16, సెప్టెంబర్ 2015, బుధవారం

ఇప్పుడే అందిన వార్త..........

1984 సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ఒంటి గంటా ఇరవై నిమిషాలకు విజయవాడ రేడియో కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. కొద్దిసేపు గడిచిందో లేదో వార్తలు చదివే వ్యక్తి "ఇప్పుడే అందిన వార్త" అంటూ ఒక సంచలన వార్తను వినిపించారు. "గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ ఎన్టీ రామారావును ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా ఆహ్వానించారు" ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాధించిన విజయ సమాచారం ఆనాటి రేడియో వార్త ద్వారా రాష్ట్రం నలుమూలలకు చేరిపోయింది. ఆరోజు ఆవార్త చదివిన వ్యక్తి, ఆరోజుల్లో బెజవాడ ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న శ్రీ గారపాటి నరసింహారావు. తాత్కాలిక ప్రాతిపదికన ఆరోజు న్యూస్ రీడర్ గా ఆవార్తను ప్రజలకు అందించే అదృష్టం తనకు కలిగిందని శ్రీ నరసింహారావు తరచూ గుర్తుచేసుకుంటూ వుండేవారు. ఆరోజు హైదరాబాదు రాజభవన్ సెంట్రీ రూములోని ఫోనుద్వారా బెజవాడ రేడియో కేంద్రానికి ఈ వార్తను అందించింది నేనే. ఆ రోజు నావెంట నేటి తెలంగాణా సిఎం, సీపీఆర్వో శ్రీ జ్వాలా నరసింహారావు కూడా వున్నారు.
ఆ గారపాటి నరసింహారావు, నాకంటే చిన్నవయస్సువాడు, 'లేడ'న్న కబురు వింటున్నాను. అతడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

శ్రీ గారపాటి నరసింహారావు గారు పేరున్న పాత్రికేయుడే గాక సహృదయుడు. ముఖ్యంగా ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి. అప్పుడే కాలం చేసేటంత పండు వయస్కుడేమీ కాదు. విచారకరం.
ఆయన ఆయన కుటుంబం మా కుటుంబానికి కూడా ఫ్యామిలీ స్నేహితులే. ఈరోజు వారింటికి వెళ్ళి వచ్చాము. May his soul rest in peace.