14, జూన్ 2021, సోమవారం

పార్టీ మార్పిళ్ళపై భాట్టం ఘాటు వ్యాఖ్య

 1978 లో మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో  ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఉన్న భాట్టం శ్రీరామ మూర్తి ఓ ఘాటు వ్యాఖ్య చేసారు.

'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా! ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా వుంది'

ఈ వ్యాఖ్య శాసన సభలో దుమారం రగిలించింది.

పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. ‘లేచిపోవడం’ అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగిన  పదమా కాదా అన్న దానిపై కొలిక్కిరాని చర్చ విస్తృతంగా జరిగింది.

తోకటపా:

పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి కూడా తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏకం తప్పితే అనేకం అన్నట్టు,  టీడీపీ తీర్థం కూడా తదనంతర కాలంలో  పుచ్చుకున్నారు.

 

13, జూన్ 2021, ఆదివారం

పెట్రో ధరలు – రాజకీయ విన్యాసాలు - భండారు శ్రీనివాసరావు

 సూటిగా ....సుతిమెత్తగా.....

పెట్రో ధరలు – రాజకీయ విన్యాసాలు భండారు శ్రీనివాసరావు
(పదకొండు సంవత్సరాల క్రితం రాసింది)
(Published in SURYA Daily)

పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. కాదు పెంచారు. వడ్డన కూడా కొంత భారీగానే వుంది.ఒక్క పెట్రోలుతో సరిపెట్టకుండా, పనిలో పనిగా డీసెలు, కిరోసిన్, గ్యాస్ ధరలను కూడా ఒకేసారి పెంచి అనేకసార్లు ఆందోళనలకు దిగే పని లేకుండా ప్రతిపక్షాలకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ ఛానల్లకే కొంత నిరాశ. పలుమార్లు చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ధరల పెరుగుదల ఈ నాలుగింటితో ఆగిపోదు, ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితం, అలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు. పొతే, ఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపిన వాళ్ళు, తమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసినవాళ్ళు యధావిధిగా టీవీ స్తుడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలు, రాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీ, ఇది ఎవరికీ పట్టదు.

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. దరిమిలా, పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయి, ఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీ, యెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఆనవాయితీగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదనని, ఎడ్ల బళ్ళు, రిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు, వెచ్చాలు కొనని వాళ్ళ తాలూకు ఆడంగులు కొందరు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు-ఏమీ కొనేట్టులేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ‘ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడం’ అన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండి, పెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు.

ఇదంతా ఎందుకు జరుగుతోంది ?

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల.

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమె కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాత తరం నుంచి, వున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరో తరం నుంచి, ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకో తరం నుంచి, అలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన దారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలి, కొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి. ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయి, ఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా అనే ఆటో డ్రైవర్ – సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటే, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది. ఇది సమాజం లోని అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కానీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప.

తోకటపా: నేను పెట్రో ధరల పెరుగుదలకు వ్యతిరేకిని. అయితే, రాజకీయ పార్టీలు సమయానుకూలంగా, అధికారంలో లేనప్పుడు చేసే విమర్శలకు, నిరసన ప్రదర్శనలకు, ప్రభుత్వంలో వున్నప్పుడు సమర్ధించుకుంటూ చేసే ప్రకటనలకు కూడా వ్యతిరేకిని.
(25-06-2010)

ఈ ప్రపంచం ఓ మాయా దర్పణం

 

ఓ కుక్క దారి తప్పి దారి పక్కన కనబడ్డ ఓ మ్యూజియంలోకి ప్రవేశించింది. ఆ హాల్లో ఎటు చూసినా అద్దాలే. బ్రూస్ లీ సినిమాలో మాదిరిగా కిందా, పైనా, పక్కనా, నలువైపులా నిలువెత్తు అద్దాలు. అందులో దూరిన కుక్కకు మతి పోయింది. ఎటు చూసినా తనను బోలిన శునకాలే. నిజమో కాదో తేల్చుకోవడానికి ఆ కుక్క పళ్ళు బయటపెట్టి భయపెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపిస్తూవున్నవి దాని ప్రతిబింబాలే. అవి కూడా పళ్ళు బయటపెట్టి భయపెట్టినట్టు కనిపించడంతో తన జాతి కుక్కల గుంపు నడుమ తాను నిష్కారణంగా చిక్కుకు పోయాననుకుని ఆ కుక్కకు పెద్ద భయం పట్టుకుంది. వాటిని మరింత భయపెట్టి తప్పించుకుందామన్న ఆలోచనతో మొరగడం మొదలు పెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపించే ఆ కుక్క ప్రతిబింబాలు సయితం అదేమాదిరిగా మొరగడం మొదలు పెట్టాయి. కుక్క గొంతు పెంచి గట్టిగా మొరుగుతూ అటూ ఇటూ దూకడం మొదలెట్టింది. చుట్టూ అద్దాల్లోని వందలాది కుక్కలు కూడా అంతే మెరుపు వేగంతో గెంతడం మొదలయింది. ప్రాణ భయంతో కుక్క ప్రాణాలు ఠావులు తప్పాయి. ఆరోజు సెలవు దినం కావడం వల్ల మ్యూజియం సిబ్బంది మరునాడు వచ్చి తలుపు తీసేసరికి ఆ అద్దాల మహల్ లోని అద్దాలు అన్నీ పగిలిపోయి చిందరవందరగా పడివున్నాయి. వాటి మధ్యలో విగతజీవిగా పడున్న ఓ కుక్క శరీరం.

నిజానికి ఆ హాల్లో కుక్కకు హాని తలపెట్టే వాళ్లు ఎవ్వళ్ళూ లేరు. అద్దాల్లో తన ప్రతిబింబాలను తానే చూసుకుని గాభరా పడిపోయి, అందువల్ల కలిగిన భయంతో తన చావును తానే కొనితెచ్చుకుంది.

ఈ ప్రపంచం తనకు తానుగా ప్రజలకు ఏ అపకారం తలపెట్టదు. మన మనస్సుల్లోని ఆలోచనలే మనకు మేలయినా, కీడయినా కలిగిస్తాయి. మనకు మంచి జరిగినా, చెడు జరిగినా దానికి కారణం మన భావాలే. మన కోరికలే. మన నిర్ణయాలే. మనం చేసే పనులే.

ఎందుకంటే మన చుట్టూ వున్న లోకమే ఓ పెద్ద దర్పణం.

(ఓ ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్ఛానువాదం)

తవ్వకాల్లో దొరికింది


2018లో జరిగిన   ట్రంప్, కిం శిఖరాగ్రసమావేశంపై నా తెలుగు పాపులర్ టీవీ ఛానల్ లో సమీక్ష: (నా పేరు పక్క 'తోక' నేను తగిలించుకున్నది కాదు)

Ramakrishna Jagarlamudi, Nirmal Akkaraju and 43 others
12 Comments
1 Share
Share
ON THI

సన్ ఆర్ సన్ ఇన్ లా పాలసి

 నేను రేడియోలో చేరిన కొత్తల్లో సచివాలయంలో ఓ ఉన్నతాధికారి  పరిచయం అయ్యారు. మంచి స్నేహశీలి.  అడగడమే వాడిదే పాపం అన్నట్టు ఎవరు ఏది అడిగినా అది తన చేతిలో పనయితే వెంటనే చేసిపెట్టేవారు. అక్కడ మనవాడా పరాయి వాడా అనే వివక్ష చూపేవారు కాదు. ఉద్యోగం, బదిలీ ఇలా ఎవరు ఏ పని కోరినా,  ‘కాదు, కుదరదు’  అని చెప్పే అలవాటు ఆయనకు లేదు. అలా అని డబ్బు కోసం సాయం చేయడం ఇంటావంటా లేదు. నిక్కచ్చి మనిషి. నిజాయితీ పరుడు.

సాయం కోరి నా దగ్గరకు  వచ్చిన వారిని నేను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళే వాడిని. ఏం కావాలో కనుక్కుని ఆ పని ఏమిటో  ఆ వివరాలు ఓ చిన్న పుస్తకంలో రాసుకునేవారు. ‘రేపు రండి చెబుతాను’ అనేవారు. ఎన్నిసార్లు ఆయన దగ్గరకు పోయినా ఇదే వరస. ‘రేపు రండి అని పంపించేసేవారు. మరునాడు వెడితే పనిచేసి పెట్టడమో, లేక ఆ పని అయ్యేది కాదు అని మొహం మీద చెప్పడమో జరిగేది.  చాలా సందర్భాలలో వచ్చిన వాళ్లకు ఆశాభంగం కలగకుండా  పనిచేసి పంపించేవారు. మరి, ఇంత మాత్రం దానికి రేపు రమ్మనడం దేనికి అనే  మీమాంస నన్ను వెంటాడేది.

తర్వాత విచారించగా తెలిసింది ఏమిటి అంటే ఆయనది  ‘సన్ ఆర్ సన్ ఇన్ లా  పాలసి’.

ముందు ఏ సాయం అయినా కొడుకు లేదా అల్లుడు. తర్వాతే ఎవరయినా అనేది ఆయన పెట్టుకున్న పద్దతి.

వచ్చిన వాడు బదిలీ అడిగాడు అనుకోండి. ఆ సాయంత్రం ఇంటికి వెళ్లి కొడుకు, అల్లుడు లేదా కోడలు, కుమార్తెతో సంప్రదించేవాడు. పనిమీద వచ్చిన వాళ్ళ పని చేసి పెడితే, దానివల్ల  తన పిల్లలకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకునే వారు. ఉదాహరణకు ఉద్యోగం అనుకోండి, అదే ఉద్యోగానికి తన కొడుకు, లేదా అల్లుడికి సాయం కోరినవారు  పోటీ అవరు అనేది తేల్చుకున్న తర్వాతనే, వారి పని చేసి పెట్టేవారు. అలాగే బదిలీ. బదిలీ అడిగిన వాళ్ళకు చేసిపెడితే దానివల్ల తన పిల్లలకు ఏమీ తభావతు రాదు అని నిర్ధారించుకున్న తర్వాత కానీ వచ్చిన వారి విషయం పట్టించుకునే వాడు కాదు. వినడానికి విడ్డూరంగా ఉండవచ్చు  కానీ ఈ నియమాన్ని ఆ అధికారి చాలా కాలం పాటించడం నాకు తెలుసు.

అడిగినవాడికి లేదనకుండా సాయం చేస్తూ వచ్చిన ఆయన, తనపై  ఏ మచ్చా పడకుండా ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆయన పోయినట్టు తెలిసింది. ఆయన వల్ల సాయం పొందిన అనేకమంది, తమ ఇంట్లో మనిషి పోయినట్టుగా  బాధ పడ్డారు. 

ధృతరాస్ట్రుడికే కాదు, పుత్రప్రేమ అనేది మనుషులకు పుట్టుకతోనే వస్తుందేమో. 

(13-06-2021)

12, జూన్ 2021, శనివారం

ఎన్టీఆర్ జన్మించి 98ఏళ్లు:

రాజీనామాలు, ఆమోదాలు - భండారు శ్రీనివాసరావు

 

వాయువేగంతో ఆమోదించబడిన రాజీనామాల్లో, నాకు తెలిసి,  నందమూరి హరికృష్ణదే మొదటిది అనుకుంటాను. రాష్ట్రాన్ని విభజించాలనే కాంగ్రెస్  అధిష్టానం నిర్ణయానికి  నిరసనగా హరికృష్ణ తన  రాజ్యసభ  సభ్యత్వానికి రాజీనామా లేఖను చైర్మన్ ఛాంబర్ లో ఇచ్చి బయటకు వస్తుండగానే పార్లమెంటులోని టీవీ చానళ్లలో రాజీనామా ఆమోదం వార్త స్క్రోలింగుల రూపంలో దర్శనం ఇచ్చింది.

ఇక ‘నా రాజీనామాను ఆమోదించండి బాబూ’ అని,   స్వాతిముత్యం  సినిమాలో కమల్ హసన్ ఉద్యోగం కోసం శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుపొందిన సోమయాజులు ధరించిన పాత్రను పదేపదే  వెంటపడే దృశ్యాన్ని గుర్తుకు తెచ్చిన ఉదంతం  డాక్టర్ జనార్ధన రెడ్డి  (మహబూబ్ నగర్)ది.  అప్పుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్.  ప్రత్యేక తెలంగాణా వాదానికి మద్దతుగా  డాక్టర్  నాగం తన టీడీపీ  శాసన సభ్యత్వానికి  రాజీనామా చేశారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం  వరకు  ఆయన స్పీకర్ ని  కలుస్తూ తన రాజీనామా సంగతి ఏం చేశారు అంటూ  వారాల తరబడి వెంటపడేవారు. ఆయనే ఈ స్వాతిముత్యం సంగతి విలేకరుల చెవిన వేశారు. తన రాజీనామాను ఆమోదించకుండా స్పీకర్ తప్పించుకుని తిరుగుతున్నారు అని ఆరోపణ చేయడమే కాకుండా స్పీకర్ మిస్సింగ్ అంటూ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేశారు. ఆఖరికి అసెంబ్లీ ఆవరణలో ధర్నా చేశారు. చిట్టచివరికి, ఎట్టకేలకు ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.

రాజీనామాల పర్వంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2011 లో ఆనాటి పాలకపక్షం నుంచి విడిపోయిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు. సీబీఐ చార్జ్ షీట్ లో పూర్వ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. పేరు ప్రస్తావించడానికి నిరసనగా వాళ్ళు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. శాసన  సభలో నిలబడి ‘మా రాజీనామాలను ఆమోదించండి’ అని నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని ఎన్నోసార్లు వేడుకున్నారు. ఫలితం పూజ్యం.

చివరికి చాలా కాలం తర్వాత, కాంగ్రెస్ అధిష్టానం పచ్చ జెండా ఊపిన పిదప ఆ రాజీనామాలకు మోక్షం లభించింది. 

ఆ తర్వాత ఎన్నాల్టికో ఉప ఎన్నికలు జరిగాయి. పదిహేడు అసెంబ్లీ సీట్లతో పాటు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి సీటు, కాంగ్రెస్ లోక సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి రాజీనామా వల్ల ఏర్పడ్డ లోక్ సభ స్థానానికి కూడా  ఎన్నికలు జరిగాయి. పద్దెనిమిది అసెంబ్లీ సీట్లలో పదిహేను వైసేపీ గెలుచుకుంది. రెండు కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలబడ్డ  వైసీపీ  అభ్యర్ధి మేకపాటి రాజమోహన్ రెడ్డి, తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి  టి. సుబ్బరామిరెడ్డి పై  రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉపఎన్నికల్లో అన్ని సీట్లుకోల్పోవడం  ఆ పార్టీ  భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనేదానికి సంకేతంగా చెప్పుకున్నారు.  టీడీపికి ఆ ఉపఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదు. కానీ తర్వాత  అదే టీడీపీ, రాష్ట్ర విభజన అనంతరం, 2014 లో నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది.      

ఈ నేపధ్యాల నడుమ  తెలంగాణా  మాజీమంత్రి ఈటెల రాజేందర్ ఈ  ఉదయం ఇచ్చిన రాజీనామాను కొన్ని గంటల్లోనే స్పీకర్  పోచారం   శ్రీనివాసరెడ్డి ఆమోదించడం విశేషమే!    

(12-06-2021)