1, సెప్టెంబర్ 2022, గురువారం

కాకి చెప్పిన భగవద్గీత

 

రాయకపోతే చచ్చిపోతానేమో అనే కసి పుట్టేవరకు కాగితం మీద కలం పెట్టకు, అప్పుడే మంచి కధ రాయగలుగుతావు అని ఎక్కడో, ఎప్పుడో చదివాను. ఈ వాక్యం ఈనాటి సోషల్ మీడియా ఫార్వార్డ్, షేరింగ్ వ్యవహారానికి కూడా వర్తిస్తుంది అనుకుంటా. ఇది నలుగురూ చదివితే ఎంత బాగుంటుందో అని గట్టిగా అనిపించేవరకు ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం మానుకుంటే మంచి మంచి విషయాలు అందరికీ చేరతాయి. అలా కాకుండా కంటికి కనిపించిన ప్రతిదీ పక్క వాళ్లకు తోసేస్తుంటే వాళ్లకు మిగిలేది నానా చెత్త మాత్రమే. పనిలేక వాటిని పంపిన వారిని మౌనంగా తిట్టుకుంటూ వాటిని పనిపెట్టుకుని డిలిట్ చేస్తూ కూర్చోవడమే.
ఈ అభిప్రాయం నాలో పాతుకుపోయిన కారణంగా నా పోస్టుల్లో ఈ ఫార్వార్డులు, సేకరణలు, ఎత్తిపోతలు చాలా చాలా తక్కువ.
అయితే మానవ మనస్తత్వాలను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ కింది పోస్టు నేను నాకై పెట్టుకున్న నియమాన్ని పక్కకు పెట్టేలా చేసింది. అందుకే షేర్ చేస్తున్నాను. అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలు. ఆ పోస్టు ఏమిటంటే:
“నాపేరు "కాకి". నాకది మనుషులు పెట్టిన పేరు. "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు. ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.
నాకు నలుగురు పిల్లలు. అందులో ఇద్దరు నా పక్క చెట్టు మీద ఉండే కోయిల సంతానం. కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం, పెంచడం తెలియదు. కానీ, మాకు గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లి కన్న బిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు.
ఆ రోజు ఆదివారం జోరువాన. బంగాళాఖాతంలో వాయుగుండం అంట. ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను.
పిల్లకాకులేమో ఆకలి అంటున్నాయి. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో, డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి. ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.
"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసుకు ఉండదు కదా". అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను.
“ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వాన చినుకులు విసిరిన రాళ్ళలా శరీరానికి తూట్లు పెడుతున్నాయి. కాసేపు అలసట తీర్చుకుందామని ఒక ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను.
“సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు. నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ. ముందు పచ్చడి, తరవాత కూర, ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ.
మొత్తం నలుగురు. ఒకతను మాత్రం ముసలివాడు, 70 ఏళ్ళవరకు ఉంటాయి. పాపం అతని కంచంలో మాత్రం అన్నం, ఎర్రటి రంగులో మామిడి పచ్చడి.
"అమ్మా, తాతయ్యకి కూర వేయొచ్చుగా" అని ఆ పెద్దాయన పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు.
వాడు అలా అనగానే, ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ, "ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను. తిండి పెట్టడమే ఎక్కువ. దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు. కూరలు కావాలంట కూరలు. ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ.
ఆమెని అలా చూసి సంబంధం లేని నాకే భయం వేసింది. ఇంక ఆ పిల్లోడెంత.
అక్కడ అంత జరుగుతున్నా ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు,
"ఏవే ఇంకొంచెం సాంబారు పోయి"అని అడిగి పోయించుకుని తింటున్నాడు.
వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి, చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు. వాడి ముఖాన్ని వాడు రోజూ అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో, ఏమో!
పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు. అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా, త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో. మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు. బాగా మంటగా ఉందనుకుంటా, కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి, మొఖం ఎర్రగా మారిపోయింది.
ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ, అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు . అయ్యో! ఎంత దారుణం, పాపం పెద్దాయన.
వాళ్లు తినడం అయిపోయింది. అందరూ లేచారు. ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు. అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను. నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ మిగిలిన అన్నం పడేసాడు. ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి.
"పెద్దాయనా! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నావు. నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని, నేను కొన్ని మెతుకులు తిని, కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.
సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా, ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా. ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు. కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా! అని అక్కడ వాలాను. ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను. అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయనది. ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి.
"అయ్యా! పిండం పెట్టి కాకుల్ని పిలవండి. మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ. ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది. నల్లటి నా మొఖం తెల్లబారిపోయింది. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నాయి.
వార్నీ! మనుషులు! మీరేం మనుషులురా బాబు! బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా?
పోవడం కోసం శాపనార్ధాలు పెట్టి, చనిపోయిన తర్వాత కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా?
బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతిని, విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా?
ప్రాణం ఉన్నంత కాలం పెద్దాయన కప్పుకోవడానికి కండువా కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచె పెడతారా!
పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు. అసలు వీడ్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి.
వెంటనే గాల్లోకి ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను. అందరూ సరే అన్నారు.
గంటా, రెండు గంటలు. అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి. పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు. చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది.
బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో! అందుకే ఇప్పుడు తినడానికి కాకులు రావట్లేదు అని ఒకడు, ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు, అని ఇంకొకరు, నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అవి విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది. తలదించుకుని అలాగే ఉండిపోయాడు. పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు, బ్రతికున్నా చచ్చిపోయినట్టు అనిపించివుంటుంది అతనికి.
నా బిడ్డల ఆకలి తీర్చినందుకు ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను. ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను.
చివరి మాట : కాకుల శరీరం నలుపు కావచ్చు, కానీ మనసు మాత్రం తెలుపు.

NOTE: Courtesy Image Owner




NOTE: Courtesy Image Owner

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అవునాండి? భగవద్గీతలో ఉన్నది ఇదేనా? మా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు. అబ్బో, ఏదో మీలాంటి పెద్దలు చెప్పకపోతే మాబోంట్లకి అసలు భగవద్గీత అంటేనే తెల్సి ఉండేది కాదు.

మీ మూడ్ బట్టి ఎవరైనా పంపినది చదవడమో అది నచ్చడమో జరుగుతుంది. దాన్ని బయటకి తీసి ఇదే భగవద్గీత అని చెప్పుకోవడానికి మీకు బాగానే ఉండొచ్చు కానీ అది చదివేవారు వెర్రిపీనుగులు కాదని గమనించాలి. మనలో మాట మీరు ఎన్నిసార్లు ఇప్పటివరకూ భగవద్గీత చదివారు? (అంటే నేను అడిగేది నిజంగా చదివారు అని, కనీసం మీరు పోస్ట్ చేసే - పాత పోస్ట్ లు దిద్ది మరోసారీ మరోసారీ రీసైకిల్ చేసినట్టు).

అజ్ఞాత చెప్పారు...

ఓ నాలుగు దశాబ్దాల ముందు వచ్చిన తెల్లకాకి అన్న ఓ కథ ఆంధ్ర పత్రిక లో అనుకుంటా వచ్చింది. ఆ ఛాయలలో వున్నదండి ఇది.

అజ్ఞాత చెప్పారు...

కాకి పాఠాలు అంటే బాగుంటుందేమో. భగవద్గీత అని ఎందుకు ?

అజ్ఞాత చెప్పారు...

మూడో అజ్ఞాత: భగవద్గీత అని ఎందుకా? కాస్త "వేదాంతం," "గీత" "రామాయణం," అంటూ ఏదైనా కధ చెప్తే జనాలకి చెవిలో పువ్వులు పెట్టడం ఈజీ. దానికోసం ఎంత వయసు వచ్చినా ఇలా వదుల్తూ వుంటారు జనాలమీదకి. నేనేమిటి, నాకేం తెల్సు ఇందులో అనేది ఆవగింజంత చూసుకోవడం కూడా ఉండదు.