13, డిసెంబర్ 2022, మంగళవారం

రద్దు రద్దయితే – భండారు శ్రీనివాసరావు

 అసందర్భంగా అనిపించినా ఆ సందర్భం ప్రస్తావించదలిచాను. 1970 ప్రాంతంలో నేను విజయవాడలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో పని చేసే రోజుల్లో జర్నలిష్టుగా సంఘంలో నా జీవితం ఒక మెట్టు పైన వుండేది. కానీ జీతభత్యాల రీత్యా చూసుకున్నప్పుడు దారిద్య్ర రేఖకు దిగువన వుండేది. జీతానికీ, జీవితానికీ పొంతనలేని ఆ రోజుల్లో ఒకరోజు, ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి జరూరుగా కావాల్సి వచ్చింది. ఇల్లంతా గాలించినా పాతిక పైసలు కూడా లేవు. పిల్లవాడికి పోతపాలు. పాలసీసా పగిలిపోయింది. నేనూ మా ఆవిడా దిగులు మొహాలు వేసుకుని కూర్చుని వుంటే రామారావు అని కొత్తగా పరిచయం అయిన వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతడాసమయంలో అలా రావడం మా ఇద్దరికీ బాగనిపించలేదు. పరిస్తితి గమనించాడేమో వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఇట్టే తిరిగి వచ్చాడు. అతడి చేతిలో పాలసీసా. మా ప్రాణాలు లేచి వచ్చాయి. కొద్దిరోజులుగా నానుంచి ఓ సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. అతనో పెయింటర్. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే తపన. బ్యాంకులో పూచీకత్తు ఇచ్చేవాళ్ళు కావాలంటున్నారు. అతడు చేసిన సాయానికి ప్రతిగా బ్యాంకుకు వెళ్లి హామీ సంతకం చేసి పదివేలు అప్పు ఇప్పించాను. వెంటనే, హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగం రావడం, ఆ తరువాత మాస్కో రేడియోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళడం ఈ హడావిడిలో నేను బెజవాడ బ్యాంకు అప్పు సంగతి మరచిపోయాను. ఈలోగా అప్పుతీసుకున్న వ్యక్తి వ్యాపారం సరిగ్గా నడవక రోడ్డున పడడం, బ్యాంకు వాళ్ళు హామీదారునయిన నా చిరునామా పట్టుకుని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ద్వారా లక్ష రూపాయలకు కోర్టు ఇచ్చిన డిక్రీ చేతిలో పెట్టడం సినిమాలోలా జరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగిని కదా, అప్పు వసూలుకు నేను వారికి కనిపించి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం అల్లా ఇప్పుడు అలా జరగడం లేదేమిటని!

అల్లా ఈరోజు దాకా అనుకుంటున్నాను. కానీ ఇందాకనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఓ బాంబు పేల్చారు. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసినట్టు అనుకుంటున్న రుణాలు రద్దయినట్టు  భావించరాదనీ, అప్పులు తీసుకున్నవాళ్లు ఏ దేశంలోవున్నా ముక్కు పిండి వసూలు చేస్తామని వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని అర్ధం వచ్చే రీతిలో మాట్లాడినట్టు టీవీల్లో స్క్రోలింగులు తిరుగుతున్నాయి.

పోనీ లెండి, పెన్షన్ అటాచ్ చేస్తామని అనలేదు. ఆస్తులు కదా! అవి ఎట్లాగో లేవు.


https://economictimes.indiatimes.com/industry/banking/finance/banking/bad-loans-worth-rs-10-lakh-crore-wrote-off-by-banks-in-last-five-financial-years-says-nirmala-sitharaman/articleshow/96196461.cms?fbclid=IwAR3rpQ6aHhZuvd9JGmcM_NWpJsrHjPB9RRRh1btCv8ZT5QFgnsDn75UJlQg&from=mdr

(13-12-2020)




(13-12-2020)

11, డిసెంబర్ 2022, ఆదివారం

నా బలమా! నీ నామ బలమా! – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha today Sunday 11-12-2022)
‘పరీక్ష తప్పడానికి అయినా సిద్ధపడతాడు కానీ, పక్కవాళ్ళది చూసి కాపీ కొట్టడు’ అనే మంచి పేరు నాకు చదువుకునే రోజుల నుంచి వుంది. అయితే, చూసి కాపీ కొట్టకపోవచ్చు, కానీ విని రాసుకోవడం అనే కొత్త అలవాటు, యాభయ్ ఏళ్ళ క్రితం పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన నాటి నుంచీ తప్పనిసరి అవసరంగా అలవడింది. విలేకరి చేసే పనే అది కదా! ఇతరులు చెప్పింది విని, ముక్కున పెట్టుకుని వెళ్లి ఆఫీసులో ఒప్పగించడం. అందులోను నేను చేసింది రేడియో ఉద్యోగం. వార్తల వ్యవధే పది నిమిషాలు. అంచేత మూడు ముక్కల అప్పగింతతో విధినిర్వహణ బాధ్యత ఆ పూటతో ముగిసిపోయేది. మళ్ళీ ఇప్పుడు రిటైర్ అయి ఆంధ్రప్రభ దిన పత్రికలో వారం వారం ఆదివారం నాటికి ఓ వ్యాసం రాసే బాధ్యత నెత్తికి ఎత్తుకోవడం చేత మళ్ళీ పాత అలవాటు కొత్తగా వంటపడుతోంది. యింతకీ విషయం ఏమిటంటే:
బహుశా ఏడాది క్రితం అనుకుంటాను, కరోనా రెండో వేవ్ ఉదృతంగా సాగుతున్నప్పుడు మిత్రుడు జ్వాలా నరసింహారావు, ఆయన భార్యా ఇద్దరూ ఒకేసారి ఈ మాయదారి జబ్బున పడ్డారు. అప్పటికి ఇంట్లోనే వుండి డాక్టర్ సలహాలతో చికిత్స తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఆ విధంగా ఓ రెండువారాలు ఇంట్లోనే ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు, రామనామ జపంతో తాను అస్తమానం కాలక్షేపం చేస్తుండేవాడినని తనకు పూర్తిగా స్వస్థత చేకూరిన తర్వాత జ్వాలా నాతో చెప్పాడు. కరోనా నయం కావడానికి రామనామం కూడా కొంతవరకు పనిచేసిందని ఆయనకో నమ్మకం. ఆలిండియా రేడియోలో నా సీనియర్ సహచరులు ఆర్వీవీ కృష్ణారావు గారికి ఈ విషయం చెబితే ఆయన రామజోగి మందు గురించి చెప్పారు. భక్త రామదాసు కీర్తనలలో ఇదొకటిట.
‘రామజోగి మందు కొనరే ఓ జనులారా!’ అంటూ రామదాసు పాడిన ఓ కీర్తనలో రామనామం ఓ మంచి ఔషధం అని పేర్కొన్నట్టు తెలిపారు.
ఫోన్లో మాట్లాడుతూ రాసుకోవడం వల్ల కొన్ని పదాలు తప్పిపోయాయేమో తెలియదు కానీ మొత్తం మీద భావం బోధపడేలా రాసుకున్న రామదాసు కీర్తన ఇది:
‘రామజోగి మందు కొనరే! ఓ జనులార! రామజోగి మందు కొనరే!
రామజోగి మందు కొని ప్రేమతో భజించుడన్న
కామక్రోధ లోభ మోహ ఘనమైన రోగాలకు మందు
కాటుక కొండలవంటి కర్మము లెడబాపే మందు
సాటిలేని జగమునందు
స్వామి రామజోగి మందు కొనరే!
ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు ముదముతో సేవించే మందు
రామజోగి మందు కొనరే! ఓజనులార! రామజోగి మందు కొనరే!’
కొంచెం అటూ ఇటుగా ఇదీ రామదాసు గారు పాడిన కీర్తన
రామదాసుగారు చెప్పిన రామజోగి మందు (సతతం రామ రామ అని భజించడం) జ్వాలాకు కరోనా నుండి రక్షణ కవచం మాదిరిగా పనిచేసిందని కృష్ణారావు గారి ఉవాచ.
ఆయనతో పాటు నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి, ఆర్వీవీ కృష్ణారావు, అమెరికా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు. నాకు రాయకపోతే తోచదు. కానీ నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప, ఆ తర్వాత గుర్తుండదు. ఈ పాడు మతిమరపు వల్ల వెంటనే రాసుకుంటే సరి. లేకపోతె ఇంతే సంగతులు.
రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.
ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.
ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.
నారాయణ గారికి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.
భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారితో అన్నారు. ‘నారాయణ గారి చవులూరించే విందు ఆరగిస్తున్నాం సరే! మరి వీనుల విందుగా మీ విందు (కచేరీ) మాత్రమే మిగిలింది’ అని.
ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా’ అనే త్యాగరాయ విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి రాగం వుంది.
సరే ఇదలా ఉంచితే ..
ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు. దాదాపు ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం గుర్తుండే వుంటుంది.
ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారికి భవిష్యత్ వాణి తెలుసల్లే వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.
చిన్ననాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి ఒక మందు చీటీ రాసిచ్చి పట్రంమ్మంటాడు. చిల్లి కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు ఆయుర్వేదం మందులు అమ్మే షాపుకి పరిగెడతాడు. షాపు వాడు చీటీ చూసి మందుల అలమరా తెరిచి, ఓ సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో ఉందంటారు కృష్ణారావు గారు.
పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు. కస్తూరి మాత్రలు, సువర్ణ సూర్యావతి, పైత్యాంతక రసం. వాటితో పాటు కాశీ దారాలు, ఇత్తడి పిన్నీసులు, పేల దువ్వెనలు వగైరా వగైరా. ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవారు.
వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు. అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న మాట వాస్తవమే అయినా, అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు నయం చేసే శక్తి క్రమంగా లోపిస్తోందేమో అని ఓ సందేహం.



(11-12-2020)

10, డిసెంబర్ 2022, శనివారం

ఇద్దరు అచ్చమాంబలు - భండారు శ్రీనివాసరావు

మా కుటుంబంలో ఇద్దరు ప్రసిద్దులయిన స్త్రీ మూర్తులు వున్నారు. ఇద్దరి పేర్లు ఒకటే అచ్చమాంబ. ఒకరు భండారు అచ్చమాంబ. రెండవవారు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ. మొదటి ఆవిడ రెండో అచ్చమాంబకు స్వయానా మేనత్త.

డాక్టర్ అచ్చమాంబ కొమర్రాజు లక్ష్మణ రావు గారనే సుప్రసిద్ధ సాహితీవేత్త కుమార్తె. లక్ష్మణ రావు గారు భండారు అచ్చమాంబ గారి సోదరులు. వారిది కృష్ణా జిల్లా నందిగామ వద్ద పెనుగంచి ప్రోలు. ఆకాలపు ఆచారాల దృష్ట్యా అచ్చమాంబ గారికి తలితండ్రులు చదువు చెప్పించలేదు. అయితే ఎమ్మే వరకు చదివిన సోదరుడి పక్కనే వుండి సొంతంగా చదువు నేర్చుకుని అనేక భాషల్లో పండితురాలు కాగలిగిన పట్టుదల అచ్చమాంబ గారిది. తెలుగులో మొదటి కధ రాసింది భండారు అచ్చమాంబ అనే ప్రచారం ఒకటి వుంది. ఆవిడ మేనకోడలు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ బెజవాడలో పేరెన్నికగన్న వైద్యురాలు. విజయ టాకీసు ఎదురుగా ఉన్న రామచంద్ర రావు రోడ్డు ( ఆయన మా పెద్ద మేనమామ, గొప్ప వకీలు)లో అచ్చమాంబ గారి ఆసుపత్రి వుండేది.
మా ఇళ్ళల్లో పురుళ్ళూ పుణ్యాలు అన్నీ అక్కడే. ఆవిడ పుణ్యమే!




విని వూరుకున్నంత సుఖం లేదు - భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక కాలంలో నేను టీవీ చర్చలకు క్రమం తప్పకుండా అనుదినం వెడుతుండే బంగారు కాలంలో ఒకానొక రోజు...
టీవీ చర్చల విరామసమయంలో లేదా చర్చలకు, ముందూ తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో చర్చలకు వచ్చిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అనేక ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటారు. వాటిల్లో నిజంపాలెంతో తెలియదు కాని, విన్నప్పుడు నిజమేనేమో అనిపించేలా వుంటాయి ఆ కబుర్లు. అలాటి ఉదంతం ఒకటి.
చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార పార్టీలో పైకి వచ్చిన బడా నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో ఛోటా నాయకుడికి రాజకీయ గీతాబోధ చేసాడిలా.
'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా మేనేజిమెంటు'
'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు ఛోటా నాయకుడు.
'అది తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్ పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని చెప్పి ఈ ఇరవై వేలు అతడికి ఇచ్చిరా. అలాగే, మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.
ఛో.నా., బ. నా. చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట పెట్టాడు.
'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా మట్టి బుర్రకు అర్ధం అయి చావలేదు'
'అదేమరి. నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా! మామూలు వాళ్ళకి అవకాశం అలాటప్పుడే దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి కారు కాసేపు అక్కడే ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి అంటే డ్రైవర్ ని మనం మంచి చేసుకోవాలి. అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్ కాలును, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం అయిందా? సమ్జే! అండర్ స్టాండ్!' అన్నాడు అన్ని భాషల్లో బ. నా.
'అయింది మహాప్రభో!' అనేసాడు ఛో.నా.
(తోకటపా: ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ ఎవరా రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి. చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే అలవాటులేని నేనూ అడగలేదు, విని వూరుకున్నంత సుఖం మరోటి లేదు. ఇలాంటి వాటినే మీడియా పరిభాషలో ఆఫ్ ది రికార్డ్ అంటారు)

4, డిసెంబర్ 2022, ఆదివారం

శనివారం రాత్రి వాట్సప్ రాలేదు

 ప్రతి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడూ మూడున్నర ప్రాంతంలో వాట్సప్ మెసేజ్ చప్పుడు చిన్నగా వినపడేది. నాకు తెలుసు అది ఖమ్మం నుంచి దుర్గా ప్రసాద్ పంపింది అని.

గత రెండు మూడు ఏళ్లుగా ప్రతి ఆదివారం ఆంధ్ర ప్రభలో నా ఆర్టికల్ వస్తోంది. E Paper చూడడం వస్తుంది కానీ దాన్ని క్రాప్ చేయడం తెలియదు. ఆ పని దుర్గా ప్రసాద్ చేసేవాడు. చాలా తేలిక ఈసారి హైదారాబాద్ వచ్చినప్పుడు నేర్పుతాను అని కిందటి వారమే చెప్పాడు .
రాత్రి మెసేజ్ చప్పుడు రాలేదు. కానీ మెలకువ వచ్చింది. ఇక ముందు అది రాదు అని అర్థం అయి మనసు ఆర్ధ్రం అయింది.
బై పెద్దబాబు బై!
మామయ్య.
రాజకీయ భీష్ముడు రోశయ్య – భండారు శ్రీనివాసరావు
(డిసెంబరు నాలుగు రోశయ్య ప్రధమ వర్ధంతి)
Published in Andhra Prabha today, Sunday.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కానీ, ఆ పిమ్మట తమిళనాడు గవర్నర్ పదవి కానీ కొణిజేటి రోశయ్యకు కోరుకుంటే వచ్చినవి కావు. ఈ పదవులను కోరుకునేవారు, కోరుకున్నవారు ఎంతోమంది ఉన్నప్పటికీ, అవే వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని వరించాయి అంటే సబబుగా ఉంటుందేమో.
కీర్తిశేషులు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఆచార్య రంగా వంటి ఉద్దండ రాజకీయ నేతలతో సాహచర్యం చేసి, రాజశేఖరరెడ్డి వంటి యువతరం నాయకులతో కలసి మెలిసి పని చేసి, అనేక సంవత్సరాలపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు సారధ్యం వహించి, సర్వం వ్యాపారపరమయిన ప్రస్తుత రాజకీయరంగంలో ఇక ఇమడ లేనని తెలుసుకుని, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే వయసే కాదు, 'ఆ శక్తులూ, ఆ యుక్తులూ' తనకు లేవని అర్ధం చేసుకుని తనకు తానుగా తప్పుకున్న తత్వం రోశయ్య గారిది. అయినా ఆయన సుదీర్ఘ అనుభవం, అవినీతి మరకలు అంటని రాజకీయ జీవితం అక్కరకు వచ్చి మళ్ళీ ఆయనను రాజకీయ ప్రధాన యవనికపై నిలబెట్టాయి.
ఒక పెనువిషాదం రాష్ట్రాన్ని కమ్ముకున్న దురదృష్ట సమయంలో, మేరు పర్వతం లాంటి ఒక నాయకుడిని రాష్ట్ర కాంగ్రెస్ కోల్పోయిన విపత్కర తరుణంలో ఏ అండా లేని రోశయ్య, ఎవరూ ఊహించని రీతిలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు.
ఈ పదవి శాశ్వతం కాదని, అధిష్టానం ఆదేశిస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా తప్పుకుంటాననీ అంటూ, కావమ్మ మొగుడు సామెతను ఉటంకిస్తూ ఆయనే స్వయంగా అనేక పర్యాయాలు బాహాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే నీడలా వెంటపడి వచ్చే 'హంగూ ఆర్భాటాలను' సయితం ఆయన చాలా రోజులు దూరం పెట్టారు. అంతేకాదు, లోగడ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాటిస్తూ వచ్చిన సంప్రదాయానికి విరుద్ధంగా, పదవిని స్వీకరించిన వెంటనే ఢిల్లీ విమానం ఎక్కని 'అరుదయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి' అనే రికార్డ్ కూడా ఆయన ఖాతాలో చేరింది. ఇంకా చెప్పాలంటే, కొరకరాని కొయ్య అని పేరుగాంచిన 'పోలీసు బాసు'ని రాత్రికి రాత్రే మార్చేసారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అంతకుముందు కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతోను అతి సన్నిహితంగా పనిచేసిన అధికారిని కేవలం సమర్ధత పాతిపదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించగలిగారు. చిన్న పదవిని భర్తీ చేయాల్సి వచ్చిన ఢిల్లీ పెద్దలను సంప్రదించే సాంప్రదాయానికి స్వస్తి చెప్పిన ఘనత కూడా రోశయ్యదే. అనేక జిల్లాలలో కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేశారు. రాజకీయ పార్టీలు అన్నింటికీ 'ఓట్ల వనరు'గా ఉంటూ వస్తున్న తెల్ల రేషన్ కార్డుల ప్రక్షాళనకు సయితం నడుం కట్టారు. జనాకర్షక పధకాలలోని ఆర్దికపరమయిన మంచి చెడుల పట్ల దృష్టి సారించారు.
స్వల్పకాలంలోనే ఇన్ని చేసినా ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి’, 'అసమర్ధ ముఖ్యమంత్రి' అన్న ముద్ర నుంచి తప్పించుకోలేకపోయారు. కాంగ్రెస్ రాజకీయాలు అవపోసన పట్టిన రోశయ్యకు ఈ ప్రచారానికి వెనుక వున్న రాజకీయ కారణాలు తెలియవని కాదు. కానీ గుంభనంగా వుండిపోయారు.
ప్రయత్నం చేయని పదవి అయాచితంగా లభించినా అందులో ఆయన ప్రశాంతంగా గడిపిన సమయం బహు తక్కువ. ఒక దానివెంట మరొకటి చొప్పున సమస్యలు వరదల్లా వెల్లువెత్తాయి.
ఆంద్రప్రదేశ్ వంటి అతి ముఖ్యమయిన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా వుండడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందరి కళ్ళు నిశితంగా గమనిస్తుంటాయి. రాజకీయ లబ్దినీ, రాజకీయుల ద్వారా లబ్దినీ పొందాలని చూసే శక్తుల 'శక్తియుక్తులు' అన్నీ ముఖ్యమంత్రి పీఠం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. ఈ రకమయిన కుయుక్తి రాజకీయాలు నడిపే శక్తుల స్తాయినీ, స్తోమతనీ, సామర్ధ్యాన్నీ తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు, తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన్ని 'రోజులు,వారాల ముఖ్యమంత్రి' గానే లెక్కవేశారు. తాత్కాలిక ప్రాతిపదికపైన శాశ్వతంగా కొనసాగే వీలుచాళ్ళు కానరావడంతో సొంత పార్టీలోని ప్రత్యర్దుల నుంచి ముప్పేట దాడులు మొదలయ్యాయి. బయటి పోరుకు ఇంటిపోరు తోడయింది.
ఫలితం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పాత బాటలోనే ముఖ్యమంత్రి మార్పుకు సిద్ధపడింది. దరిమిలా రోశయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను అని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు.
ముళ్ళకిరీటం వంటి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత రోశయ్య చాలాకాలం మాజీ ముఖ్యమంత్రిగా వుండి పోయారు. పదవి లేకుండా క్షణం గడవని షరా మామూలు రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా ఆయన తన పార్టీకి వీర విధేయుడిగా ఎంతో ఓపిక ప్రదర్శించారు. ఆ నిరీక్షణ ఫలించింది. తమిళనాడు వంటి కీలక రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. జయలలిత వంటి ప్రాంతీయ పార్టీ అధినేత్రి ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రానికి గవర్నర్ గా నెగ్గుకు రావడంలో కూడా రోశయ్యకు వున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం అక్కరకు వచ్చింది.
ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ, భగవంతుడు ఇచ్చిన అసాధారణ ధారణ శక్తి, ప్రసంగ పాటవాలను సమయస్పూర్తితో వాడుకుంటూ శిఖరాగ్రాలకు చేరుకున్న కొణిజేటి రోశయ్య ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుతూ నిరుడు డిసెంబరు నాలుగో తేదీన తన 88వ ఏట కన్నుమూశారు.
ఆయన మరణంతో నిబద్ధత కలిగిన రాజకీయాల శకం ముగిసింది.
(04-12-2022)
ఆంధ్ర ప్రభ : Andhra Prabha Telugu News Paper | Andhra Prabha ePaper | Andhra Prabha Andhra Pradesh | Andhra Prabha Telangana | Andhra Prabha Hyderabad
EPAPER.PRABHANEWS.COM
ఆంధ్ర ప్రభ : Andhra Prabha Telugu News Paper | Andhra Prabha ePaper | Andhra 

3, డిసెంబర్ 2022, శనివారం

ఆఖరి ప్రయాణానికి అంతా సిద్ధం.

 పుట్టినప్పుడే టిక్కెట్టు కొన్నాను, ఏం లాభం అంత ముందుగానే కొన్నా, ఆర్ ఏ సీ పొమ్మన్నారు. రైలు బయలు దేరడానికి కొద్ది ముందుగా వచ్చి ఎవరైనా కేన్సిల్ చేసుకుంటే ఆ బర్త్ ఖాయం చేస్తారుట. చాలా కాలం వెయిట్ చేసి ఇక లాభం లేదనుకుని ప్రతి రోజూ వెళ్లి నా అదృష్టం పరీక్షించుకుంటున్నాను. ఏం లాభం. ఎక్కడెక్కడి వాళ్ళో వస్తున్నారు. నాకంటే ముందే రైలు ఎక్కుతున్నారు. ఎలా అంటే అదేదో ఈ క్యూ అంటారు. అదేదో తెలియకే ఇన్నాళ్ళు ఇలా ప్లాట్ ఫారం మీదే గడ్డాలు పెంచుకుంటూ వేచి వున్నాను. వెంట తీసుకువెళ్ళే లగేజ్ లేదు, అదో అదృష్టం. నేనొక్కడినే కాదు. ఎక్కడ చూసినా అదే జనం. వారిలో కొందరికి ఎలాగైనా రైలు ఎక్కాలని వుంది. కొందరికి ఈ రైలు తప్పిపోతే బాగుండు అనిపిస్తోంది.

 కానీ రైలు రావడం, బెర్త్ కన్ఫర్మ్ కావడం ఎవరి చేతిలో లేదుగా!

(ఈ రాతలు ఇప్పుడు పిచ్చిగా అనిపించినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మంచిగా అనిపిస్తాయి, జీవితం అంటే అదే!, నేనూ అలాగే అనుకున్నాను వయసులో వున్నప్పుడు)

03-12-2022

ఆగిపోయిన దరహాసం – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు  శనివారం ఉదయం ఎప్పటిలాగే ఇంటి ముందు వరండాలో (మామూలుగా అపార్ట్ మెంట్ కల్చర్ లో వరండాకు వీలుండదు, కానీ ఏరికోరి ఆ ఏర్పాటు చేసుకున్నాడు) కుర్చీలో కూర్చుని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు మా మేనల్లుడు కౌటూరి దుర్గా ప్రసాద్. అలా మాట్లాడుతూనే ఓ పక్కకు ఒరిగిపోయాడు. దగ్గరలో ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు కానీ ఫలితం దక్కలేదు. ఏకాదశి పుణ్య తిధినాడు అనాయాసంగా కన్ను మూశాడు నా మేనల్లుడు, ఆప్త మిత్రుడు పెద్దబాబు. పెద్ద బాబు ఇక లేడు అనే వార్తతో ఇంటిల్లిపాదీ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.

నాకంటే వయసులో చాలా చిన్న. కానీ ఆ చిన్నవయసులోనే ఒక మనిషి సాధారణ  జీవితంలో ఏమి సాధించవచ్చో అన్నీ సాధించే ప్రయత్నం చేశాడు.

డిగ్రీ పాసవుతూనే ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం, ఏడాది తిరగకుండానే ఖమ్మం నాగార్జున గ్రామీణ బ్యాంకులో ఆఫీసరు కొలువు, అది వదిలేసి ప్లీడరు ప్రాక్టీసు, ఆ పిదప రాజకీయ రంగ ప్రవేశం, జలగం వెంగళరావుకు అత్యంత ఆత్మీయుడుగా మారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరో అవతారం, ఢిల్లీ దాకా వెళ్లి నానా ప్రయాస పడినా అసాధ్యం అనుకునే  కాంగ్రెస్ టిక్కెట్టు, అదీ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇంటికే వచ్చి వొళ్ళో పడడం, రాజకీయం రంగూ రుచీ వాసనా తెలియని వయసులో అసెంబ్లీకి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోవడం  అలా అన్నీ పాతిక ముప్పయి వయసు లోపలే జరిగిపోయాయి.

ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక ఇందిరాగాంధి చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి దుర్గాప్రసాద్  ప్రత్యక్ష సాక్షి. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావు తండ్రి) వున్నారు.  

ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెసు (కాంగ్రెస్ ఓ) లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?

ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చోటా మోటా స్థానిక నాయకుల మీద పడింది.


(కౌటూరి దుర్గాప్రసాద్)


 

రాజకీయాల్లో ఆటుపోట్లన్నీ తట్టుకుని నిబ్బరంగా నిలబడ్డాడు. అందులో పైకి రాలేకపోయినా మొత్తం కుటుంబానికి మంచీచెడూ కనుక్కునే పెద్ద దిక్కుగా మారాడు.  

తనపై తనకు అంతులేని ఆత్మ విశ్వాసం, దాన్ని వ్యక్తీకరిస్తున్నట్టు ఎన్నడూ చెరగని దరహాసం. పెద్దబాబును చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేసేది, ఒక్కోసారి భయం వేసేది. చాలాసార్లు  ధైర్యం కలిగేది.

ఎవరు ఏ సమస్యలో వున్నా సరే, అదో సమస్యా అని తేలిగ్గా అంటూ మనసుల్ని తేలిపరిచేవాడు. తనకు చేతనైన సాయం అడగకుండానే చేసేవాడు. తన సమస్యలను ఎవరి వద్దా ప్రస్తావించేవాడు కాదు.

1992 లో వివాహ రజతోత్సవం నాడు, ఖమ్మం నుంచి హైదరాబాదుకు ఓ గజమాలతో వచ్చి, దండలు లేని పెళ్లి చేసుకున్నానని అదే పనిగా గొప్పలు చెబుతుంటావు కదా! ఈరోజు మీ పెళ్లి నేను దగ్గర వుండి జరిపిస్తాను” అన్న పెద్దబాబును మరచిపోవడం సాధ్యం అయ్యే పనికాదు, వాడి మాటల్ని పదేపదే గుర్తు చేసుకోవడం తప్ప.

“అనాయాసేన మరణం, వినా ధైన్యేన జీవనం” ఈ సూక్తికి పెద్దబాబే పెద్ద ఉదాహరణ.

(03-12-2022)