18, నవంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి ( 9 ) - భండారు శ్రీనివాసరావు

 బాల్యం. ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత భాగం. కష్టాలున్నా బాధ్యతలు వుండవు. సుఖాలు అనుభవించడమే కాని వాటిని ఎలా సంపాదించుకోవాలనే తాపత్రయం వుండదు. ప్రేమను పూర్తిగా పొందడమే కాని తిరిగి పంచే పూచీ వుండదు.

గుర్తుండకపోయినా, బాల్యంలో పడ్డ ముద్రలు పెద్దయిన తరువాత కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.

నా చిన్నప్పటి విషయాలు గురించి పెద్దవాళ్ళు చెప్పగా వినడమే కాని గుర్తున్నవి తక్కువ. గుర్తుంచుకోవాల్సినవి కూడా తక్కువేనేమో!

ఏడుగురు ఆడపిల్లలు, ముగ్గురు మొగపిల్లల తరువాత పదకొండోవాడిని నేను. అందరిలోకి  చిన్నవాడిని అని అందరూ గారాబం చేయడంతో మంకుతనం, ముట్టె పొగరు, కర్ణుడి కవచకుండలాల మాదిరిగా సహజసిద్దంగా అలవడ్డాయి. పెద్దలను ఎగర్తించి మాట్లాడ్డం, అనుకున్నది దొరికే దాకా గుక్క పట్టి ఏడ్వడం నా చిన్నతనం గురించి మా పెద్దల జ్ఞాపకాలు. ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నెయ్యి కోసం చేసిన యాగీ అంతాఇంతా కాదు. కుడిచేతిలో నెయ్యి పోస్తుంటే అది వేళ్ళ సందుల్లోనుంచి కారిపోయేది. చేతినిండా నెయ్యి వేయలేదని గుక్క తిరగకుండా ఏడుపు.  గుక్కపట్టడం అనేది ఈనాటి తల్లులకు, పిల్లలకు బహుశా తెలియకపోవచ్చు. ఊపిరి కూడా పీల్చుకోకుండా అదేపనిగా ఆపకుండా ఏడ్వడం వల్ల ఒక్కోసారి పిల్లలు కళ్ళు తేలవేసేవాళ్ళు. అందుకే గుక్క పట్టే పిల్లలంటే తలితండ్రులు భయపడేవాళ్ళు. వాళ్ళు ఏది అడిగితే  అది ఆలోచించుకోకుండా చేతిలో పెట్టేవాళ్ళు. నా గుక్క సంగతి తెలుసు కనుక,   ఇక ఇది పని కాదనుకుని ఒక చిన్న వెండి గిన్నెలో నెయ్యి నింపి ప్రత్యేకంగా నా కంచం పక్కన పెట్టడం అలవాటు చేశారట. వయసు పెరిగిన కొద్దీ ఆ నెయ్యి అలవాటు కొంతవరకు పోయింది కానీ మొండితనం మాత్రం, ఎందుకు నచ్చానో తెలియదు కాని,  నాతోనే ఉండిపోయింది. పైగా తనకు తోడుగా ‘మాట తూలడం’ అనే తోబుట్టువును తోడు తెచ్చుకుంది. నిజానికి ఈ రెండూ లేకపోతే నేనూ ఒక ఆదర్శ పురుషుడిని అయ్యేవాడిని. కాని కొందరికి కొన్ని ఇలాటి ‘రోల్డ్ గోల్డ్ ఆభరణాలు’ ఆ దేవుడే తగిలిస్తాడు. ‘పుటక- పుడకలు’ సామెత అందుకే పుట్టిందేమో! అయితే  నేను పుట్టి పెరిగిన వాతావరణం మాత్రం  దీనికి పూర్తిగా విరుద్ధం. అందరు శాంత స్వభావులే. వారి మధ్య నా బాల్యం గడిచింది. కానీ వారి మంచితనం నాకు వంటబట్టలేదు.

“మా కుటుంబం మొత్తంలో మా చిన్న తాతగారు   భండారు సుబ్బారావుగారి తరహానే  వేరు. సుబ్బయ్య తాతగారిది  ఆధ్యాత్మిక దృక్పధం. జాలిగుండె. ఎవరికి కష్టం వచ్చినా చూడలేడు. కాకపొతే ప్రధమ కోపం. కాని అది తాటాకు మంటలాంటిది.  ఇట్టే ప్రజ్వరిల్లినా మళ్ళీ అట్టే చల్లారిపోయేది. చిన్నతనంలో చాలా దుడుకు మనిషి అని పేరు కాని పెద్దయిన తరువాత  చాలా మారిపోయాడు.

 పిల్లలు లేని కారణంగా వూళ్ళో అందర్నీ పిల్లలుగా చూసుకునే వారు. కష్టసుఖాలు గమనించి, అడగకుండానే  సాయం చేస్తూ  వుండేవారు. చివరికి మా రెండో అన్నయ్య రామచంద్రరావును చాలా చిన్నతనంలోనే  దత్తు తీసుకున్నారు. మా అన్నయ్యకు మాత్రం మా తాతయ్య మంచితనం వచ్చింది.

మా తాతయ్య సతీసమేతంగా తరచుగా తీర్ధయాత్రలు చేస్తుండేవారు. కాశీ రామేశ్వరాలు తిరిగివచ్చిన పుణ్యశాలి. ఆయన భార్య సీతమ్మ గారు  కందిబండ వారి ఆడపడుచు. భర్తకు జడియడమే సరిపోయేది. ఆ రోజుల్లో భార్యలపై చేయిచేసుకోవడం వుండేది. కాని మా తాతగారికీ, నాన్నగారికీ అది అలవడలేదు. అయితే మా చినతాతలిద్దరికీ ఆ అలవాటు వుండేది. సుబ్బయ్య తాతగారు మాత్రం ఆవేశంలో ఏదయినా తప్పుచేస్తే  వెంటనే పశ్చాత్తాపం చెందేవాడు. ఎవరిమీద అయినా చేయి చేసుకుంటే, ముందు బావి దగ్గరకు వెళ్లి తలస్నానం చేసి జందెం మార్చుకునేవాడు. అంతేకాదు. ఆ కొట్టిన వాడిని పిలిపించి మానెడు జొన్నలు ఇచ్చి పంపేవాడు. బీదాబిక్కీ ఎవరికయినా పనిదొరక్కపోతే, ‘ఇవాళ సుబ్బయ్యగారితో నాలుగు దెబ్బలు తిన్నా బాగుండు’ అనుకునేవారు. అంతేకాదు ఎవరయినా అప్పు అడగడమే తరువాయి, లేదనకుండా వెంటనే వందా రెండొందలు  ఇచ్చేవాడు. అసలు, వడ్డీ కలిపి ఎంతవుతుందో లెక్క కట్టి, ఎవరికెంత ఇచ్చిందీ వివరాలన్నీ పెన్సిల్ తో గోడమీద రాసేవాడు. ఒకసారి మరచిపోయి సున్నం కొట్టించాడు. అంతే!  మొత్తం పద్దులన్నీ మాఫీ. అప్పులు మాఫీ చేసే విషయంలో చరణ్ సింగుకు దోవ చూపించింది సుబ్బయ్య తాతయ్యే అనవచ్చు. సంగీతం అంటే చెవి కోసుకునేవాడు. ఆ తాలూకా మొత్తంలో మొదటిసారి గ్రామ ఫోన్ కొన్నది మా తాతయ్యే. పెద్ద పెద్ద గాయనీ గాయకులు పాడిన పాటలు, జావళీల రికార్డులు ఆయన దగ్గర వుండేవి.  గ్రామఫోన్లో దెయ్యపు పిల్ల దాక్కుని ఆ  పాటలు పాడుతోందని ముందు ఊళ్లోవాళ్ళు చాలా భయపడ్డారు. ఆయనకు కొంత కొంత  చట్టం తెలుసు. తనకు తెలిసిన పరిజ్ఞానంతో తీర్పులు చెప్పేవాడు. ఇక దానికి తిరుగుండేది కాదు. సుబ్బయ్యగారు ఎవరికీ అన్యాయం చేయదు అనేది ఊరివారి నమ్మకం.   

"ఒకసారి రైల్లో వెడుతున్నప్పుడు ఆయనకు  ఒక యువ సాధువు  కలిశాడు. ఆయన వర్చస్సు, పాండిత్యం చూసి మా చిన తాతగారు ముగ్ధుడై ఆయనను కంభంపాడు తీసుకు వచ్చారు. ఆ సన్యాసి పేరు శ్యాం ప్రకాష్ బ్రహ్మచారి. ఆయనను అంతా కాశీ స్వాములవారు అనేవారు.

ఆయన మా వూళ్ళో ఒక ఆశ్రమం స్థాపించారు. స్వామివారు హోమియో వైద్యం కూడా చేసేవారు. ఆయన బోధనలు విని మా తాతగార్లు,  తలా కొంత పొలం ఆయన గారి ఆశ్రమానికి దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో ఆయన తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే  ఒక వేద పాఠశాలను కూడా నిర్వహించారు. అదంతా బహుశా  1930-40 ప్రాంతాల్లో కావచ్చు. ఆ కార్యకలాపాలతో  మండాలపాటి నరసింహారావుగారికీ,  విజయవాడ న్యాయవాది శ్రీ  దంటు శ్రీనివాసశర్మ గారికీ సంబంధం వుండేది. మా సుబ్బయ్య తాతగారు సతీ సమేతంగా కొన్నాళ్ళు ఆశ్రమంలోనే కాపురం పెట్టారు.    స్వాములవారు అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించి, కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని అక్కడ ప్రతిష్టించారు. అదిప్పుడు శిధిలావస్థకు చేరుకోవడంతో, కొన్నేళ్ళ క్రితం మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు పూనిక వహించి, ఆ గుడిని  ఓ మేరకు అభివృద్ధి చేసి, ఒక  పూజారిని నియమించి ఆ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత మొత్తం పంపుతున్నాడు. ఆశ్రమం మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. దానికి మా పూర్వీకులు ఇచ్చిన పొలం ప్రభుత్వం తీసుకుని ఆ  ప్రదేశంలో షెడ్యూల్డ్ కులాలవారికోసం ఒక పెద్ద కాలనీ నిర్మించింది. దానం చేసిన స్థలం అలా ఒక సత్కార్యానికి ఉపయోగపడడం సంతోషదాయకం.  అసందర్భం అనిపించినా ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించక తప్పదు.

నా వయసు డెబ్బయి తొమ్మిది. నేను పుట్టేనాటికే మా ఊళ్ళో ఓ మిషనరీ పాఠశాల వుండేది. అది పూరిపాకలో కాదు. మంచి భవంతిలో. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.

నేను చదువుకున్న బడి నడి ఊళ్ళో వుంది. పూరిల్లు. వర్షం వస్తే సెలవు. అలా వుండేది.

మా తాతగారు భండారు సుబ్బారావు గారు ఓ స్వామీజీకి తనకున్న భూమిలో ఇరవై ఎకరాలు దానం చేసి ఆయనకు ఓ ఆశ్రమం కట్టించి ఇచ్చారు. ఊళ్ళోని రైతులు కూడా, మరో ఇరవై ఎకరాల దాకా సాయం చేశారు. కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని స్వామీజీ ఆ ఆశ్రమంలో ప్రతిష్టించి ఓ చిన్న గుడి కట్టించారు. కొన్నాళ్ళు వైభవంగానే రోజులు గడిచాయి.

కాలక్రమంలో స్వామీజీ కాలం చేశారు. ఆశ్రమం పాడు పడింది. మా తాతగారు చనిపోయారు. గుళ్ళో దీపం పెట్టేవాళ్ళు కరువయ్యారు. ఆశ్రమానికి సాయం చేసిన మా కుటుంబంలోని వాళ్ళు కూడా పై చదువులకు, ఉద్యోగాలకు నగరాలకు తరలిపోవడంతో పరిస్థితి మరింత అధ్వాన్నం అయింది. మా తాతగారు దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు ఓ ఇరవై ఎకరాలు గుడి పేరున వుంచి, దాన్ని ఆ పూజారికే వదిలివేశారు. దానిపై వచ్చిన ఆదాయం (కౌలు డబ్బులు) తో జీవనం గడుపుతూ, గుడి బాగోగులు చూడమని అప్పగించారు. ఆ భూములపై ఇప్పుడు మాకు ఎటువంటి హక్కులు లేవు.

మిగిలిన ఇరవై ఎకరాలను ప్రభుత్వానికి అప్పగిస్తూ అక్కడ ఓ ఎస్సీ కాలనీ నిర్మిస్తే బాగుంటుందని నాటి జిల్లా కలెక్టర్ కు ఓ లేఖ రాసారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన జంధ్యాల హరినారాయణ గారు అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్.

ఆ ఉత్తరం చూసి ముందు ఆయన నమ్మలేదు. ఎస్సీ కాలనీల కోసం భూముల సేకరణకు తమ సిబ్బంది కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతుంటే ఒక్కళ్ళూ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఎవరీయన ఏకంగా ఇరవై ఎకరాలు దఖలు పరుస్తూ ఉత్తరం రాశారని ఆశ్చర్యపోతూ మా ఊరు వచ్చి స్వయంగా పరిశీలించి వెళ్ళారు. బహుశా ఆయన హయాములోనే అనుకుంటా జిల్లా మొత్తంలో ఓ పెద్ద ఎస్సీ కాలనీ మా ఊళ్ళో వెలిసింది.

ఇదంతా ఎందుకు అంటే..

పొరబాట్లు ఎక్కడ ఎలా జరిగాయో తెలిపేందుకు. అప్పటికే మూడు గుళ్ళు వున్న మా ఊళ్ళో మరో గుడి కట్టడానికి భూములు ఇచ్చిన రైతులు తర్వాత ఆ గుడిలో దేవుడిని పట్టించుకోలేదు. ఊళ్ళో బడి దిక్కూ మొక్కూ లేకుండా వుంటే దాని సంగతి పట్టించుకోలేదు.

అదే సమయంలో మిషనరీ వారు ఎక్కడో విసిరేసినట్టున్న మా ఊరువంటి ఓ మారు మూల గ్రామంలో ఓ మంచి పాఠశాల కట్టించారు. అక్కడ చదువుకున్న పిల్లలు జీవితంలో ఎంతో ఎదిగి వచ్చారు.

గుడి ప్రాధాన్యతను నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ సమాజానికి కావాల్సిన వాటిని అందించడంలో మన ధార్మిక సంస్థలు తగినంత కృషి చేయడం లేదు. కోట్ల కోట్ల ఆస్తులు కలిగిన సంస్థలు కూడా చదువుకూ, ఆరోగ్యానికీ ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఏదైనా అంటే అది ప్రభుత్వాల బాధ్యత అంటారు.

కంచిపీఠం, రామకృష్ణ మఠం వంటివాళ్ళు చక్కని విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్వహిస్తున్న సంగతి వాస్తవమే. కానీ విస్తృత హిందూ సమాజపు విద్య, వైద్య అవసరాలని అవి తీర్చగలిగే స్థాయిలో లేని మాట కూడా నిజమే. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షణ అనేది మొదటి ప్రాధాన్యంగా అవి కార్య కలాపాలు నిర్వహిస్తున్నాయి.

విద్య, వైద్య రంగాల ప్రాధాన్యత గుర్తించిన మిషనరీ సంస్థలను నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు మతం మారితే మనం తప్పుపడుతున్నాము. వాళ్ళని దూరం చేసుకుని, వాళ్ళే దూరం జరిగారని అనుకుంటే లాభం ఏమిటి?

అయితే, మతం మార్చుకుని కూడా ప్రభుత్వ సదుపాయాలను, సౌకర్యాలను అనుభవించడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇందులో భేదాభిప్రాయం లేదు. ఉండరాదు. సరే! ఇది తెగే అంశం కాదు. అసలు విషయానికి వస్తాను.

మా నాన్నగారికి సుస్తీ చేసిన సమయంలో సుబ్బయ్య తాతయ్య ఎంతో ఆదుకున్నాడు. అప్పులన్నీ తీర్చి వేసాడు. చికిత్స గురించి శ్రమ పడేవాడు. అప్పుడు మా పెద్దన్నయ్యకు పదిహేడు ఏళ్ళు ఉంటాయేమో. మా నాన్నకు ఎక్కడో  భద్రాచలం దగ్గర అడవుల్లో కోయవాళ్లు ఇచ్చే పసరు పనిచేస్తుందని ఎవరో చెబితే, తనకు ఇటువంటి వాటిల్లో నమ్మకం లేకపోయినా, తాను ఎన్నడూ  వెళ్ళని ప్రదేశాలకు ఒంటరిగా ప్రయాణం చేసి ఆ మూలికల మందు వచ్చాడు. తన చదువును ఫణంగా పెట్టి మా నాన్న కోసం ఆ పల్లెటూరులోనే వుండిపోయాడు. నిజమైన కష్ట జీవి.  సుబ్బయ్య తాతయ్యను బాగా దగ్గరగా చూసిన వాడు.

భోలాశంకరుడుగా పేరున్న సుబ్బయ్య తాతయ్య గారికి చివరి రోజుల్లో భగవంతుడు పరీక్షలు పెట్టాడు. ఆయన భార్య సీతమ్మగారు పక్షవాతంతో తీసుకుని మరణించింది. ఆయనకు  కూడా పెద్దతనంలో ఒక కాలూ చేయీ పడిపోయింది.  అంతకు ముందే తాను దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్యకు, మాకు రెండిళ్ళ అవతల వుండే చామర్తి వీరభద్రరావు మామయ్య అమ్మాయి విమలాదేవితో చాలా సింపుల్ గా వివాహం జరిపించాడు. కట్నకానుకల ప్రసక్తి లేదు. అసలు మా ఇంట్లో ఎప్పుడూ ఈ గోల లేదు.  అంతకు ముందే మా పెద్దన్నయ్య వివాహం జరిగింది ఒక తాటాకు పందిరి కింద.  మా పెద్ద వదినగారు సరోజినిదేవిది  మేనరికం పెళ్లి.

పెళ్ళయిన కొత్తల్లో ఇద్దరు అన్నయ్యలు ఒకరు ఉద్యోగం నిమిత్తం,  మరొకరు చదువుల కోసం మా వదినలను ఇంట్లో పెద్దవారయిన  సుబ్బయ్య తాతయ్య, బామ్మ, అమ్మలను కనిపెట్టి చూడడానికి  మా ఊరిలోనే ఉంచారు. ఇంట్లో కరెంటు సంగతి అటుంచి మరుగు దొడ్డి కూడా వుండేది కాదు. పైగా పాములు, తేళ్ళ బాధ ఒకటి. విస్తళ్ళ కట్ట తీయబొతే అక్కడ ఒక పాము,  ఇంటి దూలానికి చుట్ట్టుకుని ఇంకో పాము. ఇంట్లో హమేషా జీతగాళ్ళు వుండేవాళ్ళు కాబట్టి, భయంతో  కేక వేయగానే వచ్చి వాటిని చంపడమో, పట్టుకుని బయట వదిలేయడమో చేసేవాళ్ళు. నేను మధ్య మధ్య మార్చి పరీక్షలు తప్పుతూ, సెప్టెంబర్ పరీక్షలకు తయారు అవుతాను అనే మిషతో  మా ఊర్లో నెలల తరబడి వుండిపోయేవాడిని. ఒకసారి అరుగు మీద కూర్చొన్నప్పుడు మండ్రగబ్బ కుట్టింది. ఆ బాధ వర్ణనాతీతం. ఏడ్చి మొత్తుకుంటుంటే మా బామ్మ ఎవరినో పిలిపించి తేలుమంత్రం వేయించింది. అలాంటి ఇంట్లో, కొత్తగా కాపురానికి వచ్చిన  మా ఇద్దరు వదినలు ఎంతో ఓపికగా పెద్దవారికి సేవచేసేవారు. మట్టి ఇల్లు. అప్పటికి బండలు వేయించలేదు. ప్రతిరోజూ వంటింటిని ఆవుపేడతో అలికేవారు.  పక్షవాతంతో మంచానపడిన మా సుబ్బయ్య తాతయ్యకు మా రెండో వదిన గారు విమల స్వయంగా అన్నం తినిపించడం నాకు బాగా గుర్తు. ఇప్పుడు వాళ్ళూ పెద్దవాళ్లు అయ్యారు. ఆనాటి సేవల పుణ్యం  ఇప్పుడు  అక్కరకు వస్తోంది. వారి సౌశీల్యం, సహనం మళ్ళీ మా కుటుంబంలోకి అడుగుపెట్టిన  కోడళ్ళకు రావడం మా  అదృష్టం. కంటికి రెప్పలా కనిపెట్టుకుని చూస్తున్నారు.  

కింది ఫోటో:

దత్తు తీసుకున్న మా రెండో అన్నయ్య రామచంద్రరావుతో సుబ్బయ్య తాతయ్య, సీతం బామ్మ.



ఇంకా వుంది.    

17, నవంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచివచ్చిన దారి (8) - భండారు శ్రీనివాసరావు

 


ప్రతి ఇంటికి ఒక ఇలవేలుపు ఉంటాడు. నాకు సంబంధించినంతవరకు మా ఇంటి ఇలవేలుపులు  ఇద్దరు. ఒకరు మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు గారు. రెండోవారు మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారు.

పొతే, మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు  గారంటే నాకెంత గౌరవం వుందో అంతకుమించి రెట్టించిన  కోపం కూడా వుంది. (శ్రీరాముడి మీద భక్త రామదాసుకు కోపం వచ్చినట్టు. అది సభక్తిక ఆగ్రహం)

గౌరవం ఎందుకంటే ఆయన్ని  మించి  గౌరవించతగిన గొప్పవ్యక్తి  ఈ సమస్త భూప్రపంచంలో  నాకు మరొకరు ఎవ్వరూ లేరు. ఇక కోపం ఎందుకంటే, ఆయన బతికి వున్నప్పుడు ‘చెన్నా టు అన్నా’ అనే పుస్తకం రాస్తుంటానని ఎప్పుడూ చెబుతుండేవాడు. మొదటిసారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు పీఆర్వో ఆయనే. ఆ రోజుల్లో పీఆర్వో, అన్నా,  సీపీఆర్వో అన్నా,  ప్రెస్ సెక్రెటరీ అన్నా సమస్తం ఆయనే. తరువాత  అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఆ తదుపరి మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నేతృత్వం వహించిన నందమూరి తారక రామారావు, ఇలా ఏకంగా వరుసగా అయిదుగురు ముఖ్యమంత్రులకు పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన అనుభవం ఆయనది. అందుకే ఆ పుస్తకం పేరు అలా పెట్టాడు.  కానీ రాయకుండానే దాటిపోయాడు.  అదీ నాకు కోపం.  ఆయన ధారణశక్తి అపూర్వం. ఒక విషయం విన్నా, చదివినా ఎన్నేళ్ళు అయినా మరచిపోడు. తారీఖులతో సహా గుర్తు. ఇక విషయం వివరించడంలో,  మా అన్నయ్య అనికాదుకానీ,  ఆయనకు ఆయనే సాటి.  ఇంగ్లీష్, తెలుగు భాషలు కొట్టిన పిండి. రాసినా, మాట్లాడినా అదో అద్భుతమైన శైలి. అన్నింటికీ  మించి వెలకట్టలేని నిబద్ధత. అలాటివాడు  అలాటి పుస్తకం రాశాడు అంటే గొప్పగా వుండి తీరుతుందనే నమ్మకం అందరిదీ. ఒక విషయం,  తమ్ముడిని  కాకపోయుంటే ఇంకా గొప్పగా పొగిడేవాడిని.

ఎందుకో ఏమిటో కారణం తెలవదు. గొప్ప ఆధ్యాత్మిక గ్రంధాలు ఎన్నో ఒంటి చేత్తో రాశాడు కానీ,  రాజకీయాల జోలికి వెళ్ళలేదు. నేల మీద చాప వేసుకుని కూర్చుని, కాగితాల బొత్తి తొడమీద పెట్టుకుని వందల, వేల పేజీలు   రాస్తూ పోయాడు. పైగా రాసినవన్నీ  రిఫరెన్సుకు పనికి వచ్చే గ్రంధాలు. కంప్యూటరు లేదు, ఇంటర్ నెట్ లేదు. టైప్ చేసేవాళ్ళు లేరు. ప్రూఫులు దిద్దేవాళ్ళు లేరు, ఎందుకంటే రాసిన విషయాలు అటువంటివి, పేర్కొన్న శ్లోకాలు అటువంటివి. తభావతు రాకూడదు, స్ఖాలిత్యాలు  వుండకూడదు. ఒంటిచేత్తో అన్నదందుకే.  నరసింహస్వామి తత్వం గురించి అవగాహన చేసుకుని రాయడానికి దేశంలో ఎక్కడెక్కడో వున్న నరసింహ క్షేత్రాలు  సందర్శించాడు. కోల్కతా, చెన్నై వంటి నగరాలలోని  గ్రంధాలయాల చుట్టూ తిరిగి రాసుకున్న నోట్స్ తో అద్భుత గ్రంధాలు వెలువరించాడు. ఏ ఒక్క పుస్తకాన్నీ అమ్ముకోలేదు. అటువంటి వాటిపట్ల మక్కువ వున్నవారికి ఉచితంగా కానుకగా ఇచ్చేవాడు. ఆ క్రమంలో ఒకరకమైన ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయాడు.  బహుశా మానసికంగా ఒక స్థాయికి చేరిన తరువాత ఆయనకు ఈ పారలౌకిక  విషయాలు అన్నీ పనికిమాలినవిగా అనిపించాయేమో తెలవదు.

ఇప్పుడు ఇన్నాళ్ళకు అనిపిస్తోంది ఆయన చేసిన పని సబబేనని. ఏవుంది ఈ రాజకీయాల్లో. రాసింది ఒకళ్ళు మెచ్చుతారా, ఒకళ్ళు నచ్చుతారా! అందరూ గిరిగీసుకుని కూర్చున్నారు. ఒకరు మెచ్చింది మరొకరు నచ్చరు. తమ మనసులో వున్నదే రాయాలంటే ఇక రాయడం ఎందుకు? అసలు  ఇంత అసహనం ఎందుకో అర్ధం కాదు. ఈ స్థాయిలో రాజకీయ నాయకుల పట్ల, సినీ హీరోల మాదిరిగా అభిమాన దురభిమాన ప్రదర్శనలు ఎందుకోసం? రవ్వంత వ్యతిరేకత ధ్వనించినా సహించలేని పరిస్తితి. చరిత్ర తెలియాలంటే జరిగింది జరిగినట్టు చెప్పేవాళ్ళు వుండాలి. వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు వుండాలి. అప్పుడే చరిత్ర, చరిత్రగా రికార్డు  అవుతుంది. కానీ ఈ ముక్కలు ఎవరి చెవికీ ఎక్కడం లేదు. 

ఇవన్నీ చూస్తున్న తరువాత మళ్ళీ  మళ్ళీ అనిపిస్తోంది ఆయన రాజకీయం రాయకపోవడం రైటే అని.

అయితే, నేను ఈ శీర్షిక మొదలు పెట్టినప్పుడు కొందరు ఇదే విషయం అడిగారు. నీ వృత్తి జీవితంలో పూర్ణభాగం రాజకీయులతో గడిచింది కదా! మరి నువ్వయితే ఏం చేస్తావ్ అని. ఓ పది, పదిహేనేళ్ల క్రితం ఇది మొదలు పెట్టి వుంటే, నిస్సంకోచంగా వున్నది వున్నట్టు రాసేవాడిని. ఈనాడు, మారిన పరిస్థితుల్లో నేనే కాదు, నిజాయితీతో పనిచేసే ఏ జర్నలిస్టుకు ఈ అవకాశం లేదు. విరుచుకుపడడానికి అన్ని పక్షాల వారు ఎప్పుడు కాచుకునే వుంటారు. వారి నుంచి కాచుకోవడం ఎలా అన్నదే పెద్ద టాస్క్.  తెలుగు రాజకీయాలను గురించి అన్ టోల్డ్ స్టోరీస్ నా దగ్గర వంద వరకు వున్నాయి. అవన్నీ ఎవరికో ఒకరికి మనస్తాపం కలిగించేవే. ఆ సంగతి నాకు తెలుసు. వెయిట్ చేయండి. నేనూ రాస్తాను, ఎలా రాస్తానో చూద్దురు కానీ అని కాస్త విసురుగానే జవాబు చెప్పాను.  అలా రాసే ఓపిక వుంది. కానీ ఆ మాత్రం వ్యవధానం నాకు ఆ పైవాడు ఇవ్వాలి.  

ఇక విషయానికి వస్తే,  మా పెద్దన్నయ్య ఎన్నో రాస్తూ, మరెన్నో చెబుతుండేవారు. ఏ ఒక్కరికోసమో కాకుండా, జనాంతికంగా. నిజంగా అవన్నీ శ్రద్ధగా విని రాసుకుని అక్షరబద్ధం చేస్తే  దాన్ని మించిన రచన మరొకటి వుండదు. ఆయన ఏది చెప్పినా నేను మనసు పెట్టి వినేవాడిని. కానీ ఏం లాభం?  ఏనుగుని సృష్టించిన ఆ సృష్టికర్త ఆ పెద్ద జంతువుని శాకాహారిని చేశాడు. లేకపోతే ఈ ప్రపంచం ఏమై వుండేది. అలాగే నా విషయంలో.  నాకు మతిమరపు అనే శాపాన్ని ప్రసాదించాడు. రాయడం అనే శక్తి వుంది కానీ అన్నీ  గుర్తు వుండాలి కదా! అదే నాలోని పెద్ద లోపం. నార్ల గారు చెప్పేవారు. తెలియనిది, గుర్తు లేనిది ఊహించి రాయకు అని.

