24, జులై 2022, ఆదివారం

లోకం చుడుతున్న వీరుడు రాజేష్ వేమూరి

 

వేమూరి రాజేష్ గారిని నేను ఇంతవరకు చూడలేదు. కానీ నేను చూడాలని బలంగా కోరుకున్న వ్యక్తుల్లో రాజేష్ ఒకరు.

రాజేష్ వేమూరి అనే పేరు వినగానే నాకు అల్లసాని పెద్దన విరచిత స్వారోచిత మనుసంభవం అనే మనుచరిత్ర  కావ్యంలోని ప్రవరుడు, మహాకవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తుకు వస్తాయి.

ప్రవరాఖ్యుడి గురించి ఖమ్మం కాలేజీలో మా తెలుగు లెక్చరర్ ఆదినారాయణ గారు చెప్పేవారు.

అరుణాస్పదపురం అనే  ఓ మారుమూల కుగ్రామంలో కాపురం చేసుకుంటూ, తలితండ్రులను పోషించుకుంటూ త్రికాల సంధ్యాదులు సక్రమంగా క్రమంతప్పకుండా  నిర్వర్తించుకుంటూ కాలం గడిపే ఓ శోత్రియ శ్రేష్టుడు ప్రవరుడు.  అతడికి తన ఇల్లే కైలాసం. ఊరు దాటి ఎరుగడు. కానీ లోకం చూడాలనే కోరిక. పొలిమేర దాటలేని ఆశక్తత. అంచేత ఊరిలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చేవాడు. అతిథి మర్యాదల అనంతరం తాను చూడాలని అనుకుని చూడలేని ప్రదేశాల విశేషాలు వారినుంచి వింటూ తృప్తి పడేవాడు. ఈ క్రమంలో యువకుడు అయిన ఓ యువ సిద్ధుడు తటస్థ పడడం, పరాయి ప్రదేశాలను గురించి అతడు చెప్పిన సంగతులు వింటూ, ఇంత చిన్న వయస్సులో అన్ని ప్రాంతాలు ఎలా తిరిగాడని అబ్బుర పడడం,  సరే ఈ కధ ఇంతవరకే చెప్పుకుందాం. తర్వాత కధ తెలియని వాళ్ళు వుండరు.

ఇదెందుకు చెప్పాను అంటే, ఈ కావ్యంలోని ప్రవరుడి వంటి వారు అనేకమంది ఈ నాటికీ వుంటారు. దేశాలు చుట్టి రావాలని వారికి  వుంటుంది, కానీ అందుకు అనేక అవరోధాలు. అంచేత రాజేష్ వంటి వారు దేశాలు చుట్టి రాసే పుస్తకాలు చదివి,  సంతోషించడం. ఇంత చిన్న వయస్సులో ఇన్ని దేశాలు ఎలా తిరిగారని ఆశ్చర్యపడడం.

మనుచరిత్రలోని  సిద్ధుడి వద్ద, అనుకున్నదే తడవుగా  లోకాలు చుట్టి రావడానికి పాదలేపనం అనే దివ్యమైన పసరు  వుంది.  మరి రాజేష్ దగ్గర ఏముంది. తిరగాలనే ఆకాంక్ష వుంది. దాన్ని నెరవేర్చుకునే పట్టుదల వుంది. పట్టుదలకు తగ్గట్టు సహకరించే భార్య భార్గవి వున్నారు. పోదాం పద డాడీ అంటూ  సంచి సర్దుకుని, నేనూ రెడీ అనే   చిన్నారి హన్ష్ ప్రోద్బలం వుంది. అన్నింటికీ మించి రకరకాల దేశాలు చూడాలి, అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలి అనే బలమైన కోరిక వుంది. విశాలమైన హృదయం వుంది. ఏతావాతా జరిగింది ఏమిటి అంటే ఇరవై రెండు దేశాల వీసా స్టాంపులు వాళ్ళ పాసుపోర్టుల్లో భద్రంగా వున్నాయి. కాణీ ఖర్చులేకుండా మనల్ని కూడా ఆ పుస్తకాల ద్వారా ఆ దేశాలు  తిప్పారు. ఈ పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పండి. ముందు ముందు మరిన్ని దేశాలు తిరుగుతారు. మరిన్ని పుస్తకాలు రాస్తారు. మనమూ  వాటిని చదువుతూ వారితో పాటు ఆయా దేశాలు ఉత్తపుణ్యానికి చదువుతాము. ఉభయతారకం అన్నమాట.

