2, మార్చి 2014, ఆదివారం

పాతికేళ్ళనాటి మాస్కో - 9


 దేశంలో పిల్లలే ప్రత్యేకం అనుకుంటే - వారికి అన్నీ ప్రత్యేకమే.
పిల్లలకు ప్రత్యేక ఆసుపత్రులు,ప్రత్యేక స్కూళ్ళు, ప్రత్యేక ఆహారం, ప్రత్యేక దుస్తుల దుకాణాలు, ప్రత్యేక బొమ్మల షాపులు, కొన్న బొమ్మలకు వేసే చిన్ని చిన్ని గవున్లు, బొమ్మల జుట్టు శుభ్రం చేసేందుకు షాంపూలు, దువ్వెనలు, బ్యాటరీతో పనిచేసే బుల్లి బుల్లి హెయిర్ డ్రయర్లు మొదలయినవన్నీ అమ్మే ప్రత్యేక దుకాణాలు, విశాలమయిన ఆట మైదానాలు, గడ్డకట్టే చలిలో కూడా వెచ్చని నీళ్ళు వుండే ఈత కొలనులు, ఓ పక్కన జోరున మంచు కురుస్తున్నప్పటికీ పెరాంబ్యులేటర్లలో పసిపిల్లలను కూర్చోబెట్టి ఆరుబయట తిప్పడానికి వీలయిన దుస్తులు, వారికి వేసే కాలిజోళ్ళు, మేజోళ్ళు, పక్కబట్టలు, మంచాలు, పడక గదులు - అన్నీ ప్రత్యేకం. వీటిల్లో కొన్ని పూర్తిగా ఉచితం - మరికొన్నింటి ధరలు నామమాత్రం.


(మాస్కోలో ఇండియన్ స్కూల్, కేంద్రీయ విద్యాలయ్)

మాస్కోలో పనిచేసేవారికి అపార్ట్ మెంట్ల కేటాయింపులో పిల్లలదే కీలక పాత్ర. తలిదండ్రులకు ఎన్ని గదుల ఇల్లు కేటాయించాలనేది వారి హోదానుఉద్యోగాన్ని బట్టి కాకుండా వారి పిల్లల సంఖ్యను బట్టి నిర్ణయిస్తారు. మాకు ఇద్దరు పిల్లలు ఉండడంవల్ల మూడు పడక గదుల అపార్ట్ మెంట్ ఇచ్చారు.
మాస్కోలో లెనిన్ స్కీ ప్రాస్పెక్ట్ అనేది ప్రధాన వీధి. ఎనిమిది లేన్ల మార్గం. వీటికి అదనంగా ట్రాములు, విద్యుత్ తో నడిచే బస్సులు తిరిగే మార్గాలు. వీటన్నిటితో యెంతో విశాలంగా వుండే ఆ వీధికి సోవియట్ వ్యవస్తకు ఆది పురుషుడయిన లెనిన్ పేరు పెట్టారు. ఆ వీధి మధ్యలో రాకపోకలకు వీలయిన మరో మార్గం వుంటుంది. కానీ దాన్ని వాడుతున్న దాఖలాలు ఎన్నడూ కానరాలేదు. బహుశా గోర్భచేవ్ వంటి నాయకులకోసం దాన్ని ప్రత్యేకించారేమోనని అనుకుండేవాళ్ళం. చివరికి తెలిసిందేమిటంటే - అది స్కూలు బస్సులు వెళ్ళే మార్గమని.

ఒకసారి ఆ మార్గంపై వెడుతున్న ఒక కాన్వాయ్ ని చూసాము. ముందు మిలీషియా వాహనం ( రష్యన్ లో పోలీసులను 'మిలీషియా' అంటారు.) దానివెంట ఒక బస్సు, దాని వెనక అంబులెన్స్, వెనుకనే మరో పోలీసు వాహనం - ఏదో స్కూలు పిల్లలు పిక్నిక్ కి వెళుతున్నప్పటి సంబడం అది అని చెప్పారు. పిల్లల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా స్కూలు వాళ్ళు ముందు పోలీసులకు తెలియచేయ్యాల్సి వుంటుంది. అల్లా వుంటుంది అక్కడ పిల్లల పట్ల తీసుకుండే శ్రద్ధ.

పలికించెడి వాడు .....


అనుదిన జనాభిప్రాయం
"..........అన్న జగన్ మోహన రెడ్డి అభిప్రాయంతో ఏకీభవిస్తారా?....'అవును'- 87 శాతం, 'కాదు' - 13 శాతం"
"..........అన్న చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవిస్తారా? .......'అవును - 87 శాతం , 'కాదు' - 13 శాతం"
"..........అన్న కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయంతో ఏకీభవిస్తారా?...'అవును' - 87 శాతం, 'కాదు' - 13 శాతం"
"..........అన్న కేసీయార్ అభిప్రాయంతో ఏకీభవిస్తారా?.........'అవును' - 87 శాతం, 'కాదు' - 13  శాతం"    
(ఏ గూటి 'టీవీ' ఆ గూటి పలుకే పలుకుతుంది)

ఆరు నెలల క్రితం చెప్పిందే ఇప్పుడు చెబుతున్నాను.