అందుకే, అన్నయ్య రాసిన వాటిని, అముద్రితాలను సయితం సేకరించడం, ఎవరి నోటి నుంచయినా, వాళ్ళు నాకంటే చిన్నవాళ్లు అయినా సరే,  ఆయన మాటలు  వినబడితే, మళ్ళీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను.  ఆయన చెప్పిన మాటలు, రాసిన రాతలు  నా ప్రతి రచనలో కనపడతాయి. కాబట్టి నా పేరుతో వచ్చిన రచనలకు ఏమైనా కీర్తి ప్రతిష్టలు అంటూ వస్తే, నేను గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నాను, వాటిల్లో సింహభాగం మా అన్నయ్యకే చెందుతుంది.

మా అన్నయ్య మంచి గుణాలు ఏవీ నాలో లేవు. కానీ, నిజాయితీగా రాయడం మాత్రం ఆయన నుంచే నేర్చుకున్నాను.

చాలా సంవత్సరాలక్రితం ఆయన ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.

 

ఒకానొక గర్భదరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.

ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.

దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.

దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.

“దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని తెలుసుకుంటాడు.”

 

మా అన్నయ్య చిన్న కుమార్తె చిరంజీవి వాణి ఎప్పుడూ  గుర్తు చేసుకుంటూ వుంటుందిలా.

చిన్నప్పుడు తాతయ్య తద్దినానికి కంభంపాడు వెళ్ళినప్పుడు నాన్న వరండాలో కూర్చుని మాట్లాడుతుంటే వూళ్ళో ఎంతో మంది వినడానికి వచ్చేవారు. నాన్న ఎవరి అభిరుచికి తగ్గట్టు అ అంశం వారితో ముచ్చటి పెడుతుంటే వినేవాళ్ళు అయస్కాంతంలా అతుక్కుపోయి వింటూ వుండేవాళ్ళు. నాన్న మాట్లాడే మాటల్లో రెండు విషయాలు చోటు చేసుకునేవి కావు. ఒకటి ఆత్మస్తుతి, రెండోది  పరనింద.”

ఆయన చేసినవి చిన్నా చితకా ఉద్యోగాలు కావు. అయిదుగురు ముఖ్యమంత్రులకు (చెన్నా టు అన్నా అంటే చెన్నారెడ్డి,అంజయ్య, భవనం, కోట్ల, ఎన్టీఆర్ ) పీఆర్వో గా పనిచేశారు, వాళ్లకి మాట రాకుండా, తను మాట పడకుండా.

సమాచార శాఖ డైరెక్టర్ గా, ఆంధ్రా బ్యాంక్ చీఫ్ పీఆర్వో గా, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1993లో రిటైర్ అయ్యారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం పెన్షన్ లో మూడింట రెండు వంతులు ముందుగానే అమ్ముకున్నాడు. బహుశా ఆయన తనకోసం చేసుకున్న పైరవీ ఇదొక్కటేనేమో. సాధారణంగా ఒప్పుకోని రూల్స్ ని పక్కన పెట్టించి పెన్షన్ డబ్బులు తీసేసుకున్నాడు. సీనియర్ అధికారి హోదాలో పెద్ద మొత్తాన్ని పించనుగా పొందే అవకాశాన్ని వదులుకున్నాడు. (ఆయన చనిపోయిన తరువాత ఎప్పుడో రెండు దశాబ్దాల పిదప జ్వాలా నరసింహారావు పూనికతో, మా వదిన గారికి ఫ్యామిలీ పెన్షన్ పునరుద్ధరించారు)

రిటైర్  అయిన తర్వాత, పెన్షన్ కూడా లేని స్థితిలో తన  శేషజీవితం పుట్టపర్తిలో గడిపారు. ఆయన ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నారో నాకయితే ఇప్పటికీ అర్ధం కాదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం, ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థాశ్రమం మాదిరిగా అన్నీ వదులుకుంటూ అక్కడికి చేరాడేమో అనిపిస్తుంది. ఆయన్ని చూడడానికి హైదరాబాదు నుంచి ఒకసారి  పుట్టపర్తి వెళ్ళాము.

ప్రధాన వీధిలో ఆశ్రమానికి కొంచెం దూరంగా ఓ చిన్న డాబా ఇల్లు. ఇరుకు దారి. చిన్న చిన్న మెట్లెక్కి వెళ్ళాలి. ఒకటే గది. అందులోనే ఓ పక్కగా గ్యాస్ స్టవ్. వంట సామాను. ఊరంతా ఎక్కడ చూసినా బాబా ఫోటోలు. చిత్రం! ఆయన గదిలో ఒక్కటి కూడా లేదు. ఒకప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటప్పుడు పరమహంస గారు పరిచయం. వారు బాబా గారికి  సన్నిహితులు. ఆశ్రమం లోపల కాటేజీ సంపాదించుకోవడం పెద్ద పని కాదు. కానీ అలాంటివి అన్నయ్యకు ఇష్టం వుండవు. ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా మా అన్నయ్యా, వదిన నడిచే తిరిగేవారు. ఇలా అవసరాలు తగ్గించుకుంటూ, అనవసరాలను వదిలించుకుంటూ జీవితం గడపడానికి ఎంతో మానసిక పరిణితి వుండాలి. సాయంకాలం ఆశ్రమంలో భజనకు వెళ్ళేవాళ్ళు.  ముందు వరసలో కూచునే వీలు వున్నా, కావాలని వెళ్లి  చిట్టచివర గోడనానుకుని కూచునేవాడు. బాబాని కలుసుకోగల అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయలేదు. భజన సమయం మినహాయిస్తే పగలూ రాత్రీ ఆ గదిలో కింద  కూచుని, కాలు మీద కాలు వేసుకుని, తొడమీద కాగితాల బొత్తి పెట్టుకుని  అనేక ఆధ్యాత్మిక పత్రికలకు  వ్యాసాలు రాస్తుండేవాడు. దగ్గరలోని ఓ దుకాణంలో కాగితాలు కొంటూ వుండేవాడు. ఒకసారి ఆ షాపువాడు ఎవరితోనూ అంటుంటే ఆ మాటలు మా వదిన చెవిలో పడ్డాయి.

ఎవరండీ ఈయన. ఎప్పుడు వచ్చినా దస్తాలకు దస్తాలు కొనుక్కుని వెడతారు.”

పుట్టపర్తిలో వున్నప్పుడు అన్నయ్య రాసిన అనేక రచనల్లో సాయిగీత  ఇదొకటి. దీనికి కొంత పూర్వరంగం వుంది. భగవాన్ సత్య సాయి బాబా తన జీవిత కాలంలో చేసిన అనేకానేక  అనుగ్రహ భాషణల్లో జాలువారిన హితోక్తులను, సూక్తులను  అంశాల వారీగా వడపోసి, ఒక్క చోట గుదిగుచ్చి, భగవద్గీతలో మాదిరిగా అధ్యాయాలుగా విడగొట్టి టీకా టిప్పణి (టీక అంటే ఒక పదానికి గల అర్థం. టిప్పణి అంటే టీకకు టీక. అంటే అర్థాన్ని మరింత వివరించి సుబోధకం చేయడమన్నమాట)తో సహా తయారు చేసిన బృహత్ గ్రంధం అది. అదొక బృహత్తర కార్యక్రమం. బాబాగారి ప్రసంగాల టేపులు తెప్పించుకుని వినాలి. వింటూ నోట్స్ రాసుకోవాలి. వాటిని ఓ క్రమంలో అమర్చుకోవాలి. ప్రూఫులు కూడా దిద్దుకుని మేలు ప్రతి సిద్ధం చేసుకోవాలి. ఇంత ప్రయత్నం సాగిన తర్వాత కూడా పడ్డ శ్రమ అంతా బూడిదలో పన్నీరు అయ్యే అవకాశాలు వున్నాయి.

బాబా గురించి లేదా ఇతరులు ఆయన గురించి  రాసిన రచనలు సత్యసాయి ట్రస్టు ప్రచురించాలి అంటే వాటికి బాబా గారి ఆమోదం వుండాలి.

అందుకోసం పరమ హంస గారు చాలా శ్రమపడి ఆ పుస్తకాన్ని డీటీపీ  చేయించి, కవర్ పేజీతో సహా డమ్మీ కాపీని తయారు చేయించి, ఒక రోజు భజన ముగించి బాబా విశ్రాంతి మందిరంలోకి వెళ్ళే సమయంలో, ఆ డమ్మీ కాపీని బాబా చేతుల్లో ఉంచారు. బాబా ఆ పుస్తకంలో కొన్ని పుటలు పైపైన చూస్తూ, ఏమీ చెప్పకుండా  దాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయారు. అంతే!

మళ్ళీ బాబా తనంత తానుగా ఆ ప్రసక్తి తెచ్చే వరకు ఆ ప్రస్తావన ఆయన ముందుకు తెచ్చే వీలుండదు. రోజులు గడిచిపోతున్నాయి కానీ బాబా దాన్ని గురించి మాట్లాడక పోవడంతో ఇక అది వెలుగు చూసే అవకాశం లేదు అని నిరుత్సాహ పడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక రోజు బాబా ఆ పుస్తకం డమ్మీ కాపీని పరమహంస గారికి ఇచ్చి, వేరెవరో ఎందుకు మనమే దీన్ని ప్రింట్ చేద్దాం అన్నారు. ఆ విధంగా సాయిగీత పుస్తకాన్ని సత్యసాయి పబ్లికేషన్స్ వారే ప్రచురించారు. బాబా నోటి వెంట వెలువడిన సూక్తులు కాబట్టి అన్నయ్య ఆ పుస్తకం మీద కనీసం సంకలన కర్త అనికూడా తన పేరు వేసుకోవడానికి సమ్మతించలేదు.  సాయిగీత ప్రతులన్నీ అమ్ముడు పోయాయి. ఆసక్తి కలిగినవారికోసం దాని లింక్ vedamu.org అనే వెబ్ సైట్ లో ఉంచినట్టు పరమహంస గారు చెప్పారు. ఆధ్యాత్మిక విషయాల్లో అన్నయ్య అనురక్తిని గమనించి సత్య సాయి పబ్లికేషన్స్ వారు ప్రచురించే సనాతన సారధి బాధ్యతలు అప్పగించాలని కొన్ని ప్రయత్నాలు జరిగినా, దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. రాయడం అనే బాధ్యత తప్పిస్తే వేరే బాధ్యతలు మోసే ఆసక్తి తనకు లేదని చెప్పారు. బాబాని చూడడానికి పుట్టపర్తికి వచ్చే విదేశీయులకు తెలుగు నేర్పే బాధ్యతను అన్నయ్య స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారని, ఇంగ్లీష్ తెలిసిన తమకు ఇంగ్లీష్ లోనే తెలుగు నేర్పేందుకు ఆయన ఎంచుకున్న పద్దతులను ఒక విదేశీ మహిళ డాక్యుమెంట్ చేసింది కూడా.

విషాదం ఏమిటంటే భౌతికపరమైన సంపదలను ఆయన కూడబెట్టలేదు, దాచుకోలేదు. ఆలాగే ఆధ్యాత్మిక పరమైన రచనలు ఎన్నో చేసి  వాటిని కూడా దాచుకోలేదు.

భౌతిక ప్రమాణాల ప్రకారం నిర్ధనుడుగా దాటిపోవడం బాధ్యతారాహిత్యమే కావచ్చు. నైతిక విలువల కోణంలో చూస్తే అది తప్పనిపించదు. ఆయన చూపించి వెళ్ళిన దారిలో మేము కొంత దూరం నడవగలిగినా జన్మధన్యమే.

కాకతాళీయమే కావచ్చు, 480 పేజీల సాయిగీత పుస్తకంలో ఆఖరి వాక్యం ఇలా రాశాడు:

శ్రీరస్తు! శుభమస్తు! విజయోస్తు! ‘సాయి’జ్య  సాయుజ్య ప్రాప్తిరస్తు!

చివరికి తన జీవనయానాన్ని పుట్టపర్తిలోనే ముగించాడు. దానికి ముందు సినిమాల్లో క్లైమాక్స్ మాదిరిగా ఒక సంఘటన చోటు చేసుకుంది. బహుశా అదే ఆయన ఆకస్మిక మరణానికి కారణమేమో!

 

2006 సంవత్సరం ఆగస్టు 14 వ తేదీ ఉదయం

తెల్లవారుతుండగానే పుట్టపర్తి నుంచి మా అన్నయ్య ఒక్కరే  హైదరాబాదు వచ్చారు. ఆయన మొహంలో ఎన్నడూ కనబడని ఆందోళన. రాత్రంతా నిద్ర లేకుండా బస్సులో. పైగా రిజర్వేషన్ కూడా లేకుండా డెబ్బయ్ ఏళ్ళ పైబడిన వయసులో చాలా దూరం నిలబడే ప్రయాణం. అంచేత అలసట వల్ల అలా వున్నారేమో అనుకున్నాం.

కానీ కారణం అది కాదు. ఆయన ఆందోళనకు కారణం దివాలా తీసిన ఒక ప్రైవేటు సహకార బ్యాంకు తాలూకు లీగల్ నోటీసు.

మీరు తీసుకున్న రుణం ఒక్క పైసా కూడా ఇంతవరకు చెల్లింపు చేయలేదు, కావున మీ మీద కోర్టు ద్వారా చర్య తీసుకోబోతున్నాం’ అనేది సారాంశం.

గతంలో ఆయన హైదరాబాదులో వున్నప్పుడు ఉన్న ఇంటి చిరునామా అందులో వుంది. జీవితంలో ఎవరికీ బాకీ పడరాదు అనే సిద్దాంతంతో బతికిన మనిషికి ఇది పెద్ద షాకే.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ గా రిటైర్ అయిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, బంధువు, అడ్వొకేట్ రావులపాటి శ్రీనివాసరావు  అందరం కలిసి నాంపల్లిలో సహకార బ్యాంకుల వ్యవహారాలు చూసే అధికారి కార్యాలయానికి వెళ్లాం. ఆఫీసులో సిబ్బంది పెద్దగా లేరు. సంబంధిత అధికారి ఆర్చుకుని తీర్చుకుని వచ్చేసరికి చాలా పొద్దు పోయింది. రాత్రంతా ప్రయాణం చేసి పొద్దున్న ఏదో పేరుకు ఇంత బ్రేక్ ఫాస్ట్ చేసి రావడం వల్ల మా అన్నయ్య మరీ నీరసించి పోయాడు. మొత్తం మీద ఆ అధికారి వచ్చాడు. మేము చెప్పింది విన్నాడు. ‘ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది, మీరేమీ కంగారు పడకండి, మీకు ఈ అప్పుతో ఏమీ సంబంధం లేదు’ అనే ధోరణిలో మాట్లాడాడు. ‘మనలో మన మాట ఈ బ్యాంకులో ఇలాంటివి ఎన్నో జరిగాయి, ఒక్కొక్కటీ మెల్లగా బయట పడుతున్నాయి’ అని కూడా అన్నాడు.

మేమందరం ఊపిరి పీల్చుకున్నాం, ఒక్క మా అన్నయ్య తప్ప. బ్యాంకును మోసం చేశారు అని వచ్చిన తాఖీదే ఆయన్ని ఇంకా కలవరపెడుతున్నట్టుంది. మంచి మనిషికి ఓ మాట చాలు.

ఆ సాయంత్రమే మళ్ళీ పుట్టపర్తి ప్రయాణం. వద్దన్నా వినలేదు. వదిన ఒక్కతే వుంటుంది అన్నాడు. ఇక తప్పదు అనుకుని ఆర్టీసీ పీఆర్వో కి ఫోను చేసి డీలక్స్ బస్సులో సీటు పెట్టించాను. ఆ రాత్రే ఆయన వెళ్ళిపోయాడు. అదే ఆయన్ని ఆఖరుసారి ప్రాణాలతో చూడడం.

సరిగ్గా వారం గడిచింది. ఆగస్టు 21వ తేదీన కబురు వచ్చింది, మాట్లాడుతూ మాట్లాడుతూ దాటిపోయాడని.

మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి కూడబెట్టిన ధనం అంటూ ఏమీ లేదు.

కానీ జన్మతః వచ్చిన మానధనం మాత్రం పుష్కలంగా వుంది.

మా పెద్దన్నయ్యకు అనేకరంగాల వారితో సన్నిహిత పరిచయం వుండేది. చాలామంది ఆయనకు తెలుసు, ఆయనకూ చాలామంది తెలుసు. కానీ, ఆయన ఈ లోకంలో లేరన్న సంగతి వారిలో చాలామందికి తెలవదు. ఇప్పటికీ చాలా మంది అడుగుతుంటారు, మీ అన్నగారు ఎలావున్నారని? అంటే అంత నిశ్శబ్దంగా ఆయన దాటిపోయారన్నమాట. ఆయన లేరన్న భావం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు కాబట్టి నిజం చెప్పలేకా, అబద్ధం ఆడలేకా ఒక నవ్వు నవ్వి తప్పుకుంటూ వుంటాను.

భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు ఇవ్వకపోయినా, అనాయాస మరణం మాత్రం ప్రసాదించాడు.

 

కింది ఫోటో:

మా అన్నయ్యలు భండారు పర్వతాలరావు, భండారు రామచంద్రరావు వారి నడుమ మా మేనకోడలు శారద భర్త, మాజీ ఐపిఎస్ అధికారి, ప్రసిద్ధ రచయిత రావులపాటి  సీతారాంరావు, కుడిపక్కన చెవి ఒగ్గి వింటున్న నేను .



 

ఇంకావుంది