ఇంతకీ దూర్జటి పద్యం గురించి ప్రస్తావించారు కానీ ఆ ప్రసక్తి రాలేదేమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను. ముగింపు కోసం అట్టే పెట్టాను.

శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఆఖరి నూరో పద్యం ఇది.

“దంతంబుల్పడనప్పుడే తనవునం దారూడి యున్నప్పుడే

 కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే

విన్తల్మేన చరించనప్పుడే కురుల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె

నీ పదాంబుజములన్ శ్రీ కాళ హస్తీశ్వరా!”

ప్రతిపదార్ధం అవసరం అనుకోను. 

తిరగగలిగిన వయసులో తిరగకుండా, తిరగాలనే  కోరిక ఉన్నప్పటికీ   తిరగలేని అశక్తత కలిగిన మా వంటి వారి గురించే ఆ పద్యం రాసారని అనిపించింది.

అయినా భక్త గోపన్న అన్నట్టు, తక్కువేమి మనకు, రాజేష్ పుస్తకం చేత వున్నవరకు.



23, జులై 2022, శనివారం

అసలేముంది రాజకీయంలో - భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 24-07-2022, SUNDAY)

ఈ కింది సంభాషణలు చిత్తగించండి:

“ఐ.ఐ.టి. టాపర్ అయిన  మీరు ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”

“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని  అప్పట్లో  భావించాను”

“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి  అయివుండి, ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”

“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”

“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”

“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

“దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చంద సంస్థలకు కోట్ల రూపాయలు  భూరివిరాళాలుగా  ఇస్తుంటారు. మరి  రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది”

“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”

“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. మీకు మీరే సాటి అనే పేరుంది. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మధన్యం  అనుకునే వీరాభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. మరి ఈ వయసులో రాజకీయ అరంగేట్రం చేసి,  ఎండనకా, వాననకా ప్రజాసేవ అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”

“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే సరైన  మార్గం”   

“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ.గా వున్నారు.  వృత్తిపరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ ప్రవేశం ఎందుకు చేసినట్టు”

“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”

“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం. అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”

“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను” 

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!

చివరికి ప్రజాసేవ కూడా సోషలిజంలాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.

మరో అర్ధం కాని విషయం వుంది. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఎవరూ డబ్బులు లేని వాళ్ళు కాదు. మరిన్ని ఎక్కువ సొమ్ములు సంపాదించేందుకు రాజకీయాల్లో చేరుతున్నారా అంటే అదీ కాదు. మరి ఎందుకోసం ఈ యావ!  

ఎందుకంటే రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికారచక్రం అలవోకగా  తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయనీటికి ఎగబడే చేపల చందంగా రాజకీయ కండువాలు కప్పుకోవడం కోసం తహతహలాడేది అందుకే.

ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం!

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. కానీ  బయటకు తెలియని విషయం ఒకటుంది. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క బీట్ కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు, షూటింగ్ పర్మిషన్  ఒక్కటే కాదు, కస్టడీలో ఉన్న మనిషికూడా దర్జాగా బయటకు వస్తాడు. ఇక మా ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోవాలి? అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ అనేది  ఓ ప్రముఖ సినీనటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు మరుక్షణంలో క్లియర్ అవుతాయి. కానీ మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎంత గట్టి ఆఫీసర్లం అయినా సరే, పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా ఒక్కోసారి  మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసే బదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా, కాలం గడుస్తున్నకొద్దీ  తత్వం బోధపడి సర్దుకుపోవడమే మేలనే స్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో మనసు మూలల్లో  బాధ. ఇంత చదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మేము అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ అనేది  ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

“ఏళ్ళ తరబడి కష్టపడి సువిశాల వ్యాపార, వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాను. నెలకు లక్షలు లక్షలు జీతాలు తీసుకునే సిబ్బంది నా దగ్గర వేల మంది అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. వాటిని చుట్టి రావడానికి సొంత విమానాలు వున్నాయి. బస చేయడానికి ఏడు నక్షత్రాల హోటళ్ళకు ఏమాత్రం  తీసిపోని సొంత అతిథి గృహాలు అన్ని నగరాల్లో  లెక్కకు మిక్కిలిగా వున్నాయి. కానీ ఏం లాభం. గవర్నమెంటులో  ఒక్క చిన్న ఫైలు కదిలించడానికి మా సీనియర్ అధికారులు సచివాలయం చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు హోటల్లో ఇచ్చే టిప్పు పాటి చేయని నెల జీతాలు తీసుకునే ప్రభుత్వ గుమాస్తాల ముందు చేతులు కట్టుకుని నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటారు. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడు కల్పించుకుని పై వాళ్లకు ఓ మాట చెబితే ఆ ఫైలు  ఆఘమేఘాల మీద కదిలి, అన్ని సంతకాలతో ఆమోద ముద్ర వేసుకుని బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురయినప్పుడు అనిపిస్తుంది, ఎందుకీ పనికిరాని వైభోగాలు, సిరి సంపదలు అని. అసలైన అధికారం మా దగ్గర లేదని తేలిపోయింది. ఎక్కడ ఉన్నదో కూడా తెలిసిపోయింది. అందుకే రాజకీయ రంగప్రవేశానికి అడుగులు వేస్తోంది” ఒక వ్యాపారవేత్త అంతరంగం.

“ఒక చిన్న వీధి రౌడీ దగ్గర కుడి భుజంగా చాలా కాలం వున్నాను. అతడు చెప్పిన పనల్లా చేస్తూ పోయాను. చాలాసార్లు  పోలీసులకు దొరికిపోయి నానా అవస్థలు పడ్డాను. వాళ్ళు నన్ను  నన్ను నడి బజారులో తన్నుకుంటూ స్టేషన్ కు తీసుకు వెడుతుంటే మిన్నకుండిపోయాను. ఇక ఎన్నాళ్ళీ కష్టాలు అని ఓ శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ నాయకుడి దగ్గర అనుచరుడి  అవతారం ఎత్తాను. కొంత పేరు వచ్చిన తర్వాత నన్ను అడిగేవాడే లేడు, అడ్డుకునే వాడే లేడు. నన్ను పట్టుకునే పోలీసు పుట్టలేదు, నన్ను పెట్టే జైలు కట్టలేదు అనే తరహాలో రొమ్ము విరుచుకుని తిరిగే అవకాశం నాకీ కొత్త వృత్తి ఇచ్చింది” అని ఓ మాజీ గ్యాంగ్ లీడర్ తన  గోడు వెళ్ళబోసుకుంటాడు.

అంటే వీరందరినీ రాజకీయాల వైపు  బలంగా లాగుతోంది వ్యవస్థలో ఉన్న లోపం అనుకోవాలి.  

తోకటపా:

ఇలా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు పైకి చెప్పే ప్రజాసేవ అనేది ఒక పడికట్టు పదం మాత్రమే. అసలు కారణాలు మాత్రం  వేరే అనిపిస్తే తప్పేముంది!

నిజానికి ప్రజాసేవే చేయాలి అనుకుంటే అంటే రాజకీయ పదవులు అవసరమా!

ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకే వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.



ఆ రోజులు అలా ఉండేవి



‘మీ పేరు నేదురుమల్లి జనార్ధన రెడ్డి కాదు, ధనార్జనరెడ్డి అంటారు, నిజమేనా?

జర్నలిస్ట్  డైరీ సతీష్ బాబు రూపకల్పనలో గతంలో ప్రసారం అయిన ధర్మపీఠం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్ధన రెడ్డిని ఒక విలేకరి సూటిగా అడిగిన ప్రశ్న ఇది.

ఇబ్బంది పెట్టే ప్రశ్న వేసినా ఇబ్బంది పడకుండా నిగ్రహం కోల్పోకుండా జవాబులు చెప్పడం ఆ నాటి నాయకుల లక్షణం.

అందుకే చెప్పేది, ఆ రోజులే వేరని.  




LINK:

https://www.youtube.com/watch?v=wRR0lRGKthg

“ట” మాయమైపోయింది – భండారు శ్రీనివాసరావు


నాలుగేళ్ల క్రితం ఒక రోజు.
AP 24 X 7 తెలుగు న్యూస్ ఛానల్ లో ఓ సోమవారం ఉదయం Morning Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో, రాజకీయ నాయకులు మాట మార్చడాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గుర్తున్నంతవరకు నేను చెప్పిన విషయాల్లో కొన్ని: (సరిగ్గా ఇలాగే అని కాదు, ఓ మోస్తరుగా ఇలాగే)

“తెలుగు అక్షరమాలలో ‘ట’ అనే అక్షరం మాయమయిపోయినట్టుంది. అదివరకు ఏవైనా విన్నవి, అనుమానం వున్నవి చెప్పేటప్పుడు ‘అన్నాడుట’, ‘చెప్పాడుట’ అని అనేవారు. ఇప్పుడు అలాకాదు, ఎదురుగా వుండి తన చెవులతో విన్నట్టు, ‘అలా అన్నాడు, ఇలా చెప్పాడు’ అనేస్తున్నారు. ‘వెనక ఎన్టీ రామారావు గారు, కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ సీటు అడిగితే కాదన్నారన్న కినుకతో ఏకంగా తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టాడుట తెలుసా’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ‘ట’ తీసేసి మాట్లాడుతున్నారు. దీనివల్ల మీడియా పని కూడా తేలిక అయింది. ప్రయాస పడి, సోర్సులను పట్టుకుని వార్తను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పని లేదు. అసలు వాళ్ళే నేరుగా మీడియాకు, అదీ కెమెరాల ముందు నిలబడిమరీ చెప్పేస్తున్నారు. ‘హోదా కావాలని చెప్పగలరు, అదే నోటితో హోదా కావాలని ఎప్పుడు అన్నామో చెప్పండి’ అంటూ మీడియానే ఎదురు ప్రశ్న వేయగలరు. రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశారని ఎవరో అన్నట్టు ఇంకెవరో చెప్పడం కాదాయె. స్వయంగా నాయకులే చెబుతున్నారు. టీవీ చర్చల్లో తమ నాయకుల వ్యాఖ్యలని సమర్ధించలేక ఇబ్బంది పడే పార్టీ ప్రతినిధులను మనం రోజూ చూస్తూనే వున్నాం.
“నేను మూడేళ్ళ నుంచీ మీడియా చర్చల్లో ఒకటే చెబుతూ వస్తున్నాను. హోదా విషయంలో వైఖరులు మార్చి మాట్లాడకండి. ఇప్పటివరకు అది భావోద్వేగ అంశం కాలేదు. ఒకసారి అలా రూపం మార్చుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఉదాహరణ తెలంగాణా ఉద్యమం. లక్ష కోట్ల ప్యాకేజీ ఇస్తానన్నా ఒప్పుకోలేదు. తెలంగాణా తెచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ప్రభ వెలిగిపోతున్నరోజుల్లోనే, అంటే మొదట్లోనే ‘హోదా అనేది మారిన పరిస్తితుల్లో సాధ్యం కాదు, ప్రత్యామ్న్నాయం చూస్తాము’ అని వుంటే ప్రజలు ఎవరెన్ని చెప్పినా వారి మాటనే నమ్మేవారు. అప్పుడేమో ప్రతివారూ హోదా తధ్యం అన్నట్టు మాట్లాడారు. తరువాత కుదరదన్నారు. హోదా అనేది ఇంకా భావోద్యోగ అంశంగా రూపాంతరం చెందలేదు కానీ, ఆయా పార్టీల వైఖరి ఈ అంశంపై రూపాంతరం చెందుతూ వుండడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రస్తుతానికి నాయకులు మాత్రం ఈ అంశాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.
“వెనక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పట్టుకుంటే లక్ష అనో పదివేలనో ఒక సినిమా వచ్చింది. ఒక చిన్న పాప ఆడుకునే బొమ్మలో లక్షలు ఖరీదు చేసే వజ్రాలు దాస్తారు. అది చేతులు మారుతుంటుంది. కానీ విషయం తెలియక ఎవరూ ఆ బొమ్మను సీరియస్ గా తీసుకోరు. ఒకసారి వజ్రాలు ఎక్కడ వున్నాయో తెలియగానే అందరూ ఆ బొమ్మ వేటలో పడతారు. ఇప్పడు హోదా వ్యవహారం కూడా ఆ బొమ్మ మాదిరిగానే తయారయింది. ఎన్నికల వైతరణి దాటాలంటే హోదా అస్త్రం ఒక్కటే శరణ్యం అని అనుకుని అన్ని పార్టీలు హోదా మంత్రం మొదలు పెట్టాయి”
“చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు కరక్టు టైము చూపిస్తుంది. ఆ మాదిరిగా రాజకీయం కోసం రాజకీయం చేయండి. పార్టీలుగా మీకు ఎలాగూ మాటలు మార్చక తప్పదు. అయితే కనీసం కొంతయినా ప్రజలకోసం మాట్లాడండి. అన్ని పార్టీలకి నా విజ్ఞప్తి ఇదే”