విభజన – విచికిత్స (As published in today’s , 27-08-2013, Andhra Jyothy, Edit Page) – భండారు శ్రీనివాసరావు




“రాష్ట్ర విభజన అనివార్యం. ఆ నిర్ణయంలో మార్పువుండదు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అది మినహా వేరే ఏవైనా విషయాలుంటే చెప్పండి. అవి కూడా ఆంటోనీ కమిటీలో ” అని కాంగ్రెస్ అధినాయకత్వం తమను కలుసుకుని తమ గోడు వెళ్ళబోసుకోవాలని వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కుండ బద్దలు కొట్టినట్టు చెబుతోందని భోగట్టా.
ఈ నేపధ్యంలో అంశాలను సమీక్షించుకుంటే కొన్ని విషయాలు బోధపడతాయి. నిర్ణయం అమలుచేసే వ్యవధానం, ఎన్నికలు ముంగిట్లో వున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వుందా అన్న అనుమానాలు పక్కకి పెట్టిచూస్తే, కాసేపు ఆ పార్టీ చిత్తశుద్ధి పట్ల వున్న సందేహాలను కూడా పక్కకి నెట్టి చూస్తే, కనబడే రాజకీయ చిత్రం అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి.
విభజన నిర్ణయం తిరుగులేనిదని అంటున్నారు. అటువంటప్పుడు మళ్ళీ కమిటీల మీద కమిటీలు వేస్తూ పోవడాన్ని యెలా అర్ధం చేసుకోవాలి. విభజన విషయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాతుకునిపోయివున్న భయ సందేహాలను ఈ కమిటీ తీర్చగలుగుతుందా. వినడం తప్ప వేరే నిర్ణయం తీసుకోలేని ఈ కమిటీ ఏర్పాటు కేవలం కాలయాపన కోసమే అని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సింది ఏముంటుంది.
పార్టీ అధినేత్రి సోనియా గాంధి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపకల్పన చేసిన ఆహార భద్రత బిల్లు లోక్ సభ ఆమోదం పొందేలా చూడగలిగినప్పుడు, అదే వేగంతో నలుగురినీ సంప్రదించి ఒక ఆమోద యోగ్యమైన పరిష్కారంతో విభజన బిల్లు తయారు చేసి ఆమోదింప చేయడానికి వున్న అడ్డంకులు ఏమిటి? మీనమేషాలు లెక్కిస్తూ రోజులు దొర్లించడం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల్లో రాజుకుంటున్న విద్వేషాలు మరింత ప్రజ్వరిల్లడం మినహా సాధించేది ఏముంటుంది?
మాటల ఈటెలు విసురుకుంటున్న రాజకీయ నాయకులకు వచ్చేది పోయేది ఏమీ వుండదు. విద్వేషాలు మరింత ముదిరితే బాధ పడేది ఇరు ప్రాంతాల ప్రజలే. ఈరోజు ఒక పార్టీలో వున్న నాయకుడు పట్టుమని పదికాలాలపాటు అదే పార్టీలో వుంటాడన్న నమ్మకం ఆ పార్టీలకే లేదు. ఇక అలాటి వాళ్లని నమ్ముకుని ఆవేశకావేశాలకు దిగడం అంత తెలివితక్కువతనం మరోటి వుండదు.
మరో విషయం. తెలంగాణాని కోరుకుంటున్న వాళ్ళపై ఇప్పుడు పెద్ద బాధ్యత వుంది. కోరుకుంటున్నకల సాకారమయ్యే సంకేతాలు కనబడుతున్న దశలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం వున్నప్పటికీ, లక్ష్యానికి చేరువైన సమయంలో కటువైన వ్యాఖ్యలు చేయకుండా సంభాలించుకోవాల్సిన అవసరం తెలంగాణావాదులపై ఎక్కువగా వుంటుంది. పరిస్థితులు విషమంగా తయారవడం వల్ల ఆ సాకు చూపి తప్పించుకునే అవకాశం అధికార పార్టీకి ఇవ్వకూడదు. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలకు వున్న సందేహాలను తేలిక పరచి మాట్లాడ్డం తగ్గించాలి. వాటిని నివృత్తి చేసే పనికి నడుం కట్టాలి. ‘మీకేం భయం లేదు, మీ రక్షణకు మాదీ పూచీ’ అని టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు సయితం హామీలు గుప్పించడం విడ్డూరంగా వుంది. ఆ పని చేయాల్సింది, అలాటి హామీలు ఇవ్వాల్సింది అధికారంలో వున్నవాళ్ళు. ఆ హామీల అమలుకు సత్వరం ఒక నిర్దిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసినప్పుడే వాటిపట్ల ప్రజలకు విశ్వసనీయత కలుగుతుంది.
విభజన తప్పదు అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు అది చేతల్లో కూడా కనబడాలి. కానీ ఆ దిక్కుగా అడుగులు పడుతున్న సూచనలు కానరావడంలేదు, కేవలం మొక్కుబడి ప్రకటనలు తప్ప.
కాంగ్రెస్ పార్టీ కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కానీ, తమ స్వప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల ప్రయోజనాలను కాపాడుతాయా అన్నదే ఈ నాటి ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన జవాబు అన్వేషించడంలో పార్టీలు విఫలం అయితే భవిష్యత్ తరాలు మాత్రమే కాదు వర్తమానతరం వారు కూడా వాటిని క్షమించరు.
(27-08-2013)




పాతికేళ్ళనాటి మాస్కో - 8



దేవుడ్ని నమ్మని దేశంలో పిల్లలే దేవుళ్ళు

ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే - ఆ దేశం వారి పాలిట స్వర్గం. వారు ఆడింది ఆట, పాడింది పాట. చదువయినా  సంధ్యయినా వారి అభిరుచి ప్రకారమే. 'మా అబ్బాయి డాక్టర్ ని చేద్డామనుకుంటున్నాము, మా అమ్మాయిని ఇంజినీరు చదివిద్దామనుకుంటున్నాము' అంటే అక్కడ కుదరదు. చిన్న తరగతుల స్తాయిలోనే వారి వారి అభిరుచులను కనుగొనే పరీక్ష - (ఇంగ్లీష్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు)- పెట్టి ఆ విద్యార్ధి డాక్టర్ అవాలనుకుంటున్నాడో, ట్రాక్టర్ డ్రైవర్ కావాలనుకుంటున్నాడో - తెలుసుకుని ఆ కోర్సులో చేర్పిస్తారు. ఇందులో తలిదండ్రుల ప్రమేయం ఏమాత్రం వుండదు. చదివించే బాధ్యత కూడా సర్కారుదే కావడంవల్లా, డాక్టరుకూ, ట్రాక్టర్ డ్రైవర్ కూ జీతభత్యాలలో పెద్ద తేడాలు లేకపోవడంవల్లా, వారికీ అభ్యంతరాలు వుండవు.


(మా పిల్లలకు వేసవి వినోదం - చేపల వేట - ఫోటో కోసం)

మరో విచిత్రమయిన సంగతేమిటంటే జననాలను ప్రోత్సహించడం. యెంత ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కంటే  ప్రోత్సాహకాలు అంత ఎక్కువగావుంటాయి. పదిమందికి పైగా పిల్లల్ని కన్న 'సంతానలక్ష్ములను' జాతీయ అవార్డులతో సత్కరిస్తుంటారు. గర్భవతులయిన ఉద్యోగినులకు , గర్భం ధరించిన సమాచారం తెలిసినప్పటినుంచిసుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి అడుగులు వేసే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు మంజూరు చేస్తారు. ఆ పుట్టిన పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు ప్రభుత్వం వారికి కల్పించే రాయితీలూ, సదుపాయాలూ కనీ వినీ ఎరుగనివి.

ఒకే గడి ముడి - 1 (కొత్త ప్రయోగం)


తినే కాయలు కావు, గోకుడు కాయలు (6)

జవాబు : లుయకాటమచె (తిరగేయండి)     

1, మార్చి 2014, శనివారం

"పిసినారిని మించిన దాత లేడు"

ధర్మ సందేహం
అప్పుడెప్పుడో  అర్ధరాత్రి దూరదర్శన్ సప్తగిరి పెడితే 'ధర్మసందేహాలు' కార్యక్రమం నడుస్తోంది. దాంట్లో వినవచ్చిన ఓ మంచిమాట.
"పిసినారిని మించిన దాత లేడు"

"ధనవంతుడయిన ఓ పిసిని గొట్టు - జగదేకసుందరి లాంటి అమ్మాయిని వెతికి పట్టుకుని ఆమెను పెళ్ళాడి, పిల్లాడు పుడితే ఆస్తి పట్టుకు పోతాడేమో అని పిల్లాడ్ని కనకుండానే చనిపోయాడు. దాంతో అతడి ఆస్తి  అంతా పరాధీనం అవుతుంది. రూపాయో అర్దో ఇచ్చి పేరు తెచ్చుకునే దాతలకన్నా సమస్తాన్ని పరాధీనం చేసివెళ్ళిన ఆ పిసినారే పెద్ద దాత" 

పాతికేళ్ళనాటి మాస్కో - 7


స్త్రీ బాలవృద్దులదే హవా!

అక్కడ అన్ని విషయాల్లో పెద్దపీట స్త్రీబాలవృద్ధులదే.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తుపాకి పట్టగలిగిన ప్రతి ఒక్క మగవాడినీ- వయస్సుతో నిమిత్తం లేకుండా యుద్ధరంగానికి పంపిన కారణంగా - దేశాన్ని నడిపేందుకు మహిళల తోడ్పాటు అవసరమయిందని చెప్పుకుంటారు. ఆ రోజుల్లో రైళ్ళూ బస్సులూ ట్రాములూ నడపడంతోపాటు కర్మాగారాల్లో కూడా స్త్రీలే పనిచేసారు. అందుకు కృతజ్ఞతగా ఆనాటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం- ఆడవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. అనేక రాయితీలు, సదుపాయాలూ వారికి సమకూర్చింది. చలి దేశం కాబట్టి చిన్నదో, పెద్దదో ప్రతివారికీ ఒక గూడు అవసరం. కొంపాగోడూ లేనివాళ్ళు మనవద్ద మాదిరిగా ప్లాటు ఫారాలపైనా, ఫుట్ పాతులపైనా రోజులు వెళ్లమార్చడానికి అక్కడ వీలుండదు. ఇళ్ళ కేటాయింపును కుటుంబంలో ఆడవారి పేరు మీద జరిగే పధ్ధతి ప్రవేశపెట్టడంతో కాలక్రమేణా ఇంటి వ్యవహారాలలో పడతుల పట్టు పెరుగుతూ వచ్చింది. అంతే కాకుండా చదువులు ఉద్యోగాలలో మగవారితో పోటీ పడి సంపాదించుకున్న ఆర్ధిక స్వావలంబన వారి స్వేచ్చా జీవితానికి ఆలంబనగా మారింది. ఇంటిమీద హక్కులు, ఆర్దికపరమయిన వెసులుబాటు లభించడంతో ఇళ్ళల్లో వారిదే పైచేయి అయింది. నిండా యిరవయి ఏళ్ళు నిండకుండానే ఇద్దరు ముగ్గురు మొగుళ్ళకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్ళికి సిద్ధం కాగల సత్తా వారి సొంతం అయింది. మాస్కో రేడియోలో పనిచేసే నటాషా చెప్పినట్టు 'పండగనాడుకూడా పాత మొగుడేనా ' అనే వారి సంఖ్య పెరిగింది. 


సోవియట్ రష్యాలో ఏటా పెరిగిపోతున్న విడాకుల పట్ల అక్కడో జోకు ప్రచారంలోకి వచ్చింది. విడాకులు ఎవరు ఇచ్చినా, కొత్త ఇల్లు కేటాయించేవరకు పాత పెళ్ళాంతో, ఆమె తాజాగా కట్టుకున్న కొత్త మొగుడితో కలసి పాత పెళ్ళాం పాత ఫ్లాటులో నివసించాల్సిన పరిస్తితి మగవాళ్ళది. ఈ దుస్తితి పగవాళ్ళకి కూడా రాకూడదురా బాబూ! అని సరదాగా చెప్పుకునేవారు. అయితే అక్కడ ' ఏకపతీవ్రతం ' చేస్తున్న ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. పిలిపెంకో అనే ఎనభై ఏళ్ళ 'యువకుడితో' మా కుటుంబానికి పరిచయం ఏర్పడింది. ఆయన గారి ఏకైక భార్య గత కొన్ని దశాబ్దాలుగా  ఆయనగారితోనే కాపురం చేస్తోంది. ఒకే మొగుడితో కాపురం అన్న సూత్రమే ఆవిడనూ, మా ఆవిడనూ జత కల్పిందని పిలిపెంకో మహాశయులవారి అభిప్రాయం. చివరికి ఈ అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందంటే మేము ఇండియా తిరిగి వచ్చినతరవాత కూడా ఆ పిలిపెంకో దంపతులు హైదరాబాద్ వచ్చి మా ఇంట్లో వారం రోజులు వుండి వెళ్ళారు. గమ్మత్తేమిటంటే నాకూ, మా ఆవిడకు రష్యన్ తెలియదు. వారిద్దరికీ వాళ్ళ భాష తప్ప మరోటి తెలియదు.అయినా అనుబంధానికి ఇది అడ్డంకే కాలేదు. కాకపొతే - మాస్కోలో వున్నన్ని రోజులు మా పిల్లలే మాకు దుబాసీలు. 

మందు కిక్కిచ్చిందీ లేనిదీ తెలుసుకోవాలని వుందా?


అయితే ముందీ పనిచేయండి.ఈ లింక్ పై నొక్కండి.* http://www.selfcontrolfreak.com/slaan.html అప్పుడు *కనిపించే ఫోటోలో ఈ వ్యక్తిని చూస్తున్నారు కదా.* * * * మీ చేతిలోని **'**మౌస్**' **తో అతగాడి ముక్కుమీదక్లిక్ చేయండి.* *కొత్త విండో తెరుచుకుంటుంది. మళ్ళీ ఓ సారి అతడి ముక్కుపై క్లిక్ చేయండి.చేయగలిగితే మీకు కిక్కు ఎక్కనట్టే లెక్క.* (లేదా బొమ్మ పక్కన కనిపించే selfcontrolfreak.com  మీద క్లిక్ చేయండి.
ఇదీ పనిచేయకపోతే లింక్ ని పేస్ట్ చేసి ప్రయత్నించండి.

నవ్వు గ్యారంటీ (షరతులు వర్తిస్తాయి)


(ఆర్.వీ. ప్రభు గారి సౌజన్యంతో -)
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆపారు.పోలీసులు వచ్చారు. పుష్ప గుచ్చంతో..
కారులోకి తొంగి చూసారు. ముగ్గురు వున్నారు కారులో.
"
మీరు ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తున్నందుకు, సీటు  బెల్టు పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నందుకు మిమ్మల్ని ఈ వారం ఉత్తమ వాహనచోదకుడిగా గుర్తించి, మీకు అయిదువేల రూపాయలు బహుమతి ఇస్తున్నారు, ఈ "లాస్యా క్లబ్" వాళ్లు. మీరు ఈ డబ్బుతో  ఏం చేస్తారో చెప్పమని అడుగుతున్నారు' అన్నారు పోలీసువాళ్ళు.
కొడుకు అబద్ధకుమార్ గునుస్తూ చెప్పాడు.
'నేను నేనయితే ఈ డబ్బుతో డ్రైవింగ్ లైసెన్సుకి అప్లై చేస్తాను.'  
'వాడి మాటలు నమ్మకండి, వాడు బాగా తాగేసి వున్నాడు' అంది తల్లి జాణేశ్వరి.
ఇంతలో వెనుక సీటులో పడుకున్న తండ్రి కేటుకుమార్ నిద్ర నుంచి లేచి ఆవులిస్తూ చెప్పాడు.
"నేను అనుకుంటూనే వున్నాను. దొంగిలించిన కారులో మనం ఎంతో  దూరం వెళ్లలేమూ, చట్టం  చేతులు చాలా పొడవైనవీ, పోలీసులు ఎక్కడో అక్కడ కాపేసి పట్టుకుంటారు అని. చూశారా. ఇప్పుడు అదే జరిగింది.'
Top of Form


పాతికేళ్ళనాటి మాస్కో - 6


'జీవితమే ఉచితమూ..'
మాస్కో గురించిన మరపురాని అనుభవం మాకు మంచినీళ్ళతో మొదలయింది.1987 లో మాస్కో బయలుదేరినప్పుడు హైదరాబాద్ లో మంచినీళ్ళకు బాగా కటకటగా వుండేది. తెల్లవారుఝామున ఎప్పుడో ఒక గంటసేపు నల్లాల్లో నీళ్ళు వొదిలేవాళ్ళు. అదీ రెండురోజులకోమారు. తాగే నీళ్ళనూ వాడే నీళ్ళను పరమపొదుపుగా వాడుకునేవాళ్ళం. అలాటి పరిస్తితుల్లో మాస్కో వెళ్ళిన మాకు రాత్రీ పగలూ అని లేకుండా కొళాయిల్లో నీళ్ళు రావడం చూసి మతి పోయింది. బాతురూముల్లో, వంటింటిలో ఎక్కడ చూసినా మంచినీళ్ళ పంపులే. ఒకటి తిప్పితే ఫ్రిజ్ వాటర్ లాంటి చల్లటి, శుభ్రమయిన మంచినీళ్ళు. మరోదాంట్లో పొగలుగక్కే వేడినీళ్ళు. ఈ ఏర్పాటు ఏటిపోడుగునా అందుబాటులో ఉండడమే కాదు, పూర్తిగా ఉచితం కూడా. మాస్కో జీవితంలో మేము ఎన్నో ఉచితాలు రుచి చూసాము. అసలక్కడ- 'జీవితమే ఉచితమూ.. ' అని పాడుకోవచ్చు అని మిత్రులకు ఉత్తరాల్లో రాసేవాడిని.


(విందులు - వినోదాలు) 


పోతే, మాస్కో విషయాలు ముచ్చటించుకునేటప్పుడు మరచిపోకుండా చెప్పుకోవాల్సింది అక్కడి కరెంటు గురించి. మేము అక్కడ వున్న అయిదేళ్ళూ కరెంటు దీపాలు కన్ను కొట్టిన పాపాన పోలేదు. వోల్టేజి సమస్య అంటే అక్కడివారికి తెలియదు. వంటింట్లో వాడే గ్యాస్ కూడా పైపుల్లో సరఫరా అయ్యేది. సిలిండర్ అయిపోతే ఎట్లారా అన్న బెంగ లేదు. పైగా కరెంటు, నీళ్ళు, గ్యాస్, ఫోన్ అన్నీ ఉచితం. ఇంటి సంగతి సరేసరి. అంత పెద్ద అపార్ట్ మెంటుకు చెల్లించాల్సిన నెల కిరాయి పది రూబుళ్ళు దాటదు.   జీతం మాత్రం అటూ ఇటూగా వెయ్యి రూబుళ్ళు.


( స్త్రీబాలవృద్ధులదే అక్కడ అసలు హవా - అదేమిటో ఇంకో మారు)

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పాతికేళ్ళనాటి మాస్కో - 5


కన్నుకొట్టని కరెంటు దీపాలు
ఒక నగరం నగరాన్ని ఆ మాటకు వస్తే ఒక దేశం దేశాన్నీ అందులోనూ నీళ్ళు గడ్డకట్టే వాతావరణం కలిగిన దేశాన్ని వెచ్చగా వుంచడం అక్కడే చూసాను. ఏడాదిలో దాదాపు పదినెలలు మంచు దుప్పటి కప్పుకుండే మాస్కోలో దుప్పటి అవసరం లేకుండా నిద్ర పోవడం అక్కడే సాధ్యం. అదీ పైసా (కోపెక్) ఖర్చు లేకుండా. ఇళ్లూ వాకిళ్ళూ , ఆఫీసులు, బస్సులు, ట్రాములు, మెట్రో రైళ్ళు, సినిమా హాళ్ళు, హోటళ్లు, స్కూళ్ళు, కాలేజీలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రష్యన్ సర్కస్ డేరాలు చివరాఖరుకు స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఎయిర్ కండిషన్ అంటే నమ్మశఖ్యమా చెప్పండి. ఇంటి బయట ఎముకలు కొరికే చలి పులి పంజా విసురుతున్నా- ఇంట్లో మాత్రం లుంగీ పైజమాలతో మసలగలిగేంత వెచ్చగా వుండేది. ఆ వెచ్చదనం కూడా ఏటిపోడుగునా ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా ఒకేమాదిరిగా వుండడం వల్ల ఆ అయిదేళ్ళలో ఒకసారి కూడా తుమ్మాల్సిన అగత్యం రాలేదు. ఎయిర్ కండిషన్ వ్యవస్తకు  మరమ్మతులు చేయడానికి మాత్రం వేసవిలో ఓ పదిహేను రోజులు ఈ సదుపాయాన్ని నిలుపు చేస్తారు. అసలు ఈ వ్యవస్థ పనిచేసే విధానమే మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళ్లు ఆఫీసులు అన్నిటిలో వేడినీరు ప్రవహించే ఇనుప గొట్టాలు వుంటాయి. ఆ గొట్టాలనుంచి సదా వెలువడే వేడితో ఇల్లంతా వెచ్చగా వుంటుంది. బయట ఉష్ణోగ్రతల్లో ఏర్పడే హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఈ గొట్టాలలో ప్రవహించే నీటి వేడిని పెంచడమో తగ్గించడమో చేస్తుంటారు. దేశ ప్రజలను పొత్తిళ్ళలో పాపాయిలమాదిరిగా నులి వెచ్చగా ఉంచేందుకు అక్కడి పాలకులు చూపించిన శ్రద్ధాసక్తులకు ఇదో చక్కని తార్కాణం.


(హాయిగా తెలుగువార పత్రిక తిరగేస్తూ మా ఆవిడ నిర్మల)


 అలాగే రాత్రల్లా కురిసిన మంచుతో కప్పుకుపోయిన రహదారులను తెల్లవారేసరికల్లా వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఒక దారికి తీసుకురావడం , అందుకు పడుతున్న శ్రమా, పెడుతున్న ఖర్చూ చూసేవాళ్ళకు కళ్ళు తిరగక మానవు. ప్రతి రోజూ అర్ధరాత్రి దాటిన  తరవాత అంటే సుమారు రెండుగంటలనుంచి ఓ రెండు మూడు గంటలపాటు రహదారులపై బస్సులు, ట్రాములు మొదలయిన వాహనాలతో పాటు మెట్రో రైళ్ళ రాకపోకలను నిలిపివేస్తారు. అక్కడినుంచి మొదలవుతుంది  యుద్ధ ప్రాతిపదికన రోడ్లపై మంచు తొలగించే కార్యక్రమం. వార్ ఫుటింగ్ అన్న పదానికి సరయిన అర్ధం తెలుసుకోవాలంటే దీన్ని  ఒక సారి పరిశీలించాలి. మొత్తం మూడు రకాల వాహనాలను ఇందులో వాడతారు. ముందు ఒక వాహనం ఉప్పు కలిపిన ఇసుకను రోడ్లపై చల్లుకుంటూ వెడుతుంది. దానితో గట్టిగా పేరుకుపోయిన మంచు నీళ్లగా కరుగుతుంది. రెండో వాహనం కింద అమర్చిన చీపురు యంత్రాలు ఆ ఇసకను, నీటిని చిమ్మివేస్తాయి. మూడో వాహనం నీటితో రోడ్లను శుభ్రంగా అద్దంలా కడిగేస్తుంది. ఇది ఏదో బాగా వర్షం పడినప్పుడు హడావిడి చేసి చేతులు దులుపుకోవడంలాంటిది కాదు. ఇది సంవత్సరం అంతా జరిగే కార్యక్రమం. పైగా నిత్య కృత్యం.

దేవుణ్ణి దూరం చేసుకుని పెద్ద పొరబాటే చేశా!




దేవుడంటే వుండాల్సింది భక్తా? భయమా?


చిన్నతనంలో నాకు దేవుడంటే భయంతో కూడిన భక్తి. తెల్లవారుఝామున లేచి స్నానం చేసి బెజవాడ గవర్నర్ పేట శివాలయం వీధిలో వున్న గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి విబూది పట్టీలు పెట్టుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుని వచ్చేవాళ్ళం. అదేమిటో బడికి వెళ్ళిన తరువాత కూడా నుదిటిమీద విబూది రేఖలు అలాగే చెదరకుండా వుండేవి. ఇప్పట్లా గుడికి వెళ్ళినప్పుడల్లా కొబ్బరికాయలు కొట్టడం, హుండీలో డబ్బులు వేయడం ఎరగం. ఆ రోజుల్లో గుళ్ళు కూడా ఎంతో ప్రశాంతంగా వుండేవి. కాసేపు కూర్చోవాలని అనిపించేది.
ఇళ్ళల్లో కూడా ఇప్పటిమాదిరిగా విడిగా పూజ గదులు వుండేవి కావు, దేవుడి గూళ్ళు తప్ప. దేవుళ్ళందరూ గూటికే పరిమితం. అక్కడే గోడమీద పసుపూ సున్నం  కలిపి ఎర్రగా తిరుపతి వెంకన్న నామాల పట్టెడ వుండేది. ఇంటిల్లిపాదీ అక్కడే నిలబడి దణ్ణం పెట్టుకునేవారు. స్నానం చేసి దణ్ణం పెట్టుకోవడం మినహా ఇక ఎలాటి నియమాలు వుండేవి కావు. నాకు తెలిసి అది భక్తి. ఇప్పుడు పూజ గదుల్లో దేవుడి పట్ల భక్తి కంటే భయం ఎక్కువ కనిపిస్తోంది.
తరవాత్తరవాత ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మనుషుల  మనస్తత్వాల్లో మార్పులు రావడం మొదలయింది. ‘దేవుడు లేదు’ అనే గోరాగారి ప్రభావం.(దేవుడు లేడు అనేవారు కాదు, ఎందుకంటే ఆయన దృష్టిలో దేవుడే లేడు కనుక ఆయన మగో ఆడో అనవసరం అనుకుని  ‘లేదు’ అని అంటుండేవారు. సరే! ఆయన మరణించిన తరువాత ఇప్పుడు ఆ కుటుంబానికి ఆయనే దేవుడు అనుకోండి. నిజానికి దేవుళ్ళు ఇలానే పుడతారేమో).
‘తెలుగునాట భక్తి రసం వరదలుగా పారుతోంది’ వంటి రచనల స్పూర్తి.
దేవుణ్ణి విమర్శిస్తే నలుగురిలో పెరుగుతున్న గౌరవం.
మొత్తానికి ఏమయితేనేం దేవుడు క్రమంగా దూరం అవుతూ వచ్చాడు. (ఇదీ ఒక భ్రమే! ఇందుగలడందులేడనేవాడు దూరం కావడం ఏమిటి? దూరం చేసుకోవడం ఏమిటి?)
తోటివాళ్ళు, సాటివాళ్ళు సావాసగాళ్ళు చాలామంది అదేబాటన వెడుతూ సంఘంలో మర్యాద,మన్నన పొందడం చూసి దేవుడికి మరింత దూరం జరిగాను. (ఈ నాస్తికులలో  చాలామంది దేవుడ్ని తమ బాగుకోసమే ఉపయోగించుకున్నారనీ, సాధారణ ఆస్తికులకంటే ఎక్కువగా దేవుడ్ని నమ్ముతారనీ చాలాకాలం తరువాత తెలిసింది). పెళ్లి వేడుకలకు స్వస్తిచెప్పాను. పిల్లలకు బాలసారలు చేసి పేర్లు పెట్టలేదు. మా పెద్ద పిల్లవాడు కడుపులో వున్నప్పుడు సూర్య గ్రహణం వస్తే, అప్పట్లో వున్న నమ్మకాలను కాదని  మా ఆవిడను చీకటి గదిలో పడుకోనివ్వలేదు. పైగా పిండి కలిపి రొట్టెలు చేస్తే, అవకరం కలిగిన  పిల్లలు పుడతారని భయపెట్టే జనం మధ్య సొంత ప్రయోగాలు ధైర్యంగా చేసాను. మా ఆవిడ సహకారం లేకపోతే ఇవి సాధ్యమయ్యే పనులు కాదు.
నా తరహా తీరూ చూసి మా వాళ్లల్లోనే చాలామంది నాకు నాస్తికుడనే ముద్ర వేసారు. పూజలు, పునస్కారాలతో దేవుణ్ణి మరింత దూరం చేసుకుంటున్నామన్నది నా ఉద్దేశ్యం. భక్త కన్నప్ప నాకాదర్శం. కానీ నా గోడు వినేవాళ్ళెవ్వరు ఆ దేవుడు తప్ప.  
సరే! దేవుళ్ళ గురించి తక్కువ మాట్లాడాలి ఎక్కువ ఆలోచించాలి అనే స్పృహ కలిగించింది మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు.  గోరాగారిని పరిచయం చేసిందీ ఆయనే. అనేక పరిశోధనలు చేసి నారసింహతత్వాన్ని బోధించింది ఆయనే. సమర్ధుడు కనుక ఈ ద్వంద్వ ప్రకృతిలో ఆయన నెగ్గుకు రాగలిగాడు. నేను కొట్టుకు పోయాను.
అయితే ఈ క్రమంలో సాగుతూ వచ్చిన సంభాషణల్లో, వాద ప్రతివాదాలలో అనేక ఆసక్తికర విషయాలు బోధపడుతూ వచ్చాయి. దేవుడ్ని నమ్మిన వారు, నమ్మని వారు కూడా తెలుసుకోదగ్గ సంగతులవి.
గుడిలో ఏముందీ?
గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం గుడిలో వుంది.
వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్నాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.  
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకు,  అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో  మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ  సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి  ఇప్పుడో! వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి  మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో  ఇది సాధ్యమా అంటే అనుమానమే. (09-01-2013) 

ప్రశ్నోపనిషత్

ప్రశ్నోపనిషత్ 
“నాయనలారా… నేను అడిగిన దానికి అడిగినట్టు సమాధానము చెప్పుడి…”
“అటులనే”
“2006 తరవాత ఏమి వచ్చును?”
“2007 వచ్చును”
“కరెక్ట్‌ ఆన్సర్‌! మీరో కొవ్వత్తి గెలుచుకున్నారు. బైదిబై… ఇంత టఫ్‌ ప్రశ్నకి అంత ఈజీ సమాధానం చెప్పావంటే… నాకు భలే ముచ్చటేస్తోంది. నా పదహారో ఏడు వరకు నా పేరు కూడా నేను సరిగ్గా చెప్పలేకపోయే వాణ్ణి. కాబట్టి… మీరింత చిన్న వయసులో ఎంత చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పినా నాకు పిచ్చిపిచ్చిగా ఆనందం కలుగుతుంది. వెర్రివెర్రిగా ఆశ్చర్యం వేస్తుంది.
తరవాతి ప్రశ్నలు చాలా కష్టం… రెడీ అయ్‌ ఉండండి… ఈసారి నేను వరసగా పది ప్రశ్నలు అడుగుతాను. ఠకీఠకీమని సమాధానం చెప్పాలి.”
“ఓకే. మేం రెడీ”
“దానము వల్ల ఏమి పుట్టును…?”
“పుణ్యము పుట్టును”
“వాగ్దానము వల్ల ఏమి పుట్టును?”
“అధికారము పుట్టును”
“వాగ్దానము తప్పినచో ఏమి పుట్టును?”
“ఆందోళన పుట్టును”
“ఆందోళన ఎవరికి పుట్టును?”
“అధికారమున ఉన్నవారికి పుట్టును”
“ఆందోళన ఎవరివల్ల పుట్టును?”
“ప్రజాగ్రహము వల్ల పుట్టును”
“ప్రజాగ్రహము ఎందులకు పుట్టును?”
“విద్యుక్త ధర్మమును వీడినందులకు పుట్టును”
“ఉచిత విద్యుత్తు వల్ల ఏమి పుట్టును?”
“ఉచితముగా అధికారము పుట్టును”
“అనుచిత విద్యుత్తు వల్ల ఏమి పుట్టును?”
“రైతుల గుండెలయందు మంట పుట్టును”
“మంట వల్ల ప్రభుత్వమునకు ఏమి పుట్టును?”
“సెగ పుట్టును”
“అప్పుడు ప్రభుత్వమునకు ఏమి ఆలోచన పుట్టును?”
“చేతులెత్తు ఆలోచనలు మెండుగా పుట్టును”
“ఓ సెభాష్‌. మీరు రెండు టార్చి లైట్లు, ఒక చార్జింగ్‌ లాంతర్‌ గెలుచుకున్నారు. తరవాతి రౌండ్‌లోకి వెళ్ళేముందు… కాసేపు కరెంట్‌ కట్‌”
(శ్రీ వింజమూరి వెంకట అప్పారావు, శ్రీ జీ ఎస్ నవీన్ల సౌజన్యంతో -)

పాతికేళ్ళక్రితం మాస్కో - 4


మంచు కాలం 
మాస్కోలో మేము అడుగుపెట్టింది ఎముకలు కొరికే చలి కాలంలో.
ఇండియా నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మాకు ఆ వాతావరణం ఓ పట్టాన కొరుకుడుపడలేదు. కొన్నాళ్ళు వానలు, కొన్నాళ్ళు చలి గాలులు, మరికొన్నాళ్ళు మండే ఎండలు - ఇలాంటి వాతావరణం తెలుసు. కానీ అక్కడి వాతావరణం గురించిన ఒక జోక్ ఇలా ప్రచారంలో వుంది. 'మాస్కోలో మొదటి నాలుగు నెలలు చలికాలం- తరువాత మరో నాలుగు నెలలు చలికాలం. పోతే, మిగిలిన నాలుగు నెలలు చలికాలమే'
ఏప్రిల్, మే నెలల నడుమ ఓ పదిహేను, యిరవయి రోజులు వేసవి కాలం పలకరిస్తుంది. అప్పుడు కూడా డిల్లీలో చలికాలం మాదిరిగా ఎండ కాస్తుంది. దానికే మాస్కో వాసులు తెగ సంబరపడిపోతారు. ఆ సంబరంలో వాళ్లకు వొంటిమీద బట్టనిలవదు. ఏటిపొడుగునా ధరించే ఎలుగుబంటి దుస్తుల్ని వొదిలిపెట్టి - ఆడవాళ్ళు స్కర్టుల్లోకి, మగవాళ్ళు నిక్కరు,టీ షర్టుల్లోకి మారిపోతారు. నిజానికి, రష్యన్ల మేని ఛాయ తెల్లని తెలుపు. కానీ చలి దుస్తుల్లో వారి అందం కాస్తా మరుగున పడిపోతుంది. ఫర్ కోట్లు, ఫర్ టోపీలు ధరించిన తరవాత ఎవరు ఆడో - ఎవరు మగో గుర్తు పట్టడం కష్టం మరి. 


(ఓ వేసవి సాయంత్రం మాస్కో వీధిలో మా కుటుంబం) 


ఇక మాస్కో గురించి చెప్పుకోవాలంటే అక్కడ కురిసే మంచు గురించి ముందు ముచ్చటించుకోవాలి. తెల్లటి మంచు పూలరేకులమాదిరిగా నిరంతరం నింగినుంచి 'దేవతలు పుష్పవృష్టి' కురిపిస్తున్నట్టు జాలువారుతూనే వుంటుంది. ఆ మంచు వానలో దుస్తులన్నీ 'మంచు కొట్టుకు పోతాయి' కానీ 'తడిసి ముద్దయి' పోవు. ఎందుకంటె అక్కడి 'మైనస్' టెంపరేచర్లలో మంచు కరిగి నీరుగా మారే అవకాశమే లేదు. తెల్లవార్లూ ఎడతరిపి లేకుండా కురిసే మంచులో ఇళ్ళ ముందు పార్కు చేసిన కార్లు నిలువెత్తు మంచులో కూరుకుపోతాయి. ఆ మంచుని తొలగించి కార్లను మళ్ళీ రోడ్డు ఎక్కించడం వాటి యజమానులకు రోజూ ఒక సమస్యే. అందుకే చాలామంది కార్లను 'మంచు సమాధుల'లోనే ఉంచేసి , మెట్రో రైళ్ళ పయినే రాకపోకలు సాగిస్తుంటారు. 

అదిగో నవలోకం

భూగర్భంలో కొన్ని వందల అడుగుల దిగువన నిర్మించిన ఒక అద్భుత నిర్మాణం 'మాస్కో మెట్రో'. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ మెట్రో రైళ్ళు - తెల్లవారు ఝామునుంచి అర్దరాత్రివరకు నిరంతరం సంచరిస్తూ లక్షలమంది ప్రయాణీకులను గమ్యాలకు చేరవేస్తుంటాయి. చిత్రమేమిటంటే- నేలపైన, రోడ్డుపక్కన మెట్రో స్టేషన్ వున్నచోట 'ఎం' అనే అక్షరం రాసిన గుర్తు మాత్రమే వుంటుంది. ('ఎం' అనే అక్షరాన్ని ఇంగ్లీష్ లో మాదిరిగానే రష్యన్లోకూడా రాస్తారు) అక్కడనుంచి భూగర్భంలోని స్టేషన్ కు చేరడానికి ఎస్కలేటర్లు వుంటాయి . అయిదు కోపెక్కుల (రష్యన్లకు మన అయిదు పైసలతో సమానం) నాణెం అక్కడి మిషన్లో వేయగానే ఎస్కలేటర్లలోకి వెళ్ళే ద్వారం ఆటోమాటిక్ గా తెరుచుకుంటుంది.
 
ఒక్కసారి అయిదు పైసలు వేసి ఏదయినా ఒక మెట్రో లోకి ప్రవేశించామంటే చాలు, దానితో మాస్కో నగరం భూగర్భంలో నిర్మించిన సుమారు నూట నలభయి స్టేషన్ లకు యెంత దూరమయినా, ఎన్నిసార్లయినా ప్రయాణం చేయవచ్చు.
 ఒక స్టేషన్ కు మరో స్టేషన్ కు పోలిక లేకుండా విభిన్న ఆకృతులతో, సోవియట్ యూనియన్ లోని వివిధ ప్రాంతాల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వాటిని నిర్మించిన విధానం అపూర్వం. భూ ఉపరితలానికి వందల అడుగుల దిగువన అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల కాంతి లో పట్టపగలులా మెరిసిపోయే మాస్కో మెట్రో స్టేషన్ లు మయసభలను మరిపిస్తూ మానవ నిర్మిత కట్టడాల ప్రశస్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నయా అన్నట్టుగా వుంటాయి.

 
అంత లోతున డజన్లకొద్దీ నిర్మించిన సొరంగ మార్గాలలో మెట్రో రైళ్ళు మెరుపు వేగంతో పరుగులుతీస్తుంటాయి. రైలు  వెళ్లి పోయిందే అన్న బెంగ లేకుండా ఒక దానివెంట మరొకటి నిమిషాల వ్యవధిలో రాకపోకలు సాగిస్తుంటాయి.
 రైలు  ప్లాటు ఫారం మీదకు రాగానే తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకుంటాయి. ప్రయాణీకులు దిగినదాకా ఆగి ఎక్కాల్సిన వాళ్ళు తోపులాటలు లేకుండా ఎక్కుతుంటారు. ఈ రైలు తప్పిపోతే ఇలా అనే భయం వారికి లేకపోవడమే ఇందుకు కారణం. మరో నిమిషంలో మరో రైలు వస్తుందనే భరోసా వారికి ఆ ధైర్యాన్ని ఇస్తోంది. ఒకసారి పిల్లలతో వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎక్కగలిగారు కానీ నేనూ మా ఆవిడా ఎక్కేలోగానే రైలు కదిలింది. చిన్నపిల్లలయినా ఏమాత్రం కంగారు పడకుండా పక్క స్టేషన్ లో దిగిపోయి మా కోసం ఎదురుచూశారు. వెనువెంటనే వచ్చిన మరో మెట్రో రైలు లో వెళ్లి మేము వారిని కలుసుకున్నాము. మెట్రో గురించిన మరో విశేషం ఏమిటంటే - సమయ పాలన. నేను అక్కడవున్న అయిదేళ్ళు ఒక విషయం గమనించాను. మెట్రోలో మా ఆఫీసు కు వెళ్ళడానికి పద్నాలుగు నిమిషాలు పట్టేది. ఏరోజునా అరనిమిషం తేడా కూడా వచ్చేది కాదు. అంత ఖచ్చితంగా రైళ్ళు నడిచేవి. 

(మాస్కో 'గోంగూర' గురించి మరోసారి)