22, మే 2022, ఆదివారం

సతీ నీలాంబరి – భండారు శ్రీనివాసరావు

 నీలాంబరితో ఏకాంబరం పెళ్లి పెళ్లున జరిగిపోయింది. మొదటి రాత్రే ఏకాంబరం భార్యతో చెప్పాడు.

'మనం ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. నా మీద నీకు కోపం వస్తే కేకలు వెయ్యి. కానీ అప్పుడు మనిద్దరం తప్ప మూడో వ్యక్తి వుండకూడదు. నేనూ అలాగే. మరొకరు వున్నప్పుడు నీ మీద నోరు పారేసుకోను. అండర్ స్టాండ్?'

'అండర్ స్టాండ్. అల్లాగే' అన్నది నీలాంబరం.

భార్య సహకారం చూసిన ఏకాంబరానికి ఆమె మీద ప్రేమ పూనకంలా తన్నుకు వచ్చింది.

'నువ్వుంటే నాకు ఈ లోకంతో పనిలేదు. ఎదురుగా ఎందరు వున్నా నా కంటికి నువ్వొక్కదానివే...' అంటూ గారాలు పోయాడు.

మర్నాడు కాఫీ తాగేటప్పుడు ఏదో విషయం మీద మాటా మాటా వచ్చి మొగుడ్ని అత్తామామల ముందే కడిగి పారేసింది నీలాంబరి. ఏకాంబరం బిత్తరపోయాడు. బిక్కచచ్చిపోయాడు.

ఆ రాత్రి వొంటరిగా వున్నప్పుడు అడిగాడు 'అందరిముందు ఎందుకు అలా వొంటి కాలి మీద లేచావు' అని.

నీలాంబరి గారాలు పోతూ చెప్పింది.

'ఎవరున్నారు అక్కడ? మీరే కదా అన్నారు, ఎదురుగా నేనుంటే ఇక ఎవరూ లేనట్టే అని'

ఏకాంబరం మరోసారి బిక్కచచ్చిపోయాడు

 

కామెంట్‌లు లేవు: