3, ఆగస్టు 2022, బుధవారం

ప్రతి ఊళ్ళో, ప్రతి గుళ్ళో నాదస్వరం

 (ఆగస్టు మూడు పినాకపాణిగారి జయంతి)

డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అరుదయిన వ్యక్తే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుగడ్డ గర్వించదగిన పదహారణాల తెలుగుబిడ్డ.

చాలా ఏళ్ళ క్రితం సంగతులు.

జంటనగరాలలో రెండు సంగీత కళాశాలలు వున్నాయి. ఒకటి సికింద్రాబాద్ లో, రెండోది హైదరాబాద్ లో. సికింద్రాబాద్ కాలేజీకి నూకల చిన్న సత్యనారాయణ ప్రిన్సిపాల్ అయితే, హైదరాబాద్ కాలేజీకి హిందుస్తానీ విద్వాంసులు దంతాలే ప్రిన్సిపాల్. అప్పట్లో రెండు కాలేజీలు కలసి రవీంద్రభారతిలో త్యాగరాజ స్వామి ఉత్సవాలు నిర్వహించేవారు. ఉదయం నుంచి ప్రసిద్ధ విద్వాంసుల కచేరీలు మొదలయ్యేవి. ఇక రోజంతా అక్కడే గడపడం. పక్కనే వున్న గోపి హోటల్లో టిఫినూ, భోజనమున్నూ.

ఈ ఉత్సవాల్లో ఓ రోజు సంక్రాంతి వచ్చింది. ఆవేళ ఉదయం పదకొండు గంటలకు కోటి శ్రీ కృష్ణదేవరాయ ఆడిటోరియం లో పినాకపాణి గారి సోదాహరణ ప్రసంగం, కర్ణాటక సంగీతంలో నెరవు (అరవంలో నెరవల్) స్వరకల్పన ఈ రెండింటిపై.  ఆ రోజు హాజరు కాని సంగీత అభిమానులది దురదృష్టమనే చెప్పాలి. నాలుగు గంటలకు పైగా పాణి గారు అద్భుతమైన ప్రసంగం చేసారు. కళ్యాణి రాగంలో ‘మది దేహి’ అనే కీర్తనలో ‘పతిత పావన’ అనే చోట నెరవు, స్వరకల్పన గురించి. నిజంగా అమ్మవారు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది అందరికి. పండగ విందు అక్కడే దొరికింది. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పినాక పాణి మీద కవర్ పేజి కధనం ప్రచురించింది. జి ఎన్ ఎస్ రాఘవన్ గారు రాసారు. ఆయన ఆకాశవాణి వార్తా విభాగానికి డైరెక్టర్ గా పని చేసారు.  రాఘవన్ కు పినాకపాణి సంగీతం అంటే అమిత ఇష్టం.

మ్యూజిక్ అకాడెమి పినాక పాణి గారిని ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. పినాక పాణి గారికి రావలసిన సత్కారాలన్నీ వచ్చాయి. దీనితో పాటు భగవదనుగ్రహం కూడా. నూరేళ్ళు పూర్ణాయుర్దాయం లభించింది. నేదునూరి, నూకల, వోలేటి, గోపాలరత్నం వంటి శిష్యులు, మల్లాది సూరిబాబు, శ్రీరామ్, రవి కుమార్ వంటి ప్రశిష్యులు ఆయన బాణీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకన్న కావల్సినదేముంటుంది ? 1990 లో ఆయనకు తొంభయి ఏళ్ళు పూర్తయిన సందర్భంలో కర్నూలులో కొంత మంది విద్వాంసులు వెళ్లి ఆయనకు పాదపూజ చేసారు. ఆయన పాడిన ఓ కచేరి సీడీగా తెచ్చారు.

పినాకపాణి గారికి కొన్ని నిర్దిష్టమయిన ప్రమాణాలు వున్నాయని సంగీత ప్రియుడు, రేడియో, దూరదర్సన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన  ఆర్వీవీ కృష్ణారావు చెప్పారు. వాటితో రాజీపడేవారు కారు అనడానికి ఓ ఉదాహరణ జోడించారు.

‘బెజవాడలో మా త్యాగరాజ సంగీత కళా సమితి తరఫున ఆయన్ని 1986 లో ఘనంగా సత్కరించాము. అప్పుడు ఆయన ధర్మపురి రామమూర్తితో కలసి కర్నూలు నుంచి బస్సులో వచ్చారు. సన్మానం అయిన తర్వాత సుధారఘునాథన్ కచేరి పెట్టాము. చివరివరకు కూర్చున్నారు. మర్నాడు కూడా వున్నారు. ఆ రోజు మరో ప్రసిద్ధ విద్వాంసులు మహారాజపురం సంతానం కచేరి. కచేరీకి రమ్మనమని పిలిచాం. రానని మొండి కేసారు. ఎందుకని అడుగుతే ‘వాడు డబ్బు మనిషి. విద్వత్తుని నిర్మొహమాటంగా అమ్ముకుంటున్నాడు. వాడు ఎంత గొప్పగా పాడినా అనవసరం’ అని కృష్ణారావు  అన్నారు.

ఇక సంగీతానికి వస్తే ‘అసలయిన సంగీతం కావేరి నది వొడ్డున వుంది’ అనేది పినాక పాణి గారి అభిప్రాయం. అందుకనే కాబోలు ‘పాణి గారిది తంజావూరు బాణీ’ అంటారు. ‘మీ గురువు ఎవర’ని అడిగితే ‘నా తల్లి’ అని చెపుతూ వుంటారు. చిన్నప్పుడు తల్లి పాడే తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలే, డాక్టర్ అయిన తనని సంగీతం వయిపు లాక్కుని వెళ్లాయని పాణి గారు చెపుతూ వుంటారు. సంగీతం ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందాలంటే ఒకే ఒక సూత్రం ఉందంటారు పాణిగారు. ప్రతి వూళ్ళోని  దేవాలయంలో ప్రాతః కాలంలో నాదస్వర  వాయిద్యం వినిపించాలన్నది ఆయన కోరిక. నాదస్వరానికి మించింది మరోటి లేదన్నది ఆయన విశ్వాసం. ఉదయం పూట నాదస్వరం వింటే సంగీతంపై అభిమానం కలుగుతుందని,  అప్పుడే తెలుగునాట కర్నాటక సంగీతం వైభవంగా పరిఢవిల్లుతుందని అనేవారు.

శతాయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. కోటికి వొకరికి  కూడా లభ్యంకాని ఆ అదృష్టం పినాకపాణి గారికి భగవంతుడు ప్రసాదించాడు. దానితో పాటే మనందరికీ మరో వరం అనుగ్రహించాడు. అదేమిటంటే ఆయనకు సమకాలికులుగా కొన్నేళ్ళు మనగలిగిన మహద్భాగ్యం.



(03-08-2022)

 

 

కామెంట్‌లు లేవు: