17, మే 2022, మంగళవారం

ప్రతి ప్రభుత్వానికీ అనుసరణీయం గడప గడపకు కార్యక్రమం - భండారు శ్రీనివాసరావు

 గడప గడపలో నిరసనలు వెల్లువెత్తినా సరే,  గడప గడపకు అనే  కార్యక్రమం చాలా మంచి నిర్ణయం. టీవీ చర్చల్లో వెలువడే విమర్శలకు రాజకీయ రంగు ఉండవచ్చు కానీ ఈ గడప గడపకు కార్యక్రమంలో వెలువడే నిరసన నిఖార్సయినది.  వీటిని రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. కొంత రాజకీయం ఉండవచ్చు కానీ అది చాలా స్వల్పం. దీని ద్వారా లభించే ఫీడ్ బాక్  ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుంది. ఉపకరిస్తుంది కూడా.  ప్రజలకు కావాల్సినవి ఇస్తున్నామా లేక ప్రజలకు అనవసరమైనవి పంచి పెడుతున్నామా అనేది తెలిసి వస్తుంది. ఏ పధకం ఎలా అమలవుతోంది, ఏ పధకం అమల్లో విఫలం అవుతోంది అనే విషయాలు  వాస్తవ రూపంలో తెలుస్తాయి.  రాజకీయాలకు అతీతంగా  అందరి గడపలకు కూడా వెడితే పాలక పక్షం నేతలకు వాస్తవాలు బోధపడుతాయి.  ప్రజలు తమ సమస్యలను టీవీలకు ఎక్కి అనుదినం  చెప్పుకోలేరు. అలాంటి వారికి ఇది వరప్రసాదం. నిరసన తెలిపినా, నిలదీసినా ఆ హక్కు ప్రజలకే వుంటుంది. ఇలాంటి వాటికి నెగెటివ్ ప్రచారం ఎలాగు వుంటుంది. అయితే పొరబాట్లు  సరిదిద్దుకునే మహత్తర అవకాశం ప్రభుత్వానికి ముందుగా  లభిస్తుంది. నిఘా వర్గాలు కూడా ఇటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని అంచనా వేయలేవు. వేసినా అరకొర సమాచారమే ప్రభుత్వానికి చేరుతుంది.  ప్రజల నాడి యధాతధంగా  పట్టుకోవడానికి ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక కొలమానం ఈ గడప గడపకు కార్యక్రమం. అంతా సజావుగా వుంది అనే భ్రమలు ఏమైనా వుంటే అవి తొలగడానికి ఈ కార్యక్రమం పనికి వస్తుంది.  ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరకు నేతలు పోవడం అనేది ఆ నాయకులకే ప్రయోజనం. ప్రజలు నిరసన తెలిపినా దానిని ఆ స్థాయిలోనే అదుపు చేయడానికి, అది అసహనంగా మారి ఆగ్రహంగా పరిణమించకుండా జాగ్రత్త పడడానికి  నాయకులకు ఇదొక  ఆయుధంగా ఉపయోగపడుతుంది.  నిరసనలకు కారణం ప్రత్యర్థుల ప్రేరేపణ అని ఎదురుదాడికి దిగడం కన్నా వాటిని సానుకూలంగా మార్చుకోవడంలోనే నాయకుల ప్రతిభ, పరిణతి  వెలుగు చూస్తుంది.

తప్పులు దొర్లడం తప్పుకాదు. ఆ తప్పులను దిద్దుకోవడం ఉత్తమ లక్షణం. కాబట్టి ఈ గడప గడపకు కార్యక్రమాన్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా  ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో చేస్తే ఇటు ప్రజలకు మంచిది, అటు ప్రభుత్వానికి మంచిది.

కేంద్రంతో సహా, దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో తమ స్థానం ఏమిటన్నది తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకు పూనుకోవాలి.

(17-05-2022)

కామెంట్‌లు లేవు: