4, జూన్ 2013, మంగళవారం

ఇది ఇండియా – అది అమెరికా


(ఆంధ్ర జ్యోతి – 04-06-2013)
షిండే మింగిన ప్రాణం
ఆమెకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి గేటు వరకు వచ్చేశారు. అక్కడ సైంధవులు అడ్డుపడ్డారు. దీంతో గేటు వద్దే ఆమె మరణించింది.  ఆ సైంధవులు ఎవరంటే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భద్రతా దళాలు. చత్తీస్ ఘడ్ మావోయిస్టుల దాడిలో  గాయపడినవారిని పరామర్శించేందుకు షిండే రాయ్ పూర్ ఆస్పత్రికి వచ్చారు. అదేసమయంలో ఓ మహిళకు గుండెపోటు వచ్చింది.  షిండే భద్రతాదళాలు ఆమెను  ఆసుపత్రిలోకి తీసుకుపోనీకుండా అడ్డుకున్నారు. అత్యవసరంగా వైద్యం అందించాలని ఎంతగా ప్రాధేయపడ్డా ప్రయోజనం లేకుండాపోయింది. సకాలంలో వైద్యం అందక   మరణించిందని ఆమె బంధువులు ఆరోపించారు. ఇది ఇండియా.
పోతే మరో సంఘటన.
ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని  సియాటిల్ నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై  ఆ నగరానికి వచ్చివెడుతున్న  అమెరికా ప్రెసిడెంట్ -  ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానానికి అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ లోనే కొద్దిసేపు  వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్  దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక  వార్త సారాంశం. అది అమెరికా.    

 (04-06-2013)   

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మనం ఇంకా ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న రాజరికంలోనే ఉన్నాం.
ఎన్నికలలో గెలిచిన నాయకులు "అయిదేళ్ళ రాజు" లవుతున్నారు.