5, సెప్టెంబర్ 2022, సోమవారం

ముగ్గురు గురువులు - భండారు శ్రీనివాసరావు

 (సెప్టెంబరు అయిదు- ఉపాధ్యాయ దినోత్సవం)

‘సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః’

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.

ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. ‘నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే ‘పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడు’ అని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.

గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న వృత్తాంతం గుర్తుకువస్తోంది.

“ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.

“తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు”

ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.”

మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.

1921 వ  సంవత్సరం. అంటే వందేళ్ళ కిందటి మాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.”

పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.

ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.

అక్షరబిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నా చిన్నతనంలో మా ఊరిలో షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది.  ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు.  బ్లాకు బోర్డులు లేవు. విద్యార్ధులలో చాలామందికి పలకా బలపాలు ఉండేవి కావు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ, ఇవి వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించేవారు. అంతసేపు నాకు ఒంట్లో వణుకు. అసలు ఆయన్ని చూస్తూనే భయం. కానీ అప్పయ్య మాస్టారు కొట్టో, తిట్టో నేర్పించిన నాలుగు అక్షరాలే నాకు జీవితంలో ఒక మార్గం చూపాయి. వీడికి పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు అనే మాటలు పడకుండా కాపాడాయి. 

ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో పడి,  ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షరభిక్ష పెట్టిన మహానుభావుడు కనుకే మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.

మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన ఫోను వచ్చినప్పుడు నేను ‘రేడియో రోజులు’ మరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్ అనే విషయం రాస్తున్నాను.   అదేమిటంటారా!

మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. ‘అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెనడీ ఎన్నిక. ఓటమి అంగీకరిస్తూ రిచర్డ్ నిక్సన్  ప్రకటన’ అంటూ ఆయన చదివే వార్తలు వింటుంటే, అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.

ఉపాధ్యాయ దినోత్సవంనాడు ఆయన్ని సంస్మరించుకుంటూ -    

గురుద్దేవో నమః

కింది ఫోటో: కీర్తిశేషులు శివరాజు అప్పయ్య పంతులు గారు




అడగ్గానే ఇళ్ళు ఇచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు


ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు.

1975 లో బెజవాడ ఆంధ్రజ్యోతి వదిలి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో చేరాను అన్నమాటే కానీ, రాజధాని నగరంలో ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే, రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని, ఆ కాపీ నాటి  ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి, పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి మేముంటున్న చిక్కడపల్లి నుంచి రిక్షాలో  ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే దానిలో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. నేను గట్టిగా చెప్పడంతో, ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు గారు  అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. మొదటి ఇంటి కధ ఆ విధంగా ముగిసింది.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులో

ఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని. అదయితే ఎంచక్కా  తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన.  ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు, ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే కావాలి అన్నాను. పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే అన్నారాయన వెక్కిరింతగా. వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు.

ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా  ఆర్డర్ వచ్చింది.

2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి  రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ  కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో సందేహిస్తూ కాలం  గడిపాము.

మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.

(05-09-2022)

 

 


4, సెప్టెంబర్ 2022, ఆదివారం

ప్రజాస్వామ్యం హరాయించుకోలేని పార్టీ ఫిరాయింపులు

 (Published in Andhra Prabha Daily on 04-09-2022, SUNDAY0

పత్రికారచయితలు రాసుకోవడానికి కాలం చెల్లని, సార్వకాలీన అంశం ఏదైనా వుంది అంటే అది పార్టీ ఫిరాయింపులే. ఎందుకంటే, దేశంలో ఎక్కడో ఒక చోట,  నిన్నా,నేడు, రేపు  అనే తేడా లేకుండా సర్వకాలాల్లో జరుగుతుండేవి ఈ ఫిరాయింపులే.

పార్టీ ఫిరాయింపులు గురించి ప్రస్తావించుకునేటప్పుడు కొంత పరిణామక్రమాన్ని కూడా గుర్తుచేసుకోవాలి.

అనైతిక పార్టీ మార్పిళ్లను అరికట్టడానికి చట్టం లేదా అంటే వుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే, రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా  పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. అయితే, దాని ప్రకారం, చట్ట సభలో ఒక పార్టీకి వున్న సంఖ్యాబలంలో మూడింట ఒక వంతుమంది వేరే పార్టీలోకి మారితే అది పార్టీ పిరాయింపు కాకుండా, 'విలీనం' కిందికి వస్తుంది. దీన్ని అడ్డుపెట్టుకుని వ్యూహాత్మక మార్పిళ్లు జరగడంతో ఆ చట్టం కోరలు పదును పెట్టడం కోసం దరిమిలా దానికి ఎన్నో సవరణలు కూడా చేశారు. అయినా  చట్టంలోని  లొసుగుల్ని వాడుకుంటూ, చట్టాలకు తూట్లు పొడవడం ఆ చట్టాల నిర్మాతలయిన ప్రజా ప్రతినిధులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చట్టం దోవ చట్టానిది,  రాజకీయ నాయకుల దోవ వారిదీ అవుతూ వచ్చింది. ఎవరినీ తప్పుబట్టడానికి వీలులేకుండా తప్పులు చేస్తూ పోవడానికి చట్టాల్లో వున్న ఈ లొసుగులే ప్రధాన కారణం. అనేకానేక అధ్యయనాల అనంతరం పద్దెనిమిదేళ్ళ తరువాత అంటే, 2003 లో ఈ చట్టానికి మరో రాజ్యాంగ సవరణ చేసారు. దీని ప్రకారం 'పార్టీ మార్పిడి పిరాయింపు కాదు, మరో పార్టీలో విలీనం కావడం' అని చట్టం దృష్టిలో అనిపించుకోవాలంటే ఆ పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు సమ్మతించాలి. ఈ సవరణ ప్రకారం విడిగా కానీ, బృందాలుగా కానీ, పార్టీ మారే చట్టసభల సభ్యులు తమ సభ్యత్వానికి ముందు  రాజీనామా చేయాలి.  అలా రాజీనామా చేసినవారు, ఆ తరువాత ఎటువంటి లాభదాయక పదవులు పొందడానికి వీలుండదు. నిజానికి ఈ రాజ్యంగ  సవరణ ద్వారా పార్టీ మార్పిళ్లు అనేవి దుర్లభంగా మారాయి. కానీ, రాజకీయాల్లో వున్నవాళ్ళు ఘటనాఘటన దురంధరులు. అడ్డువచ్చిన వాటిని ఎలా అడ్డు తొలగించుకోవాలో, అదీ చట్టబద్ధంగా, వారికి కరతలామలకం. ఎన్నికలు కాగానే, గెలిచినవాళ్ళల్లో కొందరు, తాము అధికారం దక్కని పార్టీలో ఉన్నామని గ్రహించిన మరుక్షణం నుంచే గోడదూకే సన్నాహాలు మొదలుపెడతారు.  ఎందుకంటే, ఎన్నికల్లో గెలవడం ఒక్కటే వారికి ముఖ్యం కాదు, పాలకపక్షం అండ దొరికితేనే 'ప్రజాసేవ' చేయడానికి వీలుంటుంది అన్న నమ్మకం పుష్కలంగా పెంచుకున్నవాళ్ళు వారు. అందుకే అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరిపోయి, తమ రాజీనామా ద్వారా ఉత్పన్నమైన ఖాళీలో జరిగే ఉపఎన్నికలో  పోటీ చేసి,  అధికార పార్టీ ప్రాపకంతో మళ్ళీ  అనతికాలంలోనే చట్టసభల్లో ప్రవేశించిన ఉదాహరణలు  కోకొల్లలు.  పార్టీ పిరాయింపులను నిరోధించడానికి రూపొందించిన చట్టాన్ని ఆ విధగా కొందరు నీరుకార్చి వేస్తున్నారు. 'ఇది నైతికమా కాదా' అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కానీ, అంతటి  సావధానం కానీ వారికి ఉంటుందనుకోలేము. ఇక, 'ఇలా చేతికి అందిన రాజీనామాలు ఆమోదించాలా తిరస్కరించాలా లేదా పెండింగులో పెట్టాలా' అనే విషయంలో స్పీకర్లదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాలను  సమీక్షించే లేదా తిరగతోడే అవకాశం న్యాయస్థానాలకు  కూడా లేదు. గత అయిదారేళ్ళ కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలను సునిశితంగా గమనిస్తూ వస్తున్నవారికి  ఇటువంటి సందర్భాలు లెక్కకు మిక్కిలి అన్నవిషయం తేలిగ్గానే బోధపడుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా అధికారంలో వున్న పార్టీదే పైచేయి.  అందువల్ల, పిరాయింపులు అనేవి పాలకపక్షాల ఇష్టాఇష్టాల ప్రకారమే అటు చట్టబద్దం కావడమో, ఇటు చట్ట విరుద్ధం కావడమో జరుగుతోంది. అయితే, చట్టంలో వున్న  ఈ లొసుగుకు  సుప్రీం కోర్టు ఓ మేర అడ్డుకట్టవేసింది. గతంలో గోవా శాసనసభ స్పీకర్ ఇద్దరు సభ్యులపై వేసిన 'అనర్హత వేటు'ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.  కానీ రాజ్యాంగం పదో షెడ్యూల్లో పొందుపరచిన మిగిలిన అధికరణాలను మాత్రం సుప్త్రీంకోర్టు తప్పుపట్టలేదు.

మంచి చేయబోతే చెడు ఎదురయినట్టు, ఈ చట్టం వల్ల కొందరు నిజాయితీపరులయిన సభ్యులు ఇబ్బంది పడే అవకాశం వుంది.  అనర్హత వేటుకు భయపడి, ఇష్టం వున్నా లేకపోయినా పార్టీ అధినాయకత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను, బిల్లులను, వాటి  మంచి చెడులతో నిమిత్తం లేకుండా సమర్ధించాల్సిన పరిస్తితి వారిది.

ఇండిపెండెంటు సభ్యులకు  ఈ చట్టంలో కొంత వెసులుబాటు వుంది. వారు తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు తెలపవచ్చు. కానీ అందులో చేరడానికి వీలులేదు. ఇండిపెండెంటుగా గెలిచినా వాళ్ళు ఇండిపెండెంటు హోదాలోనే కొనసాగాలని   చట్టం నిర్దేశిస్తోంది. హర్యానాలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఇండిపెండెంటుగా గెలిచిన అభ్యర్ధులు   అధికార పార్టీలో చేరినట్టు టీవీల్లో వార్త  ప్రసారం అయింది. ఒక టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో  ఏకంగా వారే ఈ విషయం చెప్పినట్టు వచ్చింది. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించారు. వారు కోర్టును ఆశ్రయించారు. చివరికి  సుప్రీం కోర్టు కూడా  స్పీకర్ నిర్ణయాన్నే  సమర్ధించింది.

పొతే, మనం సాధారణంగా  'పాలిటిక్స్' అని వాడే ఇంగ్లీష్ పదం  గ్రీకు భాషలోని 'పొలిటికా' అనే పదం నుంచి వచ్చింది. అమెరికా దేశపు మొదటి  అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహాం లింకన్  ప్రజాస్వామ్య ప్రభుత్వానికి  ఇచ్చిన నిర్వచనాన్నే మన రాజకీయ నాయకులు తరచూ ఉటంకిస్తుంటారు. 'ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం' అని. పొలిటికా అనే  ఈ గ్రీకు పదానికి దాదాపు అదే అర్ధం. అయితే కాలక్రమంలో 'నేతిబీరకాయ సామెత' మాదిరిగా ప్రజాస్వామ్యంలో 'ప్రజలు' అడుగంటి పోయి 'నాయకస్వామ్యం'గా మారడం మొదలయింది. 'దీనికి ఎవ్వరు కారకులు? ప్రజలా? పాలకులా? పార్టీలా?' అంటే, 'తిలాపాపం తలా పిడికెడు' అన్నట్టు అందరికీ ఇందులో భాగం వుంది.  ఎవరో అన్నట్టు రాజకీయాలు అనేవి ఒక బుడుగు మాదిరి. దాంట్లోకి ఒకసారి దిగితే అంతే  సంగతులు. తిరిగిరావడం వారి చేతిలో వుండదు. అందుకే,  ఒక పార్టీలో తమకు భవితవ్యం  లేదనుకున్నప్పుడు సిద్దాంతాలు, సూత్రాలు గాలికి వొదిలేసి వేరే పార్టీలోకి దూకుతున్నారు. ఇలా గోడలు దూకేవాళ్ళు కొందరయితే, దూకడానికి తటపటాయించేవారిని దింపడం కోసం గోడలకు నిచ్చెన వేసే పార్టీలు మరికొన్ని. చేపలకు 'ఎర'  వేస్తున్నారా, లేక చేపలే వచ్చి గాలానికి చిక్కుకుంటున్నాయా అనేది జవాబు దొరకని ప్రశ్న.

చివరికి  చెప్పేదేమిటంటే, చట్టాలు చేసేవారే వాటిని 'ఎలా ఉల్లంఘించాలా' అనే దారులు వెతకడం మొదలు పెడితే, అసలు వాళ్ళు చేసిన చట్టాలకు అర్ధం వుండదు, అవి తయారయ్యే చట్టసభలకూ  అర్ధం వుండదు. తరువాత తీరిగ్గా విచారించినా ప్రయోజనం వుండదు.

అన్ని రాజకీయ పార్టీలు ఈ వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్య సౌధం పునాదులు బీటలువారకుండా వుంటాయి.




(01-09-2022)

2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

రెండు కన్నీటి బొట్లు - భండారు శ్రీనివాసరావు

 (Published in SAKSHI daily on 02-09-2022, FRIDAY, today)

సరిగ్గా పదమూడేళ్ల క్రితం, 2009 సెప్టెంబరు రెండో తేదీన యావత్ తెలుగు ప్రజానీకం పడిన ఆందోళన ఇంకా గుండెల్లో పచ్చిగానే వుంది. కార్చిన కన్నీటి తడి ఇంకా చెమ్మగానే వుంది. ఆ విషాద ఘడియల్లో దేశవ్యాప్తంగా మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వై.ఎస్.ఆర్. ఆ పేరు ఇక ముందు కూడా వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం సజీవంగా కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకునేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖర రెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.
'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండో పర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండగానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.
'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.
అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి.మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వై.ఎస్.ఆర్., అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది, ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.
1978 నుంచి ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం ఎంత దూరమైనా వెళ్ళడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వై.ఎస్.ఆర్. కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసి పెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసనసభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.
రాజశేఖరరెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.
ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.
2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టుడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పెనవేసుకున్న ఈ బంధం శాశ్వతంగా తెగిపోయిందే అన్న బాధతో, ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నివాళి అర్పిస్తూ, 'రెండు కన్నీటి బొట్లు' రాల్చడం మినహా ఏమీ చేయలేని చేతకానితనం నాది.



(02-09-2022)

1, సెప్టెంబర్ 2022, గురువారం

కాకి చెప్పిన భగవద్గీత

 

రాయకపోతే చచ్చిపోతానేమో అనే కసి పుట్టేవరకు కాగితం మీద కలం పెట్టకు, అప్పుడే మంచి కధ రాయగలుగుతావు అని ఎక్కడో, ఎప్పుడో చదివాను. ఈ వాక్యం ఈనాటి సోషల్ మీడియా ఫార్వార్డ్, షేరింగ్ వ్యవహారానికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. ఇది నలుగురూ చదివితే ఎంత బాగుంటుందో అని గట్టిగా అనిపించేవరకు ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం మానుకుంటే మంచి మంచి విషయాలు అందరికీ చేరతాయి. అలా కాకుండా కంటికి కనిపించిన ప్రతిదీ పక్క వాళ్లకు తోసేస్తుంటే వాళ్లకు మిగిలేది నానా చెత్త మాత్రమే. పనిలేక వాటిని పంపిన వారిని మౌనంగా తిట్టుకుంటూ వాటిని పనిపెట్టుకుని డిలిట్ చేస్తూ కూర్చోవడమే.
ఈ అభిప్రాయం నాలో పాతుకుపోయిన కారణంగా నా పోస్టుల్లో ఈ ఫార్వార్డులు, సేకరణలు, ఎత్తిపోతలు చాలా చాలా తక్కువ.
అయితే మానవ మనస్తత్వాలను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ కింది పోస్టు నేను నాకై పెట్టుకున్న నియమాన్ని పక్కకు పెట్టేలా చేసింది. అందుకే షేర్ చేస్తున్నాను. అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలు. ఆ పోస్టు ఏమిటంటే:
“నాపేరు "కాకి". నాకది మనుషులు పెట్టిన పేరు. "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు. ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.
నాకు నలుగురు పిల్లలు. అందులో ఇద్దరు నా పక్క చెట్టు మీద ఉండే కోయిల సంతానం. కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం, పెంచడం తెలియదు. కానీ, మాకు గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లి కన్న బిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు.
ఆ రోజు ఆదివారం జోరువాన. బంగాళాఖాతంలో వాయుగుండం అంట. ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను.
పిల్లకాకులేమో ఆకలి అంటున్నాయి. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో, డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి. ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.
"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా". అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను.
“ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వాన చినుకులు విసిరిన రాళ్ళలా శరీరానికి తూట్లు పెడుతున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను.
“సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు. నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ. ముందు పచ్చడి, తరవాత కూర, ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ.
మొత్తం నలుగురు. ఒకతను మాత్రం ముసలివాడు, 70 ఏళ్ళవరకు ఉంటాయి. పాపం అతని కంచంలో మాత్రం అన్నం, ఎర్రటి రంగులో మామిడి పచ్చడి.
"అమ్మా, తాతయ్యకి కూర వేయొచ్చుగా" అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు.
వాడు అలా అనగానే, ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ, "ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను. తిండి పెట్టడమే ఎక్కువ. దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు. కూరలు కావాలంట కూరలు. ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ.
ఆమెని అలా చూసి సంబంధం లేని నాకే భయం వేసింది. ఇంక ఆ పిల్లోడెంత.
అక్కడ అంత జరుగుతున్నా ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు,
"ఏవే ఇంకొంచెం సాంబారు పోయి"అని అడిగి పోయించుకుని తింటున్నాడు.
వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి, చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు. వాడి ముఖాన్ని వాడు రోజూ అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో, ఏమో!
పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా, త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో. మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉందనుకుంటా, కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి, మొఖం ఎర్రగా మారిపోయింది.
ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ, అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు . అయ్యో! ఎంత దారుణం, పాపం పెద్దాయన.
వాళ్లు తినడం అయిపోయింది. అందరూ లేచారు. ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను. నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ మిగిలిన అన్నం పడేసాడు. ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి.
"పెద్దాయనా! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని, నేను కొన్ని మెతుకులు తిని, కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.
సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా, ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా. ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు. కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా! అని అక్కడ వాలాను. ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను. అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయనది. ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి.
"అయ్యా! పిండం పెట్టి కాకుల్ని పిలవండి. మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ. ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది. నల్లటి నా మొఖం తెల్లబారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నాయి.
వార్నీ! మనుషులు! మీరేం మనుషులురా బాబు! బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా?
పోవడం కోసం శాపనార్ధాలు పెట్టి, చనిపోయిన తర్వాత కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా?
బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతిని, విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా?
ప్రాణం ఉన్నంత కాలం పెద్దాయన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచె పెడతారా!
పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు. అసలు వీడ్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి.
వెంటనే గాల్లోకి ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను. అందరూ సరే అన్నారు.
గంటా, రెండు గంటలు. అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి. పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు. చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది.
బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో! అందుకే ఇప్పుడు తినడానికి కాకులు రావట్లేదు అని ఒకడు, ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు, అని ఇంకొకరు, నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అవి విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది. తలదించుకుని అలాగే ఉండిపోయాడు. పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బ్రతికున్నా చచ్చిపోయినట్టు అనిపించివుంటుంది అతనికి.
నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను.
చివరి మాట : కాకుల శరీరం నలుపు కావచ్చు, కానీ మనసు మాత్రం తెలుపు.

NOTE: Courtesy Image Owner




NOTE: Courtesy Image Owner