12, సెప్టెంబర్ 2013, గురువారం

ఇలాటి ‘రత్నాలు’ కూడా వుంటాయి సుమండీ!


కొందరికి బాధ్యత అనేది అసలు సిసలు  బాధ్యత.  మరికొందరికి అదో కర్తవ్యం. అంటే చేసి చేతులు దులుపుకోవడం అన్నమాట.
మరికొందరు వుంటారు. బాధ్యతను కూడా ప్రచారానికి వాడుకుంటారు. వీరినే రాజకీయ నాయకులు అని కూడా అంటుంటారు. పావలా పనిచేసి పాతిక రూపాయలు ప్రచారంకోసం ఖర్చు పెడతారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అట్లాంటి వాళ్లని గురించికాదు. ఇట్లాంటి వాళ్లు కూడా వుంటారా అని అబ్బురపడే ఓ వ్యక్తి గురించి.
అయిదేళ్ళ క్రితం ముంబైలో జరిగిన పాక్ ఉగ్రవాదుల దాడికి మూలకారకుడయిన  కసబ్ ను సుదీర్ఘంగా విచారణ జరిపి ఎట్టకేలకు ఉరితీశారు.
అది పక్కన పెడదాం.


(కుక్కకు విశ్వాసం వున్నట్టే మనిషి స్పందించే హృదయం అవసరం )

ఆ దాడిలో ప్రధానంగా  దెబ్బతిన్నది రతన్ టాటా కు చెందిన తాజ్ హోటల్. దేశానికే తలమానికం అయిన ఈ హోటల్ ఆ దాడిలో పూర్తిగా దెబ్బతిన్నది.  టాటాలకేం తక్కువ చాలా తక్కువ వ్యవధిలోనే ఆ హోటల్ ను పునరుద్ధరించారు.  కానీ రతన్ టాటా ఇంకా చాలా చేసాడు. నిజానికి ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు అవి. దీనికి ఒక్క డబ్బు వుంటే చాలదు. గుండె కూడా వుండాలి. అది స్పందించే హృదయం అయి వుండాలి. రతన్ టాటాకు ఈ రెండూ వున్నాయి. కనుకే, ఆయన అనుకున్నది అనుకున్నట్టు అనుకున్న వ్యవధిలో పూర్తిచేశాడు, అదీ ప్రచార పటాటోపం లేకుండా.
దాడి జరిగిన రోజు   హోటల్లో వందలాదిమంది సిబ్బంది విధుల్లో వున్నారు. వారిలో అదే రోజు పనిలో చేరిన వారు కూడా వున్నారు. హోటల్ మూతపడ్డ కాలంలో  ఎవ్వరినీ వొదిలి పెట్టకుండా  అందరికీ ఎప్పటిమాదిరిగానే నెలనెలా జీతాలను వారి వారి ఇళ్లకు మనిఆర్డర్ ద్వారా పంపించారు.
దాడిలో చనిపోయిన హోటల్ సిబ్బందికి ఉదారంగా ఆర్ధిక సాయం అందించారు. ఇందులో వింతేమీ లేదు. కానీ ఆ రోజు ముంబై లో జరిగిన వివిధ దాడుల్లో చనిపోయిన వారికీ, గాయపడ్డవారికీ, ఇంకా చెప్పాలంటే పావ్ బాజీ, పాన్ దుకాణాల వారికి కూడా ఈ సాయం అందించారు.  హోటల్ తో ఏమాత్రం సంబంధం  లేని వాళ్లకి కూడా నెలకు పదివేల రూపాయల చొప్పున ఆరు మాసాలపాటు  ఆర్ధిక సాయం  అందించారు.
శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న సిబ్బంది సంక్షేమం కనిపెట్టి చూడడానికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేశారు.  అతడికి ఎలాటి సాయం అవసరమయినా ఎవరికోసమో ఎదురు చూడకుండా  అప్పటికప్పుడు సాయపడడానికి   ఈ ఏర్పాటు.
ముంబై వెలుపల ఇతర ప్రాంతాలలో వున్న వారి బంధువులను ఆత్మీయులను విమానాలలో ముంబైకి తరలించడమే కాకుండా వారికి  ప్రెసిడెంట్ హోటల్ లో మూడువారాలపాటు అవసరమైన వసతి ఏర్పాట్లు ఉచితంగా చేశారు.
ఆనాటి ముష్కరుల దాడిలో ఓ నాలుగేళ్ళ అమ్మాయికి నాలుగు బులెట్లు దిగాయి. సర్కారు దవాఖానాలో   వొకటి తొలగించారు. విషయం తెలుసుకున్న రతన్ టాటా ఆ ఆమ్మాయిని ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించి మిగిలిన బులెట్లను కూడా శరీరం నుంచి తీసివేయించారు. అందుకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు యాజమాన్యం ఉదారంగా ఆర్ధిక సాయం అందించింది. కనీస మొత్తం ముప్పై ఆరులక్షల నుంచి ఎనభయ్ అయిదు లక్షల వరకు చెల్లించారు.
అంతేకాదు, ఉద్యోగి ఆఖరి నెల వేతనాన్ని వారి కుటుంబాలకు  జీవించి వున్నంత కాలం ప్రతి నెలా చెల్లించేలా ఏర్పాటు చేశారు. వారి పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా ఆ ఖర్చును భరించడానికి రతన్ టాటా హామీ ఇచ్చారు.  ఆ కుటుంబాలకు అవసరమయ్యే  వైద్యం ఖర్చు జీవిత  పర్యంతం వారికి అందేలా ఏర్పాటు చేశారు.
ఉద్యోగంలో వుండగా వారికి ఇచ్చిన అన్ని రకాల రుణాలను పూర్తిగా రద్దు చేశారు.

ఇంత చెప్పిన తరువాత ఇక చెప్పడానికి ఏముంది చెప్పండి.

3 కామెంట్‌లు:

Pratap చెప్పారు...

viti antiti kanna daadi anantaram taj hotel paina egaraveinchina bhaaratha jaatiya pathakam aayana gunde dhairyanni manaku teliyachesthundi...kaadantaaraa

యశోదకృష్ణ చెప్పారు...

ఎంత మంచి సమాచారం అందించారండి .. ధన్యవాదాలు
నిజంగా మనం వారి దగ్గరినుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

hari.S.babu చెప్పారు...

he is really a ratan!!!