నాలుగేళ్ల క్రితం కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడే చాన్స్ ఇచ్చారు.
ఇప్పుడా! నో చాన్స్! నో వే!

తోకటపా: తన తల్లి ఇందిరాగాంధి మరణ వార్తని ధ్రువ పరచుకోవడానికి రాజీవ్ గాంధి బీబీసీ వార్తలు విన్నారు. ఈ రోజుల్లో ఏదైనా వార్తని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏ ఛానల్ చూడాలి?

22, జులై 2022, శుక్రవారం

ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో కొన్ని అనుభవాలు




ఎన్టీఆర్ సినీ రంగంలో మేరుశిఖర సమానుడు.

హైదరాబాదు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్న నాకు ఆయన్ని పలుసార్లు కలవగలిగే అవకాశం కలుగుతుందని నేను ఏనాడు ఊహించలేదు. ఆయన రాజకీయాల్లో చేరి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి అపూర్వ సందర్భాలు రేడియో విలేకరిగా తటస్థపడ్డాయి. అది కేవలం కాకతాళీయం.

ఆ అనుభవాలను చెప్పే అవకాశాన్ని సుమన్ టీవీ నాకు కల్పించింది.

వారికి కృతజ్ఞతలు. 







ఏవి తల్లీ! నాడు కురిసిన హిమసమూహములు!

ఎప్పుడో తొమ్మిదేళ్ళ నాటి ముచ్చట. తవ్వకాల్లో బయట పడింది. ఇలాంటి కార్యక్రమాలు ఈ టీవీ (TV 5)లోనే కాదు, ఇంకా ఏదైనా టీవీలో ఈరోజుల్లో ప్రసారం అయ్యే అవకాశం ఉంటుందా!




LINK:

https://youtu.be/l8OCnepAzGY

చెప్పులూ, గొడుగూ – భండారు శ్రీనివాసరావు


"ఇదిగో బాణం విడిచిపెడుతున్నా! " శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు.

"ఊ"

"చాలా దూరం వెడుతుంది సుమా!"

"ఎంత దూరం వెళ్లినా తేగలను."

"అలాగేం? సరే! చూడు మరి."

జమదగ్ని బాణం విడిచాడు. రేణుకాదేవి పరుగెత్తింది.

ఒకరోజు వాళ్లిద్దరికి సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది. అందుకే పొద్దున్నే బాణాలూ, విల్లూ తీసుకుని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరుబయలు ప్రదేశం చేరుకున్నారు.

జమదగ్ని బాణాలు వేయడం, ఆమె పరుగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందో కనుక్కుని తెచ్చి ఇవ్వడం .. ఇదీ ఆట.

ఆ ఆట ఇద్దరికీ నచ్చింది.. కాని జమదగ్నికి జాలేసింది తన భార్య కనుక్కోగలదో లేదో అని.

"ఇదిగో బాణం తెచ్చాను!" అని నవ్వుతూ అందించింది రేణుకాదేవి.

అలా జమదగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఆమె కనుక్కుని తెస్తూనే ఉంది. కాని ఒకసారి అలా వెళ్లిన రేణుకాదేవి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. జమదగ్ని చాలాసేపు ఎదురు చూశాడు. చివరికి నీరసంగా , మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది.

"రేణుకా! ఏమైంది ఈసారి ఆలస్యం చేసావు?"

" అదిగో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కి ఆయాసంగా ఉంటే కాస్సేపు ఒక చెట్టు కింద కూర్చుని వస్తున్నాను."

అలిసిపోయి ముఖం మీది చెమటను చీరచెరుగుతో తుడుచుకుంటున్న రేణుకాదేవిని చూసి జమదగ్ని బాధపడి " ఈ సూర్యుడు నిన్ను ఇంతగా బాధపెట్టాడా? అతని పని చెప్తానుండు " అంటూ కోపంతో సూర్యుడివైపు అస్త్రం సంధించాడు.

ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి ఆయన చేతిని పట్టుకున్నాడు.

"మహర్షీ! శాంతించు. సూర్యుడు లేకుండా ముల్లోకాలు నిలుస్తాయా? ఆలోచించు."

"నాకు అదంతా తెలీదు. సూర్యుడు నా భార్యను బాధపెట్టాడు. అతను శిక్ష అనుభవించి తీరాలి" అని గర్జించాడు.

మరుక్షణమే ఆ బ్రాహ్మణుడు "అయ్యా! నన్ను క్షమించు. నేనే సూర్యున్ని. దయ చూపుము" అని ప్రార్ధించాడు.

ఆ వెంటనే చెప్పులు, గొడుగూ సృష్టించి " ఇవిగో! ఈ పాదరక్షలు ధరించి, ఈ చత్రముతో శిరస్సుకు నీడపడితే నా వేడి సోకదు. ఇవి తల్లి రేణుకాదేవికి ఇవ్వండి" అని జమదగ్ని మహర్షికి సమర్పించుకున్నాడు.

అది చూసి జమదగ్ని శాంతించాడు. సూర్యుడు అంతర్ధానమయ్యాడు.

ఆ గొడుగును , చెప్పులనూ చూసి ప్రజలంతా కూడా సంతోషించారు. తాపసుల కోపం కూడా లోకకళ్యాణానికే దారితీస్తుందనే నానుడిని నిజం చేస్తూ రకరకాలుగా గొడుగులూ, చెప్పులనూ తయారు చేసి వినియోగించడం ప్రారంభించారు.


సూర్యుడి చేత సృష్టించబడినవి గనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, బీదసాదలకు, సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి చాలా పవిత్రమైనవి కాబట్టి పెళ్ళిళ్ళలో, పితృకార్యాలలో కూడ వినియోగిస్తారు.