11, డిసెంబర్ 2022, ఆదివారం

నా బలమా! నీ నామ బలమా! – భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha today Sunday 11-12-2022)
‘పరీక్ష తప్పడానికి అయినా సిద్ధపడతాడు కానీ, పక్కవాళ్ళది చూసి కాపీ కొట్టడు’ అనే మంచి పేరు నాకు చదువుకునే రోజుల నుంచి వుంది. అయితే, చూసి కాపీ కొట్టకపోవచ్చు, కానీ విని రాసుకోవడం అనే కొత్త అలవాటు, యాభయ్ ఏళ్ళ క్రితం పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన నాటి నుంచీ తప్పనిసరి అవసరంగా అలవడింది. విలేకరి చేసే పనే అది కదా! ఇతరులు చెప్పింది విని, ముక్కున పెట్టుకుని వెళ్లి ఆఫీసులో ఒప్పగించడం. అందులోను నేను చేసింది రేడియో ఉద్యోగం. వార్తల వ్యవధే పది నిమిషాలు. అంచేత మూడు ముక్కల అప్పగింతతో విధినిర్వహణ బాధ్యత ఆ పూటతో ముగిసిపోయేది. మళ్ళీ ఇప్పుడు రిటైర్ అయి ఆంధ్రప్రభ దిన పత్రికలో వారం వారం ఆదివారం నాటికి ఓ వ్యాసం రాసే బాధ్యత నెత్తికి ఎత్తుకోవడం చేత మళ్ళీ పాత అలవాటు కొత్తగా వంటపడుతోంది. యింతకీ విషయం ఏమిటంటే:
బహుశా ఏడాది క్రితం అనుకుంటాను, కరోనా రెండో వేవ్ ఉదృతంగా సాగుతున్నప్పుడు మిత్రుడు జ్వాలా నరసింహారావు, ఆయన భార్యా ఇద్దరూ ఒకేసారి ఈ మాయదారి జబ్బున పడ్డారు. అప్పటికి ఇంట్లోనే వుండి డాక్టర్ సలహాలతో చికిత్స తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఆ విధంగా ఓ రెండువారాలు ఇంట్లోనే ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు, రామనామ జపంతో తాను అస్తమానం కాలక్షేపం చేస్తుండేవాడినని తనకు పూర్తిగా స్వస్థత చేకూరిన తర్వాత జ్వాలా నాతో చెప్పాడు. కరోనా నయం కావడానికి రామనామం కూడా కొంతవరకు పనిచేసిందని ఆయనకో నమ్మకం. ఆలిండియా రేడియోలో నా సీనియర్ సహచరులు ఆర్వీవీ కృష్ణారావు గారికి ఈ విషయం చెబితే ఆయన రామజోగి మందు గురించి చెప్పారు. భక్త రామదాసు కీర్తనలలో ఇదొకటిట.
‘రామజోగి మందు కొనరే ఓ జనులారా!’ అంటూ రామదాసు పాడిన ఓ కీర్తనలో రామనామం ఓ మంచి ఔషధం అని పేర్కొన్నట్టు తెలిపారు.
ఫోన్లో మాట్లాడుతూ రాసుకోవడం వల్ల కొన్ని పదాలు తప్పిపోయాయేమో తెలియదు కానీ మొత్తం మీద భావం బోధపడేలా రాసుకున్న రామదాసు కీర్తన ఇది:
‘రామజోగి మందు కొనరే! ఓ జనులార! రామజోగి మందు కొనరే!
రామజోగి మందు కొని ప్రేమతో భజించుడన్న
కామక్రోధ లోభ మోహ ఘనమైన రోగాలకు మందు
కాటుక కొండలవంటి కర్మము లెడబాపే మందు
సాటిలేని జగమునందు
స్వామి రామజోగి మందు కొనరే!
ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు ముదముతో సేవించే మందు
రామజోగి మందు కొనరే! ఓజనులార! రామజోగి మందు కొనరే!’
కొంచెం అటూ ఇటుగా ఇదీ రామదాసు గారు పాడిన కీర్తన
రామదాసుగారు చెప్పిన రామజోగి మందు (సతతం రామ రామ అని భజించడం) జ్వాలాకు కరోనా నుండి రక్షణ కవచం మాదిరిగా పనిచేసిందని కృష్ణారావు గారి ఉవాచ.
ఆయనతో పాటు నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి, ఆర్వీవీ కృష్ణారావు, అమెరికా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు. నాకు రాయకపోతే తోచదు. కానీ నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప, ఆ తర్వాత గుర్తుండదు. ఈ పాడు మతిమరపు వల్ల వెంటనే రాసుకుంటే సరి. లేకపోతె ఇంతే సంగతులు.
రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.
ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.
ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.
నారాయణ గారికి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.
భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారితో అన్నారు. ‘నారాయణ గారి చవులూరించే విందు ఆరగిస్తున్నాం సరే! మరి వీనుల విందుగా మీ విందు (కచేరీ) మాత్రమే మిగిలింది’ అని.
ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా’ అనే త్యాగరాయ విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి రాగం వుంది.
సరే ఇదలా ఉంచితే ..
ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు. దాదాపు ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం గుర్తుండే వుంటుంది.
ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారికి భవిష్యత్ వాణి తెలుసల్లే వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.
చిన్ననాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి ఒక మందు చీటీ రాసిచ్చి పట్రంమ్మంటాడు. చిల్లి కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు ఆయుర్వేదం మందులు అమ్మే షాపుకి పరిగెడతాడు. షాపు వాడు చీటీ చూసి మందుల అలమరా తెరిచి, ఓ సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో ఉందంటారు కృష్ణారావు గారు.
పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు. కస్తూరి మాత్రలు, సువర్ణ సూర్యావతి, పైత్యాంతక రసం. వాటితో పాటు కాశీ దారాలు, ఇత్తడి పిన్నీసులు, పేల దువ్వెనలు వగైరా వగైరా. ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవారు.
వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు. అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న మాట వాస్తవమే అయినా, అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు నయం చేసే శక్తి క్రమంగా లోపిస్తోందేమో అని ఓ సందేహం.



(11-12-2020)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

జబ్బు నయం చేసే శక్తి క్రమంగా లోపిస్తోందేమో అని ఓ సందేహం.


సందేహ పడాల్సిన అవసరమే లేదండి. వందకి వేయిపాళ్ళూ సచ్ హై