14, మే 2022, శనివారం

పునరావృతం కానివ్వం – భండారు శ్రీనివాసరావు

 గుంటూరు ప్రభుత్వ వైద్య శాలలో ఆరేండ్ల చిన్నారి ఆరాధ్య  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోగొట్టుకుందని ఆ అమ్మాయి తలితండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన చాలా దురదృష్టం పునరావృతం కానివ్వం అనే ప్రకటనలు వెలువడ్డాయో లేదో తెలియదు.

ఈ నేపధ్యంలో 2015లో అదే ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన గుర్తుకు వస్తోంది.

సాధారణంగా న్యాయస్థానాలు భావోద్వేగాలకు అతీతంగా తామరాకుమీది నీటి బొట్టు మాదిరిగా వ్యవహరిస్తాయి. అయితే మానవ హక్కుల కమిషన్ ఒక కేసు విషయంలో వెలువరించిన అభిప్రాయాలు, వ్యక్తపరచిన విధానం ఆ కేసులోని తీవ్రతను తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసికందును ఎలుకలు కొరికి చంపిన దారుణ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో ఉపయోగించిన పదజాలం తెలుపుతోంది. మామూలుగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కమిషన్ స్పందించి, సంబంధిత అధికారులకు జారీ చేసే ఆదేశాలు, ఇంగ్లీష్ భాషలో, ఒక నిర్దిష్ట పద్దతిలో, ఒక రకంగా చెప్పాలంటే పడికట్టు పదాలతో, ఒకే మూసలో వున్నట్టు కానవస్తాయి. కానీ గుంటూరు సంఘటన విషయంలో మానవ హక్కుల కమిషన్ స్పందించిన తీరు, ఈ సాంప్రదాయక విధానానికి భిన్నంగా వుంది. ఈ సారి కమిషన్ ఆదేశాలు సరళమైన తెలుగులో, ఉద్వేగ పూరిత భావజాలంతో, అదీ చేతిరాతతో వెలువడ్డాయి.

నిర్లక్ష్యం కమ్ముకున్న ఈ వ్యవస్థలో ..ఆ తల్లికి బిడ్డను తెచ్చి ఇవ్వగలమా? దీనికి బాధ్యులు ఎవ్వరు ?’ అని కమి షన్ ప్రశ్నించింది. వైద్యులను ప్రాణదాతలుగా కొలిచే సమాజంలో వాళ్ళు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని చీవాట్లు వేసింది. అంతేకాదు, పసికందును ఎలుకలు పీక్కు తిన్నాయని తెలిసినప్పుడు నిర్ఘాంతపోయిన యావత్ సభ్య సమాజం మాదిరిగానే మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయిందన్న విషయం ఆదేశాల్లో పొందుపరచిన అతిలోతయిన భావాలు చదివితే అర్ధం అవుతుంది.

అమ్మా! నేను ప్రపంచంలోకి వస్తున్నా! నాకు భావి పౌరుడిగా ఎదగాలని వుంది. ఎందుకమ్మా నన్ను ఈ ఆసుపత్రికి తీసుకువచ్చావ్?’ అని ఎలుకలు తన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ శిశువు యెంత మూగవేదన అనుభవించి వుంటుందో’ అంటూ కమిషన్ అచ్చ తెలుగులో వ్యక్తపరచిన భావాలు సమస్య తీవ్రత పట్ల ఎంతగా కమిషన్ స్పందించి వుంటుందో అనే వాస్తవాన్ని బహిర్గతం చేస్తున్నాయి.

మనిషిని మనిషి కాటేసే సంఘంలో తామేమీ తీసిపోమని చాటిచెప్పేలా గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు ఆ పసి కందుపై దాడిచేశాయి. అవి కొరుకుతుంటే ఆ పసి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయిందో. ఈ ఘటన మన భాషకు, భావాలకు అందనంత హృదయ విదారకమైనది’ అంటూ కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొన్నది.

దవాఖనాలు దెయ్యాల ఖానాల మాదిరిగా మారిపోయి పసివాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కలు పసికందుల్ని పీక్కుతిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ఎలా సరిదిద్దుతాం ?’ అన్నది కమిషన్ సంధించిన ప్రశ్న.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందును ఎలుకలు అత్యంత పాశవికంగా కొరుక్కు తినడం వల్ల ఆ శిశువు మరణించిన వార్తపై విచారణ జరపాలని మానవ హక్కుల కమిషన్ తనకు తానుగా సంకల్పించి సంబంధిత ప్రభుత్వ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

కమిషన్ స్వయంగా పేర్కొన్నట్టు ఆ పసికందు ప్రాణాలు తిరిగి తేవడం అసాధ్యం. కానీ ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సింది ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.

ఆ రోజుల్లో పత్రికలు ఈ దుర్ఘటనపై  పుంఖానుపుంఖాలుగా కధనాలు రాశాయి. మీడియా  గగ్గోలు పెట్టింది.

