలే అంతంత మాత్రంగా వున్న 'మాటా మంతీ'  దీనితో నామమాత్రంగా మారిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే  'గెస్టులు' గా తయారవుతున్నారు. ఇరుగు పొరుగు- చుట్టపక్కాలతో సంబంధబాంధవ్యాలే కనుమరుగవుతున్నాయి. టీవీ చూస్తున్న సమయంలో ఫోన్ వస్తే సమాధానం  చెప్పేవారే కరువవుతున్నారు. 
ఇక అశ్లీల కార్యక్రమాలను గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 
అశ్లీలాన్ని అరికట్టే  సదాశయంతో  రూపొందించే  ప్రోగ్రాములే అశ్లీల దృశ్యాలతో నిండిపోతున్నాయి. 
ఒక్క మాటలో చెప్పాలంటే- తీరిక పుష్కలంగా ఉన్నవాళ్ళకోసం ఛానళ్ళు  తీరిక లేకుండా  పనిచేస్తున్నాయి. 
-భండారు శ్రీనివాసరావు -  

NOTE: All the images in this blog are copy righted to their respective owners.