ఇది జరిగి ఏడేళ్లు దాటుతోంది. ఇన్నేళ్ళుగా ఆ కన్నతల్లి కడుపుకోత గురించి కానీ, ఆ శిశువు కుటుంబం పడ్డ వేదన గురించి కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలా లేదు.

గుంటూరు ఆసుపత్రి సంఘటనపై జరిగిన విచారణ ఫలితం ఏమిటన్నది ఎవరికీ పట్టదు. కొన్నాల్తికే జనమే ఈ విషయం మరచిపోతారు. ఎలకలు కొరుక్కు తిన్న ఆ పసిపాప చిట్ట చివరి దైన్యపు చూపు నేతల జ్ఞాపకాల్లో రూపుమాసిపోతుంది. కడుపుకోతతో విలవిలల్లాడే ఆ మాతృమూర్తి వేదన అరణ్య రోదనే అవుతుంది.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కావంటూ నాయకులు చెప్పే హామీలు మాత్రం పునరావృతం అవుతూనే వుంటాయి. ఇదొక విష చక్ర భ్రమణం. ఈ భ్రమణంలో చోటుచేసుకున్న మరో విషాదమే చిన్నారి ఆరాధ్య మరణం.

తోకటపా:

సంఘ విద్రోహ, ఆరాచక శక్తుల్లో ఎక్కడా కానరాని అవగాహన వుంటుంది. ఒకరినొకరు కాపాడుకోవడం, ఆపదలో పడ్డప్పుడు ‘సర్ప మూషిక న్యాయాన్ని’ పాటించడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అయితే వాటి నడుమ ఈ దోస్తీ కొంత మేరకు మాత్రమే. ఒక స్థాయి వరకే.

ఒక పాము, ఒక ఎలుక సమయం కలిసిరాక ఒకే బుట్టలో ఇరుక్కుపోయాయి. పాముకు ఎలక ఆహారం. తినేస్తే ఒక పనయిపోతుంది. కానీ బుట్ట నుంచి బయట పడక పొతే అంతే సంగతులు. అంచేత ఆ పాము యుక్తిగా ఎలకకు ఓ సలహా చెబుతుంది. తన పొడ గమనించి ప్రాణభయంతో గడగడలాడిపోతున్న ఎలకకు హామీ ఇస్తుంది. ‘నావల్ల నీకు ఎలాటి ప్రమాదం వుండదు. ముందు నీ దంతాలతో ఈ బుట్టకు ఓ రంధ్రం చెయ్యి. ఇద్దరం తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుందాం’

ఎలక బతుకు జీవుడా అనుకుంటూ బుట్టకు రంధ్రం చేస్తుంది. వెంటనే పాము ఆ ఎలకని ఎంచక్కా నమిలి మింగేసి, తరువాత ఎలక చేసిన ఆ రంధ్రం ద్వారా బయట పడుతుంది.

ఈ సర్ప మూషిక న్యాయం ప్రకారం పరస్పర ఆధారిత స్వార్ధపర శక్తులు ఒకమేరకు తమలో తాము సహకరించుకుంటాయి. ఒక స్థాయికి చేరిన తరువాత తమ స్వార్ధానికి, తమ స్వప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. సామాన్యులు మాత్రం ఇందులో శలభాలుగా మారతారు.

(14-05-2022)

 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇంక్యూబేటర్ లో పసిపిల్లలు చనిపోవడం ...
ఐసీయూ లో పసి పిల్లలు ని ఎలకలు కొరికేయడం ,
ఎంత దారుణం సర్ , ఇండియా లోనే సాధ్యం.ప్రాణాలకి పైసా విలువ కూడా ఇవ్వని జనాలు .
అందులోను పసి పిల్లలు, ముసలి వాళ్ళ ప్రాణాలు అయితే , గాల్లో దీపాలే . నోరు విప్పి చెప్పలేని వాళ్ళ బతుకులు గాలివాన బతుకులే.

నార్వే లో, కొన్ని సంవత్సరాల క్రితం,తల్లితండ్రులు ని జైల్లో పెట్టిన కారణం " పాలు తాగకపోతే ఇండియా కి పంపించేస్తాను " అన్న మాట. అంతే . చుడండి ఎంత తేడాయో వాళ్లకి మనకి . మనం ఎంత అధమ స్థాయిలో ఉన్నామో, మనకి అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలియదు. యుద్ధ ప్రాతిపదికన అని అంటారు కదా,అలాంటివి చేయాల్సింది వైద్య శాఖ లో. కానీ ఎదో ఒక స్టేటుమెంట్ ఇచ్చి దులిపేసుకుంటారు .

ఇంత దరిద్రాన్ని కూడా పొగిడే ఆ నాయకుల ఎడమ చేతి జనాల ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా తెలియడం లేదు.

బలహీనుల హక్కులు , జీవన ప్రమాణాలు, నిజమైన అభివృద్ధి అంటే ఏంటి , ఇలాంటి పదాలు కొంచెం కూడా అర్ధం అవ్వని స్థితి లో ఉంటారు , నాయకుల అభిమానులు, వాళ్ళే ఓట్లు వేస్తారు. ఏంటో ఇలా బ్రతికేస్తున్నాం .